"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

31 October, 2008

తెలంగాణా దళిత అంతర్మథన కవిత్వం ‘ఎగిలివారంగ’

(ఈ సమీక్ష ప్రజాకళ అక్టోబరు 2008 సంచికలో ప్రచురించింది. ఈ సమీక్ష పై కొంత మంది స్పందించారు. వాటిని కూడా ప్రజాకళ సౌజన్యంతోనే పాఠకుల సౌకర్యం కోసం సమీక్ష చివర పునర్ముద్రిస్తున్నాను.
సీతారాం గారు ఒక వాక్యాన్ని ప్రయోగించారు. "బతుకమ్మ పండగ మీద రచయతకు, సమీక్షకుడీకి అవగాహన లెదనుకుంతటాను" అనేది ఆయన వ్యాఖ్య. దీన్నే మరోలా చెప్తే బాగుండేది. "రచయితకూ, సమీక్షకుడికీ మరింత అవగాహన ఉంటే బాగుండేది" అని వాక్యాన్ని రాసుంటే సహృదయ వ్యాఖ్య అయ్యుండేది. అయినా ఆ ఉద్దేశంతోనే అలా రాసి ఉంటారని భావిస్తున్నాను. ఈ సమీక్షకుడిగా నా అవగాహనను ప్రశ్నించిన మీదట నేను దానికి సమాధానం అక్కడే ఇచ్చాను. తెలంగాణాలో జరిగే బతకమ్మ పండగ పట్ల నాకు అవగాహన ఉందనుకుంటున్నాను. దాని గురించి ఒక పరిశోధనే చేశాను. దళిత దృక్పథంతో రాశాను. అయినా నాది తెలంగాణా ప్రాంతం కాదు. కనుక, ఆ ప్రాంతానికి చెందిన వారి అనుభవాలను చెప్పినప్పుడు నేనెప్పుడూ వాటిని గౌరవిస్తాను. అలాగే మిగతా ప్రాంతాలవారి అభిప్రాయాలనూ గౌరవిస్తాను. మనం ఏ టోన్‌ తో చెప్తున్నామో గమనించి మన అభిప్రాయాన్ని వ్యక్తీకరించాలి. సీతారామ్‌ నాకు వ్యక్తి గతంగా తెలుసు. అలాంటి వ్యక్తి "అవగాహన " గురించి రాసేటప్పుడు ఇలాంటి వాక్యం రాయడంలో గల హడావిడిని అర్ధం చేసుకోవాలనిపిస్తుంది. స్పందించిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రజాకళకు మరీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమీక్షలో మార్క్సిస్టుల పట్ల తీవ్రమైన విమర్ష ఉంది. అయినా సమీక్ష కుడి అభిప్రాయాలను ప్రజాస్వామిక వాతావరణంగా గౌరవించి దీన్ని ప్రచురించారు. దీన్ని నాబ్లాగు ద్వారా కూడా నెట్ లో ప్రచురించుకోగలను. కానీ, ప్రజాకళ ద్వారా ప్రచురింపబడటం మరింత గౌరవంగా భావిస్తాను. ఆ హూందాతనాన్ని మరింతగా పెంచిన ప్రజాకళకు అభినందనలు తెలుపుతున్నాను. -దార్ల )





ఎగిలివారంగ కవి : పొన్నాల బాలయ్య



-డా//దార్ల వెంకటేశ్వరరావు
గతంలో తెలంగాణా ప్రాంతం నుండి వచ్చిన దళిత కవుల్లో కూడా అంబేద్కర్ భావజాలం కంటే, మార్క్సిస్టు భావాల పట్లే ఎక్కువ మమేకత్వం కనపడేది. కానీ, ఈ మధ్య కాలంలో ఆ ధోరణి కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతుంది. అంబేద్కరిజమ్పై ఆసక్తి పెరుగుతుంది. స్థానీయతను ఆకాంక్షిస్తూనే, దళితుల ఆత్మగౌరవం అంబేద్కరిజమ్లోనే అంతర్భూతంగా ఉందనే సంగతిని గుర్తిస్తున్నారు.
ఈ నేపథ్యంతో పరిశీలిస్తే, చాలామంది తెలంగాణా దళిత కవులు పరిణామం ఈ దిశగా కొనసాగుతుందని స్పష్టమవుతుంది. ఇటీవల పొన్నాల బాలయ్య ‘ఎగిలి వారంగ’ పేరుతో తన కవితలన్నీ ఒక సంపుటిగా తెచ్చాడు. ‘పొద్దు పొడవాల’నేది ఆ కవితా సంపుటికి పెట్టిన పేరులోని అర్థం. దళిత సమస్యలెలా పరిష్కరించబడాలో, తెలంగాణా సమస్యనెలా పరిష్కరించుకోవాలో, వర్గీకరణ సమస్యనెలా అర్థం చేసుకోవాలో, మార్క్సిస్టు పోరాటాల్ని, ఆ పోరాటాల్లో బలైపోతున్న దళితుల జీవితాన్ని ఎలా బాగుచేసుకోవాలో, ప్రపంచీకరణ నుండి ఎలా రక్షించుకోవాలో, అన్నింటికీ మించి సంస్కృతినెలా కాపాడుకోవాలో వివరించే దిశగా ఆలోచించి ఒక కొత్త ‘పొద్దు పొడవాల’నే ఆకాంక్షను కవి ‘ఎగిలి వారంగ’ లో వ్యక్తం చేశాడు.
శక్తివంతమైన భావాన్ని, అంతేశక్తివంతంగా అందించగలగడమే కవిత్వం చేయడంలో కనిపించే శిల్పం. పొన్నాల బాలయ్య దాన్నింకా సాధన చేయవలసి ఉన్నా, తెలంగాణా పట్ల, ఆ ప్రాంతంలోని దళితుల పట్ల, మొత్తంగా ప్రజల ఆశల పట్ల స్పష్టమైన భావాలున్న కవి. వృత్తిరీత్యా హిందీ పండితుడైనా, తెలుగులో కవిత్వం రాస్తున్నందుకు ముందుగా ఆయన్ని అభినందించాలి. అలాగే, ఆ తెలుగులో కలిసిపోయిన మణి ప్రవాళ భాష గురించీ ఆలోచించమనాలి.
‘ఎగిలి వారంగ’ లో చిన్నప్పుడే చనిపోయిన తండ్రి స్మృతితో కవిత్వం ప్రారంభమౌతుంది. తన బాల్యమెంత విషాదకరంగా సాగిందో ‘ఎగిలివారంగ’ కవిత అనేక దృశ్య చిత్రాలతో చూపిస్తుంది. కవిత అంతా విడివిడిగా పదాలున్నట్లు ఉంటుంది. ఒకదానితో మరొక దానికి సంబంధం లేనట్లుంటుంది. తన బాల్యం కూడా ఒక పద్ధతి ప్రకారం కొనసాగలేదనీ, తనలాంటి వాళ్ళ బాల్యం కూడా అలాగే ఉందని కవి శిల్ప నైపుణ్యంతో చెప్తున్నాడు. ఒక అస్తవ్యస్థత ఆ కవిత నిండా ఉన్నట్లు ఉంటుంది. ఆయన రాసుకున్న జీవిత నేపథ్యం చదివితే, ఆ కవిత బాగా అర్థమవుతుంది. బహుశా దాన్ని అలా చెప్తేనే బాగుంటుందనుకున్నాడేమో!
“అయ్య కొట్టిన తంగెడు కట్ట
సోయి తప్పిన అవ్వ
ఆనిగపు బుర్ర నీళ్ళు….” ఇలా సాగిపోతుందీ కవిత.
తెలంగాణాకే ప్రత్యేకతను తెచ్చే పండగల్లో ఒకటి “బతుకమ్మ”. దీన్నితెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో దళితులు ఆడడానికి లేదు. ఆ పండగల్లో భాగస్వామ్యం కాలేని అలాంటి తెలంగాణా దళిత బాల్యాన్ని వర్ణిస్తూ…
“అందరు పండుగ మోజులవుంటే
నేను పశుల గాస్తుంటే
డప్పుల చప్పుళ్ళతో
బతుకమ్మను తెచ్చి ఆడుతావుంటే
ఆవలుండి చూసుటే తప్ప
పండుగ జరుపుకున్న పాపాన పోలేదు” (పుట: 20) అని ఆనాడు అందుకోలేని అందమైన బాల్యాన్ని, చేజారిన సంతోషాన్ని గుర్తు చేసుకుంటున్నాడు కవి.
మొదట్లో దళితుల్ని గుర్తించిందీ, చైతన్యం నింపిందీ ఖచ్చితంగా మార్క్సిస్టు సాహిత్యమే. నేటికీ దానిలో అదే మౌలిక భావన ఉంది. అయితే అది పీడిత వర్గదృక్పథంతో చూస్తుంది తప్ప, కుల స్పృహను ప్రధానంగా గుర్తించదు. కానీ, భారతదేశంలో కులమే ప్రధానమవుతుందని దళిత మేథావులు భావిస్తున్నారు. అదే అనేక సమస్యలకికారణమవుతుందని దళిత మేధావుల వాదన. ఆ పునాదిని గుర్తించకుండా కులాన్ని ఉపరితల అంశంగానే వర్గవాదులు గుర్తించడం జరుగుతోంది. మొదట్లో పీడిత వర్గ చైతన్యంతోనే తెలంగాణాలోనూ దళితులు ఆ భావజాల పార్టీల్లో పనిచేశారు. తర్వాత కాలంలో అంబేద్కర్ భావజాలంపై అవగాహన కొస్తున్నారు. దాన్ని కవి వర్ణిస్తూ…
“పగలనక రాత్రనక పశులుగాసి
ప్రపంచానికీ దూరంగా పస్తులుండి
కారడవిలో వింత పశువునై
అడవే నాకు అవ్వ - అయ్య
ఆత్మీయతతో అడవితల్లి ఆదరించింద’నీ గుర్తు చేసుకుంటాడు. అయితే, తర్వాత కాలంలో జరిగిన మోసాన్ని కూడా గుర్తించమంటున్నాడు కవి.
“చెమట చుక్కలతో చెలకదున్నిన
ఎగిలి వారంగ యాతం బోసిన
అలసట ఎరగక అన్ని పండించిన
…………………………………
ఊరు బయటనే అంటరానోన్ని జేసిండ్రు” అని అక్కడ కులాన్ని ఆధారం చేసుకుంటున్నారని, అంతర్గతంగా మార్క్సిస్టుల విధానాన్ని ప్రశ్నిస్తున్నాడు. దళితులకు నాయకత్వాన్ని అందనివ్వని స్థితిని గుర్తు చేస్తున్నాడు. అక్కడా హిందూ భావజాలమే మార్క్సిస్టుల్లో అంతర్భూతంగా పనిచేస్తుందంటాడు. అందుకే దళితులకు“కనులు తెరిపించే కాంతొకటి వచ్చిందిఅంబేద్కరే ఆ కాంతి ” ( పుట: 34) అని స్పష్టంగా అంబేద్కరిజాన్ని ఎలుగెత్తి చాటుతున్నాడు కవి. భూములిప్పిస్తామంటూ పోరాటాలు చేస్తుంటే, పోలిసులు జరిపే కాల్పుల్లో దళితులే ఎందుకు బలవుతున్నారో, ఆ పోరాటానికి నాయకత్వం వహించే వాళ్ళనెందుకు ఆ తూటాలు తాకలేక పోతున్నాయో గుర్తించగలిగామని కూడా స్పష్టంగా ప్రకటిస్తున్నాడు కవి…
“ఎగేసుడు, సగేసుడు ఎనుకనే నిల్చుండుడు
ముందుండి… ముదిగొండలో
అసువులు బాసింది…. అణగారిన వారే” (పుట: 29) అని ముదిగొండలో దళితుల్నే ఎందుకు కాల్చారో, ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వారెలా తప్పించుకోగలిగారో చెప్తున్నాడు.
తాను పుట్టి పెరిగిన తెలంగాణా ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేసుకుంటే తప్ప, నిజమైన పరిష్కారాలు లభించవనీ, అందుకే అందరూ కలిసికట్టుగా పోరాడమంటూ ప్రత్యేక రాష్ట్రం, ‘తల్లి తెలంగాణా’ కవితల్లో తెలంగాణాలో పాలకుల నిర్లక్ష్యం, స్వార్ధం వల్ల నిస్సారమై పోయిన స్థితిని వర్ణించాడు. “చావు తప్పి లొట్టబోయిన సంస్కృతిని, అస్తి పంజరంలా తయారైన గ్రామాల్ని నేపధ్యంగా చెప్పి, తేనెటీగల్లా కదిలి తెలంగాణా సాధించుకోవాలంటున్నాడు…
‘తెలంగాణ’ కవితలో!
“వలస పిట్టలు వాలకుండా
వడిశెలందుకుందాం
పర పాలకులు పొలిమేర పారంగ
తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందాం” అంటున్న పొన్నాల బాలయ్య తన నేలమీద నిలబడి, తన నిజమైన గొంతుతో, ఎలాంటి అస్పష్టతా లేకుండా కవిత్వం రాస్తున్నందుకు అభినందించవలసిందే!
దీనిపై ప్రజాకళలో వచ్చిన అభిప్రాయాలు :
9 అభిప్రాయాలు
# ramarao 06 అక్టోబర్ 2008 , 7:11 am
ఇది సదివిన సంది ఎగిలివారంగ సదవాలనుంది.ఇదెక్కడ దొరుకుతుంది?
# srinivas olle 06 అక్టోబర్ 2008 , 11:46 am
sar
# SRINIVAS O 15 అక్టోబర్ 2008 , 5:00 am
సార్ మీ వ్యాసాలు అన్నీ చధువుతాను చాల బాగుంటున్నాయి నాలాంటి విద్యార్టులకు చాలా ఉపయోగ కరంగా ఉంటున్నాయి. థాంక్యూ సర్
# vemuganti 15 అక్టోబర్ 2008 , 9:41 am
పొన్నల బాలయ్య కవిత్వము బాగున్నదీ బాలయ్య ఫొనె 9908906248 పుస్తకాలు కావలనుకునెవారు ఫొను చెయంది
# Pasunoori Ravinder 16 అక్టోబర్ 2008 , 6:53 am
మంచి సమీక్షకుడు ఎవరంటే…..?
ఎలాంటి పక్షపాతం లేకుండ, రచనలోని మంచి చెడుల్ని బేరీజు వేసేవాడు. అది మంచి రచన అయితే నలుగురు చేత ఆ పుస్తకాన్ని చదివించేలా నిగాఢమైన విషయాల్ని వెలికి తీసి దాన్ని అర్థం చేసుకునేందుకు కావాల్సిన చూపును అందించాలి. అలాంటి పనిని పరిపూర్ణంగా నిర్వహించిన డా.దార్ల గారికి అభినందనలు. కవి పొన్నాల బాలయ్యకు శుభాకాంక్షలు.
పసునూరి రవీందర్
# Dr.Darla 17 అక్టోబర్ 2008 , 2:59 am
సాహితీ మిత్రులారా!
అభిప్రాయాలు రాస్తున్న మీ అందరికీ అభినందనలు. అలాగేఈ పుస్తకం కావలసిన వారు : పొన్నాల బాలయ్య, ఆరేపల్లి, బస్వాపూర్ పోస్టు,కోహెడ మండలం,కరీంనగర్ జిల్లా,ఫోను: 09908906248పుస్తకం వివరాలు: పుటలు:90,దీనిలో 36 కవితలున్నాయి.జూలూరి గౌరీశంకర్ ముందుమాట రాశారు.అన్నింటికంటే కవి రాసుకున్న ప్రవేశిక చదివి తీరాల్సిందే!పుస్తకం వెల రూ50/-ఈ పుస్తకం నవోదయ, విశాలాంధ్ర,ప్రజాశక్తి బుక్ హౌస్ లలో కూడా లభిస్తుంది
.–మీ
దార్ల
# GURRAM SEETARAMULU 27 అక్టోబర్ 2008 , 9:05 am
ఆవలుండి చూసుటే తప్పపండుగ జరుపుకున్న పాపాన పోలేదు” ……………
కవితా స0కలన0 చదివాను
దార్ల సమీక్ష బాగుంది
కాకుంటే బతుకమ్మ పండగ మీద రచయతకు, సమీక్షకుడీకి అవగాహనలెదనుకుంతటాను, బతుకమ్మ దలితులు చెసుకొరు అనెది అ వాస్తవముపండగ అనెది సామాజిక ఆర్దిక స్తితి బట్టీ ఉంటూ0ది ఈ విసయమ మీద 2 దసాబ్దాలుపరిశోదన చెసిన భరతబుసన గారితొ సుదీర్గ0 గా చ ర్చించానుఅది తప్పుప్రప0చము లొతెలగాన లొ స బ్బండ వర్నా లు జరుపు కొనె ప0డగ బతకమ్మఅనెది సత్య0
# GURRAM SEETARAMULU 27 అక్టోబర్ 2008 , 9:09 am
కవితా స0కలన0 చదివాను
దార్ల సమీక్ష బాగుంది
కాకుంటే బతుకమ్మ పండగ మీద రచయతకు, సమీక్షకుడీకి అవగాహనలెదనుకుంతటాను, బతుకమ్మ దలితులు చెసుకొరు అనెది అ వాస్తవముపండగ అనెది సామాజిక ఆర్దిక స్తితి బట్టీ ఉంటూ0ది ఈ విసయమ మీద 2 దసాబ్దాలుపరిశోదన చెసిన భరతబుసన గారితొ సుదీర్గ0 గా చ ర్చించానుఅది తప్పుప్రప0చము లొతెలగాన లొ స బ్బండ వర్నా లు జరుపు కొనె ప0డగ బతకమ్మఅనెది సత్య0
# vrdarla 29 అక్టోబర్ 2008 , 8:51 am
సీతారాం గారూ!
సంతోషం… నా సమీక్ష మీకు నచ్చినందుకూ… అంతకు మించి ఒరిజినల్ పుస్తకం చదివినందుకూ!ఇక తెలంగాణాలో బతకమ్మ ఆన్ని వర్ణాల వాళ్ళూ ఆడతారా లేదా అనేది ఆ ప్రాంతం, అదీ కింది వర్ణాలుగా ముద్ర వేయబడిన వారిని ఆ యా పండగల్లో పరిశీలించ వలసి ఉంది. నేను చేసిన సర్వే ప్రకారం, నా పరిశీలన ప్రకారం కొన్ని ప్రాంతాల్లో కింది వర్ణాల వాళ్ళూ బతకమ్మ ఆడరు. అంతేకాక, అది అన్ని వర్ణాల వారి పండగ కాదు. ఇప్పుడు …ప్రజాస్వామ్యం అందించిన స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనల వల్ల, తెలంగాణా ప్రజలంతా ఒకటి కావాలనే భావాలు విస్తరింపబడుతున్న తరుణంలో అందరూ ఆడినా అశ్చర్య పోనవసరం లేదు. ఒకవేళ అది అందరి పండగా అయితే అంతకంటే సంతోషం ఏముంది.మీ అభిప్రాయానికి ధన్యవాదాలు
మీ
దార్ల

1 comment:

Afsar said...

dear darla:

sameeksha baagundi. meeru vudaaharinchina kavitwa pamktulu koodaa chaalaa pandunu gaa vunnaayi.

veetilo meeku nacchina rendu- moodu kavitalu naaku pdf cheyyagalaraa?

afsar