"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

మాదిగ కవులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మాదిగ కవులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

08 మే, 2016

10 TV అక్షరంలో దార్ల వెంకటేశ్వరరావు



(ఈరోజు అంటే 8 మే 2016 వతేదీ మధ్యాహ్నం 12-30నిమషాలకు 10 TV వారు ధిక్కారస్వరాలుకార్యక్రమంలో నా గురించి సుమారు 9.27 నిమషాల పాటు ప్రసారం చేశారు. దీనిలో ప్రముఖ విమర్శకుడు జి.లక్ష్మీనరసయ్యగారు నా కవిత్వం గురించి వ్యాఖ్యానిస్తూ సహజత్వంతో కవిత్వాన్ని రాసే కవిగా, శిల్పం కోసం కృత్రిమత్వాన్ని పాటించడనీ విశ్లేషించారు.  ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన 10 టి.వి.,వారికీ, నా కవిత్వం గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన జి.లక్ష్మీనరసయ్యగారికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను....డా.దార్ల వెంకటేశ్వరరావు)
మనువు సృష్టించిన నిచ్చెన మెట్ల సమాజంలో దళితులు ఎదుర్కొంటున్న అవమానాలను, మానసిక సంఘర్షణలను అద్భుత కవిత్వంగా చిత్రిస్తున్న దళిత కవి దార్ల వెంకటేశ్వరరావు. కుల వ్యవస్థలోని వైరుధ్యాలు, వైవిధ్యాలను అంబేద్కర్ దృక్పథంతో కవిత్వంగా ఆవిష్కరిస్తున్న అరుదైన కవి ఆయన. దళితకవి, విమర్శకుడు, పరిశోధకుడైన దార్ల వెంకటేశ్వరరావు కవిత్వాన్ని, ఆయన సృజనలోని దళిత తాత్వికతను, కవితా నిర్మాణ పద్ధతులను ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య విశ్లేషించారు. 'దార్ల రాసిన మాదిగ మానిఫెస్టో కవిత మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. సరికొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. దండోరా తీసుకొచ్చిన దళితవాదాన్ని గట్టిగా సమర్థిస్తుంది' అని పేర్కొన్నారు. ఈ దేశంలో వర్ణవ్యవస్థ సృష్టించిన అసమానతలను అన్యాయాలను అధర్మాలను, తన కవిత్వంలో తూర్పారబట్టారు ఈ కవి. ఒక బాలునిగా, విద్యార్థిగా, పరిశోధకునిగా దళిత విద్యార్థి అనుభవించే కష్టాలను ఆర్ద్రమైన కవితలుగా శిల్పీకరించారు దార్ల వెంకటేశ్వరరావు. నగర నాగరికత, తెలుగుభాష, తెలంగాణా కోస్తా దళితుల జీవన చిత్రాలను ఈ కవి చక్కగా కవిత్వీకరించారు. ఇదే విషయం గురించి ప్రస్తావిస్తూ దార్ల కవిత్వంలో వస్తు వైవిద్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందంటారు జి.లక్ష్మీనర్సయ్య.
10 TV  అక్షరంలో జి.లక్ష్మీనరసయ్యగారు


దార్ల జీవిత విశేషాలు...

చాలా మంది దళిత కవులు శిల్పం కోసం ఆరాట పడుతుంటారు. పదచిత్రాల కోసం పలవరిస్తుంటారు. వీరికి వస్తుసాంద్రత, సమస్యతీవ్రత కన్నా శిల్పమే ముఖ్యం. కాని దార్లవెంకటేశ్వరరావు శిల్పం కోసం కృత్రిమ చిత్రణచేయడని ప్రతి మాట, ప్రతి పదం కవిత్వంతో జవజవలాడాలన్న తపన ఈకవికి లేదంటారు లక్ష్మీనర్సయ్య. ఇక... దార్ల వెంకటేశ్వరరావు జీవిత విశేషాల్లోకి వెళితే ఆయన 1973 లో తూర్పుగోదావరి జిల్లా చెయ్యేరు అగ్రహారం లో పెదనాగమ్మ, లంకయ్య దంపతులకు జన్మించారు. బి.ఏ.స్పెషల్ తెలుగు చదివి హైదరాబద్ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., ఎం.ఫిల్.,  పి.హెచ్.డి చేశారు. అదే యూనివర్సిటీలో తెలుగుశాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు .వెంకటేశ్వరరావు కవిత్వం, సాహిత్య విమర్శ, సౌందర్య శాస్త్రం, మాదిగ సాహిత్యం పై విశేష కృషి చేశారు. దళిత తాత్వికుడు, నెమలి కన్నులు కవిత్వంతో పాటు సాహితీ సులోచనం సమీక్షాగ్రంథం, వీచిక సాహితీ విమర్శ, బహుజన సాహిత్య దృక్పథం, సృజనాత్మక రచనలు ఎలా చేయడం, పునర్మూల్యాంకనం, సాహితీ మూర్తులు-స్పూర్తులు మెుదలైన సాహితీ వ్యాస సంపుటాలు వెలువరించారు. దార్ల వెంకటేశ్వరరావు కృషిని గుర్తించి భారతీయ దళిత సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ వారు 2007లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పురస్కారంతో సత్కరించారు. ఈయన రాసిన తెలుగు సాహిత్య విమర్శకు 2012 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం లభించింది. భవిష్యత్తులో ఈ సృజనకారుని కలం నుండి మరెన్నో రచనలు వెలువడాలనిఆశిద్దాం. (10 టి.వి. సౌజన్యంతో...)


18 మే, 2015

బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు

మనుస్మృతికి మారుపేరు బ్రాహ్మణుడు
------------------------------------------------------------------
1. " బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు జన్మించారు. " ( ఋగ్వేదం 10 - 90 - 12 )
2. " భూలోక విస్తారము కోరినవాడై బ్రహ్మ తన ముఖము, బాహువులు, తొడలు, పాదాల నుండి వరుసగా బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను సృష్టించెను. " ( మనుస్మృతి 1 - 31 )
3. " బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు వారి వారి ధర్ంులను ఇహపర సుఖములకై బ్రహ్మ వేరువేరుగా ఏర్పరచెను. " ( మను 1 - 87 )
4. " వేద ఆధ్యయనం - ఆధ్యాపనం, యజ్ఞాలు చేయడం - చేయించడం, దానాలు చేయడం - స్వీకరించడం అను ఈ ఆరు ధర్మములు బ్రహ్మణులకు నిర్దేశించబడ్డాయి. " ( మను 1 - 88 )
5. " క్త్షత్రియులకు పరిపాలన, ప్రజారక్షణ ధర్మంగా నిర్దేశింబడినది. వేదాద్యాయనమే కాని ఆధ్యాపన అర్హత లేదు. దానం చేయాలి కానీ దాన పరిగ్రహ అర్హత లేదు. " ( మని 1 - 89 )
6. " వ్యవసాయం, పశుపోషణ, వానిజ్యం వైశ్య ధర్మం. వేదాధ్యాయనమే కాని అధ్యాపన అర్హత లేదు. దానం ఇవ్వడమే కాని పరిగ్రహించే అర్హత లేదు. " ( మను 1 - 90 )
7. " బ్రహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్ధేశించెను. అదేమనగా బ్రాహ్మణ క్షత్రియ, వైశ్యులకు గుణనింద చేయకుండా శుశ్రూష ( సేవ) చేయడం. " ( మను 1 - 91 )
8. " బొడ్డుకు క్రింది భాగం కంటే పై భాగం పరిశుద్ధమైనదని చెప్పబడెను. అందును ముఖం మిక్కిలి పరిశుద్ధమని బ్రహ్మచే చెప్పబడెను. " ( 1 - 92 )
9. " ఉత్తమాంగము నుండి పుట్టుట వలనను, Veదములు ధరించుట వలనను, అన్ని వర్ణములకు ధర్మశాసనము చెప్పడం వల్ల వర్ణములకెల్ల బ్రహ్మణుడు ప్రభువు. " ( మను 1 - 93 )
10. " ఈ చరాచర జగత్తులో ప్రణులు శ్రేష్టులు. ప్రాణులలో బుద్దిజీవులు శ్రేష్టులు. వాటిలో మనుష్యులు శ్రేష్టులు. మనుషుల్లో బ్రాహ్మణులు శ్రేష్టులు." (మను 1 - 96 )
11. " ఈ భూమియందున్న సంపద అంతా బ్రాహ్మణునిదే. ఇతరులందరూ కూడా బ్రాహ్మణుని సంపదనే అనుభవించు చున్నారు. " ( మను 1 - 100)
12. " పదేండ్ల బ్రాహ్మణుడు, నూరేండ్ల క్షత్రియుడు వరుసగా తండ్రి కొడుకులుగా ఎంచవలయును. వీరిలో బ్రాహ్మణుడే తండ్రిగా చెప్పబడెను. " ( మను 2 - 135 )
13. " బ్రాహ్మణులు ప్రథమ పెళ్ళి బ్రహ్మణ కన్యనే చేసుకోవాలి. కామము కొరకు క్షత్రియ, వైశ్య, శూద్ర స్త్రీలను గ్రహించవచ్చును. క్షత్రియులు క్షత్రియ కన్యను పెళ్ళాడి కామమునకు వైశ్య, శూద్ర స్త్రీలను గ్హించ వచ్చును. వైశ్యుడు వైశ్య కన్యను పెళ్ళాడి, కామమునకు శూద్ర స్త్రీని గ్రహించ వచ్చును. శూద్రునికి మాత్రం శూద్ర కన్య ఒక్జటే . " ( మను 3 - 12, 13 )
14. " ఎన్ని పాపాలు చేసినప్పటికి బ్రహ్మణున్ని ఎప్పుడూ చంపరాదు. వాని ధనమును వానికొసంగి, శారీరకంగా బాధింపక దేశం నుండి పంపించాలి. " ( మను 8 - 380 )
15. " లోకమున బ్రాహ్మణ వధ కంటే మించిన గొప్ప అధర్మం మరొకటి ఏదీ లేదు. బ్రాహ్మణున్ని చంపుట మనస్సులో కూడా తలంచకూడదు. " ( మను 8 - 381 )
16. " ఉపయోగపడినా, ఉపయోగపడకపోయినా అగ్ని ఎట్లు మహిమాన్వితమో అట్లే పండితుడైనా, మూర్ఖుడైనా బ్రాహ్మణుడు ప్రకృష్టమైన దేవుడే. ( మను 9 - 317 )
17. " బ్రాహ్మణుడు ముల్లోకాల ప్రజలను పీడించినప్పటికి , అనేక పాపములు చేసినప్పటికి, Veదములు కలగియుండుట వలన పాపమును పొందడు. " ( మను 11 - 261 )
18. " బ్రాహ్మణులు ఎన్ని నీచకార్యములు చేసినప్పటికి వారు సర్వవిధముల పూజ్యులే అగుదురు. వారు ఎల్లప్పుడు పరమోత్మ దేవతలే అగుదురు. " ( మను 9 - 319 )
19. " మానవులు శ్రుతుల యందును, స్మృతుల యందును చెప్పబడిన ధర్మము ననుసరించుచు ఇహలోక సుఖమును, పరలోక మోక్షమును పొందుదురు. అందుచే శ్రుతిస్మృతుల ధర్ంులను అనుష్టించుట విధి ( Vidhi) అని చెప్పబడినది. " ( మను 2 - 9 ).
20. " బ్రహ్మదేవుడు బ్రాహ్మణులను సర్వజగద్రక్షణములకై తన ముఖం నుండి పుట్టించెను. " ( మనుస్మృతి : 1 - 94 )
21. " ఉత్తమాంగమయిన ముఖం నుండి పుట్టుట వలనను, Vedamulanu ధరించుట వలనను, మిగిలిన వర్ణములకు ధర్మోపదేశార్హత వల్లను బ్రాహ్మణుఉ అన్ని వర్ణములకు ప్రభువు అగుచున్నాడు. " ( మను : 1 - 93 )
22. " సకల చరాచర రాసులలో ప్రాణులు శ్రేష్ఠులు. ప్రతి అణులలో బుద్ధిజీవులు శ్రేష్ఠులు. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠులు. మానవులలో బ్రాహ్మణులు శ్రేష్ష్ఠులు. " ( మను : 1 - 96 )
23. " బ్రాహ్మణులు పుట్టుచునే భూమియందు అందరికంటే గొప్పవాడుగా పుట్టియున్నాడు. సకల ప్రాణుల సమూహమునకు సంబంధించిన ధర్మ సమూహ సంరక్షణకు ప్రభువు. " ( మను : 1 - 99 ).
24. " భూతలమందున్న సమస్తమూ బ్రాహ్మణుడిదే. బ్రహ్మ ముఖము నుండి జన్మించుట చేతను, వర్ణమున ఉత్తమవర్ణం అగుట చేతను బ్రాహ్మణుడు సర్వ ధనమునకు అర్హుడు అగుచున్నాడు. " ( మను : 1 - 100 )
25. " బ్రాహ్మణుడు తన ధనమునే తాను అనుభవించు చున్నాడు. తన వస్త్రమునేబతాను ధరించు చున్నాడు. తన ధనమునే ఇతరులకు ఇచ్చుచున్నాడు. లోకమందలి సర్వస్వము అంతా అతనిదే. బ్రాహ్మణుని దయాగుణము వలననే ఇతరులు అతని సర్వస్వమును అనుభవించు చున్నారు. ( మను : 1 - 101 )
26. " హితమైనా, అహితమైనా అగ్ని ఎట్లు మహిమాన్వితమో, అట్లే పండితుడైనా, మూర్ఖుడైనా బ్రాహ్మణుడు ప్రకృష్టమైన దేవుడు." ( మను : 9 - 317 )
27. " బహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్ధేశించెను. అదేమనగా పై మూడు ద్విజ వర్ణాలకు గుణనింద చేయక వారికి శుశ్రూష ( సేవ ) చేయటం". ( మనుస్మృతి 1 - 91 )
28. " శూద్రుడు ధనము సంపాదించ కూడదు. అతడు ధనం సంపాదించి యెడల బ్రాహ్మనులను హింసించును. " ( మను 10 - 129 )
29. " ,బ్రాహ్మనుడు ఎప్పుడైనా సందేహచకుండా శూద్రుని సంపదు, వస్తువులను బలవంతంగానయినా స్వాధీనం చేసుకోవచ్చును. ఎందుకనగా శూద్రునికి స్వంత ధనం అంటూ ఏదీ లేదు కదా." ( మను 8 - 417 )
30. " బ్రాహ్మనులకు సేవకులుగా ఉండటమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటి రాదు. " ( 10 - 123 )
31. " జీతభత్యాల ప్రమేయం లేకుఢా బ్రాహ్మణుడు శూద్రులతో సేవలు చేయించుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మనులకు బానిసలుగా ఉండటానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడు. " ( మను 8 - 413 )
32. " బ్రాహ్మనుడు తినగా మిగిలిన ఎంగిలి అన్నాన్ని, చికిగిపోయిన పాతబట్టలను, పాత సామానును శూద్రులకివ్వాలి. " ( మను 10 - 125 )
33. " శూద్రుడు బ్రాహ్బనున్ని దూషిస్తే ఎర్రగా కాల్చిన పది అంగుళముల ఇనుపకడ్డీతో వాని నాలుకను కాల్చాలి. " ( మను 8. 271 )
34. " ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో , చెవుల్లో మరిగించిన నూనె పోయాలి. " ( మను 8 - 272 )
35. " బ్రాహ్మనునితో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులను కోసివేయాలి లేదా కాల్చిన ఇనుప కర్రుతో కాల్చాలి. " ( మను 8 - 281 )
36. "శూద్రుడు బ్రాహ్మనున్ని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమును ఛేదించి వేయాలి. ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి. పిత్తితే గుదమును కోయాలి. " ( మను 8 - 282)
37. " బ్రహ్మనున్ని శూద్రుడు ఏ అంగంతో బాధిస్తాడో ఆ అంగాన్ని ఖండించివేయాలి. " ( 8 - 283 )
38. " శూద్రుని సమక్షంలో వేదాలు పఠించరాదు. " (మను 4 - 99 )
39. " బ్రాహ్మనుని పేరు శుభప్రదమైనది గాను, క్షత్రియుని పేరు శక్తి సూచకంగానూ, వైశ్యుని పేరు సంపద సూచకంగానూ, శూద్రుని పేరు హేయమైనదిగానూ ఉండవలెను. " ( మను 2 - 31 )
40. " బ్రాహ్మనున్ని సేవించిన శూద్రుడు మరో జన్మలో ఉత్తమ కులంలో జన్మించును. " ( మను 9 - 3 35 )
41. బ్రాహ్మనోస్య ముఖమాసీత్, బాహూ రాజన్య కృతః
ఊరూ తదస్య యద్ వైశ్య పదభ్యాగ్ శూద్రో ఆజాయతః . ( ఋగ్వేదం : 10 - 90 - 12 )
విరాట్పురుషుని ముఖం నుంచి బ్రాహ్మణుడు, బాహువుల నుంచి క్షత్రియుడు, తొడల నుంచి వైశ్యుడు, పాదాల నుంచి శూద్రుడు పుట్టారు.
42. లోకానాం తు వివృద్ధ్యర్థం ముఖబాహూరుపాదతః,
బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం శూద్రం చ నిరవర్తయత్ . ( మనుస్మృతి : 1 - 31 )
భూలోకవిస్తారము గోరినవాడై, బ్రహ్మ తన ముఖము, బాహువు, తొడలు, పాదములు వీని నుండి వరుసగా బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను సృజించెను.
43. ఏకమేవ తు శూద్రస్య ప్రభుః కర్మ సమాదిశత్,
ఏతేషా మేవ వర్ణానాం శుశ్రూషామనసూయయా. ( మనుస్మృతి : 1 - 91 )
44. ధర్మోపదేశం దర్పేణ విప్రానామస్య కుర్వతః,
తప్తమానేచయేత్తైలం వక్త్రే శ్రోత్రే చ పార్థివః. ( మనుస్మృతి : 8 -272 )
బ్రాహ్మణునికి ఎదురు ధర్మం చెపితే వాడి నోటిలో, చెవుల్లో మరిగించిన నూనె పోయాలి.
45. చండాలశ్వపచానాం తు బహిర్గ్గ్రామాత్ప్రతిశ్రయః
అపపాత్రాశ్చ కర్తవ్యా ధనమేషాం శ్వగర్దభమ్, ( మనుస్మృతి : 10 - 51 )
46. వాసాంపి మృతచేలాని భిన్నభాండేషు భోజనమ్,
కార్ష్ణాయనమలంకారః పరివ్రజ్యా చ నిత్యశః. ( మనుస్మృతి : 10 - 52 )
చండాలురు శ్వపాకులుగా గ్రామమునకు వెలుపలనే నివాసము. వీరికి కుక్కలు, గాడిదలే ధనము. పీనుగలపై గల చస్త్రములే వీరికి బట్టలు. పగిలిన కుండపెంకులలో వీరు భుజించాలి. ఇనుప సామానే వీరికి ఆభరణములు.
47. బ్రాహ్మణున్ని నిందించే శూద్రుని నాలుకను కోసివేయాలి. ఎందుకంటే అతడు నీచ జన్ముడు. ( మను : 8 - 270)
48. బ్రాహ్మణుని కులాన్ని, పేరును నిందించిన శూద్రుడి నోట్లో పదివేళ్ళ పొడుగిన్న ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి దూర్చాలి . ( మను : 8 - 271 )
49. శూద్రుడు ఆస్థి సంపాదించ రాదు. అది బ్రాహ్మణునికి అపకారం కలొగిస్తుంది. ( మను : 10 - 129 )
50. శూద్రుడు బ్రాహ్మణునితో ఆతని పక్కన కూర్చొనడానికి ప్రయత్నిస్తే వాడి ముడ్డిని కాల్చివేయాలి లేదా కోసివేయాలి. ( మను : 8 - 281)
ఇది హిందూమత ధర్మశాస్తరం అయిన మనుస్మృతి. దీని ప్రకారమే నాడు పరిపాలన జరిగేది. బ్రిటిష్ వారు వచ్వే వరకు ఇదే మనకు Penal Code. బ్రిటిష్ వాడు వచ్చి ఈ దుర్మార్గపు చట్టాన్ని రద్దు చేశాడు.
బాబాసాహెబ్ ఈ దుర్మార్గ ధర్మశాస్త్రాన్ని 1927 డిసెంబర్ 25 న తగలబెట్టి దహనం చేశాడు. అందువల్ల SC, ST, BC లకు డిసెంబర్ 25 ఒక పండుగ రోజు. ఆ పండుగను మనమందరం జరుపుకోబాలి.
-------------------------------------------------------------------
సమతా సైనిక.దళ్ సౌత్ ఇండియా సౌజన్యంతో...

11 జనవరి, 2015

ఒక మాదిగ స్మృతి-నాగప్పగారి సుందరరాజు పరిచయం


నాగప్పగారి సుందర్రాజు చనిపోయిన తర్వాత అతని గురించి  నాకు తెలిసినంత వరకూ ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ గారు తప్ప ఒక్కరు కూడా పత్రికలలో వ్యాసాలు రాయలేదు. దళిత సాహితీ వేత్తలు దళితుల్లోని కొన్ని ఉపకులాల వారి మరణాలకే సంస్మరణ సంచికలు వేస్తున్నారు. దళిత పత్రికల వాళ్ళు  నాగప్పగారి సుందర్రాజు గురించి ప్రత్యేక సంచిక వేస్తామంటూనే రోజులు గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక గొప్ప సాహితీ వేత్త  మరుగున పడిపోయే పరిస్థితులు కలుగుతున్నాయనిపించింది.
            నాగప్పగారి సుందర్రాజు ఆశించిన మాదిగ సాహిత్య ధోరణినీ, దాన్ని తీసు కొచ్చిన ఆ సాహితీ వేత్తనీ నామమాత్రంగా స్పర్శించు కోవడమే తప్ప, అతని వ్యక్తిగత వివరాలు, మరుగున పడిపోతున్నాయి. ఇది సాహిత్య చరిత్రకు చాలా నష్టం కలిగించే చర్య. నా శక్తి యుక్తుల మేరకు దీన్ని కాపాడాలని భావించాను. అతని పుస్తకాలు ఇప్పటికే కనుమరుగై పోతున్నాయి. చూస్తూ చూస్తూ ఇలా అతని చరిత్ర మరుగున పడిపోవడం బాధాకరమనిపించింది.
            ఈ నేపథ్యంలో హైదరాబాదు విశ్వవిద్యాలయం, దళిత స్టూడెంట్స్‌ యూనియన్‌ వారు సుందర్రాజు నా అధ్యక్షతన ఒక సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఒక కర పత్రం రాయమని కొంత మంది విద్యార్థులు  నా దగ్గరకు వచ్చారు. అప్పుడు కరపత్రం కోసం రాసిన వ్యాసం ఒక బుక్‌ లెట్‌ గా ప్రచురించాను. దాన్ని ఆ రోజు సంస్మరణ సభలో మేరీ మాదిగ, జాజుల గౌరి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత దీన్ని మరింత వివరంగా రాయాలని భావించి ఆ వ్యాసాన్ని పెంచి ఈ రూపంలోకి తీసుకొచ్చాను.
నాగప్పగారి సుందర్రాజుతో నిజానికి నాకున్నది చాలా తక్కువ కాలం పరిచయమే. అయినా ఆ తక్కువ సమయంలో కూడా ఎక్కువ అనుబంధాన్ని పెనవేసుకున్నాను. అతడు కూడా నన్ను అంత ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నాడు. అతను రాసిన ఔను నేను దేశద్రోహినే కవిత చదివి అతని దగ్గరకు వెళ్ళాను. అప్పటికి నేను ఎం,.లో ఉన్నాను. అతను డాక్టరేట్ చేస్తుండే వాడు. మేమిద్దరం దళితుల గురించి మాట్లాడుకోవడం ద్వారా అతని ఆలోచనలు నచ్చి నేను అతనికి మరింత దగ్గరయ్యాను.

కలిసినప్పుడల్లా క్యాంపస్ పరిస్థితులతో పాటు రాష్ట వ్యాప్తంగా మాదిగల స్థితిగతుల గురించి చర్చించుకొనే వాళ్ళం. ఆ చర్చల్లో నుండే మాదిగ సాహిత్య వేదిక రూపకల్పన జరిగింది.
మాదిగ సాహిత్య వేదికకు  నన్ను వ్యవస్థాపక సహాయ కార్యదర్శిగా నియమించాడు. అప్పటికే మాదిగ దండోరా ఉద్యమం మాదిగల సమస్యలను ప్రజలందరి ముందుకీ తీసుకొస్తుంది.
ఈ పరిస్థతుల్లో మాదిగ సాహితీ వేత్తలను జాగృతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా భావించాడు. క్యాంపస్ కే పరిమితం  కాకుండా  రాష్ట వ్యాప్తంగా మాదిగ సాహిత్య వేదికను విస్తరించాలని కలలు కన్నాడు.
కవిత్వం, కథ, నవల ... ఇలా అన్ని ప్రక్రియల్లోనూ మాదిగ రచనలను తేవాలనుకున్నాడు. మాదిగ చైతన్యం కవితా సంకలనానికి నా పేరుతోనే పత్రికా ప్రకటన ఇచ్చి కవితలను సేకరించేలా చేశాడు
సుందర్రాజుతో నాకున్నది తక్కువ పరిచయమే అయినా, అతని ఆలోచనల్లో మాదిగల చరిత్ర, సాహిత్యం, సంస్కృతి గురించిన తపన ఎక్కువగా గమనించాను. అతని ఆశయం పూర్తిగా నెరవేరకుండానే అకస్మాత్తుగా మరణించాడు. అతనిని గుర్తు చేసుకోవడం అంటే మాదిగ సాహిత్యాన్ని గుర్తు చేసుకోవడమే. మాదిగ సాహిత్యాన్ని గుర్తు చేసుకోవడం అంటే నాగప్పగారి సుందర్రాజుని కూడా తప్పని సరిగా గుర్తు చేసుకోవడమే.
తెలుగు సాహిత్యం ఇప్పుడు మాదిగ సాహిత్యాన్ని ఒక ధోరణిగా గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలాగే మాదిగ సాహిత్యం నుండి సుందర్రాజుని విడదీసి చూడలేని పరిస్థితి ఉంది. అందువల్ల సాహితీ వేత్తలు సుందర్రాజుని అనివార్యంగానైనా గుర్తు చేసుకోవలసిందే. ఒక సాహిత్య ధోరణికే కారణమైన సుందర్రాజుని గుర్తు చేసుకోవడం సాహితీ వేత్తలకూ, మరీ ముఖ్యంగా మాదిగలకూ ఒక తప్పని సరి అవసరం. దీనిలో భాగమే ఈ పుస్తకం రాశాను.
పుస్తకంలో ప్రధానంగా అతని లక్ష్యాలను, ఆశయాలను, స్పందనలను, అనుభూతులను రికార్డ్ చేశాను. దీన్ని చదివిన ప్రేరణతో మీరూ అతను గురించి ఏమైనా రాసి ఉంటే నాకు పంపించండి. మలి ముద్రణలో వాటిని చేర్చడానికి ప్రయత్నిస్తాను. సాహిత్యానికీ తన జీవితాన్ని అంకితం చేసిన సుందర్రాజుని మాత్రం స్మరించు కోవడం తెలుగు సాహిత్యం చదివే వారందరి విధిగా భావిస్తున్నాను.

-      డా// దార్ల వెంకటేశ్వరరావు



13 మే, 2014

రాయక్క మాన్యం కతల సంపుటి ఆవిష్కరణ సభ

ప్రముఖ కవి, రచయిత్రి, విమర్శకురాలు జూపాక సుభద్ర రాసిన రాయక్క మాన్యం కతల సంపుటి ఆవిష్కరణ సభ ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో జరిగింది. సిరిసిల్ల, జగిత్యాల రైతు కూలీ పోరాట యోధురాలు కొదురుపాక రాజవ్వ ఈ పుస్తకాన్ని ఆవిష్యరించారు.  ప్రొ పులికొండ సుబ్బాచారి ఈ సభకు అధ్యక్షత వహించారు. ప్రొ ముని రత్నమ్మ, అరుణోదయ విమలక్క, జ్వలిత, డా షాజహానా, గంధం విజయలక్ష్మి, డా దార్ల వెంకటేశ్వరరావు, డా జి.వి. రత్నాకర్‌, కృపాకర్‌ మాదిగ ప్రసంగించారు. ఈ సభలో నేను మాట్లాడిన సారాంశాన్ని త్వరలోనే అందిస్తాను....దార్ల

01 ఏప్రిల్, 2014

మట్టి మహిళలసాహిత్య చరిత్రల్ని గుర్తించరా?-జూపాక సుభద్ర


 
తెలంగాణ వచ్చిన తర్వాత కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో 'తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం'పై జాతీయ సదస్సును నిర్వహించి, మసకబార్చిన తెలంగాణ సాహిత్య చరిత్రల్ని వెలికితీయడం అభినందనీయం. తెలంగాణ ఉద్యమంలో అణగారిన సామాజికవర్గాలు జెండర్‌లు సమానత్వాల్ని కలగన్నాయి. వలసాంధ్ర పాలనలో విద్య, ఉద్యోగం, నీళ్లు, నిధులే గాదు, చరిత్రల్ని, సాహిత్యాల్నీ పెద్దఎత్తున నష్టపోయింది తెలంగాణ. అవన్నీ తిరగదోడి పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరము ంది. తెలంగాణ సాహిత్య ప్రత్యేకతల్ని వెలుగులోకి తెచ్చి తెలంగాణ సాహిత్య చరిత్రల ఉన్నతి పునర్నిర్మాణం కావల్సి వుంది.
అయితే అట్టి సాహిత్య చరిత్ర నిర్మాణాలు అట్టడుగు సమూహాల, జెండర్‌ల సాహిత్య చరిత్రలుగా నిర్మాణం జరగాల్సిన అవసరం నవ తెలంగాణకు ఉంది. ఇలాంటి తెలంగాణ కోసమే అణగారిన కులాల బిడ్డలు ఆత్మబలిదానాలు చేశారు. కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ సాహిత్య సదస్సులో ఆరు సమావేశాల్లో తెలంగాణ సాహిత్య చరిత్ర, తెలంగాణ విమర్శ, తెలంగాణ విప్లవ సాహిత్యం, తెలంగాణ జిల్లాల చరిత్రలు, తెలంగాణ దళిత కవిత్వం, తెలంగాణ జానపద సాహిత్యం, తెలంగాణ భాష, తెలంగాణ ముస్లిం మైనారిటీ సాహిత్యం, తెలంగాణ స్త్రీవాద సాహిత్యం, తెలంగాణ గిరిజన సాహిత్యం ఇంకా అనేక అంశాలు చేర్చడం జరిగింది. కానీ బహుజన సమూహానికి చెందిన రుద్రమదేవి ఏలిన కాకతీయ గడ్డమీది యూనివర్సిటీ నిర్వహిస్తున్న 'తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం' సదస్సు అంశాల్లో దళిత, బీసీ, ఆదివాసీ, ముస్లిం మైనారిటీ మహిళా సాహిత్యాల ప్రస్తావన లేకపోవడం, మట్టి మహిళల సాహిత్యాల అస్తిత్వాన్ని మరుగుపరిచే ఆధిపత్యాల పునర్నిర్మాణంగానే కనిపిస్తుంది.
సాహిత్య చరిత్రల పునర్నిర్మాణం పేరుతో మళ్లీ అప్రజాస్వామికమైన ఫూడ్యల్ పాత రోతల్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఇది. సామాజిక తెలంగాణ, బహుజన తెలంగాణ అని నినదిస్తున్న ఈ సందర్భంలో కూడా తెలంగాణ మట్టి మహిళల సాహిత్య చరిత్రలను గుర్తించకపోవడం ఆధిపత్య సాహిత్య రాజకీయాల పునర్నిర్మాణమే.
తెలుగు సాహిత్య చరిత్రల్ని ఆక్రమించుకున్న, నియంత్రణలో పెట్టిన కోస్తాంధ్ర ఆధిపత్య కుల పితృస్వామ్యాలు అణగారిన కులాల సాహిత్యాల్ని కుక్కముట్టిన కుండలాగ నిషేధించాయి. ఆ భావజాలాలే తెలంగాణ నుంచి జాజుల గౌరి, సూరేపల్లి సుజాత, అనిశెట్టి రజిత, పచ్చనూరి అనురాధ, నాంపల్లి సుజాత, గోగు శ్యామల, అడువాల సుజాత, తాయమ్మ కరుణ, షాజహాన, కొలిపాక శోభ, షహనాజ్ ఫాతిమ, గంధం విజయలక్ష్మి, కృష్ణవేణి మేరి మాదిగ, జ్వలిత, భాగ్యలక్ష్మి, జూపాక సుభద్ర ఇంకా అనేక మంది తెలంగాణ మట్టి మహిళలు తమ సాహిత్యాల్ని అస్తిత్వ కోణాల నుంచి వెలువరిస్తున్నారు. వారికి సాహిత్య కారులుగా వలసాంధ్ర సాహిత్య చరిత్రలు గుర్తింపు, గౌరవాలను అవాచ్యం చేశాయి.
ఈ కొత్త తెలంగాణలోనూ అవే ఆధిపత్య సాహిత్య రాజకీయాల్ని కొనసాగిస్తే నవ తెలంగాణకు అర్థమేముంది? తెలంగాణ మట్టి మహిళలు తమ కులదోపిడీ, శ్రమదోపిడీ, సామాజిక హింసలు, దొర, దొర్సాని ఆధిపత్యాలమీద తమ అస్తిత్వ సాహిత్యాల్ని వెలువరించారు. అలాంటివారి విస్తృతమైన సాహిత్యాల్ని అప్రస్తుతం చేసి సదస్సు అంశాల్లో చేర్చకపోవడం మళ్లీ ఈ సాహిత్యాలపై చీకట్లు మోపే పునర్నిర్మాణ ప్రయత్నాలే.
తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్నిర్మాణ సదస్సులో తెలంగాణ దళిత సాహిత్యం, తెలంగాణ ఆదివాసీ, తెలంగాణ బహుజన, తెలంగాణ ముస్లిం మైనారిటీ, స్త్రీవాద సాహిత్యాలు, మట్టి మహిళల సాహిత్యాలకు సమాన భాగస్వామ్యాలు కల్పించిన సాహిత్య దాఖలాల్లేవు. దళిత, బీసీ, ఆదివాసీ, మైనారిటీ సాహిత్యాలంటే ఆయా మగవాళ్ల సాహిత్యాలుగానే సాహిత్య చరిత్రల్లో చెలామణి అయ్యాయి. అలానే స్త్రీవాద సాహిత్యమంటే కోస్తాంధ్ర అగ్రకుల మహిళల సాహిత్యంగా కొనసాగింది. స్త్రీవాద సాహిత్యంలో తెలంగాణ మహిళా సాహిత్యం లేదు, ఏ ప్రాంత మట్టి మహిళా సాహిత్యాల్లేవు. ఈ మహిళల సాహిత్యాల్ని స్త్రీవాదం అక్కున చేర్చుకున్న చరిత్రల్లేవు.
ఇలాంటి సాహిత్య రాజకీయాలు తెలిసీ కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం నిర్వాహకులు తెలంగాణలోని దళిత, బీసీ, ముస్లిం మైనారిటీ, ఆదివాసీ మహిళల బలమైన అస్తిత్వ సాహిత్యాల్ని చీకటి చేసి తెలంగాణలో లేని స్త్రీవాద సాహిత్యాన్ని అంశంగా పునర్నిర్మాణంగా చేయటం అన్యాయం.
తెలంగాణ మహిళలు, మట్టి మహిళల చరిత్రలు, సాహిత్యాలు ధిక్కార పోరాట చరిత్రలు. రుద్రమ్మ నుంచి సమ్మక్క సారక్కల దాకా. ఇక్కడి మహిళలు, ముఖ్యంగా మట్టి మహిళలు తరతరాలుగా అనేక బతుకు పోరాటాలు, ఆత్మగౌరవ పోరాటాలు చేసినవారు. పోరాటాల్లో చాకలి ఐలవ్వ నుంచి కొదురుపాక రాజవ్వ దాకా ఎందరో ఉద్యమకారులు. తెలంగాణలో మహిళల రచనలు స్త్రీవాదంగా కేవల పితృస్వామ్య వ్యతిరేకంగా లేవు. తెలంగాణకు వలసొచ్చిన కోస్తాంధ్ర రచయిత్రుల రచనల్ని తెలంగాణ స్థానిక స్త్రీవాదంగా చెలామణి చేసే దౌర్జన్యం ఒకటి జరుగుతుంది. దీనిని తెలంగాణ రచయిత్రులంతా తీవ్రంగా నిలువరించాల్సిన అవసరముంది.
- జూపాక సుభద్ర
Published at: 31-03-2014 08:53 AM ( Andhra Jyothy vividha సౌజన్యంతో)
http://www.andhrajyothy.com/node/81336
 

23 ఫిబ్రవరి, 2012

తొలి ద ళిత కవి ‘మాదిగ మహా యోగి’ దున్న ఇద్దాసు

తొలి ద ళిత కవి దున్న ఇద్దాసు
వర్ణవ్యవస్థను ప్రశ్నించిన తొలి ప్రముఖుడు బుద్ధుడు. ఆ మార్గం శతాబ్దాల పాటు మూసుకపోయింది. మళ్లీ
ఆ మార్గాన్ని తెరిచింది బసవేశ్వరుడు. తెలంగాణలో దాని వారసుడు పాల్కురికి సోమనాథుడు. శిష్టవర్ణ కథనాల్ని తిరస్కరించి మడేలు మాచయ్య, కమ్మరి గుండయ్యలకు పట్టం కట్టిన మార్గదర్శి పాల్కుర్కి. ఆ మార్గంలో శిష్టవర్గ పురాణాల్ని కాదని విస్మృత కులాలు తమ కుల పురాణాల్ని సృష్టించుకున్నరు. ఈ కుల పురాణాల సృష్టి వర్ణ వ్యవస్థ మీద, వర్ణాధిక్యత మీద వేసిన పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న
తదనంతరం ‘ప్రధాన స్రవంతి’లోకి రాకపోయినా ఒక పాయగా సాగుతూ వస్తూనే ఉంది. ప్రచారం దృష్ట్యా
అది పాయ కావచ్చు. కాని జనాభా దృష్ట్యా అది పాయ కాదు. అదే ప్రధాన స్రవంతి. సరే పాయ అనుకున్నా అది ఆగలేదు. చెవుల్లో సీసం పోసినా, నాలుక ఖండించినా అది ఆగలేదు.

ఉపమ గలిగి శయ్యల నొప్పిఉన్న
అంఘ్రిభవుని కావ్యంబు
గ్రాహ్యంబు కాదు
పాయసంబైన సంస్కార పక్వమైన
కాకజుష్టంబు హవ్వంబు కాని యట్లు


అని నిషేధం విధించినా ఆగలేదు.తొలుత ఆ పాయ నుంచి గొప్ప శూద్ర కవులొచ్చినారు. కందుకూరి రుద్రకవి, తెనాలి రామలింగకవి, మన్నెంకొండ హనుమద్దాసు, వేపూరి హనుమద్దాసు, రాకమచర్ల వెంకటదాసు, పోశెట్టి అంగకవి, గావండ్ల రాజలింగకవి, సుంకరనేని ఫణికుండలుడు, గడ్డం రామదాసు, గౌడపురాణం రచించిన మల్లికార్జున సిద్దయోగి మొదలగువారు అట్లాం టి గొప్ప కవులు.
ఆ పాయలోని రెండవ పొర అయిన దళితుల నుంచి కవులొచ్చినారు. అట్లా వచ్చిన కవి చింతపల్లి దున్న ఇద్దాసు (1811-1919). లభిస్తున్న సమాచారం మేరకు ఇద్దాసు తొలి దళితకవి. బిరుదు రామరాజు గారు ఈయనను ‘మాదిగ మహా యోగి’ గా సంబోధించినాడు. ఇద్దాసు యోగిగానే ప్రసిద్ధి చెందినాడు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట తాలూకా అయ్యవారిపల్లి గ్రామం లో ఇప్పటికీ ఉన్న ఇద్దాసు ఆశ్రమం ఆ ప్రసిద్ధికి నిదర్శనం.

కరణాలు, రెడ్లు మొదలుకొని అనేక కులాల వారు ఆయన శిష్యులు గా ఉండడం ఆ గొప్ప తనానికి మరో నిదర్శనం. ఇద్దాసు యోగి గా ఉంటూనే అనేక కీర్తనలు, తత్త్వాలు, మేలుకొలుపులు రాసినందువల్ల ఆయనను నేను కవిగా ‘ముంగిలి’లో చేర్చిన. ఇద్దాసు అసలు పేరు ఇద్దయ్య. మాదిగ కులానికి చెందిన దున్న రామ య్య, ఎల్లమ్మలకు క్రీ.శ.1911 ప్రాంతంలో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి గ్రామంలో జన్మించాడు. రైతుల దగ్గర జీతగాడిగా ఉన్న ఇద్దయ్య తత్త్వకవిగా పరిణితి చెందడం ఆశ్చర్యకరం. పశువుల కాపరిగా ఉన్నప్పుడు సాధువుల సాంగత్యం ఏర్పడి వారి నుంచి తత్త్వగీతాలు నేర్చుకున్నాడు. మోటకొడుతూ ఆశువుగా తత్త్వగీతాలు అల్లిపాడేవాడు.

ఆ గీతాలు విన్న పరసిద్ధ జంగమదేవర పూదోట బసవయ్య ఇద్దయ్యకు లింగధారణ చేయించి, పంచాక్షరీ మంత్రం ఉపదేశించినాడు. తర్వాత ఇద్ద య్య పోతులూరి వీరవూబహ్మం, ఈశ్వరమ్మలు ప్రచారం చేసిన రాజయోగం సాధన చేసినాడు. ఆరునెలలు అడవుల్లో సంచరించి ఏకాంతంగా యోగసాధన చేసినాడు. పూర్ణయోగి అయిన తర్వాత అష్టసిద్ధులతని వశమై అనేక మహిమల్ని ప్రదర్శించినాడని జనశృతి. అట్లా ఇద్దయ్య-ఇద్దన్న, ఇద్దాసు అయినాడు. ఊరూరు తిరుగుతూ భక్తి, జ్ఞాన వైరాగ్యాల్ని ప్రబోధిస్తూ వందలాది మంది శిష్యుల్ని, భక్తుల్ని, అనుయాయుల్ని చేసుకుంటూ అచ్చంపేట తాలూకా అయ్యవారిపల్లి చేరుకున్నాడు. అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దాసు అనేక తత్త్వాల్ని, కీర్తనల్ని, మేలుకొలుపుల్ని ఆశువుగా వచించినాడు. ఇందులోంచి 32 తత్త్వాల్ని మాజీ మంత్రి పి. మహేంవూదనాథ్ సంపాదకత్వం లో మల్లేపల్లి శేఖర్‌డ్డి ‘శ్రీదున్న ఇద్దాసు గారి తత్త్వాలు’ పేరుతో ముద్రించినాడు.


పల్లవి: మీరయ్యవారా?
బ్రహ్మముగన్న వారయ్యగారూ
॥ మీర ॥
అనుపల్లవి: మీరయ్య వారైతే
మిగుల చెన్నంపురి
కంటిగురుని సేవ కనబరిచి తిరుగక ॥ మీర ॥
చరణం: గజరాజుకు మారు గ్రామ సూకరి బుట్టి
గ్రామశుద్ధి చేసి గజము నేననిమేటి
దానితో మారు మాటాడు తెలియని
వారు దానంతవారూ॥ మీర ॥
సింహమునకు మారు శునకనాథుడు బుట్టి
రేయి పగపూల్ల భౌభౌ మనియేటి
దానితో మారు మాటాడ తెలియని
వారు దానంతవారూ ॥ మీర ॥
తేజిగానికి మారు గార్ధభంబు బుట్టి
బంధమేసుకొని గరిక భక్షించేటి
దానితో మారు మాటాడ తెలియని
వారు దానంతవారూ॥ మీర ॥
వ్యాఘ్రమునకు మారు మార్జాలము బుట్టి
కండ్లు మూసుకొని పాలువూదాగేటి
దానితో మారు మాటాడు తెలియని
వారు దానంతవారూ ॥ మీర ॥

కామధేనువు మారు కడగోవు జన్మించి
మూతి వంచుకొని పూరి భక్షించేటి
దానితో మారు మాటాడు తెలియని
వారు దానంతవారూ॥ మీర ॥

వాసిగ తుంగతుర్తి వాసుని మరుగు జేరి
ఆత్మను గన్న ఇద్దాసయ్యగారు
మీరయ్య గారా?
ఆత్మను గన్న వారయ్య గారూ ॥ మీర ॥
ఇద్దాసు గారి ఈ తత్త్వం ఆయన కవితా తత్త్వాన్ని చిత్రిక పడుతుంది.
‘అ కులస్థుడై యున్న యభవుని భక్తికి
ఏ కులంబని నిర్ణయించెదవు’
‘ఎట్టి దుర్జాతి బుట్టిన నేమి
యెట్టును శివభక్తుడిల పవివూతుండు’

‘మలిన దేహుల మాలలనుచును
మలిన చిత్తుల కధిక కులముల
నెలవొసంగిన వర్ణధర్మమధర్మ
ధర్మంబే’
అని గురజాడ చెప్పడానికి
భూమిక నేర్పరచింది.
‘మాలల నంటగ రాదని
గోల నొన్చదరేలా గొప్పర నీకున్
మాలల గోసిన రక్తము
మీలోనను పాలుగలవే నిజముగ
నరుడా (1934)


అన్న పాల్కుర్కి భగవంతుని ముందు కులం ప్రసక్తి లేదని కులాలన్నీ ఒక్క ప్రబోధించినాడు. అది శూద్ర కులాల్లో సూతనోత్తేజాన్ని నింపింది. ఆ భావన కొనసాగింపు ఇద్దాసు ఈ కీర్తన. ఆ భావన కులపురాణాలు, అన్నమాచార్య, వీరవూబహ్మం, వేమనల మీదుగా ఇద్దాసు దాకా ప్రవహించింది. ఆత్మన్యూనత నుంచి బయటపడడం మొదలుకొని ఆధిక్యతను ప్రశ్నించేదాకా ఆ భావన దోహదం చేసింది. అది ఈ కీర్తనలో ప్రతిబింబించింది.

ఇద్దాసు మహిమల్ని ప్రదర్శించినప్పుడు ఆపహాస్యం చేసిన బ్రహ్మణులనుద్దేశించి ఆశువుగా చెప్పిన గొప్ప కవితాత్మకమైన కీర్తన ఇది. బాహ్యశుద్ధి కాదు అంతశ్శుద్ధి ముఖ్యమన్నది ఈ కీర్తన ఉద్దేశం. అంటే కులం ముఖ్యం కాదన్నది తాత్పర్యం.

ఈ భావనే తర్వాతి కాలంలో...
అని జగన్నాథం ఆవేదన చెందడానికి, దైద దేవేందర్ ‘తొండం’(1975) అనే కావ్యం రాయడానికి ఇటీవల అంద్శై గ్యారయాదయ్య, వేముల యెల్లయ్య, చిత్రం ప్రసాద్, జూపాక సుభద్ర, గోగు శ్యామల, జాజులగౌరి, పసునూరి రవీందర్, జిలుకర శ్రీనివాస్, కదికృష్ణ, చైతన్య ప్రకాష్ మొదలయిన వారు కులాధిక్యతను ప్రశ్నించడానికి కొత్త భావజాలంతో పాటు ఇద్దాసు మీదుగా నిరంతర ధారగా కొనసాగిన సబావూల్టన్ పాయ పూర్వ రంగ మేర్పరిచింది.
అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో ఇద్దాసు జన్మించి రెండు వందల సంవత్సరాలవుతున్న సందర్భంగా ఆయన రచనలన్నింటినీ సేకరించి ముద్రించడం, ఆయన కృతుల మీద విశ్లేషణ చేయించడం ఆయనకొనసాగింపుకు సార్థకత  చేకూరుతుంది.
-డా. సుంకిడ్డి నారాయణడ్డి
( నమస్తే తెలంగాణ సౌజన్యంతో...)

10 మే, 2011

రావినూతల ప్రేమకిషోర్ కవితా సంపుటి 'నలుగురమవుదాం' ఆవిష్కరణ సభ

రావినూతల ప్రేమకిషోర్ కవితా సంపుటి 'నలుగురమవుదాం' ఆవిష్కరణ సభ మే 10న సా.6 గం.లకు హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరుగుతుంది. ఎండ్లూరి సుధాకర్ అధ్యక్షత వహించే ఈ సభలో మంత్రి మాణిక్యవరప్రసాద్‌రావు, కె.వి.రమణాచారి, వెలుదండ నిత్యానందరావు, జూపాక సుభద్ర, దార్ల వెంకటేశ్వరరావు, కోయి కోటేశ్వరరావు, షాజహానా, మల్లవరపు రాజేశ్వరరావు పాల్గొంటారు.
- మల్లవరపు జాన్ మధుర సాహిత్య భారతి

18 జనవరి, 2011

నిలువెత్తు భారతీయతను నింపుకున్న కవి. పద్మశ్రీ జ్ఞానానందకవి

(సూర్య దినపత్రిక 17.1.2011 సౌజన్యంతో)
(ఇమేజ్ పై రెండు సార్లు క్లిక్ చేయండి. చదవడానికి పెద్దదిగా కనిపిస్తుంది)
‘‘ భరియించెద భర్తలుగా
వరియించెద మీ మనోజ్ఞభావమ్ముల, నే
చరియించెద నిష్టామతిు
గురియించెద వలపు మలపు కూర్ములెసంగన్‌’’ ఇది డా॥ యస్‌.టి.జ్ఞానానందకవి సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ‘‘ ఆమ్రపాలి’’ కావ్యంలోని ఒక చక్కని కంద పద్యం.ఆమ్రపాలి అందమైన అమ్మాయి. ఆమెను షోడషజనపథాలకు చెందిన రాజులు అనుభవించాలని ఆమె తండ్రినే నిర్భంధిస్తారు. అందమైన అమ్మాయిని గణభోగ్యగా చేసుకునే ఒక ఆచారం ఆనాడు ఉండేది. దానికి అనుగుణంగానే ఆమెను అలా అందరిభార్యగా మార్చుకోవాలనుకున్నప్పుడు, తండ్రి ఎలాంటి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలోకి కూరుకుపోతాడు అప్పుడు ఆమ్రపాలి ప్రకటించిన నిర్ణయం ఆ పద్యంలో వర్ణించారు కవి. కందం రాసిన వాడే కవి, పందిన కొట్టినవాడే మొనగాడు’’ అనే సామెత ఒకటుంది. కవిత్వాన్ని పద్యంలో చెప్పడమే కాకుండా, దాన్ని రసభరితంగా వర్ణించగల నేర్పు కందంలో అందంగా రాయగలిగినవారికే సాధ్యమనే విషయాన్ని చెప్పడానికా సామెతను సాహితీవేత్తలు చమత్కారంగా ప్రయోగిస్తుంటారు. కందం మాత్రమే కాదు, తెలుగులో ఏ పద్యాన్నైనా వర్ణించడంలో అభినవ శ్రీనాథుడనే కీర్తికి పాత్రమైన కవి పద్మశ్రీ డా॥ యస్‌.టి.జ్ఞానానందకవి. ‘‘కూలీ నుండి కళాప్రపూర’’్ణ వరకూ ఎదిగిన ఈయన ఈనెల ( జనవరి ) 6 వతేదీన శాశ్వతంగా కన్నుమూశారు.
జ్ఞానానందకవిగారు విజయనగరం జిల్లా బొబ్బిలిలో 1922 జూలై 16న సురగాలి పాపమ్మ, ఎల్లయ్య దంపతులకు జన్మించారు. తనమేనమామ దగ్గర రామాయణ, భారత, భాగవత, ప్రబంధాలను చదువుకున్నారు. ఉపాధ్యాయుడైన తన మేనమామ పద్యాల్ని రాగయుక్తంగా పాడేవారు. ఆ ప్రభావంతో తానూ పద్యం పాడటమే కాదు, రాయగలగాలనుకునేవారు. తెలుగు పండితులు అప్పయ్యశాస్త్రి, ఆదినారాయణశాస్త్రిగార్ల సహాయంతో వ్యాకరణంతో పాటు, పద్యవిద్యను అవగాహన చేసుకున్నారు. తన పదిహేనో సంవత్సరం నాటికి శతకాల్ని, శబ్దమంజరినీ కంఠస్థం చేసి, దీనబంధు శతకాన్ని రాశారు. చిన్నవయసులోనే సీసపద్యాలతో ఒక శతకాన్నే పూర్తిచేయడాన్ని గమనించిన తెలుగు పండితులు జ్ఞానానందకవి గార్ని చూసి ఆశ్చర్యపోయేవారు. అలా పద్యాల్లో కవిత్వం చెప్తూ, వివిధ సాహితీ సభల్లో వాటిని చదవాలని ప్రయత్నించేవారు. 1947 ఆగస్టు 15 వతేదీన స్వాతంత్య్రదినోత్సవాన్ని వర్ణిస్తూ రాసిన పద్యాల్ని ఒక సభలో ఆలపించారు. దానికి ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావుగారు సభాధ్యక్షులు. ఆ పద్యాల్ని విని ‘‘ఇకపై నీపేరు ‘ జ్ఞానానందకవి’గా ప్రసిద్ధి చెందుతుంది’’ అని ఆశీర్వదించారు. అలా నాటి నుండీ సురగాలి తిమోతి జ్ఞానానందంగారు, ‘‘యస్‌.టి. జ్ఞానానందకవి’’గానే ప్రాచుర్యం పొందారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి కవిగా గుర్తింపుపొందడమే కష్టం. అటువంటిది సంప్రదాయపండితుల మెప్పు పొంది, కనకాభిషేకాల్ని, అభినవ జాషువ, కవికోకిల, కవితాశ్రీనాథ, కవిలోక విభూషణ వంటి ఎన్నో బిరుదుల్ని పొందడం వెనుక కవి నిరంతర కృషి ఎంతో దాగి ఉంది.
జ్ఞానానందకవి అనగానే సాహితీలోకానికి గుర్తొచ్చే అంశాలు కొన్నైనా చెప్పుకోవాలి. భావకవిత్వం పేరు చెప్తే కృష్ణశాస్త్రి వేష, భాషలెలా గుర్తుకొస్తాయో, చాసో అంటేనే కాల్చుకుంటున్న చుట్టెలా గుర్తుకొస్తుందో, జ్ఞానానందకవి అనగానే కూడా గుర్తొచ్చే విషయాలు కొన్ని ఉన్నాయి. కవిగారి ‘‘ధర్మాగ్రహం’’ ఖండకావ్యానికి స్ఫూర్తిశ్రీ రాసిన ముందుమాటలో ఇది కనిపిస్తుంది. ‘‘ రోజువారీ జీవితంలో సైతం ఆయన నిండైన కవి. వెనక్కి దువ్విన ఒత్తయిన శిరోజాలు, ఎంతో ముద్దుగా పెంచుకున్న పొడుగాటి మీసాలు, వాటిని స్పృశించడానికి దిగివస్తున్నట్టు అనిపించే చెంపలు, మోకాళ్ళు దిగజారి వ్రేలాడే ఖద్దరు లాల్చీ, కొన్ని సమయాల్లో సిల్కు లాల్చీ, అందంగా తీర్చి దిద్దినట్టు కట్టిన పంచె ` వీటన్నింటికీ అందం తెచ్చే ధీరగంభీరమైన నడక... ఇది నాకు చేతనైనంతలో శ్రీ జ్ఞానానందకవిగారి రూపం’’ అని స్ఫూర్తిశ్రీ వర్ణించిందెంతో సముచితంగా ఉంది.
డా॥ జ్ఞానానందకవి రచనాతత్త్వాన్ని మూడుప్రధానమైన అంశాలుగా విశ్లేషించవచ్చు. తాను పుట్టిపెరిగిన కుల, మత, ప్రాంతమేదైనా, తనని భారతీయతకు ప్రతిరూపంగా అందరూ భావించాలనే ఆత్మవిశ్వాసం కలిగించే ప్రయత్నం ఆయన ప్రతిరచనలోను కనిపిస్తుంది.భారతదేశాన్ని వర్ణిస్తూ, హిమాలయాల్ని
‘ ఇది ఋషిచంద్రుల హృదయాల బంధించు
తతగాఢయోగ సాధన తలమ్ము
ఇది నిశాట ధ్వంసి పదముల లయ ఘోష
తాండవించిన దేవతా భువనము
ఇది చలిమిరిమల సదనమ్ము పరమప
విత్ర జాహ్నవికి నవేశనమ్ము
ఇది శత్రు సైన్యాల విదళింప నిలచిన
అరి భయంకర కరాళాయుధమ్ము
ఇది భరింపరాని హిమశృంగములజాడ
భరత ఖండమునకు వజ్రకుడ్య
మిది నగాగ్రగామి యిది వేలుపుల కొండ
ఇది మహా మహితము హిమకుధరము
ఇది ప్రకృతి యందచందాల కింపు గూర్చు
సురుచిర మనోజ్ఞ నృత్యనిర్జరుల నెలవు
ఇది హిమాద్రి ముక్కంటి యేలు నేల
స్వామి! కనులార తిలకించి పరవశించె’’ (శ్రీవివేకానందగానము) అంటారు. రెండవది, ఇంచుమించు పద్యంలోనే తన కవిత్వానంతటినీ చెప్పినా, తన ప్రతిభా పాండిత్య ప్రదర్శన కంటే, పాఠకులందరికీ పద్యం కూడా సులభంగానే అర్థమవుతుందనే ఆలోచనను కలిగించేలా పద్యాన్ని వర్ణించడం. మూడవది, అహింస, దయ, కరుణ, విశ్వమానవుడిగా ఎదిగే ఆలోచనలు కలిగించిన మహానుభావుల్ని కీర్తించడం వీరి రచనల్లో ప్రధానంగా కనిపిస్తుంది.
సమకాలీన కవుల్లో గుర్రం జాషువ, విశ్వనాథ సత్యనారాయణ, మధునాపంతుల సత్యనారాయణ, దాశరథి వంటి వారెందరో జ్ఞానానంద కవి కవిత్వాన్ని ప్రశంసించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం, మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో అనేక సంవత్సరాల పాటు వీరి ‘‘ఆమ్రపాలి’’ కావ్యం పాఠ్యాంశంగా ఉంది. అనేక విశ్వవిద్యాలయాల్లో వీరిపై పరిశోధనలు జరిగాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో సత్కరించగా, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేటుతో గౌరవించింది.కవి సాహిత్యానికి గుర్తింపుగా భారతప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.మొత్తం మీద పద్యకవుల్లో సామాజిక విషయాల్ని పద్యంలో ద్రాక్షాపాకంలో రాయడంలో చేయితిరిగిన కవిగా గుర్తింపుపొందారు. కఠినమైన భావాన్ని కూడా సులభంగా అర్థమైయ్యేరీతిలో వర్ణించి పాఠకుల్ని ఆనందింపజేయగల శక్తిమంతులు.దీనికి ఉదాహరణగా ఒక పద్యం చూద్దాం.
‘‘ రక్తప్లావితమైన మానగరమార్తధ్వానముల్‌ విన్న దు
శ్శక్తుల్‌ నెత్తురుద్రావు రాక్షసుల దౌర్జన్యాలు హింసల్‌ మహో
ద్రిక్తంబై చెలరేగ మానవత గోరి చొచ్చె నీవేళ నే
శక్తిన్‌ జూపి ప్రశాంతినింపెదవహో! సంక్రాంతి యీ నేలకున్‌’’ ` ఈ పద్యం ఈ మధ్యనే ఎవరో రాశారనుకుంటారు. ఇది 1993లో ‘‘ ఆహ్వానం ’’ లో రాసిన కవితా ఖండిక. కవిని ద్రష్ట అంటారు. నగరాల్లో నేరప్రవత్తుల్ని చూసినప్పుడల్లా అప్పుడే ఈ పద్యం చెప్పారా అనిపించేటట్లుంది. ఇలాంటివెన్నో సామాజిక అంశాల్ని పద్యాల్లో వర్ణించారు.
జ్ఞానానందకవిగారు నాటి నుండీ తుదిశ్వాస విడిచే వరకూ అవిశ్రాంతంగా తన పద్యవిద్యను కొనసాగించారు.తరంగమాల, వసంతగానం, దేశబంధు, పాంచజన్యం, గోల్కొండ, క్రీస్తుశతకం, రాజధాని, వంశధార, శ్రీవివేకానందగానం, క్రీస్తుప్రబంధం మొదలైన 36 కావ్యాల్ని ప్రచురించారు. షెడ్యూలు కులాలు అంటరానివా? అనే పరిశోధన గ్రంథాన్ని రాస్తే, దాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ప్రచురించింది. దీనిలో షెడ్యూలు కులాలు అంటరానివిగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ప్రముఖపాత్ర వహించిన మనువాదభావజాలాన్ని తూర్పారగట్టారు. నిజంగా వేదాల్లో, పురాణాల్లో లేని కులం, తర్వాత కాలంలో స్వార్థపరులు దాన్ని వాడుకుని సమాజాన్ని విచ్ఛిన్నం చేశారని నిరూపించేప్రయత్నం చేశారు. తన జీవితంలో ఎదురైన కష్ట నష్టాల్ని వివరిస్తూ ‘‘ కూలీ నుండి కళాప్రపూర్ణ వరకూ’’ అనే గ్రంథం రాశారు. వీరి సాహిత్య కృషిని వివరిస్తూ ‘‘ ది విజన్‌ ఇన్‌ ది వెర్సెస్‌ ఆఫ్‌ డా॥జ్ఞానానందకవి’ అనే ఆంగ్ల గ్రంథం కూడా వెలువడిరది. ఇంకా వీరి ‘ నా జీవితగాథ, ఏడు దశాబ్దాల కవితా పరిశ్రమ, సాహిత్య వ్యాససంపుటి, తొలిసంజ’’ వంటి అనేక రచనలు ముద్రితం కావాల్సినవి ఉన్నాయి.సాహిత్యమే జీవితమై బతికిన పద్మశ్రీ జ్ఞానానందకవి. తనలో, తన రచన్లో నిలువెత్తు భారతీయతను నింపుకున్న కవి. ఆయన రచనల్ని ప్రభుత్వం పునర్ముద్రించి, అన్ని విద్యాలయాలు, గ్రంథాలయాల్లో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేయడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళిని ప్రకటించిన వాళ్ళమవుతాం.
-డా॥ దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ,
సెంట్రల్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాదు` 46
ఫోను: 9989628049

17 జులై, 2010

ఈ రోజే నాగప్పగారి సుందర్ రాజు వర్ధంతి

దఃళిత స్టూడెంట్స్ యూనియన్ వారు మాదిగ సాహిత్య ఉద్యమ కారుడు, కవి, కీ.శే. నాగప్పగారి సుందర్ రాజు వర్థంతి కార్యక్రమాన్ని హైదరాబాదు విశ్వవిద్యాలయంలో నేడు (17-7-2010) నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం గం. 3 .- 30 నిమషాలకు పరిశోధక విద్యార్ధిని హేమలత అధ్యక్షతన అంబేద్కర్ ఆడిటోరియమ్ లో జరుగుతుందని దఃళిత స్టూడెంట్స్ యూనియన్ వారు ఒక ప్రకటనలో వివరించారు. ఈ కార్యక్రమంలో డా. దార్ల వెంకటేశ్వరరావు డా.కదిరి కృష్ణ, డా. జిలుకర శ్రీనివాస్‌ , డా. శ్రీపతిరాముడు తదితరులు పాల్గంటారు. సుందర్‌ రాజుకి సంబంధించిన వివరాలు కావలసిన వారు డా. దార్ల వెంకటేశ్వరరావు రాసిన ‘‘ ఒక మాదిగ స్మృతి ( నాగప్పగారి సుందర్రాజు పరిచయం) పుస్తకాన్ని చదివి తెలుసుకోవచ్చు. అది ఇంటర్నెట్‌ లో ఉచితంగా అందుబాటులో ఉంది.




18 జనవరి, 2010

నిప్పుల్లో తడిచే తప్పెట ( మాదిగ దీర్ఘ కావ్యం)


-->
ఒంగోలు గిత్త - ఎజ్రాశాస్త్రి - పౌరుష కవిత్వం
ఒక రచనని గుర్తించటం సాహిత్య ప్రస్తావనలో తక్షణ కర్తవ్యంగా భావించాలి. విమర్శలో సాహి త్య ప్రస్తావన అనే భావనని గురించి వివరించటం కన్నా అందుకు తగ్గ కృషి చేయటవేు విమర్శకుల కర్తవ్యంగా నేను భావిస్తాను. విమర్శకి మరో కర్తవ్య పార్శం సాహి త్య ప్రస్తావనే. ఇటీవల వచ్చిన కొత్త ధోరణులని కొంతమంది విమర్శకులు యింకా జీర్ణంచేసికోలేదు. మన విమర్శకులు వాళ ధోరణిలోనుంచి రచయిత కృషిని పట్టించుకుంటున్నారుగాని రచన తరఫున వకల్తా పుచ్చుకొనే ధోరణికి అలవాటు పడలేదు. రచయిత రచన చేసిన తర్వాత రచయితనుంచి రచన విడిపోతుంది. యింక రచయితకి ఆరచనకి సంబంధం వుండదు. రచన పాఠకుడి వశం అవుతుంది. రచనని పాఠకుడి కంటే కూడా ముందుగా విమర్శకుడి గుర్తింపుద్వారా విమర్శకుడి మొదటి కర్తవ్యం ప్రారంభం అవుతుంది. ఆగుర్తింపు ద్వారా ఆరచనని, ఆరచయిత యితర రచనలని విమర్శకుడు గుర్తించి దానిని వీలున్న చోట ప్రస్తావన ద్వారా ఆరచనని పాఠకుడి దగ్గరికి తీసికెళాలి. అంచేత విమర్శలో సాహి త్య ప్రస్తావన ఒక గతి శీలక పాత్రనే కాక చైతన్య వంతమైన పాత్ర కూడా నిర్వహించి రచయితని బేరీజు వేసేందుకు కృషి చేస్తుంది. రచనా ప్రవాహాంలో ముందుకు నడుస్తున్న రచయిత రచనలని అతని కృషి, అతని బలాన్ని, బలహీ నతనీ ఎత్తి చూపటం సాహి త్య ప్రస్తావనలో జరగాల్సిన మొదటి తంతుగా భావించాలి.
నా సాహి త్య ప్రస్తావనలో భాగంగా గత పదేళనుంచి సాహి త్య కృషి చేస్తున్న దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి ఎదుగుదలని గుర్తించే ప్రయత్నవేు ఈ వ్యాసం నిర్వహి ంచే పాత్ర. నిజానికి రచనని గుర్తించే ముందు విమర్శకుడికి ఆరచయితకి సాన్నిహి త్య సంబంధం కూడా చాలా అవసరం. ఒక విమర్శకుడు తారసపడ్డ ప్రతి రచయితని, ప్రతి కవిని కప్పదాటుగా విమర్శంచే కర్తవ్యం నించి బైటపడి, తనకు దగ్గరగా వున్న,తనకు బాగా తెల్సిన, తన ప్రాంతీయ రచయిత కృషిని గుర్తించి ఆ విమర్శని ముందుకు తీసికెళటం చాలా సరైన చర్య. నిజానికి ఒక విమర్శకుడు ఒక రచయితని లేదా ఒక ధోరణి రచయితలని అంటిపెట్టుకొని వాళ కృషిని కాపాడటం కూడా సాహి త్య ప్రస్తావనలో సరైన చర్యగా భావించాలి.
దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి నాకుగత పదిఏళనుంచి బాగా తెలుసు. అతడి కవితా ప్రయాణాన్ని దగ్గర నుంచే గమనించటవేుకాక ప్రోత్సాహి ంచి అతనికి నా తోడ్పాటును ఈరోజు దాకా అందిస్తున్నాను. అందుకే ఈ పరిచయం.
చెప్పులుకుట్టే చేతుల వంశంనించి ఎదిగిన ఎజ్రాశాస్త్రి ఆ మాదిగ జాతి నిర్వహి స్తున్న యం.ఆర్‌.పి.యస్‌. ఉద్యమానికి బాసటగా నిలుస్తూనే కేవలం దళిత కవిత్వ నిర్వహాణా స్పృహా చాలదని గుర్తించటంలోనే అతని వ్యూహాంవుంది. దళిత ఉద్యమాన్ని బహుజనుల చేతికి అందించటం ద్వారా మాత్రవేు తమ జాతి ఆత్మగౌరవం మరింత పదును ఎక్కుతుందనే జాతీయ స్పృహా ఎజ్రాశాస్త్రిలో వుంది. అందుకే రచలని దళిత కవిత్వంలో భాగంగా కాక బహుజన కవిత్వ నిర్మాణంలో భాగంగా అతను కృషి చేస్తున్నాడు.
ఎజ్రాశాస్త్రి తన సాహి త్య ప్రస్థానంలో యిప్పటి వరకు వెలువరించిన రచనలు :
1) కర్రముక్క - దీర్ఘకవిత - ఆగస్ట్‌ 2005 ప్రచురణ
2) ఏరువాకై తిరిగి లేస్తా - కవితా సంకలనం - డిసెంబర్‌ 2006 ప్రచురణ
3) నిప్పుల్లో నడిచే తప్పెట - దీర్ఘకవిత - డిసెంబర్‌ 2008
పై రచనలేకాక నిరంతరంగా పత్రికల్లో అతని కవితలు వస్తున్నాయి. ఆ కవితల్లో ''బియ్యమూ - బంగారమాÑÑ అంటా వడ్లగింజ గురించి రాసిన అతని కవిత యిటీవల గొప్ప సంచలనం చేసింది.
కవిత్వం అంటే కేవలం ఓ అనుభవవేు కాదు, చరిత్రలో భాగం కూడా. రచన చేయటం చారిత్రక కర్తవ్యంగా భావించే క్రమలో నుంచే వెలువడింది కర్రముక్క దీర్ఘకవిత! ఏజాతి నైతే దూరంగా యింతకాలంగా తోసి వేశారో. ఆజాతే మరుభూమి దగ్గర్నించి, కళ్యాణ వేదికల దాకా దుడ్డుకర్రని చేత పట్టుకొని సమాజాన్ని ముందుకు నడిపించటవేుకాక - అన్నింట్లోను వారే ముందువుండి ఆ తర్వాత మరే జాతి అయినా, అనే సామాజిక ఆత్మగౌరవం దట్టించిన ఉద్యమ స్పృహాని ఈ కర్రముక్క దీర్ఘ కవిత నిరూపించింది. పాలక వర్గాల్ని ఎదురించే క్రమంలో భాగంగా ఈ కర్రముక్క ఓ ఆయుధంగా అవుతుందని ఎజ్రాశాస్త్రి ఎలుగెత్తి చాటాడు.
''కర్రముక్కకదా అనుకుంటే పొరపాటే / ఆకులు వలువలు ధరిస్తే, మహారణ్యం!, ఆకులు విదిల్చిచేతే ఒక మహా సింహాసనంÑÑ అనే ఎత్తుకొలుతో ప్రారంభమైన ఈ మహా ప్రవాహాం కవిత ఆ..... ''శత్రు సమూహాలపై ఈటేలు విసిరి / భూ భకాసురులపై ఒరిసెలు ఎత్తి / ఆ నాగరిక / అడవితల్లిబిడ్డలకు వనమూలికలై / వేర్లనుండి వైద్యాన్ని మొలిపించి / ఆకు పచ్చగా చిగిర్చింది నువ్వేకదా?ÑÑ అని ముక్తా యించటవేు కాక కర్రముక్కని విముక్తి దాతగా ప్రకటించడం ద్వారా ఆత్మ ప్రభోదాన్ని చాటి చెప్పటం జరిగింది!
కర్రముక్క దీర్ఘ కవితతో పాటు ఈ సంకలనం అతని మరిన్ని తొలినాటి కవితలు 16 దాకావున్నాయి.
''రెండు క్షణాల కౌగిలి / మూడో క్షణం చీదరింపు గతం అంటుకోలేదు / వర్తమానం వెంటరాదుÑÑ అంటూ క్షణికం మీద అతను విసిరిన వైరాగ్యంఅతని కవిత్వ సూటిదనాన్ని తాత్వికంగా విన్న విస్తుంది. ఈపోకడే అతని చాలా కవితల్లో కన్పిస్తాయి. కారణం ఎజ్రాశాస్త్రి ఒక ఆసుకవి. పైగా జానపదకవి. అనేకమంది జానపద కవుల మాదిరే అవలీలగా కవితలు అల్లుతాడు. ఈ అల్లిక అతని నోటి వెంట అనర్గళంగా ప్రవహి స్తుంది. అందుకే అతని రచనలు ధారగా ప్రవాహాంగా సాగుతాయి. చెప్పేవిధానంతో కవిత రాయట ద్వారా అతను రెండు ప్రయోజనాలు సాధిస్తున్నాడు. ఒకటి అతని రచన సూటిగా వుంటుంది. రెండు అస్పష్టత ధరి దాపులకు వెలకుండా సూటిగా పాఠకుడికి అనుభూతిని ప్రసాదిస్తుంది. అక్కడే అతని విజయం అతని బలహీ నతలు కూడా బైటపడ్తుంటాయి. ప్రవాహాంగా వచ్చేఅతని కవిత్వంలో అక్కడక్కడ కొన్ని నట్లు కన్పిస్తుంటాయి. ఇటీవల ఆ బలహీ నత ఒదలించుకొని సూటిగా కవితవెలువడటం యిటీవలి అతని కవితల్లో స్పష్టంగా కన్పిస్తోంది. అందుకు కారణం అతని నిత్యకృషి, సాదన, అధ్యయనం పైపెచ్చు నీర్భీకత. ఈ నిర్భీకతతోనే అతని కవితలు పండుతున్నాయి. అందునా బాల్యంలో వలకూలీ అయిన తండ్రితో కలిసి సేద్యం చేసిన చేతులు ఈ నాడు కలం పట్టుకొని ముందుకు వచ్చినప్పుడు 'ఏరువాకై తిరిగి లేస్తాÑ అనే సంపుటిని ప్రకటించటంలోనే రైతుకూలీల పట్ల, రైతాంగం పట్ల అతని ఆవేదన అర్ధమవుతుంది. రైతుల ఆత్మ హాత్యలకి చలించిన తాను, కళ్లముందర ప్రవాహామైన పంట చేజారిన చేతిలోని బిడ్డలా ఆత్రంగా చేతులెత్తి కాపాడమని ఆక్రోశించినట్లుంది పంటపొలం. అంటా ఓ భావ చిత్రాన్ని మన ముందు వుంచుతాడు. అలాగే రైతుని కూలి తల్లి ముక్కుపుడకై వెలిగే భాస్కరుడుగా చిత్రీకరించటంలోనే అతని భావుకత వెల్లడవుతుంది. రాయటంగా కాక చెప్పడంగా వచన కవితని ముందుకు తీసికెళటంద్వారా ప్రప్రధమంగా ఒక మంచి దళిత కవిగా పేరుతెచ్చుకొన్న ఎజ్రా ఒక సిద్ధాంతం కాడే ఆగిపోకుండా నిరంతర ప్రయాణంలో భాగంగా తన కవిత్వాన్ని బహుజనుల కోసం తర్వాత తర్వాతి రోజుల్లో మలచటం అతని ఎదుగదలని సూచిస్తుంది.ఏకవికూడా ఏదో ఒక సిద్ధాంతం దగ్గరే నిలబడ్తే కొన్నాళ తర్వాత రాయలేడు. చెప్పిందేచెప్పి ఆతర్వాత కనుమరుగై పోతాడు. అలా కాకుండా నిరంతర చలన శీలతతో సమాజానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ కవిలో పరిణతి సాధ్యవుతుంది. ఆ పరిణతిని ఎజ్రా అందుకున్నాడని నేను భావిస్తున్నాను.
''మనస్సు తెరల మాటున నడిచి వెళిన నీ పాదముద్రల సవ్వడి మారు మ్రోగుతునే వుందిÑÑ అని నా నెచ్చెలి అనడంతో ఆ నెచ్చెలి అంబేడ్కర్‌ అనే మార్మికతని సాధించటం కూడా ఎజ్రా పరిణతలోని భాగవేు. అందుకే ఏరువాకైతిరిగి లేస్తా అని అనటంలో కూడా పాపులకోసం ఏసుక్రీస్తు మూడవదినం లేచినట్లుగా తానూ ముందుకు వస్తాననే మార్మిక ప్రయోగం చేయగలిగాడు. అంచేతనే ఏరువాకై తిరిగి లేస్తానని అనేక కవితలకి సూటి దనంతో పాటు అనేకానేక అర్థాలు పాఠకులు వెతుక్కోవల్సిన అవసరంవుంది. అందుకే ఈ సంకలనంలోని కవితలు ఏనాడు చదివినా పాఠకుడు ఫ్రేష్‌గా ఫీల్‌ అయ్యే వెసులు బాటుని అతని సంకలనంలో ని కవితలు కన్పిస్తాయి.
'నిప్పుల్లో దరువేయ్‌ వివక్షలను తరివేుయ్‌Ñ అనే వేుల్కొలుపుతో వచ్చిన మరో దీర్ఘకవిత ఎజ్రా యిటీవలనే వెలువరించిన సంకలనం! యిందులో మిగ్గు, ముడుసు, ఈరగ, గోరోజనం,శరాయి, బొక్కెన మొదలైన ప్రకాశం జిల్లా మాదిగపల్లె మాండలిక పదాలు కోకొల్లలుగా కన్పిస్తాయి. రచయిత తన ప్రాంతీయ స్పృహాని వెలువరించంద్వారా ఆరచనకి ఒక సజీవకతని సాధిస్తాడు. ఆ మాండలిక పదాలు చావకుండా అన్నమయ్య దగ్గర్నుంచి ఎజ్రాశాస్త్రి మొదలైన జానపద రచయితలంతా ఒకే మెలుకువతోనే ఆపదాలని బతికించగల్గుతున్నారు. భాషని సజీవం చేస్తున్నారు. భాష రచయిత చేతిలోని పనిముట్టు. దాన్ని ఒడుపుగా వాడుకోటంలోనే అతని నిర్మాణ కుశలత కన్పిస్తుంది. మాదిగ జాతిని వేుల్కొలిపే మాదిగ పురాణమిది అని ముక్తాయింగా వెలువరించిన 'నిప్పుల్లో నడిచే తప్పెటÑ మనల్ని మాదిగ పల్లెల్లోకి పరిగెత్తిస్తుంది.
''నా చేలో మొక్క / ఇటుకలో మట్టి/ చెప్పుకువేుకుÑÑ యిలాగ ప్రవాహా స్థాయిలో నడిచే యితని కవిత్వాన్ని పాడుకునే గుణం కూడావుంది. అందుకుతగ్గలయ, దరువు, అతని నిప్పుల్లో నడిచే తప్పెట కవిత్వంలో మనం వెతుక్కోవచ్చు. మిగతా దళిత కవుల మాదిరి ఆక్రోశం, నిందాస్తుతి, అపరిపక్వ పెళుసుదనం ఎజ్రా కవిత్వంలో ఎంతవెత్తుక్కున్నా కానరాదు. అందుకు భిన్నంగా మార్మికత, సూటిదనం, పరిగెత్తుతా, గెంతుతా ఆడుతూ పాడుతూ సాగే పరిమళాలు యితని కవిత్వంలో సాధారణ అంశాలు. ఎప్పుడూ గొప్ప మెళుకువతో కవిత్వం చెప్పిన లక్షణాలే మనకు కన్పిస్తాయి తప్ప స్పృహా దాటి గతి తప్పి నినాద స్థాయి రచనాతత్వం ఎజ్రా కవిత్వంలో మనకు కానరాదు. అందుకు భిన్నంగా నేడు సౌకుమార్యం, లాలిత్త్వం, పదాల ముప్పేటు దాడి, జాతిలోలత్వం నిండుగా యితని కవిత్వంలో వెదుక్కోవచ్చు. ఓ సుకుమార కవి ఎజ్రా! ఓ ప్రేమకుడి లాలిత్త్వం నిండివున్న యితని కవిత్వాన్ని ఎన్నాళయినా ఆస్వాదించవచ్చు. జాషువా కున్న నిర్భీకత, నిజాయితీ వున్న అసాధారణకవి ఎజ్రా శాస్త్రి. అతను ఆంధ్రుడు కావటం మన అదృష్టం. అందులోను కనిగిరి వాడు కావటం మరో గొప్ప అదృష్టం. ఒంగోలు గిత్త పౌరుషం యితని కవిత్వంలోనూ చూడచ్చు.
- శ్రీరామకవచం సాగర్‌
www. sriramakavachamsagar.wordpress.com

------------------------------------------------------------------------------------








ఆసుపత్రికి ఓమూల
పోస్టు మార్టం గదిలా
ఊరికి దూరంగా మాదిగ పల్లె
చర్మం లేని దట్టెంలా ఉంది
నాగజెముడు
బ్రహ్మాజెముడు
సర్కారుకంప
రేగి
కలివె
తుమ్మ
పరికి
ఒళంతాముళతో,
కంపల్లో రాలిపడుతున్న
రక్తపు చుక్కలు
తలమీద ముళకిరీటం
ఒళంతా గాయాలమయమైన
క్రీస్తులా ఉంది నా మాదిగపల్లె.
బతుకు భారమై
భుక్తికోసం
వలస జీవనం
సాగిస్తున్న
వాస్కోడిగామాలు
నా మాదిగ ప్రజలు
ఇంటి ముందర
రెండు ప్రయోగశాలలు
అమ్మసున్నం
అయ్యతంగేడు -
అయ్య వీరబాహుడిలా
కల్లుతాగి
కత్తులు పదును బెడ్తుంటాడు
కసాయి భాషనేర్వనికత్తి
అయ్యచేతిలో
కొవ్వొత్తిలా వెలుగుతుంది,
చెట్టుకింద కూర్చొని చెప్పులు కుడుతుంటే
బోధివృక్షం కింద
బుద్ధుడులా ఉండేవాడు
ఆరెకు,వారుకు, తోలుకు, నూలుకు మధ్య
''మిగ్గుÑÑలాంటి మనసున్న అయ్య
నే పాలు తాగక మారాంజేస్తె
వాల్లయ్య పేరుతో
నా పసితనానికి
పెద్దరికం తలపాగా చుట్టి
సంబరపడేవాడు
అమ్మ తొమ్మిదినెలలు
కడుపులో మోస్తే,
అయ్య తన గుండెలమీద,
బుజాల మీద మోసెవాడు.
తడుబ్బాత1 లేని అయ్య
నా పసి బెల్లానికి
''శరాయిÑÑ తొడిగి
సంబరపడేవాడు.
తన చద్దిబువ్వలో
నేను చిచ్చుళు పోస్తే
చీదరింపు లేక
కాటంరాజు తిరనాళలో
నన్ను బుజాలకెత్తుకొని... చిందయ్యెవాడు.
ఓ..న..మాలు రాని అయ్య
నాకు పెదబాల శిక్ష.
నా పలకా, బలపం,
నేను కలగటేరు
అయితే కల్లజూడాలని
కలలుగనేవాడు.
అయ్య తప్పెట దరువేస్తే
రైలు పట్టాలుదిగి
మాదిగ పల్లెలోకి
పరిగెత్తినట్లుండేది.
మా ఇంటిముందర
కల్పవృక్షం లేకపోయినా
చింతచెట్టుండేది
ఊరి పచ్చి బాలింతలకు
పత్యానికి పాతచింతకాయ పచ్చడి
కాసిన్ని కస్తూరి మాత్రలు,
చిటికెడు గోరోజనం అయ్యేవాడు అయ్య.
వేురు పర్వతమా
జాంబవతనయా
పసిడి నదులు
నీపాదాల గుండా
ప్రవహిాంచేవట
త్రేతాయుగంలో
శ్రీరాముని రాజకీయ సలహాదారుడివై
ద్వాపరయుగంలో
శ్రీకృష్ణునిపై
వీరోచితంగా పోరాడినావట
శూరుడా !
యుద్ధవీరుడా !
అద్భుత శమంతకమా,జాతిరత్నమా
కోహిానూర్‌ కూడా నీ ముందర వెలవెలే కదా!
నీవు నడిచొస్తుంటే
పొడిచొస్తున్న సూర్యుడిలా ఉంటావు!
బండా గుండ్రాయితో ఉగ్గునూరి
బుగ్గగిల్లి ఉగ్గుబెట్టి
తలకు సాంబ్రాణి ధూపవేుసి
దూలానికి జోలేసి
ఊగే ఉయ్యాల కాదు బాల్యం
నేను పీకి పారేసిన ముడుసు2
చదువుల్లో నేను సొలోమానురాజు
మా బడి మా ఊరిగుడి
అయ్యవారు పూజారి
నే గుడిముందర చెప్పులు
మెట్లవద్ద యాచకుణ్ణి
అక్షరాలు అయ్యవారి దయ
ఐదోతరగతి పుస్తకంలో
అంబేద్కర్‌ గుర్తొస్తుంటాడు
ఆరో తరగతి రాగానే
మహాకవి జాషువా
కష్టజీవిలా కనిపిస్తాడు.
జేెబులో రెండు ఈరగ (లివర్‌) ముక్కలు
నాకు చాక్‌లెట్స్‌,
కృష్ణ, కృపన్నలు
కరపత్రాల
కత్తులతో
కువ్వల్లో కనికట్టతేల్చి
జరుగుతున్న మోసాల్ని
లెక్కల్లో చిక్కు ముళువిప్పి
దండోరాకు నన్నొక
తప్పెట మూయాలనిరి
రాత్రి చర్చల చివరాకర్లో
క్రీస్తు రెండో రాకడ కొరకు
క్రైస్తవులంతా ఎదుర చూసినట్లు
మాదిగ మందిమంతా
మాదిగ నాయకుడికొరకు
ఎదురు జూస్తుండిరంటిని
ఎబిసిడిలు భాగవతం
బిబిసిలో బూర ఊదబడునని
మహానాయకుల సరసన
మాదిగ జాతికి కుర్చీలుంటాయని
జోష్యం జెప్పినానప్పుడు కాలజ్ఞానమై
మీరు ఆదర్శ స్వాప్నికులు
వెలకట్టలేని వెలుతురు దివ్వెలు
రేపటి తరాలకు నిప్పురవ్వలు
బాబూజీ వారసులు
బాబాసాహోబ్‌ ఆలోచనాపదŠంలో
పయనించే అరుంధతీ పుత్రులంటిని
కనకగిరి నెక్కి
కనక తప్పెటతో
దామాషాగురించి
కనిగిరి తాలూకాలో
దండోరా ఏసిన మొదటోన్ని
మా ఊరు సరస్వతికి
నిలయం కాకపోయినా
అరుంధతికి ఆలయం
పోలేరమ్మకు పుట్టిల్లు
ముత్యాలమ్మ తల్లి వేరేనా?
మా ఇంటి ఆడపడుచు
బక్క ఎద్దుచర్మం
బొక్కెన తోలు
బక్కరైతుకు చెప్పులు
తొండానికి తోలు
దండేనికి తునకలు.
పసుపురోగ పాడావు
చండ్రకోల వారులు అల్లి
బొడ్డారులు3 మెడగంటలు
తలకుచ్చులు.
కరువు కాటకాలు
పన్నుపోటు, వెన్నుపోటు
జమాబందీలకు
ఏలానికి, తాలానికి
చావులకు, సంబరాలకు
చాటింపు, దండోరాలై
పీర్లగుండాల నడిపించి
ప్రభలైనా
పూలబండ్లయినా
వెలిగేది వాళు
ఎగిరేది వేుము.
పాలు పెరుగు ఎరగని
పాలేరు బ్రతుకు మాది
వేగుచుక్క వేులుకొని
ఏడుగాల్ల పెడ
ఇంటిముందు కళాప
ఎరువు బండ్లు, బరువు బండ్లు
ఏడు బర్రెల పాడి
చిట్టు, పొట్టు
గాటిలో గడ్డి
దూడ మూతికి చిక్కం
నా ముంతలో పున్నీళు.
కాడెడ్లకు కొండగడ్డి
పాడి బర్రెకు పచ్చగడ్డి
పైటాలకు నాకు రాగిముద్ద
మాపైగుడ్డలు బాప్తీస్మాలు
పొందితేగాని చాకలన్నముట్టడు
దొరలు కాళు పట్టిన చేతులు
మా తల వెంట్రుకలేనాడు ముట్టాడుకనుక?
పై చదువులకు
నే పట్నం మెట్లెక్కితే
అమ్మా కళళో నే కన్నీళౌతా
అయ్య నా పాదాలకు చెప్పులై
ముద్దాడతాడు.
ఐదు రొట్టెలు
రెండు చేపలకై కాక
చర్మంచుట్టిన
ఎముకలగూడు
నడిచే అస్తిపంజరంనేను
నిత్యం పస్తులై, నిస్తులై
పాఠాలతో
పొట్ట నింపుకొని
ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణతే
శలవు దినాలన్నీ
నాకు పనిదినాలే
నేను పునాది రాయి
తీసిపారేసిన రాయి తలకు మూలరాయి
నే చేలో మొక్క
ఇటుకలో మట్టి
చెప్పుకు వేుకు
చేనుకు కంచె
చేలో ఎరువు
కంచెలో మంచె
మంచె విూద వడిశల
వడిశలలోన రాయి
తోకలేని పిట్టలెన్నో
తల ఊపుతూ మోకరిల్లి
ఉభయకుశలోపరి అంటూ
క్షేమాలను మోసుకొచ్చి
చావుకబుర్లు తీసుకొచ్చి
మసిబూస్తే మరణమని
పసుపైతే పెళని
నాతో పరిపరి చదివించుకొని
ఏడూళకు దారినేను
దిక్కునేను
నేనుపట్టా పట్టుకొని
నడిచొస్తుంటే
జమాబందికొస్తున్న
తహాసిల్‌దారులా
నా మాదిగపల్లె
''తునకల హారాలతో
స్వాగతం పలికేది
కరువు శిలువను మోస్తూ
కాలాన్ని ఎల్లదీస్తూ
పల్లేర్ల మీద బతుకుబండినీడిస్తూ
కట్టెల మోపులు
కలబందలు
గోగు, గురివిందలు
పావలో బేడో
అర్ధణో, అణాతో
పొట్ట పోసుకొని
ఆకలి కలెవకాయలు
నెమ్మిపండ్లు
దొంగిలిన
దోసకాయలు
వేరుశనక్కాయాలు
గెణుసుగడ్డలు
అడవిగడ్డలు, పిల్లేర్లతో
పొట్టనిండక
పస్తులై, నిస్తులై
పొగరాని పొయ్యిజీవితం
నారై, నీరై, మొక్కై
పుడమితల్లి పొత్తిళలోచేర్చి
పంటకు జోల పాటపాడి
వేుఘమా! వర్షమైవచ్చి
నారైతు పంటను ముద్దాడమని
తూర్పు, పడమటిగాలులు
వింజామరలై వీచమని
ఉత్తర దక్షణాదులుయ్యా లూపమని
చిరుపొట్ట కాగానే
వడిశలై పిట్టల్నితోలి
చిరుగాలులూ!
శ్రీమంతంచేయమని
గింజకాగానే
గాలిహాోరుల
తుఫానులు తాకొద్దని
ప్రకృతి నాల్గుదిక్కులమొక్కి
పంటను రైతు ఇంటచేర్చి
వేుమంతా చేలో
కొయ్య కాళలా మిగిలిపోతాం
కుప్పనూర్చి
తూర్పారబట్టి
గాలికి ఎగిరే తాలు గింజలం
రాసి అడుగుమట్టి గింజలం.
దేవుని మాన్యాలన్నీ
దెయ్యాల పాలు
నైవేద్యాలన్నీ బూతాలపాలు.
జానెడు కొమ్ములు తిరిగిన
మెడబలసిన దున్నపోతును సైతం
ఏటుకునరికి
పొలినై బలినైన
ఊడ్చడానికి
ఏడ్చడానికి సెంటుభూమిలేదు.
జీవితాన్ని తెగిన చెప్పులా ఈడుస్తున్నా
వేసక్టమీ అంటే అయ్యకు ఉరి
సారా కోసం సావుకైన సిద్దం
కుచేలుడు సంతానాన్ని
కలరా కబలిస్తున్నా
అతిసారా అంతమొందించినా
మసూచి మట్టుబెడుతున్నా
పోలియో అంగవైకల్యమైనా
వ్యాధినిరోధక టీకాలంటే
చెట్టు
పుట్ట
గాదే
గరిసెలై
ఏడూళు ఏకమై
ఏడుపులు
పెడబొబ్బలు.
పల్లె రాబందులకు విందు
తమలపాకులు తుంచారని
తలకాయలు తెంచారు
అరటిగెలనరికారని
అరికాళునరికారు.
గొర్రెల్లోబడ్డా తోడేళా
వేుకల్లోబడ్డా చిరుతల్లా
నాలుగెద్దుల కదŠలో పులిలా
విభజించి పాలించే
తెల్లదొరలకు తీసిపోరు
రైతుల పెళంటే
చెప్పులు పువ్వుల్లా
పాదాలకింద పోస్తాడు అయ్య
గజ్జల గుత్తైపోయి
చిందులు శివాలై
చిట్లిన తప్పెటలా
గోడకిందవాలి పోతాడు
పండగంటే
వడ్లగింజలో
బియ్యపుగింజ!
సంవత్సరానికో ప్రసాదం!!
ఈ వసంతాని కోసం
నా పల్లె ప్రజలు వలస పకక్షుల్లో
కలిసిపోయింది.
జబ్బుకు
జాడ్యానికి
జిల్లేడు పసరు నస్యం
కళల్లో కలికం
సొంటి
వొంటేలువైద్యం
కషాయం
పాషాణం
లంకణానికో పత్యం
వరిబువ్వగంజి
టీగ్లాసులే కాదు
మందుగ్లాసులు
ఊరిని పల్లెను రెండుగా
చీలుస్తాయి
కొంపలు నిప్పంటుకుంటే
కులం వాగులో
విద్యుత్‌లా ప్రవహిాస్తుంది
దాహానికి దోసెళతో
దేబిరించాల్సిందే
బూడిదలో ఉచ్చ
బుడ్డోడిమంత్రం
కొండ నాలుక పెరిగిందని
చిమట కాకర్లబోతే
ఉన్న నాలుక ఊడిపోయే
తేలు మంత్రం
భూతాలకు తంత్రం
చేతబడి
చిల్లంగి
బాణామతి
అమాయకత్వం
ఆసరాగ పెట్టుబడి
ముగ్గులేసి
నిగ్గుతేల్చి
మాదిగోడికి పాతాళం.
రైతు పంటచేతికొస్తే
నేను మగదŠ సామ్రాజ్య
యువరాజునే మరి
గంగిరెద్దుల ఆట, నిప్పుల్లో నడుస్తున్న
కణకతపెట్లు, కర్రసాములు
మల్లయుద్దాలు
వీధినాటకంలో నేనెప్పుడూ
వీర బాహున్నే
మాదిగ మాష్టీలు
ముష్టియుద్దాలు
మల్లయోధులై
సాముగరిడీలై
యుద్ధవీరులైన మాదిగసేన!
నాపేట కోట ప్రాకారం
అల్లంత దూరాన
నాడెక్కలి సుందరి
చెలికత్తెలతో
తన సౌందర్య సుమాల
సువాసనలతో నన్నా కర్షించి
ఆహ్వానం పలుకుతుంది.
కోరమీసాలు మెలివేసి
కిర్రుచెప్పులు కాల్లతొడిగి
నెత్తికి సమురుబూసి
నా నిలువెత్తు మూర్తి మత్వానికి
మాల కొండన్న
నూరు నెంబరు నూలుపంచ
ఖద్దరులాల్చి ఆరుమూరల కండువాతో,
వెనకాముందు సైన్యాలున్నట్లు
అశ్వాలు
ఐరావతాలు
కదులుతున్నట్లు నేనుకదులుతుంటే
అంతఃపుర సుందరాంగులు
లేలేత లేగదూడల కొవ్వుల పువ్వులతో
వసనెయ్యి4 ప్రమిదల తో
నాకు ఆహ్వానం పలికినట్లుండేది
నేను నాప్రియురాలు
మందహాసంతో
ఆ నులక మంచవేు పట్టుపరుపు
పందిరిమంచం
ఆపై మా ప్రణయ గాధలెన్నో?
నా జీవితపురాణం
నాలుకమీద లిఖించుకున్న 'ఆసాదిÑÑ
వల్లిస్తూ
జంబూద్వీపము
జాంబవ పురాణం
యజ్ఞ జ్వాలలనుండి
ఉద్భవించిన అరుంధతిని
వశిష్టుడు వలచి
కులపెద్దల ఆజ్ఞతో
పరిణయమాడి
ఆకాశంలో నక్షత్రమై
స్త్రీ జాతికి ఆదర్శవంతమై
నూతన దంపతులకు
దర్శన మొసంగుచు
వెలుగొందుతున్న మాదిగ
మహా పతివ్రత చరిత్రలివి.
కొమ్ము లూదుతూ
జయ జయ ధ్వనులతో
కీర్తిస్తున్న కొమ్ములవారు
నా ఆస్తాన పూజారి
వశిష్టుడి వేునమామ
నాజాతిగురువు మాదిగ దాసరి
జంధ్యాలతో
ఇంద్రలోకము నుండి
దిగివచ్చిన దేవేంద్రుడిలా
లక్ష్మణుడికి ప్రాణంప్రసాదించిన
సంజీవినిలా
పెళి పేరంటాలకు
మంత్రోచ్ఛరణలతో
ఉద్భవించిన ఓంకారానికి
కారణ భూతుడిలా
కాలాన్ని తాళపత్రగ్రందŠంజేసి
చేతబట్టి
చావు -
రేవుల
క్రతువులోనర్చి
అగ్నిహాోత్రుడు మాదిగదాసరి.
నేను సూర్యరదŠమెక్కి
కోట్లపగ్గాలు చేతబట్టి
తూర్పుతీరం నుండి
విజయ దుంధుభి మోగిస్తున్న
విజయ సారధినేను.
వందకోట్లు పాదాలు కందకుండా
కాలు కింద మోపకుండా
నాచర్మంతో చెప్పులు కుట్టినవాడను
మకుటములేని మహారాజులా
వెలగుతున్నవాడను.
నూరు కోట్ల భారతీయులను
పాలితులుగా జేసుకొని
రారాజు, మహారాజు కాగలవాడను.
బాటా, కరోనా, లోటస్‌, లిబర్టీ
నాతోలు ముక్కలు,
నాతోటకలుపు, మొక్కలు
చెప్పు నాజాతి జండా
డప్పు నా ఎజండా
చర్మం నా తంత్రి
జన సముద్రంలో
బాప్తీస్మం పొందిన వాడిని
మృత్యువుని జయించినవాడిని
కల్పవృక్షం నావంట చెఱకు,
కామధేనువు నాకూరాకు
అమృతం నా మధుపానం
మృత్యుంజయుడనై లేచిన వాడిని
నేను మాదిగోణ్ణి
నాకిక మరణంలేదు
నీలివేుఘాల పతాకం చేతబట్టి
లక్షల డప్పుల సింహా నాదంతో
ఐరావతాన్ని అధిరోహిాంచి
నేను రాజ్యంవైపు నడుస్తా.
-దుగ్గనపల్లి ఎజ్రాశాస్త్రి, ఇం.నెం. 43-3-714, ఓల్డ్ విజేత స్ట్రీట్, ఇందుర్తి నగర్, ఒంగోలు-523 001