సమకాలీన సాహిత్యానికి నిలువెత్తు ప్రతీక ‘ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ ’
ఆయన మరణించారు? కానీ, నాతో నిత్యం మాట్లాడుతున్నట్లే ఉంది. తన గురించి గుండెగొంతుకలో కొట్లాడుతున్న నాలుగు మాటల్ని బయటపెట్టలేకపోతున్నావేమని ప్రశ్నిస్తున్నట్లుంది. ఆయన పేరు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు. సుమారు ఆయన భౌతికంగా 78 ఏళ్ళపాటు జీవించారు. 1 ఆగస్టు 2025 వ తేదీన అమెరికాలో, తన కుమారుడి ఇంటి దగ్గర మరణించారు. ఆయన 2005 ఆగస్టునుండి 2008 ఆగస్టువరకు కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయానికి వైస్–ఛాన్సలర్ గా పనిచేశారు. అంతకు ముందు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదులో లెక్చరర్ నుండి ఫ్రొఫెసర్ వరకు పనిచేశారు. అక్కడే డైరెక్టర్ గా, డీన్ గా వివిధ హోదాల్లో పనిచేశారు. తన జీవిత చరమాంకంలో ‘సిరికోన వాక్స్థలి సాహితీ అకాడమీ’ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా సాహితీచర్చలు చేస్తూ గడిపారు. దాని కేంద్రంగానే అనేకమంది యువకుల నుండి వృద్ధసాహితీవేత్తల వరకు ఆయన సాహితీ చర్చోపచర్చలు చేసేవారు. అంతకు ముందు ఎంతోమందితో ఆయనకు గురుశిష్య సంబంధాలున్నాయి. కానీ, ఈ గ్రూపు ద్వారా ఆయనతో అత్యంత అనుబంధాన్ని పెంచుకున్నవాళ్ళున్నారు. రసభరితమైన ఒక వాక్యం రాసినా, అటువంటి వాళ్ళను ఆయన ఎంతగానో ప్రోత్సహించేవారు. అదే ఆయన్ని ఎంతోమంది గుర్తుపెట్టుకొనేలా చేసింది. అదే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకుండా చేస్తుంది. నేటికీ ఆ గ్రూపులో వాళ్ళ ఆవేదనలు కొనసాగేలా చేస్తుంది.
ఆయనతో మాట్లాడుతున్నంతసేపూ ఆ కళ్ళల్లో ఒక వాత్సల్యమేదో కురుస్తున్నట్లుండేది. పిల్లలు మాట్లాడుతుంటే తండ్రి తన్మయంతో వింటున్నదృశ్యమే కనిపించేది. తనకే తెలుసునన్నట్లు మనమేదో మాట్లాడుతుంటే చిరునవ్వేదో ఆయన ముఖంపైనుండి మన హృదయంపై ఒక సంతకమేదో చేసినట్లుండేది. ఇంటికి పిలవడం, తన హోదాను కూాడా మరిచిపోయి కుటుంబసభ్యుడిలా ఆదరిస్తూ ఏదొకటి తినిపిస్తూ తదేకంగా చూడ్డం వంటి ఆయన అనురాగతన్మయత్వాన్ని అనుభవించినవాళ్ళకే తెలుస్తుంది. మరలా ఆయన మాట్లాడ్డం మొదలు పెడితే, ఈయనతోనేనే మనం ఇంతసేపూ మాట్లాడిందనిపిస్తుంది. ఆయనొక విజ్ఞాన సర్వస్వంలా, మహోన్నత జ్ఞాన పర్వతంలా కనిపిస్తారు.
మనం మాట్లాడిందేదో ఆయన కూడా అంగీకరించేసినట్లో, అంగీకరించలేనట్లో వాదనలు పెట్టుకుంటారు. చిన్నపిల్లాడిలా చిన్నబుచ్చుకుంటారు. అంతలోనే అన్నీ మరిచిపోయి హృదయానికి హత్తుకుంటారు. పిల్లాడిని ఒడిలో పెట్లుకొని లాలిస్తారు. అలాంటి సంఘటనలన్నీ గుర్తొస్తుంటే ఆయనలో దైవత్వం ఉందేమోననిపిస్తుంది. మనమేమి చేయాలో ఆ సృష్టికర్తకు తెలిసినా, అన్నీ తానిచ్చి కూడా మనల్ని పరీక్షించే దైవత్వపు దోబూచులాటేదో ఆడేవారేమోననిపిస్తుంది.
ఆయన పాశ్చాత్య సాహిత్యం గురించి చెప్పినా, తెలుగు సాహిత్యం గురించి మాట్లాడినా, సంప్రదాయమైనా, ఆధునికమైనా ఆయన మాట్లాడుతున్నంత సేపు మనం మౌనంగా మారిపోవాల్సిందే. ఆ మాటల్లో ఒక జ్ఞానప్రవాహం. దానిలో మనం కొట్టుకుపోవాల్సిందే. ఒక ఆత్మీయానురాగబంధం కట్టిపడేసేది. దానితో ముడిపడాల్సిందే.
ఆయనను నేను మొదటిసారిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కలిసాను. ఒక ప్రత్యేకమైన ప్రసంగాన్ని ఏర్పాటు చేసి ఆయనను మా తెలుగు శాఖకు ఆహ్వానించినప్పుడు కలిశాను. అప్పుడు, ఆచార్య తుమ్మల రామకృష్ణగారు తెలుగు శాఖకు అధ్యక్షులుగా ఉండేవారు. అప్పటికే ఆచార్య పిల్లలమర్రి రాములుగారికి కూడా ఆయన బాగా పరిచయమని తెలిసింది. నన్ను, రామకృష్ణగారిని ఒకసారి ఆచార్య గంగిశెట్టిగారి ఇంటికి తీసుకెళ్ళారు. ఆరోజు రాములుగారితో ఆయనకు చిరకాలంగా పరిచయం ఉందని తెలిసింది.
ఆచార్య గంగిశెట్టిగారు నాకు అంతకుముందు వ్యక్తిగతంగా తెలియకపోయినా ఆయన రచనలు నాకు తెలుసు. ఆచార్య కొలకలూరి ఇనాక్ గారిపై ఒక వ్యాసం రాస్తూ రిఫరెన్స్ రచనలను ఉటంకిచేటప్పుడు, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు వ్యాసాన్ని కూడా ప్రస్తావించాను. ఆయన మా డిపార్ట్మెంట్ కి వచ్చినప్పుడు ఆ వ్యాసంలో నేను ఎప్పుడో చదివిన విషయాలు చెబుతూ ఉంటే నన్ను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత వారికి నా ‘వీచిక’, ‘బహుజన సాహిత్యదృక్పథం’, ‘సాహితీ మూర్తులు–స్పూర్తులు’ పుస్తకాలతో పాటు నా ‘నెమలికన్నులు’ కవిత్వాన్ని పోస్ట్ ద్వారా ఆయనకు పంపించాను. కొన్నాళ్ళకు ఆయన నాకు ఒక లేఖ రాశారు. ఈస్తటిక్స్ పై నేను రాసిన వ్యాసాలు ఆయనకు బాగా నచ్చాయి. ఎంతో సంతోషించారు. అవి చదివిన తర్వాత ఆయనే ఫోన్ చేస్తుండేవారు. నన్నెంతగానో ప్రోత్సహించేవారు. ఆయన రాసిన కవితలను పంపిస్తుండేవారు. నాగరాజు రామస్వామి కవిత్వాన్ని బాగా ఇష్టపడేవారు.ఆయన మొదట కవిత్వం రాశానని చెప్పారు. తర్వాతనే వ్యాసాలు రాసాననీ, అనువాదం చేశానని చెప్పారు. ఆ పుస్తకాన్ని కూడా నాకిచ్చారు. ఆయన కన్నడం నుండి అనువాదం చేసిన డా.ఎస్.ఎల్. బైరప్పగారి ‘‘పర్వ’’ నవల ప్రస్తావన వస్తే, మహాభారతాన్ని, దానిలోని ప్రతీకాత్మక, మానవీయ సంబంధాలను ఎంతో చక్కగా వివరిస్తుండేవారు.
ఆయన నాకు ఇచ్చిన పుస్తకాలు చదివి, వాటిలో పరిశోధక విద్యార్థులకు ఉపయోగపడే అంశాల గురించి మాట్లాడేవాణ్ణి. ఆ సంభాషణల ఫలితంగా పరిశోధక విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ‘సాహిత్యపరిశోధనా కళ: విధానం’ అనే పుస్తకం రాశారు. దానికి నన్ను ఎడిటర్ గా ఉండమన్నారు. ఆశ్చర్యపోయాను.ఆ పుస్తకానికి నన్ను ఎడిటర్ గా ఉండమనడమే కాదు, దానిలోని అంశాలు రాసి పంపిస్తూ, విద్యార్థులకు ఉపయోగపడే అంశాలను తరచి తరచి అడిగి తెలుసుకొని ఆ పుస్తకాన్ని పూర్తి చేశారు. ఆ పుస్తకానికి ఒక విలువైన సంపాదకీయాన్ని రాయించారు. ఆ పుస్తకాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో ఆవిష్కరించి, తన కుమారుడు కీ.శే.చెన్నసాయికిశోర్ స్మృత్యర్థం సభలో పాల్గొన్న పరిశోధక విద్యార్ధులతో పాటు, ఎం.ఏ. విద్యార్ధులకు కూడా ఉచితంగా ఆ పుస్తకాన్ని బహూకరించారు. ఆయన అప్పుడప్పుడు రాసిన కవితలను ‘‘మండువాలోగిలి’’ పేరుతో ప్రచురించారు. దాని ఆవిష్కరణ సభలో ఆ పుస్తకాన్ని నన్నే పరిచయం చేయమన్నారు. ఆ సభకు శ్రీమతి నందమూరి పార్వతి గారు అధ్యక్షత వహించారు. ఆమె ఆచార్య గంగిశెట్టిగారి శిష్యురాలు. మంచి సాహితీవేత్త.
తరచుగా ఆయన అమెరికా వెళ్ళి వస్తుండేవారు. అక్కడ నుండి కూడా ఫోన్ చేయడం, ఈమెయిల్ ద్వారా కవిత్వాన్ని పంపించడం, సాహితీ చర్చలు కొనసాగేవి. అమెరికా నుండి ఇండియా వచ్చిన తర్వాత ఇంటికి రమ్మని కూడా ఆహ్వానించారు. పిల్లలమర్రి రాములు గారు, తుమ్మల రామకృష్ణ గారితో కలిసి వెళ్లాను. ఆయన ఉండే ఇల్లు మామూలుగానే ఉంది. ఆయన వైస్–ఛాన్సలర్ తో పాటు అనేక పెద్దపెద్ద హోదాల్లో పనిచేశారు. వాళ్ళ కుటుంబం అమెరికాలో ఉంటుంది. కేవలం తాను లేదా తమ కుటుంబం వచ్చినప్పుడు ఉండడానికి మాత్రం ఒక ఇల్లుంటే చాలు అన్నట్లే పెట్టుకున్నారనుకున్నాను. ఆ ఇంట్లో సోఫామీద, కుర్చీమీద, ఆ మూలన ఉన్న ఊయల మీద, టీవి దగ్గర, టీవీ పైనా.. చిన్ని డైనింగ్ టేబుల్ లాంటి ఆ టేబుల్ మీద… ఎక్కడ చూసినా పుస్తకాలే. ఆ గోడల మీద తన కొడుకు ఫోటో. నేను ఆయన ఇంటికి వెళ్ళిన రోజు వారి శ్రీమతి కూడా ఉన్నారు. ఆ ఇల్లు చూశాక, అది ఆయన నిరాడంబర జీవితానికి నిదర్శనమనుకున్నాను. ఆయన తన రచనలను ట్యాబ్ లో రాసుకుంటుండేవారు. యూనికోడ్ తెలుగు అక్షరాలను టైపు చేసేటప్పుడు ఇంగ్లీష్ ఫొనెటిక్ కీబోర్డ్ వాడేవారు. అప్పటికే నేను వాయిస్ టైపింగ్ చేసేవాణ్ణి. ఏ ఫార్మేట్ లో ఉన్నా వాటిని మనకు కావాల్సిన ఫార్మేట్ లోకి మార్చుకోవడం, చదివి వినిపించే పద్ధతులు తెలుగు భాషలో కూడా చేయొచ్చని చెప్పినప్పుడు ఆయన సంతోషానికి అవధుల్లేవు. చిన్నపిల్లాడిలా వాటిని తనకీ చెప్పమనేవారు. చెప్తుంటే ఆ సెట్టింగ్స్ చూస్తారనుకుంటే, నా ముఖంలోకి, నా కళ్ళల్లోకి ఎంతో ఆనందంగా చూస్తుండేవారు. చాలా సేపు మాట్లాడుకున్న తర్వాత భోజనం చేశాం. వచ్చేటప్పుడు నాకు అమెరికా నుండి తెచ్చిన ఒక టీ షర్ట్ ఇచ్చారు. దాన్ని నాకు ఇచ్చేముందు దానికున్న ప్రైస్ ట్యాగ్ తీసేసి ఇచ్చారు. ఇంట్లోకి వెళ్ళి ఆయన రాసిన ‘తెలుగు సంస్కృతి’ (శాసనాలు: చారిత్రక పరిణామాలు), ‘ఆధునికత–సమకాలికత’ (కొన్ని పార్శ్వాలు) ఇచ్చారు. ‘విమర్శశాస్త్రాన్ని అభిమానిస్తూ పాతతరం అభిమానాన్ని కొల్లగొడుతున్న విద్వన్మిత్రుడు డా.దార్ల వెంకట్ కు ప్రేమతో…’ అని ఒకపుస్తకానికీ,‘మా తరం ఇంకా జీవిస్తోందన్న మాధురీభావననందించే సద్విమర్శకుడు–సహృదయుడు–మానుష కవి డా.దార్లకు ఆత్మీయంగా’’ అని మరొక పుస్తకానికి రాసిచ్చారు. తర్వాత ఒక ఇంగ్లీషు పుస్తకాలు పట్టుకొచ్చి, ఇద్దామనుకొని, తర్వాత ఇస్తానని అన్నారు.
సాహిత్యంలో ఆధునికత, సమకాలీనత అనేవి ఒకటి కాదు. సమకాలీనతలో ఆధునికత ఉంటుంది. ఆధునికత కాలాన్ని, భావజాలాన్ని, నవ్యత్వాన్ని ఆధారంగా చేసుకొంటుంది. పాత పద్ధతులకు బదులుగా హేతువాదం, శాస్త్రీయ ఆలోచనలు, వ్యక్తివాదం, పారిశ్రామికీకరణ, నూతన ఆవిష్కరణలను స్వీకరించడం వంటివి ఆధునికతలో ఉంటాయి. అంతేకాదు, సాంప్రదాయిక విశ్వాసాలు, మూఢవిశ్వాసాలకు బదులుగా శాస్త్రం, హేతువు ఆధారంగా విషయాలను విశ్లేషిస్తుంది. సమకాలీనతలో సంప్రదాయం, ఆధునికతలు రెండూ మిళితమై ఉంటాయి. సాధారణంగా ఆధునికత మానవుని కేంద్రంగా ఉంటే, సమకాలీనత మానవుడు, మానవేతరశక్తుల కేంద్రంగా ఉంటుంది. వీటితో పాటు ఉత్తరాధునికత (పోస్ట్ మోడర్నిజం), ద్రవాధునికత (లిక్విడ్ మోడర్నిటి) అనేవి కూడా భారతదేశంలో, అదీ తెలుగు వాడుకలో ఉన్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న సాహిత్యంలోను కనిపిస్తుందని కొంతమంది సాహితీవేత్తలు సూత్రీకరిస్తున్నారు. ఏకైక సత్యం అనేది ఉండదని, జ్ఞానం, సత్యం అనేది వ్యక్తిగత అనుభవాలు, దృక్పథాలు, మ సామాజిక నిర్మితిపై ఆధారపడి ఉంటుందని పోస్ట్ మోడర్నిజం వాదిస్తుంది. లిక్విడ్ మోడర్నిటీ అనేది ఆధునిక సమాజం యొక్క అస్థిరమైన, మార్పు చెందుతున్న స్వభావాన్ని వివరిస్తుంది.ఈ సమాజంలో ఏదీ శాశ్వతం కాదు. సామాజిక నిర్మాణాలు, సంబంధాలు ద్రవంలా నిరంతరం మారుతూ ఉంటాయి.ప్రజలకు ఎక్కువ స్వేచ్ఛ లభిస్తుంది, కానీ దానితోపాటు అభద్రత, ఆందోళన కూడా పెరుగుతాయి. వీటిని మన తెలుగు సాహిత్యంతో సమన్వయిస్తున్నవాళ్ళున్నారు. సృజనసాహిత్యం సృష్టించేవాళ్ళకు ఈ భావనలు, సిద్ధాంతాలు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కానీ, విమర్శకులు, పరిశోధకులు మాత్రం వీటిని తెలుసుకోవాలి. ఇవన్నీ ఆయన పుస్తకాల్లో ఎంతో వివరణాత్మకంగా రాశారు. అంత మేధావి అయినా, మనం ఏదైనా మాట్లాడితే ఎంతో గొప్పమాట చెప్పినట్లు ప్రోత్సహించేవారు.మనలో కొద్దిపాటి ప్రతిభను గమనించినా కొండంత ఆనందంతో సంతోషించే వ్యక్తి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు.
ఆయనతో ఉన్న అనుబంధంలోని కొన్ని విషయాలనైనా రాయకపోతే ఆయన ఆత్మనన్ను నిత్యం ప్రశ్నిస్తున్నట్లనిపిస్తుంది. అందుకే ఆయన గురించి నాలుగు మాటలిలా మీతో పంచుకుంటున్నాను.
– ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
తెలుగుశాఖ, పూర్వ అధ్యక్షులు,
సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్.
ఫోన్: 9989628049