‘‘ నేను ఛందోబద్ధ కవిత్వాన్ని, స్వచ్ఛందంగా సాగిన వచన కవిత్వాన్ని కూడా ఆహ్వానిస్తాను. నిజానికి కవిత్వం అనేది విషయ ప్రధానంగానే ఉంటుంది తప్ప రూప ప్రధానంగా వుండదు. గుణానికి నేను ప్రాధాన్యం ఇస్తాను. శ్రీ జాన్ గారి కవిత్వం గుణభూయిష్ఠంగా వుంటుంది. మాధుర్య గుణం వీరి మనసులో, మాటలో పొంగులెత్తుతూ ఉంటుంది. కవికి ప్రధానంగా కావల్సిన ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలు శ్రీ జాన్ గారిలో పుష్కలంగా వున్నాయి.’
అని మల్లవరపు జాన్ కవిగారి ‘‘అతుకుల బ్రతుకులు’’ కావ్యానికి 1981లో ప్రముఖ కవి దాశరథి రాసిన మాటలివి. అటువంటిమల్లవరపు జాన్ కవి గారి శతజయంతి ఉత్సవాలు ఏడాది నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ వారు, జానుడి సంస్థతో కలిసి ఒంగోలులో ఒకరోజు (12 జూలై 2026) సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ, తెలుగు సలహా మండలి కన్వీనర్ ఆచార్య సి.మృణాళిని పాల్గొని శత జయంతి ఉత్సవాలను ప్రారంభించారు.
మాట్లాలాడుతున్న సాహిత్య అకాడమీ, తెలుగు సలహా మండలి కన్వీనర్ ఆచార్య సి.మృణాళిని. వేదికపై డాక్టర్ జవహర్, ఆచార్య కోయి కోటేశ్వరరావు, మల్లవరపు ప్రభాకర రావు, డా.నూకతోటి రవికుమార్జాన్ కవిగారి పద్యశిల్పాన్ని డా. సి.నారాయణరెడ్డి ప్రస్తుతించేవారన్నారు. చమత్కారం, వ్యంగ్యం, తెలుగు పలుకుబడులతో చక్కని సంభాషణాత్మక, హేతుబద్ధ శైలిలో పద్యం రాసిన జాన్ కవి పద్యకవులకు సరికొత్త స్ఫూర్తినిచ్చారన్నారు. జాన్ కవి శతజయంతి సభను కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశ్యం జాన్ కవి గారి రచనల్లో సామాజికతను, సర్వకాలీనతను సమకాలీనతను, పునర్మూల్యాంకనం చేయడమేనన్నారు. జానుడి కన్వీనర్ డా.నూకతోటి రవికుమార్ ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రముఖ కవి, విమర్శకులు ఆచార్య కోయి కోటేశ్వరరావు కీలకోపన్యాసం చేశారు.
మల్లవరపు సాహిత్య భారతి అధ్యక్షులు డా.జవహర్, ప్రముఖ నాటకకర్త పాటిబండ్ల ఆనందరావు, ప్రముఖ కవి బీరం సుందరరావు, ఆచార్య విస్తాలి శంకరరావు, డా.వై.విజయానందరాజు, కవి కోట్ల వేంకటేశ్వర రెడ్డి, ఆచార్య కప్పగంతుల మధుసూదన్ , సాహిత్య అకాడమీ ప్రతినిథి చంద్రశేఖర్ లతో పాటు మల్లవరపు జాన్ కవి గారి మనవలు, కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమీషనర్లు మల్లవరపు సుధాకర రావు, మల్లవరపు ప్రభాకరరావు, మనకాలం మాస పత్రిక సంపాదకులు కత్తి కళ్యాణ్, డా.కోలాశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను మల్లవరపు జాన్ కవి గారి కవిత్వ శిల్పం గురించి మాట్లాడాను. అకాడమీ నిర్వహించిన కార్యక్రమం తో పాటు దానికి కొనసాగింపుగా సాయంత్రం అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారు.
మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
తెలుగు సాహిత్య చరిత్రలో మల్లవరపు కవులు అనే ఒక అధ్యాయాన్ని కేటాయించదగినంత కృషిచేసిన వారీ కవులు. మల్లవరపు జాన్ కవి, రాజేశ్వరరావు, ప్రభాకరరావు, సుధాకరరావు, రాజీవ్ తెలుగు సాహిత్యంలో విశేషమైన సేవచేసిన వారికి ప్రతియేడాది మల్లరపు జాన్ కవిగారి స్మృత్యర్థం ఒక పురస్కారాన్ని ఇస్తున్నారు. ఈ పురస్కారాన్ని 2016 నుండి ప్రారంభించారు. తొలిపురస్కారాన్ని నాకు అందించారు. అది నాకు లభించిన గొప్పగౌరవంగా భావిస్తున్నాను.
మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
జాను కవి గారు 22 జనవరి 1927లో జన్మించారు. మల్లవరపు దావీదు, శ్రీమతి రత్నమ్మ గార్లు వీరి తల్లి తండ్రులు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని చీమకుర్తివీరి జన్మ స్థలం. వీరి కుటుంబానికో ప్రత్యేకత ఉంది. వీరి కుమారుడు రాజేశ్వరరావు, కుమార్తె కోటి రత్నమ్మ, మనవడు ప్రభాకరరావులు మంచి కవులు. ఒక మనవడు మంచి చిత్రకారుడు. జాను కవి గారు 12 ఆగష్టు 2006 న మరణించారు. ఆయన కవిత్వం రాశారు. ఆ కవిత్వాన్ని ఛందోబద్ద పద్యంలో రాశారు. సాంసన్ - డెలీలా నాటకం రాశారు. అది క్రైస్తవ సాహిత్యేతివృత్తం. అందులోనూ కొన్ని పద్యాలున్నాయి. ‘సజ్జనాను రక్తిజాను సూక్తి’ మకుటంతో ఒక సూక్తి శతకం రాశారు. అది అనేక భావాల సంగమం. రేడియోలో సమస్యపూరణం పేరుతో వారం వారం ప్రసారమైన కార్యక్రమంలో అనేక సమస్యలకు పద్యపూరణ చేశారు.
మాట్లాడుతున్న ఆచార్య విస్తాలి శంకరరావు
తన కృతులను ప్రచురించినవారినీ, ప్రచురించడానికి సహకరించినవారినీ, తన రచనలపై స్పందించినవారినీ అభినందిస్తూ పద్యాలు రాశారు. కవిత్వంలో తనకిష్టమైన ప్రాచీనాధునిక కవులనూ, కావ్యాలనూ స్పర్శించారు. మాతృభాషపై, మాతృభూమిపై అభిమానాన్ని కురిపించారు. వీటిని పరిశీలించినప్పుడు జాన్ కవి భిన్న వస్తువులను తీసుకొని కవిత్వం రాశారని తెలుస్తుంది. కవి భిన్న వస్తువులను తీసుకోవడం వల్ల మాధుర్యం వస్తుందా? తీసుకున్న వస్తువులను కవిత్వీకరించడంలో మాధుర్యం వ్యక్తమవుతుందా? అనే ప్రశ్న ప్రతి కవి గురించీ, ప్రతి రచన గురించీ వేసుకోవలసి వస్తుంది. ఈ ప్రశ్నకు వచ్చిన సమాధానాల సమాహారం నుండే కవిత్వ స్థాయి తెలుస్తుంది. కవి వచ్చిన సమాజం నుండి కూడా కవిత్వ స్థాయిని చూడాలి. కవిత్వ మాధుర్యాన్ని గుర్తించాలి. అందుకేనేమో కరుణశ్రీ ..
‘’పనస తొనలకన్న పాల మీగడకన్న
మధువుకన్న ముగ్ధ వధువు కన్న
మల్లవరపు కవిత మధురాతి మధురమ్ము
“జాను” తెనుగు మేలి “జాను తెనుగు" అని జాన్ కవిగారిని ప్రశంసించారు. జాన్ కవి అప్పకవి నిర్ణయాన్ని ఖండించడంతోనే ఆగిపోలేదు. మహాకవి జాషువా కవిత్వంతో కలిసి పయనించారు. కవిత్వం రాయడానికి కులం అడ్డంకి కాదని నిరూపించిన జాషువాని ప్రశంసించారు.
ఆచార్య సి.మృణాళినిగారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతినిథి చంద్రశేఖర్ తదితరులుదార్ల వెంకటేశ్వరరావు, మల్లవరపు రాజేశ్వరరావుగారి భార్య, కోయి కోటేశ్వరరావు
మల్లవరపు రాజేశ్వరరావు గారి భార్య, ప్రభాకరరావు, దార్ల వెంకటేశ్వరరావు
మల్లవరపు ప్రభాకరరావు, సుధాకర రావు, కోయి కోటేశ్వరరావు, దార్ల వెంకటేశ్వరరావు
కవిత్వంలోని వస్తువు, అభివ్యక్తులను బట్టి గుర్తించటమే ప్రతి కవికీ నిజమైన గుర్తింపు. అలాంటప్పుడు కుల, మత, ప్రాంతీయ భేదాలు పొడచూపవు. నిజానికి కవిత్వాన్ని ఇష్ట పడటానికి ఈ కొలమానాలు చాలా మంది చూస్తుంటారు. వీటితో పాటు అత్యంత ముఖ్యమైనది భావజాలం. భావజాలం నచ్చినప్పుడు పైవేమీ పెద్దగా ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఇవేమీ కాకుండా, కేవలం కవిత్వాన్నే ఇష్టపడేవాళ్ళూ ఉంటారు. అటువంటి వాళ్ళు చాలా అరుదు. అసలు విషయం ఏమిటంటే, ఇటీవల సాహితీకౌముది త్రైమాసిక పత్రిక ఏప్రిల్ 2007 సంచిక చూశాను. దాన్ని మధుర కవి శ్రీ మల్లవరపు జాన్ 80 వ జయంతి ప్రత్యేక సంచికగా ప్రచురించారు. తెలుగు పద్య సాహిత్యాన్ని ప్రోత్సాహించే పత్రిక. దీనిలో చాలా మంచి వ్యాసాలు, కవితలు ఉన్నాయి. జాన్ కవి గారి గురించే కాకుండా, మరికొన్ని శీర్షికలు కూడా ఉన్నాయి. సాహితీ వార్తలు ఉన్నాయి.
Courtesy: Hans india news
వ్యవస్థాపక ప్రధాన సంపాధకులు శిష్ట్లా వెంకట్రావు గారు మంచి సంపాదకీయం రాశారు. సంచికలో ఉన్న అన్ని వ్యాసాల పెట్టు ఆ సంపాదకీయంలో ఉంది. జాన్కవిగారి సమగ్ర వ్యక్తిత్వం ఆ సంపాదకీయంలో పెట్ట గలిగారు. సనాతన సంప్రదాయాన్ని మన్నిస్తూనే వాటిలోని బల హీనతలను త్రోసి రాజనగల కవులలో ఒకరుగా జాన్ కవిని బాగా అంచెనా వేయగలిగారు. "దైవభక్తి, దేశభక్తి, సామాజిక స్వభావం, మృదుస్వాభావికత ఆయన వ్యక్తిత్వాన్ని మహోన్నత స్థాయిలో నిల్పిన కవిగా జాన్ కవి గారిని అభివర్ణించారు.
షేక్ ఆలీ, ఎం.పి. జాను కవి, ఉన్నం జ్యోతి వాసు, మల్లవరపు రాజేశ్వరరావు, మల్లవరపు వెంకటరావు, ఫణితపు శ్రీరామ మూర్తి, కొండ్రెడ్డి వేంకటేశ్వర రెడ్డి , డా.బీరం సుందరరావు, బోడావుల నాగేశ్వరరావు, గంగవరపు జానకి రావు, బులుసు వేంకటేశ్వర్లు మొదలైన వారు జాన్ కవిగారి సాహిత్యాన్ని, వ్యక్తిత్త్వాన్నిఛందో బద్దంగా మంచి పద్యాలను రాశారు.
జాన్ కవిగారి గురించి చాలామంది మంచి వ్యాసాలు రాశారు. " మధుర కవి సాహిత్య దర్శనం" పేరుతో డా// గోగినేని యోగ ప్రభావతి గారు రాసిన వ్యాసం చాలా బాగుంది. ఇంకా ఇలాంటి వ్యాసాలు చాలా ఉన్నాయి. జాన్ కవి గారి వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని తెలుసుకోవాలనే వారికి ఈ సంచిక ఒక ఆకర గ్రంథంగా ఉపయోగిస్తుంది.
కం.
మాదార్ల మనసువెన్నెల
ప్రాధాన్యతనిచ్చి కవుల పండితులను తా
నాదరము జూచి మమతా
మాధుర్యమొసంగిబ్రోచు మంజుల హృదితోన్
తే.గీ.
మధుర కవి మల్లవరపు జాన్ మధుర పద్య
కవన భావ సౌరభ్య వైభవము గాంచి
మెచ్చి మెండు సమీక్షల నిచ్చి కవుల
మనసు దోచుకున్నారు నమ్మకముగలుగ!
Rajeev Book Cover
ఈ పద్యాలను మల్లవరపు రాజేశ్వరరావుగారు నా గురించి 22 అక్టోబరు 2009లో ప్రేమతో వర్ణించినవి. నాకు మల్లవరపు జాన్ గారు, రాజేశ్వరరావుగారి కంటే ముందు వారి కుటుంబసభ్యుడైన ప్రభాకరరావు బాగా తెలుసు. ఆయన చిక్కనైన వచన కవిత్వం రాస్తారు.
జాన్ కవి కుమారుడు మల్లవరపు రాజేశ్వరరావు. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ తెలుగుపండితుడిగా పనిచేస్తూనే అనేక రచనలు చేశారు. 1949 డిసెంబరు 17 వతేదీన జన్మించిన రాజేశ్వరరావుకి 'జీవనది' పద్యకావ్య సంపుటి ఎంతో పేరు తెచ్చింది. భక్తయోబు, అనాథ గంగ, ఎయిడ్స్ మహమ్మారి, బాలగేయాలు, హన్నా, కాళింది, రజయ ప్రణయం, ఎస్తేరు రాణి మొదలైన రచనలు చేశారు. వీటితో పాటు ఈయన రాసిన కావ్యాలు, నాటకాలు ముద్రణలో ఉన్నాయి. ఈయన రాసిన 'ముంతాజ్ మహల్' పద్యకావ్యం అనేకమంది సాహితీవేత్తల ప్రశంసలు అందుకుంది. పద్యంలోరాసినప్పటికీ వీరి భాష ఎంతో సరళంగా ఉంటుంది. మల్లవరపు జాన్ కవి వారస త్వాన్ని పుణికి పుచ్చుకొని పోతనలోని మాధుర్యాన్ని, కరుణశ్రీలోని మృదుత్వాన్ని, వేమనలోని వస్త్వలంకారాలతో సత్యాన్ని సామాన్యు లకు అందించగల నేర్పునీ, జాషువాలోని సామాజిక స్పందన్నీ ఏకోన్ముఖంగా మనకి అందించగల కళానైపుణ్యం ఈయన కవిత్వం లో కనిపిస్తుంది. ఈయన రాసిన 'మల్లవరపు శతకం'లో సామాజిక సమస్యల్ని వర్ణించారు. 'మతములన్నియు జనుల హితమునే కూ ర్చును/ సత్యము వాని నమ్మి సాగువారి/బ్రతుకులందు శాంతి భావాలు వెలుగొందు/ మల్లవరపు మాట మల్లెమూట' అని మతం ప్రజలకు హితాన్ని కలిగించి ముందుకు తీసుకుపోవడానికి ఒక మార్గంగా ఉండాలని ధ్యన్యాత్మకంగా ప్రబోధించారు.సమాజంలో జీవిస్తున్న బాధ్యతాయుత మైన కవిగానీ, కళాకారుడు గానీ తన చుట్టూ జరుగుతున్న వాటికి స్పందించడంలో 'కళాత్మకత' ఉంటుం ది. అది బయటకొచ్చే వరకు 'పురిటి నొప్పులు' భరించాల్సిందే నన్నట్లుంటుంది. కొన్నిసార్లు 'గుం డెగొంతులో కొట్లాడుతూనే ఉం టుంది. నిలబడనీయదు. అందరి లో ఉన్నా ఒంటిరిని చేస్తుంది. ఒంటరిగా ఉన్న సమూహాన్నీ చేస్తుంది. అది బయటకొచ్చిన తర్వాత కవి గొప్ప రిలీఫ్ పొందుతాడు. కవి మల్లవరపు రాజేశ్వరరావు అటువంటి 'తల్లి'గురించెలా వర్ణించారో చూడండి. 'కనెడి వేళ తల్లి కష్టంబు పడునెంతొ/ కాన్పులైన పిదప కలత మరచు/ హత్తుకొనును బిడ్డ పొత్తిళ్ళలో నుంచి/మల్లవరపు మాట మల్లె మూట'. గుర్రం జాషువా స్మారక కళాపరిషత్, ప్రకాశం జిల్లా ముస్లిం రచయితల సంఘం, శ్రీకష్ణదేవరాయ సాంస్కృతిక సేవా సమితి మొదలైన సంస్థలు పురస్కారాలతో పాటు, ఆచార్య నాగారు ్జన విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారంతో సత్కరించింది. 2007 లో ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందు కున్నారు. ఈయన రాసిన జీవనది కావ్యంపై తెలుగుశాఖ, హైదరా బాదు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పరిశోధన చేశారు. రాజేశ్వరరావుగారు 24 అక్టోబరు 2018వ తేదీన మరణించారు.
మల్లవరపు జాన్ శత జయంతి ప్రారంభ సమావేశంలో పాల్గొన్న సాహితీవేత్తలు.
***
‘వసంతానికి స్వాగతం’ పేరుతో1996 లో మల్లవరపు ప్రభాకరరావుగారు రాసిన కవితలోని కొన్ని భాగాలు చూడండి.
‘’కల్లలైన కలల మధ్య
చేదు జ్ఞాపకాలలోని తీపి స్మృతుల మధ్య
అలనల్లన నడిచొచ్చే ఉగాదికి స్వాగతం’అంటూనే ఎన్ని ఉగాదులు వచ్చినా సామాన్యులను, మధ్యతరగతిలను ఎలాంటి జీవన పరిస్థితుల్లో నెట్టేస్తూ ఉంటాయో చెప్తూ…
‘ఒక్కో వసంతం ఎన్ని తీపికలలను వెంట తీసికొస్తుందో
ఒక్కో వసంతం ఎన్ని వాడిన జీవితాల కథలను వెంటకొనిపోయిందో’
పిల్లాడి స్కూల్ ఫీజుల కోసం
కాఫీ కప్పులో పంచదార కోసం
ఇంటి కొచ్చిన కొత్తల్లుడి గొంతెమ్మ కోర్కెలు తీర్చడం కోసం
మా ఆత్మాభిమానాన్ని చంపుకుంటున్నా
వసంతానికి ఆహ్వానం చెబుతుంటాం’ అంటాడు కవి.
మల్లవరపు రాజీవ్ తన పద్దెనిమిదేళ్ల వయసులోనే 'ఇగ్నోరెంట్ బ్లిస్' (Ignorant Bliss) అనే ఆంగ్ల కవితా సంకలనం ద్వారా అద్భుతమైన పరిణతిని, విశాల దృక్పథాన్ని కనబరిచాడు. యువతకు సహజమైన ఆవేశాలకు బదులుగా, మనిషి అంతరంగం, స్వచ్ఛమైన హృదయం, తప్పుల నుంచి నేర్చుకునే పాఠాలు, జీవితం పట్ల ఆశావాదం వంటి ఉన్నతమైన అంశాలను తన కవితల్లో లోతుగా స్పృశించాడు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా సాటి మనిషితో బంధాన్ని పెనవేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ, సమాజంలోని కృత్రిమత్వాన్ని, మూస ధోరణులను తన కవిత్వం ద్వారా అత్యంత సుతిమెత్తగా, ప్రభావవంతంగా విమర్శించాడు.
రాజీవ్ రాసిన 'విచ్ వే' (Which Way) కవిత చదువుతుంటే, సుప్రసిద్ధ అమెరికన్ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన 'రోడ్ నాట్ టేకెన్' (Road not Tken) కవిత ఇచ్చిన స్ఫూర్తి మనకు అడుగడుగునా కనిపిస్తుంది. అదేవిధంగా, 'త్రూ దేర్ ఐస్' (Through Their Eyes) కవితలో విలియం హెన్రీ డేవిస్ రాసిన 'లెయిజర్' (Leisure) కవిత తాలూకు ప్రభావం అద్భుతంగా ఒదిగిపోయిందని విమర్శకులు అన్నారు.
ఒక మంచి పాఠకుడు మాత్రమే గొప్ప రచయిత కాగలడన్న నానుడిని నిజం చేస్తూ, తన విస్తృత పఠనం వల్లే ఇంతటి చిన్న వయసులో జీవిత గమ్యాన్ని, తత్వవిచారాన్ని నిష్పక్షపాతంగా, కవితాత్మకంగా ప్రపంచానికి పరిచయం చేయగలిగాడని ఈ కవితలు స్పష్టం చేస్తున్నాయి.
'మన కాలం' మానసపత్రిక సంపాదకులు కత్తి కళ్యాణ్, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
మల్లవరపు కవుల కుటుంబం ఒకవైపు ప్రాచీన పద్య సంప్రదాయాన్ని, మరోవైపు ఆధునిక వచన కవిత్వాన్ని సమపాళ్లలో పండిస్తూ తెలుగు సాహిత్యానికి అమూల్యమైన సేవలు అందిస్తుంది. పద్య సాహిత్యం ద్వారా జాన్ కవి, రాజేశ్వరరావు గార్లు తమ కావ్యాల్లో సామాజికతను, భావ మాధుర్యాన్ని ఏమాత్రం లోపించనివ్వకుండా అద్భుతమైన పద్య శిల్పాన్ని చెక్కారు. అదే సమయంలో సుధాకరరావు, ప్రభాకరరావు ఢమగార్లు వంటి వారు వచన కవిత్వం ద్వారా సామాన్యుల కన్నీటి గాథలను, మధ్యతరగతి జీవిత పోరాటాలను ఆర్ద్రంగా ఆవిష్కరించారు. ఛందస్సుల చట్రంలో ఇమిడిన పద్యమైనా, స్వేచ్ఛగా సాగే వచన కవితైనా.... అంతర్జాతీయంగా వినిపించగలిగే ఆంగ్ల కవిత్వమైనా మల్లవరపు కవుల కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం మానవతా విలువలనే సుసంపన్నం చేసింది. విభిన్న ప్రక్రియల ద్వారా సమాజ హితాన్ని కోరిన వారి సాహితీ ప్రస్థానం భావితరాల కవులకు నిరంతరం ఒక గొప్ప స్ఫూర్తిదాయకం.
కోట్ల వేంకటేశ్వర రెడ్డి, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావునేను 1998 సంవత్సరంలో జాన్ కవి గారిని కలిసాను. అప్పుడు నాపై రెండు పద్యాలు రాశారు. హైదరాబాద్ చేరే సరికి ఆ పద్యాలున్న నా పర్సు ఎవరో కొట్టేశారు. అప్పుడు పద్యం పోయినందుకు బాధపడ్డాను. ఇప్పుడు ఆయనకు నేనే ఒక పద్యాన్ని సమర్పిస్తున్నాను.
తే.గీ.
జ్ఞాన మూర్తిగ వెలసిన జాన్ కవీంద్ర
శత వసంతములందున శతము జేసి
నిత్య కవితల గీతుల నిత్యగతిని
అంజలిని ఘటియించుచు అభినుతింతు.
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్
19.7.2026
(నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 19.7.2026 సౌజన్యంతో)

















