"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

26 జులై, 2026

శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం సందర్శన ఓ యాత్రానుభవం

 శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం సందర్శన

ఓ యాత్రానుభవం





కొన్ని ప్రయాణాలు ఒక తేదీని చూసుకొని మొదలవ్వవు. అవి మనసులోనే చాలాకాలం ముందే ప్రారంభమవుతాయేమో. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠానికి వెళ్లాలనే నా ప్రయాణం కూడా అలాంటిదే. చిన్నప్పిటి నుండీ ఆ పేరు వినబడినప్పుడల్లా, నా ఊహల్లో ఆ రాయలసీమ గ్రామం రూపుదిద్దుకునేది. కాలాన్ని తన ఒడిలో దాచుకున్న నేల, మౌనాన్ని భాషగా మార్చుకున్న చెట్లు, మహాయోగి అడుగుల జ్ఞాపకాన్ని ఇంకా దాచుకున్న వీధులు…అన్నీ నా ఊహలో నెమ్మదిగా ఒక చిత్రంలా విప్పారేవి.



వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ఎంత చదివితే అంత కొత్త ఆసక్తి కలిగేది. ఆయన కాలజ్ఞానం ప్రజల విశ్వాసంలో ఒక ప్రవాహంలా నేటికీ సాగుతూనే ఉంది. ఆయన తాత్వికత కాలాన్ని దాటి మనిషి అంతరంగంతో సంభాషిస్తుంది. ఆయన పద్యాలు చదివినప్పుడల్లా జీవితానుభవంతో వెలిగిన దీపాల్లా అనిపించేవి. ఆ వెలుగు పుట్టిన ప్రదేశాన్ని ఒకసారి స్వయంగా చూడాలనే కోరిక మనసులో నిశ్శబ్దంగా వేర్లు వేసుకుంది.

ఆ కోరికకు రూపం ఇచ్చిన వారు యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ తప్పెట రామ ప్రసాదరెడ్డి గారు. ఆయన భగవాన్ కాశిరెడ్డి నాయనగారి పరమభక్తులు. ఆయన కారులో కాశిరెడ్డి నాయనగారి ఫోటో ఉంటుంది. ఆ చిత్రపటానికి దండం పెట్టుకుని ఏపైనయినా ప్రారంభిస్తారు. 

యోగివేమన విశ్వవిద్యాలయంలో ఒక పిహెచ్డి మౌఖిక పరీక్షకు విషయం నిపుణులుగా వెళ్లాను. అది 25.7.2026 వ తేది.‌ మధ్యాహ్నానికి వైవా పూర్తి అయింది. తర్వాత అందరి ఫ్యాకల్టీనీ కలిసినట్లే ఆయనని కూడా కలిశాను. అంతకు ముందు ఒకసారి వెళ్ళినప్పుడు ఆయనే స్వయంగా దుండి శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని దర్శించేలా చేశారు. తర్వాత ఇడుపులపాయ తీసుకువెళ్లి వైయస్సార్ ఘాట్ చూపించారు. అవన్నీ గుర్తు చేసుకుంటున్న మాటల సందర్భంలో "బ్రహ్మంగారి మఠానికి వెళ్దాం" అని ఆయన చెప్పగానే, చాలాకాలంగా ఎదురుచూస్తున్న పిలుపే ఆయన నోట్లో నుండి వచ్చినట్టుగా అనిపించింది. ఆహ్వానం వినగానే, దానికంటే ముందే నా మనసు కందిమల్లాయపాలెం చేరుకుంది. ఎన్.టి.రామారావు గారు. తీసిన చలనచిత్రంలోని అనేక దృశ్యాలు కళ్ళముందు కదిలాడాయి.

యాత్ర మొదలయ్యేలోపే నా ఆలోచనలు ఆ నేలపై ఆనందంతో తిరుగుతున్నాయి. ఎన్నో శతాబ్దాల క్రితం వీరబ్రహ్మేంద్ర స్వామి చూసిన ఆకాశమే ఇప్పటికీ ఆ గ్రామం మీద నీలి చీరలా పరుచుకొని ఉంటుందా? ఆయన నడిచిన దారుల మీద ఇప్పటికీ ఉదయపు గాలి అదే మృదుత్వంతో వీస్తుందా? ఆయన ధ్యానించిన నిశ్శబ్దాన్ని ఆ గ్రామం ఇంకా తన హృదయంలో దాచుకుందా? అలాంటి ఎన్నో ప్రశ్నలు నా మనసులో అలలం అలలుగా ఎగసిపడుతుండగా యాత్రకు సమయం ఆసన్నమైంది.

ప్రతి చారిత్రక క్షేత్రానికీ ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. పాత రాళ్ల సువాసన, కాలం తాకిన గోడల నిశ్శబ్దం, తరతరాల భక్తి తడిసిన నేల, మనుషుల విశ్వాసంతో నిండిన గాలి…ఇవన్నీ కలిసిన ఒక అదృశ్య అనుభూతి అక్కడ ఎదురుచూస్తూ ఉంటుందని నేను తరచూ అనుకునేవాడిని. ఆ అనుభూతిని నా కళ్లతో చూడడానికి, నా అడుగులతో తాకడానికి, నా మనసుతో ఆస్వాదించడానికి నేను బయలుదేరాను.

….

కడప నగరాన్ని దాటిన కొద్దిసేపటికే రాయలసీమ తన సహజ స్వరూపాన్ని మెల్లగా విప్పుకుంది. దూరంగా గోధుమరంగు కొండలు, వాటి పాదాల వద్ద పచ్చని పొలాలు, నేలమీద మట్టి నలుపు, కుంకుమ రంగు, ఎరుపులలో కనిపిస్తుంది. ఎక్కడికక్కడ తలెత్తినట్లుండే రకరకాల చెట్లు… రోడ్డుకిరువైపులా ఉండే పొలాల్లో పసుపు, టొమాటోలు, కొన్ని చేలల్లో అరటితోటలు…మరికొన్ని చేలల్లో జొన్న పంటల..రకరకాల కూరగాయలులతో చాలా వరకు చేలు పచ్చగా కనిపించాయి. కొన్ని చోట్ల ఎండిపోయి, ఏ పంటా లేక బీడువారిపోయాయి. మొత్తం మీద ఈ నేల ఎన్నో శతాబ్దాల చరిత్రను తనలో దాచుకొని ప్రశాంతంగా శ్వాసిస్తున్నట్టుగా అనిపించింది. రామ ప్రసాద రెడ్డి గారు కారును నెమ్మదిగా నడుపుతున్నారు. కారులో శ్రీ వేంకటేశ్వర స్వామి సంకీర్తనలు మృదువుగా వినిపిస్తున్నాయి. ఆ సంగీతం, ఆ ప్రకృతి, మా సంభాషణ మూడూ కలిసి యాత్రను ఒక ఆధ్యాత్మిక అనుభవంగా మలిచాయి. మధ్య మధ్యలో బ్రహ్మంగారి మఠం దగ్గర ప్రొటోకాల్ దర్శనం ఏర్పాట్ల కోసం మాట్లాడేవారు. వాళ్ళబ్బాయి ప్రసిద్ధ డాక్టర్. రోహిత్ రెడ్డి. ఆయన మెడికవర్ హాస్పిటల్ లో కొన్నాళ్లు పనిచేసి సొంతంగా అని పెట్టారట. హైదరాబాదులోనే ఉంటారు ఎప్పుడైనా కావాలంటే ఆయన అందుబాటులో ఉంటారని చెప్పారు. ఆయన గురించి మాట్లాడుకుంటున్నా సమయంలోనే వాళ్ళ నాన్న గారికి ఫోన్ చేసి ఆత్మీయంగా కాసేపు మాట్లాడాడాయన. ఆయనకు నన్ను కూడా పరిచయం చేసి నాతో కూడా మాట్లాడించారు. 

కిటికీ బయటకు చూస్తుంటే నా ఆలోచనలు పదిహేడవ శతాబ్దం వైపు మళ్లాయి. ఇదే రాయలసీమ... ఇదే ఆకాశం... ఇదే గాలి... ఇదే నేల. ఈ దారుల్లోనే ఎప్పుడో వీరబ్రహ్మేంద్ర స్వామి సంచరించి ఉంటారు. ఈ కొండలను చూసే ఆయన దృష్టిలో కాలం ఎలా కనిపించి ఉంటుందో! ఈ నేలపై నిలబడి భవిష్యత్తు తరాల గురించి ఆయన ఎలా ఆలోచించి ఉంటారో! అనే ప్రశ్నలు నాలో మౌనంగా మెదులుతున్నాయి.

చరిత్రలో కొంతమంది వ్యక్తులు తమ కాలానికే పరిమితమైపోతారు. మరికొందరు కాలాన్ని దాటి తరతరాలతో సంభాషిస్తుంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి అలాంటి మహనీయులలో ఒకరు. పదిహేడవ శతాబ్దంలో జీవించిన ఆయన కేవలం గొప్ప ఆధ్యాత్మికవేత్త. అంతే కాదు; సమాజాన్ని నిశితంగా పరిశీలించిన తాత్వికుడు, కాలగమనాన్ని అర్థం చేసుకున్న దార్శనికుడు, జీవితాన్ని సరళమైన పదాల్లో ఆవిష్కరించిన కవి. ఆయన రచించిన కాలజ్ఞానం, గోవింద వాక్యాలు, కాళికాంబ సప్తశతి వంటి రచనలు ఇప్పటికీ తెలుగు ప్రజల సాంస్కృతిక స్మృతిలో సజీవంగా ఉన్నాయి.

ఆయన జీవించిన కాలం రాయలసీమ రాజకీయంగా గోల్కొండ కుతుబ్‌షాహీ పాలన ప్రభావంలో ఉన్న సమయం. ఆ కాలంలోనే ఆయన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గౌరవించిన నవాబు కందిమల్లాయపాలెం మఠానికి డెబ్బై ఎకరాల భూమిని ఇనాంగా ఇచ్చాడని మఠ చరిత్ర చెబుతోంది. అది ఒక వ్యక్తికి ఇచ్చిన గౌరవం అనుకోకూడదు; జ్ఞానానికి, తపస్సుకు, మానవతకు సమాజం అర్పించిన నమస్కారంగా నాకు అనిపించింది. 

వీర బ్రహ్మంగారు వడ్రంగి వృత్తికి చెందిన కుటుంబంలో జన్మించారు. అయినప్పటికీ ఆయన జీవితంలో కనిపించేది కులం కాదు, జ్ఞానం; వృత్తి కాదు, వివేకం; వ్యక్తిగత మహిమ కాదు, సమస్త మానవాళిని ఆవరించిన ఆధ్యాత్మిక దృష్టి. అందుకే అన్ని వర్గాల వారూ ఆయనకు శిష్యులయ్యారు. ఆయన ఆశ్రమంలో జన్మ కంటే గుణానికి, వంశం కంటే విలువలకు, బాహ్య గుర్తింపుకంటే అంతరంగ వికాసానికే ప్రాధాన్యం లభించిందని చదివిన విషయాలు ఒక్కొక్కటిగా నా జ్ఞాపకాల్లో మెదులుతున్నాయి.

కందిమల్లాయపాలెం మరింత చేరువవుతున్న కొద్దీ, నేను ఒక గ్రామానికి వెళ్తున్నాననే భావన కంటే, తెలుగు చరిత్రలో ఇప్పటికీ సజీవంగా నిలిచి ఉన్న ఒక మహనీయుని అడుగుజాడల్లో నడవబోతున్నాననే ఆనందమే ఎక్కువగా అనిపించింది. అక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుందేమో... ప్రతి చెట్టు ఒక జ్ఞాపకాన్ని దాచుకుందేమో... ప్రతి గాలి వీచికలో ఆయన తాత్వికత ప్రతిధ్వనిస్తుందేమో... అనే మధురమైన ఎదురుచూపులతో నా మనసు ముందే బ్రహ్మంగారి మఠ ప్రాంగణంలో సంచరిస్తోంది.

కొద్దిసేపటికే కందిమల్లాయపాలెం మమ్మల్ని ఆహ్వానించింది. అప్పటికే చంద్రశేఖర్..బ్రహ్మంగారి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మాకోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన కూడా మా కారు ఎక్కి కూర్చున్నాడు. గ్రామంలోకి అడుగుపెట్టగానే ఒక విచిత్రమైన ప్రశాంతత మనసును తాకింది. అది కాలం నెమ్మదిగా మాట్లాడుతున్న స్వరంలా తాకింది. ఆ వీధుల్లో నడుస్తుంటే హడావుడి కనిపించలేదు. ప్రతి ఇల్లు, ప్రతి చెట్టు, ప్రతి రచ్చబండ తమకు తెలిసిన ఒక చరిత్రను లోపల దాచుకొని ఏదో ఓ ఆధ్యాత్మిక గర్వంతో నిలబడి ఉన్నట్టుగా అనిపించింది.


రామ ప్రసాద రెడ్డి గారు ముందుగా గ్రామదేవత పోలేరమ్మను దర్శించుకుందామని చెప్పారు. ఒక రచ్చబండ దగ్గర జనం అంతా చూస్తుండగా గ్రామ మునసుబుగార్కి చుట్ట కాల్చుకోవడానికి నిప్పు తెమ్మని పోలేరమ్మ తో చెప్తారట బ్రహ్మంగారు. అప్పుడు ఆమె నిప్పు పట్టుకొచ్చి ఇస్తుందని ఐతిహ్యం. అలా అన్నీ గుర్తుకొచ్చాయి. పోలేరమ్మ ఆలయంలో అడుగుపెట్టగానే ఆ పరిసరాల్లో ఒక సహజమైన పవిత్రత కనిపించింది. పూజలు ముగించుకుని బయటకు వస్తుండగా, "వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితంలో పోలేరమ్మకు సంబంధించిన అనేక జానపద స్మృతులు ఇప్పటికీ ఇక్కడి ప్రజల నోట వినిపిస్తుంటాయి" అని రామ ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. ఆ మాటతో నా ఆసక్తి మరింత పెరిగింది.








బ్రహ్మంగారు కూర్చున్న రచ్చబండ, ఆ పక్కనే ఒక శిలా శాసనం ఉన్నాయి. రచ్చబండ పవిత్రంగా తాగాను. ఒక మహిమాన్వితుడు కూర్చున్న నేలను తాకుతున్నాననే ఒక భావన. నేను పవిత్రంగా స్థలాన్ని భావించాను. నమస్కరించుకున్నాను. నేను కూడా అక్కడ కూర్చున్నాను. నాతో పాటు రాంప్రసాద్ రెడ్డి గారు కూడా కూర్చున్నారు. ఎన్టీ రామారావు సినిమాలో చాలా విశాలమైన వేదిక చూపిస్తారు. కానీ వాస్తవానికి ఆ రచ్చబండ ఉన్న ప్రాంతం చాలా ఇరుకుగా ఉంది. 

అక్కడి నుంచి స్వామివారు నివసించిన ఇంటి వైపు నడిచాం. బయటికి చూస్తే అది ఒక సాధారణ ఇల్లులా కనిపిస్తుంది. అయితే గడప దాటిన క్షణం నుంచి ఆ సాధారణత్వమే అసాధారణంగా అనిపిస్తుంది. ఎన్నో శతాబ్దాల క్రితం ఆ ప్రాంగణంలో నడిచిన అడుగుల ప్రతిధ్వని ఇప్పటికీ అక్కడి నిశ్శబ్దంలో వినిపిస్తున్నట్టుగా అనిపించింది. వీర బ్రహ్మంగారి స్వయంగా తయారు చేసుకున్న ద్వారా బంధాలు దానికి చెక్కిన అందమైన శిల్పాలు లాంటి నిర్మాణాలు ఎంతో ఆకర్షణీంగా అనిపించాయి. అవి పునరుద్ధరించే పనుల్లో భాగంగా ఫోటోలు, కొలతలు తీసుకుంటూ ఆ శిథిలమైపోతున్న గోడలను తొలగిస్తున్నారు. లోనికి ఎవరిని వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. చంద్రశేఖర్ గారు ప్రత్యేకమైన అనుమతి తీసుకుని ఉండడం వలన మమ్మల్ని లోనికి వెళ్ళనిచ్చారు. బ్రహ్మంగారి జీవించిన ఇంటి పక్కనే ఒక నుయ్యి ఉంది. అది బ్రహ్మంగారు స్వయంగా ఒక రాత్రిలో దుప్పి కొమ్ముతో తవ్వారట. ఆనాటి ఆధిపత్య కులాలు బ్రహ్మంగారి కూడా మంచి నీళ్లు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు తాను ఆ భావి తగ్గుకున్నట్లుగా ప్రజలు చెబుతారు.ఆయన స్వయంగా తవ్విన నుయ్యి వద్ద కొద్దిసేపు నిలిచాను. ఆ నుయ్యిలోని నీటిని మాత్రమే కాదు, కాలాన్ని కూడా లోతుగా తవ్వి బయటకు తీసిన మహనీయుని జీవితం నా మనసులో మెదిలింది. ఆ బావి రాళ్లను చూస్తుంటే, వాటిపై కాలం తన ముద్రను వేసినా, వాటి జ్ఞాపకాలను మాత్రం చెరపలేకపోయిందనిపించింది.

ఆ తరువాత రచ్చబండ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నిలబడి పూజారిగారు పోలేరమ్మకు సంబంధించిన స్థానిక సంప్రదాయాన్ని వివరించారు. భక్తి, గ్రామజీవితం, ఆధ్యాత్మికత ఒకదానిలో ఒకటి కలిసిపోయిన ఆ కథనం వింటుంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితం ప్రజల దైనందిన జీవితానికి ఎంత దగ్గరగా మిళితమైందో అర్థమైంది. చరిత్ర అనేది కేవలం శాసనాల్లోనే ఉండదని, ప్రజల నోట నిలిచిన జ్ఞాపకాలలో కూడా శాశ్వతంగా జీవిస్తుందని అక్కడ అనుభవించాను. అక్కడ కొన్ని ఫోటోలు తీసుకుని వదిలి రాలేక రాలేక అక్కడ నుండి బయలుదేరాం.

తర్వాత బ్రహ్మంగారు సజీవ సమాధి అయిన స్థలం, అక్కడే నిర్మించిన దేవాలయం దర్శించాం.‌ మాకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు చంద్రశేఖర్. అందువల్ల వేగంగా దర్శనం అయింది. మఠాధిపతులు ప్రత్యేక పూజలు చేయించారు. శేషవస్త్రాన్ని, ప్రత్యేక పూజలు చేసిన పూలమాల ప్రసాదాలను మాకు బహుకరించారు. అక్కడ పూజారులు అందరూ ఆ వంశానికి చెందిన వారు కావడం విశేషం అని రాంప్రసాద్ రెడ్డి గారు అన్ని పోసగొచ్చినట్లు చెప్పారు. వారు చదువుతున్న శ్లోకం చేస్తున్న పూజా విధానం బ్రాహ్మణులకు ఏమాత్రం తీసుకుపోయినట్లుగా ఉంది. స్పష్టమైన విచారణ సంప్రదాయబద్ధమైన ఆచారాలతో ఆ పూజా విధానాలు కొనసాగుతున్నాయి. మేము వెళ్ళింది తొలి ఏకాదశి రోజు కావడంతో భక్తుల సంఖ్య కూడా విశేషంగానే ఉంది. మండపంలో భజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మఠాధిపతి నివసించే గృహాన్ని సందర్శించాం. మఠాధిపతి వారి శ్రీమతి గారిని కలిసాం. 

మఠంలోని పూజారులు, నిర్వాహకులు ఎంతో ఆప్యాయంగా మాతో మాట్లాడారు. మా కోసం పేరు బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం వ్రాతప్రతులను చూపించారు. స్వామివారి జీవిత విశేషాలను వివరించడం ప్రారంభించిన వెంటనే కాలం వెనక్కి నడుస్తున్న అనుభూతి కలిగింది. వారు చెప్పిన ప్రతి సంఘటన స్థానిక చరిత్రతో, ప్రజల జ్ఞాపకాలతో ముడిపడి ఉంది. పదిహేడవ శతాబ్దపు రాయలసీమ సామాజిక జీవితం, ఆ కాలంలో ప్రజల విశ్వాసాలు, స్వామివారి సంచారాలు, శిష్య పరంపర అన్నింటినీ వారు ఎంతో సహజంగా వివరిస్తున్నారు. పుస్తకాల్లో చదివిన విషయాలు అక్కడ మనుషుల మాటల్లో వినిపిస్తుంటే వాటికి మరో జీవం వచ్చినట్టుగా అనిపించింది. వీరబ్రహ్మేంద్రస్వామి వారు సజీవ సమాధి అయిన ప్రాంతంలో నిలబడితే ఏదో ఒక వైబ్రేషన్ అనిపించినట్లు అనిపించింది. ఒకప్పుడు రాఘవేంద్ర స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభూతికి గురి అయ్యానో, మరలా వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకున్నప్పుడు అలా అనిపించింది. ఆయన సమాధిపై వీరబ్రహ్మేంద్రస్వామి రూపాన్ని విగ్రహంగా పెట్టారు. దాని ఎదురుగా వారి భార్య పిల్లలు జీవ సమాధి అయిన స్థలాలుగా పూజారి వివరించారు. బయటకు వచ్చిన తర్వాత వీరబ్రహ్మేంద్రస్వామి వారు సజీవ సమాధి అయ్యే ముందు నిలబడి అందరికీ బోధనలు చేసిన స్థలం దగ్గర వారి పాదముద్రికలు ఉన్నాయి. వాటిని ఆ చరిత్రను వివరిస్తూ అక్కడ ఒక పూజారి ఉన్నారు. అక్కడ ఉన్న అనేక గుడ్లలో పూజారులు ఉండడం ప్రతిచోట నామార్చన చేయడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం కొనసాగుతున్నాయి. బ్రహ్మంగారి దేవాలయం పక్కనే వారి మనవరాలు ఈశ్వరి దేవి అమ్మవారి దేవాలయం ఉంది. అంటే ఆమె సమాధి ఉంది. అక్కడ కూడా పూజలు జరుగుతున్నాయి. స్వామివారు నడయాడిన ప్రదేశాలను మిత్రులు చంద్రశేఖర్ వాటిని ఒక్కొక్కటిగా చూపించారు. 

ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మఠ ప్రాంగణం వైపు నడిచాం. ప్రతి అడుగూ నెమ్మదిగా పడుతోంది. అక్కడ తొందరపడాల్సిన అవసరమే లేదనిపించింది. కాలమే నిదానంగా నడుస్తున్న చోట మనిషి అడుగులు కూడా సహజంగానే నెమ్మదిస్తాయి.

మఠం ఆవరణలోకి ప్రవేశించగానే అక్కడి వాతావరణం మనసును మరో లోకంలోకి తీసుకెళ్లింది. ఎక్కడా కృత్రిమ ఆర్భాటం లేదు. భక్తి తన సహజ రూపంలో కనిపిస్తోంది. శతాబ్దాలుగా భక్తుల పాదస్పర్శతో పవిత్రమైన ఆ నేల, గాలిలో పరచుకున్న ధూప సుగంధం, ఘంటారావాల మృదునాదం, నిశ్శబ్దంగా ధ్యానంలో మునిగిపోయిన భక్తులు..ఇవన్నీ కలసి ఆ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గంభీరతను ప్రసాదిస్తున్నాయి.

అక్కడి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ చంద్రశేఖర్ గారు ఎంతో ఆత్మీయంగా మాకు అన్నీ దగ్గరుండి చూపించారు. ఆలయ మర్యాదల ప్రకారం దర్శనం ఏర్పాటుచేశారు. మఠంలోని ప్రధాన ప్రదేశాలను చూపిస్తూ, ఒక్కో స్థలానికి సంబంధించిన చారిత్రక విశేషాలను ఎంతో ఓర్పుతో వివరించారు. ఆయన మాటల్లో భక్తి ఉంది; అధ్యయనం ఉంది; ఆ సంప్రదాయం పట్ల గౌరవం ఉంది.

సంభాషణ క్రమంగా వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవితంపైకి మళ్లింది. మఠాధిపతులు, పూజారులు చెప్పిన ప్రతి విషయం నా మనసులో చదివిన చరిత్రతో కలిసిపోతోంది. వారు స్వామివారిని మహిమలతో మాత్రమే కాదు, సమాజాన్ని లోతుగా అర్థం చేసుకున్న మహనీయునిగా పరిచయం చేశారు. ఆత్మజ్ఞానం గురించి బోధిస్తూ, మనిషి జీవన విలువలను ఆచరణలో చూపించిన యోగిగా ఆయనను వర్ణించారు.

స్వామివారి శిష్య పరంపర గురించి వారు చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. కులం, వృత్తి, సామాజిక స్థితి వంటి భేదాలకు అతీతంగా జ్ఞానాన్వేషణతో వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన ఆశ్రమ ద్వారం తెరిచి ఉండేదని వారు వివరించారు. సిద్ధయ్య వంటి మహాభక్తుల ప్రస్తావన వచ్చినప్పుడు ఆ సంప్రదాయం ఎంత విశాలమైందో మరింత స్పష్టమైంది. గురువు బోధన ఒక వ్యక్తితో ముగియకుండా, శిష్యుల జీవితాల ద్వారా సమాజంలో ఎలా విస్తరించిందో వారి వివరణలో అర్థమైంది.

వీర బ్రహ్మంగారు సజీవ సమాధి ప్రాంగణానికి చేరుకున్న తర్వాత సహజంగానే మనసు అంతర్ముఖమైంది. భక్తులు నిశ్శబ్దంగా నమస్కరిస్తున్నారు. కొందరు ధ్యానంలో కూర్చున్నారు. మరికొందరు కాలజ్ఞాన గ్రంథాన్ని భక్తితో చదువుతున్నారు. ఆ దృశ్యాలన్నీ చూస్తుంటే శతాబ్దాలుగా ఈ క్షేత్రం భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక చింతనలకు కేంద్రబిందువుగా ఎలా నిలిచిందో అర్థమవుతోంది.

సజీవ సమాధి గురించి వివరిస్తూ పూజారిగారు చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. "మహనీయుల జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే వారు వదిలిన విలువలను చూడాలి" అని ఆయన ఎంతో ప్రశాంతంగా అన్నారు. ఆ ఒక్క వాక్యం ఆ యాత్రకు ఒక కొత్త అర్థాన్ని ఇచ్చింది. సమాధి అనేది ఒక ముగింపు కాదు; తరతరాలకు స్ఫూర్తినిచ్చే జీవన సందేశానికి నిలయమని ఆ క్షణంలో నాకు అనిపించింది.

మఠం చుట్టూ మరోసారి నెమ్మదిగా నడిచాను. ప్రాచీన వృక్షాలు తమ నీడలో ఎన్నో తరాల భక్తులను చూసి ఉంటాయి. ఆ ప్రాంగణంలోని ప్రతి రాయి వేలాది మంది నమస్కారాలను మౌనంగా స్వీకరించి ఉంటుంది. గాలిలో కలిసిన వేదఘోషలు, భక్తుల ప్రార్థనలు, పక్షుల కిలకిలారావాలు అన్నీ కలిసి ఆ క్షేత్రాన్ని ఒక జీవంతమైన ఆధ్యాత్మిక స్మృతిగా నిలబెడుతున్నాయి.

అక్కడి నుంచి తిరిగి అడుగులు వేస్తున్నప్పుడు ఒక తృప్తి మనసంతా నింపుకుంది. ఎన్నాళ్లుగానో మనసులో నిలిచిన ఒక కోరిక నెరవేరింది. చదివిన చరిత్రకు ఆ రోజు ఒక రూపం కనిపించింది. విన్న కథలకు ఒక నేల దొరికింది. పుస్తకాలలో పరిచయమైన వీరబ్రహ్మేంద్ర స్వామి, కందిమల్లాయపాలెం నేలపై నడుస్తూ నా మనసుకు మరింత చేరువయ్యారు.

అక్కడ తినడానికి రకరకాల సత్రాలు ఉన్నాయి. నిత్య అన్నదానాలు జరుగుతున్నాయి. శిష్యులు సిద్దయ్య, కక్కయ్య నాకు సంబంధించిన విశేషాలు కూడా చారిత్రక ప్రాంతాలలో కనిపిస్తున్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు శ్రీ విష్ణువు అవతారంగా చెప్పారు. అక్కడ ఆ దేవాలయాల సమూహంలో విఘ్నేశ్వరుడు, నంది విగ్రహాలు కూడా కనిపించడం విశేషం. ఆ ప్రాంగణం లోనే తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు సౌకర్యాలను అందించే విధంగా బిల్డింగ్ కూడా కట్టించారు. ఆ ప్రాంతం అంతా ఒక ఆధ్యాత్మిక వాతావరణమే కనిపించింది. అక్కడ భక్తి పేరుతో వ్యాపారం జరుగుతున్న ఫీలింగ్ కనిపించలేదు. ఆ ప్రాంతానికి కొంచెం దూరంలో ఒక రిజర్వాయర్ ఉంది. దానికి సాగర్ వీర బ్రహ్మం సాగర్ అని పేరు పెట్టారు. అది ఎన్టి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించారట. తర్వాత దాన్ని వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో పూర్తి చేశారని చెప్తున్నారు. రిజర్వాయర్ వల్ల వేసవి కాలంలో కూడా ఆ ప్రాంతంలో నీళ్ల సమస్య లేదని చాలామంది భావిస్తున్నారు. 

ఆ విధంగా వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠాన్ని దర్శించుకున్నాం. కందిమల్లాయ్య పాలెంతో పాటు బనగానపల్లి, యాగంటి మొదలైన పుణ్యక్షేత్రాలతో వీరబ్రహ్మేంద్రస్వామి వారి చరిత్రకు అనుబంధం ఉంది అని అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది. నేను, మా కుటుంబం, మా విద్యార్థులతో కలిసి గతంలో యాగంటికి చాలా సార్లు వెళ్ళాను. యాగంటిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైయున్న ఒక అద్భుతమైన పర్వత గుహ ఉంటుంది. దానిలో వీరబ్రహ్మేంద్రస్వామి వారు తపస్సు చేసుకుంటూ కాలజ్ఞానాన్ని రాసారని చెప్తారు. వాటిని కూడా పూజారులు ప్రస్తావించారు. 

మొత్తం మీద ఎన్నాళ్ళగానో చూడాలనుకున్న ఒక చారిత్రక పురుషుని, ఒక ఆధ్యాత్మికవేత్త, కాలజ్ఞాని, గొప్ప మతసామరస్యవాది పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠాన్ని చూడడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. 

రాయలసీమ ప్రాంతాన్ని చాలామంది కరువు ప్రాంతంగా మాత్రమే గుర్తిస్తుంటారు. కానీ నాకు అది ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా అనిపిస్తుంది. అనేకమంది యోగులు, ఆధ్యాత్మిక వేత్తలు, పురాణ పురుషులు, పుణ్యాత్ములు, దైవాలు కొలువైన స్థలంగా అనిపిస్తుంది.

చక్కటి ఒక పుణ్యక్షేత్రాన్ని చూడాలని తీసుకొనివెళ్ళిన ఆచార్య తప్పేట రామ ప్రసాద రెడ్డి గారికి, అన్ని దగ్గరుండి చూపించిన వీరబ్రహ్మేంద్రస్వామి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ గారికి, చక్కని ఫోటోలు తీసిన ఒకప్పటి మా సెంట్రల్ యూనివర్సిటీ ఎం.ఏ. విద్యార్థి, ప్రస్తుతం యోగివేమన విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్ ఖలందర్, అలాగే మరొక రీసెర్చ్ స్కాలర్…మాకు మంచి ఫోటోలు తీశారు. వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 

సెంట్రల్యూ నివర్సిటీ, హైదరాబాద్. 26.7.2026.