"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

22 మార్చి, 2026

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 'నెమలి కన్నులు(ఆత్మకథ)' పై డాక్టర్ కొత్వాలు అమరేంద్ర వ్యాసం

 ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 'నెమలి కన్నులు(ఆత్మకథ)' మీద సృజన క్రాంతి దినపత్రిక(17-5-26)లో  ప్రత్యేక వ్యాసం..... డాక్టర్ కొత్వాలు అమరేంద్ర 

#############₹###₹#



 సంక్షుభిత జీవన పార్శ్వాల ఆత్మకథ



గతాన్ని తలచుకుంటూ ఆ గతం కల్పించిన వెన్నెల దారుల్లోనూ, ముళ్ల దారుల్లోనూ సాగించిన నడకల్లోని ఒడిదుడుకుల్ని చర్వితచరణం చేసుకోవడమే కాక తనలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపించే తనకు ఎదురైన ఎన్నో సంఘటనల్నీ, మరెన్నో సందర్భాల్నీ తన భావోద్వేగాలతో సంలీనం చేయడమే అసలైన ఆత్మకథ అవుతుంది. బాల్యపు నోస్టాల్జియా జ్ఞాపకాల్లో భాగంగా అలాంటి జీవనసంఘర్షణ తాలూకు విభిన్న పార్శ్వాలు కల్పించిన ఎన్నో ఒడిదుడుకులకు అక్షరరూపం కల్పిస్తూ, సామాజిక సంక్షోభంలో ఎదురైన ఎన్నెన్నో ఆటపోట్లను ఎదుర్కొంటూ తాను ఎదిగిన క్రమాన్ని వివరిస్తూ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వెలువరించిన ఆత్మకథే ‘నెమలి కన్నులు’ 

తెలుగులో తొలి ఆత్మకథ 1911లో కందుకూరి వీరేశలింగం ‘స్వీయచరిత్రము’తో పారంభమైనా ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో సామాజిక ప్రయోజనాన్ని కలిగించే స్ఫూర్తిదాయక స్వీయచరిత్రలు 1934లో ఏడిదము సత్యవతి వెలువరించిన ‘ఆత్మచరితము’(భర్త చనిపోయాక ఆత్మవిశ్వాసంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన తీరును వివరించడం) గ్రంథంతో ప్రారంభమైందని చెప్పవచ్చు. 20వ శతాబ్దంలోనే తెలుగులో స్వీయచరిత్ర ప్రక్రియ విభిన్న సామాజిక పార్శ్వాలతో, సామాజిక సందేశాలతో పుజుకోవడం ప్రారంభమైంది. చిలకమర్తి లక్ష్మీనరసింహం ‘మాబడి’(తాను అంధుడైనప్పటికీ సాహిత్యంలో తాను ఒక్కోమెట్టు అధిగమించిన విధాన్ని చెప్పడం), ఆదిభట్ల నారాయణదాసు ‘ఎరుక’(ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ హరికథాపితామహునిగా తాను ఎదిగిన క్రమాన్ని వివరించడం), కొండపల్లి కోటేశ్వరమ్మ ‘నిర్జనవారథి’( తాను నమ్ముకున్నఉద్యమంలో ఆత్మస్థైర్యంతో తాను ఎదుర్కొన్న అడ్డంకుల్ని వివరించడం), గుర్రం జాషువా ‘నాకథ’(తన సాహిత్యప్రస్థానంలో తాను ఎదుర్కొన్న అనేక వివక్షలను పద్యరూపంలో వివరించడం), ఎన్నో సామాజిక కట్టుబాట్లను ధిక్కరిస్తూ చలం రాసుకున్న ‘స్వీయచరిత్ర’, భోయి హైమవతి ‘పాలేరు నుంచి పద్మశ్రీ వరకు’(తన భర్త భోయి భీమన్న ఎగుడుదిగుడుల జీవనపోరాటాన్ని ఆయన సతీమణి తన ఆత్మకథలో నిక్షిప్తం చేయడం)..వంటి ఆత్మకథలు ఎంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తాయి. ఇప్పుడు వీటన్నింటి స్ఫూర్తితో దార్ల  ఒక సామాజిక లక్ష్యంతో తన ఆత్మకథను తీర్చిదిద్దారు. 

బాల్యంలోని నోస్టాల్జియా జ్ఞాపకాలు కొందరికి ఎంతో అపురూపంగా కనిపిస్తే మరికొందరికి జీవన సంఘర్శణతో మిళితమైన ఎన్నో ఒడిదుడుకులుగా కనిపిస్తాయి. అలాంటి జీవనసంఘర్షణలతోనే ఈ రచయిత ఆత్మకథ సాగుతూ సామాజిక సంవేదనను వినిపిస్తుంది. ఎన్నెన్నో ప్రశ్నలను సంధిస్తుంది. ఆ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తూ ముందుకు సాగింది ఈ రచయిత జీవితపయనం. తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూనే తన కుటుంబనేపథ్యంలో చోటుచేసుకున్న సామాజిక సంక్షోభాన్ని వివరించడమే ఈ రచయిత ప్రధాన ఉద్దేశం. ఆధిపత్యం, వివక్షల మధ్య విలవిలలాడిన తన కుటుంబం తనలో కలిగించిన సంఘర్షణలను తన బాల్యంలోని వివిధ దశల్లో అంటే చిన్నతనం నుంచి పదవ తరగతి దశవరకు 39 అధ్యాయాల్లో వివరించుకుంటూ వేళతాడు. తన కుటుంబాన్ని నెట్టుకురావడంలో తల్లిదండ్రులు పడిన కష్టాలను వివరిస్తూ వారి ప్రేమాభిమానాలకు అక్షరాభిషేకం చేశాడు. ఈ ఆత్మకథ 25 వారాలపాటు భూమిపుత్ర దినపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. 

ఈ ఆత్మకథలో రచయిత చెప్పుకున్న బాల్యజ్ఞపకాలు విని మురిసిపోయేంత అపురూపమైన ముచ్చట్లు కావు. తన పసిమనసును గాయపరచిన విభిన్న సామాజిక సంఘర్షణల తాలూకు ఆటుపోట్లుగానూ, సామాజిక చైతన్యానికి దోహదపడే సామాజిక గాట్లుగానూ అవి కనిపిస్తాయి. తన తండ్రితోబాటు పొలం పనులకెళ్లినా, బోర్లు వేసే పనులకెళ్లినా తాను విద్యార్థిగా ఎదిగిన క్రమాన్ని వివరించిన విదానం స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. ఈ ఆత్మకథలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది రచయిత కథనాత్మక శైలి. ‘పొద్దున్నే ఆ నల్లని మేఘాలెంత వేగంగా నడిచేవో, అంతకంటే వేగంగా అనేకసార్లు దూరపు ఊళ్లలో పనికోసం మా వాళ్లతోపాటునేనూ నడిచేవాణ్ణి కదా అనిపించేది..’. ఇలాంటి శైలే ఈ రచనను చివరివరకూ సుసంపన్నం చేసింది. ఎప్పుడూ పచ్చని పోలాలతో కళకళలాడే కోనసీమ మారుమూల నున్న తమ ఊరిలోని దళిత సౌందర్యాన్ని వివరిస్తూనే తమ వూరిలోని విభిన్న కులాల మధ్య చోటుచేసుకున్న వివక్షలనూ ప్రస్తావిస్తాడు. అది వివరించే క్రమంలో ‘స్మశానం కాని స్మశానంలో కూడా కులం వదలిపెట్టని స్థితిని నేను మా వూరిలో చూశాను’ అంటాడొకచోట. తాను చదువుకునే పాఠశాల గురించి చెప్పే సందర్భంలో స్కూలు రిజిస్టర్ లో తమ పేర్లను తమ అభీష్టానికి అతీతంగా ఉపాధ్యాయులే నిర్ణయిస్తారని చెప్పడం వివక్షలోని ఒక కోణాన్ని చూపిస్తుంది. అందుకే ‘మా పేర్లు మా ఊహల్లోనుంచి వచ్చినవి కాదు. మా అభిరుచులనుంచి ఏర్పడినవి కాదు. వాళ్లకు నచ్చితే మంచి పేరు. వాళ్లకు నచ్చకపోతే వాళ్లిష్టమొచ్చిన పేరే మా పేరుగా మారిపోయేది’..అంటాడింకొక చోట. స్కూలులో ఎప్పుడూ పిల్లల ముందుభాగంలో నిలుచుకునే తనను జెండా పండుగ వందనం రోజున వెనుకవైపున నిలబెట్టడం ఈ రచయితలో తీవ్ర అంతర్మథనాన్ని రేకెత్తించి ఎన్నో ప్రశ్నలను లేవదీస్తుంది. ఈ అతర్మథనమూ స్ఫూర్తిదాయకమే. 

 రచయితకు ఎదురైన పలుసంఘటనల్లోనూ, పలు సందర్భాల్లోనూ వివక్ష అనేక రకాలుగా కనిపిస్తుంది. ఉదాహరణకు జుట్టు కటింగ్, బట్టల ఇస్త్రీ విషయాల్లోనూ చోటుచేసుకునే వివక్షను ఒక అధ్యాయంలో విడమరచి చెబుతాడు. ‘మనకి మంగలాయన కటింగ్ వెయ్యడానికి రారు. అందుకనే నేను మీకు చేస్తున్నా’ అంటూ తనకు జుట్టు కత్తిరించే తండ్రి ‘అదంతే మనకి చెయ్యరు. ఎవరైనా మనకి కటింగ్ చేసినట్టు తెలిస్తే ఊరంతా ఆ మంగలిని వెలివేస్తారు. అందుకే చెయ్యరు’ అని చెప్పడం ఈ రచయితలోని ఆత్మగౌరవాన్ని ప్రశ్నింపజేస్తుంది. అలాగే తమ గేదెపాల విక్రయంలోనూ అగ్రకులాల వారినుంచి ఎదురయ్యే ఇక్కట్లనూ వివరిస్తాడు. ఈ ఆత్మకథలో రచయిత ముఖ్యంగా పాలేరుతనం గురించి వివరించేటప్పుడు ఆ పాలేరుతనం తమ కుటుంబం లాంటి ఎన్నో కుటుంబాలకు ఎంత సంక్షోభాన్ని మిగిల్చిందో విశదీకరిస్తాడు. తాను కూడా ఒకరోజు పాలేరుగా వెళ్లినప్పుడు తనకు పాచిపోయిన అన్నం పెట్టిన యజమానురాలి వివక్షకు గురై తాను అనుభవించిన మానసికక్షోభను వర్ణిస్తాడు. పాలేరుతనంలో మగ్గిపోయే కుటుంబాల దుర్భరస్థితిని తనకు కలగా వచ్చిన తుఫానుతో ఇలా పోలుస్తాడు... ‘ఒక పెద్ద తుపాన్...వేగంగా వస్తున్న గాలులు... పెద్దపెద్ద చెట్లు కూలుతున్నాయి.. మేమంతా వాటినుంచి తప్పించుకోవాలని పరుగు పెడుతున్నాం.. అంతలోనే పెద్ద వరద. ముచుకొచ్చేస్తున్ననీట చేలన్నీ మునిగిపోయాయి. మా రోడ్లన్నీ మునిగిపోయి దారులన్నీ తెగిపోయాయి. ఎటుచూసినా చీకటి. నీళ్లు మా ఇంటి ముంగిటకొచ్చేశాయి’.... పాలేరుతనం రూపంలో వికటాట్టహాసం చేసే కులవివక్ష అనే ఒక సామాజిక సంక్షోభాన్ని సూచిస్తుంది ఈ సన్నివేశం... ఈ ఆత్మకథలోని ఆత్మ అంతా ఈ సన్నివేశంలోనే కనిపిస్తుంది.

ఈ ఆత్మకథలోని మరో ప్రత్యేకత ఈ రచయిత ప్రతి అధ్యాయంలోనూ కవిగా కూడా కనిపించడమే. ఆయా సందర్బాలకూ, సంఘటనలకూ తగినట్టు తాను తన నోస్టాల్జియా జ్ఞాపకాలతో కలబోసి వెలువరించిన కవితాపంక్తుల్నీ ఉదహరించడం ఈ అధ్యాయాలకు నిండుదనాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ‘బాల్యం కొంతమందికీ ఆటల పల్లకీ/బాల్యం కొంతమందికి పూలపరిమళం/కానీ నా బాల్యం అలా సాగలేదు/ఒక్కోసారి నిప్పుల కుంపటి/ ఒక్కోసారి ముళ్లకిరీటం’.. అని తన బాల్యాన్ని కవిత్వీకరిస్తాడు. తన కవితాపంక్తుల్నే ఆత్మకథగా మార్చాడు. చివరి అధ్యాయంలో యుద్ధం ప్రారంభమైందని ఆశావాదాన్ని వ్యక్తం చేస్తూ.. ‘ఇది ప్రత్యక్షంగా జరిగే యుద్ధం/రక్తం కారని యుద్ధం/ఆయుధాలు లేని యుద్ధం/ఆధిపత్యాన్ని చెలాయించే యుద్ధం’... అంటూ ఈ రచయిత తన ఆత్మకథ ద్వారా మనసారా ఆకాంక్షిస్తున్నాడు. 

(‘నెమలికన్నులు’ పుస్తకానికి సబ్బని నాగమ్మ- మల్లేశం స్మారక పురస్కారం లభించిన సందర్భంగా...)

                   - డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, 

                      9177732414

కామెంట్‌లు లేవు: