నిలువెత్తు భారతీయతను నింపుకున్న కవి. పద్మశ్రీ జ్ఞానానందకవి

(సూర్య దినపత్రిక 17.1.2011 సౌజన్యంతో)
(ఇమేజ్ పై రెండు సార్లు క్లిక్ చేయండి. చదవడానికి పెద్దదిగా కనిపిస్తుంది)
‘‘ భరియించెద భర్తలుగా
వరియించెద మీ మనోజ్ఞభావమ్ముల, నే
చరియించెద నిష్టామతిు
గురియించెద వలపు మలపు కూర్ములెసంగన్‌’’ ఇది డా॥ యస్‌.టి.జ్ఞానానందకవి సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ‘‘ ఆమ్రపాలి’’ కావ్యంలోని ఒక చక్కని కంద పద్యం.ఆమ్రపాలి అందమైన అమ్మాయి. ఆమెను షోడషజనపథాలకు చెందిన రాజులు అనుభవించాలని ఆమె తండ్రినే నిర్భంధిస్తారు. అందమైన అమ్మాయిని గణభోగ్యగా చేసుకునే ఒక ఆచారం ఆనాడు ఉండేది. దానికి అనుగుణంగానే ఆమెను అలా అందరిభార్యగా మార్చుకోవాలనుకున్నప్పుడు, తండ్రి ఎలాంటి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలోకి కూరుకుపోతాడు అప్పుడు ఆమ్రపాలి ప్రకటించిన నిర్ణయం ఆ పద్యంలో వర్ణించారు కవి. కందం రాసిన వాడే కవి, పందిన కొట్టినవాడే మొనగాడు’’ అనే సామెత ఒకటుంది. కవిత్వాన్ని పద్యంలో చెప్పడమే కాకుండా, దాన్ని రసభరితంగా వర్ణించగల నేర్పు కందంలో అందంగా రాయగలిగినవారికే సాధ్యమనే విషయాన్ని చెప్పడానికా సామెతను సాహితీవేత్తలు చమత్కారంగా ప్రయోగిస్తుంటారు. కందం మాత్రమే కాదు, తెలుగులో ఏ పద్యాన్నైనా వర్ణించడంలో అభినవ శ్రీనాథుడనే కీర్తికి పాత్రమైన కవి పద్మశ్రీ డా॥ యస్‌.టి.జ్ఞానానందకవి. ‘‘కూలీ నుండి కళాప్రపూర’’్ణ వరకూ ఎదిగిన ఈయన ఈనెల ( జనవరి ) 6 వతేదీన శాశ్వతంగా కన్నుమూశారు.
జ్ఞానానందకవిగారు విజయనగరం జిల్లా బొబ్బిలిలో 1922 జూలై 16న సురగాలి పాపమ్మ, ఎల్లయ్య దంపతులకు జన్మించారు. తనమేనమామ దగ్గర రామాయణ, భారత, భాగవత, ప్రబంధాలను చదువుకున్నారు. ఉపాధ్యాయుడైన తన మేనమామ పద్యాల్ని రాగయుక్తంగా పాడేవారు. ఆ ప్రభావంతో తానూ పద్యం పాడటమే కాదు, రాయగలగాలనుకునేవారు. తెలుగు పండితులు అప్పయ్యశాస్త్రి, ఆదినారాయణశాస్త్రిగార్ల సహాయంతో వ్యాకరణంతో పాటు, పద్యవిద్యను అవగాహన చేసుకున్నారు. తన పదిహేనో సంవత్సరం నాటికి శతకాల్ని, శబ్దమంజరినీ కంఠస్థం చేసి, దీనబంధు శతకాన్ని రాశారు. చిన్నవయసులోనే సీసపద్యాలతో ఒక శతకాన్నే పూర్తిచేయడాన్ని గమనించిన తెలుగు పండితులు జ్ఞానానందకవి గార్ని చూసి ఆశ్చర్యపోయేవారు. అలా పద్యాల్లో కవిత్వం చెప్తూ, వివిధ సాహితీ సభల్లో వాటిని చదవాలని ప్రయత్నించేవారు. 1947 ఆగస్టు 15 వతేదీన స్వాతంత్య్రదినోత్సవాన్ని వర్ణిస్తూ రాసిన పద్యాల్ని ఒక సభలో ఆలపించారు. దానికి ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావుగారు సభాధ్యక్షులు. ఆ పద్యాల్ని విని ‘‘ఇకపై నీపేరు ‘ జ్ఞానానందకవి’గా ప్రసిద్ధి చెందుతుంది’’ అని ఆశీర్వదించారు. అలా నాటి నుండీ సురగాలి తిమోతి జ్ఞానానందంగారు, ‘‘యస్‌.టి. జ్ఞానానందకవి’’గానే ప్రాచుర్యం పొందారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి కవిగా గుర్తింపుపొందడమే కష్టం. అటువంటిది సంప్రదాయపండితుల మెప్పు పొంది, కనకాభిషేకాల్ని, అభినవ జాషువ, కవికోకిల, కవితాశ్రీనాథ, కవిలోక విభూషణ వంటి ఎన్నో బిరుదుల్ని పొందడం వెనుక కవి నిరంతర కృషి ఎంతో దాగి ఉంది.
జ్ఞానానందకవి అనగానే సాహితీలోకానికి గుర్తొచ్చే అంశాలు కొన్నైనా చెప్పుకోవాలి. భావకవిత్వం పేరు చెప్తే కృష్ణశాస్త్రి వేష, భాషలెలా గుర్తుకొస్తాయో, చాసో అంటేనే కాల్చుకుంటున్న చుట్టెలా గుర్తుకొస్తుందో, జ్ఞానానందకవి అనగానే కూడా గుర్తొచ్చే విషయాలు కొన్ని ఉన్నాయి. కవిగారి ‘‘ధర్మాగ్రహం’’ ఖండకావ్యానికి స్ఫూర్తిశ్రీ రాసిన ముందుమాటలో ఇది కనిపిస్తుంది. ‘‘ రోజువారీ జీవితంలో సైతం ఆయన నిండైన కవి. వెనక్కి దువ్విన ఒత్తయిన శిరోజాలు, ఎంతో ముద్దుగా పెంచుకున్న పొడుగాటి మీసాలు, వాటిని స్పృశించడానికి దిగివస్తున్నట్టు అనిపించే చెంపలు, మోకాళ్ళు దిగజారి వ్రేలాడే ఖద్దరు లాల్చీ, కొన్ని సమయాల్లో సిల్కు లాల్చీ, అందంగా తీర్చి దిద్దినట్టు కట్టిన పంచె ` వీటన్నింటికీ అందం తెచ్చే ధీరగంభీరమైన నడక... ఇది నాకు చేతనైనంతలో శ్రీ జ్ఞానానందకవిగారి రూపం’’ అని స్ఫూర్తిశ్రీ వర్ణించిందెంతో సముచితంగా ఉంది.
డా॥ జ్ఞానానందకవి రచనాతత్త్వాన్ని మూడుప్రధానమైన అంశాలుగా విశ్లేషించవచ్చు. తాను పుట్టిపెరిగిన కుల, మత, ప్రాంతమేదైనా, తనని భారతీయతకు ప్రతిరూపంగా అందరూ భావించాలనే ఆత్మవిశ్వాసం కలిగించే ప్రయత్నం ఆయన ప్రతిరచనలోను కనిపిస్తుంది.భారతదేశాన్ని వర్ణిస్తూ, హిమాలయాల్ని
‘ ఇది ఋషిచంద్రుల హృదయాల బంధించు
తతగాఢయోగ సాధన తలమ్ము
ఇది నిశాట ధ్వంసి పదముల లయ ఘోష
తాండవించిన దేవతా భువనము
ఇది చలిమిరిమల సదనమ్ము పరమప
విత్ర జాహ్నవికి నవేశనమ్ము
ఇది శత్రు సైన్యాల విదళింప నిలచిన
అరి భయంకర కరాళాయుధమ్ము
ఇది భరింపరాని హిమశృంగములజాడ
భరత ఖండమునకు వజ్రకుడ్య
మిది నగాగ్రగామి యిది వేలుపుల కొండ
ఇది మహా మహితము హిమకుధరము
ఇది ప్రకృతి యందచందాల కింపు గూర్చు
సురుచిర మనోజ్ఞ నృత్యనిర్జరుల నెలవు
ఇది హిమాద్రి ముక్కంటి యేలు నేల
స్వామి! కనులార తిలకించి పరవశించె’’ (శ్రీవివేకానందగానము) అంటారు. రెండవది, ఇంచుమించు పద్యంలోనే తన కవిత్వానంతటినీ చెప్పినా, తన ప్రతిభా పాండిత్య ప్రదర్శన కంటే, పాఠకులందరికీ పద్యం కూడా సులభంగానే అర్థమవుతుందనే ఆలోచనను కలిగించేలా పద్యాన్ని వర్ణించడం. మూడవది, అహింస, దయ, కరుణ, విశ్వమానవుడిగా ఎదిగే ఆలోచనలు కలిగించిన మహానుభావుల్ని కీర్తించడం వీరి రచనల్లో ప్రధానంగా కనిపిస్తుంది.
సమకాలీన కవుల్లో గుర్రం జాషువ, విశ్వనాథ సత్యనారాయణ, మధునాపంతుల సత్యనారాయణ, దాశరథి వంటి వారెందరో జ్ఞానానంద కవి కవిత్వాన్ని ప్రశంసించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం, మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో అనేక సంవత్సరాల పాటు వీరి ‘‘ఆమ్రపాలి’’ కావ్యం పాఠ్యాంశంగా ఉంది. అనేక విశ్వవిద్యాలయాల్లో వీరిపై పరిశోధనలు జరిగాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో సత్కరించగా, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేటుతో గౌరవించింది.కవి సాహిత్యానికి గుర్తింపుగా భారతప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.మొత్తం మీద పద్యకవుల్లో సామాజిక విషయాల్ని పద్యంలో ద్రాక్షాపాకంలో రాయడంలో చేయితిరిగిన కవిగా గుర్తింపుపొందారు. కఠినమైన భావాన్ని కూడా సులభంగా అర్థమైయ్యేరీతిలో వర్ణించి పాఠకుల్ని ఆనందింపజేయగల శక్తిమంతులు.దీనికి ఉదాహరణగా ఒక పద్యం చూద్దాం.
‘‘ రక్తప్లావితమైన మానగరమార్తధ్వానముల్‌ విన్న దు
శ్శక్తుల్‌ నెత్తురుద్రావు రాక్షసుల దౌర్జన్యాలు హింసల్‌ మహో
ద్రిక్తంబై చెలరేగ మానవత గోరి చొచ్చె నీవేళ నే
శక్తిన్‌ జూపి ప్రశాంతినింపెదవహో! సంక్రాంతి యీ నేలకున్‌’’ ` ఈ పద్యం ఈ మధ్యనే ఎవరో రాశారనుకుంటారు. ఇది 1993లో ‘‘ ఆహ్వానం ’’ లో రాసిన కవితా ఖండిక. కవిని ద్రష్ట అంటారు. నగరాల్లో నేరప్రవత్తుల్ని చూసినప్పుడల్లా అప్పుడే ఈ పద్యం చెప్పారా అనిపించేటట్లుంది. ఇలాంటివెన్నో సామాజిక అంశాల్ని పద్యాల్లో వర్ణించారు.
జ్ఞానానందకవిగారు నాటి నుండీ తుదిశ్వాస విడిచే వరకూ అవిశ్రాంతంగా తన పద్యవిద్యను కొనసాగించారు.తరంగమాల, వసంతగానం, దేశబంధు, పాంచజన్యం, గోల్కొండ, క్రీస్తుశతకం, రాజధాని, వంశధార, శ్రీవివేకానందగానం, క్రీస్తుప్రబంధం మొదలైన 36 కావ్యాల్ని ప్రచురించారు. షెడ్యూలు కులాలు అంటరానివా? అనే పరిశోధన గ్రంథాన్ని రాస్తే, దాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ప్రచురించింది. దీనిలో షెడ్యూలు కులాలు అంటరానివిగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ప్రముఖపాత్ర వహించిన మనువాదభావజాలాన్ని తూర్పారగట్టారు. నిజంగా వేదాల్లో, పురాణాల్లో లేని కులం, తర్వాత కాలంలో స్వార్థపరులు దాన్ని వాడుకుని సమాజాన్ని విచ్ఛిన్నం చేశారని నిరూపించేప్రయత్నం చేశారు. తన జీవితంలో ఎదురైన కష్ట నష్టాల్ని వివరిస్తూ ‘‘ కూలీ నుండి కళాప్రపూర్ణ వరకూ’’ అనే గ్రంథం రాశారు. వీరి సాహిత్య కృషిని వివరిస్తూ ‘‘ ది విజన్‌ ఇన్‌ ది వెర్సెస్‌ ఆఫ్‌ డా॥జ్ఞానానందకవి’ అనే ఆంగ్ల గ్రంథం కూడా వెలువడిరది. ఇంకా వీరి ‘ నా జీవితగాథ, ఏడు దశాబ్దాల కవితా పరిశ్రమ, సాహిత్య వ్యాససంపుటి, తొలిసంజ’’ వంటి అనేక రచనలు ముద్రితం కావాల్సినవి ఉన్నాయి.సాహిత్యమే జీవితమై బతికిన పద్మశ్రీ జ్ఞానానందకవి. తనలో, తన రచన్లో నిలువెత్తు భారతీయతను నింపుకున్న కవి. ఆయన రచనల్ని ప్రభుత్వం పునర్ముద్రించి, అన్ని విద్యాలయాలు, గ్రంథాలయాల్లో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేయడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళిని ప్రకటించిన వాళ్ళమవుతాం.
-డా॥ దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ,
సెంట్రల్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాదు` 46
ఫోను: 9989628049

జ్ఞానానందకవి అస్తమయం

(కాకినాడ, కెఎన్‌ఎన్‌ ప్రతినిధి) కూలీ నుండి పద్మశ్రీ వరకు ఎదిగిన సురగాలి తిమోతి జ్ఞానానందకవి జీవితం విషాదంగానే ముగిసింది. ఇది కవులతో పాటు సామాజిక భావాలు కలిగిన అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. సామాన్యుడి నుండి కవిసార్వభౌముని వరకు అంచెలంచెలుగా ఎదిగిన జ్ఞానానందకవి సాహితీ లోకంలో దీర్ఘకాలం పాటు అత్యద్భుతంగా ప్రకాశించారు. కవి కోకిలగా.. కవితా విశారదగా...కవి లోక విభూషణుడిగా...సాహితీ వల్లభునిగా ... అధ్య, విద్యప్రభువునిగా ఇలా అనేక అంశాలలో తనదైన శైలిలో సాహత్యాన్ని పోషించారు. బాల్యం నుండే రచనాసక్తిని చేపట్టిన జ్ఞానందకవి చివరివరకు అకుంతాసక్తిని కనబరిచారు. పలు రచనలు చేసి సాహతీ లోకంలో ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్నారు. సహజ కవితావేశబంధుర హృదయుడైన ఆయన తన కలం ద్వారా అలవోకగా రచనలు చేసి సాహితీ భూమిపై పాదుకొల్పారు. అవి నేడు వృక్షాలై ఎందరికో మార్గదర్శకంగా నిలిచాయి. వేలాదిమంది సాహితీప్రియుల్నుంచి ఆయన ఇప్పటికీ గాడ్‌ఫాదర్‌గా గౌరవాన్నందుకుంటున్నారు. తెలుగుబాషపై అపార ప్రతిభతో సాహితీ కృషివరులకు, సాహితీ ప్రయులకు సంబ్రమాశ్చర్యాల్ని కలిగించే రీతిలో ఆయనచేసిన రచనలు దేశ విదేశాల్లో బహుళ ప్రాచుర్యంపొందాయి. 1944లో తరంగ మాల కావ్యం ద్వారా తన రచనా ప్రాభవాన్ని చాటుకుని 40పైగా రచనల్తో తెలుగు సాహితీ జగత్తులో అనేక బిరుదులు స్వీకరించారు.
జ్ఞానానందకవి రచనలు
వసంతగానం(1947), గాంధీ (1950), దేశబంధు, పాంచజన్యము (1956), ప్రభంజనం, పర్జన్యం (తొలి భాగము)(1959), గోల్కొండ, క్రీస్తు చరిత్ర (1963), విజయాభిషేకం (1966), పర్జన్యం(రెండో భాగము)(1969), అక్షరాభిషేకం (1971), ఆమ్రపాలి (1972), అక్షరాక్షతలు (1973), అక్షరగుచ్చము (1975), వెలుగుబాట (1976), క్రీస్తు ప్రబంధం (1977), క్రీస్తుప్రబంధం తొలిభాగము (1992), నా జీవిత గాథ తొలిభాగం (1977), అక్షరపూజ (1979), హరిజనులు అంటరానివారా (1980), పిల్లనగ్రోవి (1982), రాజధాని (1987), వంశధార(1989), ది విజన్‌ ఇన్‌ ది వర్సస్‌ ఆఫ్‌ డాక్టర్‌ జ్ఞానందకవి (1990), కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు (1988), ధర్మాగ్రహము (1998), వివేకానందగానం(2004), రెండు వేల పద్యాలతో క్రీస్తు ప్రబంధం, మనదేశం, రోజలుమారాలి (లఘునాటిక) బాష్ప సందేశం, పిల్లనగ్రోవి, రాజధాని, ఆహ్వానం, రెండంకితాలు, ఆరుదశాబ్ధాల కవితా పరిశ్రమ, అభినందన పద్యగద్య వ్యాససంపుటిలతో పాటు జ్ఞానందకవి చేసిన మరి కొన్ని రచనలు బహుళ ప్రాచుర్యం పొందాయి.
బిరుదులు
విజయనగరం జిల్లాలో 1987 డిశంబర్‌ 7న కవితా విశారద, విజయవాడలో 1950 మే 20వ తేదీన కవికోకిల, కాకినాడలో 1961ఏప్రిల్‌ 24న కవిలోక విభూషణ, 1968నవంబర్‌ 10వ తేదీన విద్వత్‌కవిచూడామణి, 1968నవంబర్‌ 15వ తేదీన సాహితీవల్లభ, 1974 జనవరి 27న మహాకవి, 1979 అక్టోబర్‌ 28న కవిసార్వభౌమ, 1991 ఫిబ్రవరి 7వ తేదీన బ్రహ్మీ విభూషణ, విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో 1974 ఆగష్టు 3వ తేదీన కళాప్రపూర్ణ, విజయవాడలో 1974 సెప్టెంబర్‌ 29వ తేదీన అభినవ జాషువ, బొబ్బిలి చిలుకలపల్లిలో 1975సెప్టెంబర్‌ 28వ తేదీన సాహితీ కృషి వల, రామచంద్రపురంలో 1982 సెప్టెంబర్‌ 28వ తేదీన కవితాశ్రీనాధ, 1982లో పద్యవిద్యాప్రభు, 1996లో డి.లిట్‌, 2001లో పద్మశ్రీ బిరుదులను స్వీకరించారు.
విద్యాబ్యాసం
1922జూలై 16వ తేదీన విజయనగరం జిల్లా బలిజపేట మండలం పెదపెంకి గ్రామంలో జన్మించిన జ్ఞానానందకవి ఆరవఏటే రచనలు రాయడం ప్రారంభించారు. భీమునిపట్నం బోర్డింగ్‌ స్కూల్‌లో 8వ తరగతి వరకు విద్యాభ్యాసానంతరం కాకినాడలో ఉపాధ్యాయశిక్షణ పొందారు. అనంతరం ఆయన తొలిసారిగా 14వ ఏటనే అప్పటి విశాఖ జిల్లా అలజంగి గ్రామంలో తెలుగుపండిట్‌గా ఉపాధ్యాయవృత్తి చేపట్టారు. 1982లో పదవీ విరమణ చేసేనాటికి 512రూపాయలను వేతనంగా స్వీకరించేవారు. ఈయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం మరో ఐదేళ్ళ పాటు సర్వీసును పెంచినప్పటికి వేతనం చెల్లింపులో మాత్రం నిర్లక్ష్యం వహించింది.
చేపట్టిన పదవులు
జ్ఞానానందకవి రాష్ట్రంలో పలు గౌరవ పదవుల్ని చేపట్టి వాటికి వన్నెతెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం, ఆంద్రప్రదేశ్‌ లైబ్రరీ యాక్ట్‌ రివ్యూ కమిటీ, ఆంధ్రప్రదేశ్‌ సాహితీ అకాడమీ, ఆంధ్రవిశ్వవిద్యాలయ అకాడమీ కౌన్సిల్‌, తూర్పు గోదావరి జిల్లా రెడ్‌క్రాస్‌ సంఘం, తూర్పుగోదావరి జిల్లా గ్రంథలాయ సంస్థ సభ్యుడిగా పలు పదవులు నిర్వహించారు. రచనలు చేయడంతో జ్ఞానానందకవి సాహితీ సంస్థలను ఏర్పాటు చేయడంపై ప్రత్యేక శ్రద్ద కనబరిచారు. 1967లో సాహితీ సమాఖ్య, 1972లో సాహిత్య కళాపీఠం, 1980లో జాషువాకవి సాహిత్య పీఠాల్ని ఏర్పాటు చేశారు.
ప్రముఖుల ప్రశంసలు
జ్ఞానందకవి రచనలను శ్లాఘించిన వారిలో కవిసామ్రాట్‌ డాక్టర్‌ విశ్వనాధ సత్యనారాయణ, డాక్టర్‌ బెజవాడ గోపాల్‌లెడ్డి, ఆచార్యరంగ, డాక్టర్‌ సి నారాయణరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు, డాక్టర్‌ దివాకర్ల వెంకటావధాని, ఆంధ్రసారస్వత రిషదధ్వక్షులు దేవులపల్లి రామానుజరావు, బ్రహ్మీభూషణ కాకకపర్తి కృష్ణశాస్త్రి, జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, డాక్టర్‌ నందూరి రామకృష్ణమాచార్య, డాక్టర్‌ కులుకలూరి ఇనక్‌, ఆర్‌ఎస్‌ సుదర్శనం, కవిరాజ మూర్తిలతో పాటు అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రత్యేకంగా అభినందించిన వారిలో ఉన్నారు. భారత మాజీ రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ నుండి జ్ఞానందకవి అత్యున్నతమైన పద్మశ్రీ అవార్డును స్వీకరించారు.
కుటుంబ వివరాలు
సురగాలి ఎలయ్య, పాపమ్మ దంపతులకు 1922లో జ్ఞానందకవి జన్మించారు. మారెటి తల్లి పోలమ్మ సమక్షంలోఆయన పెరిగి పెద్దవారయ్యారు. అనంతరం ఆయనకు సుగుణ మణితో వివాహం జరుగగా ముగ్గురు కుమారులు, ఇరువురు కుమార్తెలు కలిగారు. వీరిలో ఒకబ్బాయి యుక్తవయస్సులోనే మరణించగా మిగిలిన వారు వివిధ హోదాలలో ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారు. చివరిదశలో ఆయన దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. నడకుదురులోని జనావళి అనాధాశ్రమంకు చెందిన మందపల్లి శ్యామ్‌ ఆయన్ను ఆదరించి చివరివరకు ఆయనకు సదుపాయాలు కల్పించారు. మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ నెలకు రెండువేల చొప్పున కొన్నాళ్ళపాటు ఆయనకు ఆర్ధికసాయాన్నందించారు. నగరానికి చెందిన మరికొంతమంది ఆయనకు ఆర్ధికసాయం చేసి సహకరించారు. చివరివరకు సాహిత్యసేవలోనే గడిపిన ఆయన జీవితం ధన్యం.
..............


'పద్మశ్రీ' జ్ఞానానందకవి కన్నుమూత
కాకినాడ, న్యూస్‌టుడే: ప్రముఖ గ్రంథ రచయిత, సాహితీవేత్త, పద్మశ్రీ సురగాలి జ్ఞానానందకవి(89) ఇకలేరు. అనారోగ్యంతో ఆయన తూర్పుగోదావరి కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఈయన కాకినాడ మెక్లరిన్‌లో తెలుగు పండితునిగా పనిచేసి పదవీవిరమణ పొందారు. అప్పట్నుంచి కాకినాడలోనే స్థిరపడ్డారు. 40కుపైగా గ్రంథాలు రచించారు. తరంగమాల, వసంతగానం, దేశబంధు, గొల్కొండ, ఆమ్రపాళి, తదితర గ్రంథాలు వీరి ప్రముఖ రచనలు. ఆయన ప్రముఖ కవి గుర్రం జాషువాకు అనుయాయులు. జ్ఞానానందకవి రచనలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో 'పద్మశ్రీ' అవార్డును అప్పటి రాష్ట్రపతి కె.నారాయణన్‌ చేతులమీదుగా అందించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 'కళాప్రపూర్ణ' బిరుదుతో గౌరవించింది. ఈయన రచనలు రాష్ట్రంలో నాలుగు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా అమలు చేస్తున్నారు. జ్ఞానానందకవి మృతి పట్ల రాష్ట్రమంత్రులు తోట నరసింహం, పినిపే విశ్వరూప్‌, కలెక్టర్‌ ఎం.రవిచంద్ర సంతాపం తెలిపారు.
( Courtesy  :  http://www.eenadu.net/archives/archive-7-1-2011/story.asp?qry1=21&reccount=26 )

.............

ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి
ప్రముఖ సాహితీ వేత్త, కళాప్రపూర్ణ డాక్టర్‌ జ్ఞానానంద కవి గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. ఆయన గతేడాదిన్నరగా నడకుదురు వృద్ధుల ఆశ్రమంలో కాలం గడుపుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో లైఫ్‌లైన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 7 గంటలకు తనువు చాలించారు. శుక్రవారం ఆయన పార్ధివ శరీరాన్ని ఖననం చేస్తారు.
జ్ఞానానందకవి 1922 జూలై 16న విజయనగరం జిల్లా, బొబ్బిలి వద్ద పెద కంచి గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. తల్లి పాపమ్మ, తండ్రి పాపయ్య. ఆయన పుట్టిన రెండేళ్లకే తల్లి మరణించారు. జ్ఞానానందకవి భాషా ప్రావీణ్యాన్ని పరిగణనలోకి తీసుకొని అప్పటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి ఆయనను తెలుగు పండితునిగా నియమించారు. జిల్లాలోని ఆలగంజి, పెంట, మేడపల్లి పాఠశాలల్లో జ్ఞానానందకవి పనిచేశారు. అనంతరం కాకినాడ మెక్లారిన్‌ హై స్కూల్లో 35 సంవత్సరాల పాటు తెలుగు పండితుడిగా పనిచేసి, అక్కడే ఉద్యోగ విరమణ చేశారు. 1954లో ఆయనకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుగుణమణితో వివాహం అయింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. జ్ఞానానందకవి పలు రచనలు చేశారు. వీటిలో ప్రధాన మైనది ఆమ్రాపాలి. గోల్కొండ మొదలగు 26 పుస్తకాలు రచించారు.
సత్కారాలు, బిరుదులు
తెలుగు సాహిత్యానికి జ్ఞానానంద కవి చేసిన సేవలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సన్మానాలు, బిరుదులు అందించాయి. 1991లో భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్డు, 1974లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదు, 1988లో నాటి ముఖ్యమంత్రి ఎన్‌టి.రామారావు చేతుల మీదుగా కవి సార్వభౌమ బిరుదు జ్ఞానానంద కవి అందుకున్నారు. ఆయన రచనలు, జీవితంపై ఐదు విశ్వవిద్యాలయాల్ల్లో పరిశోధనలు జరిగాయి.
పలువురి సంతాపం
డాక్టర్‌ జ్ఞానానంద కవి మరణం సాహిత్య లోకానికి తీరని లోటని రాష్ట్ర స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ మంత్రి తోట నరసింహం పేర్కొన్నారు. అనేక రచనల ద్వారా సాహితి లోకానికి ఆయన ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. జ్ఞానానందకవి మృతి సాహితి లోకానికి తీరని లోటని జిల్లా కలెక్టర్‌ ఎం.రవిచంద్ర సంతాపం ప్రకటించారు. సాహిత్య లోకం పెద్ద దిక్కును కోల్పోయిందని కాకినాడ ఆర్‌డిఓ జిసి.కిశోర్‌కుమార్‌ పేర్కొన్నారు. జెఎన్‌టియు వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అల్లం అప్పారావు మాట్లాడుతూ జ్ఞానానందకవి మృతి సాహితి ప్రియులకు తీరని లోటని అన్నారు. సాహితీ లోకానికి జ్ఞానానంద కవి చేసిన సేవ చిరకాలం గుర్తుంటుందని జిల్లా పౌరసంబందాధికారి వి.రామాంజనేయులు పేర్కొన్నారు.
( soujanyam :  http://www.prajasakti.com/eastgodavari/article-190676

అనాధాశ్రమంలో 'పద్మశ్రీ'

ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి
కవి సార్వభౌముడు, పద్మశ్రీ, కళా ప్రపూర్ణ డాక్టర్‌ సురగాని తిమోతి జ్ఞానానంద కవి 20 రోజులుగా అనాధాశ్రమంలో తలదాచుకుంటున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో పురస్కారాలు అందుకుని అనేక బిరుదులతో సత్కారాలు అందుకున్న కళా ప్రపూర్ణ జ్ఞానానందకవి దిక్కూ మొక్కూ లేక అనాధాశ్రమంలో చేరడం పలువురిని విస్మయానికి గురి చేసింది. ఆయనకు ఐదుగురు పిల్లలున్నా వారు పట్టించుకోవడం లేదు. దీంతోపాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందకపోతుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాకినాడకు చెందిన దళిత కవి జ్ఞానానంద 20 రోజుల క్రితమే కాకినాడ సమీపంలోని కరప మండలం నడకుదురులో ఉన్న జనావళి అనాధ వృద్ధాశ్రమానికి వెళ్లినట్లు ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఎన్నో పురస్కారాలు అందుకున్న దళిత కవికి కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణా ఉండటంలేదని, తాను ఉండేందుకూ స్థలం ఇవ్వలేదని వాపోతూ వచ్చారు. అంతేకాకుండా ఆయనకు ఎటువంటి పింఛనూ అందడం లేదని ఆవేదన చెందేవారు. ఆయన కాకినాడలోనే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల ఉగాది పురస్కారం ఇచ్చేందుకు కూడా కలెక్టర్‌ జ్ఞానానంద కవిని ఆహ్వానించారు. ఈ సందర్భంగానూ ఆయన 'కవి పట్ల మీకు ఉన్న విజ్ఞత ఇదేనా?. నేను ఎలా వస్తానో కూడా ఆలోచించరా?. కనీసం వాహనం కూడా ఏర్పాటు చేయలేకపోయారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 'పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఎందుకు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ జిల్లా అధికారులు కూడా ఆయనకు ఎటువంటి సహాయమూ అందించలేదు. జ్ఞానాంద కవికి ఐదుగురు పిల్లలున్నా వారు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఆలనా పాలనా కరువవడంతో ఆయన ఆనాధ వృద్దాశ్రమంలో తలదాచుకుంటున్నారు.
నా దుస్థితికి ప్రభుత్వమే కారణం : జ్ఞానానందకవి
నా దుస్థితి ప్రభుత్వమే కారణం. నాకు ఎటువంటి రాజకీయ అండదండలూ లేకపోవడం వల్లే నన్ను పట్టించుకోవడం లేదు. నేను దళితుణ్ని. నాకు ఎంఎల్‌ఎ, ఎంపీ, అధికారుల సపోర్టు లేదు. రాజకీయ బలం ఉంటే ఎక్కడో ఉండేవాణ్ణి. కలెక్టర్‌కు తెలుగు రాదు. ఉగాది రోజున రూ.200 ఇచ్చారు. భోజనానికి కూడా సరిపోలేదు. నాకు అన్నం లేదు. ఆకలితో అలమటిస్తున్నాను. ప్రభుత్వానికి దళిత కవులు అంటే చిన్న చూపు. పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి వారి హయాంలో గౌరవం దక్కేది. ముఖ్యమైన వాటిలో తనకు ప్రాధాన్యత కల్పించేవారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి...
జ్ఞానానంద కవి అవార్డులు..
1974లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా కళా ప్రపూర్ణ అవార్డు.
2001లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు.
ఎన్‌టిఆర్‌ హయాంలో హంసకవి అవార్డు. రూ.30 వేల నగదు పురస్కారం.
1974లో ప్రభుత్వం ద్వారా కనకాభిషేక పురస్కారం.
1991లో తెలుగు యూనివర్శిటీ నుంచి డాక్టరేట్‌.
చేపట్టిన పదవులు..
అధికార భాషా సంఘం రాష్ట్ర సభ్యుడు.
రెడ్‌క్రాస్‌ మెంబర్‌.
రాష్ట్ర గ్రంథాలయ చట్టం సమీక్షా కమిటీ సభ్యుడు.
ఆంధ్రా యూనివర్శిటీ కౌన్సిల్‌ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ సభ్యుడు. దూరదర్శన్‌ సభ్యుడు.
వచ్చిన బిరుదులు...
పద్మశ్రీ, కళాప్రపూర్ణ, శారదా వల్లభ, కళారత్న, కవికోకిల, కవితా విశారద, అభినవ జాషువా, కవి సార్వభౌమ, మహాకవి, కవి విభూషణ, కళా రత్న.
..........

పద్మశ్రీ జ్ఞానానందకవి కన్నుమూత

కాకినాడ, జనవరి 6: ప్రముఖ కవి, కళాప్రపూర్ణ, పద్మశ్రీ డాక్టర్ ఎస్‌టి జ్ఞానానంద కవి గురువారం రాత్రి కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జ్ఞానానంద కవి సాహితీ లోకానికి అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద పెదకంకి గ్రామంలో నిరుపేద కుటుంబంలో 1922 జూలై 16న జ్ఞానానంద కవి జన్మించారు. తల్లిదండ్రులు పాపమ్మ, ఎల్లయ్యలు. ఆయన అసలు పేరు సురగాలి తిమోతి జ్ఞానానందం. కాకినాడ నగరంలో మెక్లారిన్ హైస్కూల్‌లో తెలుగు పండిట్‌గా చేరి దాదాపు 35 ఏళ్ళు ఇక్కడే పని చేసి పదవీ విరమణ చేశారు. జ్ఞానానందకవి కవితల్లో ప్రధానమైనవి అమ్రపాలి. గౌతమబుద్దుని శిష్యురాలు అమ్రపాలి పేరున ఈ పుస్తకాన్ని రాశారు. అలనాటి రచనల్లో ఈ పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది. 1974లో ఈ పుస్తకాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం బిఎస్సీ విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టింది. 1944 నుండి 1970 సంవత్సరాల మధ్య తరంగమాల, వసంతగానం, గాంధీ, దేశబంధు, పాంచజన్యం, ప్రభంజనం, గోల్కొండ, క్రీస్తుచరిత్ర, క్రీస్తు శతకం, వెలుగుబాట, విజయాభిషేకం, పర్జన్యం వంటి పుస్తకాలను రచించారు. తెలుగు సాహిత్యానికి జ్ఞానానంద కవి చేసిన సేవలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సత్కారాలు, పురస్కారాలు అందచేశాయి. ప్రతీ ఏటా నిర్వహించే ఉగాది సమ్మేళనంతోపాటు వివిధ సాహితీ సభలు, కార్యక్రమాలకు ఆయన పెద్ద దిక్కుగా ఉండేవారు. నగరంలోని మెక్లారిన్ హైస్కూల్‌లో తెలుగు పండిట్‌గా పని చేసి పదవీ విరమణ చేసిన ఈయన అనేక రచనలు, కవితల ద్వారా సమాజంలో కీర్తింపబడ్డారు. జాషువా సాహిత్య పీఠాన్ని నెలకొల్పిన ఈయన రచనలు పలువురు యువ కవులు, రచయితలకు మార్గదర్శకంగా నిలిచాయి.
జ్ఞానానంద మృతికి మంత్రి తోట, కలెక్టర్ సంతాపం...
ప్రముఖ కవి, పద్మశ్రీ, కళాప్రపూర్ణ జ్ఞానానందకవి మృతి పట్ల మంత్రి తోట నరసింహం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన గురువారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో జ్ఞానానంద కవి మృతి జిల్లా సాహితీ, కవితా లోకానికి తీరనిలోటన్నారు. జిల్లా కలెక్టర్ ఎం రవిచంద్ర విడుదల చేసిన మరో ప్రకటనలో జ్ఞానానంద కవి మృతిపట్ల సంతాపం తెలియచేశారు. కవి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే జిల్లా పౌర సంబంధాధికారి వి రామాంజనేయులు విడుదల చేసిన ప్రకటనలో దశాబ్ధాలుగా సాహితీ ప్రపంచానికి సేవ చేసిన జ్ఞానానంద కవి మృతి చెందడం బాధిస్తోందని పేర్కొన్నారు.
soujanyam : andhra bhoomi 

“ఆదికవి” లో సాహిత్యకీయం?



తెలుగు కవుల్లో నన్నయ, వేమన పేర్లతో కొన్నాళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్‌ లో రెండు విశ్వవిద్యాలయాల్ని ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నిజంగా అది తెలుగు కవులకు దక్కిన గొప్ప గౌరవంగానే పైకి అనిపిస్తున్నా, వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే అలా విశేషణాలతో పేర్లు పెట్టడం సమంజసమేనా అనిపించకమానదు. ఒక దానికి ‘‘ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం’’ అని పేరు పెట్టారు. విశ్వవిద్యాలయానికి తెలుగు కవి పేరు పెట్టినా, దానిలో ఎం.ఏ., తెలుగు కోర్సు  లేదు. తెలుగు కోర్సులు కూడా తర్వాత పెట్టే అవకాశం ఉండొచ్చు.నన్నయ పేరుకి ముందు ఆదికవి అనే బిరుదు అవసరమా?  నన్నయే తొలి తెలుగు కవి అవుతాడా? నన్నయకు ముందు తెలుగు సాహిత్యం లేదా? ఉంటే మరి నన్నయనే ఆదికవి అని ఎందుకంటున్నారు?
నన్నయ నాటికే తెలుగు కవిత్వం ఉందని కొంపెల్ల జనార్ధనరావు ఉదయిని ( సంచిక 5 ` మే) లో రాశారు. నన్నయ కంటే ముందు సర్వదేవుడనే కవి ఉన్నాడనీ, అతడు ఆదిపురాణం, విరాట పర్వ అనే కావ్యాల్ని రాశాడని కొంపెల్ల విశ్వసించారు. ఇతడు జైనమతస్థుడు. ఇతడినే పొన్నమయ్య అని కూడా అంటారని నేలటూరి వెంకటరమణయ్య నిరూపించారు. కన్నడ కవిత్రయం పంప, పొన్న, రన్నడులో ఇతడొకడు. అయితే తెలుగులో  పొన్నమయ్యగా ప్రసిద్ది చెందిన ఈ కవి  రాసిన ఆదిపురాణంలో మూడుపద్యాలు దొరికాయి. ఆ పూర్తి కావ్యం గానీ, కొంత భాగంగానీ దొరికితే  పొన్నమయ్యగార్ని ఆదికవి పోటీకి నిలబెట్టొచ్చని ఆరుద్ర అన్నారు. జైనమతం పట్ల ఉన్న వ్యతిరేకత వల్ల ఆ కావ్యాన్ని కూడా ప్రాచుర్యంలోకి తీసుకురాలేదేమోనని సందేహించాల్సి వస్తోంది.
నన్నయకు ముందే కవిజనాశ్రయం అనే ఛందోగ్రంథం వచ్చింది. దీన్ని క్రీ.శ. 940 ప్రాంతంలో మల్లియరేచన రాశాడు. ఈ కవి వైశ్యుడు. జైనమతస్థుడు.  దీని కర్తృత్వాన్ని వివాదం చేశారు. దీన్ని వేముల వాడ భీమన కవి రాశాడనీ, అయితే రేచన దగ్గర డబ్బు తీసుకుని అతని పేరుతో ప్రచారం చేశాడనీ, అందువల్ల దీన్ని వేములవాడ భీమన రాసిన కృతంగానే గుర్తించాలనేది జయంతి రామయ్య పంతులు వాదన.
వీరితో పాటు గజాంకుశుడనే కవి నన్నయ కంటే ముందే నీతిసారం రాశాడని సాహిత్య చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇతడు కేవలం తెలుగులోనే కాకుండా కన్నడంలో కూడా కవిత్వం చెప్పినవాడన్నారు. దీనితో పాటు కవిరాజశిఖామణిగా పేరొందిన నన్నెచోడుడు రాసిన కుమారసంభవం తెలుగులో తొలి కావ్యమనే వాదన తెలుగు సాహిత్యాన్నొక ఊపుఊపింది. క్రీ.శ. 940 ప్రాంతానికి చెందిన నన్నెచోడుడే ఆదికవి అవుతాడనీ మానవల్లి రామకృష్ణకవి వాదించారు. దీన్ని తర్వాత సాహిత్య చరిత్రకారులు అంగీకరించలేదు. అతడు క్రీ.శ. 1080- 1130 ప్రాంతానికి చెందుతాడని నిర్ణయించారు. అయితే ఇక్కడో గమ్మత్తుంది. నన్నెచోడుడు క్షత్రియుడనీ, అందుకే అతడిని ఆదికవిగా గుర్తించనిరాకరించారనే వాదనలున్నాయి. వేములవాడ భీమకవిని కూడా నన్నయకు ముందున్న కవి అనీ, అతడూ మహాభారతాన్ని రాసినా, దాన్ని నన్నయ గోదావరిలో కలిపేశాడనేది ఒక పుక్కిటపురాణంగా కొట్టిపారేసిన వాళ్ళే ఎక్కువమంది. అందు వల్ల అనివార్యంగా సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనుసృజన చేసిన నన్నయనే ఆదికవి అని పిలుస్తున్నారు.
నవ్య సంప్రదాయాన్ని ఒక ‘‘ఉద్యమం’’గా కీర్తించిన సాహిత్య చరిత్ర కారులు కూడా నన్నయను ‘‘ఆదికవి’’గా సమర్థించడానికెంతగానో కష్టపడ్డారు.అసలు తెలుగులో నన్నయ ‘‘ఆదికవి’’ అవుతాడా? ‘ఆంధ్రమహాభారతంరెండున్నర పర్వాల్ని పూర్తి చేసి, లిఖిత రూపంలో దాన్ని ఒక కావ్యంగా అందించినందు వల్లే ఆయన్ని ఆదికవిగా గుర్తించాలా? అంతకు ముందు తెలుగు సాహిత్యం లేదా? తెలుగు కవుల్లేరా? పద్యకావ్యంగా రాస్తేనే దాన్ని సాహిత్యంగా పరిగణించాలా? పద్యకావ్యం రాసినందు వల్లనే నన్నయని తెలుగులో ఆదికవిగా పిలుస్తున్నారా? ఇవన్నీ మన తెలుగు సాహిత్య చరిత్రకారులు వేసుకుని వివిధ సమాధానాలతో సంతృప్తి పడ్డవాళ్ళున్నారు. మరికొంతమంది ఆ అసంతృప్తిని వెళ్ళగక్కుతూనే ఉన్నారు. ఆ అసంతృప్తికి పరిశోధనాత్మక, వైయక్తికమైన అనేక కారణాలెన్నో ఉన్నాయి.

కవుల్ని, వారి రచనల్ని కులం, అగ్రవర్ణత్వం ఆధారంగా వివక్షను ప్రదర్శించిన వైనాన్ని  బహుజన సాహిత్య వాదం బయటపెడుతుంది. సాహిత్య చరిత్రలో వర్ణ వివక్ష కొనసాగిన తీరుని ఎండగడుతుంది. ఇక్కడ అగ్రవర్ణత్వమంటే ఏమిటో అంబేద్కర్‌ చెప్పిన అభిప్రాయాలు గుర్తించాల్సిన అవసరముంది. ఉదాహరణకు చాతుర్వర్ణ వ్యవస్థనే తీసుకుందాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలున్నాయి. దీనిలో అంత్యవర్ణం శూద్ర. శూద్రులకు వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణలు అగ్రవర్ణాలవుతాయి. వైశ్యులకు ఆ పై రెండూ, అలాగే క్షత్రియులకు బ్రాహ్మణులు అగ్రవర్ణాలవుతాయి. ఇలా భారతదేశంలో వేలాది వర్ణాలున్నాయి. వీటిలో ఒకదానిపై మరొకటి అగ్రవర్ణత్వాన్ని చెలాయిస్తున్నాయి. ఈ వివక్ష నిచ్చెన మెట్ల వ్యవస్థను కలిగి ఉంటుంది. దీన్ని కొన్ని వర్గాలుగా మాత్రమే విభజించి చూస్తే సరిపోదు. దీన్ని బహుజన  సాహిత్య దృక్పథం లోతుగా అధ్యయనం చేయాలంటుంది. కనుక, అగ్రవర్ణత్వాన్ని నిర్మూలించాలంటే, ముందుగా దాని వికృత స్వరూపమెలా విస్తరించిందో చూపాల్సిన అవసరముంది. ఈ అగ్రవర్ణత్వం వల్ల అత్యంత ఎక్కువగా కష్ట నష్టాలకు గురైందెవరో, వాళ్ళంతా చైతన్యం కావాలంటుంది. ఈ దృష్టితో చూసినప్పుడు అత్యంత అగ్రవర్ణంగా ఉన్న వర్ణమే సాహిత్యంలోనూ ఆధిపత్యాన్ని చెలాయించుకోవడంలో భాగంగానే నన్నయను ఆదికవిగా నిలిపే ప్రయత్నం జరిగిందని గుర్తించాలి. 
నన్నయను ఆదికవి అనడమొక చర్చనీయాంశమైతే, రెండవది వేమన పేరుతో ఒక విశ్వవిద్యాలయాన్ని పెట్టినా, దీనికి కూడా ‘‘యోగివేమన’’ అని ఒక విశేషణాన్ని ముందుంచడం మరో చర్చనీయాంశమైంది. ‘‘వేమన’’ అంటే సరిపోతుంది కదా! కానీ కొంత నిర్దిష్టమైన పద్ధతిలో పేర్లు పెట్టకపోతే, భవిష్యత్తులో కొన్ని వివాదాలు తలెత్తే అవకాశముందని భావించామనొచ్చు. బహుశా గట్టిగా సమర్థించుకోవడానికి నాగార్జున విశ్వవిద్యాలయం పేరు ముందు ‘‘ఆచార్య’’ చేర్చి నాగార్జునుడిని స్మరించేటట్లు చేశారు కదా అని, దాన్ని చూపించి, వాదించే అవకాశం కూడా ఉంది. దీనికీ, పై రెండింటికీ మధ్య చాలా తేడా ఉంది. వేమనను హిందూభావజాల చట్రంలో కట్టిపడేయాలనే ఆలోచన ఉండొచ్చు. ఇది తెలియాలంటే వేమన చెప్పిన నిజమైన పద్యాల్ని గుర్తించాలి. ఆ సమయం కూడా వస్తుందని ఆశిద్దాం.
-డా దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ,
సెంట్రల్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాదు` 46
ఫోను: 9989628049