‘రాత్రి సింఫని’ ఒక సార్వత్రిక మానవ హృదయ నాదం
డాక్టర్ బాణాల శ్రీనివాసరావు ఆధునిక తెలుగు కవిత్వ రంగంలో తనదైన విశిష్ట ముద్రను వేసిన కవి. ఆయన సరికొత్త కవితా సంపుటి ‘రాత్రి సింఫని’ (అక్టోబర్ 2023) సమకాలీన సామాజిక, తాత్విక, అస్తిత్వ స్పృహల సమాహారం. ఆంగ్ల సాహిత్య నేపథ్యంతో పాటు దేశీయ, ప్రాంతీయ మూలాల పట్ల అవగాహన ఉన్న కవి కావడంతో, ఈ సంపుటిలోని కవితలలో వస్తు వైవిధ్యం, అద్భుతమైన అభివ్యక్తి శిల్పం గోచరిస్తాయి. ‘నా సాహితీవృక్షానికి తల్లివేరు మావూరే’ పేరుతో తన సాహితీ నేపథ్యాన్ని అద్భుతంగా వివరించారు కవి. ఆంగ్లసాహిత్యంపై పరిశోధన చేయడంతో పాటు, కవిత్వాన్ని కూడా సాధన చేస్తుండటం వల్ల ఆయన కవిత్వం ఎంతో పదునుతో వెలువడుతుంది. ఆయన తన జీవిత నేపథ్యం నుండి తన తండ్రి చేసే వృత్తిని వర్ణిస్తూ ‘కుంపటి’ దీర్ఘకవిత కవిగా ఆయనకు గొప్పగుర్తింపుని తెచ్చింది. అది ‘వెంటాడే కలాలు’ బి.సి. వాద అస్తిత్వ గొంతులను కవిత్వీకరించే లక్ష్యంతో వర్ణించిన కవిత్వం. అందువల్ల దాని నిండా జీవితమే కవిత్వమయ్యింది. అది తర్వాత అనేక కవితాసంకలనాల్లో చోటు సంపాదించడమే కాకుండా, ఆంగ్లంలోకి కూడా అనువాదం అయ్యింది. ఆ తర్వాత అనేక పత్రికల్లో చిక్కనైన కవిత్వం రాశారు. వాటిలో కొన్నింటిని ‘రాత్రి సింఫని’ పేరుతో ప్రచురించారు. ‘రాత్రి సింఫని’’ పేరుతోనే ఒక కవిత ఉంది. 'సింఫనీ' అంటే రకరకాల వాయిద్యాల కలయికతో పుట్టే ఒక సుదీర్ఘమైన, గంభీరమైన సంగీత రచన. రాత్రి అనేది కేవలం నిశ్శబ్దం కాదు, అందులో ఎన్నో శబ్దాలు, భావాలు, దృశ్యాలు దాగి ఉన్నాయి. వాటి కలయికే ఈ కవిత. ఇది నాలుగు విభిన్న దశల్లో (మూవ్మెంట్స్) సాగింది. మొదటి భాగం ప్రశాంతత - యాంత్రికత ల మధ్య సంఘర్షణను చిత్రిస్తుంది.
"ఆ గది గూటిలో అలసిపోయి
హాయిగానిదురిస్తున్నరొండు చిన్ని పక్షులు" ఇది ఒక అందమైన, సున్నితమైన గృహ వాతావరణాన్ని చూపిస్తుంది. కానీ వెంటనే "సముద్ర హోరును తలపించే నిరంతరం సింఫని సంగీతం" అంటూ పక్కనే ఉన్న ఫ్యాన్ శబ్దమో లేదా ఏసీ శబ్దమో... ఆధునిక జీవితపు యాంత్రిక హోరును ప్రకృతితో పోల్చిన తీరు అద్భుతం.
రెండవ భాగం
‘రాత్రి రక్షణ సహజత్వాన్ని కవిత్వీకరిస్తుంది. వీధి కుక్కల అరుపులను కేవలం శబ్దంగా కాకుండా, "నిదురించే కాలనీని నిద్ర లేపుతున్న" ఒక హెచ్చరికగా, రాత్రి వేళ కాపలాగా అభివర్ణించడం నిత్యజీవిత సత్యాన్ని ఆవిష్కరించింది.
మూడవ భాగంలో ఆర్ద్రత - మనోవేదన నను పలికిస్తుంది. ఇక్కడ కవిత్వం మరింత లోతుకు వెళ్ళింది. ఆకాశాన్ని సముద్రంతో, చందమామను ఒంటరి నావికుడితో పోల్చడం క్లాసిక్ ఇమేజరీ.
"అక్కడో పచ్చి బాలింత
అలిసిపోయి పడుకుంది
పాలకోసం పసిపాప గుక్కపెట్టి ఏడుస్తున్నట్లు...
"రాత్రి వేళ వినిపించే ఏడుపు లేదా ఏదో ఒక ఆర్తి, నిద్రపట్టని కవి/రచయిత మనసును మెలిపెట్టడం ఇక్కడి భావోద్వేగాన్ని పెంచింది. బాహ్య ప్రపంచం నుంచి కవి అంతరంగంలోకి ప్రయాణం ఇక్కడ కనిపిస్తుంది. నాల్గవ భాగంలోఆశావహ దృక్పథం - మేల్కొలుపు లోకి తీసుకెళ్తుంది. చీకటి పలచబడటాన్ని "వెలుగుమొగ్గలు విచ్చుకుంటున్న నిశ్శబ్ద పరిమళం" అనడం ఎంతో నవ్వమైన భావచిత్రం. కాంతికి పరిమళాన్ని ఆపాదించడం కవితకు హైలైట్. అంటే ఒక ఇంద్రియ అనుభూతిని మరొకదానితో పోల్చడంలో కవి ప్రతిభ కనిపిస్తుంది. ‘‘నిదురిస్తున్నరొండు" లో ‘రెండు’ బదులుగాను, ‘‘చందమామ’’ అనకుండా "సందమామ" అనే పదాన్ని ప్రయోగించడం బహుశా గ్రామీణ/జానపద శైలిని సహజత్వం కోసం కావాలనే వాడారేమో. అయితే, కవిత మొత్తం ఆధునిక/వచన శైలిలో సాగింది. కవిత్వనిర్మాణ పరంగా గుర్తించాల్సిన ఇలాంటి ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి.
వైయక్తికానుభూతులను కలిగిస్తూనే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలపై కవిత్వీకరించడం మరొక ప్రత్యేకత. కవి కేవలం తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మాత్రమే కాక, ప్రపంచీకరణ సృష్టించిన సంక్షోభాలను కూడా కవిత్వీకరించారు. "అరచేతిలో గ్లోబు", అమెరికా ఎలా "గ్లోబల్ నేరస్థుడు"గా మారుతుందో అద్భుతంగా వర్ణించాడు కవి. కవి ప్రకృతి నియమాలతో కవితను ప్రారంభిస్తూ, "లేడిని పులి వేటాడటం" అనేది ఒక సహజమైన ప్రకృతి ధర్మమని చెప్పారు. కానీ, ఆధునిక ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు తమ స్వార్థం కోసం బలహీన దేశాలపై ఆధిపత్యం చలాయించడాన్ని 'ప్రాంతీయ ధర్మం', 'అంతర్జాతీయ ధర్మం' అంటూ అందమైన పేర్లతో సమర్థించుకోవడాన్ని కవి ఈసడించుకున్నారు.
‘‘లేడిని పులివేటాడితే!
ప్రకృతిధర్మం
ఒక ప్రాంతానింకో
ప్రాంతం ఆక్రమిస్తే!
ప్రాంతీయధర్మం
ఒకదేశాన్ని
మరోదేశం కబళిస్తే
అంతర్జాతీయ ధర్మం
దేశాధ్యక్షున్ని కూలదోసి
ఆ దేశన్యాయస్థానంలో
నేరస్థున్ని చేసి
మరణ శిక్షవేయించి మట్టుబెడితే
ఇది ఏ ధర్మం? ''
అనిఅమెరికా అగ్రాధిపత్యాన్ని ప్రశ్నించి, దానికి అది చేస్తున్న ‘‘అంత్యతాధునిక ఆయిల్ ధర్మమా!’’ అని వ్యంగ్యంగా ఆ దేశ అనైతికతను ఎత్తి చూపిస్తాడు కవి. చివరికి ‘‘ఓ గ్లోబల్ నేరస్థుడా! ‘‘ అని సంబోధిస్తూనే ఏదొక నాడు బలవంతమైన సర్పం కూడా ‘‘చలిచీమల చేచిక్కిన పాములా’’ ఆ దేశం ఇతర దేశాల చేతుల్లో పడి చావకతప్పదని భవిష్యదర్శనాన్ని చూపిస్తున్నాడు కవి. ఎంతటి శక్తివంతమైన శత్రువైనా, ప్రపంచ ప్రజలంతా ఏకమైతే లొంగక తప్పదని చెప్పడానికి "చలిచీమల చేచిక్కిన పాములా" అనే అద్భుతమైన సామెతను ప్రతీకగా వాడారు. అమాయక ప్రజల కన్నీళ్లు ఊరికే పోవని, ఆ "కన్నీటి అక్షరాలతో" ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు రాసే 'మరణశాసనాన్ని' ఏ గ్లోబల్ నేరస్థుడూ తప్పించుకోలేడని కవి సామ్రాజ్యవాద శక్తులకు తీవ్ర హెచ్చరిక జారీ చేశాడు కవి. "మార్చింగ్ టూ బీజింగ్" వంటి కవితలు ప్రపంచవ్యాప్త రాజకీయాలు, మానవ సంబంధాల విధ్వంసాన్ని ప్రశ్నిస్తాయి. గ్లోబలైజేషన్ వల్ల మనుషులు ఎంత యాంత్రికంగా మారిపోతున్నారో, పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా విస్తరిస్తోందో ఈ కవితలు ఎత్తిచూపుతాయి.
‘‘జీవితానికి పర్యాయపదం గాయం
నిరంతరం గాయపడుతూ
ఆయుధాలనన్ని ఎదుర్కొన్నప్పుడే!
అద్భుత ఔషధాయుధమవుతావు
చివరాఖరికి నీవో తెల్లపావురమవుతావ్అప్పుడు
నీ అరచేతిలో
గ్లోబవుతుంది
ఈ భూగోళం…‘‘
ఈ సంపుటిలో అంతస్సూత్రంగా సాగే మరొక ముఖ్యమైన వస్తువు 'అస్తిత్వ వాదం'. కవి, విమర్శకుడు సిద్ధార్థ తన ముందుమాటలో అన్నట్లు, బాణాల శ్రీనివాసరావు "అస్తిత్వ జలాల్లో కదిలే ఒంటరి నావికుడు". మనిషి ఎదుర్కొంటున్న అంతరంగిక సంక్షోభం, భయం, ఒంటరితనం వీరి కవితల్లో స్పష్టంగా కనిపిస్తాయి. "భయం ఊబిలో..", "నేనేమౌతానో!", "ఐసోలేషన్" వంటి కవితలు వర్తమాన కాలంలో మనిషి అనుభవిస్తున్న అభద్రతా భావాన్ని, ఒంటరితనాన్ని ప్రతిబింబిస్తాయి.
కవికి తన పుట్టిన ఊరు, తల్లిదండ్రుల పట్ల ఉన్న గాఢమైన అనుబంధం కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తుంది. "అమ్మొక సముద్రం.." కవితలో అమ్మ ప్రేమలోని అనంతత్వాన్ని ఆవిష్కరించారు. తన సాహితీ వృక్షానికి తల్లివేరు తన ఊరేనని కవి సగర్వంగా ప్రకటించుకున్నారు. "మమ్మల్నిలా బతకనీయండిరా!", "బహుజనం", "వలసజీవులు" వంటి కవితలు సమాజంలో అణచివేతకు గురవుతున్న శ్రమజీవుల, వలస కార్మికుల పక్షాన గొంతుకను వినిపిస్తాయి. వ్యవస్థలోని అసమానతలపై తిరుగుబాటు, పీడిత ప్రజల పట్ల సానుభూతి వీరి వస్తువులలో ప్రధానమైనవి.
‘‘కులం కంపు ఇంకా.. ఇంకా..
ఈ దేశం దేహంనిండాప్రవ హిస్తున్నందుకేగా
మేమింకా కులవృత్తుల గుంజలకు
కుట్టివేయబడ్డ మూగజీవాలమైనం
నయానాగరికులమధ్య
బతుకుబండినీడ్చే బహుజనులమైనం’’ అని కులవృత్తుల పేరుతో ఆర్థికంగా, సామాజికంగా జరుగుతున్న అణచివేతను కవిత్వీకరించి, సామాజిక వాస్తవికతకు ప్రధానమైన పీఠం వేశాడు కవి.
చిన్నతనంలో ఊరిలో చూసిన భజనలు, తోలుబొమ్మలాటలు, అమ్మ పాడిన బతుకమ్మ పాటల లయ ఒకవైపు... ఆంగ్ల సాహిత్య పఠనం ద్వారా అబ్బిన అంతర్జాతీయ ఆధునిక దృక్పథం మరోవైపు వీరి కవిత్వ శైలిని సుసంపన్నం చేశాయి. నిశ్శబ్దాన్ని శబ్దంగా మార్చడం, ఆవేదనను అక్షరబద్ధం చేయడంలో వీరి శైలి విశిష్టమైనది.
బాణాల శ్రీనివాసరావు గారి కవిత్వంలో వస్తువు ఎంత బలంగా ఉంటుందో, దానిని వ్యక్తపరిచే శైలి, శిల్పం కూడా అంతే రమణీయంగా ఉంటాయి. ఆంగ్ల కవులైన కీట్స్, వర్డ్స్వర్త్ లతో పాటు అమెరికన్ బీట్ కవులు, తెలుగు దిగంబర కవుల ప్రభావం వీరి అభివ్యక్తిని మరింత పదును పెట్టిందనిపిస్తుంది.
రోమన్ కవి హొరేస్ అన్నట్లు "సాహిత్యం యొక్క ముఖ్య ఉద్దేశం బోధించడంతో పాటు ఆనందింపజేయడం కూడా". బాణాల శ్రీనివాసరావు గారి 'రాత్రి సింఫని' ఈ రెండు లక్షణాలను అనేక కవితల్లో నెరవేరుస్తుంది. సమాజంలోని రుగ్మతలను, మనుషుల అంతరంగిక మథనాన్ని వస్తువుగా స్వీకరిస్తూనే, వాటిని అత్యంత కళాత్మకమైన, హృద్యమైన అభివ్యక్తితో కవిత్వంగా మలిచడం విశేషం. కవి తన కవిత్వంలో సందర్భానుసారంగా అద్భుతమైన ప్రతీకలను, భావచిత్రాను ఉపయోగిస్తారు. "నీటినిప్పు", "వెన్నెలశిల్పం" వంటి పదబంధాలు వారి సృజనాత్మక అభివ్యక్తికి అద్దం పడతాయి.
పర్గేటోరియో స్వాగతం" కవితా పంక్తులు కవిత్వ ఆంతర్యాన్ని, దాని సామాజిక బాధ్యతను, వర్తమాన సాహిత్య విమర్శలోని లోపాలను అత్యంత ప్రగతిశీల, తాత్విక కోణంలో విశ్లేషించాయి. పర్గేటోరియో' (Purgatorio) అనేది ఇటాలియన్ మహాకవి డాంటే అలిఘేరి (Dante Alighieri) రాసిన ప్రపంచ ప్రసిద్ధ కావ్యం "ది డివైన్ కామెడీ" (The Divine Comedy) లోని రెండవ భాగం పేరు. క్రిస్టియన్ (కథోలిక్) మత విశ్వాసాల ప్రకారం, మరణం తర్వాత ఆత్మలు నేరుగా స్వర్గానికో (Heaven), నరకానికో (Hell) వెళ్ళే ముందు.. తాము చేసిన పాపాలను పశ్చాత్తాపంతో కడుక్కొని, తమను తాము శుద్ధి చేసుకునే మధ్యంతర స్థలాన్ని 'పర్గేటరీ' లేదా ఇటాలియన్ భాషలో 'పర్గేటోరియో' అంటారు. ఇక్కడ ఆత్మలు బాధలను అనుభవిస్తూనే, చివరికి పవిత్రతను సాధించి స్వర్గానికి వెళ్ళడానికి అర్హత పొందుతాయి. ఈ పదాన్ని ఒక శక్తివంతమైన రూపకం (Metaphor)గా వాడుకున్నారు. కవి దృష్టిలో వర్తమాన సాహిత్య విమర్శ, సమాజం ఒక సంక్షోభంలో ఉన్నాయని భావిస్తున్నాడు. కేవలం అలంకారాలు, ప్రతీకలతో రాసే బాధ్యతారహితమైన కవిత్వాన్ని కాకుండా, సమాజంలోని దోపిడీని ఎండగట్టే నిబద్ధ కవిత్వాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందంటాడు కవి. సమాజంలో లేదా సాహిత్యంలో పేరుకుపోయిన కల్మషాన్ని, నిస్సహాయతను వదిలించుకుని, బాధ అంతర్మథనం ద్వారా సరికొత్త చైతన్యాన్ని, పవిత్రతను పొందే ప్రక్రియకు 'పర్గేటోరియో' ఒక ప్రతీకగా ప్రయోగిస్తూ కవిత్వం బాధ్యతాయుతంగా ఉండాలని భావిస్తున్నాడుకవి. "సుప్తచేతనలోని కలల అలలు కరిగితే కవిత్వమా?" అని ప్రశ్నిస్తూ, కవిత్వం అనేది కేవలం మనస్సులోని అంతర్గత కలలు, ఊహల నుండి మాత్రమే పుట్టదని స్పష్టం చేశారు. కవిత్వంలో సామాజిక నిబద్ధత అనేది అబద్ధం కాదని, సమాజం నుండి పారిపోయి ముక్కు మూసుకుని తపస్సు చేసే కవులుగా కాకుండా, వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కవి పిలుపునిచ్చారు. "బాధలోంచి వచ్చే భావమే కవిత్వం! వేదనలోంచి వచ్చే నాదం కవిత్వం!!" అని మనిషి అనుభవించే బాధ, శ్రమజీవుల అంతరంగ వేదనల నుండి పుట్టే నాదమే నిజమైన కవిత్వమని, అది సమాజానికి సింఫనిలా (సంగీత లయలా) వినిపించాలని కవి ఈ పంక్తుల ద్వారా నిరూపించారు. ఇది కేవలం కవిత్వ విశ్లేషణ మాత్రమే కాదు, కవుల సామాజిక బాధ్యతను గుర్తుచేసే ఒక గొప్ప సాహిత్య మేనిఫెస్టో. ఈ కవితా సంపుటి నిండా కవిత్వం, సామాజిక స్పృహ రెండూ మిళితమై ప్రవహించాయి. ఒకేసారి హృదయాన్ని పల్లవింపజేస్తూనే, మెదడుని ఆలోచింపజేస్తుంది కూడా. అందుకే ఈ కవిత్వం ‘‘రాలిపడుతున్న పూలతో పాటు జారిపడుతున్నపరిమళాల
గాయాల్నిచూడాలి
ఆ గాయాలకు
కనీసం
చూపుల లేపనం రాయాలి’’ అన్నట్లుగా సాగింది.
డాక్టర్ బాణాల శ్రీనివాసరావు గారి ‘రాత్రి సింఫని’ కవితా సంపుటి సమకాలీన తెలుగు కవిత్వ రంగంలో ఒక వైవిధ్యభరితమైన, ఆలోచనాత్మకమైన మైలురాయి. ఈ సంపుటి కేవలం సామాజిక రుగ్మతలను ఎత్తిచూపే వేదిక మాత్రమే కాదు; ఇది అంతర్జాతీయ రాజకీయ సంక్షోభాలు, గ్లోబలైజేషన్ తెచ్చిన విచ్ఛిన్నత మొదలుకొని మనుషుల అంతరంగిక వేదనలు, అస్తిత్వ ఆరాటాల వరకు ప్రతి అంశాన్ని స్పృశించిన ఒక సమగ్ర జీవన దర్పణం. సాంప్రదాయ మూలాల పట్ల గౌరవం, ఆంగ్ల సాహిత్య పరిజ్ఞానంతో కూడిన ఆధునిక దృక్పథం కలగలిసిన వీరి శైలి తెలుగు కవిత్వానికి సరికొత్త నవ్యతను చేకూర్చింది. కవిత్వంలో నిబద్ధతను చాటుతూనే, బాధను భావంగా, వేదనను నాదంగా మలిచిన ఈ 'సింఫని'.. పాఠకుడిని కేవలం ఆనందింపజేయడమే కాకుండా, ఒక నూతన సామాజిక-తాత్విక చైతన్యం వైపు నడిపిస్తుంది. చీకటి లాంటి వర్తమాన సంక్షోభాలను చీల్చుకుంటూ మానవత్వం, శాంతి అనే తెల్లపావురాల ఆశావహ దృక్పథాన్ని ప్రకటించిన ‘రాత్రి సింఫని’ అక్షరరూపం దాల్చిన ఒక సార్వత్రిక మానవ హృదయ నాదం.
(పీచర సునీతారావు స్మారక సాహిత్య పురస్కారాన్ని ‘రాత్రిసింఫనీ’ కవితా సంపుటికి ప్రకటించిన సందర్భంగా…)
– డా.దార్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్, పూర్వశాఖాధ్యక్షులు, తెలుగుశాఖ, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్. ఫోన్: 9989628049
