‘పుస్తకాలు మనకెన్నో బోధిస్తాయి. అది సాహిత్య రూపంలో కావచ్చు. స్ఫూర్తిదాయకమైన ఆత్మకథల రూపంలో కావచ్చు. ఆ కోవ లోనిదే ఇటివలె ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వెలువరించిన ‘నెమలికన్నులు’ ఆత్మకథ’ కూడా అని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ పేర్కొన్నారు. సుప్రసిద్ధ కవి, రచయిత, విమర్శకులు ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులైన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి ఆత్మకథ ‘నెమలికన్నులు’ గ్రంథాన్ని తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి పంపిన సందర్భంగా ఆచార్య మాడభూషి వారు తమ విద్యాత్మక సిబ్బందితో కలిసి సోమవారం నాడు (18.3.2024) ఆవిష్కరించారు.
ఈ నేపథ్యంగా వారు మాట్లాడుతూ... ఆచార్య దార్ల వారు తన బాల్యం నుండి తాను అనుభవించిన జీవితాన్ని ఈ ఆత్మకథ ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించడమే కాకుండా. తన చుట్టూ వున్న ప్రపంచం ఎలా ప్రవర్తిస్తుందన్న నిజాన్ని మన ముందుంచారు. ఆత్మకథ రచయిత తన బాల్యంలో ఆకలికన్నా, పేదరికం కన్నా తనకు విద్య ఎంతో ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టిందని ఈ గ్రంథంలో తెలిపారు. ఈ రచన తనని తాను మార్చుకుంటూ ఎదిగిన తీరుకు నిదర్శనమని కూడా దార్లవారు చెప్పుకున్నారు. నిజానికి ఒక నిరుపేద కుటుంబం నుండి ఉన్నత విద్యావంతుడిగా, గొప్ప పరిపాలన దక్షుడిగా ఎదగడానికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పడిన శ్రమ మెచ్చుకోదగింది. ఇలాంటి ఎన్నో విషయాల సమాహారంగా వీరు ఆత్మకథ మన ముందు నిలిచింది. ఇలాంటి ఆత్మకథలు నేటి సమకాలీన సమాజానికి చాలా అవసరం. దీన్ని చదివిన ప్రతి ఒక్కరూ ఎన్నో విషయాల్ని తెలుసుకోవడమే కాకుండా ఎంతో ప్రేరణ పొందుతారని ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ అన్నారు. అంతేకాదు ‘నెమలికన్నులు’ పుస్తకాల్ని రచయిత ఆచార్య దార్లవారు కేంద్రంలో పనిచేస్తున్నవారికీ అలాగే గ్రంథాలయానికి పంపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం విద్యాత్మక సిబ్బందైన డా. బడిగె ఉమేశ్, డా. ఈతకోట ఈశ్వరరావు, డా. టి. ఎస్. వెంకటేశ్, డా. బాలసుబ్రహ్మణ్యం, డా. లోకేశ్వరీ తదీతరులు పాల్గొన్నారు.
నమస్తే దినపత్రిక, 19.3.2024 సౌజన్యంతో
సాక్షి దినపత్రిక, నెల్లూరు 19.3.2024 సౌజన్యంతో