"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

14 జూన్, 2026

వెదురు జీవనరాగం’ కావ్యం

 పచ్చని శ్లోకంలో 

శ్రామిక సూక్తమే 'వెదురు జీవనరాగం’ కావ్యం.


విమలసాహితి సాహిత్య అనుబంధం, 15.6.2026 సౌజన్యంతో 


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, పూర్వ అధ్యక్షులు, తెలుగు శాఖ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ), హైదరాబాద్.

  ఒక చేతిలో అక్షరాయుధాన్ని పట్టి సమాజానికి జ్ఞానభిక్ష పెట్టే ఉపాధ్యాయ వృత్తి, మరో చేతిలో వెదురును చీల్చి అద్భుతమైన సృష్టిని చేసే మేదరి వృత్తి సంస్కృతి... ఈ రెండింటి సమాహార రూపం కవి, గాయకుడు బాలకృష్ణ గారు. ఇప్పటికే అనేక కవితలు పాటలు రాశారు. మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి సామాజిక, తాత్విక భావజాలాలను తన గుండె నిండా నింపుకున్న బాలకృష్ణ గారు, ఆ వైచారిక వెలుగులోనే తన కలం నుండి ''వెదురు జీవనరాగం’' అనే అద్భుతమైన వచన దీర్ఘ కావ్యాన్ని సృజించారు. మేదరి జీవితాల కన్నీళ్లను, వారి శ్రమలోని సుగంధాన్ని, ఆధునిక సమాజం మరచిన వారి ఆదిమ చరిత్రను ఈ కావ్యం అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించింది.

    భారతీయ సమాజంలో వెదురు (Bamboo) ఆధారంగా జీవనం సాగిస్తూ, తమ అద్భుతమైన నైపుణ్యంతో సమాజానికి సేవలందిస్తున్న శ్రమజీవులు మేదరులు. అడవితో, ప్రకృతితో విడదీయరాని బంధం కలిగిన మేదరి కులస్థుల జీవితం, వృత్తి, సంస్కృతి, వారి తాత్విక చింతన. 

పూర్వం వీరు అడవులకు సమీపంలో నివసిస్తూ, అక్కడి నుండి వెదురును సేకరించి తెచ్చుకునేవారు.

పచ్చి వెదురును కోసుకురావడం, దానిని ఎండబెట్టడం, నిల్వ చేసుకోవడం వీరి జీవితంలో ఒక భాగం.మేదరి వృత్తిలో కుటుంబంలోని సభ్యులందరి భాగస్వామ్యం ఉంటుంది. పురుషులు అడవి నుండి వెదురు తెస్తే, మహిళలు, వృద్ధులు ఇంట్లో కూర్చుని వస్తువులను అల్లడంలో సాయం చేస్తారు. ప్లాస్టిక్ వస్తువుల వాడకం పెరగడం, అటవీ నిబంధనలు కఠినతరం కావడం వల్ల ప్రస్తుతం వీరి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందుల్లో పడింది. ఇవన్నీ వీరికి ఎదురవుతున్న ఆధునిక సవాళ్లు. అయినప్పటికీ, పర్యావరణహిత  వస్తువులకు మళ్లీ ఆదరణ పెరుగుతుండటంతో వీరు మెల్లగా కోలుకుంటున్నారు. మేదరుల వృత్తిలో ఒక అద్భుతమైన హస్తకళ ఉంది. వెదురును చీల్చి, సన్నని బద్దలుగా చేసి, వాటితో రకరకాల వస్తువులను అల్లడం వీరి ప్రత్యేకత.

మనం నిత్యజీవితంలో ఉపయోగించే వస్తువులలో గంపలు, చేటలు, తట్టలు, బుట్టలు, జల్లెడలు, మంచాలు, ఊయలలు వంటి నిత్యజీవితంలో వాడే వస్తువులను వీరు తయారు చేస్తారు. ఇలా అల్లాలంటే ఎంతో కళాత్మకత ఉంది.

రైతులు ధాన్యం నిల్వ చేసుకునే 'బొమ్మలు' (పెద్ద గిడ్డంగులు), ఎరువులు మోసే తట్టలు, పశువుల మేత బుట్టలు వంటివి తయారు చేస్తూ వ్యవసాయ రంగానికి మేదరులు వెన్నెముకగా నిలుస్తారు.

ప్రస్తుతం మేదరులు కేవలం సాంప్రదాయిక వస్తువులకే పరిమితం కాకుండా అందమైన వెదురు కుర్చీలు, టేబుళ్లు, సోఫాలు, అలంకరణ వస్తువులు (ఇంటీరియర్ పరికరాలు), ల్యాంప్ షేడ్స్ వంటిఆధునిక ఆవిష్కరణలతో విలాసవంతమైన వస్తువులను కూడా తయారు చేస్తూ మార్కెట్‌లో రాణిస్తున్నారు.

మేదరులకు ప్రత్యేకమైన సాంస్కృతిక ఆచారాలు, నమ్మకాలు ఉన్నాయి. సమాజంలో ప్రతి శుభకార్యానికి వీరు తయారుచేసే వెదురు వస్తువులు తప్పనిసరి. హిందూ సంప్రదాయ పెళ్లిళ్లలో ఉపయోగించే 'పెళ్లి గంపలు', 'బాసికాలు', 'ఆరివేణుల' అలంకరణలో మేదరి వస్తువులకు ప్రాధాన్యత ఉంది.పెళ్లికూతురిని గంపలో కూర్చోబెట్టి కల్యాణ వేదికపైకి తీసుకురావడం ఒక ముఖ్యమైన ఆచారం.

    వీరు ప్రధానంగా ప్రకృతిని, తాము నమ్ముకున్న వెదురును దైవంగా భావిస్తారు. ఆయుధ పూజ (దసరా) రోజున వెదురును చీల్చే కత్తులు, కొడవళ్లను పూజిస్తారు.  

 మేదరులలో ఒక వర్గం వారు వీరశైవ సంప్రదాయాన్ని పాటిస్తారు. శివుని మెడలోని పామే వెదురుగా మారినట్లు భావిస్తారు. బసవేశ్వరుడిని, శివుడిని భక్తితో ఆరాధిస్తారు. మేదరుల తాత్విక చింతన చాలా లోతైనది. ఇది ప్రముఖ శరణుడైన "మేదర కేతయ్య" ఇతడు 12వ శతాబ్దపు వచనకారుడు, బసవేశ్వరుని సమకాలీనుడు. "కాయకమే కైలాసం" అని భావించే మేదరుల ప్రధాన తాత్విక సూత్రం శ్రమను గౌరవించడం. తాము చేసే వెదురు అల్లిక పనిని వారు కేవలం పొట్టకూటి కోసం చేసే పనిగా మాత్రమే భావించరు; దాన్నొక తపస్సుగా, దైవకార్యంగా కూడా భావిస్తారు.

   పచ్చి వెదురు ఎలాగైతే వంగి సుందరమైన రూపాలుగా మారుతుందో, మనిషి కూడా జీవితంలో అహంకారాన్ని వీడి, వినయాన్ని, సహనాన్ని అలవర్చుకోవాలని వీరి వృత్తి మనకు బోధిస్తుంది. గట్టిగా ఉండే వెదురును ముక్కలు చేసి, మళ్లీ వాటన్నింటినీ కలిపి ఒక అందమైన బుట్టగా అల్లడం అనేది సమాజంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని, కలిసికట్టుగా ఉండే జీవన విధానాన్ని సూచిస్తుంది.

ప్రకృతితో మమేకమవుతారు. ప్రకృతి నుండి తీసుకున్నదానికి కృతజ్ఞతగా జీవించడం, పర్యావరణానికి హాని చేయని వస్తువులను సృష్టించడం వీరి జీవన తత్వంలో భాగం. శూన్యం నుండి (కేవలం వెదురు కర్రల నుండి) సమాజానికి ఉపయోగపడే సృష్టిని చేయడం ఒక యోగంగా వీరు భావిస్తారు.

    మేదరి జీవనం అనేది ప్రకృతికి, మానవ నైపుణ్యానికి మధ్య ఉన్న ఒక సుందరమైన వారధి. వారి వృత్తిలో కళ, సంస్కృతితో పాటు ఉన్నతమైన జీవన తత్వం దాగి ఉన్నాయి. దీన్ని అంతటినీ ‘ 'వెదురు జీవనరాగం’ కావ్యం లో కవిత్వీకరించారు. 

    కావ్యం ప్రారంభంలోనే కవి బాలకృష్ణ గారు వెదురుకు, మేదరి జీవనానికి ఉన్న అద్భుతమైన ఆత్మీయ బంధాన్ని కళ్లకు కట్టారు. వారి దృష్టిలో వెదురు అనేది కేవలం ఒక అటవీ వస్తువు మాత్రమే కాదు; అది వారి సంస్కృతిని, మనుగడను శాసించే ఒక జీవన సూత్రం.

"వెదురు మా జీవనరాగం

మా ఇంటి బువ్వ కుండ

మా తాతల జీవకంజి

తాతవ్వల దీవెనార్తి

దోసిట్ల లచ్చిందేవి

మా ఇంటి కట్టె దీపం"

ఈ పంక్తులలో కవి అట్టడుగు వర్గాల ఆకలిని, వారి బతుకుదెరువును వెదురుతో ముడిపెట్టి చూశారు. అది ఆకలి తీర్చే 'బువ్వ కుండ', తరం నుండి తరానికి అందిన 'జీవకంజి', చీకట్లను చీల్చే 'కట్టె దీపం'. వెదురునే వారు 'పచ్చని నేలపై రాసిన ప్రకృతి జీవన శ్లోకం' అని అభివర్ణించడంలోనే కవిలోని తాత్విక గాంభీర్యం, ప్రకృతిపై ఉన్న గౌరవం వ్యక్తమవుతాయి. అంతే కాదు, భారతీయ సంస్కృతిలో వేదాన్ని అత్యున్నతమైన జ్ఞానంగా భావించేవారున్నారు. అందుకనే కవి…

''వెదురు మా జీవన వేదం 

పచ్చని నేలపై రాసిన 

ప్రకృతి జీవన శ్లోకం'' అని భావించారు. వెదురుని తమ జీవన వేదమై ప్రవహించిన రాగంగా అభివర్ణిస్తారు. 

వెదురు పొదలను, అవి పెరిగే తీరును కవి వర్ణించిన విధానం ఆయనలోని సహజసిద్ధమైన గాయకుడి భావుకతను గుర్తుచేస్తుంది. వెదురును కేవలం వృత్తిపరంగానే కాక, ఒక సజీవ శిల్పంగా కవి దర్శించారు:

"అదిగదిగో వెదురు

మట్టిని చీల్చిన చిగురు

తల విరబోసుకున్న నాగసర్పం

పచ్చటి దీపంలా మెరిసి

ఎండినా ఎగిరే బంగారుతీగ"

పచ్చగా ఉన్నప్పుడు దీపంలా మెరిసి, ఎండిపోయిన తర్వాత కూడా మేదరుల చేతుల్లో రూపం మార్చుకుని 'బంగారు తీగ'లా సమాజానికి లక్ష్మీప్రదంగా మారుతుందని చెప్పడం కవి వృత్తి నైపుణ్యానికి ఇచ్చిన అపారమైన గౌరవం.

కవి బాలకృష్ణ గారు ఈ కావ్యంలో మేదరుల చరిత్రను మానవ పరిణామ క్రమంతో ముడిపెట్టి సరికొత్త చారిత్రక కోణాన్ని ఆవిష్కరించారు. మానవుడు రాతి యుగం, లోహ యుగాల్లోకి అడుగుపెట్టక ముందే, ప్రకృతి ప్రసాదించిన వెదురుతో నాగరికతను నిర్మించిన 'ఆదిమ ఇంజనీరు' మేదరి అని కవి సగర్వంగా ప్రకటిస్తున్నారు.

"భూమి పుట్టిన కాలం

గాలి తొలి ఊపిరి పీలుస్తున్నపుడు

అడవి తన కళ్లను నెమ్మదిగా తెరిచింది

భూమి పుట్టినప్పుడే వెదురు పుట్టింది 

మేదరి మహేంద్రుడు పుట్టాడు..." అనం ద్వారా రాళ్ళు, ఇనుము, నిప్పు కనుగొనబడక ముందే కేవలం చేతులనే ఆయుధాలుగా మలిచి, వెదురుతో నివాసాల కోసం గుడిసెలను, నదులు దాటడానికి తెప్పలను నిర్మించిన ఘనత మేదరులదేనని ఆ చరిత్రను పునర్నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. ఈ సృష్టికి వారే 'తొలి శిల్పులు', ఈ 'భూమి పుత్రులు' అని కవి అన్వయించిన తీరు అద్భుతం. ఇది ఫూలే, అంబేద్కర్లు బోధించిన శ్రమజీవుల చారిత్రక వారసత్వానికి అద్దం పడుతోంది.

‘’రాయి వాడక ముందే 

లోహం కనుక్కోక ముందే 

చేతులే ఆయుధాలుగా మలిచిన 

తొలి శిల్పి మేదరి’’ అనడం ద్వారా మేదరుల పురాతన కాలం నుండి సమాజానికి చేస్తున్న సేవను గుర్తుచేస్తున్నారు. 

     మేదరి వృత్తికి ఉన్న పౌరాణిక, చారిత్రక నేపథ్యాన్ని కూడా కవి చాలా సృజనాత్మకంగా కావ్యంలో పొందుపరిచారు:

"శివుని మెడలో నాగుపాము

వెదురు బొంగుగా ఉద్భవించి

మహేంద్రగిరిపై పారి

మేదరింటికి చేరింది"

శివుని ఆభరణమైన నాగుపామే వెదురుగా మారి మహేంద్రగిరి నుండి మేదరి ఇంటికి చేరిందనే ఈ కల్పన, వారి వృత్తి ఎంత పవిత్రమైనదో, ఎంతటి దైవికమైనదో చాటిచెబుతోంది. ఆదిమ చరిత్ర నుండి ఆధునిక చరిత్ర వరకు అడవితోనే వారి జీవనం సాగిందని, వెదురు బొంగులే వారి శ్వాస అని కవి స్పష్టం చేశారు.

 మేదరి జాతికి ఉన్న ఆధ్యాత్మిక, తాత్విక నేపథ్యాన్ని వచనకారుల కాలంతో ముడిపెట్టారు కవి. 12వ శతాబ్దపు వీరశైవ ఉద్యమంలో బసవేశ్వరుని సాటి శరణుడైన ‘మేదర కేతయ్య’ ను తమ గురువుగా, మార్గదర్శిగా కొలుస్తూ, దూడయ్య, చెన్న బసవయ్యల నామాలతో బసవపురాణంలో నిలిచిన కీర్తి గాథలను కవి స్మరించారు. ‘కంక వనం’ (వెదురు అడవి) తిరిగి, ‘కంక బియ్యం’ తింటూ, ‘కష్పీ’ (పనిముట్టు) మీద బతికే పవిత్ర జీవులని వీరిని అభివర్ణించారు.

కావ్యంలో కేవలం తాత్విక చింతనే కాదు, కళ్ల ముందు కదిలే సజీవ పాత్రల చిత్రణ ఉంది.

మా తాత బొమ్మిడి బక్కయ్య

నెత్తికి రుమాలు చుట్టుకుని

కుట్టుడు రెక్కల బనీను వేసుకొని

తెల్లటి దోతీ గోసి కట్టుకొని 

సాదాసీదా వేషంలో...”

ఈ వర్ణన ప్రతి మేదరి ఇంట ఉండే శ్రమకు, నిరాడంబరత్వానికి నిలువెత్తు ప్రతీకగా భావించాలి.

కావ్యంలో కవి మేదరి అల్లిక నైపుణ్యాన్ని శాస్త్రీయ దృక్పథంతో, ఆధునిక ప్లాస్టిక్ సంస్కృతితో పోల్చి చూపారు.

కుర్చడ అల్లితే నీళ్లు జారవు పిండి కారదు

నిలేసి నేలకు కొట్టినా ప్లాస్టిక్కులా పర్రె పెట్టదు”

ఇది మేదరుల హస్తకళలోని సాంకేతిక చాకచక్యానికి నిదర్శనం. ప్లాస్టిక్ పగిలిపోతుంది, పర్యావరణాన్ని పాడు చేస్తుంది. కానీ, మేదరి అల్లిన వెదురు బుట్ట నేలకు కొట్టినా పర్రె (పగులు) పెట్టదు. గంజి నీళ్లతో జీవన గీతాన్ని రాసుకునే ఈ కళాకారుల హస్తకళ ఎంతటి గట్టిదో కవి ఇక్కడ నిరూపించారు.


నగరీకరణ, ఆధునికత పేరిట వచ్చిపడిన ప్లాస్టిక్ సంస్కృతి ఏ విధంగా ఒక అద్భుతమైన వృత్తిని, మానవ సంబంధాలను మింగేసిందో కవి ఆవేదన వ్యక్తం చేశారు.

పెండ తట్టలు, ముగ్గు గుల్లలు, బీడీల సెంగేరీలు, పిండి జల్లెడలు, గంపలు, చాటలు వంటివన్నీ నేడు కనుమరుగయ్యాయి.

ఆఖరికి బియ్యం చెరిగే చాటలు కూడా ప్లాస్టిక్ మయం కావడాన్ని చూపిస్తూ, కవి “మనిషితనం లబ్బరుమయం” అనడం నేటి యాంత్రిక, కృత్రిమ మానవ విలువలకు అద్దం పడుతోంది.

ప్రకృతిలో దొరికే ప్రతి వెదురు బొంగును మేదరి కన్ను ఎలా గుర్తిస్తుందో కవి వర్గీకరించిన తీరు అద్భుతం.

స్పెషల్ క్లాస్: బొంగు శిల్పం హంగు

ఫస్ట్ క్లాస్: సాధనపు బొంగు

సెండ్ క్లాస్: జిట్టెగనె బొంగు

థర్డ్ క్లాస్: గైకట్టె బొంగు

వెదురులో ఉండే ఈ రకాలను బట్టి ఏ వస్తువుకు ఏ బొంగు వాడాలో తెలిసిన మేదరి కంటికి “ప్రతి బొంగు ఒక బంగారు పోగు” గా కనిపిస్తుంది. శ్రమను సంపదగా మార్చే కిటుకు తెలిసిన శ్రామికుడాయన.

మేదరులను కేవలం ఒక శ్రామిక కులంగా కాకుండా, ఈ భూమిపై రేఖలను, దిక్కులను గుర్తించిన ఆదిమ మేధావులుగా కవి ఉగ్గడించారు.

అడుగు తొక్కి అక్షాంశ రేఖాంశాలు

కాలు మోపి కర్కటకరరేఖల గ్రిడ్ గీతలు

కనుగొన్న పురాతన భూగోళ శాస్త్రవేత్తలు”

వెదురు కోసం అడవుల వెంట తిరుగుతూ, కొండలు కోనలు దాటుతూ భూమి భౌగోళిక స్వరూపాన్ని మొదట ఆకళింపు చేసుకున్న చారిత్రక పురుషులు మేదరులని కవి సరికొత్త చారిత్రక నిర్వచనాన్ని ఇచ్చారు.

ఫూలే, అంబేద్కర్ భావజాల ప్రభావం ఇక్కడే స్పష్టంగా కనిపిస్తుంది. చరిత్ర ఎప్పుడూ రాజులది, పీఠాలదే రాసింది కానీ, నాగరికతను నిర్మించిన శ్రమజీవులను విస్మరించింది. “వెనకబడిన వర్ణ వెలుగు రేఖలు, చరిత్రకెక్కని కాగితాలు” అంటూ మట్టిలో మురిగిపోయిన మూలవాస మహేంద్రుల చరిత్రను కవి తవ్వి తీశారు. హరప్పా, సింధు, ఈజిప్టు, మెసపటోనియా వంటి ప్రాచీన నాగరికతల మట్టిపొరల్లో, శిథిలాల్లో మేదరి వాళ్ల అడుగుజాడలు ఉన్నప్పటికీ, చరిత్ర వారిని నిశ్శబ్దంలోనికి నెట్టేసిందని కవి చారిత్రక నిర్వేదాన్ని ప్రకటించారు. ఇదంతా చరిత్రకెక్కని మూలవాసుల గురించి కవి గుర్తించిన లోతైన పరిశీలన. 

భారతదేశ వ్యాప్తంగా మేదరి సామాజిక స్థితిని కవి ఒక సామాజిక శాస్త్రవేత్తలా విశ్లేషించారు. మేధా, మేదరి, బురూడ్, బోన్స్ పోర్, బురార్, బసోర్... ఇలా దేశంలో ఏ ప్రాంతంలో ఏ పేరుతో పిలిచినా, వృత్తి ఒక్కటే, జాతి ఒక్కటే. అయితే వివిధ రాష్ట్రాల్లో వీరి సామాజిక హోదా వేరుగా ఉంది (కొన్ని చోట్ల దళిత, గిరిజన హోదా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో వెనకబడిన కులంగా ఉన్నారు). అలాగే, వారిలోనే ఉన్న అంతర్గత ఉపకులాలు (తిక్కడ, తూర్పు, ఆరవ, యానాది, ఊరు, కొండ, ఎరుకలి, మాల మేదరి) వారి మధ్య ఐక్యతా లోపానికి ఎలా కారణమవుతున్నాయో కవి నిర్మొహమాటంగా ఎండగట్టారు.

మనిషి పుట్టుక నుండి చావు వరకు, నిత్య జీవితంలో రక్షణ నుండి వ్యవసాయం వరకు వెదురు కట్టె ఎలా తోడుంటుందో కవి గుర్తుచేశారు.

   ముసలి చేతిలో కొంకడి కట్టెగా, రైతు చేతిలో ముల్లు కట్టెగా, భద్రతనిచ్చే సాము కట్టెగా నిలిచే వెదురే తమ ఊపిరి అని చెబుతూ, “మా వెదురు ఊపిరేనని ఈ లోకం గ్రహించే రోజు ఎప్పుడో?” అని కవి ప్రశ్నించారు.

కావ్యం చివరి అంకానికి వచ్చేసరికి విప్లవాత్మక, ఉద్యమ స్వరూపాన్ని సంతరించుకుంది. అడవులపై హక్కులు కోల్పోయి, వృత్తి గుక్కపెడుతున్న తరుణంలో మేదరులు మేల్కొనాల్సిన అవసరాన్ని కవి చాటారు.

సెప్టెంబర్ 18 'ప్రపంచ వెదురు దినోత్సవం' సందర్భంగా డప్పు దరువులు, ప్లకార్డులతో రాజధాని నడిబొడ్డున జరిగిన చారిత్రక సభను ఉద్యమ స్ఫూర్తిగా అభివర్ణించారు.

  రేకుర్తి, కల్వకుర్తి, జన్నారం, కొలనుపాక వంటి క్షేత్రాలను ఐక్యతా కేంద్రాలుగా పేర్కొంటూ, కావ్యాన్ని ఒక అద్భుతమైన ఐక్యతా సందేశంతో ముగించారు.

బొంగుకెన్ని గనుపుల్లున్నయో 

మేదరోల్ల గుణాలన్నట్టు

బొంగుకెన్ని గనుపులున్నా

 వెదురుబొంగు ఒక్కటేయన్నా

మేదరోల్ల గుణాలెన్నున్న 

మనమంతా ఒకటే గణమన్న 

ఐక్యత చాటాలన్నా”

కవి బాలకృష్ణ గారి 'మేదరివాడ'  ఒక కులం గురించి చెప్పే కావ్యంగా కాకుండా, భారతదేశవ్యాప్తంగా మేదరులు భిన్న కులాలుగా ఉన్నారని, కొన్నిచోట్ల గిరిజనులుగా, షెడ్యూలు కులాలుగా, వెనుకబడిన తరగతులుగా…రకరకాల పేర్లతో ఉన్నప్పటికీ వాళ్ల వృత్తిలోని శ్రమ జీవన తత్వం ఒకటేనని చెప్పారు. అందుకే ఇది శ్రమ సౌందర్యాన్ని, మానవ నాగరికతకు పునాది వేసిన ఒక శ్రామిక వర్గం యొక్క సృజనాత్మకతను గౌరవించే 'విశ్వజనీన కావ్యం'. ఫూలే-అంబేద్కర్ భావజాల నేపథ్యం ఉండటం వల్ల, ఈ కావ్యంలో కేవలం వృత్తి గొప్పతనమే కాకుండా, ఆధునిక కాలంలో అడవులపై హక్కులు కోల్పోయి, ప్లాస్టిక్ సంస్కృతి మధ్య నలిగిపోతున్న మేదరుల కష్టనష్టాల పట్ల సామాజిక ఆవేదన, ఒక బలమైన చేతనాత్మక స్వరమూ వినిపిస్తాయి.

     ఒక సాహిత్య సృష్టిని సాధారణ కవిత అనకుండా, 'కావ్యం' (ముఖ్యంగా వచన దీర్ఘ కావ్యం) అనడానికి కొన్ని నిర్దిష్టమైన సాహిత్య లక్షణాలు, అర్హతలు ఉండాలి. కవి బాలకృష్ణ గారి ‘’'వెదురు జీవనరాగం’రచనను 'కావ్యం' అనడానికి గల బలమైన కారణాలను ఇలా చెప్పుకోవచ్చు.

1.వస్తువు యొక్క సమగ్రత (Magnitude of Subject): కవిత అనేది ఒక చిన్న భావననో లేదా ఒక సంఘటననో మాత్రమే వ్యక్తీకరిస్తుంది. కానీ కావ్యం ఒక సమగ్ర జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. ‘మేదరివాడ’లో మేదరి జాతి పుట్టుక, వారి ఆదిమ చరిత్ర, వృత్తి సాంకేతికత, సాంస్కృతిక ఆచారాలు, ఆధునిక కాలంలో ఎదుర్కొంటున్న కష్టనష్టాలు మరియు వారి ఉద్యమ స్వరం వరకు... ఒక జాతి సంపూర్ణ జీవన ప్రస్థానాన్ని సమగ్రంగా చిత్రించడం వల్ల ఇది కావ్యం అయింది.

2.కథన సూత్రం - దీర్ఘత (Narrative Continuity): ఈ రచనలో ఒక అంతస్సూత్రం (Narrative Arc) ఉంది. భూమి పుట్టిన ఆదిమ కాలం నుండి హరప్పా, మొహెంజోదారో నాగరికతల మీదుగా, బసవపురాణ కాలం దాటుకుంటూ, నేటి ఆధునిక నగరాల నడిబొడ్డున జరిగే చారిత్రక ఉద్యమ సభ వరకు ఒక చారిత్రక క్రమ పరిణామం (Chronological Flow) ఉంది. ఈ సుదీర్ఘమైన కథన శైలి దీనికి కావ్య గౌరవాన్ని తెచ్చింది.

3.తాత్విక దృక్పథం (Philosophical Vision): కావ్యం అనడానికి ఉదాత్తమైన తాత్వికత ముఖ్యం. ఇందులో ఫూలే-అంబేద్కర్ వైచారిక దృక్పథంతో పాటు, శ్రమనే దైవంగా భావించే "కాయకమే కైలాసం" (మేదర కేతయ్య తత్వం) అనే లోతైన జీవన తత్వం ఉంది. వెదురు బొంగులను ఐక్యతకు ప్రతీకగా మార్చిన కవి తాత్విక పరిణతి ఈ రచనను ఉన్నత స్థానంలో నిలబెట్టింది.

4.పాత్రల సృష్టి - సామాజిక వర్ణన (Characterization and Setting): కావ్యంలో ఉండే వర్ణనాత్మకత ఇందులో పుష్కలంగా ఉంది. వెదురులోని వివిధ శ్రేణుల వర్ణన, అలాగే ‘మా తాత బొమ్మిడి బక్కయ్య’ వంటి సజీవ పాత్రల చిత్రణ ద్వారా ఒక కాలఖండాన్ని, ఒక సమాజాన్ని కళ్లముందు ఉంచారు. సంప్రదాయం కావ్యంలో వలే  పాత్రలను ప్రత్యక్షంగా ప్రవేశపెట్టకుండా, ఆ స్పృహను కల్గించడం ఆధునిక వచన కావ్య ఉత్తమ  లక్షణం. అది ఈ కావ్యంలో కనిపిస్తుంది.

5.ఉదాత్తమైన శైలి - ప్రతీకలు (Elevated Style & Metaphors): "పచ్చని నేలపై రాసిన ప్రకృతి జీవన శ్లోకం", "మట్టిని చీల్చిన చిగురు", "ఎండినా ఎగిరే బంగారుతీగ" వంటి అద్భుతమైన దేశీయ ప్రతీకలు, కవితాత్మక శైలి ఈ రచనను సాధారణ వచనం నుండి ఉన్నతమైన సాహిత్య కావ్య స్థాయికి తీసుకెళ్లాయి.

అందుకే, ఒక సముదాయం యొక్క ఆత్మకథగా, ఒక చారిత్రక దస్తావేజుగా రూపుదిద్దుకున్న ‘మేదరివాడ’ను వచన దీర్ఘ కావ్యం అనడం సర్వథా అర్హం, శాస్త్రబద్ధం.

     మొత్తం మీద ఈ ‘మేదరివాడ’ దీర్ఘకావ్యం ఒక . సంప్రదాయ వృత్తి పురాణంలా రాయలేదు. అది అణచివేయబడిన శ్రామిక వర్గాల ఆత్మగౌరవ ప్రణాళికగా వర్ణించారు. ఒక వైపు కవిత్వంలోని భావుకతను, మరోవైపు గాయకుడి లయను, ఇంకోవైపు సామాజిక విశ్లేషకుడి తార్కికతను మేళవించి రాసిన ఈ కావ్యం తెలుగు సాహిత్య చరిత్రలో శ్రామిక సౌందర్యాన్ని చాటిచెప్పే ఒక సమున్నతమైన 'సామాజిక దస్తావేజు'గా మలిచారు. 

 కవి బాలకృష్ణ గారు ఈ కావ్యం ద్వారా మేదరుల జీవితానికి ఒక కళాత్మకతను సాధించారు. చరిత్రలో ఈ కావ్యానికి ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది. సమాజం పట్టించుకోని వస్తువును తీసుకొని మొత్తం ఆ జీవితాల గురించే ఆలోచించేలా సాహిత్యీకరించిన కవి బాలకృష్ణగార్ని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 

పూర్వ అధ్యక్షులు, తెలుగు శాఖ, 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ), హైదరాబాద్ 

ఫోన్: 9989628049.