‘సాధారణంగా కనిపించే అసాధారణ కవిత్వం’
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు,
స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్,
హైదరాబాద్.
‘కవిత్వానికి, కన్నీటికి
ఎప్పటి బంధమో ఏమో
కన్నీరు కార్చిన ప్రతిసారి
కవిత్వం జాలువారుతుంది’ ఇవి సాదాసీదా పదాలు కాదు; జీవితాన్ని కాచి వడబోసిన కవితా పంక్తులు. కవిత్వం ఎలా పుడుతుందనేది ఆదికావ్యం ఆవిర్భావం నుండి నేటి వరకు చర్చోప చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతీ కవీ తన కవిత్వానికి ప్రేరణ ఏమిటో ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్పుకుంటాడు. దానితో పాటు తన కవిత్వ ప్రయోజనాన్ని కూడా సూచిస్తాడు. డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ కూడా అదే పని చేశాడు. కవి భావోద్వేగాలు, అనుభవాలు, కన్నీటి రూపంలో ప్రవహించినప్పుడు, అవి కవిత్వంగా మలచబడతాయని చెబుతున్నాడు. అంతే కాదు, కవిత్వం పాండిత్యానికి మాత్రమే పరిమితం కాదని, అది కవి ఆత్మను ప్రతిబింబించే భావోద్వేగంగా భావిస్తాడు. కవిత్వం కవి హృదయం నుంచి సమాజాన్ని తాకే ఒక శక్తివంతమైన ప్రక్రియగా అవతరిస్తుందని, అదే తన కవిత్వమని కూడా చెప్పకనే చెప్పాడుకవి. కవి తన భావోద్వేగాలను అక్షరాలుగా మారుస్తాడు; గాయకుడైతే ఒక తన సంతోషాన్నిగానీ, దుఃఖాన్ని గాని గేయంగా మారుస్తాడు; చిత్రకారుడు అయితే ఒక చిత్రమవుతాడు. కళాకారుడు తన బాధనయినా, సంతోషాన్ని అయినా సత్వరమే ఏదో ఒక రూపంలో బహిర్గత పరుస్తాడు. తొలి దశలో అలా జరిగినా, ఒక సమాధ్యవస్థ పొందిన సృజనకారుడు దాన్ని సాధారణీకరించగలగాలి. అప్పుడు పాఠకుడు / ప్రేక్షకుడు దానితో తన్మయీ భావానికి గురికాగలుగుతాడు. ఒక జీవితం కవిత్వం లేదా కళ అయ్యే వివిధ దశలను ఇది తెలుపుతుంది. కవిత్వం రాయడం, దాన్ని ఆస్వాదించడంలో ఉన్న తృప్తి, ఆనందం, ఆ మమేకత సృజనకారుడు మాత్రమే గుర్తించగలడు. తాను కవిత్వం కోసం ఎలా ఉద్వేగానికి గురయ్యే వాడో, ఆ కవిత్వంలో సామాన్యుడికి స్థానం కోసం, సామాన్యుడే కవిత్వం కావడం కోసం శ్రీశ్రీ తన ‘కవితా! ఓ కవితా!’లో తెలిపాడు. అలాగే ఈ కవి కూడా తాను కవిత్వమయ్యే క్రమంలో గుండె గొంతుకలో కొట్లాడిన విధానాన్ని కవిత్వీకరించాడు.
‘’నీకై
నా మదిని నీలాకాశపు ఎడారిలో
ఒంటరి ఒంటెలా తిప్పుతున్న క్షణాలు చూస్తే ఒయాసిస్సులు కూడా కన్నీటి బొట్లను ఆపేసుకుంటాయేమో.’’
ఇది ఆదినారాయణ వ్యక్తిగత జీవితానికి సంబంధించిందే కాదు; తరతరాలుగా భారతదేశంలో దళితులు అనుభవించిన అవమానాలకు, బహిష్కరణలకు, సమాజంలో తగిన స్థానం లేని పరిస్థితులకు నిలువుటద్దం ఈ కవిత. శూద్రుని కవిత్వాన్ని ఆస్వాదించడమంటే, కాకి ఎంగిలి చేసిన ఆహారాన్ని భుజించినట్లేనని అప్పకవి, ఆ వారసులు దళితుల్నీ, దళిత కవిత్వాన్ని పరిగణించే దయనీయమైన పరిస్థితి నేటికీ పూర్తిగా పోయిందని గుండెల మీద చేయేసుకొని చెప్పలేం. ఈ కవితలో కొన్ని తరాలుగా దళితులు త్రాగడానికి మంచినీళ్ళకోసం ఎదుర్కొన్న సామాజిక వ్యవస్థీకృత సంఘర్షణను కూడా అద్భుతమైన అభివ్యక్తితో వర్ణించాడు కవి. దళితుల జీవితం, ముఖ్యంగా నీటి వంటి ప్రాథమిక వనరులకు సైతం అవకాశం లేని పరిస్థితినీ ఈ కవితలో వివిధ ప్రతీకల ద్వారా మరింత స్పష్టంగా వర్ణించాడు. "నీలాకాశపు ఎడారి" ద్వారా దళితుల నిరాశ, అనుభవించే పాశవికత, సామాజిక విస్మరణ ప్రతిబింబించగా, "ఒంటరి ఒంటె" వారి అవహేళన భరించాల్సిన సామర్థ్యాన్ని సూచిస్తుంది.భారతదేశంలో దళితుల నిత్యజీవితంలో నీటి కోసం చేసే పోరాటాలు సామాజిక వివక్షతను వ్యక్తీకరిస్తాయి. అనేక గ్రామాల్లో బావులపై, చెరువులపై సాంప్రదాయంగా ఉన్న యజమానత్వం దళితులను వాటికి దూరం చేస్తుంది. ఈ కవితలోని "ఒయాసిస్సులు కూడా కన్నీటి బొట్లను ఆపేసుకుంటాయి" అనే వాక్యం, దళితుల గాధను చూసి ప్రకృతి కూడా సతమతమవుతుందని ఒక స్ఫూర్తివంతమైన దృశ్యాన్ని చిత్రీకరిస్తుంది.
డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ పద్య కవిత్వం పై ఎం.ఫిల్. చేశాడు. దళిత ఆత్మకథలపై డాక్టరేట్ చేశాడు. ఓరియంటల్ కళాశాల నుండి వచ్చి, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నాడు. తను విద్యార్థిగా, పరిశోధకుడుగా, విద్యార్థి నాయకుడుగా, ప్రస్తుతం ఒక అధ్యాపకుడిగా ఉన్నప్పటికీ తాను విస్తృతంగా అధ్యయనం చేస్తున్నాడు. గతంలో ‘నానీలసుగంధం’ (2023) పేరుతో తన తొలి కవితా సంపుటిని వెలువరించాడు. దాన్ని రవీంద్ర భారతిలో తన గురువు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగార్కి అంకితం చేశాడు. కవిత్వం ఒక తీరని దాహం. తన చుట్టూ ఉన్న సమాజాన్ని, ఆ సమాజంలోని వివిధ పొరలను సూక్ష్మంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో మళ్లీ అనేక కవితలయ్యాడు. ఎవరికైనా సాంఘికీకరణ ప్రక్రియ లో కుటుంబం ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఆ తరువాత పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయి వరకు మరొక సమాజాన్ని అభ్యసింప చేస్తుంది. మరలా సమాజంలో ఒక పౌరుడిగా తన విధులు నిర్వహించేటప్పుడు చట్టం, న్యాయం మరికొన్ని నియమనిబంధనలు నేర్పుతాయి. ఇవన్నీ సాంఘికీకరణ ప్రక్రియలో వివిధ దశలు. వీటన్నింటి గురించి ఆదినారాయణ కవిత్వం అయ్యాడు. అమ్మ నాన్నలలో నాన్న గురించి కవిత్వం రాసినా, రాయకపోయినా బహుశా తన అమ్మ గురించి కవిత్వం రాయని కవి ఉండడు. ఈ కవి కూడా తన తల్లిని ఒక ప్రేమమూర్తిగా, ఆత్మీయ మూర్తిగా తమకు అందించిన వివిధ అనురాగ పార్శ్వాలను ఎన్నో భావచిత్రాలుగా చూపించాడు. తన తల్లిలోని శ్రమైక జీవన సౌందర్యాన్ని తలచుకొని మురిసిపోతాడు.
‘’దండెం అమ్మ పుట్టింటి ఆస్తి.
ఆ దండెం దగ్గర
నాన్నకు చోటే ఉండదు
దాని పూర్తి హక్కులు అమ్మవే.’’ ఇంట్లో పనులు చేయటం, బట్టలు ఉతకడం, వంట చేయడం… దీనితో పాటు పొలం పనులు చేయడం తరతరాలుగా స్త్రీకి మాత్రమే సంక్రమించిన పనులుగా మారిపోయిన స్థితిని అద్భుతంగా వ్యక్తీకరించాడు కవి.
మనుచరిత్రలో అల్లసాని పెద్దన సంసారం గొప్పతనాన్నీ, భార్యాబిడ్డలు, కుటుంబం, ఆ గృహస్థ జీవితంలోని ఔన్నత్యాన్ని వర్ణిస్తూ భారతీయ జీవన విధానాన్ని వేనోళ్లా కీర్తించారు. ఈ కవి ఆదినారాయణ కూడా ఇల్లుని వర్ణిస్తూ అటువంటి పనే చేశాడు. ఇంట్లో ప్రతి ఒక్కొక్కరికి మధ్య ఉండే అనురాగాన్నీ, బాధల్నీ, బాంధవ్యాల్నీ, వారి వారి ఆస్తిత్వాల్ని అద్భుతంగా వర్ణించి, ఆధునిక భారతీయ సమాజంలో కూడా కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనం కొనసాగుతూనే ఉందని పరోక్షంగా సూచించాడు.
‘’ఇల్లంటే
చెమ్మగిల్లిన కన్నీటి బొట్లను
బరువెక్కిన హృదయాన్ని
మనసారా నవ్విన జ్ఞాపకాలను
నడుస్తున్న వంటగదిని
ఒక్కసారి స్పృశించడం.’’
ఇల్లంటే ఎవరెవరు? తల్లి, తండ్రీ, అన్నదమ్ములు, భార్యాభర్తలు, బిడ్డలు…బంధువులు ఒకరేమిటి! అనేక బంధుత్వాలతో ముడివేసుకున్న అనురాగాలు. ఆదినారాయణ వీళ్ళందరినీ సందర్భం వచ్చినప్పుడల్లా కవిత్వం చేశాడు.
‘’పనికాడ తల్కాయకు తువ్వాల గట్టి
పారవట్టి పనిజేస్తే
పడ్సు మొగోడు గూడ పన్కిరాడు
పార, పలుగు, కొడ్వలి చేతబట్టిందే
ఐనా పెన్ను వట్టినోల్ల కంటే లగాంచి మాట్లాడుత- దబ్బున నాకు జరమత్తే
కడ్పుమీద తడిబట్టేసి పెయంత రుద్ది
ఫ్యాన్ దిరిగినట్టు తిరుగుద్ది
నా మంచం సుట్టు’’
మనకెన్ని భాషలు వచ్చినా, అమ్మ పలుకులలోని ఆత్మీయత దేనికీ రాదు. కవి సందర్భోచితంగా తెలంగాణ పలుకుబడి లోని సౌందర్యాన్ని పట్టి చూపించాడు. ‘జననీ జన్మభూమశ్చ స్వర్గాదపీ గరీయసీ’ అనే శ్లోకం తల్లి గొప్పతనాన్ని, తాను జన్మించిన భూమినీ ప్రశంసిస్తుంది. అందుకే ఈ శ్లోకం ఒక సూక్తిలా కూడా మారిపోయింది. కానీ, కవి గిన్నారపు ఆదినారాయణ తల్లడిల్లే తల్లి హృదయాన్ని కూడా పట్టుకున్నాడు.
‘’ఆ కిటికి కోసం
ఎన్నిసార్లు ఖరాఖండిగా
నేను అక్కడి నుండి లేవనని చెప్పానో
ఎన్ని అబద్ధాలు ఆడానో
అదే కిటికి కోసం
ఎన్నిసార్లు బతిమాలానో
ఇలా కిటికి ఒక మధురానుభూతి’’
ఈ కవిత సాధారణం లో అసాధారణతను గుర్తించు అనే సందేశాన్ని అందిస్తుంది.ఈ కవితలో సాధారణం లో అసాధారణత అనే భావనను జీవితంలోని భావోద్వేగాల వైకల్యాలను, వాటి సంక్లిష్టతను వ్యక్తీకరించే ఒక నది లాంటిది. కవితలో "కిటికి" అనేది ఒక సాధారణమైన భౌతిక వస్తువు కాదు, ఇది జ్ఞాపకాలు, కోరికలు, మరియు ఆశల సమ్మేళనానికి ప్రతీక. ఇది మానసిక స్థితి కు ప్రతిరూపం. సాధారణ వస్తువును అసాధారణంగా మార్చే కళను కావ్య సౌందర్యాత్మకత అంటారు. "కిటికి ఒక మధురానుభూతి" అనే వాక్యం, కవి జీవితంలోని సాధారణ అనుభవాలకు కొత్త ధ్రువాలను ఇవ్వగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ కవితలో "కిటికి" వ్యక్తి జీవితంలోని సాధారణ అనుభవాలకు అసాధారణ భావాన్ని జోడిస్తుంది. అదొక నోస్తాల్జియా. ఈ కవితలో పదార్థాల వ్యర్థతను అసాధారణతలోకి మార్చి భావోద్వేగాల విశిష్టతను వెలుగులోకి తీసుకురావడంగా కవి భావించాడు. అసాధారణత అనేది ప్రతిరోజు జీవనంలో, చిన్న చిన్న విషయాలపై మన హృదయస్పందనలను గుర్తించగల తత్వానికి సంబంధించినది. సౌందర్య తత్వం ప్రతిఫలించింది. ఇలాంటిదే మరొక కవిత. మనం చాలా సాధారణమైనట్లుబావించే వాటిలో అసాధారణమైన తాత్వికతను గుర్తించడం కవి గొప్పతనం.
‘’డిసెంబర్ 31
జీవన గమనానికి
అంచలంచెల
ఆయుష్షు దించే మెట్టే తప్పా
పెంచే మెట్టు కాదు.
….
….
నిన్నటి చీకటిని మర్చిపోయి
రేపటి వెలుగును ఆస్వాదించడానికి
ఎంతటి ఆరాటం
పోరాటమై సాగుతుందో
నిత్యం చూస్తూనే ఉన్నాం.’’ అన్నప్పుడు ఆదినారాయణ ఒక తాత్వికుడిలా కనిపిస్తాడు.
మానవ జీవితంలో మార్పు, కాల చక్రం, మనసు నిరంతర ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుంది. డిసెంబర్ 31 అనే ఒక తేది, ఒక సంవత్సరానికి ముగింపు. కొత్త సంవత్సరానికి ఆరంభాన్ని సూచిస్తూ, సమయ తాత్వికతతో ముడిపడిన జీవన తాత్విక ప్రశ్నలను రేకెత్తిస్తుంది.
"అంచలంచెల ఆయుష్షు దించే మెట్టే తప్పా, పెంచే మెట్టు కాదు" అనేది మనిషి జీవితంలో సమయ సంక్షిప్తత కు ప్రతీక. కాలం అనేది కేవలం నశించేవాటిని తగ్గించడానికే ప్రయత్నిస్తుంది. కానీ, అదనంగా దేన్నీ పెంచదు. ఇది సమయ క్రమబద్ధత ను ప్రతిబింబిస్తుంది."నిన్నటి చీకటిని మర్చిపోయి రేపటి వెలుగును ఆస్వాదించడానికి" అనే వాక్యం, జ్ఞాపకాల తాత్వికత భవిష్యత్ ఆశల తాత్వికత మధ్య ఉన్న ద్వంద్వ సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. జ్ఞాపకాలు మన జీవితాన్ని నిర్మించే మార్గాలు, అయితే, భవిష్యత్ ఆశలు జీవన ఉత్సాహానికి దోహదం చేస్తాయి. దీన్ని స్మృతి భవిష్యత్ ఆశల మధ్యగల వ్యతిరేకతగా చెప్పుకోవచ్చు. మానవ ఆరాటం "ఎంతటి ఆరాటం పోరాటమై సాగుతుందో" అనే వాక్యం, మనిషి యొక్క అస్తిత్వ పోరాటం ను సూచిస్తుంది. ఇది జీవన పరిణామ క్రమంతో ముడిపడిన తన మనుగడ కోసం చేసే నిరంతర ప్రయత్నాన్ని ప్రతిపాదిస్తుంది.డిసెంబర్ 31 అనేది జీవన చక్రంలో ఒక ప్రతీక. ఇది ఒక ముగింపును సూచించినప్పటికీ, అదే సమయంలో పునఃప్రారంభానికి అవకాశాన్ని సృష్టిస్తుంది. ఇది చక్రాకార సమయ తాత్వికతకు సంకేతం. దీన్ని సంవత్సరాంతానికి ప్రతీకాత్మకతగా చెప్పుకోవచ్చు."రేపటి వెలుగును ఆస్వాదించడానికి" అనే భావం, ఆశావాద తత్వం యొక్క విభిన్న కోణాన్ని ప్రతిపాదిస్తుంది. కవిత భవిష్యత్ ఆశల వైపు దృష్టిని నిలిపి, జీవితంలో పునఃఆరంభాలు అర్థవంతమని సూచిస్తున్న ఆశావాద తత్వాన్ని చెప్పాడు కవి.
ఇలా ప్రతి కవితను వ్యాఖ్యానించుకుంటూ పోతే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. కవి గిన్నారపు ఆదినారాయణ మౌనంగా ఉంటాడు. మహా సముద్రం లాంటివాడు. ఆ సముద్రం ఎన్ని బడబాగ్నులను తనలో దాచుకుందో. అన్వేషిస్తే గాని తెలియదు. అతను కూడా అంతే. అతని వ్యక్తిత్వం కూడా అంతే. ఈమధ్య డాక్టర్ ఎన్. గోపి గారి కవిత్వాన్ని బాగా అధ్యయనం చేస్తున్నాడు. అది ఇతని కవిత్వంలో బాగా కనిపిస్తుంది. గోపిగారి గురించి కూడా దీనిలో ఒక గొప్ప కవితను రాశాడు. అయిన వ్యక్తిత్వాన్ని ఆయన రాసిన కవిత్వాన్ని ఆ కవితలో గొప్పగా ఆవిష్కరించాడు కవి.
పేదరికం తారాస్థాయి ఎలా ఉంటుందో మరొక కవితలో చెబుతూ…
‘’పాలు, పండ్లు, టిఫిన్లు
మా ఇంటికి అతిథులయ్యాయంటే
రోగం మా ఒంట్లో జేరినట్లు లెక్క
రోజుతినే బువ్వకు సెలవిచ్చి
ఇన్ని రకాల తిండి దొరుకుతుందంటే
జరాన్ని ఎందుకు కోరుకోం మరి
జరమొస్తనే గద దొరికేది
మాకివ్వన్ని ఇంక నాల్రోజుల ఇట్లనే ఉంటె
బాగుండు అనిపించేది’’ ఆరోగ్యం కోల్పోయినప్పుడు పేదవాళ్ళ జీవితాల్లో ఎదురయ్యే ప్రత్యేక పరిస్థితిని సూచిస్తుంది. నిత్యం అందుబాటులో లేని పౌష్టికాహారం, రోగ సమయంలో అందించినా, దాని వెనుక దారుణమైన అనుభవాల్ని కవి సూచిస్తున్నాడు. ఇది అనూహ్య తార్కికతకు ప్రతీక.
"ఇన్ని రకాల తిండి దొరుకుతుందంటే జరాన్ని ఎందుకు కోరుకోం మరి" అనడం ద్వారా సంతృప్తి, విచిత్ర ఆకాంక్షల ద్వంద్వాన్ని ఆవిష్కరిస్తుంది నాడు. రోగం కారణంగా దొరికే ప్రత్యేక సేవలు, ఇవన్నీ సాధారణ జీవితంలో దొరకడం అనుమానాస్పదమనే వ్యంగ్య స్వరాన్ని పలికిస్తున్నాడు కవి. "జరమొస్తనే గద దొరికేది" అనే వర్ణన మన జీవితంలోని ఐరనీ ఆఫ్ లైఫ్ ని ప్రతిపాదిస్తుంది.
రోగం ద్వారా వచ్చే ప్రత్యేకతలను, కష్టాలపై ఉన్న వ్యంగ్య స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది అసాధారణ పరిస్థితుల్లో సహజ అనుభూతిఅనే సిద్ధాంతాన్ని చర్చిస్తుంది.
ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు ఇలాంటి వస్తువులే తీసుకొని కరుణ రసార్ధ్రంగా ఒక కథ రాశారు. పేదరికంతో బాధపడుతున్న ఒక అమ్మాయికి లారీ యాక్సిడెంట్ కావడం, ఆ సందర్భంగా అనేకమైన ఆహార పదార్థాలు వస్తూ ఉంటాయి. అందుకని ఆకలి వేసినప్పుడల్లా లారీ కింద పడిపోదామనుకుంటుంది. ఆ కథ విషాదాంతంగా, వాస్తవికతతో ముగిస్తుంది. ఆ కథ చదివిన తర్వాత పాఠకులు చాలా సేపు మామూలు మనుషులు కాలేరు. పేదరికం, వాస్తవిక అనుభవాలు రచయిత, కవులను ఒకే రకమైన వస్తువుతో రచనలను చేసేలా ప్రేరేపిస్తాయి.
‘’కరోనా కాలంలో
క్లాస్లూమ్ క్లాసులకు కత్తెరవేసి
ఆన్లైన్ క్లాస్లకు ఆహ్వానం పల్కడం
పురోగమనమో తిరోగమనమో కానీ
బ్లాక్ బోర్డు మీదున్న ఫీలింగ్ స్క్రీన్ బోర్డులో లేదు’’
కరోనా కాలంలో జీవించిన కవి గాని, రచయితగాని దాన్ని స్పర్శించకుండా రచనలు కొనసాగించలేరు.కరోనా సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులను కవి ఒక విద్యార్థిగా, ఒక అధ్యాపకుడిగా తన వాస్తవిక అనుభవాలను కవిత్వం చేశాడు.
కవి డా.గిన్నారపు ఆదినారాయణ తన కవితా సంపుటికి పెట్టుకున్న పేరు ‘తొవ్వ నేర్పిన పాఠం’ పేరు తో ఒక కవిత రాశాడు.
‘’ఆ తొవ్వను చూసినప్పుడల్లా
ఆకాశంలో అందమైన చందమామను
చూసినంత ఆనందం
అందరు ఆ తొవ్వలో
ముళ్ళుంటాయని
చెప్పులు తొడుక్కొని నడిస్తే
నేను అక్షరాలు తొడిగి నడిచాను.’’
ఈ కవితలో ఒక దళితుడు విద్యార్థిగా తనకు అంతకు ముందు అందని చందమామలా, అందని ద్రాక్షలా ఉన్న చదువుని తాను చదువుకోవాలని ఉంచుకున్నాడు. భారతీయ సామాజిక జీవన క్రమాన్ని, దళితుల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుల్ని ఈ కవిత వర్ణిస్తుంది. ఆ క్రమంలో ఎదురైన అడ్డంకులను, అంతిమంగా సాధించిన విజయాల్ని కూడా చిత్రిస్తుంది. అది భారతదేశంలో కవి వ్యక్తిగత పోరాటం కాదు; తరతరాలుగా దళితులు చేసిన పోరాటానికి ఒక వ్యవస్థీకృత ప్రతీక. 'తొవ్వ' అనేది కేవలం ఒక భౌతిక వస్తువుగా కాకుండా, జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు ప్రతీకగా నిలుస్తుంది. అయినప్పటికీ, కవి ఈ సవాళ్లను అధిగమించి, దళితులు ఎలా విజయం సాధిస్తున్నారో ఎంతో స్ఫూర్తిదాయకంగా, ఆదర్శనీయ దృక్పథంతో వర్ణించాడు.
ఒక వర్గం నుండి మరో వర్గానికి, ఒక స్థాయి నుండి మరో స్థాయికి వెళ్లే ప్రక్రియనే సామాజిక చలనశీలత అంటారు. భారతీయ దళితులు చదువుకొంటూ తమ సామాజిక స్థితిని మెరుగుపరచుకున్న పరిణామాలను వర్ణిస్తున్నాడు.
'ముళ్ళుంటాయని చెప్పులు తొడుక్కొని నడిస్తే నేను అక్షరాలు తొడిగి నడిచాను' అనే వాక్యం సామాజిక వర్గాల మధ్య ఉన్న అంతరాన్ని, దాన్ని అధిగమించిన తెలివితేటలను చూపుతుంది. భారత రాజ్యాంగం అందించిన సమానత్వం అనే భావనను అందరికీ సమాన అవకాశాలు లభించాలనే ఆకాంక్షను తెలియజేస్తుంది. కవిత చివరిలో ఆకాశంలోని చంద్రునితో పోల్చడం ద్వారా ఆశావాదాన్ని ప్రదర్శిస్తుంది.
‘’ఆ తొవ్వలో అందరి ముఖాలు
పౌడరేసుకొని మెరుస్తుంటే
నాది మాత్రం
పరీక్షల్లో ఫస్టచ్చిన రోజే మెరిసేది.
ఆ తోవ్వలో గాయాలు అందరికి
శరీరానికి తాకితే
నాకు మాత్రం మనస్సుకు తాకేవి.’’
తొలి తరం దళితులు ఎదుర్కొనే భౌతిక, మానసిక సంఘర్షణలను ఇక్కడ కవి అద్భుతంగా వ్యక్తిగరించాడు. నేటికీ ప్రతిభావంతుడైన దళితుడు తాను ఏదైనా సాధించినప్పటికీ రిజర్వేషన్ తో మూడు పెట్టి చూడడమే తప్ప అతని ప్రతిభను గుర్తించని సమాజంలో ఉన్నాం. ఒక స్కూలులో విద్యార్థిగా చేరగానే, అతడు దళితుడు అని తెలియగానే తాను వేసుకునే బట్టలు, తినే ఆహారం, మాట్లాడే మాటలు అన్నింటిలోనూ ఈ మానసిక గాయాలను ఎదుర్కోకతప్పదు.
పౌడర్ అనేది ముఖాన్ని అందంగా కనిపించేలా చేసే ఒక సామాజిక గుర్తింపులేదా బాహ్య ప్రదర్శనని సూచిస్తూ "ఆ తొవ్వలో అందరి ముఖాలు / పౌడరేసుకొని మెరుస్తుంటే" అని ఎంతో వ్యూహాత్మకంగా వర్ణించాడు. సామాన్యంగా, సమాజంలో మనం ఎలా కనిపిస్తున్నామో, మన ప్రతిష్ట ఎలాంటి ఉందో అనే దానిపై సామాజిక దృష్టి ఉంటుంది. సామాజిక అలవాట్లు అనేవి మానవుల ప్రవర్తనకు, వారిచ్చే మర్యాదలు, విజయాలపై ఆత్మ గౌరవం ఆధారపడుతుంది."నాది మాత్రం / పరీక్షల్లో ఫస్టచ్చిన రోజే మెరిసేది" అనడం ద్వారా ఎప్పుడన్నా, ఎవరైనా మెచ్చుకున్నా అది బాహ్య విజయంగానో, తాత్కాలిక గౌరవంగానో చూసే పరిస్థితిని తెలుపుతుంది.
"ఆ తోవ్వలో గాయాలు అందరికి / శరీరానికి తాకితే/ నాకు మాత్రం మనస్సుకు తాకేవి" అని కవి అనడంలో తరతరాల దళితులు పడిన అవమానాలు, వాటి వల్ల మానసికంగా కుంగి పోవడాలను ఎన్నింటినో సూచిస్తుంది. మానసిక గాయాలుఅందరికీ స్పష్టంగా కనిపించవు. చేతన, అచేతన స్థితులు ఒకే కాలంలో సంభవించవచ్చు. ఇది ఇంటర్నల్ కంట్రాడిక్షన్ ని ప్రతిబింబిస్తుంది, ఎప్పుడు గమనించలేని బాధతో మనసు అశాంతిగా ఉంటుంది."నాకు మనస్సుకు తాకేవి" అనడం ద్వారా ఉపరితల సామాజిక గాయాలు కంటే ఆత్మ సంబంధ గాయాలు మరింత తీవ్రతను కలిగిస్తాయనేది భారతదేశంలో దళితులకు మాత్రమే తెలుస్తుంది. దాన్నిక్కడ ఎంతో శక్తివంతంగా ప్రయోగించాడు కవి. మొత్తం మీద ఈ కవితలో బాహ్య గాయాలు, అంతరంగ గాయాల మధ్య ఉన్న వ్యత్యాసంని చూపిస్తూ, సామాజిక సమీకరణలు, మానవ మానసిక స్థితి, ఆత్మగౌరవం గురించి తాత్త్వికంగా మాట్లాడుతున్నాడు కవి. కొన్ని భాగాలు కవి వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టినట్టుగా కూడా అనిపిస్తాయి.
ఈ కవిత వస్తు పరంగాను, నిర్మాణ పరంగాను గొప్ప కవిత. ఇలాంటి కవితలు ఈ కవిత సంపుటిలో చాలా ఉన్నాయి. తన కూతురు గురించి వర్ణించిన ‘చిట్టితల్లి’ కవిత గాని, మట్టి మనిషి నాన్న, వారసత్వం వంటివన్ని అద్భుతమైన కవితలు. వీటితోపాటు దండోరా ఉద్యమం, తాను చదివి ఉద్యమాలలో తిరిగిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్, పారిశుద్ధ్య కార్మికులు ఇలా అనేక కవితలు ఈ కవి ప్రగతిశీలతను తెలియజేస్తాయి. సాధారణమైన పదాలతో అసాధారణమైన కవిత్వాన్ని చేయడం ఎలాగో ఆదినారాయణ తెలుసుకున్నాడు. పూర్వ కవులు వాడిన పదాలను తాను సాధ్యమైనంత వరకు తన కవిత్వంలో వదల్చుకుంటే తనదైన ముద్ర ఏర్పడుతుందనేది కూడా గమనించాలి. ఒక ఆత్మీయ స్పర్శ, ఒక సామాజిక ఉద్యమ కెరటం, సమకాలిన సమాజ ప్రతిబింబంగా ఈ కవితా సంపుటిని తీసుకొస్తున్న ఆదినారాయణకు కవిత్వం ఒక కళ, ఒక జీవిత వాస్తవికత.
(ప్రభంజనం దినపత్రిక, 14.8.2026 సౌజన్యంతో)
