“సమకాలీన సామాజిక దార్శనికతకు గీటురాయిగా
-‘దార్ల మాట’ తేటగీతి శతకం”
నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 20.9.2026 సౌజన్యంతో
- శ్రీనివాస్ దాసరి
పరిశోధక విద్యార్థి, తెలుగు విభాగం
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
ఫోన్ : 7702665815
శ్రీలనందింప నెప్పుడు చేర దీయు
విఘ్న రాజును వేడుదు విశ్వసించి
మంచి పద్యము లనిడుదు మనసు నిలిపి
దారి చూపించు నట్టిది దార్ల మాట!” ( పద్యం -1)
శతకం ప్రారంభ పద్యంలోనే కవి విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తూ తన రచనకు విఘ్నాలు తొలగించాలని కోరుతున్నాడు. మంచి పద్యం చదివినపుడు ఆనందంతో పాటు, అది మనిషి ఆలోచనకు దిశను చూపాలి, జీవితానికి వెలుగునివ్వాలి, సమాజాన్ని మంచివైపు నడిపించాలి. ఈ భావననే ‘దార్ల మాట’ తేటగీతి శతకానికి కవి ఆత్మగా నిలిపారు. “దారి చూపించు నట్టిది దార్ల మాట!” అనే మకుటం ద్వారా కవి తన పద్యాలను జీవన మార్గదర్శక సూత్రాలుగా మలిచారు.
తెలుగు సాహిత్య ప్రక్రియల్లో శతకానికి విశిష్టమైన స్థానం ఉంది. సామాన్య పాఠకుడికి సైతం సులభంగా అర్థమయ్యే పద్యరూపంలో వ్యక్తి సంస్కారం నుంచి సామాజిక బాధ్యత వరకు, కుటుంబ విలువల నుంచి మానవీయత వరకు, విద్య నుంచి పర్యావరణ స్పృహ వరకు అనేక అంశాలను వ్యక్తీకరించే సామర్థ్యం శతక ప్రక్రియకు ఉంది.
వేమన, బద్దెన వంటి శతకకవులు తమ కాలంలోని సామాజిక జీవితాన్ని, మానవ ప్రవర్తనను, నైతిక విలువలను పద్యరూపంలో ప్రజలకు అందించారు. అదే సంప్రదాయాన్ని సమకాలీన జీవన సమస్యలతో అనుసంధానిస్తూ సరళమైన తేటగీతి పద్యాల్లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు రచించిన ‘దార్ల మాట’ తేటగీతి శతకం ఆధునిక తెలుగు శతక సాహిత్యంలో గమనించదగిన ఒక మంచి శతకంగా నిలుస్తుంది.
ఈ శతకాన్ని గురించి డా. బండారు విజయ్ కుమార్ గారు తన ముందు మాటలో చేసిన వ్యాఖ్యలో “సాహిత్యం సమాజానికి దర్పణం అంటారు. కానీ, ఆ దర్పణంలో కనిపించే రుగ్మతలకు సరైన చికిత్సను అందించేది ‘శతక సాహిత్యం’” అనే వాక్యం ఈ శతకం స్వభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. కవి సమాజంలోని సమస్యలను వాటి విలువల ఆధారిత పరిష్కార మార్గాలను కూడా సూచించారు. అదే కారణంగా ‘దార్ల మాట’ను సమకాలీన సమాజాన్ని సంస్కరించాలనే తపనతో రూపొందిన శతకంగా చూడవచ్చు.
కవి స్వయంగా తన ప్రస్తావనలో ఈ పద్యాలకు మూలబిందువులుగా “నా జీవిత ప్రయాణంలో నేను చూసిన మనుషులు, నేను పొందిన వివిధ అనుభవాలు, నా అక్షరానికి ఊపిరి పోసిన నా తల్లిదండ్రులు శ్రీమతి పెదనాగమ్మ, శ్రీలంకయ్య గార్ల జ్ఞాపకాలు” ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఈ శతకంలోని భావాలు కేవలం ఊహాజనితమైనవి కాకుండా కవి జీవితానుభవాలు, సామాజిక పరిశీలన, కుటుంబ విలువలు, సమకాలీన పరిణామాల నుంచి పుట్టినవిగా తెలుస్తాయి.
‘దార్ల మాట’ శతకం – ఆవిర్భావ నేపథ్యం
‘దార్ల మాట’ శతక రచనకు ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. కవి ప్రస్తావనలో చెప్పినట్లు, 2021 జూన్లో ‘దారి పూల తోట దార్ల మాట’ పేరుతో ఆటవెలది ఛందస్సులో ఒక శతకాన్ని రచించారు.
‘కంది శంకరయ్య’ గారు పరిచయం చేసిన పద్యరచనా వాతావరణం ద్వారా పద్యరచనపై ఆసక్తి పెరిగి, అనేక పద్యాలను రచించే అలవాటు ఏర్పడింది. ఆ అనుభవం క్రమంగా విస్తరించి తేటగీతి ఛందస్సులో ‘దార్ల మాట’ శతక రూపాన్ని సంతరించుకుంది.
ఈ నేపథ్యంలో ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి గారు తన ముందుమాటలో చేసిన వ్యాఖ్య విశేషమైనది. ఆయన “జీవన విలువలను, నైతిక సందేశాలను, సామాజిక బాధ్యతలను సరళమైన పద్యరూపంలో ప్రజల హృదయాల్లో నాటే శక్తి శతకాలకు ఉంది” అని పేర్కొంటూ, ‘దార్ల మాట’ను “తేటగీతి ఛందస్సులో ఆధునిక భావజాలాన్ని సమన్వయ పరుచుకున్న సార్థక కృతి” గా అభివర్ణించారు.
ఈ శతకంలో సంప్రదాయ శతక లక్షణాలు ఉన్నప్పటికీ, దాని వస్తువు మాత్రం ఆధునిక సమాజం. కుటుంబ వ్యవస్థలో మార్పులు, మానవ సంబంధాల్లో తగ్గుతున్న ఆత్మీయత, పర్యావరణ సమస్యలు, సాంకేతికత దుష్ప్రభావాలు, మద్యపానం, రహదారి భద్రత, సమయపాలన, విద్య, మాతృభాష, కులమత భేదాలు, శాంతి, మానవత్వం వంటి అనేక అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి.
మకుటం – శతకానికి మార్గదర్శక తాత్వికత
శతకానికి మకుటం అత్యంత ప్రధానమైన అంశం. ‘దార్ల మాట’ శతకానికి “దారి చూపించు నట్టిది దార్ల మాట!” అనే మకుటాన్ని కవి ఎంచుకున్నారు. ఈ మకుటం ప్రతి పద్యంలోని భావాన్ని ఒక నిర్దిష్ట నైతిక దిశలోకి తీసుకువెళ్తుంది.
డా.బండారు విజయ్ కుమార్ గారు దీనిని విశ్లేషిస్తూ..“శతకానికి ప్రాణం ‘మకుటం’. పద్యం ఏ విషయాన్ని చెప్పినా, అంతిమంగా మకుటం ఆ పద్యం యొక్క తాత్వికతను నిర్దేశిస్తుంది.” అని పేర్కొన్నారు. అదే సందర్భంలో “గందరగోళంలో ఉన్న నేటి సమాజానికి ఒక ‘మార్గదర్శనం’ గా ‘దార్ల మాట’ మకుటాన్ని ఆయన అభివర్ణించిన విషయం వాస్తవం.ఈ మకుటం వల్ల ప్రతి పద్యం ఒక సూచనగా, ఒక హెచ్చరికగా, ఒక నైతిక సందేశంగా మారుతుంది. కుటుంబం గురించి చెప్పినా, పర్యావరణం గురించి చెప్పినా, విద్య గురించి చెప్పినా, మానవత్వం గురించి చెప్పినా చివరికి “దారి చూపించు నట్టిది దార్ల మాట!” అనే పునరుక్తి ఆ భావాన్ని పాఠకుడి మనసులో బలంగా నిలుపుతుంది.
తేటగీతి ఛందస్సు – భావప్రకటనకు అనుకూలమైన రూపం
‘దార్ల మాట’ శతకానికి కవి తేటగీతి ఛందస్సును ఎంచుకున్నారు. దీనికి సామాజిక ప్రయోజనం కూడా ఉందని డా. బండారు విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆయన మాటల్లో...‘తేట’ అంటే స్వచ్ఛమైనది, స్పష్టమైనది అని అర్థం. ‘గీతి’ అంటే గానం చేయదగినది.” అలాగే, “సంక్లిష్టమైన సమాసాలు లేకుండా, పండితులకే కాకుండా పామరులకు, విద్యార్థులకు కూడా సూటిగా అర్థమయ్యే రీతిలో, ఒక పారుతున్న ఏరులాగా భావం సాగిపోవడానికి తేటగీతి అత్యంత అనుకూలమైన ఛందస్సు.” అని వివరించారు.ఈ లక్షణం ‘దార్ల మాట’ పద్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కవి సంక్లిష్టమైన తాత్విక భావాలను కూడా సూటిగా, సామాన్యుడికి అర్థమయ్యే భాషలో వ్యక్తీకరిస్తారు. అందువల్ల ఛందస్సు కేవలం పద్య నిర్మాణానికి సంబంధించిన అంశంగా కాకుండా, కవి సామాజిక ప్రయోజన దృష్టిలో భాగంగా మారింది.
‘దార్ల మాట’ శతకంలోని మరొక ముఖ్య లక్షణం భాష. పాండిత్య ప్రదర్శన కంటే భావవ్యక్తీకరణకు కవి ప్రాధాన్యం ఇచ్చారు. సామాన్య పాఠకుడికి అర్థమయ్యే పదజాలంతో నీతి, ధర్మం, సామాజిక సమస్యలను వ్యక్తీకరించారు.“క్లిష్టమైన వృత్త పద్యాల జోలికి వెళ్లకుండా, సామాన్యుడి గుండెకు హత్తుకునేలా చెప్పడానికి ఈ తేటగీతిని ఎంచుకోవడం ఆయనలోని సామాజిక స్పృహకు నిదర్శనం.” ఈ సరళత వల్ల శతకంలోని సందేశం పాఠకుడికి నేరుగా చేరుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, సామాన్య పాఠకులు, సామాజిక విలువలపై ఆలోచించేవారికి ఈ పద్యాలు సులభంగా చేరువయ్యే అవకాశం ఉంది.
“కన్న తల్లిని తండ్రిని గౌర వించి
భక్తి తోడను సేవలు సలుపు వాడు
ముక్తి మార్గము నందున మునిగి యుండు
దారి చూపించు నట్టిది దార్ల మాట!” (దార్లమాట శతకం. పద్యం - 3 )
ఈ పద్యంలో తల్లిదండ్రులను గౌరవించి, భక్తితో సేవ చేయడం మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన ధర్మమని కవి చెబుతున్నాడు. తల్లిదండ్రుల సేవను “ముక్తి మార్గం”తో సమానంగా చూపడం ద్వారా వారి పట్ల ఉండాల్సిన కృతజ్ఞతను బలంగా వ్యక్తీకరించాడు. కుటుంబ విలువలను కాపాడుకోవడం, తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండడం అనే సందేశం ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. వ్యక్తి నైతిక జీవితానికి కుటుంబం మొదటి పాఠశాల అనే భావన ఈ పద్యంలో అంతర్లీనంగా ఉంది.
“పెద్ద నాగమ్మ మాతృత్వ ప్రేమ పంచి
ఆదరమ్మను దీవెన లందజేసి
నమ్మకమ్మను నీడలో నడుపు చుండు
దారి చూపించు నట్టిది దార్ల మాట!” (పద్యం: 4)
ఇక్కడ కవి “పెద్ద నాగమ్మ” ద్వారా మాతృత్వంలోని ప్రేమ, ఆదరణ, దీవెన, నమ్మకం వంటి లక్షణాలను ప్రతిబింబించాడు. తల్లి పిల్లలకు కేవలం ప్రేమనే కాకుండా భద్రత, ధైర్యం, నమ్మకం కూడా అందిస్తుందని చెబుతున్నాడు. “నీడలో నడుపు” అనే భావన తల్లి ఇచ్చే రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. మాతృత్వాన్ని జీవితానికి దారి చూపించే శక్తిగా కవి అభివర్ణించడం ఈ పద్యంలోని ప్రధాన విశేషం.
“శంకరయ్యను సద్భక్తి స్మరణ జేతు
ఛంద మర్మము లెరిగించి చక్కదిద్ది
పద్య విద్యను నేర్పించె పట్టు బట్టి
దారి చూపించు నట్టిది దార్ల మాట!” (పద్యం: 6)
ఈ పద్యంలో కవి తనకు పద్య రచన, ఛందస్సు నేర్పిన శంకరయ్య గురువును స్మరిస్తున్నాడు. “ఛంద మర్మము లెరిగించి” అనే మాట ద్వారా కవిత్వంలోని సాంకేతికతను గురువు నేర్పిన విషయాన్ని తెలియజేస్తున్నాడు. గురువు శిష్యునిలోని ప్రతిభను గుర్తించి, దానిని మెరుగుపరచి సరైన దిశలో నడిపిస్తాడనే భావన కనిపిస్తుంది. కవి తన సాహిత్య వ్యక్తిత్వ నిర్మాణంలో గురువు పాత్రను కృతజ్ఞతతో గుర్తుచేసిన పద్యంగా దీన్ని చూడవచ్చు.
“జ్ఞాన దీపము వెలిగించి మాన సమున
అజ్ఞ మనుజుని విజ్ఞుగా నవని జేయు
గురుని కన్నను దైవము వేరె లేదు
దారి చూపించు నట్టిది దార్ల మాట!” (పద్యం: 7 )
“జ్ఞాన దీపము” అనే రూపకం ద్వారా గురువు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తిగా కవి చిత్రించాడు. అజ్ఞానిగా ఉన్న మనిషిని విజ్ఞానవంతునిగా తీర్చిదిద్దే శక్తి గురువుకు ఉందని చెబుతున్నాడు. అందుకే “గురుని కన్నను దైవము వేరె లేదు” అని గురువును అత్యున్నత స్థానంలో నిలిపాడు. ఈ పద్యం విద్య, జ్ఞానం, గురుభక్తి అనే మూడు విలువలను సమన్వయపరుస్తుంది.
“పాత పద్యాలు చదువగా పరవశమున
అనుభవజ్ఞుల సూచన లందు కొనిన
ధర్మ మార్గాన జీవికల్ ధన్య మగును
దారి చూపించు నట్టిది దార్ల మాట!” పద్యం:117
పూర్వకాల పద్యాలను చదవడం ద్వారా అనుభవజ్ఞుల ఆలోచనలు, జీవన సూత్రాలు తెలుసుకోవచ్చని కవి చెబుతున్నాడు. పాత సాహిత్యాన్ని కేవలం గతానికి సంబంధించినదిగా కాకుండా ప్రస్తుత జీవితానికి మార్గదర్శకంగా చూడటం ఈ పద్యంలో కనిపిస్తుంది. ధర్మమార్గంలో జీవించినప్పుడే జీవితం సార్థకమవుతుందని కవి భావిస్తున్నాడు. సంప్రదాయ సాహిత్యంలోని మంచిని స్వీకరించి, ఆధునిక జీవితంలో ఆచరించాలనే సందేశం ఇందులో ఉంది.
“కత్తి పట్టక శాంతికై కలయ జూచి
మౌన వ్రతమున సాధించి మాన వాళి
కంద జేసెను బుద్ధుడు నంద ముగను
దారి చూపించు నట్టిది దార్ల మాట!” (పద్యం 122)
బుద్ధుని శాంతి మార్గాన్ని కవి ఆధునిక ప్రపంచానికి సూచిస్తున్నారు. హింసకు బదులుగా శాంతి, ఆత్మనిగ్రహం, మానవత్వం అవసరమని భావిస్తున్నారు.
ఈ అంశాన్ని ప్రముఖ పద్యకవి, తెలుగు అధ్యాపకులు గోవిందు. గోవర్ధన్ గారు తన సహృదయ స్పందనలో పేర్కొన్న “సామ్రాజ్య విస్తరణ పేరుతో యుద్ధాలు చేయడం దుర్మార్గం”, “ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో విలసిల్లడానికి పరిపాలకులు తగిన చర్యలు, ప్రణాళికలు ఏర్పరచుకుని ముందుకు సాగాలి” అనే వ్యాఖ్యలతో అనుసంధానించవచ్చు.
“శీల మున్నట్టి కవికృతుల్ చిత్త మందు
నిలిపి పఠియించి విలువలన్ నేర్చు కొనుచు
వ్యాప్తి చేయాలి భువిపై వంద నముగ
దారి చూపించు నట్టిది దార్ల మాట!” (118)
శీలవంతులైన కవులు రచించిన మంచి కవితలను చదివి, అందులోని విలువలను నేర్చుకోవాలని కవి సూచిస్తున్నాడు. సాహిత్య పఠనం వ్యక్తి ఆలోచనలను, ప్రవర్తనను ప్రభావితం చేయగలదనే విశ్వాసం ఇందులో కనిపిస్తుంది. నేర్చుకున్న మంచి విలువలను తనకే పరిమితం చేయకుండా సమాజంలోకి వ్యాప్తి చేయాలని చెప్పడం ద్వారా సాహిత్యానికి సామాజిక బాధ్యత ఉందని కవి సూచిస్తున్నాడు.
“వంశ గౌరవ మన్నది వాక్కు తోడ
సత్య మెప్పుడు వీడక సాగ వలెను
మాట తప్పని వానికి మన్ననబ్బు
దారి చూపించు నట్టిది దార్ల మాట!” (పద్యం 11)
మాట నిలబెట్టుకోవడం ద్వారా వ్యక్తిగత గౌరవమే కాకుండా కుటుంబ గౌరవం కూడా నిలుస్తుందని కవి చెబుతున్నారు. ఈ పద్యాన్ని ‘డి. సాయినాథ్ రెడ్డి’ గారు రామాయణంలోని శ్రీరాముని ఏకవాక్యతతో అనుసంధానించారు. ఆయన వ్యాఖ్యలో...''ఇది రామాయణంలోని శ్రీరాముని ‘ఏక వాక్య’ పరిపాలనకు నిదర్శనం.” అని పేర్కొన్నారు. అంటే పౌరాణిక విలువను ఆధునిక జీవన నైతికతకు అనుసంధానించడం ఈ శతకంలోని ఒక ముఖ్యమైన పద్ధతి.
“భరత భూమిని నమ్ముచు భావ మెంచి
కలిసి మెలిసియు నుండుట ఘనత నిచ్చు
జాతి గౌరవ మెప్పుడు చాట వలెను
దారి చూపించు నట్టిది దార్ల మాట!” (216)
ఇది శతకానికి అంకిత పద్యంగా ఇచ్చిన ముగింపు భావన. భారతదేశంపై విశ్వాసం, ప్రజల మధ్య ఐక్యత, జాతి గౌరవం అనే అంశాలను కవి ప్రతిపాదించాడు. “కలిసి మెలిసియు నుండుట” అనే భావం మొత్తం శతకంలో కనిపించే మానవతా, సామాజిక ఐక్యతా దృక్పథానికి ముగింపుగా నిలుస్తుంది.
‘దార్ల మాట’ శతకంలోని ముఖ్యమైన ప్రత్యేకత సంప్రదాయ విలువలను ఆధునిక సమస్యలతో కలపడం. ఒకవైపు తల్లిదండ్రుల సేవ, గురుభక్తి, దైవభక్తి, కుటుంబ బంధాలు, సత్యం, ధర్మం వంటి సంప్రదాయ విలువలను కవి సమర్థిస్తారు. మరోవైపు కులమత భేదాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, మద్యపాన వ్యతిరేకత, హెల్మెట్ వినియోగం, ఫోన్ దుష్ప్రభావం, సమయపాలన వంటి ఆధునిక సమస్యలను ప్రస్తావిస్తారు.
ఈ వైవిధ్యాన్ని ఒక ముందుమాటలో “ఒకవైపు అస్తిత్వ ఉద్యమానికి చేయూతనిస్తూ దళిత కవిత్వం రాస్తున్న ఈయన మరోవైపు సంప్రదాయ విలువలని కాపాడుకొంటూ రావడం అనేది ఈయనలో ఉన్న వైవిధ్యం” అని విశ్లేషించారు.అందువల్ల దార్ల మాటలో సంప్రదాయం అనేది మూఢానుసరణగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే విలువలను స్వీకరించడంగా కనిపిస్తుంది. ఆధునికత కూడా పాతదాన్ని పూర్తిగా తిరస్కరించడం కాకుండా, మానవీయ విలువలను సమకాలీన అవసరాలకు అన్వయించుకోవడంగా వ్యక్తమవుతుంది.గోవిందు గోవర్ధన్ గారు తన సహృదయ స్పందనలో ఈ శతకంలోని సామాజిక ప్రయోజనాన్ని కూడా స్పష్టంగా వివరించారు. ఆయన ప్రకారం, ఇందులో “ఆధునిక సమాజంలో కొనసాగుతున్న కొంతమంది జీవన విధానంలో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపారు”. యువత ప్రవర్తన, సోమరితనం, క్రమశిక్షణారాహిత్యం, తల్లిదండ్రులు–గురువు–దైవం పట్ల నిర్లక్ష్యం, ధనార్జనలో నీతి నియమాలను విస్మరించడం వంటి అనేక సమస్యలను కవి పద్యాల్లో పొందుపరిచారు.
అంతేకాకుండా ఆయన “ఈ శతకాన్ని సాహితీప్రియులు చదివి తప్పకుండా తమలో ఉన్న మంచిచెడులు బేరీజు వేసుకుని తప్పకుండా మార్పు కోరుకుంటారని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.
ఇది ‘దార్ల మాట’ యొక్క అసలు లక్ష్యాన్ని సూచించే ముఖ్యమైన వ్యాఖ్య. కవి పాఠకుడికి బోధించడమే లక్ష్యంగా పెట్టుకోలేదు; తనలోని మంచిచెడులను పాఠకుడు తానే పరిశీలించుకోవాలని కోరుకున్నారు.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి ‘దార్ల మాట’ తేటగీతి శతకంను సమగ్రంగా పరిశీలించినప్పుడు ఇది కేవలం శతక ప్రక్రియలో మరో కృతి మాత్రమే కాదని స్పష్టమవుతుంది. ఇది సంప్రదాయ నైతిక విలువలను సమకాలీన సామాజిక సమస్యలతో అనుసంధానించిన ఆధునిక నీతి శతకంగా రూపుదిద్దుకుంది.
తల్లిదండ్రుల సేవ నుంచి కులమత భేదాల నిర్మూలన వరకు, గురువు–విద్య నుంచి మాతృభాష వరకు, కుటుంబ అనుబంధాల నుంచి మానవత్వం వరకు, చెట్ల సంరక్షణ నుంచి జీవవైవిధ్యం వరకు, అత్యాశ నిరాకరణ నుంచి కష్టపడి పనిచేయడం వరకు, సమయపాలన నుంచి రహదారి భద్రత వరకు, సెల్ఫోన్ దుష్ప్రభావం నుంచి పొరుగు సంబంధాల వరకు విస్తరించిన జీవన అంశాలను కవి పద్యాల్లో ప్రతిబింబించారు.
ఈ శతకానికి సంబంధించిన ఒక ముందుమాటలో చెప్పినట్లుగా “జీవన విలువలను, నైతిక సందేశాలను, సామాజిక బాధ్యతలను సరళమైన పద్యరూపంలో ప్రజల హృదయాల్లో నాటే శక్తి శతకాలకు ఉంది.” ‘దార్ల మాట’ ఈ లక్షణాన్ని సమకాలీన సందర్భంలో సార్థకం చేస్తుంది. అదేవిధంగా సాహిత్య విమర్శకులు డా. బండారు విజయ్ కుమార్ గారు చేసిన “మానవత్వ పరిమళాలను వెదజల్లుతున్న అక్షర కుసుమమే ఈ ‘దార్ల మాట’” అనే వ్యాఖ్య ఈ శతక స్వభావాన్ని సంక్షిప్తంగా ప్రతిబింబిస్తుంది.
‘ దార్ల మాట’లోని “దారి చూపించు నట్టిది దార్ల మాట!” అనే మకుటం ప్రతి పద్యానికీ ముగింపు మాత్రమే కాదు; మొత్తం శతకానికి ఒక నైతిక దిక్సూచి. కులం, మతం, స్వార్థం, అత్యాశ, అజ్ఞానం, సోమరితనం, పర్యావరణ నిర్లక్ష్యం, సాంకేతికత దుర్వినియోగం వంటి సమకాలీన సమస్యల మధ్య మనిషి ఏ విలువలతో జీవించాలో ఈ మకుటం నిరంతరం గుర్తుచేస్తుంది. అందువల్ల ‘దార్ల మాట’ను డి సాయినాథ్ రెడ్డి గారు “ఆధునిక మానవుడిని సంస్కరించే ఒక మానవీయ మ్యానిఫెస్టో” గా పేర్కొన్న ముందుమాటలోని వ్యాఖ్య ఎంతో ఔచిత్యవంతమైనది. కుటుంబం నుంచి సమాజం వరకు, వ్యక్తి నుంచి మానవాళి వరకు, సంప్రదాయం నుంచి ఆధునికత వరకు విస్తరించిన విలువల సమన్వయం ఈ శతకానికి ప్రత్యేకతను కల్పించింది.
ముఖ్యంగా “కులము మతభేద ములనెల్ల కూల్చివేసి / మనిషి మనిషిగా బ్రతికిన మనుగడౌను / సమత మమతలు పంచెడి సత్యమిదియె” అనే 123వ పద్యం నుంచి “వింట విడిచిన బాణము వెడలు నట్లు / నోట వచ్చిన మాటయు నొచ్చు” అనే 209వ పద్యం వరకు విస్తరించే విలువల దృక్పథం, వ్యక్తిగత సంస్కారం నుంచి సామాజిక సంస్కరణ వరకు కవి ఆలోచనను తీసుకెళ్తుంది.కాబట్టి తెలుగు శతక సాహిత్య పరిణామంలో ‘దార్ల మాట’ తేటగీతి శతకం సమకాలీన జీవన సమస్యలను నీతి, మానవత్వం, సామాజిక బాధ్యత, పర్యావరణ స్పృహ, కుటుంబ విలువలు, విద్య, సమానత్వం వంటి అంశాలతో అనుసంధానించిన ఆధునిక శతకంగా గుర్తించదగినది. దాని ప్రతి పద్యం ఒక చిన్న జీవనసూత్రంగా, ప్రతి మకుటం ఒక నైతిక సూచనగా, మొత్తం శతకం ఒక సమగ్ర మానవీయ జీవన దృక్పథంగా పాఠకుడి ముందుకు వస్తుంది.ధర్మం వైపు నడిచే ప్రతి అడుగుకూ, మానవత్వాన్ని నిలబెట్టే ప్రతి ఆలోచనకూ, సమాజాన్ని మంచివైపు నడిపించే ప్రతి ప్రయత్నానికీ... “దారి చూపించు నట్టిది దార్ల మాట!”
ఈ శతకాన్ని చదువుతున్నప్పుడు ఒక పరిశోధక విద్యార్థిగా, యువకుడిగా నాలాంటి విద్యార్థులు నేర్చుకోవలసిన అనేక విద్యాబోధనలు, సమాజం పట్ల నైతిక విలువలు, జీవితం పట్ల బాధ్యతలు పద్యరూపంలో కనిపిస్తాయి. పూర్వకాలపు శతక సాహిత్య కవులైన ఏనుగు లక్ష్మణకవి, ప్రజాకవి వేమన వంటి కవుల నీతి శతకాలలో కనిపించే జీవనబోధ, సామాజిక చైతన్యం ఈ శతకంలోనూ ఆధునిక కాలానుగుణంగా దర్శనమిస్తుంది. ఈ అత్యాధునిక కాలానికి ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు గారిని ఒక ‘సుభాషిత కవి’గా చెప్పాలి. ఎందుకంటే తెలుగు ఛందస్సును ఈ కాలపు సామాన్య పాఠకులకు అందించి, నాలాంటి విద్యార్థులకు కూడా పద్యవిద్యను అలవాటు చేస్తున్న ఆచార్య దార్ల వారి సాహిత్యాన్ని తెలుగు సాహిత్య విద్యార్థులు, పాఠకులు ఆదర్శప్రాయంగా తీసుకొని, అందులోని విలువలను నిత్యజీవితంలో అలవరచుకోవాలి.
పండితుల పద్యసాహిత్యం సాధారణ ప్రజల జీవనానుభవాలకు దూరంగా ఉంటుందనే అభిప్రాయానికి భిన్నంగా, ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు గారి శతకాల్లో ప్రజల భాష, పేద సామాన్య ప్రజల జీవితం, వారి అనుభవాలు ప్రతిఫలిస్తాయి. ప్రాచీన, ఆధునిక పద్య సాహిత్యాల మధ్య వారధిగా నిలుస్తూ, ఛందస్సును సామాన్య పాఠకులకు చేరువ చేస్తున్న వారి కృషి అభినందనీయం. తెలుగు సాహిత్య విద్యార్థులు, పాఠకులు వారి సాహిత్యాన్ని చదివి, అందులోని జీవన విలువలను అవగాహన చేసుకొని నిత్యజీవితంలో ఆచరించాలి. అప్పుడే ప్రాచీన పద్య సంప్రదాయానికి, ఆధునిక పద్య సాహిత్యానికి సరైన స్థానం దక్కుతుంది. ఈ భావానికి నా గురుభావాన్ని జోడిస్తూ నేను రాసిన కంద పద్యం.
కం . గురువై కల్పక తరువై
ధరువై వరమై నగమయి దార్లా నెరవై!
సిరులై సద్గుణ నిధివై
నరుడై వచ్చిన హరివయి నాకై గురువా!
ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు గారి సాహిత్య కృషి
కి శుభాభివందనాలు.
దాసరి శ్రీనివాస్, నినాదం దినపత్రిక, సాహిత్య అనుబంధం 20.9.2026 సౌజన్యంతో
