తెలుగు నాటకాలలో కనిపిస్తున్న జాతీయోద్యమ ప్రభావాన్ని వివరిస్తూ డా. రావి రవి ప్రకాశ్ రాసిన పరిశోధనాత్మక గ్రంథం “తెలుగు నాటకాలు – జాతీయోద్యమం” తాను 2005వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందిన సిద్ధాంత వ్యాసాన్ని ఇటీవల ఈ పుస్తకంగా ప్రచురించారు.
భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో జరిగిన అనేక సంఘటనల్ని నాటక రచయితలు వివిధ నాటకాలుగా మలిచి ప్రజల్ని చైతన్య పరిచిన విధానాన్ని రచయిత దీనిలో చక్కగా నిరూపించారు. ప్రజలు తాము నివశిస్తున్న నేల మీద అభిమానాన్ని ప్రకటించడం, స్వజాతి జనుల మీద ప్రేమను పెంపొందించుకోవటం జాతీయతలో కనిపించే కొన్ని ముఖ్యాంశాలు. తరతరాలుగా కొనసాగుతున్న స్థానిక సత్సంప్రదాయాల పై ప్రగాఢమైన అభిమానం; నిర్దిష్ట పాలనా వ్యవస్థకి అనుగుణంగా మనుగడ సాధించే మానసిక స్థితిని కలిగి ఉండటం జాతీయత అనవచ్చు.
సర్వసాధారణంగా ప్రజలు తమ అస్తిత్త్వాలకు తీవ్రంగా భంగం కలుగుతుందని భావించినప్పుడల్లా ఈ జాతీయతా భావాలు ఉద్యమ రూపంలో కనిపిస్తుంటాయి. భిన్న జాతులు, మతాలు, సంస్కృతులు ఉన్నప్పటికీ భారతదేశంలోని ప్రజలంతా తరతరాలుగా కలిసిమెలిసి జీవించేవారని చరిత్ర చెబుతుంది. బ్రిటీష్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి, క్రమేపీ పాలనాధికారాన్ని చేజిక్కించుకోవడంతో వాళ్ళకు వ్యతిరేకంగా భారతీయుల్లో జాతీయతా స్పూర్తి అంకురించింది.
అది ఆంగ్ల విద్యాప్రభావంతో మరింతగా విస్తరిల్లింది. అనేక సాహితీ ప్రక్రియల్లో సాహిత్యం సృజనీకరించబడి ప్రజల్లో జాతీయతా భావాలు వేగంగా వ్యాపించాయి. ఈ పరిస్థితి అన్ని భాషల్లోనూ కనిపిస్తుంది. అలాగే తెలుగులోనూ జాతీయోద్యమ ప్రభావంతో భిన్న ప్రక్రియల్లో సాహిత్యం వెలువడింది. కవిత్వం, నవల, వ్యాసం, నాటకం వంటి సాహిత్య ప్రక్రియలు జాతీయోద్యమాన్ని వేగంగా ప్రసరించడంలో నిర్మాణాత్మకమైన పాత్రను నిర్వహించాయి.
జాతీయోద్యమ ముఖ్య లక్ష్యం పరదేశీయుల్ని పారద్రోలడమే ప్రధాన ధ్యేయమైనప్పటికీ, నాటకాల్లో నాడు జాతీయోద్యమం సామాజిక రంగంలో కనిపించే అనేక సమస్యల్ని పరిష్కరించేదిశగా పయనించిన కోణాన్ని కూడా రచయిత ఈ గ్రంథంలో వివరంగా పేర్కొన్నారు. వందేమాతరం, విదేశీవస్తు బహిష్కరణ, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన చారిత్రక ఘట్టాలను తెలుగు నాటకాల్లో ప్రతిఫలించిన తీరు ఈ గ్రంథంలో కనిపిస్తుంది.
కేవలం 1947 ఆగష్టు 15 వరకు మాత్రమే కాకుండా, 1948 సెప్టెంబరు 17న హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనం అయ్యేవరకూ చరిత్రను పరిగణనలోకి తీసుకొన్నప్పుడు మాత్రమే, ఆంధ్రప్రాంతానికి సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించినట్లవుతుందంటారు రచయిత. అందుకనే ఈ గ్రంథంలోని అయిదో అధ్యాయంలో తెలుగు నాటకాలపై చూపిన తెలంగాణా సాయుధ పోరాట ప్రభావాన్ని వివరించారు. ఈ ప్రభావాన్ని తెలిపే నాటకాల్ని వివరించిన తీరు బాగుంది.
వేదాంతకవి 1948 లో రాసిన ”ఛలో హైదరాబాద్” ,వాసిరెడ్డి భాస్కరరావు, సుంకర సత్యనారాయణలు కలిసి రాసిన మాభూమి నాటకాలపై సుదీర్ఘమైన విశ్లేషణ చేశారు. ఈ రెండు నాటకాలు చదివితే తెలంగాణాలో జరిగిన సాయుధ పోరాటం చాలా వరకూ అవగాహన కొస్తుంది. నిజాం నిరంకుశ పాలనలో అమీనులు, దేశ్ముఖ్ లు సాగించిన దురంతాల పై నాటి సామాన్య ప్రజలు సహితం పోరాడిన సంఘటనలన్ని జాతీయోద్యమంలో భాగంగానే చూడాలనేది ఈ గ్రంథంలో కనిపించే ఒక ప్రతిపాదన. తెలంగాణా సాయుధ పోరాటంలో స్త్రీల పాత్రను కూడా చిత్రించిన నాటకాలను వివరించారు. స్త్రీ చైతన్యాన్ని కూడా ఆయా నాటకాల్లో ప్రతిఫలించిన తీరుని వివరించారు.
సాధారణంగా పరిశోధనలో ఒక్క కొత్త అంశాన్నైనా బహిర్గత పరచాలి. అది అన్ని వేళలా సాధ్యం కానప్పుడు, ముఖ్యంగా సాహిత్య పరిశోధనలో కొత్త సమన్వయాన్నైనా అందించాలి. ఈ పరిశోధన గ్రంథంలో ఈ రెండంశాలూ కనిపిస్తున్నాయి. ఆరు ప్రధాన అధ్యాయాలుగా ఫలితాంశాలు చివరి అధ్యాయంగానూ గ్రంథాన్ని విభజించారు. తాను పరిశీలించిన అన్ని నాటకాల్లోకనిపించే ప్రధానాంశాలను రచయిత ఇలా వర్గీకరించారు. అవి: సంఘ సంస్కరణ, దేశభక్తి, సమగ్ర జాతీయతా భావం, మద్యపాన నిషేధం, విదేశీ వస్తు, శాసనోల్లంఘన, ఖద్దరు వస్త్రాలను ధరించడం, గాంధీజీ సూక్తులు పాటించడం, సత్యాగ్రహాం, శాంతి సౌహార్ద్రభావం, అస్పృశ్యతా నివారణ వంటి వన్నీ జాతీయోద్యమంలో అంతర్భాగంగా కొనసాగిన సంస్కరణలని రచయిత వింగడించి విశ్లేషించారు.
మొదటి అధ్యాయంలో కొండ అద్దమందు చూపినట్లుగా జాతీయోద్యమంలోని ముఖ్యఘట్టాల చారిత్రక క్రమపరిణామాన్ని వివరించారు.
రెండవ అధ్యాయంలో జాతీయోద్యమ నాటక నేపథ్యాన్ని వివరిస్తూ పూర్వపరిశోధనల్ని పేర్కొంటూనే తనదైన ప్రతిపాదనలను పాఠకుల ముందుంచారు. దేశభక్తి పూరితాలైన తెలుగు నాటకాలను పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలుగా విభజిస్తూనే, స్వాతంత్ర్య సమరాన్ని ప్రత్యక్షంగా వ్యాఖ్యానించిన రాజకీయనాటకాలనే విభజన కూడా చేస్తే బాగుంటుందన్నారు. ( పుట: 36)
పౌరాణిక నాటకాల్లో ఆయా పాత్రల ద్వారా జాతీయ భావాలను ప్రబోధించారని సోదాహరణంగా నిరూపించారు. దౌల్తాబాదు గోపాల కృష్ణారావు1932 లో రాసిన ? సంపూర్ణ భారతం అనే నాటకంలో అర్జునుడు శివుడిని మెప్పించి పాశుపతాస్త్రం కోరతాడు. ఆ అస్త్రమే కోరడంలో గల ఆంతర్యాన్ని తెలపమన్నశివుడితో అర్జునుడు నిరంకుశ ప్రభువులను దండించి భారతీయుల దాస్యాన్ని రూపుమాపటానికని చెప్తాడు.
తిరుపతి వేంకట కవుల రచించిన ప్రఖ్యాత నాటకం పాండవోద్యోగము ( 1938) లో ధర్మరాజు వంటి గుణ సంపన్నుడిగా గాంధీజీని కవులు వర్ణించారని ఈ పరిశోధకుడు చేసిన సమన్వయం బాగుంది. ‘అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాత శత్రువే అలిగిన నాడు…’ అనే పద్యంలో ధర్మరాజు పాత్ర చిత్రణలో గాంధీజీ జాతీయోద్యమ స్వభావం ఉందని పరిశోధకుడు వ్యాఖ్యానిస్తున్నారు. (పుట: 47) ఊటకూరు సత్యనారాయణ గారి అభిమన్యు ( 1938) నాటకంలో భర్తపై ఉండే ప్రేమ కొద్దీ ఉత్తర అభిమన్యుణ్ణి యుద్ధరంగానికి పోవద్దన్నా, తానూ సారథియై వస్తానని పలకడం, భర్త వద్దన్నా, స్త్రీలు కూడా యుద్ధంలో పాలుపంచుకోవాలని వాదించడంలో నాటి స్వాతంత్ర్య సమరంలో స్త్రీలను చైతన్యపరచడమేనంటారు రచయిత!
చారిత్రక నాటకాల్లో మహమ్మదీయుల పాలనలో హిందూధర్మానికి జరిగిన హానిని ప్రస్తావిస్తూ వ్రాసిన నాటకాలు అధికంగా ఉన్నాయి. పౌరాణిక పురుషులకంటే చారిత్రక పురుషులు స్వాతంత్ర్యయోధులలో, ప్రజలలో మరింత ఉత్సాహాన్ని నింపారని, ఆ నాటకాలను సోదాహరణంగా వివరించారు.
ముత్తరాజు సుబ్బారావు “చంద్రగుప్త’ ( 1932), శేషుబాబు అశోకరాజ్యము’ (1945), ప్రభులింగాచార్యుల పల్నాటి వీరచరిత్రము’ (1928), ఉన్నవ లక్ష్మీనారాయణ “నాయకురాలు’ ( 1926), నండూరి బంగారయ్య “ఆంధ్రతేజము’ (1938), వేదం వేంకటరాయశాస్త్రి “ప్రతాపరుద్రీయము’ ( 1897), పోతుకూచి సుబ్బయ్య “ఆంధ్రవాణీ సామ్రాజ్యము’(1944), కోలాచలం శ్రీనివాసరావు “సుల్తాన్ చాంద్ బీ’ ( 1900) కాళ్ళకూరి సాంబశివరావు “రంగరాయ కదన సమవాకారం’ ( 1899), శ్రీపాద కృష్ణమూర్తి “బొబ్బిలి యుద్దం’ ( 1908), కొప్పరపు సుబ్బారావు “రోషనార’ (1921), పడాల రామారావు ’అల్లూరి సీతారామరాజు’ ( 1950) మొదలైన నాటకాల్లో దేశవ్యాప్తంగానూ, ఆంధ్రదేశంలోనూ ప్రజారంజకంగా పాలన అందించిన పాలకుల స్పూర్తినీ, వారి పోరాట పటిమనీ, వారు మహమ్మదీయులు, విదేశీయులతో పోరాడిన చారిత్రక సంఘటనలను వర్ణించారన్నారు. ఇవన్నీ జాతీయోద్యమ ప్రభావంతో రాసిన నాటకాలేనని నిరూపించారు.
సాంఘిక, రాజకీయ నాటకాల్లో గాంధీజీ చేసిన ఉద్యమప్రభావం అత్యధికంగా కనిపిస్తుందన్నారు. గాంధీజీ ఒకవైపు స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని కొనసాగిస్తూనే, దేశం సమైక్యంగా ఉండాలంటే అంతర్గతంగా జరగాల్సిన వాటిని గుర్తించారన్నారు. దీనిలో భాగమే ఆయన కొనసాగించిన హరిజనోద్యమం అనీ దీనికి నాటక కర్తలు ఎంతో ప్రభావితులైయ్యారని ఆ నాటకాలను సోదాహరణంగా నిరూపించారు.
సుమారు 280 పేజీలున్న ఈ పుస్తకంలో జాతీయోద్యమంలో పాల్గొన్న కొంతమంది నాయకుల, కొంతమంది నాటక కర్తల ఛాయా చిత్రాల్ని కూడా ప్రచురించారు.
వీటితో పాటు ఈ గ్రంథంలో పేర్కొన్న అందరికీ అందుబాటులో లేని కొన్ని నాటకాల ముఖచిత్రాల్నైనా ప్రచురించి ఉంటే మరింత బాగుండేది. అవి సాహిత్య పరిశోధనలో భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేవి.
అలాగే, జాతీయోద్యమ కాలం నాటి సంఘటనలు పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలుగా వర్ణించేటప్పుడు, వాటిని ప్రదర్శంచేటప్పుడు వ్యక్తమైన నాటక శిల్పగతాంశాలను వివరిస్తే మరింత బాగుండేది. ప్రదర్శనానుకూలత ఏ నాటకాల్లో బాగుంది? ఏ నాటకానికి సరిగ్గా సరిపోలేదో కూడా చెప్తే బాగుండేది. నాటకంలో గల పద్యాలను, పాటలను, సంభాషణలను వివరించినా అవన్నీ ఇతివృత్తం ఆధారంగానే చెప్పినట్లయ్యింది. జాతీయోద్యమ సంఘటనలు కవిత్వం, కథ, పాట, నవల, నాటక ప్రక్రియల్లో వచ్చినప్పుడు ప్రక్రియా గతం కనీసం స్థాలీపులాక న్యాయంగానైనా ఏ ప్రక్రియలో సమర్థవంతంగా చెప్పగలిగే వీలుందో సోదాహరణంగా నిరూపిస్తే ఇంకా బాగుండేది.
మొత్తం మీద తెలుగు నాటక వికాసాన్ని అర్థం చేసుకోవడానికి ఈ గ్రంథం ఒక ముఖ్య ఆకరంగా ఉపయోగపడుతుంది. అనేక నాటకాలను సేకరించి, జాతీయోద్యమ ప్రభావాన్ని వివరించిన పరిశోధకుడు అభినందనీయుడు. ప్రతి విద్యాలయంలోనూ ఉండదగిన పుస్తకం. మరోసారి మన భారతీయ జాతీయోద్యమ స్పూర్తి రగిలించుకొని, నేటి సామాజిక సమస్యలపై ఎలా స్పందించాలో అవగాహన చేసుకోవడానికీ పుస్తకం దోహదపడుతుంది.
ఈ పుస్తకాన్ని మీడియా హౌస్ పబ్లికేషన్స్,304 శ్రీ దత్త హోమ్స్, అయ్యప్ప దేవాలయం దగ్గర, బాగ్ అంబర్ పేట్, హైదరాబాదు-13 వాళ్ళు ప్రచురించారు. దీని ఖరీదు 180 రూపాయలు. కావలసిన వాళ్ళు ప్రచురణ సంస్థ దగ్గర గాని, లేదా అన్ని ముఖ్యమైన పుస్తక విక్రయ కేంద్రాల్లోనూ దీన్ని కొనుక్కోవచ్చు.
( ఈ సమీక్షా వ్యాసం పుస్తకం డాట్ నెట్ లో 6 November 2009 న ప్రచురిత్రమైంది. అలాగే ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ( ) ప్రసారం చేయబడింది. )
(''మాకూ ఒక భాషకావాలి'' పేరుతో తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ గారు ఆంధ్రజ్యోతి (http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2008/jun/23vividha2) లో ఒక కవిత రాశారు. దీన్ని ఇప్పటికే చాలా మంది చదివి ఉంటారు. అయ్యినా నాకు నచ్చడం వల్ల ఆ కవితను ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో ఇక్కడ పునర్ముద్రిసున్నాను..దార్ల )
మ్లేచ్ఛితమన్నా సరే మమ్మల్ని మ్లేచ్ఛులన్నా సరే మెకాలేకు వందనాలు చెప్తాం పుట్టిన మా పసిపిల్లల చెవుల్లో ఏబిసిడిలే ఉచ్చరిస్తాం......
అంగ్రేజీ దేవతకు వేనవేల వందనాలు లండన్ మాది కాదు ఇంగ్లీషు మాకు రాదు పౌండ్లకోసం ఇంగ్లండు వెళ్లిన జాతి మాదికానేకాదు మేమేమీ ఇవాంజిలికల్ క్రైస్తవులమూకాదు ఆంగ్లీకరించుకున్నంత మాత్రాన మేము మార్టిన్ లూథర్లమూ కాదు....
సూపర్ కంప్యూటర్ నిర్మించిన నిరుపేదల దేశంలో బోధనాలయాల ఆంగ్లీకరణల కుంభమేళాలో ఐటి, ఐఐటి సాఫ్ట్వేర్లు దేశమంతా వేర్లొచ్చిన ఆదిశంకరుడి పీఠాలైతే ఆధిపత్య వర్ణాలు ఆనందంగా జరుపుకొనే డాలర్ కార్నివాల్లో 'టామీ' అని పిలిస్తే కుక్కలు కూడా ఇంగ్లీషు నేర్చుకుంటున్నాయి
జీన్ ప్యాంట్లు వేసుకునేవాళ్ళ దగ్గర దేశాభిమానం మీద నిక్కర్లతో చక్కర్లు కొట్టే వాళ్ల దగ్గర సంస్కృతీ సంప్రదాయాలమీద లెక్చర్లే వినాల్సిన ఖర్మపడితే అమెరికా ఎంబసీల ముందు ఆనందంగా బారులు తీరిన భారతీయ సోదరుల సుందర వదనాల మీద దమ్ముంటే ఉమ్మేసే దేవ భాషల పేర్లేమిటో!
జాతిలో సమైక్యం కాలేనప్పుడూ నీతిలో సమతుల్యం లేనప్పుడూ వాచకాల్లో ఒక్క గౌరవ పదమూ దళితుల గౌరవం కోసం వ్రాయనప్పుడూ సగౌరవంగా వీధులూడ్చే వాళ్ల పిల్లల్ని సమానత్వం ఫ్లాట్పారాల మీద సివంగిలా తరిమికొట్టేదెవడిభాష!
దేశమంటే కులమే దేశీయ భాషల Äౌగికమే ఒకడు చెండాలుడట............ మరొకడు ఆగ్నిహోత్రావధానుడట..... ఏం భాషలురా ఇవీ అంటరాని తల్లిని ఆమ్మన్నా తప్పు అష్టావధానంలో నీ యమ్మన్నా ఒప్పు ఆ రబ్బీలు అర్థంకాని అరబ్బీలు నేర్పినా సఖ్యతలు నేర్పే వాళ్ల మదరాసాలే నయంకదూ
ఖర్మ! కపటం జాతీయ అజెండా అయింది అస్పృశ్యత సారూప్యతలో బానిసత్వం ఒక పిక్నిక్ అయింది పంచాయితీ బళ్ళు మాకై అంగ్రేజీ బళ్ళు వాళ్ళకై కార్పొరేట్లు దొంగసచ్చినోళ్ళకై సైనిక్ స్కూళ్ళూ సెంట్రల్ స్కూళ్ళూ కలగా పులగమై మాపై మీకు సానుభూతెప్పుడో చచ్చిందిగదా!
ఈ నుడికారాల్నింక మ్యూజియంలోకీ ఈ భాషాదెయ్యాల్నింక గురుకులాల్లోకీ సర్కారు భాషా సౌందర్యపు గోడౌన్లలోకీ తరిమి పడెయ్యాలి..............
మాకిప్పుడొక కొత్త భాష కావాలి అది మా హృదయ ఘోషకావాలి కన్న బిడ్డల్నే అస్పృశ్యులంటూ చేతులతో మలాన్నెతించిన భాష సజీవ దహనం కావాలి.......... మ్లేచ్ఛితమన్నా సరే! మమ్ముల్ని మ్లేచ్ఛులన్నా సరే!
సాహిత్యంలో శ్రీశ్రీ అనేక సంచలనాలకు కేంద్రం బిందువుగా కన్పించడం వల్లనే నేటికీ చర్చనీయాంశమవుతున్నాడు. తాను ప్రయోగించిన భాష అంత సరళమైంది కాకపోయినా, సామాన్యుడికి కూడా ఆ భ్రమని కల్పిస్తుంది. సామాన్య పాఠకులు సైతం చాలా మంది తమకేదో అర్థమైపోయిందనే భావన కొస్తుంటారు. శ్రీశ్రీ ప్రయోగించిన పదాల వెనుక నిగూఢమైన భావాలున్నాయి. అవి ప్రతీకలు కావచ్చు, దేశదేశాలకు చెందిన వ్యక్తుల, పోరాట వీరుల, సంఘర్షణ సందర్భాలు కావచ్చు. ఆలంకారికంగా ఒక ప్రత్యామ్నాయ అనియతికి కూడా శ్రీశ్రీ మార్గం వేశాడు. ఇలాంటివెన్నో శ్రీశ్రీ రచనల్లో లోతుగా చూసేవాళ్ళకు కనిపిస్తాయి. కానీ, విచిత్రమేమిటంటే, సామాన్య పాఠకుడు కూడా ఆ శైలిలో, ఆ వస్తు ప్రతిపాదనలో మమేకమైపోతుంటాడు. ఆ రచనల్ని, ముఖ్యంగా శ్రీశ్రీ కవిత్వాన్ని చదివిన వాళ్ళపై ఆ ప్రభావం ఏదొక రూపంలో వెంటాడుతుంది. తమ కులం, మతం, ప్రాంతం, లింగం వంటివన్నీ విస్మరించి శ్రీశ్రీ కవిత్వాన్ని ఆస్వాదించడంతో పాటు అవసరమైతే తామూ ఒక కవిత రాయాలనే ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు కూడా! అలా అందరూ సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ, సృజనకారులుగా తయారవ్వాలనేదే శ్రీశ్రీ ప్రధాన ఆకాంక్ష! అలాంటి ఆకాంక్షను అందరిలో కలిగించాలనే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారన్నట్లుగా ఐనాల సైదులు, శ్రీనివాసు గద్దపాటి తమ సంపాదకత్వంలో ‘‘ స్వేచ్ఛ కోసం'' ‘‘ పేరుతో ఖమ్మం కవులు రాసిన కవితల్ని శ్రీశ్రీ స్మారక సంకలనంగా తీసుకొచ్చారు. దీనిలో సుమారు 72 కవితలు ఉన్నాయి. సవాలుగా మారిన కులం: శ్రీశ్రీ శత జయంతి సందర్భంగానే రాసినా, కేవలం స్మృతి కవితల్నే తీసుకోలేదు. సమకాలీన సమస్యల్ని వర్ణించిన కవితలు ఇందులో ఉన్నాయి. భారతీయ సమాజంలోఇష్టమున్నా లేకపోయినా ప్రతివ్యక్తినీ అనివార్యంగా ఏదో ఒక కులానికి చెందిన వ్యక్తిగానే ముద్రవేస్తుంటారు. ఇక్కడ కులానికున్న ప్రభావం అలాంటిది. ప్రేమను కూడా కలుషితంగా చూపించే కుట్రలో భాగమైన విషాధకర సంఘటన కంచెకచర్ల కోటేశుది. అది దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో ఒక దళితుణ్ణి సజీవ దహనం చేసిన సంఘటన. మళ్ళీ అలాంటి విషాధం ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఖైర్లాంజీలో జరిగింది. ఒక దళిత కుటుంబాన్ని ఊచకోత కోసేసిన సంఘటన అది. అంటే కుల వివక్ష భారతదేశవ్యాప్తంగా చాపకింద నీరులా రకరకాల రూపాల్లో విస్తరిల్లింది. దీన్ని గద్దపాటి శ్రీనివాసు " కంచికచర్ల టు ఖైర్లాంజి ' కవితలో ‘‘" "కాల, స్థల, ప్రదేశాల్లో మార్పే కానీ.../ కానీ... / అదే జీవితం/ అదే వర్ణ దురహంకార మంటల్లో/ మాడి మసైపోయిన జీవితం'' ‘‘ ( పుట: 8) అని ఆవేదన చెందటం కనిపిస్తుంది. ‘‘""భూత, భవిష్యత్వర్తమానాల్లో కూడా/ అదే జీవితం'' ‘‘ కొనసాగుతుందనే కవి ఆందోళన కుల నిర్మూలనకున్న మార్గాల్ని వేగతరం చేయమని సవాలు విసురుతుంది. కుల, మత ముసుగుల సంకెళ్ళు: అది ఏ కులమైనా కులం వల్ల వివక్ష కొనసాగుతూ, మానసిక, భౌతిక వ్యధలకు గురవుతున్నవాళ్ళెంతో మంది ఉన్నారు. ఒకప్పటి ఆధిపత్య లేదా ప్రాబల్యకుల స్వభావం నేడు మరికొన్ని కులాల్లో కనిపిస్తుంది. దానికి రకరకాల కారణాలున్నాయి. మన దేశంలో 1935 నాటికే డా.అంబేద్కర్ గుర్తించిన కులాల్ని చూసినా, ఆ కులాలన్నీ ప్రాంతాలవారీగా గౌరవమర్యాదల్లో తేడాలు ఉంటాయి. మతం మారడం వల్ల కూడా ఇలాంటి ప్రయోజనాలు అప్పుడప్పుడూ కొన్ని కులాలకు కలుగుతున్నాయి. వీటి వల్ల రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక రాయితీలిచ్చి, ఆ కుల ప్రజల్ని కూడా ప్రధాన జీవన స్రవంతికి తీసుకొని రావాలనే సదాశయంతో పెట్టిన నియమ నిబంధనలు అమలులోకి వచ్చేసరికి వాటిని సరళీకరించాల్సింది పోయి, కఠినంగా, క్లిష్టంగా మార్చేస్తున్నారు. దీని వల్ల లక్ష్యం నెరవేరకపోగా అసలుకే ఎసరు వస్తుంది. ఈ స్థితిని కవిత్వీకరిస్తూ గరికిపాటి మణీందర్ "ధృవీకరణ పత్రం' పొందడానికి కొన్ని కులాల వాళ్ళు పడుతున్న కష్టాల్ని వర్ణిస్తూ నన్ను నేనుగా రుజువు పరుచుకోవడానికి/ ఎవరో అనామకుల/ ధృవీకరణ సంతకం ప్రామాణికమైనందుకు/ సిగ్గుతో చితికిపోతున్నాను'' ( పుట:10) అని అనేక మంది పడుతున్న ఇబ్బందులను, కోల్పోతున్న ఆత్మగౌరవాన్ని వివరిస్తున్నాడు. ఇవన్నీ భరించలేని వాళ్ళు జార్జ్ ని జంగమయ్యగాను/ మరియమ్మను మంగమ్మ గాను/ మార్చలేక చదువుకు/ దూ... రం... గా.../ వెళ్ళిపోతున్న వైనాన్ని పేర్కొంటున్నాడు. ఈ సమస్య ప్రధానంగా దళితులే ఎదుర్కొంటున్నారు. హిందువులుగా ఉంటే దళితులకు అంటరానితనం లేదా కులం వల్ల వచ్చే రకరకాల ఆత్మగౌరవ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయని, అందువల్ల వారికి కొన్ని ప్రత్యేక రాయితీల్ని ఇస్తున్నారు. క్రైస్తవులు, ముస్లిములుగా మత మార్పిడి జరిగితే ఆ మత భావనల్ని బట్టి అందులో కులం పట్టింపులు ఉండకూడదు. అంటే హిందూ మతంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్య ఆ మతాల్లోకి మారిపోవడం వల్ల పరిష్కరింపబడాలి. కానీ, ఆచరణలో అలా జరగడం లేదు. అక్కడ కూడా కులాన్ని బట్టి, వారి ఆర్థిక స్థితిగతుల్ని అనుసరించి గౌరవమర్యాదలు లభిస్తున్నాయి. అలాంటప్పుడు మతమార్పిడి జరగాల్సిన అవసరమేముంది?అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మతం మారిపోవడం వల్లనే కుల సమస్యలన్నీ తీరిపోతాయని అనుకొనే పరిస్థితులు నేడు అంతగా లేవు. కానీ, నిర్భంధ కుల వృత్తులు అక్కడ లేవు. తమ తెలివి తేటల్ని బట్టి "ఆ సమాజం'లో గౌరవంగా బతుకుతున్నవాళ్ళున్నారు. ఆ పరిస్థితి హిందూ మతంలో దానితో పోల్చదగినంతగా లేదు. పైగా నేడిలా మళ్ళీ అన్ని మతాలూ కులాన్నే ఆశ్రయిస్తాయని ఊహించని రెండు, మూడు ముందటి తరాలు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా హిందూ మతం నుండి బయటకి వెళ్ళిపోయారు. ఇప్పడు విద్యావంతులవుతున్న దళితులు వాస్తవ పరిస్థితులు గమనిస్తున్నవాళ్ళు మతం మారిపోవడానికి ముందంజవేయడానికి అప్పుడున్నంత వేగంగా ముందంజ వేయట్లేదు. మరో వైపు ముందుతరాల వాళ్ళు పెట్టిన పేర్లను బట్టి వీళ్ళ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వీళ్ళకి కూడా ఆ మత ముద్రలే వేస్తున్నారు. వీటిని వ్యతిరేకిస్తున్న తరానికి ప్రాతినిథ్యం వహించే కవితగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇలా కుల, మత కోణాల్లో వస్తున్న సమస్యల్ని వర్ణిస్తూ శీలం భీష్మారెడ్డి ఐటి యుగంలో కూడా ఆధునికులమనుకుంటూనే మనసు మాత్రం మూఢత్వంతో పయనించడాన్ని నిరసిస్తూ "జల అస్పృశ్యత' కవితను రాశాడు. ఒకప్పుడు కొన్ని కులాలకే పరిమితమయిన, తప్పని సరి పరిస్థితిలో తినవలసి వచ్చిన ఆహారం కూడా అందకుండా పోవడానికి గల కారణాల్ని అన్వేషిస్తూ జి. మాణిక్యరావు "మా గూడెంలో మల్లెపువ్వు'లా గొడ్డుమాంసాన్ని వర్ణిస్తాడు. దళితేతరులు ఈ ఆహారం పట్ల వ్యవహరించే ద్వైదీభావాన్ని నిరసిస్తాడు. ‘‘రోగం వచ్చిందనో డాక్టరు తినమన్నాడనో/సలవసేతందనో దొంగసాకులు సూపి/సాటుమాటుగా తెచ్చుకొని తెగమెక్కడం లేదా/ పెమాన సాచ్చిగా/ గుండెమీద చెయ్యేసుకొని సెప్పండి సూద్దాం'' ‘‘(పుట: 27) అని సవాలు విసురుతున్నాడు కవి. అలా తిన్నందుక్కాదు కవి నిరసన. ‘‘పేరుకేమో మేము బొక్కేది మీరు/ అంటున్నానని కాదు గానీ/ గొడ్లను కోయడానికి/గూడేల్లో చావిడుల్లున్నట్లు/ఊళ్ళో కూడా ధైర్యంగా చావిళ్ళు కట్టుకోండి/మేం రొమ్ము తప్పెట్లు వాయిత్తా/ సంతోషంగా మద్దతిత్తాం'' ‘‘ (పుట: 27) అనడంలో మాదిగలు ఆత్మగౌరవాభివ్యక్తి ఉంది. ఒకప్పుడు గొడ్డుమాంసం అంటేనే మాదిగలు వెంటనే స్ఫురించేవారు. నేడు అవి పరాయివాళ్ళు పెద్దవ్యాపారంగా మార్చుకున్నారు. గ్రామాల్లో అక్కడక్కడా చిన్న చిన్న దుఖాణాలు పెట్టుకున్నా, మాదిగల కంటే మాదిగేతరులే డాక్టరు చెప్పాడనో, రకరకాల కారణాలు చెప్పు ఆ మాంసాన్ని రహస్యంగా రప్పించుకొని తింటూనే, బహిరంగంగా మాత్రం మాదిగల్ని నిందించడంలో దళితేతరుల ద్వైదీభావ స్వభావమే కాకుండా, వాస్తవంగా జీవించలేని స్థితిని వెల్లడిస్తుంది. మరోవైపు స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, అమాయకంగ?ా బతుకువెళ్ళదీసే కులాన్ని నిందిస్తు బతికేవాళ్ళ అసలు రంగునీ బయటపెడుతుందీ కవిత. వేకువ బాబు అంటరాని దేవుళ్ళు'' గురించి దేవుళ్ళండీ దేవుళ్ళు/ మాఊళ్ళో దేవుళ్ళూ.../ఏ ఊళ్ళోనైనా దేవుళ్ళే...!'' (పుట: 110) అంటూ గ్రామంగా పెత్తందారీ కులాల వాళ్ళు తప్పనిసరిగా మొక్కించుకొనే వ్యవస్థను వ్యంగ్యంగా మనకళ్ళముందుంచుతున్నాడు. ఇలా కుల దృక్పథంతో రాసిన కొన్ని కవితలు ఉన్నాయి. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకత: సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే, వస్తు సంస్కృతిని నిరసించే కొన్ని కవితలతో పాటు, భావజాలాన్ని నమ్మినట్లు నటిస్తూ, తమ కుటుంబాన్ని మాత్రం ఆ భావజాల దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తపడే వాళ్ళనీ ఈ సంకలనంలో కవులు తూర్పారబట్టారు. తాము చెప్పేదానిపట్ల చిత్తశుద్దిలేని డొల్లతనాన్ని ఎండగట్టవలసిందేనన్నారు. శ్రమైక జీవన సౌందర్యం: కుటుంబసంబంధాలే నిజమైన మానవీయ సంబంధాల్ని పటిష్టపరిచే ప్రాధమిక సామాజిక నియంత్రణ సాధనాలుగా భావించిన కవితలు కూడా ఉన్నాయి. ఐనాల సైదులు అమ్మనవ్వాలనుంది'' గొప్ప అనుభూతినిచ్చే వాస్తవ వ్యక్తీకరణ. ప్రపంచంలో మాతృత్వాన్ని ఎన్ని రకాలుగా వర్ణించినా ఇంకా మరేదో మిగిలే ఉంటుంది. ప్రతి వ్యక్తీ తన సుఖ సంతోషాలలో పాలు పంచుకోలేక జీవితమంతా త్యాగాలతోనే నిండిపోయిన తల్లుల్ల్ని నిరంతరం స్మరించుకోవడం జరుగుతుంటుంది. అది ఆ వ్యక్తిలో ప్రవహించే మానవీయతకు నిలువెత్తు నిదర్శనం. కొన్ని వర్గాల ప్రజలకు అక్షరం కొన్ని తరాల వరకూ గగన కుసుమమే అయ్యింది. తాను గానీ, తన ముందు వాళ్ళుగానీ పొందలేని అక్షరభాగ్యాన్ని తన కొడుకులో చూసుకుంటున్న తల్లి ఫీలింగ్స్ ని వర్ణిస్తూ ముత్యాలూ.../ నీ కొడుకు అన్నింటా ఫస్టేనన్న/ పంతులు గారి పలుకులిని/ కడుపార నీళ్ళు తాగిన/ పంటకాలవయ్యేది'' ( పుట: 136) అన్నాడు. ఈ కన్నీళ్ళు ఆనందభాష్పాలు. వీటిని పంటకాల్వతో ఉపమించడం ఔచిత్యమైన పోలిక! ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేసిన ఆత్మీయ శ్రమ సంబంధాల్ని కవితాత్మకంగా పొద్దంతా/ కలుపుకొచ్చిన పొలంల/కొడవలై/మాపుటాళ్ళకు/కమ్మోరి కొట్టంల/ రోకటి పోటయ్యేది/బీడుల్ని సాగుచేసిన నాయన/బొక్కెనయితే/దానికి తాడైంది'' అని గుర్తుచేసుకుంటాడు. తల్లిదండ్రుల శ్రమని మర్చిపోని కొడుకు చేయాల్సిన కర్తవ్యం తాను విజయవంతంగా నిర్వర్తిస్తూ అందరి చేతా ప్రశంసించబడుతున్నా, ఇంకా ఏదో అసంతృప్తి వెంటాడుతున్న కవి అమ్మకి ""అమ్మ నవ్వాలనుంది'' అంటాడు. ఈ కవితా సంకలనంలో మరో కొన్ని విశేషాల్ని ముచ్చటించుకోవాలి. జీహాదీ పేరుతో జరుగుతున్న దాడుల్ని ఒక కరడుకట్టిన హిందువు వాదించినట్లున్న కవిత ఒకటి దీనిలో కనిపిస్తుంది. సమైక్యవాదాన్ని ఆకాంక్షించే దిశగా కూడా కవితలున్నాయి. అయితే అది సమానత్వాన్ని కోరుకొనే సమైక్యత. వర్ణ, వర్గ, లింగ, ప్రాంత వివక్షలు లేని సమైక్యతగా ఉండాలనే ఆశయంతో కూడినది కావడం విశేషం. శ్రీశ్రీ స్మృతి కవితలు కూడా కొన్ని ఉన్నాయి. శ్రీశ్రీ స్మృతి కవితల నివాళి: శ్రీశ్రీ ని ఈ యువకవులు రకరకాల కోణాల్లో దర్శించుకున్నారు. శ్రీశ్రీ తో పయనించాలని ప్రతిన పూనినవాళ్ళున్నారు. ""ఓ మహాకవి శ్రీశ్రీ/ అక్షరం చూస్తే మీ కవిత్వం గుర్తొస్తుంది/మీ కవిత్వంలో దాగిన జనం బతుకు గుర్తుకొస్తుంది/ జనానికి రణం ఎలా నేర్పాలో మాకు తెలుస్తుంది''(పుట: 57) అని బొగ్గారపు రాజా అభివర్ణించాడు. మరో కవి యుగంధర్ శ్రీ శ్రీ సాహిత్యంలో తీసుకొచ్చిన నియతిరాహిత్యాన్ని స్మరిస్తూ.. ఛందస్సుల చరబట్టి/ అలంకారాల నొదిలి పెట్టి/కఠిన పదాలపై కోతపెట్టి'' న యుగకర్తగా నూతన శకానికి నాందిపలికాడన్నాడు. నియతి అతిక్రమణ కొన్నిసార్లు మంచికి దారితీస్తుంది. మరికొన్ని సార్లు అవ్యవస్థతకు కారణమవుతుంది. శ్రీశ్రీ ఛందో బందోబస్తుల్ని తెలిసి అతిక్రమించాడు. ఆ నియతి అతిక్రమణ వల్ల కవితాశైలిలో, వస్తు స్వీకరణలో నూతన మార్గాలేర్పడ్డాయి. ఈ విషయాన్ని చెప్తూ ఒక కవితలో చేసిన వ్యాకరణ నియతిరాహిత్యం అసహజంగా ఉంది. అది నిజంగా నియతిరాహిత్యమేనా ? అనే సందేహం కూడా కలుగుతుంది. వ్యాకరణమర్యాదలు తెలిసి, దాన్ని సహజంగా అతిక్రమించడం వ్యాకరణ నియతిరాహిత్యం అవుతుంది. తెలియకుండా చేసేది ప్రయోగం అని అసలే అనిపించుకోదు. అది అజ్ఞానం అవుతుంది. కొత్తగా కవిత్వం గానీ, మరే ప్రక్రియలో గానీ రాసేటప్పుడు వీటిని గుర్తెరిగి రాస్తే మంచిది. సహజత్వంలోని సౌందర్యాన్ని ఆస్వాదించడంలోనే నిజమైన నిష్కల్మషత్వం మానవీయతను పరిమళింపజేస్తుంది. అది విద్యాసాగర్ కవితలో కనిపించి నిసర్గ సౌందర్యాన్ని మన కళ్ళముందుంచుతూ మంచి శిల్పబిగువుతో సాహిత్యంలో నిలిచిపోతుంది. " ఈ జాతి మీదా, నీతి మీదా చేసిన సమతా మానవతా సంతకం శ్రీశ్రీ' గా సిహెచ్. ఆంజనేయులు, " తెలుగుతల్లి అమ్ముల పొదిలో అక్షర కణాన్ని రాల్చే అరుణాస్త్రం' గా బి.ఇందిర, శ్రీశ్రీ మనోబలం తెలుగు సాహిత్యానికే హలం వంటిదని కాలవ సుధాకర్ నివాళులర్పించారు. ఈ పుస్తకంలో శ్రీశ్రీ స్మృతిని ఒక మినీకవితలో ఎం.ప్రభాకర్ ప్రతిభావంతంగా వర్ణించాడు. సూర్యుడి నుదుట/ ఎర్రని బొట్టు పెట్టాలనుకోవడం/ సముద్రపు గొంతులో/ గుక్కెడు నీళ్ళునింపాలనుకోవడం/ఆకాశంలో అనంత నక్షత్రాలను / లెక్కించాలనుకోవడం/ మహా కవి శ్రీశ్రీ కవిత్వాన్ని / విశ్లేషించాలనుకోవడం/ఒక్కటే మిత్రమా!'' (పుట: 44) అని శ్రీశ్రీని అంచెనా వేయడం అసాధ్యమంటున్నాడు. ఇంచుమించు ప్రపంచగీతంగా కీర్తించదగిన లక్షణాలు ఉన్న కవిత వెంకట్రామయ్య రాశాడు. ప్రతి ప్రగతి శీల పోరాటంలోనూ తమనాయకుడిని ఈ కవితలో చూసుకొనే విశ్వజనీన భావనతో బహుశా అతను మరణించకపోవచ్చు'' అంటూ పోరాటయోధుణ్ణి, విప్లవవీరుణ్ణి కీర్తించాడు కవి. నిజాయితీతో పోరాడి నేలకొరిగిన వాడు ఎప్పటికీ చిరస్మరణీయుడే అవుతాడు. బహుశా అతను మరణించకపోవచ్చు/ రేపో మాపో వేల మెగా వాట్ల శక్తితో/ విర్చుక పడొచ్చు/ప్రజా ఊరేగింపు అగ్రభాగాన/ బ్యానర్ గా మారి/సింహ గర్జన చెయ్యొచ్చు/ బిగించిన పిడికిళ్ళలో/ మరింతశక్తిని అందించవచ్చు/ఉద్యమానికి ఊపిరిగా మారి/విజయకేతనం ఎగరవేయవచ్చు'' (పుట: 49) ఇంకా చాలామంది శ్రీశ్రీని స్మరించుకొంటూ కవితలు రాశారు. తెలుగు తనానికి నూతన వెలుగులు అద్దినవాడిగా లింగాల వెంకన్న, నిన్ను మరువలేమంటూ గంధసిరి మల్లయ్య, శ్రామికుని స్వేదాన్నే వేదంగా భావించిన కవిగా యశ్ పాల్, నవసమాజ నిర్మాణం కోసం నాందిపలికిన కవిగా సస్య, కొండంత ధైర్యాన్నిచ్చిన కవిగా నీరుకొండ,శ్రీశ్రీని సూర్యుడితో పోలుస్తూ, పోరాటం ఒక నిరంతర స్రవంతిగా చొల్లేటి సునీత, శ్రీశ్రీ అనే రెండక్షరాలు ఆరని విప్లవజ్వాలలుగా అన్వేషి కొమరారం, కదం తొక్కే గుర్రంపై జోన్ ఆఫ్ ఆర్క్ శ్రీశ్రీ కవితగా సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు వంటి చాలామంది కవులు శ్రీశ్రీకి నివాళులు అర్పించిన కవితలు దీనిలో ఉన్నాయి. శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ఖమ్మం ప్రజా రచయితల సమాఖ్య అర్పించిన ఘనమైన నివాళిగా దీన్ని భావించవచ్చు. ఇది ఖమ్మం జిల్లా నుండి వచ్చిన కవితా సంకలనం. కనుక, సహజంగానే అక్కడ ఉన్న గిరిజనుల గిరించి కూడా కొన్ని కవితలు ఉంటే బాగుండేది సీతారాం, జ్వలిత, పి.విద్యాసాగర్ వంటి సీనియర్ కవులు ఈ సంకలనంలో కనిపించి, యువతకు ప్రోత్సాహం ఇచ్చినట్లయ్యింది. దీనిలో చాలా మంది కవులు మొదటి సారిగా కలం పట్టిన వాళ్ళున్నారనిపిస్తుంది. తమ భావాల్ని స్వేచ్ఛగా రాసుకొనే స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా, వాటిని యథాతథంగా ప్రచురించే విశాల దృక్పథం ప్రదర్శించిన సంపాదకులు అభినందనీయులు! ఇటువంటివి అన్ని జిల్లాల నుండీ రావాల్సి న అవసరం ఉంది.
ప్రముఖ విమర్శకుడు డా.ద్వానాశాస్త్రి గారి సంపాదకత్వంలో వెలువడిన " మానాన్న గారు" ( కీర్తిశేషులైన 62 మంది సాహితీ ప్రముఖుల జీవితానుభవాలు) గ్రంథం వెలువడింది. దీన్ని ఈ నెల 25 వ తారీఖున సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గాన సభ, హైదరాబాదు లో ఆవిష్కరిస్తారు. డా. సి.నారాయణ రెడ్డి, డా. కె.వి. రమణాచారి, సుమారు 102 సంవత్సరాల జి. నారాయణ శెట్టి ( IAS, Retd) తదితరులు వక్తలుగా పాల్గొంటున్నారు. ఆసక్తి గల సాహితీవేత్తలు అందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులేనని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
డియర్ ఫ్రెండ్స్, బ్లాగర్స్ అండ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కార్యకర్తలారా!
నా బ్లాగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఎప్పుడూ తక్కువ భావంతో చూడలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలని మనస్స్పూర్తిగా కోరుకుంటున్న వాణ్ణి. నేనూ అనేక అణచి వేతలకు గరవుతున్న వర్గం నుండి వచ్చిన వాణ్ణే. పీడన ఎలా ఉంటుందో తెలిసిన వాణ్ణి. ఒక రచయితగా, ఒక కవిగా, ఒక పౌరుడిగా సమాజంలో జరుగుతున్న అనేక అంశాల పట్ల మన స్పందనలు వ్యక్తం చేస్తుంటాం. అలాగే నేనూ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమానికి సంబంధించి మొదటి నుండీ నేటి వరకూ ఆ ఉద్యమం పట్ల సానుభూతి ఉన్నవాణ్ణే. దీనికి ఉదాహరణగా నెట్ లో నేటికీ ఉన్న నా అనేక అభిప్రాయాలే నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో మీ ఆకాంక్షలు, ఆలోచనలేమిటి? పేరుతో నా బ్లాగులో ఒక పోస్టు రాశాను. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందూ, తర్వాతా మన అభిప్రాయాలూ, ఆకాంక్షలు ఎలా ఉంటాయో, మనం సమాజాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామో తెలుసుకొనే విధంగా ఒక బ్లాగరుగా కొన్ని ప్రశ్నలతో ఒక పోస్టు రాశాను. దాన్నిఒకరిద్దరికి కలిగిన అపార్థం చేసుకున్నారు. అందువల్ల మరింత మంది అపార్థం చేసుకోకుండా నా బ్లాగు నుండి దాన్ని తొలగిస్తున్నాను.
అని12/2/09 నాడే యూనివర్సిటీలో జరిగిన సంఘీభావ ప్రకటన అనంతరం ఒక పోస్టు రాశాను. తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమాన్ని సమర్థిస్తూ రాసిన ఇలాంటి అనేకమైన నా పోస్టులు ఉన్నాయి. కొన్ని పోస్టులు రాసినప్పుడు ఎంతమంది స్పందించారు. అప్పుడు ప్రతిస్పందించని వారు కూడా ఇప్పుడు ప్రతిస్పందించడానికి కారణం, బహుశా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల నా అలోచనలో ఏమైనా మార్పు వచ్చిందని అపోహ పడి ఉండవచ్చునని అనుకుంటున్నాను. అందువల్ల వీరందరికీ స్పష్టంగా వివరించడానికే ఈ సవరణ ప్రకటన చేస్తున్నాను. ఎప్పటికీ వివక్ష, పీడనలకు వ్యతిరేకంగానే నా అలోచనలు, నా రచనలు కొనసాగుతాయణీ గమనించవలసిందిగా కోరుతున్నాను.
తెలుగుకథ ప్రారంభమై నూరేళ్ళవుతున్న సందర్భంలో 2009 సందర్భంలో వచ్చిన పుస్తకాలలో నాకు నచ్చిన కథా సంకలనం ” ఇప్పపూలు ( గిరిజన సంచార తెగల కథలు). తెలుగులో వచ్చిన అనేక కథలను పరిశీలించి వారికున్న వనరుల పరిమితుల దృష్ట్యా సుమారు 29 కథలను ఆకర్షణీయమైన ఫాంటుతో ఒక సంకలనంగా తీసుకొచ్చారు. ఆచార్య జయధీర్ తిరుమల రావు, జవీన్ ల సంపాదకత్వంలో వచ్చిన ఈ పుస్తకంలో ప్రతి పదాన్నిఎంతో జాగ్రత్తగా ప్రయోగిస్తూ రాసిన విలువైన ముందుమాట కూడా ఉంది. ఈ పుస్తకాన్ని “గిరిజన హక్కులు మానవ హక్కులేనని ఎలుగెత్తి చాటిన” బాలగోపాల్ గార్కి అంకితమివ్వడం నాకింకా బాగా నచ్చింది.
చిక్కనవుతున్నపాట, నీలిమేఘాలు, నల్లపొద్దు, మాదిగ చైతన్యం లాంటి పుస్తకాల స్థాయిలో మళ్ళీ తెలుగు సాహిత్య చరిత్రలో ఒక గొప్పస్థానాన్ని పొందగలిగిన పుస్తకమవుతుంది. గిరిజన కథలను కూడా దళిత, స్త్రీవాద కథలలాగే గిరిజనేతరులే ముందుగా ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో, ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే ఇటీవల కాలంలోనే గిరిజనులు కూడా కథల్ని రాస్తున్నారు. తమ జీవితాల్ని తామే రాసుకోవాలని నష్టపోతున్న దళిత సాహిత్య అస్తిత్త్వవాతావరణంలో ఇలాంటి సంపుటి వెలువడడం కొత్త ఆలోచనలకు మరో పిలుపునిచ్చే ఆశను కూడా కలిగిస్తుంది.
చాలా మంది పరిశోధకులు, విమర్శకులు ఇంతవరకూ చింతాదీక్షితులు ( 1891- 1956) రాసిన చెంచురాణి కథనే తొలి గిరిజన కథగా భావించేవారు. కానీ, గూడూరు రాజేంద్రరావు ( 1904 - 1945) రాసిన చెంచు కథ మొట్టమొదటి గిరిజన కథగా నిలుస్తుందనే ప్రతిపాదన ఈ పుస్తకంలో కనిపిస్తుంది.
గిరిజన దంపతుల పెండ్లికి చీరకొనుక్కోవడానికి ఆరు రూపాయల అప్పు ఇచ్చి, ఆ చెంచిని అనుభవించాలని నిరంతరం ప్రయత్నించి, చివరికెలాగోలా బలాత్కరించి, ఆమెను చంపేసిన కాబూలీవాలా వికృతస్వభావంతో పాటు, ఆ దంపతులను పనిచేయించుకోవడమే తప్ప వాళ్ళని మనుషులుగా పరిగణించని సమాజ స్వభావాన్ని శిల్పబిగువుతో వర్ణించిన కథ చెంచు. ఆ గిరిజన దంపతుల మధ్య గల స్వచ్చమైన, విడదీయలేని అనురాగం, కళ్ళుపోతున్న తన భర్తను కాపాడుకుంటూనే, కాబూలీవాలా వికృతచేష్టల్ని చెప్పుకోలేక, తప్పించుకోలేక ఆ చెంచి పడిన సంఘర్షణను చిత్రించడంలో రచయిత ప్రతిభ అనన్యసామాన్యం.
చెంచురాణి కథ గిరిజనుల్లో గల ఆచారాలకు బలైపోయిన ఒక ప్రేమమూర్తి జీవితం చుట్టూతిరుగుతుంది. కర్నూలు పరిసరాల్లోని గిరిజన తెగల్లో చెంచుల్ని ఊచకోతకోసిన చారిత్రక సంఘటనల్ని చెత్రిస్తూ రచయిత్ర సామాజిక వాస్తవికతతో గిరిజనుల పక్షం వహించాడు. గిరిజనేతర రచయిత అయినప్పటికీ ఆ సంస్కృతిని, సంప్రదాయాన్నీ, అన్నింటికీ మించి ఆ జీవితాన్ని గొప్పగా ఆవిష్కరించాడు. చెంచురాణి ప్రేమకథను సామాజిక సమస్యతో ముడిపెట్టి నడిపించడంలో గొప్పనైపుణ్యాన్ని సాధించాడు. అడవిని నమ్ముకున్న గిరిజన చెంచులు, తమ ఆహారం “ నాగరికుల” పరమైపోతూ, తాము ఆకలితో నకనకలాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అడవిలోని పంటనంతా పట్టుకుపోతుంటే, దాన్ని దక్కించుకోవడానికి గిరిజనుల్లో అందమైన ఒక యువతి చెంచిత పరిష్కారాన్ని సూచించిన వాళ్ళని పెళ్ళిచేసుకుంటానంటుంది. అప్పటికే ఆమెను ఒకతను ప్రేమిస్తున్నా, మరొకడు పరిష్కారం సూచించడంతో, ఆ పరిష్కారం వల్ల మళ్ళీ తమ జాతి ప్రజలకు ఆహారం దొరికి సుఖసంతోషాలతో ఉండటం వల్ల ఆతన్ని వివాహం చేసుకుంటుంది. కానీ, తన మొదటి ప్రేమికుడి అభ్యర్థన మేరకు రహస్యంగా కలిసి మెలిసి ఉండటం, దాన్ని ప్రజలు గమనించి, పెద్దలు శిక్ష వేసి పదిహేను రూపాయలు చెల్లించమంటారు. కానీ, వాటిని చెల్లించలేకపోతాడు.జాలితో ఆ డబ్బుని ఒక తెల్లదొర చెల్లిస్తాడు. దానితో మళ్ళీ ఆమె దొరకే చెందాలని పెద్దలు నిర్ణయించడం, ఆ దొరకి ఆ ఉద్దేశం లేకపోయినా, కొన్నాళ్ళు కలిసి ఉన్నతర్వాత, ఆమె గర్బవతి కావడం, ఆ దొర బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం, అతనితో పాటు మాత్రం ఆమెను తీసుకెళ్ళడాని అతను అంగీకరించకపోవడం, అయినా ఏ నాటికైనా తన భర్త వచ్చితీసుకెళ్ళతాడని అలాగే ఉండిపోతుంది. మళ్ళీ ఇంతకు ముందు ప్రేమించిన, పెళ్ళిచేసుకున్న వాళ్ళిద్దరూ వచ్చి రమ్మన్నా రాకుండా అక్కడే జీవితాన్ని చాలిస్తుంది. ఇది ఈ కథ.
చెంచి కథ వ్యవహారంలోనూ, చెంచురాణి సరళ వ్యవహారికంలోనూ సాగినా, రెండూ శిల్పం దృష్ట్యా చూసినా గొప్పకథలే. ఇలాంటి కథలతో పాటు కరుణకుమార 512 ; భూషణం పులుసు, ఫణికుమార్ దండారి; సాహు రక్తపింజెర ; బి.ఎస్.రాములుఅడవిలో వెన్నెల ;పి.చంద్ అనామతు ఖాతా ; అట్టాడ అప్పలనాయుడు అరణ్యపర్వం ; అల్లం రాజయ్య మలుపు ; గోపి భాగ్యలక్ష్మి జంగుబాయి ; ఎ.విద్యాసాగర్ కొండకు కట్టెలు మొయ్యమంటారా సారూ?; వాడ్రేవు వీరలక్ష్మీ దేవి కొండాఫలం ; సువర్ణముఖి గోరపిట్ట ; గంటేడు గౌరునాయుడు ఆర్తి శ్రీరామ్ కవచం సాగర్ కలలోని వ్యక్తి; పెద్దింటి అశోక్ కుమార్ గోస ; బోయి జంగయ్య ఇప్పపూలు; జాతశ్రీ వ్యక్తిగతం; జీవన్ పోటెత్తిన జనసంద్రం ;కొండవీటి సత్యవతి గూడు ;డా.వి.ఆర్. రాసాని పయనం; డా.దిలావర్ అరణ్యరోదన, శిరంశెట్టి కాంతారావు బిగిసిన ఆ పిడికిళ్ళు ; భూక్యా తిరుపతి కాక్లా ; భూక్యానర్సింగ్మీటు భూక్యా; మల్లిపురం జగదీష్ దారి; పి.విద్యాసాగర్ దాడి; పద్దం అనసూయ మూగవోయిన శబ్దం వంటి చర్చకు అవకాశం ఉన్న కథలు ఇందులో ఎంపిక చేశారు.
కొండఫలం కథ గిరిజనుల దోపిడీని చిత్రిస్తుంది. కులాంతర వివాహాల పేరుతో గిరిజనుల భూముల్ని ఇతరులెలా అనుభవిస్తున్నారో, ఆ దోపిడీ నుండి కాపాడవలసిన చట్టాలు, న్యాయ వ్యవస్థ వాళ్ళతోఎలా ఆటలాడుకుంటుందో కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది. ఇలా తెలివైన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళను దోపిడీ చేయడం తగ్గాలంటే అందరికీ విద్యావకాశాలులభించినప్పుడే అది సాధ్యమవుతుందని రచయిత్రి భావన కావచ్చు. బినామీ పేర్లతో, దొంగ కుల ధృవీకరణ పత్రాలతో గిరిజనులను మోసగించడంఈ కథలో కనిపిస్తుంది. యూనివర్సిటీల్లో జరిగే రీసెర్చ్ ప్రాజెక్టుల పట్ల కూడా చురక కనిపిస్తుంది.
ఇప్పపూలు కథలో గిరిజనుల పై జరిగే ఎక్సైజ్ దాడులు, దాడుల ముసుగులో ఆడవాళ్ళపై జరిగే అత్యాచారాలు, జంతువులు ఎత్తుకుపోయాయని మోసగిస్తూ పిల్లల్ని అమ్ముకునే వాళ్ళ కుత్సితాలు వర్ణించారు. మనుషుల కంటే ఆడవి, జంతువులే నిష్కల్మషంగా కాపాడుతున్న వైనం ఈ కథలో కనిపిస్తుంది. ఆడవిలో పడి ఉన్న ఇప్పపూలను ఏరుకొని తమ శ్రమను మరిచిపోవడానికి నైజామ్ ప్రభుత్వం కూడా అనుమతించినా, సారా నిషేధం పేరుతో గిరిజనుల కాసుకొని, జీవనోపాధిని పొందేవాళ్ళని ఎలా హింసిస్తున్నారో చెప్పారు. ఆ ఇప్పపూలతో గిరిజనులు సారా కాయడం నిషేధమవుతుంది. కానీ, అవే పూలను సేకరించి ఫ్యాక్టరీల్లో వైన్ తయారు చేసి ప్రభుత్వం అమ్మితే తప్పుకాని ఒక విచిత్ర పరిస్థితిని ఎండగట్టిందీ కథ.
ఈ చిన్న వ్యాసంలో కథలన్నింటినీ వివరించటం శక్తికి మించిన పని. కానీ,ఈ కథల్లో సుమారు ఎనిమిది శతాబ్ధాలుగా గిరిజన తెగలు అనుభవిస్తున్న అనేక కష్ట నష్టాలను, వారి అన్యోన్యతను, త్యాగాల్ని, ఆచార, సంప్రదాయాల్ని, నిరక్షరాస్యతను, భూమికోసం, భుక్తికోసం జరుగుతున్న పోరాటాన్ని, వారిపై జరుగుతున్న రకరకాల దోపిడీలను చాలా వరకూ చూడవచ్చు. పాము కాట్లకు గురైనా సరైన వైద్యం దొరక్క ప్రాణాలెలా కోల్పోతున్నారో అరవైయ్యేళ్ళ స్వాతంత్ర్య భారతావనిలో ప్రతి పౌరుడూ ఆలోచించాల్సిన విషయాలు. తమకి రక్షణనిచ్చే వాళ్ళెవరో తెలియక, ఉన్న చట్టాలు, న్యాయస్థానాలు తమకి తోడ్పడలేనప్పుడు తప్పని సరిపరిస్థితుల్లో సాయుధులుగా ఎలా మారిపోతున్నారో గుర్తించమని చెప్పేకథలిందులో ఉన్నాయి.
తెలుగు వాళ్ళు జీవిస్తున్న ప్రాంతాల్లో సుమారు 33గిరిజన తెగల వాళ్ళు జీవిస్తున్నారని పరిశోధకులు పేర్కొంటున్నా, అన్ని తెగల వారి జీవితాల్ని ఆవిష్కరించే కథలు మాత్రం ఇంకా రావట్లేదు. కొన్ని తెగల వారి జీవితాల్ని మాత్రమే వర్ణిస్తున్నారనీ, మిగతా తెగలను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందనే విషయం మన కళ్ళముందుంచుతుందీ పుస్తకం.
( ఇప్పపూలు ( గిరిజన సంచార తెగల కథలు), సంపాదకులు ; ఆచార్య జయధీర్ తిరుమల రావు, జీవన్, పుస్తకం ఖరీదు రూ. 150/-లు, పుటలు : 336, అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో అభిస్తుంది)
ఒక రచనని గుర్తించటం సాహిత్య ప్రస్తావనలో తక్షణ కర్తవ్యంగా భావించాలి. విమర్శలో సాహి త్య ప్రస్తావన అనే భావనని గురించి వివరించటం కన్నా అందుకు తగ్గ కృషి చేయటవేు విమర్శకుల కర్తవ్యంగా నేను భావిస్తాను. విమర్శకి మరో కర్తవ్య పార్శం సాహి త్య ప్రస్తావనే. ఇటీవల వచ్చిన కొత్త ధోరణులని కొంతమంది విమర్శకులు యింకా జీర్ణంచేసికోలేదు. మన విమర్శకులు వాళ ధోరణిలోనుంచి రచయిత కృషిని పట్టించుకుంటున్నారుగాని రచన తరఫున వకల్తా పుచ్చుకొనే ధోరణికి అలవాటు పడలేదు. రచయిత రచన చేసిన తర్వాత రచయితనుంచి రచన విడిపోతుంది. యింక రచయితకి ఆరచనకి సంబంధం వుండదు. రచన పాఠకుడి వశం అవుతుంది. రచనని పాఠకుడి కంటే కూడా ముందుగా విమర్శకుడి గుర్తింపుద్వారా విమర్శకుడి మొదటి కర్తవ్యం ప్రారంభం అవుతుంది. ఆగుర్తింపు ద్వారా ఆరచనని, ఆరచయిత యితర రచనలని విమర్శకుడు గుర్తించి దానిని వీలున్న చోట ప్రస్తావన ద్వారా ఆరచనని పాఠకుడి దగ్గరికి తీసికెళాలి. అంచేత విమర్శలో సాహి త్య ప్రస్తావన ఒక గతి శీలక పాత్రనే కాక చైతన్య వంతమైన పాత్ర కూడా నిర్వహించి రచయితని బేరీజు వేసేందుకు కృషి చేస్తుంది. రచనా ప్రవాహాంలో ముందుకు నడుస్తున్న రచయిత రచనలని అతని కృషి, అతని బలాన్ని, బలహీ నతనీ ఎత్తి చూపటం సాహి త్య ప్రస్తావనలో జరగాల్సిన మొదటి తంతుగా భావించాలి.
నా సాహి త్య ప్రస్తావనలో భాగంగా గత పదేళనుంచి సాహి త్య కృషి చేస్తున్న దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి ఎదుగుదలని గుర్తించే ప్రయత్నవేు ఈ వ్యాసం నిర్వహి ంచే పాత్ర. నిజానికి రచనని గుర్తించే ముందు విమర్శకుడికి ఆరచయితకి సాన్నిహి త్య సంబంధం కూడా చాలా అవసరం. ఒక విమర్శకుడు తారసపడ్డ ప్రతి రచయితని, ప్రతి కవిని కప్పదాటుగా విమర్శంచే కర్తవ్యం నించి బైటపడి, తనకు దగ్గరగా వున్న,తనకు బాగా తెల్సిన, తన ప్రాంతీయ రచయిత కృషిని గుర్తించి ఆ విమర్శని ముందుకు తీసికెళటం చాలా సరైన చర్య. నిజానికి ఒక విమర్శకుడు ఒక రచయితని లేదా ఒక ధోరణి రచయితలని అంటిపెట్టుకొని వాళ కృషిని కాపాడటం కూడా సాహి త్య ప్రస్తావనలో సరైన చర్యగా భావించాలి.
దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి నాకుగత పదిఏళనుంచి బాగా తెలుసు. అతడి కవితా ప్రయాణాన్ని దగ్గర నుంచే గమనించటవేుకాక ప్రోత్సాహి ంచి అతనికి నా తోడ్పాటును ఈరోజు దాకా అందిస్తున్నాను. అందుకే ఈ పరిచయం.
చెప్పులుకుట్టే చేతుల వంశంనించి ఎదిగిన ఎజ్రాశాస్త్రి ఆ మాదిగ జాతి నిర్వహి స్తున్న యం.ఆర్.పి.యస్. ఉద్యమానికి బాసటగా నిలుస్తూనే కేవలం దళిత కవిత్వ నిర్వహాణా స్పృహా చాలదని గుర్తించటంలోనే అతని వ్యూహాంవుంది. దళిత ఉద్యమాన్ని బహుజనుల చేతికి అందించటం ద్వారా మాత్రవేు తమ జాతి ఆత్మగౌరవం మరింత పదును ఎక్కుతుందనే జాతీయ స్పృహా ఎజ్రాశాస్త్రిలో వుంది. అందుకే రచలని దళిత కవిత్వంలో భాగంగా కాక బహుజన కవిత్వ నిర్మాణంలో భాగంగా అతను కృషి చేస్తున్నాడు.
ఎజ్రాశాస్త్రి తన సాహి త్య ప్రస్థానంలో యిప్పటి వరకు వెలువరించిన రచనలు :
1) కర్రముక్క - దీర్ఘకవిత - ఆగస్ట్ 2005 ప్రచురణ
2) ఏరువాకై తిరిగి లేస్తా - కవితా సంకలనం - డిసెంబర్ 2006 ప్రచురణ
3) నిప్పుల్లో నడిచే తప్పెట - దీర్ఘకవిత - డిసెంబర్ 2008
పై రచనలేకాక నిరంతరంగా పత్రికల్లో అతని కవితలు వస్తున్నాయి. ఆ కవితల్లో ''బియ్యమూ - బంగారమాÑÑ అంటా వడ్లగింజ గురించి రాసిన అతని కవిత యిటీవల గొప్ప సంచలనం చేసింది.
కవిత్వం అంటే కేవలం ఓ అనుభవవేు కాదు, చరిత్రలో భాగం కూడా. రచన చేయటం చారిత్రక కర్తవ్యంగా భావించే క్రమలో నుంచే వెలువడింది కర్రముక్క దీర్ఘకవిత! ఏజాతి నైతే దూరంగా యింతకాలంగా తోసి వేశారో. ఆజాతే మరుభూమి దగ్గర్నించి, కళ్యాణ వేదికల దాకా దుడ్డుకర్రని చేత పట్టుకొని సమాజాన్ని ముందుకు నడిపించటవేుకాక - అన్నింట్లోను వారే ముందువుండి ఆ తర్వాత మరే జాతి అయినా, అనే సామాజిక ఆత్మగౌరవం దట్టించిన ఉద్యమ స్పృహాని ఈ కర్రముక్క దీర్ఘ కవిత నిరూపించింది. పాలక వర్గాల్ని ఎదురించే క్రమంలో భాగంగా ఈ కర్రముక్క ఓ ఆయుధంగా అవుతుందని ఎజ్రాశాస్త్రి ఎలుగెత్తి చాటాడు.
''కర్రముక్కకదా అనుకుంటే పొరపాటే / ఆకులు వలువలు ధరిస్తే, మహారణ్యం!, ఆకులు విదిల్చిచేతే ఒక మహా సింహాసనంÑÑ అనే ఎత్తుకొలుతో ప్రారంభమైన ఈ మహా ప్రవాహాం కవిత ఆ..... ''శత్రు సమూహాలపై ఈటేలు విసిరి / భూ భకాసురులపై ఒరిసెలు ఎత్తి / ఆ నాగరిక / అడవితల్లిబిడ్డలకు వనమూలికలై / వేర్లనుండి వైద్యాన్ని మొలిపించి / ఆకు పచ్చగా చిగిర్చింది నువ్వేకదా?ÑÑ అని ముక్తా యించటవేు కాక కర్రముక్కని విముక్తి దాతగా ప్రకటించడం ద్వారా ఆత్మ ప్రభోదాన్ని చాటి చెప్పటం జరిగింది!
కర్రముక్క దీర్ఘ కవితతో పాటు ఈ సంకలనం అతని మరిన్ని తొలినాటి కవితలు 16 దాకావున్నాయి.
''రెండు క్షణాల కౌగిలి / మూడో క్షణం చీదరింపు గతం అంటుకోలేదు / వర్తమానం వెంటరాదుÑÑ అంటూ క్షణికం మీద అతను విసిరిన వైరాగ్యంఅతని కవిత్వ సూటిదనాన్ని తాత్వికంగా విన్న విస్తుంది. ఈపోకడే అతని చాలా కవితల్లో కన్పిస్తాయి. కారణం ఎజ్రాశాస్త్రి ఒక ఆసుకవి. పైగా జానపదకవి. అనేకమంది జానపద కవుల మాదిరే అవలీలగా కవితలు అల్లుతాడు. ఈ అల్లిక అతని నోటి వెంట అనర్గళంగా ప్రవహి స్తుంది. అందుకే అతని రచనలు ధారగా ప్రవాహాంగా సాగుతాయి. చెప్పేవిధానంతో కవిత రాయట ద్వారా అతను రెండు ప్రయోజనాలు సాధిస్తున్నాడు. ఒకటి అతని రచన సూటిగా వుంటుంది. రెండు అస్పష్టత ధరి దాపులకు వెలకుండా సూటిగా పాఠకుడికి అనుభూతిని ప్రసాదిస్తుంది. అక్కడే అతని విజయం అతని బలహీ నతలు కూడా బైటపడ్తుంటాయి. ప్రవాహాంగా వచ్చేఅతని కవిత్వంలో అక్కడక్కడ కొన్ని నట్లు కన్పిస్తుంటాయి. ఇటీవల ఆ బలహీ నత ఒదలించుకొని సూటిగా కవితవెలువడటం యిటీవలి అతని కవితల్లో స్పష్టంగా కన్పిస్తోంది. అందుకు కారణం అతని నిత్యకృషి, సాదన, అధ్యయనం పైపెచ్చు నీర్భీకత. ఈ నిర్భీకతతోనే అతని కవితలు పండుతున్నాయి. అందునా బాల్యంలో వలకూలీ అయిన తండ్రితో కలిసి సేద్యం చేసిన చేతులు ఈ నాడు కలం పట్టుకొని ముందుకు వచ్చినప్పుడు 'ఏరువాకై తిరిగి లేస్తాÑ అనే సంపుటిని ప్రకటించటంలోనే రైతుకూలీల పట్ల, రైతాంగం పట్ల అతని ఆవేదన అర్ధమవుతుంది. రైతుల ఆత్మ హాత్యలకి చలించిన తాను, కళ్లముందర ప్రవాహామైన పంట చేజారిన చేతిలోని బిడ్డలా ఆత్రంగా చేతులెత్తి కాపాడమని ఆక్రోశించినట్లుంది పంటపొలం. అంటా ఓ భావ చిత్రాన్ని మన ముందు వుంచుతాడు. అలాగే రైతుని కూలి తల్లి ముక్కుపుడకై వెలిగే భాస్కరుడుగా చిత్రీకరించటంలోనే అతని భావుకత వెల్లడవుతుంది. రాయటంగా కాక చెప్పడంగా వచన కవితని ముందుకు తీసికెళటంద్వారా ప్రప్రధమంగా ఒక మంచి దళిత కవిగా పేరుతెచ్చుకొన్న ఎజ్రా ఒక సిద్ధాంతం కాడే ఆగిపోకుండా నిరంతర ప్రయాణంలో భాగంగా తన కవిత్వాన్ని బహుజనుల కోసం తర్వాత తర్వాతి రోజుల్లో మలచటం అతని ఎదుగదలని సూచిస్తుంది.ఏకవికూడా ఏదో ఒక సిద్ధాంతం దగ్గరే నిలబడ్తే కొన్నాళ తర్వాత రాయలేడు. చెప్పిందేచెప్పి ఆతర్వాత కనుమరుగై పోతాడు. అలా కాకుండా నిరంతర చలన శీలతతో సమాజానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ కవిలో పరిణతి సాధ్యవుతుంది. ఆ పరిణతిని ఎజ్రా అందుకున్నాడని నేను భావిస్తున్నాను.
''మనస్సు తెరల మాటున నడిచి వెళిన నీ పాదముద్రల సవ్వడి మారు మ్రోగుతునే వుందిÑÑ అని నా నెచ్చెలి అనడంతో ఆ నెచ్చెలి అంబేడ్కర్ అనే మార్మికతని సాధించటం కూడా ఎజ్రా పరిణతలోని భాగవేు. అందుకే ఏరువాకైతిరిగి లేస్తా అని అనటంలో కూడా పాపులకోసం ఏసుక్రీస్తు మూడవదినం లేచినట్లుగా తానూ ముందుకు వస్తాననే మార్మిక ప్రయోగం చేయగలిగాడు. అంచేతనే ఏరువాకై తిరిగి లేస్తానని అనేక కవితలకి సూటి దనంతో పాటు అనేకానేక అర్థాలు పాఠకులు వెతుక్కోవల్సిన అవసరంవుంది. అందుకే ఈ సంకలనంలోని కవితలు ఏనాడు చదివినా పాఠకుడు ఫ్రేష్గా ఫీల్ అయ్యే వెసులు బాటుని అతని సంకలనంలో ని కవితలు కన్పిస్తాయి.
'నిప్పుల్లో దరువేయ్ వివక్షలను తరివేుయ్Ñ అనే వేుల్కొలుపుతో వచ్చిన మరో దీర్ఘకవిత ఎజ్రా యిటీవలనే వెలువరించిన సంకలనం! యిందులో మిగ్గు, ముడుసు, ఈరగ, గోరోజనం,శరాయి, బొక్కెన మొదలైన ప్రకాశం జిల్లా మాదిగపల్లె మాండలిక పదాలు కోకొల్లలుగా కన్పిస్తాయి. రచయిత తన ప్రాంతీయ స్పృహాని వెలువరించంద్వారా ఆరచనకి ఒక సజీవకతని సాధిస్తాడు. ఆ మాండలిక పదాలు చావకుండా అన్నమయ్య దగ్గర్నుంచి ఎజ్రాశాస్త్రి మొదలైన జానపద రచయితలంతా ఒకే మెలుకువతోనే ఆపదాలని బతికించగల్గుతున్నారు. భాషని సజీవం చేస్తున్నారు. భాష రచయిత చేతిలోని పనిముట్టు. దాన్ని ఒడుపుగా వాడుకోటంలోనే అతని నిర్మాణ కుశలత కన్పిస్తుంది. మాదిగ జాతిని వేుల్కొలిపే మాదిగ పురాణమిది అని ముక్తాయింగా వెలువరించిన 'నిప్పుల్లో నడిచే తప్పెటÑ మనల్ని మాదిగ పల్లెల్లోకి పరిగెత్తిస్తుంది.
''నా చేలో మొక్క / ఇటుకలో మట్టి/ చెప్పుకువేుకుÑÑ యిలాగ ప్రవాహా స్థాయిలో నడిచే యితని కవిత్వాన్ని పాడుకునే గుణం కూడావుంది. అందుకుతగ్గలయ, దరువు, అతని నిప్పుల్లో నడిచే తప్పెట కవిత్వంలో మనం వెతుక్కోవచ్చు. మిగతా దళిత కవుల మాదిరి ఆక్రోశం, నిందాస్తుతి, అపరిపక్వ పెళుసుదనం ఎజ్రా కవిత్వంలో ఎంతవెత్తుక్కున్నా కానరాదు. అందుకు భిన్నంగా మార్మికత, సూటిదనం, పరిగెత్తుతా, గెంతుతా ఆడుతూ పాడుతూ సాగే పరిమళాలు యితని కవిత్వంలో సాధారణ అంశాలు. ఎప్పుడూ గొప్ప మెళుకువతో కవిత్వం చెప్పిన లక్షణాలే మనకు కన్పిస్తాయి తప్ప స్పృహా దాటి గతి తప్పి నినాద స్థాయి రచనాతత్వం ఎజ్రా కవిత్వంలో మనకు కానరాదు. అందుకు భిన్నంగా నేడు సౌకుమార్యం, లాలిత్త్వం, పదాల ముప్పేటు దాడి, జాతిలోలత్వం నిండుగా యితని కవిత్వంలో వెదుక్కోవచ్చు. ఓ సుకుమార కవి ఎజ్రా! ఓ ప్రేమకుడి లాలిత్త్వం నిండివున్న యితని కవిత్వాన్ని ఎన్నాళయినా ఆస్వాదించవచ్చు. జాషువా కున్న నిర్భీకత, నిజాయితీ వున్న అసాధారణకవి ఎజ్రా శాస్త్రి. అతను ఆంధ్రుడు కావటం మన అదృష్టం. అందులోను కనిగిరి వాడు కావటం మరో గొప్ప అదృష్టం. ఒంగోలు గిత్త పౌరుషం యితని కవిత్వంలోనూ చూడచ్చు.