"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

01 సెప్టెంబర్, 2026

సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రతిఫలించే 'మాదిగ కొలువు'


 సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రతిఫలించే 'మాదిగ కొలువు'

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

తెలుగు శాఖ,

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్,

 హైదరాబాద్ - 500046.

ఫోన్: 9989628049

తెలుగు సాహిత్యంలో వచన సాహిత్య ప్రక్రియలు సామాన్యుల్ని కూడా సొంతంగా చదువుకునే అవకాశాన్ని కలిగాయి. వీటిలో కథానిక, నవలా సాహిత్యం మధ్యతరగతి, సామాన్యుల జీవితాలను వర్ణించడంలో ప్రధానమైన భూమికను నిర్వహిస్తున్నాయి. ఆ తరగతుల పాఠకులను ఇవి బాగానే ఆకట్టుకుంటున్నాయి. సుమారు 150 సంవత్సరాల నవలా సాహిత్య చరిత్రలో దళిత జీవితాలను చిత్రించిన నవలలు ఎన్నో వచ్చాయి. అలాంటి వాటిలో దళితేతరులు, దళితులు రాసిన నవలలు కూడా ఉన్నాయి. హేలావతి (1913) మొదలుకొని మాలపల్లి (1922) నవల వరకు దళితేతర రచయితలు దళిత జీవితాలను చిత్రించిన నవలలు అనేకం ఉన్నాయి. వీటితోపాటు దళిత రచయితలే రాసిన దళిత నవలల్లో ఖాకీ బ్రతుకులు (1980-82), గద్దలాడతాండాయి (1996), అద్దంలో చందమామ (1988), పంచమం (1998), కక్క (2000), సిద్ధి (2006), అంటరాని వసంతం (2000), చంద్రవంక.. దాని తర్వాత మరలా అంత గొప్ప నవలగా 'మాదిగ కొలుపు'ను చెప్పుకోవచ్చు. ఈ నవలల పరిణామాలన్నీ గమనించిన తర్వాత 'మాదిగ కొలుపు' నవల స్థానం ఎక్కడ అని గుర్తించడంలోనే దీని ప్రత్యేకతను మనం అర్థం చేసుకున్నట్లవుతుంది.

తెలంగాణ ప్రాంతంలోని మాదిగలు, వారి సంస్కృతిని కేంద్రంగా చేసుకొని వచ్చిన నవలల్లో 'కక్క', 'సిద్ధి' తర్వాత మరలా 'మాదిగ కొలుపు'ను ప్రధానంగా చెప్పుకోవాలి. మిగతా నవలల్లో, ముఖ్యంగా 'అంటరాని వసంతం' నవలలో మాలలను కేంద్రంగా చేసుకొని, సాయుధ పోరాటం , మార్క్సిజాన్ని దళిత సమస్యకు పరిష్కారంగా చూపారు. 'అద్దంలో చందమామ' దళితుల భూమి సమస్యను చిత్రిస్తే, 'పంచమం' నవల కమ్యూనిజం, అంబేద్కర్ భావజాలాల్లో దళితులు దేన్ని ఆచరించాలో విమర్శనాత్మకంగా చర్చించింది. ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు 'మాదిగ కొలుపు' పేరుతో 2022 సంవత్సరంలో ఈ నవలను రాశారు.

మాదిగ కొలుపు నవల వస్తువు:

భారతీయ గ్రామీణ సమాజాల్లో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తెలుగు సమాజాల్లో అస్పృశ్యులుగా, నిమ్న కులస్తులుగా పరిగణించబడే వారికి (మాదిగలకు) , అగ్రవర్ణాలుగా వ్యవహరించే ఆధిపత్య వర్గాల వారికి మధ్య గల పరస్పర అవసరాలను, వాటిలో సందర్భోచితంగా బహిర్గతమయ్యే సంఘర్షణలను, సామాజిక అంతస్తుల తీరుతెన్నులను, సాంస్కృతిక వారసత్వాలను వివరించడమే దీనిలోని ప్రధానమైన వస్తువు.తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం దగ్గర్లోని ఒక గ్రామం 'మర్లపోలు'. ఆ గ్రామంలో సాధారణంగా అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఊరు బాగుండాలని ఐదు రోజుల పాటు 'అంకమ్మ జాతర' జరపడం ఆచారం. దాన్ని పర్యవేక్షించేవాళ్ళు ఆ ఊరి సర్పంచ్, భూస్వాములు , కొందరు పెద్దలు. ఆ జాతరలో భాగంగా అంకమ్మకు కొలుపులు చేస్తారు. అంటే ఆ ఐదు రోజుల్లో చివరిరోజు కొలువుల్లో ఒక దున్నను బలిస్తారు. ఆ దున్నను ఊరి మాదిగలే బలివ్వాలి. ఆ సందర్భంలో మాదిగల్లోని ఉపకులాలకు చెందిన కొమ్ములవాళ్ళు, బైండ్ల, డక్కలివారు అమ్మవారి కథ చెప్పడం, డప్పులు మ్రోగించడం, కొలువుల్లో చేసే ఇతర పనులు చేయడం వంటివన్నీ చేస్తారు. అలా చేసినందుకు గ్రామ పెత్తందారులు ఆ మాదిగలకు కొన్ని బస్తాల జొన్నలు, ఐదు వందల రూపాయలు ఇస్తారు.

ఒకసారి అలా మాదిగలకు ఇవ్వవలసినవి ఇవ్వకపోగా, ఆ ఊరి పెత్తందారుల్లో రెడ్లు, తెలగాలు మాదిగలను కొడతారు. అందువల్ల వాళ్ళు కొలుపులు చేయడానికి రాకపోతే, ఏదోలా నచ్చచెప్పి వాళ్ళను తీసుకొచ్చే బాధ్యతను పెత్తందారులు ఆ గ్రామం పెద్దమాదిగ 'హనుమంతు' మీద పెడతారు. మొత్తం మీద తగిన హామీ తీసుకొని ఆ కొమ్ములవాళ్ళను తీసుకొస్తాడు హనుమంతు. కొలువులు మొదలవుతాయి.

దున్నను అమ్మవారికి బలిచ్చి, ఆ రక్తాన్ని తడిపిన అన్నాన్ని తమతమ గ్రామాల్లోను, పొలాల్లోను చల్లుకుంటే ఎలాంటి అంటురోగాలు రావనీ, పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. ఆ సందర్భం కూడా వస్తుంది. ఊరి వాళ్ళంతా గుడి దగ్గరకు రావడం, పెద్దావిడ, వాళ్ళ కుటుంబ సభ్యులు కొలుపు నిర్వహించడానికి వస్తారు. హనుమంతుకి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఒకడికి పెళ్ళైంది. రెండోవాడు కోటేశ్వరరావు డిగ్రీ చదువుతుంటాడు. వాళ్ళకిష్టం లేకపోయినా తండ్రికి సహాయంగా వెళ్తారు. దున్నను నరికి బలిచ్చేటప్పుడు ఒక సంప్రదాయం ఉంది; ఒకే వేటుకు దున్న తల తెగిపడాలి. అలా నరకడంలో హనుమంతు నిష్ణాతుడు. పెద్ద కత్తితో నరికేటప్పుడు ఒకరు దున్న మెడను గట్టిగా సాగదీసి పట్టుకుంటారు. పెదకాపు వేమిరెడ్డి నారాయణ కొడుకు వీరయ్య ఆ పలుపు పట్టుకుంటాడు. ఇంక హనుమంతు కత్తి పైకెత్తి నరుకుతుండగా దున్నను పట్టుకున్న వీరయ్య కాలునెవరో తొక్కుతారు. దానితో తాడు లూజై, దున్న మెడ కదలడంతో ఒక్క వేటుకి దాని మెడ తెగిపడదు.

వెంటనే అక్కడ పొన్నుకర్రలతో నిలబడి చూస్తున్న గ్రామ పెత్తందారు తల్లరెడ్డి పెద్ద కోటయ్య "మాదిగనా కొడకా కత్తినొదిలేత్తావురా" అని తిడుతూ పొన్నుకర్రతో హనుమంతుని కొడతాడు. ఆ సంఘటనకు తన తండ్రిని కాపాడుకోవడానికి తన బలమైన ఇద్దరు కొడుకుల్లో కాటయ్య అడ్డొస్తే రెండో దెబ్బ అతనిపై పడుతుంది. వెంటనే రెండో కొడుకు కోటేశ్వరరావు వచ్చి తండ్రిని కాపాడుకొని, వాళ్ళపై తిరగబడి, తాము కొలుపు చేయమని వచ్చేస్తారు. డప్పులు కొట్టడం ఆపేస్తారు. కొలువులు చేయడానికి వచ్చిన బైండ్ల, కొమ్ముల వాళ్ళు కూడా తాము ఆ పని చేయడం కుదరదని హనుమంతుతో కలిసి వెళ్ళిపోతారు.అర్థాంతరంగా అలా కొలుపులు ఆగిపోవడం గ్రామానికి అనర్థమనీ, అలా సగంలో వాళ్ళు వెళ్ళిపోవడానికి పెత్తందారులు చేసిన తప్పువల్లేనని ఊరు వాళ్ళంతా అనుకుంటారు. అందువల్ల మరలా గ్రామ సర్పంచ్, పెద్దలు, కొట్టిన పెత్తందారు కోటయ్య అంతా కలిసి మాదిగ పెద్ద హనుమంతు ఇంటికెళ్ళి, తమ తప్పు ఒప్పుకొని బ్రతిమలాడి తీసుకొస్తారు. కొలువులు పూర్తి చేయిస్తారు.కొలువులు పూర్తయినా, జరిగిన సంఘటన వల్ల హనుమంతు, వాళ్ళ పిల్లలు, యావత్తూ ఆ కులస్తులపై కక్షపెట్టుకుంటారు. కానీ కోటయ్య ఇంటిలో పెరుగుతున్న అన్నపూర్ణ తన మేనమామలనే తప్పుపడుతుంది. అన్నపూర్ణ, హనుమంతు కొడుకు కోటేశ్వరరావు ఖమ్మంలో ఒక కాలేజీలో చదువుకుంటున్నారు. అన్నపూర్ణ అభ్యుదయ భావాలు గల యువతి. కోటేశ్వరరావుని అభిమానిస్తుంది. కోటేశ్వరరావు ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఎస్సీ పూర్తి చేసి, పిహెచ్.డి చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటాడు. అతణ్ణి కలెక్టర్ కావాలని ఆమె ప్రోత్సహిస్తుంది. తర్వాత అన్నపూర్ణ టీచర్ ట్రైనింగ్ చేస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది.

ఈలోగా ఊరిలో సారా పాపయ్య ప్రభుత్వం దగ్గర లైసెన్స్ తెచ్చుకొని రెండవ సారా కొట్టుకూడా పెడతాడు. అతని కొడుకు ఓబులు నాయుడు అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు. అతనికి పెళ్ళి చేసుకోవడానికి పిల్లలు కూడా దొరకరు. ఊరిలో చాలామంది ఆడవాళ్ళను, పొలం పనికి వచ్చిన వాళ్ళను తనకున్న డబ్బుతో వశపరుచుకుంటుంటాడు. ఒకసారి హనుమంతు వాళ్ళ కుటుంబానికి చెందిన ఒకామెపై సారా పాపయ్య అత్యాచారం చేయబోయాడు. కానీ ఆమె తప్పించుకొని వచ్చి తన భర్తకు, ఇంట్లో అందరికీ చెప్తుంది. అయితే పోలీస్ కేసు పెడితే మరలా తమ మీదే ఏదో ఒక కేసు పెడతారని తెలిసి, పగతీర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. మాదిగ యువకుడు ఒక అగ్రవర్ణానికి చెందిన వాళ్ళ ఇంటిదగ్గర పాలేరుగా చేరగా, ఆ పాలేరు మీద యజమాని భార్య మోజుపడి కొన్నాళ్ళు లేచిపోతారు. ఆ విషయాన్ని దాచిపెట్టి, తన భర్త ఊరికి వెళ్ళిందని ఆ యజమాని అందరికీ చెప్తాడు. కొన్నాళ్ల తర్వాత మరలా వాళ్ళిద్దరూ తిరిగి వస్తారు. ఏమీ జరగనట్లుగానే భర్త ఆమెతో కాపురం చేసుకుంటూ ఉంటాడు. మరొక వైపు మాదిగ యువతి మాత్రం తన భర్త ఇంకొక ఆమెతో లేచిపోవడాన్ని సహించలేక అతనితో కలవడానికి ఇష్టపడదు. కేవలం భార్యగా మాత్రమే ఉంటానంటుంది. అలా కొన్నాళ్ళ తర్వాత తన భార్యతో లేచిపోయిన ఆ పాలేరుని అగ్రవర్ణానికి చెందినవాళ్ళు మందు పెట్టి చంపేస్తారు. ఆ మాదిగామె వయసులో ఉంటుంది, అందమైనది. మరలా వివాహం చేసుకోకుండా ఆమె అలాగే ఉండిపోతుంది. ఆమెపై ఓబులు నాయుడు కన్ను పడుతుంది. ఆ అవకాశాన్ని హనుమంతు కొడుకులు, మాదిగ యువకులు ఉపయోగించుకుని రెడ్ హ్యాండెడ్ గా ఓబులు నాయుడుని పట్టుకునేలా చేస్తారు. అతన్ని యువకులు గట్టిగా కొడతారు. ఆమె తాను అందరిలాంటి ఆడదాన్ని కాదనీ, తనకు నీతి నిజాయితీ ఉన్నాయని చెప్తుంది. దానితో అతను మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. తర్వాత కొన్నాళ్లకు కోటేశ్వరరావు తమ్ముడు కాటయ్య చనిపోతాడు. కారణం ఓబులు నాయుడు, రెడ్డి కోటయ్య కొడుకులు కక్షకట్టి తన సారా కొట్టులోనే నల్లమందు కలిపి విషం పెట్టి చంపేయడమే.ఈ విషయాలన్నీ పట్టణంలో చదువుకుంటున్న కోటేశ్వరరావుకు తెలుస్తాయి. కోటేశ్వరరావు ఊరికి వచ్చిన తర్వాత అన్నపూర్ణతో సహా వెళ్ళి నిందితులపై పోలీస్ కేసు పెడతారు. ఆ కేసు నడుస్తూ ఉంటుంది. అన్నపూర్ణ కోటేశ్వరరావుని తనను పెళ్లి చేసుకోమని అడగగా, అతను అన్నీ చర్చించిన తర్వాత ఒప్పుకుంటాడు. ఈలోగా కోటేశ్వరరావు డిప్యూటీ కలెక్టర్ గా ఎంపిక అవుతాడు. ఇద్దరూ ఊరికి వచ్చి ఆ ఊరి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఊరేగుతారు. డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైన కోటేశ్వరరావుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పెద్ద సన్మానం చేస్తారు. ఆ సన్మానం తాను చిన్నప్పుడు చదువుకున్న ప్రాథమిక పాఠశాలలోనే జరుగుతుంది. తనకు సహకరించిన వారందరికీ కోటేశ్వరరావు కృతజ్ఞతలు చెప్తాడు. అప్పటికి రిజర్వేషన్ కోటాలో హనుమంతు ఆ గ్రామానికి ప్రెసిడెంట్ అవుతాడు.

మరలా మా ఊరిలో మామూలు కొలుపు జరిగినప్పుడు తన కొడుకుని అధికారికంగా తీసుకొచ్చి అంకమ్మ గుడి దగ్గర పూజ చేయించి ఒక ప్రెసిడెంట్ గా ఉన్నతమైన హోదాలో ఆత్మగౌరవంతో అందరితోపాటు హనుమంతు కూర్చుంటాడు. ఈలోగా సాక్షాలన్నీ సేకరించిన పోలీసులు న్యాయస్థానంలో సమర్పిస్తారు. హనుమంతు కుమారుడు కాటయ్యను చంపిన ఓబులేసు నాయుడుకు , కోటయ్య కొడుకులకు శిక్ష పడడంతో నవల ముగుస్తుంది.

నవలా విశేషాలు:

ఉన్నవ లక్ష్మీనారాయణ గారు 'మాలపల్లి' పేరుతో నవల రాసిన సరిగ్గా వంద సంవత్సరాల తర్వాత ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు 'మాదిగ కొలుపు' నవలను రాశారు. ఉన్నవ వారు మాలలను, వారి సాంస్కృతిక అంశాలను కేంద్రంగా చేసుకొని నవల రాస్తే, సుబ్బాచారి గారు మాదిగలను, మాదిగ ఉపకులాల సాంస్కృతికతను కేంద్రంగా చేసుకొని ఈ నవల రాశారు. ఈ నవల రాయాలంటే కేవలం సృజనాత్మక శక్తి ఉంటే సరిపోదు, దాని వెనుక ఎంతో పరిశోధన ఉంది. ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు తన జీవితాంతం జానపద విజ్ఞానం, కులవృత్తులు, ముఖ్యంగా మాదిగల సాంస్కృతిక జీవనంతో ముడిపడిన అనేక పరిశోధనలు చేశారు. ఆ పరిశోధన ఫలితాలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా సృజనానుభవంగా మార్చి నవలగా అందించడంలో ఆయన నూటికి నూరుపాళ్ళు విజయవంతమయ్యారు.

ఈ నవలను చదవడం ద్వారా రెండు రకాల అధ్యయన అనుభవాలను పొందవచ్చు.

 భారతీయ సమాజ నిర్మాణం, దళితులు, దళితుల్లో మాదిగలు, మాదిగ ఉప కులాలు, వారి సాంస్కృతిక నిర్మాణాన్ని ఒక పరిశోధకుడిగా అధ్యయనం చేసిన వారు దీన్ని చదివితే కార్యకారణ సంబంధాలు, శాస్త్రీయతలతో కూడిన శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు.

 ఈ నవలలోని వస్తువును తమ జీవితంలో ప్రత్యక్షంగా అనుభవించిన సామాన్యులు దీన్ని చదివినప్పుడు తమ జీవితమే ఇందులో ఉందని భావిస్తారు. ఇందులో కేవలం అనుభవం మాత్రమే ఉంటుంది.

ఈ నవలలో రచయిత చక్కని తెలుగు భాషను తన నవలా కథనానికి ఉపయోగించారు. మరుగున పడిపోతున్న అనేక తెలుగు భాషా పదాలను సహజంగా ప్రయోగించి భాషా సంపదను పరిరక్షించారు. అస్తిత్వ ఉద్యమాలు ఇంత పతాక స్థాయిలో ఉన్న తరుణంలో, ఇతరుల బాధలను తన బాధగా ఆత్మీకరించుకొని రాయడానికి రచయిత చేసిన ప్రయత్నం ఒక సాహసంగా భావించాలి. ఒక కులం లేదా వృత్తి సమాజానికి ఎంత అవసరమో, ఇతర కులాల వారి అవసరం కూడా అంతే ఉంటుందని చెప్పడానికి గ్రామీణ జీవనంలో 'కొలుపులు'కున్న ప్రాధాన్యాన్ని వస్తువుగా స్వీకరించడం రచయిత సమయస్ఫూర్తికి నిదర్శనం.

సమాజంలో ఆచార సంప్రదాయాల పయనం, శాస్త్రిపైన ఆధారపడిన పయనం అనే రెండు భిన్న దృక్పథాలు రైలు పట్టాల మాదిరిగా సమాంతరంగా పయనిస్తుంటాయి. విద్యావంతులు కూడా కొన్ని అంశాలతో రాజీపడక తప్పదని, అయినంత మాత్రాన ఆ మూఢనమ్మకాలను పూర్తిగా అనుసరిస్తున్నట్లు కాదనే సూత్రాన్ని ఈ నవల శక్తివంతంగా నిరూపించింది. ఈ నవల్లో సాధారణంగా ఉపయోగించే ఫ్లాష్‌బ్యాక్ వంటి శిల్పాలు కాకుండా, వస్తువును బట్టి శిల్పాన్ని రూపొందించుకుంటూ రూపం కంటే సారానికే అధిక ప్రాధాన్యం ఇవ్వడం రచయిత విశేష దృక్పథాన్ని తెలియజేస్తుంది.గ్రామీణ సమాజంలోని వర్గ, కుల సంబంధాల సంక్లిష్టతను 'మాదిగ కొలుపు' నవల అత్యంత వాస్తవికంగా ఆవిష్కరిస్తుంది. ముఖ్యంగా, అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణులు, పెత్తందారీ పోకడలు మాదిగల ఆత్మగౌరవాన్ని ఏ విధంగా దెబ్బతీస్తాయో ఈ నవలు స్పష్టంగా కళ్లకు కడుతుంది. జాతరలు, సాంప్రదాయాల పేరుతో శ్రమదోపిడీకి గురిచేసే వర్గాలు, ఆచారాల ముసుగులో తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూసే విధానాన్ని రచయిత ఈ నవలలో కళ్ళకు కట్టినట్లు చూపారు. ఒక్క వేటుతో దున్న తల తెగలేదన్న సాకుతో, గ్రామ పెత్తందారు కోటయ్య మాదిగ పెద్ద హనుమంతుని కర్రతో కొట్టడం వంటి సంఘటనలు అగ్రవర్ణాల అహంకారానికి, నిమ్న కులాలపై వారికున్న చిన్నచూపుకు ప్రతీకగా నిలుస్తాయి. ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని సహించలేక, భౌతిక దాడికి దిగడం ద్వారా తమ వర్గ ఆధిపత్యాన్ని శాశ్వతం చేయాలని చూసే సామాజిక రుగ్మతను ఈ నవల నిశితంగా విశ్లేషిస్తుంది. అయితే, ఈ ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా మాదిగలు తిరగబడటం, కొలుపులను బహిష్కరించడం, చదువు, చట్టపరమైన మార్గాల ద్వారా తమ హక్కుల కోసం పోరాడటం వంటి పరిణామాలు మారుతున్న కాలంలో వస్తున్న చైతన్యానికి, ఆత్మగౌరవ పోరాటాలకు అద్దం పడుతాయి.

ఈ నవలలో కులాంతర వివాహాల గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇవి కేవలం వ్యక్తిగతంగా మాదిగ – అగ్రవర్ణాల మధ్య జరుగుతున్న వాటికి సంబంధించినవి మాత్రమే కాకుండా, సమాజంలో పేరుకుపోయిన కుల అడ్డంకులను బద్దలు కొట్టే బలమైన సామాజిక పరిణామాలుగా ఆవిష్కరించే ప్రయత్నంగా అర్థం చేసుకోవాలి. అగ్రవర్ణాల ఆధిపత్యం, పాతకాలపు కట్టుబాట్లు బలంగా వేళ్లూనుకున్న గ్రామీణ వాతావరణంలో చదువుకున్న యువత తీసుకునే ఇటువంటి నిర్ణయాలు సాంప్రదాయక భావజాలానికి గట్టి సవాల్ విసురుతాయి. అభ్యుదయ భావాలు గల అన్నపూర్ణ, కోటేశ్వరరావును కేవలం వ్యక్తిగతంగా ప్రేమించడమే కాకుండా, అతనిని ఒక ఉన్నతమైన కలెక్టర్ స్థాయికి చేర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ తర్వాత, గ్రామంలోని సంప్రదాయ పద్ధతిలోనే ఇద్దరూ పెళ్లి చేసుకొని ఊరేగడం ద్వారా, నిమ్న కులాల నుండి ఎదిగిన యువతకు సమాజంలో దక్కాల్సిన గౌరవాన్ని, గుర్తింపును తమ వివాహం ద్వారా సముచితంగా పునరుద్ఘాటించారు. ఇది ఆత్మగౌరవాన్ని కలగనడంగానే భావించాలి.

ఈ తరహా కులాంతర వివాహాలు సమాజంలో సమూల మార్పులకు, భావజాల సంఘర్షణలకు అద్దం పడతాయి. ఒకప్పుడు పెత్తందారులు, అగ్రవర్ణాల గుప్పెట్లో అణగారిపోయిన మాదిగ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై, అదే ఊరిలో ఘనమైన సన్మానాలు అందుకోవడం, రిజర్వేషన్ కోటాలో హనుమంతు గ్రామ ప్రెసిడెంట్ పీఠాన్ని అధిరోహించడం కేవలం రాజకీయ అధికార మార్పు మాత్రమే కాదు; అది ఆత్మగౌరవ పోరాటాల ఫలితంగా సామాజిక నిర్మాణంలో వచ్చిన పెద్ద ఎత్తున మార్పు. కులాల సరిహద్దులను చెరిపేస్తూ, విద్యా విజ్ఞానాల ద్వారా వచ్చిన చైతన్యం సమాజాన్ని కొత్త దిశగా నడిపిస్తుందనడానికి, పాత రుగ్మతలను అధిగమించి ప్రజాస్వామ్య విలువలు ఎలా బలపడుతున్నాయో చెప్పడానికి ఈ నవలా పరిణామాలు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి.తెలుగు దళిత సాహిత్య చరిత్రలో ఒక అత్యంత విషాదకరమైన, చైతన్యవంతమైన మైలురాయి 'కంచికచర్ల కోటేశు' హత్యోదంతం. 1968 ఫిబ్రవరి 24న కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామంలో అరుకుట్ల కోటేశు అనే దళిత యువకుడిని అగ్రకులాలవారు సజీవదహనం చేసిన ఒక దారుణమైన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చారిత్రక పరంగా చూస్తే, కంచికచర్ల కోటేశు సంఘటనలో అగ్రవర్ణాల వారు ఆయనపై 'ఇత్తడి చెంబు దొంగతనం చేశాడనే' నెపాన్ని మోపారు. ఆ బూటకపు దొంగతనం ఆరోపణను అడ్డం పెట్టుకుని, ఆ యువకుడిని చేతులు కట్టేసి, ఒంటిపై కిరోసిన్ పోసి సజీవదహనం చేశారు. అయితే, సమాజంలో అణగారిన వర్గాలపై జరిగే దాడులు, హత్యల వెనుక కేవలం బహిరంగంగా చెప్పే చిన్నపాటి కారణాలు మాత్రమే ఉండవని, వాటికి లోలోపల ఉన్న సామాజిక, లైంగిక సంబంధాల ఘర్షణలు లేదా కుల దురహంకారపు నిగూఢ కారణాలు బలమైన నేపథ్యంగా ఉంటాయని ప్రజల్లో లోతుగా చర్చించుకుంటూ ఉంటారు.

 'మాదిగ కొలుపు' నవలలోని సంఘటనలను పరిశీలిస్తే, రచయిత పులికొండ సుబ్బాచారి గారు ఈ చారిత్రక కోటేశు ఉదంతం తాలూకు స్పూర్తిని, ధ్వనిని నవలలో అత్యంత శక్తివంతంగా ఇమిడ్చారనిపిస్తుంది. నవలలో హనుమంతు చిన్న కొడుకు కాటయ్యను, ఓబులు నాయుడు, రెడ్డి కోటయ్య కుమారులు కక్షకట్టి సారా కొట్టులో నల్లమందు కలిపి విషం పెట్టి హత్య చేయడం, నాటి కంచికచర్ల కోటేశు హత్యను పాఠకులకు గుర్తుకు తెస్తుంది. కుల అహంకారానికి ఎదురునిలిచిన లేదా ఎదుగుతున్న నిమ్న కులాల యువకుల ప్రాణాలను అగ్రవర్ణ పెత్తందారులు ఏవిధంగా బలిగొంటారో చెప్పడానికి ఈ రెండు ఘటనలు ప్రతీకగా నిలుస్తాయి. కంచికచర్ల ఘటన ఎలాగైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దళితులను సంఘటితం చేసిందో, నవలలో కాటయ్య హత్య, హనుమంతు కుటుంబం చేసే పోరాటం మాదిగలలో ఒక కొత్త ఆత్మగౌరవ చైతన్యాన్ని తీసుకువస్తుంది. అణచివేతకు గురైన శ్రామిక వర్గాల శోకం, అగ్రవర్ణాల క్రూరమైన కుల దురహంకారం ఎప్పుడూ ఒకే కోణంలో సాగుతాయనడానికి ఈ నవలా చిత్రణ ఒక సజీవ దర్పణం. చారిత్రక సంచలనం సృష్టించిన కంచికచర్ల కోటేశు హత్యోదంతాన్ని, దాని వెనుక ఉన్న సామాజిక-లైంగిక సంఘర్షణల నేపథ్యాన్ని రచయిత పులికొండ సుబ్బాచారి గారు 'మాదిగ కొలుపు' నవలలో ఒక నిర్దిష్టమైన ఉదంతానికి మాత్రమే పరిమితం చేయకుండా, గ్రామీణ కుల వ్యవస్థలోని అంతర్గత హింసకు ప్రతీకగా అత్యంత సహజంగా సాధారణీకరించారు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ధిక్కరించే నిమ్న కులాల యువకులపై కక్షకట్టి, వారిపై అక్రమ సంబంధాల ముసుగులోనో లేక బూటకపు కారణాలతోనో దాడులు చేయడం, అంతిమంగా ప్రాణాలు తీయడం అనే అమానుషత్వాన్ని నవలలోని కాటయ్య హత్య ద్వారా రచయిత కళ్లకు కట్టినట్లువర్ణించారు.

అగ్రవర్ణ స్త్రీతో లేచిపోయిన తన భర్తను క్షమించి కాపురం చేయడానికి నిరాకరించిన మాదిగ యువతి పాత్ర చిత్రణ ద్వారా, నిమ్న కులాల (కింది వర్ణాల) స్త్రీల యొక్క అసాధారణ ఆత్మగౌరవాన్ని, నైతిక దృఢత్వాన్ని రచయిత అత్యంత ఉన్నతంగా ఆవిష్కరించారు. సమాజంలో సాధారణంగా ఆర్థికంగా లేదా సామాజికంగా అణగారిన వర్గాల మహిళలు తమ జీవితంలో ఎంతటి మోసాన్ని ఎదుర్కొన్నా, కుటుంబ పరువు లేదా భయంతో సర్దుకుపోవాలని సమాజం ఆశిస్తుంది. కానీ ఈ నవలలోని మాదిగ యువతి ఆ సాంప్రదాయక బలహీనతకు తలవంచదు. తన భర్త వేరొకరితో సంబంధం పెట్టుకుని వెళ్ళిపోవడాన్ని ఆమె తీవ్రమైన ద్రోహంగా భావిస్తుంది. అతను తిరిగి వచ్చినా, తన భర్తగా అంగీకరించేది లేదని, కేవలం చట్టపరమైన భార్యగా మాత్రమే ఉండిపోతానని తెగేసి చెప్పడం ఆమెలోని గట్టి ఆత్మగౌరవానికి, రాజీపడని తత్వానికి నిదర్శనం. ఈ పాత్ర ద్వారా కింది వర్ణాల స్త్రీలు కేవలం బాధితులుగా మాత్రమే ఉండరనీ, వారికి సొంతమైన నైతిక స్పష్టత, వ్యక్తిగత విలువలు, దేనినీ గుడ్డిగా అంగీకరించని ధిక్కార స్వభావం ఉంటాయని రచయిత బలంగా చాటిచెప్పారు. అగ్రవర్ణాల ఆధిపత్య పోకడలు, పురుషాధిక్య ధోరణులు శ్రామిక వర్గాల జీవితాలను కదిలించినప్పటికీ, ఆ వర్గాల మహిళల అంతర్గత మనోైధైర్యం, ఆత్మగౌరవం ఎంత చెక్కుచెదరనివిగా ఉంటాయో ఈ పాత్ర రూపంలో రచయిత ఎంతో ఔచిత్యంతో చిత్రీకరించారు.

నేటి సమాజంలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ దళితులు ఉన్నత ఉద్యోగాలు సాధించడం కష్టతరంగా ఉంటుందనేది వాస్తవమే అయినప్పటికీ, అసాధ్యాలను సుసాధ్యం చేసే చైతన్య కేంద్రాలుగా విద్య మారాలనే ఒక బలమైన సామాజిక సందేశాన్ని రచయిత ఈ ముగింపు ద్వారా ఇదమిత్థంగా చెప్పదలుచుకున్నారు. గ్రామంలో అణచివేతకు గురైన ఒక మాదిగ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు కష్టపడి చదివి డిప్యూటీ కలెక్టర్ కావడమూ, అగ్రవర్ణ పెత్తందారీ కుటుంబానికి చెందిన అభ్యుదయ భావాలున్న యువతి అతనిని ప్రేమించి వివాహం చేసుకోవడమూ అనేది కేవలం కాల్పనిక సంతోషం కోసం సృష్టించినదనుకోకూడదు. ఇది సమాజంలో పాత కుల వ్యవస్థ బీటలువారుతోందనడానికి, చదువు ద్వారా మాత్రమే ఆత్మగౌరవం, అధికార మార్పిడి సాధ్యమవుతాయనడానికి ఒక ప్రతీక. అదే గ్రామంలో, తాను చిన్నప్పుడు అవమానాలు ఎదుర్కొన్న చోటే జిల్లా కలెక్టర్ చేత ఘన సన్మానం పొందడం, తండ్రి హనుమంతు రిజర్వేషన్ కోటాలో గ్రామ ప్రెసిడెంట్ పీఠాన్ని అధిరోహించి ఆత్మగౌరవంతో అందరితో పాటు సమానంగా కూర్చోవడం వంటి పరిణామాలు కేవలం ఒక సినిమాటిక్ హ్యాపీ ఎండింగ్ కాదు; అది దళిత ఉద్యమాలు సాధించవలసి ఉన్న రాజకీయ, సామాజిక విజయాల తాలూకు అత్యున్నత స్వప్నం. అందువల్ల, ఈ నవలా ముగింపును కేవలం ఒక కట్టుకథలా కాకుండా, రాబోయే సమాజం ఎలా ఉండాలనే ఒక అభ్యుదయ ఆశయానికి, అంబేద్కర్ ఆశించిన సమసమాజ నిర్మాణానికి ప్రతీకగా రచయిత చెప్పవచ్చు.