సహృదయ స్పందన
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు వ్రాసిన తన శతకాన్ని పరిశీలించండి అని పిడిఎఫ్ పంపించడం నాపై చూపిస్తున్న అభిమానానికి నిదర్శనం.
వీరువ్రాసిన తేటగీతి పద్యాలను దార్ల మాట శతకముగా సమాజానికి అందించ దలచి.ఈ పద్యాలను ఒకసారి పరిశీలించాలని సూచించడం నేనొక అదృష్టం గా భావించాను.
ఈ విధంగా భావించడానికి కారణం లేకపోలేదు. ఏకవియైనా కవితలు,లేదా పద్యాలను వ్రాసేక్రమమంలో సహజంగా దొర్లే చిన్న చిన్న దోషాలను అంతగా గమనించరు. వచన కవిత్వానికి పద్యం మాదిరి సూత్రాలు, యతి ప్రాసలు ఉండవు కాబట్టి పెద్దగా ఇబ్బందేమీ ఉండదు.పద్యంలో మాత్రం నియమాలను తప్పకుండా పాటించి తీరాలి.
నేను పద్యరచన పై ఉన్న కుతూహలం తో ప్రతిరోజూ వీలైనప్పుడల్లా కనీసం ఒకపద్యమైనా వ్రాయ కుండా ఉండలేననే విషయం అతిశయోక్తి ఏమాత్రం కాదు. పద్య రచన చేస్తున్నప్పుడు ఊహాలోకంలో తేలియాడుతూ భావంపై దృష్టి పెట్టడం వలన కొన్ని సందర్భాల్లో యతి,ప్రాస గణాలను అంతగా గమనించకుండా పద్యం ముందుకు కదులుతుంది. ఈవిషయం పద్యకవులకు అనుభవైకవేద్యమే. ఆచార్య దార్ల వారు వ్రాసిన తేటగీతి పద్యాలు పిడిఎఫ్ చేసి పంపించారు.పద్యంపై ఉన్న ఆసక్తితో ప్రతి పద్యాన్ని పరిశీలిస్తూ నా దృష్టికి వచ్చిన మెరికెల లాంటి చిన్న చిన్న దోషాలను ఆచార్య దార్ల వారి దృష్టికి తెచ్చి వారి భావములో ఏమాత్రం మార్పులేకుండా అక్కడక్కడ ఒకటి రెండు పదాలు మాత్రమే మార్పులు చేర్పులు చేసి పద్యాలన్నింటిని తుదిరూపం వచ్చేవిధంగా ప్రయత్నం చేశాము.
ఈవిధంగా పరిశీలించే అవకాశం దొరకడం నేను అదృష్టంగా భావిస్తున్నాను.
శతకములో సామాజికాంశాలు చాలా ఉన్నాయి. ఆధునిక సమాజం లో కొనసాగుతున్న కొంతమంది జీవన విధానంలో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపారు. యువత ప్రవర్తనను, సోమరితనాన్ని ఎత్తి చూపిస్తూ కలిగే దుష్ఫలితాలను ముందుంచారు. కొంత మంది క్రమశిక్షణ రహితంగా, మెలగడం, తల్లి తండ్రి, గురువు, దైవం అనే భావాలను గాలికివదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వీటిన్నింటికి పద్యాలలో చొప్పించారు. ధనాన్ని సంపాదించడం కొరకు నీతి, నియమాలు, ధర్మాధర్మాల పట్టింపు ఏమాత్రం లేదు. ప్రజలు కొనుగోలు చేసే ప్రతి వస్తువు, ఆహార పదార్థాలన్నియు కల్తీమయమే. ఈ కల్తీ చేయడం వలన కొనుగోలు దారులు గమనిస్తే వ్యాపారం కుంటుపడుతుందని సూచించారు సామ్రాజ్య విస్తరణ పేరుతో యుద్దాలు చేయడం దుర్మార్గం. ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో విలసిల్లడానికి పరిపాలకులు తగిన చర్యలు, ప్రణాళికలు ఏర్పరచుకుని ముందుకుసాగాలి. బుద్దం శరణం గచ్చామి అంటూ దుఃఖానికి కారణమైన అత్యాశ, కోరికలు అనే పుట్టలో నుండి బయటపడాలని గౌతమి బుద్దుని ధర్మపథాన్ని సూచించారు.
ఈవిధంగా సమసమాజ స్థాపనకై కులమతాలకు అతీతంగా పరిపాలన ఉండాలని యుద్దాలు విరమించాలని ఆకాంక్షించారు
కవి మిత్రులు పుస్తకావిష్కరణ సందర్భంగా అభిమానంతో అందించే పుస్తకాలను చిరునవ్వులొలికిస్తూ అందుకుంటారు. ఆ తరువాత మొహమాటానికి రెండు మూడు పద్యాలు చదివి పుస్తకాన్ని ఏమూలకో విసిరేసి ఎప్పుడైనా కవిమిత్రుడు తారస పడినప్పుడు చాలాబాగుంది అంటూ ముఖస్తుతి చేయడం గమనిస్తుంటాము. ఆ పుస్తకం ఇంట్లో ఏ సెల్ఫ్ లోనో లేక టేబుల్ పడేయడమేతప్ప పూర్తిగా చదివేవారు చాలా తక్కువ. ఈ దార్ల మాట శతకం నేను పూర్తిగా చదివే అవకాశం లభించింది. పద్యాలన్నింటిని తీరిక ఉన్నప్పుడల్లా క్షుణ్ణంగా పరిశీలిస్తూ నాకు అప్పచెప్పిన బాధ్యతను శక్తి కొలది నెరవేర్చానని చెప్పగలుగుతున్నాను.
ఈ శతకాన్ని సాహితీప్రియులు చదివి తప్పకుండా తమలో ఉన్న మంచిచెడులు బేరీజు వేసుకుని తప్పకుండా మార్పు కోరుకుంటారని ఆశిస్తున్నాను ఇలాంటి సామాజిక చైతన్యం కలిగించే మరికొన్ని రచనలను సమాజానికి అందించడానికి వీరి కలానికి మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తున్నాను.
జి.గోవర్ధన్
. తెలుగు లెక్చరర్
ఎం.వి.ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
మహబూబ్ నగర్
చరవాణి:-8106384812
తేదీ
22/02/26
ఆదివారం
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి