భక్తి–చరిత్రల సంగమం:
ఓ మరపురాని జ్ఞాపకాల పయనం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గెస్ట్ హౌస్ లో తీసుకున్న ఒక ఫోటో.
ముడుచుకున్న రెక్కల్ని విప్పిన
సీతాకోకచిలుకల్లా
మనసు దారుల్ని వెతుకుతున్నట్లు,
గూటి నుంచి జారిన
పిట్టల గుంపులా
సంతోషం ముందే గంతులేస్తున్నట్లు,
వెలుతురును తాకిన
మొగ్గలా
మా ప్రతి ముఖం విచ్చుకుంటుంటే
గమ్యం ఇంకా దూరంలోనే ఉన్నా
ప్రయాణం మాత్రం
మా కళ్లలో అప్పుడే మొదలయ్యింది.
కాలం చక్రంలా తిరుగుతుంటే, ఏటా మా అనుబంధాన్ని నెమరువేసుకునే పవిత్ర వివాహ వార్షికోత్సవం రానే వచ్చింది. ఈసారి మా పయనం ప్రాచీన భారతదేశ దివ్యత్వాన్ని, తెలుగు నేల శౌర్యప్రతాపాల చరిత్రను ఒకే వేదికపై ఆవిష్కరించిన అద్భుతమైన భావ సంగమంలా అనిపించింది. నా సతీమణి మంజుశ్రీ, సుపుత్రుడు శ్రీనివాసరావు, ఆత్మీయ శిష్యుడు సాయినాథ్ రెడ్డిలతో కలిసి, నమ్మకమైన డ్రైవర్ కిరణ్ బొలేరో వాహనంలో సాగిన ఈ రెండు రోజుల (ఆగస్టు 18, 19 వ తేదీలలో ) యాత్ర మా హృదయాలలో కలకాలం పదిలంగా నిలిచిపోయే ఒక సువర్ణాక్షర ఘట్టం.
నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 23.8.2026 సౌజన్యంతో
ఈ యాత్రలోని విశేషాలు ఒక నదీ ప్రవాహంలా, భక్తి ప్రపత్తుల నుంచి వీరత్వపు ఆనవాళ్ల వరకు సాగాయి. కృష్ణమ్మ ఒడ్డున వెలసిన విజయవాడ శ్రీ కనకదుర్గ మల్లేశ్వరుల ఆశీస్సులతో మొదలై, పంచారామ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరుడు, మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దివ్య మంగళ స్వరూపాల దర్శనంతో మనసంతా అపరిమితమైన ఆధ్యాత్మిక ప్రశాంతతతో నిండిపోయింది.
ఉండవల్లి గుహలలో పద్మనాభస్వామి ఏకశిలా విగ్రహ శిల్ప సౌందర్యం మమ్మల్ని మంత్రముగ్ధులను చేయగా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మిత్రుల ఆత్మీయ ఆతిథ్యం, నాగార్జునసాగర్ కృష్ణమ్మ ఒడ్డున ప్రశాంతమైన రాత్రి బస యాత్రకు ఎనలేని విశ్రాంతిని అందించాయి. కారంపూడి రణభూమిలో 66 మంది అమర వీరుల గుడి, వారు ఉపయోగించిన ప్రాచీన ఆయుధాలు, రక్తసిక్తమైన చరిత్ర కలిగిన నాగులేరు వాగును కళ్లారా చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచే అనుభూతి కలిగింది. బొలెరో కార్ లో మధుర గీతాల స్వరాల నడుమ, ప్రకృతి అందాలు, ప్రాచీన వైభవం, భక్తి పారవశ్యాల మేళవింపుగా సాగిన ఈ రెండు రోజుల యాత్ర మా వార్షికోత్సవానికి ఒక అమూల్యమైన, చిరస్మరణీయమైన కానుకగా మిగిలిపోయింది. ఈ వారం ఆ విశేషాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
తెల్లవారుజామున ఐదు గంటల వేళ… మంచు తెరలను చీల్చుకుంటూ మంగళకరమైన ప్రభాత సమయంలో మా ప్రయాణం మొదలైంది. ప్రతియేటా మా అనుబంధాన్ని గుర్తుచేసుకునే వివాహ వార్షికోత్సవ పర్వదినం ఇది. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే నమ్మకమైన డ్రైవర్ కిరణ్ తన బొలేరో కారుతో సిద్ధంగా ఉన్నాడు. నా సహధర్మచారిణి మంజుశ్రీ, మా సుపుత్రుడు శ్రీనివాసరావు, మా యాత్రలో భాగమైన ప్రియ విద్యార్థి సాయినాథ్ రెడ్డిలతో కలిసి చారిత్రక పరిమళాలు, దైవిక సాన్నిధ్యం కలగలిసిన పుణ్యక్షేత్రాల వైపు మా ప్రయాణం ఉత్సాహంగా సాగింది. మధ్యాహ్న సమయానికి మా ప్రయాణం ఇంద్రకీలాద్రి పాదపద్మాలను చేరింది. కృష్ణవేణి తరంగాల నాదాల మధ్య, శోభాయమానంగా విరాజిల్లుతున్న విజయవాడ శ్రీ కనకదుర్గ మల్లేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాం. భక్తుల జయజయధ్వానాల మధ్య అమ్మవారి దివ్య మంగళ రూపం కళ్లారా గాంచగానే ప్రయాణ బడలికంతా పటాపంచలైంది. జగన్మాత కరుణాకటాక్షాలు పొందాం. అక్కడే అమ్మవారి భోజనప్రసాదాలు పూర్తి చేశాం.
కృష్ణమ్మ ఒడిలో ఇంద్రకీలాద్రి
ఆ కొండంతా
కనకదుర్గమ్మ కాంతేనేమో!
అమ్మవారి గర్భాలయంలో
ఒక్క క్షణం నిలిచి చూస్తే
కుంకుమలో
ఒక సూర్యోదయమే కనిపిస్తుందేమో!
ఆమె చిరునవ్వులో
చైతన్యపు వెలుగులు,
అలంకారంలో
అమ్మతనపు ఆత్మీయతలు,
దర్శనం ముగిసినా
ఆ దివ్యరూపమే
కళ్లలోనే కాదు,
మనసంతా
మంగళకాంతిగా నిలిచిపోతుంది కదా!
ఒకసారి మా గురువుగారు ఆచార్య పరిమి రామ నరసింహం, వారి దంపతులతో కలిసి తిరుమల వెళ్ళాం. మనం ఏ హోదాలో ఉన్నా, దైవ దర్శనం, ప్రసాదాల స్వీకరణలో సామాన్యులు గానే ఉండాలని అంటూ ఆయన ఎంతో భక్తితో లైన్లో నిలబడిన తీరు నాకు గుర్తొచ్చింది.
ఉండవల్లి గుహలు దగ్గర
అక్కడ నుండి కృష్ణానది దాటి ఉండవల్లి గుహల వైపు అడుగులు వేశాం. శిల్ప కళా రీతులకు అద్దం పట్టే ఉండవల్లి గుహలు మన పూర్వీకుల అద్భుత సృజనాత్మకతకు సజీవ సాక్ష్యాలు. ఇక్కడి త్రికూట ఆలయాల శిల్ప సౌందర్యం మమ్మల్ని మంత్రముగ్ధులను చేసింది. విశాలమైన గుహంతర్భాగంలో, శ్రీఅనంత పద్మనాభ స్వామివారు సుఖాసీనుడై ఉన్న భారీ ఏకశిలా విగ్రహం ఈ గుహలకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ గుహలలోని ప్రధాన ఆకర్షణ రెండవ అంతస్తులో ఉన్న 17 అడుగుల (5 మీటర్ల) పొడవైన అనంత పద్మనాభ స్వామి (విష్ణుమూర్తి) విగ్రహం. ఆదిశేషునిపై శయనిస్తున్న ఈ ఏకశిలా విగ్రహాన్ని ఒకే గ్రానైట్ రాతితో అద్భుతంగా మలిచారు. ఆ స్వామివారి భంగిమలోని ప్రశాంతత, శిల్పి నైపుణ్యం చూసి మనసారా అభినందించకుండా ఉండలేకపోయాం.
కృష్ణమ్మ ఒడ్డున
రాతిలో చెక్కిన ఉండవల్లి గుహలు
కాలమే చెక్కిన
ఒక శిల్పకావ్యమే!
ఆ గుహల నిశ్శబ్దంలో
అనంతశయనుడైన
పద్మనాభ స్వామిని చూస్తే
శిలలోనే
శాశ్వతత్వం మేల్కొన్నట్టే ఉంటుంది.
ఆ విశాలమైన రూపం
కళ్లలో నిండగానే
కాలం కాసేపు ఆగి
మనసులో
ఒక ప్రశాంత కాంతిగా
నిలిచిపోవాల్సిందే!
చరిత్ర పేజీలను తడిమి చూసినంత అనుభూతిని ఈ గుహలు మాకు ప్రసాదించాయి. ఒకప్పుడు అజంతా, ఎల్లోరా గుహల వంటి నిర్మాణాలు చూసిన అనుభూతిని మళ్లీ పొందాం. ఈ గుహలు భారతీయ ఏకశిలా గుహాలయ వాస్తుశిల్పానికి అద్భుత నిదర్శనం. ఈ చారిత్రక గుహలలో ఉన్న త్రికూట ఆలయం చారిత్రక, ఆధ్యాత్మిక, మరియు నిర్మాణ పరంగా ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ గుహాలయంలోని ఒక అంతస్తులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు (త్రిమూర్తులకు) అంకితం చేయబడిన మూడు గర్భగుడులు పక్కపక్కనే ఉంటాయి. ఈ మూడు గర్భగుడులు కలిసి ఉన్నందువల్లనే దీనిని 'త్రికూట ఆలయం' అని పిలుస్తారు.
మూడు శిఖరాల మధ్య
ఒకే ఆకాశం
బ్రహ్మ సృష్టిగా ఒకటి,
విష్ణు స్థితిగా ఒకటి,
మహేశ్వర లయగా ఒకటి!
రాతిలో నిలిచిన ఆ దేవాలయాలు
కాలాన్ని మోస్తూ
జీవిత రహస్యాన్ని చెబుతున్నట్టుగా
పుట్టుక, ఉనికి, పరిణామం
ఒకే చక్రంలో తిరుగుతూనే ఉంటాయి.
త్రికూటం చూస్తే
మూడు రూపాలు కనిపించినా
ఆధ్యాత్మిక భావనలో
ఒకే శాశ్వత తత్త్వం
విశ్వమంతా విస్తరించినట్టే ఉంటుంది!
ఈ నాలుగు అంతస్తుల గుహాలయాన్ని 4 లేదా 5వ శతాబ్దంలో ఒకే ఒక ఇసుకరాయి (sandstone) కొండను తొలిచి అత్యంత నైపుణ్యంతో నిర్మించారు. అక్కడున్న వివరాలు ప్రకారం 6, 7 శతాబ్దాల్లో ఆ గుహలు నిర్మించినట్లు రాశారు. ఈ గుహలు ఒకే మతానికి పరిమితం కాలేదు. తొలినాళ్లలో బౌద్ధ భిక్షువుల విహారాలుగాను, తర్వాత జైన మునుల ఆవాసాలుగాను ఉండి, తదనంతర కాలంలో (విష్ణుకుండినుల ఏలుబడిలో) హిందూ ఆలయాలుగా రూపాంతరం చెందాయని చరిత్రకారులు భావిస్తారు.ఆ గుహలు చూసి కిందకు వచ్చేసరికి బాగా అలసట అనిపించింది. కింద సుగంధి కటోరి అని ఒక రకమైన సోడా అమ్ముతున్నారు. శివ పార్వతి గారు దాన్ని బాగా చేసి ఇచ్చారు. ఎంతో తృప్తిగా వాటిని తాగి బయలుదేరాం.
ఆ తర్వాత మా వాహనం అమరావతి వైపు సాగింది. పవిత్ర కృష్ణానదీ తీరాన వెలసిన శ్రీఅమరేశ్వర దేవాలయాన్ని సందర్శించాం. పంచారామాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో అడుగుపెట్టగానే ఒక విచిత్రమైన ఆధ్యాత్మిక ప్రశాంతత ఆవరించింది. ఆకాశాన్ని తాకేలా ఉన్న అమరేశ్వరుని సుదీర్ఘ లింగరూపాన్ని దర్శించి పూజలు నిర్వహించాం.15 అడుగుల తెల్లటి పాలరాతి శివలింగం ఎంతో ఎత్తైనది. పవిత్ర పంచారామ క్షేత్రాలలో మొదటిదైన అమరారామం (అమరావతి) కృతయుగంలోనే 'క్రౌంచతీర్థం'గా ఆవిర్భవించిన మహోన్నత పుణ్యక్షేత్రం. త్రిపురాసుర సంహార సమయంలో కుమారస్వామి బాణం దాటికి విరిగిన రాక్షసుని ఆత్మలింగ ముక్కలలో ఒకటి ఇక్కడ పడగా, దేవతల రాజైన ఇంద్రుడు, దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు దానిని ప్రతిష్ఠించాడని, తదనంతరం చంద్రుడు కూడా ఈ శివలింగాన్ని పూజించి 'అమరేశ్వరుడు'గా నామకరణం చేశాడని స్థలపురాణం వివరిస్తోంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని చేత పూజలందుకున్న ఈ క్షేత్రంలో శివలింగం రోజురోజుకీ ఎత్తుగా పెరుగుతుండటంతో, దానిని నిలిపేందుకు తలభాగంలో మేకు కొట్టగా రక్తం చిమ్మిందని, ఆ ఎర్రని రక్తపు మరక నేటికీ లింగం పైభాగంలో స్పష్టంగా కనిపిస్తుందని చెబుతారు. అత్యంత ఎత్తైనది కావడంతో అర్చకులు ఒక ప్రత్యేక పీఠంపైకి ఎక్కి ప్రతినిత్యం అభిషేకాలు నిర్వహించే ఈ దివ్య లింగం చుట్టూ పరివార దేవతలు కొలువుదీరడం వల్ల, దేవతలు (అమరులు) నివసించిన పవిత్ర భూమిగా ఈ ప్రాంతానికి 'అమరావతి' అనే సార్థకమైన పేరు స్థిరపడింది. ఈ దేవాలయంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు విగ్రహం ఉంటుంది. ఆయన చేతిలో ఒక భిక్షా పాత్ర ఉంటుంది. దీని గురించి భిన్న భిన్న కథనాలు ఉన్నాయి. తాను దారిదోపిడిలు చేసేవారిని పిలిచి, వాళ్లని చంపించారని ఆ పశ్చాత్తాపం వల్ల ఆయన అమరేశ్వరుని సన్నిధిలోనే గడిపినట్టుగా చెప్తారు. అమరావతి సంస్థానాధీశులైన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు (1761-1817) కృష్ణా, గుంటూరు ప్రాంతాలను సమర్థవంతంగా పరిపాలించిన ప్రసిద్ధ జమీందారు, కవిపండిత పోషకుడు. బ్రిటిష్ వారు సైనిక బలాన్ని తగ్గించడంతో ఆగ్రహించి, 1796లో తన రాజధానిని చింతపల్లి నుండి ధరణికోట వద్ద 'అమరావతి' అనే నూతన నగరానికి తరలించగా, ఆ పట్టణ వైభవాన్ని కోలిన్ మెకంజీ వంటి బ్రిటీష్ అధికారులు సైతం ప్రశంసించారు. తన పాలనలో ప్రజలను వేధిస్తున్న పిండారీలను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆయన, దారిదోపిడీలు చేసే 150 మంది చెంచు నాయకులను విందుకు పిలిచి వధించారు (ఆ ప్రదేశమే నరుకుళ్ళపాడుగా మారింది). అయితే, ఆ వధకు తీవ్ర పశ్చాత్తాపం చెంది, తన శేష జీవితాన్ని అమరేశ్వరుని సన్నిధిలోనే గడిపారు. ఈ క్రమంలోనే అమరేశ్వరాలయ పునర్నిర్మాణంతో పాటు వందకు పైగా దేవాలయాలను నిర్మించారని, మంగళగిరి నరసింహస్వామి ఆలయానికి 11 అంతస్తుల భారీ గాలిగోపురాన్ని కట్టించి, అర్చకులకు భూమిని దానం చేస్తూ గొప్ప దైవచింతనతో జీవించారని ప్రసిద్ధి చెందారు.
కృష్ణమ్మ ఒడ్డున
అమరావతి
అమరేశ్వరుని సన్నిధి
శివతత్త్వంతో నిండిన
ఒక ప్రశాంత తీరం!
రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు
భిక్షాపాత్ర విగ్రహం
అధికారపు కాలంలో
తన చేతుల మీదుగా జరిగిన
ఘటనల పట్ల పశ్చాత్తాపానికి
ఓ సజీవ ప్రతీక!
శివలింగ దర్శనంతో
భక్తుని మనసంతా ఓంకార నాదమై,
అమరావతి నేలంతా
ఆధ్యాత్మిక కాంతిగా
నిండిపోయినట్టే ఉంటుంది!
ఆ రాత్రి (18.8.2026) ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గెస్ట్ హౌస్ లో బస చేసాం. మా టూర్ గురించి నాకు అత్యంత ఆత్మీయంగా మారిన యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రామ ప్రసాదరెడ్డి గారితో మాటలు సందర్భంలో ప్రస్తావిస్తే వెంటనే ఆయన, ప్రొఫెసర్ గుజ్జు చెన్నారెడ్డి గారికి ఫోన్ చేసి గెస్ట్ హౌస్ బుక్ చేయించేశారు. నాకు ఆ విషయం తెలియక నాకు తెలిసిన మా సెంట్రల్ యూనివర్సిటీలో చదివి, ప్రస్తుతం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో హెడ్ అండ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ తో ప్రస్తావించినప్పుడు ఆయన కూడా గెస్ట్ హౌస్ బుక్ చేయడానికి ముందుకు వచ్చాడు. అంత ఆత్మీయులు ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ ప్రాంగణంలో రాత్రి వేళ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా మారింది. పగటిపూట సాగిన దైవ దర్శనాలు, చారిత్రక క్షేత్రాల యాత్రల బడలికను మర్చిపోయేలా ఆ రాత్రి మాకు అద్భుతమైన ఆతిథ్యం లభించింది. ప్రొఫెసర్ గుజ్జు చెన్నారెడ్డి గారు ఇంగ్లీష్ లో ప్రొఫెసర్. అంతకు ముందు గ్రూప్ -1 ఆఫీసర్ ఉద్యోగాన్ని కాదని టీచింగ్ అంటే ఇష్టంతో చేరారు. ఆయన రాసిన నాలుగు నవలలు నాకు ఇచ్చారు. మరో మహాత్మ(2022), లండన్ టు అమరావతి (2024), స్వప్నసాగరం (2024), వివేకమందిరం (2025). నా పుస్తకాలు నెమలికన్నులు (ఆత్మకథ), కోనసీమ కోయిల (హైకూ దీర్ఘ కావ్యం), దార్ల మాట తేటగీతి శతకం పుస్తకాలను ఆయనకు అందించాను. ఆయన ప్రత్యేక శ్రద్ధతో మా కోసం విశ్వవిద్యాలయపు గెస్ట్ హౌస్లో మంచి సౌకర్యాలతో కూడిన బసను ఏర్పాటు చేశారు. వారి సౌజన్యానికి, మమకారానికి మనసు పులకరించిపోయింది. అంతేకాకుండా, బుద్ధిష్ట్ స్టడీస్ లో గెస్ట్ ఫ్యాకల్టీ గా పనిచేస్తున్న డాక్టర్ ప్రశాంత్ గారు ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని దగ్గరుండి గెస్ట్ హౌస్కు తీసుకెళ్లారు. వారి ఆదరణ, చిరునవ్వుతో కూడిన మాటలు మా ప్రయాణ అలసటనంతా మాయం చేశాయి.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ భవనం ముందుగతంలో దూరవిద్య (డిస్టెన్స్ ఎడ్యుకేషన్) వ్యవహారాల నిమిత్తం, అలాగే తెలుగు విభాగంలో పిహెచ్డి (Ph.D.) వైవా పరీక్షల నిర్వహణ కోసం ఎన్నోసార్లు ఈ విశ్వవిద్యాలయానికి వచ్చి, ఇక్కడే బస చేశాను. కానీ, ఈ సారి ఒక అనిర్వచనీయమైన ప్రత్యేక అనుభూతి కలిగింది. గతంలో వచ్చినప్పుడల్లా బాధ్యతలు, పరుగెత్తే సమయం, పరిశోధనల ఒత్తిడి మాత్రమే తోడుగా ఉండేవి. కానీ ఈసారి, నా అర్ధాంగి, సుపుత్రుడు, ప్రియ శిష్యునితో కలిసి... నా యాత్రానుభవాల నడుమ, వివాహ వార్షికోత్సవ పవిత్ర ఘడియల్లో ఇక్కడ అడుగుపెట్టడం ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది.చదువుల తల్లి నిలయమైన ఆ విశ్వవిద్యాలయ ఆవరణలో, నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి వేళ... జ్ఞాన పరిమళాలు, ప్రాచీన చరిత్ర జ్ఞాపకాలు, మిత్రుల ఆత్మీయ ఆతిథ్యం అన్నీ కలగలిసి ఆ రాత్రి బసను మా యాత్రలోనే అత్యంత మరపురాని ఘట్టంగా మార్చేశాయి. విశ్వవిద్యాలయంలో కొన్ని ఫోటోలు తీసుకొని బయలుదేరాం. గెస్ట్ హౌస్ పే చేయవలసిన మనీ కూడా ప్రొఫెసర్ చెన్నారెడ్డి గారు నన్ను పే చేయనివ్వలేదు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ ముందు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా. మంజుశ్రీ, సాయినాథ్ రెడ్డిపొద్దున్నే హాయిగా వేడి నీళ్ళతో స్నానం చేసి మరలా యాత్రకు బయలుదేరాం. ఎంతకాలంగానో మా శ్రీమతి దర్శించాలని అడుగుతున్న మంగళగిరి పానకాల నరసింహస్వామి దర్శనం కోసం బయలుదేరాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం పనులను తిలకించుకుంటూ మంగళగిరి ప్రయాణం మొదలైంది. అ పరిసరాల్లో ఎక్కడ చూసినా రాజధాని నిర్మాణం జరుగుతున్న ప్రతి ప్రాంతంలోనూ పోలీసులు రక్షణకవచంలా కనిపించారు.
కృష్ణమ్మ ఒడ్డున
విస్తరిస్తున్న అమరావతి
నేలపై గీసిన గీతలు
రేపటి నగర రూపురేఖలై
కనిపిస్తున్నాయి!
విశాల రహదారుల మధ్య
నడుస్తుంటే
నిర్మాణంలో ఉన్న భవనాలు
భవిష్యత్తు వైపు
ఎదుగుతున్నట్టే అనిపించాయి
ఇక్కడి ప్రతి ఇటుకలోఒక ఆశయం,
ప్రతి అడుగులో ఒక అభివృద్ధి స్వప్నం,
ప్రతి నిర్మాణంలో
ఒక కొత్త అమరావతి
ఆవిష్కృతమవుతున్నట్టుంది!
చూసిన దృశ్యాలు
కళ్లలో నిలవగా
నిర్మాణంలో ఉన్న నగరం
మనసులో
రూపుదిద్దుకుంటున్న భవిష్యత్తుగా
మిగిలిపోయింది!
మంగళగిరి చేరుకోగానే ముందుగా కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ దర్శనంతో మా ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమైంది. ఆకాశాన్ని తాకేలా, పదకొండు అంతస్తులతో గర్వంగా తలెత్తుకుని నిలబడిన బ్రహ్మాండమైన గాలి గోపురం చూడగానే మనసు భక్తిభావంతో నిండిపోయింది. ఆ ప్రశాంతమైన వాతావరణంలో మా సుపుత్రుడు శ్రీనివాసరావు గారి అద్భుతమైన ఆలోచన మేరకు స్వామివారికి 'లక్ష ఒత్తుల దీపారాధన' చేయించడం నిజంగా మహద్భాగ్యం. వేలాది దీపపు కాంతుల నడుమ దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ గర్భాలయ దృశ్యం, ఆ వెలుగుల్లో స్వామివారిని దర్శించుకున్న క్షణం కనుల పండువగా అనిపించి మనసుకు అనిర్వచనీయమైన ప్రశాంతతను అందించింది. అక్కడ శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన మండపం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
కింది ఆలయంలో దీపకాంతుల పారవశ్యం నుండి తేరుకుని, దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఉచిత బస్సుపై పయనిస్తూ భక్తిశ్రద్ధలతో ఎత్తైన మంగళగిరి కొండను అధిరోహించి పానకాల స్వామి గర్భగుడిని చేరుకున్నప్పుడు మనసుకు చెప్పలేనంత ప్రశాంతత ఆవరిస్తుంది. ఇక్కడ కూడా లక్ష దీపాల అర్చన చేయించి, దర్శనానికి వెళ్ళి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామికి స్వయంగా పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్న ఆ క్షణాలు అత్యంత అద్భుతమైనవి. అర్చకులు స్వామివారి ముఖద్వారంలో శంఖంతో పానకాన్ని పోస్తుండగా, ప్రతిధ్వనించే స్పష్టమైన గుటకల శబ్దం భక్తులను ఒక దివ్యమైన లోకంలోకి తీసుకెళ్తుంది. స్వామివారు సగం పానకాన్ని మాత్రమే ఆరారగా స్వీకరించి, మిగిలిన సగాన్ని ఆశీర్వచనంగా, మధురాతి మధురమైన ప్రసాదంగా తిరిగి ప్రసాదించడం కనులారా చూసినప్పుడు కలిగే ఆధ్యాత్మిక ఆనందం వర్ణనాతీతం. ఆ పానకం చాలా బాగుంది. కొంచెం తెచ్చుకోవాలనిపించింది. కానీ,మర్చిపోయాం.
పానకాల నరసింహుని సన్నిధిలో
మంగళగిరి కొండపై
పానకాల నరసింహుని దర్శనంతో
మనసంతా మంగళధ్వనియే!
స్వామి సన్నిధిలో
పానకపు తీపి
భక్తి పరిమళమే!
ఆ దివ్య దర్శనం
మన కళ్లలో వెలుగై,
హృదయంలో ప్రశాంతతే!
స్వామివారి దర్శనానంతరం ఆ ఆలయ ప్రాంగణంలో కలిగే అనుభూతి ఒక వింతైన ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎటు చూసినా పానకం ధారలుగా పారుతూనే ఉంటుంది, గాలిలో బెల్లం, యాలకుల సుగంధం గుబాళిస్తూనే ఉంటుంది. అయినా, ఆ పరిసరాల్లో ఒక్క చీమ కూడా వాలకపోవడం స్వామివారి మహిమకు సజీవ సాక్ష్యంగా భక్తులు భావిస్తుంటారు. దైవికమైన ఆ అద్భుత ప్రదర్శన, లక్ష ఒత్తుల దీపారాధన వల్ల కలిగిన పుణ్యఫలం, అన్నింటికీ మించి ఎంతోకాలంగా ఈ క్షణం కోసం ఎదురుచూసిన మా శ్రీమతి ముఖంలో వెల్లివిరిసిన చిరకాల దర్శన సంతోషం... అన్నీ కలిసి ఈ యాత్రను మా జీవితాంతంలో గుర్తుండిపోయే మధుర స్మృతిగా మలిచాయి. పానకాల లక్ష్మీ నరసింహ స్వామి కొండ పై అరలు అరలుగా పేర్చినట్లుగా ఆ కొండలు కనిపిస్తాయి.
కొండను జేరిన పిదపన్
నిండుగ పానక మొసగగ నేర్పుగ ద్రావెన్!
దండిగ దీపపు కాంతిన్
పండుగ వలె కనుల గాంచ పానక స్వామిన్!
మంగళగిరి పానకాల స్వామి ఆలయ ఆచారాల వెనుక భక్తితో పాటు ఒక అద్భుతమైన భౌగోళిక, శాస్త్రీయ కారణం దాగి ఉందని నిపుణులు చెబుతారు. భౌగోళిక శాస్త్రవేత్తల ప్రకారం, మంగళగిరి కొండ ఒక విలుప్త అగ్నిపర్వతం (నిద్రావస్థలో ఉన్న అగ్నిపర్వతం). ఈ కొండ అంతర్భాగంలో ఇప్పటికీ అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడి వాయువులు ఉన్నాయని అంచనా. కొండ లోపల ఉన్న ఆ భయంకరమైన వేడిని చల్లార్చడానికి మరియు అగ్నిపర్వతం ఉగ్రరూపం దాల్చకుండా నియంత్రించడానికి పురాతన కాలంలో మన పెద్దలు కనుగొన్న శాస్త్రీయ ప్రక్రియే ఈ పానకం సమర్పణ. బెల్లం, మిరియాలు, యాలకులు కలిపిన పానకం అత్యంత చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. స్వామివారి ముఖద్వారం అని పిలిచే ఆ కొండపై ఉన్న రంధ్రంలో రోజంతా ఎడతెగకుండా పానకం పోయడం వల్ల, ఆ ద్రవం కొండ లోపలి పొరల్లోకి వెళ్లి అగ్నిపర్వత ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచుతుంది.
రెండవ శాస్త్రీయ కోణం ఏమిటంటే, ఈ కొండలోని రాళ్లలో గంధకం (సల్ఫర్) వంటి మూలకాలు ఉండటం వల్ల వాతావరణంలోకి హానికరమైన వాయువులు వెలువడే ప్రమాదం ఉంటుంది. బెల్లం అనేది సహజసిద్ధమైన రసాయన నిర్వీర్యకారి పానకంలోని బెల్లం, నీరు ఈ రాళ్లతో రసాయనిక చర్య జరపడం వల్ల ఆ వాయువుల తీవ్రత నశించి, చుట్టుపక్కల వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. స్వామివారు సగం పానకం మాత్రమే స్వీకరిస్తారనడం వెనుక ఉన్న వాస్తవం.. కొంత పానకం అగ్నిపర్వత గొట్టం ద్వారా లోపలికి వెళ్లి ఉష్ణాన్ని తగ్గించగా, మిగిలిన సగం బయటకు వస్తుంది. అప్పటికే ఆ పానకంలో కొండలోని ఔషధ గుణాలు, ఖనిజాలు కలవడం వల్ల ఆ పరిసరాల్లో నివసించే వారికి హాని జరగకుండా చేసిన ఒక వ్యూహంలా కూడా అనిపిస్తుంది. అంతే కాకుండా, భక్తులు స్వామిని దర్శనం చేసుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల శరీరంలోని వేడిని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచే దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అందుకే ఇక్కడ పానకం సమర్పణను ఒక ఆధ్యాత్మిక ఆచారంతో పాటు పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఒక శాస్త్రీయ ప్రక్రియగా ఏర్పాటు చేశారని చెప్తుంటారు. ఆ తర్వాత మా పయనం చారిత్రక ఘనతకు, పౌరుషానికి ప్రతిరూపమైన కారంపూడి వైపు సాగింది. ఉదయపు వేళ చల్లని గాలి తలుగుతుంటే కార్ లో హాయిగా ఉన్నా, మనసులో మాత్రం వీరుల యుద్ధ క్షేత్రాన్ని చూడబోతున్నామనే ఒక వేడిసెగలేవో ఒక కొత్త చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. తెలుగు నేల చరిత్రలో వీరత్వానికి నాంది పలికిన పల్నాటి యుద్ధ క్షేత్రంలో అడుగుపెడుతుంటే, నాటి వీరుల శౌర్యప్రతాపాలు, ఖడ్గమృదంగ ధ్వనులు మనోఫలకంపై సాక్షాత్కరించినట్లయింది. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు ప్రాంతంలో క్రీ.శ. 1178-1182 మధ్యకాలంలో దాయాదులైన నలగామరాజు, మలిదేవరాజుల మధ్య జరిగిన భీకర యుద్ధమే పల్నాటి వీర చరిత్ర. దీనిని తెలుగులో 'మినీ మహాభారతం' అంటారు. ప్రసిద్ధ కవి శ్రీనాథుడు ఈ చారిత్రక కథను ద్విపద కావ్యంగా మలిచారు. ప్రశాంతమైన ఆ ఉదయాన వీరత్వపు ఆనవాళ్లను వెతుక్కుంటూ ముందుకు సాగాం. కారంపూడిలో జరిగిన ఈ యుద్ధంలో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ యుద్ధం జరిగిన ప్రాంతంలో నడుస్తుంటే ఒక రకమైన ఏవో వీరత్వానికి చెందిన వైబ్రేషన్స్ కలుగుతున్నట్లు అనిపించింది. పల్నాడు, గురజాల, మాచర్ల నాగులేరు మొదలైన వాటికి రకరకాల అయినటువంటి వ్యుత్పత్తి అర్ధాలు చెప్తారు. గురివింద పొదలు ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని గురిజాల అనే పేరు వచ్చిందట. కృష్ణానది తీరంలో సుమారు 120 మైళ్ళ దూరంలో ఈ గురజాల నగరం ఉంది. దీనికి తూర్పున నాగులేరు, చంద్రవంక నదులు ఈ ప్రదేశంలో పల్లం ప్రాంతంలో ఉండటంవల్ల పల్లవునాడు, పలనాడుని పిలిచేవారు. క్రమేపి అదే పల్నాడు, పలనాడు, వీర పల్నాడు పేర్లతో చరిత్రకెక్కింది. నాగులేరు నదినే నాగానది అని కూడా పిలుస్తారు. ఇక్కడ నివసించే జాతిని నాగ జాతి వాళ్ళని పిలిచేవారట. తర్వాత వాళ్ల పేరుతోనే నాగులేరు అనే పేరు వచ్చినట్టు జనశ్రుతి. రామాయణ కాలంలో మారీచుడు పరిపాలించిన ప్రాంతమే మాచర్లగా భావిస్తారు. అప్పట్లో దీన్ని మాచిర్ల అని పిలిచేవారు. నాగులేరు సమీపంలో ఒక పొలం.. ఆ పొలం పక్కనే ఒక పుట్ట.. ఆ పుట్ట దగ్గర ఒక పాప దొరకడం… ఆ పాపే తర్వాత ‘నాయకురాలు నాగమ్మ’ గా ప్రసిద్ధి చెందిందంటారు.
ముందుగా, పల్నాటి వీరుల ఇలవేల్పు, సాక్షాత్తు నాయని బ్రహ్మనాయుడు ప్రతిష్ఠించిన పవిత్ర శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నాం. భక్తి శ్రద్ధలతో సాగిన ఆ పూజల్లో బ్రహ్మ నాయుడి సంస్కరణల శోభ, ఆ క్షేత్రపు దివ్యత్వమూ స్పష్టంగా ప్రతిబింబించాయి. చారిత్రక ఆధ్యాత్మికతల మేళవింపుగా ఆ ఆలయ ప్రాంగణం అడుగడుగునా ఒక దివ్యానుభూతిని అందించింది. ఈ పర్యటనలో మాకు ఎదురైన అతిపెద్ద సర్ప్రైజ్, ఒక ఆత్మీయ ఆహ్వానం. మా సతీమణికి పూర్వ విద్యార్థి, కొన్నాళ్ల పాటు సహోద్యోగిగా పనిచేసిన కాశీం వలీ రూపంలో దక్కింది. గురువుల పట్ల ఉన్న అపారమైన గౌరవాభిమానాలతో కాశీం వలీ మా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. సాధారణ యాత్రికులకు సులభంగా లభించని అరుదైన అవకాశాన్ని మాకు కల్పించాడు. పల్నాటి యుద్ధంలో వీరులు ఉపయోగించిన నాటి చారిత్రక ఆయుధాలను, కత్తులను అత్యంత సమీపం నుండి తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయించాడు. అంకాలమ్మ గుడి దర్శించుకున్న తర్వాత అక్కడే వేడి వేడి ఇడ్లీలు తిన్నాం. చాలా బాగున్నాయి. ఆ తర్వాత చెన్నకేశవస్వామి దేవాలయం ఎదురుగా బ్రహ్మనాయుడు విగ్రహం ఉంది. దానిపై కారంపూడి యుద్ధం గురించి ఒకరు(తగిరిశ. రఘుబాబు) రాసిన కవిత కూడా ఆ శిల్పంపై చెక్కారు. ఆ పరిసరాల్లో అనేక శాసనాలు ఉన్నాయి. దేవాలయాన్ని తెరిచేవరకు ఉండి, బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు ఉపయోగించిన ఆయుధాలుగా చెప్పే ఆ ఆయుధాలను ప్రత్యక్షంగా తాకి చూశాం. ఆ నాటి వీర ఖడ్గాలను కళ్లారా చూసి, చేతులతో స్పృశిస్తుంటే ఒళ్లు గగుర్పొడిచింది. చరిత్ర పుస్తకాల్లో చదివిన పల్నాటి వీరగాథలు కళ్లముందు ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది. ఆత్మీయ శిష్యుని అభిమానం, చరిత్ర సృష్టించిన ఆయుధాల సందర్శనం మా ఈ కారంపూడి పర్యటనను యాత్రలోనే ఒక చిరస్మరణీయమైన ఘట్టంగా మార్చేశాయి.
పల్నాటి నేలపై
కారంపూడి
ఏ మట్టికణాన్ని కదిలించినా
ఏదో ఒక వీరగాథ
వినిపిస్తున్నట్టే ఉంటుంది!
గాలి తాకిన ప్రతిసారీ
గతకాలపు కత్తుల మెరుపులు,
గుర్రాల పరుగులు,
వీరుల నినాదాలు
కాలపు తెరను చీల్చుకుని
ముందుకొస్తున్నట్టే ఉంటాయి.
బ్రహ్మనాయుడి ఆశయం,
నాయకురాలు నాగమ్మ రాజకీయ చతురత,
మలిదేవుని వీరత్వం
అన్నీ కలిసి
ఈ నేలపై
తెలుగు భారతయుద్ధాన్ని
జ్ఞాపకాలుగా నిలిపేశాయి!
కారంపూడి యుద్ధభూమిలో
నిలబడితే
బ్రహ్మనాయుడి చాపకూడు సిద్ధాంతం,
నాయకురాలు నాగమ్మ కుతంత్రాలు
చరిత్ర పుటల నుంచి బయటకొచ్చి
మన కళ్లముందే కదనమాడుతుంటాయి!
ఆ పల్నాడు యుద్ధం గురించి ఆ రాత్రి వచ్చిన తర్వాత వీడియోలు చూశాం. నాకు నిద్రలో కూడా ఆ వీరుల స్థలం, రక్తసిక్తమైన యుద్ధ క్షేత్రం కనిపించినట్లే అనిపించింది. ఆ కాలంలో పల్నాడు ప్రాంతం మెట్ట ప్రాంతంగా, నీటి వసతి లేక కరువు కాటకాలతో ఉండేది. అక్కడి ప్రజల జీవితం పూర్తిగా కఠిన శ్రమతో ముడిపడి ఉండేది. అక్కడ బతకాలంటే కష్టపడి పని చేయాల్సిందే తప్ప, అందచందాలకు, రాజభోగాలకు, కళలకు అక్కడ తావులేదని శ్రీనాథుడు ఎంతో హాస్యభరితంగా, అద్భుతమైన పదజాలంతో వర్ణించాడు. సాక్షాత్తూ ఆ దేవలోకపు నాట్యకత్తె అయిన 'రంభ' అంతటి అందగత్తె అక్కడికి వెళ్ళినా, ఆమె నృత్యాలను అక్కడ ఎవరూ పట్టించుకోరు. బతకడానికి ఆమె కూడా పత్తి దారం వడకాల్సిందే. భూమండలాన్ని ఏలే సాక్షాత్తూ ఆ మహారాజు అక్కడికి వెళ్ళినా, రాజభోగాలు దొరకవు, నాగలి పట్టి పొలం దున్నాల్సిందే. పూల బాణాలు కలిగిన ఆ మన్మథుడే అక్కడికి వెళ్ళినా, అక్కడ తినడానికి పంచభక్ష్య పరమాన్నాలు దొరకవు. ముతకగా ఉండే జొన్నలతో వండిన అన్నం మాత్రమే తినాలి అంటూ ఒక పద్యం చెప్పినట్లు సాహిత్యకారులు చెప్తుంటారు.
రసికుడు పోవడు పల్నా
డెసగంగా రంభ యైన నేకులె వడుకున్
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్
పల్నాడు ప్రాంతం శ్రీనాధుని కాలంలో ఎలా ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం అయితే సశ్యశ్యామలంగా కనిపిస్తోంది. ఎటుచూసిన నల్లరేగడి మట్టితో, పొలాలు పచ్చగా కనిపించాయి. ఈ ప్రయాణమంతటా రోడ్డు మార్గంలో సాగిన మా పయనానికి మరింత ప్రాణం పోసింది మా కార్ లోని సంగీతం. బొలేరో కారు కృష్ణానదీ తీరాల వెంట, పల్నాటి కొండల నడుమ సాగిపోతుంటే... మధ్య మధ్యలో ప్లేఅయ్యే అద్భుతమైన పాటలు మా ప్రయాణంలో కొత్త ఉత్సాహాన్ని, నవోత్తేజాన్ని నింపాయి. ఒకవైపు ఉదయకాలపు మంచు తెరల నడుమ జానపద గీతాలు, మరోవైపు పల్నాటి వీరభూమి దారిలో గూస్బంప్స్ తెప్పించే భావోద్వేగ గీతాలు, ఇంకోవైపు ప్రయాణ బడలికను మర్చిపోయేలా చేసే మధురమైన పాటలు... డ్రైవర్ కిరణ్ కారు స్పీకర్ల నుండి వినిపిస్తుంటే మా యాత్ర మరింత ఆహ్లాదకరంగా మారింది. నా సతీమణి మంజుశ్రీ, కుమారుడు శ్రీనివాసరావు, సాయినాథ్ రెడ్డిలతో కలిసి ఆ పాటలను ఆస్వాదిస్తూ, పాడుకుంటూ సాగిన ఆ ప్రయాణం ప్రతీ క్షణాన్నీ ఒక తీపి జ్ఞాపకంగా మార్చేసింది. గతంలో మా వివాహవార్షికోత్సవాల సందర్భంగా నా పరిశోధక విద్యార్థులు చంద్రమౌళి, రామ్ ప్రసాద్, కృష్ణవేణి, పుప్పిణి, మా చిన్నన్నయ్య గారి అబ్బాయి మురళీ మనోహర్ లతో వచ్చినప్పుడు వాళ్ళ హడావిడి, వాళ్ళు దారి మధ్యలో కట్ చేయించిన కేక్, పట్టుకెళ్ళిన పదార్థాలు పంటపొలాల్లో, తోటల్లో తిన్నదృశ్యాలు, ఆ నాటి అనుభూతులను నెమరువేసుకుంటూ ఈ యేడాది పయనం ఒక చారిత్రక, ఆధ్యాత్మక ప్రదేశాల సందర్శనగా మరో పుటలో చేరిపోయింది.
గడియారపు పరుగులకు కాసేపు సెలవిచ్చి
దైనందిన అలజడులను దాటేసి
మరొక్కసారి కొత్తగా కలుసుకున్న క్షణాలివి!
చేతిలో చేయి వేసి నడుస్తుంటే
ఆనాటి ఏడడుగుల ముచ్చట మళ్లీ గుర్తొచ్చినట్టుంది,
కొత్త దారుల్లో పాత జ్ఞాపకాలను వెతుకుతుంటే,
ప్రకృతి కూడా మనకు తోడుగా నడిచినట్టుంది.
కొత్త ప్రదేశాలెన్నో చూసినా
పరిచయమున్న నీ నవ్వులోనే నా ప్రపంచం ఉందని...
ఎన్ని మైళ్లు ప్రయాణించినా
కలకాలం సాగే మన జంట పయనమే నా గమ్యమని...
ఈ మధుర యాత్ర మరల మరాలా పరిమళిస్తూ గుర్తుచేస్తోంది....
డా. దార్ల వెంకటేశ్వరరావు, 22.8.2026








