ఒక మరణం…
దాన్ని ఆనుకొని పయనించే క్షణాలు!
1.ఆకస్మిక శూన్యం
మరణవార్త చెవిన పడిన ఆ క్షణం...
భూమి ఒక్కసారిగా
ఆగిపోయినట్లుంటుంది.
తలమీద ఆకాశం విరిగిపడ్డా
ఇంతటి భారంగా ఉండదేమో!
నిలువునా ప్రాణం ఉన్నా...
నిశ్చలమైన శిలగా మారిపోతుంది శరీరం.
అది...
నిండు వేసవిలో అకస్మాత్తుగా
ఒక పెనుతుఫాను వచ్చి,
పచ్చని చెట్టును వేళ్లతో సహా
పెకలించివేసినట్లుంటుంది.
ఆకుపచ్చని ఆశలన్నీ క్షణంలో రాలిపోతాయి.
సముద్రపు ఒడ్డున నిలబడినప్పుడు
ఒక పెద్ద అల వచ్చి సర్వస్వాన్నీ లాక్కెళ్లిపోతే,
చేతులు చాచి నిస్సహాయంగా నిలబడే
ఒక పసివాడి ఆవేదనలా మారుతుంది మనసు.
కంటి ముందే ఉంది లోకం... కానీ ఏదీ కనిపించదు,
చుట్టూ జనం మాట్లాడుతుంటారు...
కానీ ఏ శబ్దమూ వినపడదు.
ఆ క్షణం మనసు...
తీగ తెగిపోయిన వీణలా మూగబోతుంది,
దీపం ఆరిపోయిన గదిలా చీకటైపోతుంది.
ఇది కల అయితే బాగుండనిపించేంతటి దిగ్భ్రాంతి,
నమ్మలేని నిష్ఠుర సత్యం ముందు
గుండె గొంతుకలోనే నిలిచిపోయి,
కన్నీరు కూడా నైరాశ్యంతో ఘనీభవించే క్షణమది!
2.ఆఖరి ప్రయాణాన్ని సిద్ధం చేసేవేళ…!
ఒకవైపు...
కన్నవారి, కట్టుకున్నవారి కన్నీటి నదులు
ఇంటి కప్పును దాటి ఆకాశాన్ని తాకుతుంటాయి.
గుండెల్లోంచి ఊడిపడే ఒక్కో రోదన
వాతావరణాన్ని ముక్కలు ముక్కలు చేస్తుంటుంది.
ఆ ప్రాణం లేని దేహాన్ని పట్టుకుని,
"మమ్మల్ని వదిలి ఎలా వెళ్లావంటూ"
రక్తసంబంధీకులు శోకసంద్రంలో మునిగిపోతారు.
అదే సమయంలో, అదే గది బయట...
మరో వైపు….మరొక లోకం
హడావిడిగా కదులుతుంటుంది.
అక్కడ సెంటిమెంట్లు లేవు,
కేవలం ఏర్పాట్లు మాత్రమే ఉన్నాయి.
"పూడ్చాలా? కాల్చాలా?" అనే ప్రశ్నలు
గాలిలో నిర్దయాత్మకంగానే తిరుగుతుంటాయో
నిజాన్నే కఠినంగా పలుకుతున్నట్లో …
గుండెల్లో గుబుల్ని పెంచేస్తుంటాయి
సొంతూరా? ఉన్న ఊరా? ఎక్కడ అంత్యక్రియలు?
స్మశానంలో స్థలం దొరుకుతుందా?
పాడె కట్టడానికి కర్రలు వచ్చాయా?
మనుషులు సరిపోయారా?
స్వర్గధామమా
రథం వచ్చిందా?
ముహూర్తం దాటిపోతోందేమో…
క్షణాల వ్యవధిలో వందల ప్రశ్నల హడావిడి!
ఒకవైపు బంధం తెగిపోయిన ఆరాటం,
మరొకవైపు కాలంతో పరిగెత్తే లౌకిక పోరాటం.
దుఃఖించడానికి కూడా
సమయం ఇవ్వని ఆ నిమిషాలు,
మనుషులను నిలువునా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
ఆ కన్నీటి రోదనల మధ్య...
ఈ ఏర్పాట్ల కేకలు
మనిషి నిస్సహాయతను వెక్కిరిస్తున్నట్టే…
చివరి శ్వాస ఆగిపోయిన చోట,
కన్నవారి గుండెలు పగులుతుంటే...
లోకం మాత్రం ఆఖరి ప్రయాణపు పనుల్లో
యాంత్రికంగా మునిగిపోయినట్లే ఉంటుంది!
3.శూన్యపు పొలిమేరల్లో...
హడావిడి ముగిసింది... జనం పలచబడ్డారు,
ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.
ఇన్నాళ్లూ ఓదార్చిన చేతులు విడివడి,
ఇల్లు మళ్లీ
నాలుగు గోడల ఏకాంతంలోకి ముడుచుకుంది.
ఇప్పుడు ఆ ఇంట్లో మనిషి లేడు,
ఆ మనిషి వదిలివెళ్లిన
శూన్యం మాత్రమే గోడలకు వేలాడుతోంది.
వాకిట్లో కడిగిన నీళ్లు ఇంకా ఆరనే లేదు,
లోపల గుండెలు మండుతూనే ఉన్నాయి.
అటక మీద ఆయన వాడిన వస్తువులు,
గోడకు తగిలించిన చొక్కా,
కళ్లద్దాలు, కాలేజీ డైరీ, రాసుకున్న కాగితాలు...
అవన్నీ మనిషి లేడనే నిజాన్ని నిలువునా గుర్తుచేస్తుంటాయి.
సాయంత్రం వేళ... చీకటి పడుతుంటే,
ఆ మనిషి వచ్చే సమయమేమోనని
గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంటోంది.
తలుపు తట్టేది
కేవలం గాలి మాత్రమేనని తెలిశాక,
కళ్లు మళ్లీ మూగగా నదులవుతాయి.
ఇంటి మూలల్లో ఆ నవ్వుల సవ్వడులు,
మాటల ప్రతిధ్వనులు
ఇంకా వినబడుతూనే ఉంటాయి.
అందరూ ఉన్నా...
ఎవరూ లేనట్టు
లోకం నడుస్తున్నా…
తమ కాలం ఆగిపోయినట్టు,
రక్తసంబంధీకులు
ఆ శూన్యంలో దిక్కుతోచక కూర్చుండిపోతారు.
దుఃఖం ఇప్పుడు రోదనగా మారదు,
నిశ్శబ్దపు నిట్టూర్పు అవుతుంది.
అంగీకరించలేని సత్యాన్ని అంగీకరిస్తూ,
ఆ జ్ఞాపకాల బరువును గుండెల్లో దాచుకుంటూ,
మనిషి లేని ఇల్లు
ఒక కొత్త శూన్య జీవితాన్ని
భారంగా అలవాటు చేసుకోవడం
మొదలుపెడుతుంది.
4.ముళ్లబాటలూ…
పూలదండలూ
బంధువులు, స్నేహితులు, తెలిసినవాళ్లు...
ఇల్లు వెతుక్కుంటూ సంతాపం ప్రకటించడానికి
గూగుల్ మ్యాపులడిగేవాళ్ళు
ఇంటిగుర్తులు చెప్పమని విసిగించేవాళ్ళు
తమకి తామే తెలుసుకొని
అడక్కపోయినా
ఉక్కబోతని తగ్గించే మలయవీచికలు
ఓదార్చడానికే అంటారు కానీ...
"అసలు ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది?"
జరిగిందంతా పదేపదే అడిగి చెప్పించుకుంటారు.
నయమవుతున్న గాయాన్ని మళ్లీ మళ్లీ రేపుతూ,
ఆ ఒక్క రోజూ…
దుఃఖాన్ని విడతలవారీగా కొనసాగింపజేస్తారు.
వచ్చిన వాళ్లలో రకరకాల మనుషులు,
రంగురంగుల దృశ్యాల మాటలు!
కొందరు తాత్కాలిక వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ...
"కాయో పండో కాక తప్పదు,
పుట్టినవాడు గిట్టక తప్పదు"
వల్లమాలిన వేదాంతాన్ని గుప్పిస్తారు.
మరికొందరు…
ఆ మనిషిలోని మంచితనం
మంచుపర్వతంలా మనముందు నిలడెడతారు
"అంత మంచితనం వల్లే
భగవంతుడు తొందరగా తీసేసుకున్నాడు"
ఆ మంచితనాన్నే ఒక శాపంగా మారుస్తారు.
ఇంకొందరు…
తమలో తాము గొణుక్కుంటూ,
ఆసుపత్రి వాళ్లనో,
కాలం కలిసిరాని సమయాన్నో తిడుతూ,
ప్రాణం పోయాక…
పనికిరాని శాపనార్థాలు పెడుతుంటారు.
సంతాపాన్ని యాంత్రికంగా తెలిపే వాళ్ల మధ్యే...
మరికొందరు లౌకికులు ఎదురవుతారు.
"అయిందేదో అయిపోయింది,
ఇక తర్వాత జరగాల్సిన దాన్ని ఆలోచించండి...
ఆడపిల్లో/ మగపిల్లాడో పెళ్లి ఉంది,
చదువు ఉంది..."
భవిష్యత్తు భారాల్ని
ఇప్పుడే నెత్తిపై వేయడానికి సిద్ధపడతారు.
ఒకటేమిటి...
ఎవరి నోటికి వచ్చినట్లు వారు మాట్లాడుతుంటే,
ఆ మాటల రణగొణాల మధ్య...
నిజంగానే సర్వస్వాన్నీ కోల్పోయి
గుండె మరింత మూగగా రోదిస్తుంటుంది.
లోకానికి అది ఒక ఆచారం…
ఒక పలకరింపు కావచ్చు,
ఆ శోక సముద్రంలో మునిగిన వారికి మాత్రం,
ఆ పరామర్శలు...
పూలు చల్లుతూనే
గాయం మీద కారం చల్లినట్టే ఉంటాయి!
కారంచల్లుతూనే
పూలదండలవుతూనే ఉంటాయి!
ఏది ఏమైనా
సంతాపాలన్నీ సంతోషాన్నివ్వకపోయినా
ఉక్కిరిబిక్కిరితో ఊపరిరాడని క్షణంలో
కాస్త ఓదార్పునిస్తే చాలు!
అవన్నీ నిజమైన జీవితమంటే ఏమిటో
తెలిపే ఉపనిషద్వాక్యాలనేది మాత్రం నిజం!
5. కర్మల సుడిగుండం
శరీరం బూడిదయ్యాక...
శరీరం భూమిలో కలిసిపోయాకో
శ్మశాన నిశ్శబ్దం ఇల్లు చేరకముందే,
క్యాలెండర్ ముళ్లు తరుముకుంటూ వస్తాయి.
దుఃఖాన్ని కూడా లెక్కల పుస్తకంలోకి నెడుతూ...
"మూడో రోజా? పదో రోజా?"
తిథుల లెక్కలు
గుమ్మం ముందుకొచ్చి నిలబడతాయి.
కన్నీళ్లు ఇంకక ముందే…
'దశదిన కర్మ' భారం భుజాలకెక్కుతుంది.
ఎక్కడ చేయాలి?
సొంత ఇంటిలోనా?
నదీ తీరంలోనా?
ఏదైనా పవిత్ర క్షేత్రంలోనా?
పురోహితులు దొరుకుతారా?
చోటు లభిస్తుందా?
నిర్ణయించాల్సింది మనసు కాదు
నిర్ణయం చెప్పాల్సింది మనమంకాదు
లోకాచారం!
ఎలా చేయాలి? ఏమేమి చేయాలి?
నియమాల పెద్దలు
ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తారు.
పాలు చల్లాలా?
పిండ ప్రదానం చేయాలా?
ఏమేమి సామాగ్రి కొనాలి?
ఎవరెవరిని పిలవాలి?
చేయాల్సిన పనుల పట్టిక
ఒక పెద్ద ప్రశ్నార్థకమై నిలుస్తుంది.
ఎవరేమి చేయాలి?
పెద్ద కొడుకా? చిన్న కొడుకా?
లేక రక్తసంబంధీకులా?
కళ్లల్లో కన్నీళ్లతో
వణుకుతున్న చేతులతో,
ఉపవాసాల భారంతో...
ఆ కర్మల పీఠంపై కూర్చోవాలి.
శాస్త్రాల పేరిట చెప్పే గందరగోళ నియమాలను
ఏమీ తెలియని పసివాడిలా
పాటిస్తూ పోవాల్సిందే.
ఒకవైపు...
పోయిన మనిషి జ్ఞాపకాలు
గుండెను పిండేస్తుంటే,
మరొకవైపు...
శాస్త్రం, సంప్రదాయం,
బంధువుల అంచనాలు
చుట్టూ చేరి ఊపిరాడకుండా చేస్తాయి.
కన్నవారిని కోల్పోయిన ఆవేదన కంటే,
ఆ కర్మకాండల హడావిడి, ఏర్పాట్ల ఒత్తిడే
మనిషిని నిలువునా కుంగదీస్తుంది.
ఇది... భక్తి కాదు, వైరాగ్యమూ కాదు,
సమాజం కోసం, సంప్రదాయం కోసం...
దుఃఖాన్ని పక్కనపెట్టి,
యాంత్రికంగా చేసే ఒక కన్నీటి పోరాటం!
6.మళ్ళీ జీవన స్రవంతిలోకి…!
కదలిపోయాయి తిథులు...
ముగిశాయి కర్మకాండలు,
ఇంటి ముందు
పందిరిని విప్పేసి పట్టుకెళ్లిపోయారు.
అరిగిపోయిన పలకరింపులు
ఇల్లు మళ్లీ…
కేవలం మన ఇల్లే అయ్యింది.
శూన్యం ఇప్పుడు మరింత స్పష్టంగా,
నిశ్శబ్దంగా కూర్చుంటుంది
కాలం ఎవరి కోసమూ ఆగనంటుంది
ఆకలి తన నైజాన్ని గుర్తుచేస్తూ
పొయ్యి వెలిగించమంటుంది.
పిల్లల పుస్తకాల సంచులు,
స్కూలు బస్సుల హడావిడి,
ఆఫీసు వేళలు
నిత్యజీవితపు అవసరాలు...
అన్నీ వచ్చి తలుపు తడుతుంటాయి.
గుండెల్లో ఒక పెద్ద ఖాళీ
ఎప్పటికీ పూడ్చలేని ఖాళీ
అలాగే ఉండిపోతుంది
ముఖానికి మాత్రం
ఒక పలచటి నిబ్బరాన్నేదో
తగిలించుకోక తప్పదు.
రాని నవ్వుల ప్లాస్టిక్ పూలకు
పరిమళాల్ని గభాళించాలి
ఆ ఫోటోకి పూలదండ వేసి
మా ప్రాణమదేనని భావించాలి
ఆ కళ్లల్లోకి చూస్తూ…
ఒక నిట్టూర్పును దిగమింగుకొంటూ
మళ్లీ లోకంలోకి అడుగుపెట్టాల్సిందే!
నడుస్తున్న రైలు లాంటిదే
ఈ జీవన స్రవంతి...
ఒక ప్రయాణీకుడు దిగిపోయాడని
రైలు ఆగిపోదు కదా!
మిగిలిన వాళ్లం
ప్రయాణం కొనసాగించాల్సిందే.
కన్నీళ్లను తుడుచుకుంటూనే...
మళ్లీ కలం పట్టాల్సిందే!
బాధ్యతల రథాన్ని
భారంగానైనా ముందుకు లాగాల్సందే!
ఆ మనిషి లేని లోటు...
ప్రతి అడుగులోనూ తగులుతూనే ఉంటుంది
చేసే ప్రతి పనిలోనూ
ఆ నీడ కనిపిస్తూనే ఉంటుంది.
గాయంతోనే బ్రతకడం
ఆ శూన్యంతోనే నడవడం
ఇక అలవాటైపోతుంది!
దుఃఖం ఒక నది
జీవితం ఒక సముద్రం
మళ్లీ ఆ జీవన స్రవంతిలో కలిసిపోవడమే...
మనం ఆ వెళ్లిన మనిషికి ఇచ్చే నిజమైన నివాళి!
7.బంధాల వెనుక... లెక్కల తెరలు
కళ్లల్లో కన్నీళ్లు ఇంకా తడి ఆరనే లేదు,
పోగుచేసిన జ్ఞాపకాల వాసన
ఇల్లంతా పోనే లేదు.
అప్పుడే గాలిలోకి వచ్చి చేరుతాయి
ఆర్థిక లావాదేవీల లెక్కల కాగితాలు.
మనిషి జ్ఞాపకాల కంటే
ఆ మనిషి వెనుక
వదిలివెళ్లిన ఆస్తిపాస్తుల లెక్కలు
బ్యాంకు ఖాతాలు, సంతకాలు, నామినేషన్లు…
ఇన్సూరెన్స్ కాగితాలు, పెంకుటింటి హద్దులు...
ఒక్కొక్కటిగా టేబుల్ మీదికి వస్తుంటాయి.
ఇన్నాళ్లూ
ప్రేమానురాగాలను కురిపించిన బంధుత్వాలు,
ఇప్పుడు
హక్కుల కోసం వాదించే లాయర్లుగా మారిపోతాయి.
" ఎవరికెంత బాకీ ఉన్నారో? ఎవరికెంత ఇవ్వాలి?"
"ఆ సంపాదనలో ఎవరి వాటా ఎంత?"
ఈ ప్రశ్నలు మొదలైన క్షణమే...
ఇంటి వాతావరణంలో
కమ్ముకొనే మనస్పర్థల దట్టమైన పొగ
మాటల వెనుక దాగున్న సున్నితత్వం మాయమై,
స్వరాలు కరుకుగా, అనుమానంగా మారిపోతాయి.
ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా
అహం అడ్డువచ్చి గోడలు కడుతుంది.
రక్తసంబంధమని చెప్పుకున్న నోళ్లే...
పైసల లెక్కల దగ్గర
పరాయి వాళ్లలా వాదించుకుంటాయి.
పోరాడి సాధించుకోవడానికి
ఆస్తులు ఉంటాయి గానీ
పోయిన మనిషిని తెచ్చుకోవడానికి
ఏ దారీ లేదనే
నిజాన్ని
ఆ స్వార్థపు హడావిడిలో అందరూ మర్చిపోతారు.
నిజమైన దుఃఖం...
ఒక మూలన కూర్చుని నిశ్శబ్దంగా ఏడుస్తుంటే,
లోకం మాత్రం...
మనిషి విలువను కాకుండా,
ఆ వ్యక్తి వదిలివెళ్లిన అంకెల విలువను కడుతూ
బంధాలను ముక్కలు ముక్కలు చేసుకుంటుంది.
డా.దార్ల వెంకటేశ్వరరావు 22.5.2026.
(నినాదం దినపత్రిక 31.5.2026 సాహిత్య అనుబంధంలో ప్రచురితం)
