"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

పద్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పద్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30 మార్చి, 2026

దార్ల మాట తేటగీతి శతకం ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి ముందుమాట.

 

సందేశాత్మక ఆధునిక శతకం దార్ల మాట

-       ఆచార్య ఎన్.ఈశ్వర రెడ్డి



        కష్టే ఫలి అని నమ్మినవాడు, అడ్డొచ్చిన అవమానాలను తొక్కుకుంటూ ముందుకు నడిచిన వాడు, విజయ పతాకం చేతబట్టి మార్గదర్శనం చేస్తున్న వాడు, ఆచార్యుడిగా, విమర్శకుడిగా, కవిగా, స్వీయ చరిత్రకారుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్న మనిషి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులకు దారి దీపంలో నిలుస్తున్నవాడు, మరెంతో మందికి నీడనిచ్చే ఒక విద్యా వృక్షమై ఆప్యాయతను పంచుతున్నవాడు. మంచి చెడుల వివేచనను నేర్పుతున్న వాడు, కష్టసుఖాల స్వభావాలను అక్షరాలుగా మారుస్తున్న వాడు దార్ల వెంకటేశ్వరరావు. నిరంతర పోరాటంలో అంది వచ్చిన అనేక అనుభవాలను అస్త్రాలుగా చేసుకున్న వాడు, ఎదురొచ్చే ఆటంకాల చీకట్లను చీల్చి చెండాడే వాడు దార్ల. కలిమిలేముల కాలాలపై కవాతు చేసినవాడు, సామాజిక ఎత్తు పల్లాలపై నడిచొచ్చినవాడు దార్ల. కామందుల దురహంకారాన్ని నిలువునా విరిచిన వాడు, ఆత్మవిశ్వాసాన్ని విల్లుగా చేసి యుద్ధం చేసినవాడు దార్ల.

      అక్షరాలను రెక్కలుగా చేసుకుని విజ్ఞాన విహాయస యాత్ర చేస్తున్న దార్ల తనకు అందిన జ్ఞానాన్ని అనుభవ పాఠాన్ని తిరిగి అక్షరాలుగా మార్చి అందిస్తున్నాడు. తన అక్షరానికి దార్ల మాటగా నామకరణం చేసుకున్నాడు. తను పొందిన జ్ఞానానుభవాన్ని శతాధిక పద్యమాలగా మార్చి భావితరాలకు అందివ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయానికి ప్రతిఫలంగా వచ్చిందే మీ చేతిలో ఉన్న ఈ "దార్ల మాట" శతకం.

       తెలుగు సాహిత్య ప్రక్రియల్లో శతక సాహిత్యం ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకుంది. జీవన విలువలను, నైతిక సందేశాలను, సామాజిక బాధ్యతలను సరళమైన పద్యరూపంలో ప్రజల హృదయాల్లో నాటే శక్తి శతకాలకు ఉంది. ఈ సాహిత్య పరంపరలో ఆవిష్కృతమైన దార్ల మాట” తేటగీతి ఛందస్సులో ఆధునిక భావజాలాన్ని సమన్వయ పరుచుకున్న సార్ధక కృతి.

       సహజంగా శతకాలు ముక్తకాలుగా ఉంటాయి. ఏ పద్యానికి ఆపద్యమే అర్ధవంతంగా ముగిసిపోతుంది. ఒక పద్యానికి పైనున్న పద్యం లేదా కిందనున్న పద్యానికి అనుసంధానం ఉండదు. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రంగా ఒక భావాన్ని అందిస్తుంది. దార్ల మాట శతకంలో కూడా అలాంటి లక్షణాలు ఉన్నప్పటికీ, ఆ పద్య క్రమాన్ని చూస్తే ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. తల్లి తండ్రి గురువు దైవము అని మనం వరుసక్రమాన్ని చెప్తూ ఉంటాం. దార్ల మాట శతకంలో దైవం, తల్లి, తండ్రి, గురువు, స్నేహితులు ఇలా ఒక క్రమంలో కనిపిస్తారు.             

        తల్లిదండ్రులను గురువు దైవాలను గౌరవించే ఒక భారతీయ సంప్రదాయ ప్రేమికుడు దార్ల. ఒకవైపు అస్తిత్వ ఉద్యమానికి చేయూతనిస్తూ దళిత కవిత్వం రాస్తున్న ఈయన మరోవైపు సంప్రదాయ విలువలని కాపాడుకొంటూ రావడం అనేది ఈయనలో ఉన్న వైవిధ్యం. చాలామంది ‘మేము ఆధునికులం’ అని చెప్పుకుంటున్న వారు పునాదులను మరిచిపోయి, పైకప్పుల చర్చలు చేస్తుంటారు. నిలబడ్డ భూమిని వదిలి, గాలి దుమారంలో తేలిపోతూ ఎగసిపడుతుంటారు. మార్పు కోసం మాట్లాడడం అటుంచి తీర్పులు చెప్పేస్తుంటారు. మాటలకు ఈటెలు తగిలించి అవతలి వారిని గాయపరుస్తుంటారు. వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో పురాణ సంఘటనలకు ముడిపెట్టి తీవ్ర పదజాలంతో పేట్రేగిపోతుంటారు. బహుశా గుర్తింపు కోసం కొంతమంది  కూడా అలా చేస్తూ ఉండొచ్చు. దార్ల దీనికి విభిన్నమైన వ్యక్తి. కుల మతాలకతీతంగా, వర్ణ వర్గాలకు దూరంగా తను చెప్పదలుచుకున్న నాలుగు మాటలను నిజాయితీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు.      

     "గురువు నేర్పిన విద్యను మరువకెప్పుడు/ జ్ఞాన దీపము వెలిగించు నవని యందు/ నిత్య విద్యార్జన పరుడు నిశ్చయముగా/ దారిచూ...  దార్ల మాట," "పాఠశాలలు చూపించు బ్రతుకు బాట/ మస్తకమును పెంపొందించు పుస్తకములు/ వినయ విధేయతలు నున్న విజ్ఞతడు/.... దారి చూపించునట్టిది దార్ల మాట". ఈ రెండు పద్యాలు ఒకే అంశానికి సంబంధించినవి. అయితే రెండవ పద్యంలో వినయ విధేయతలు ఉన్న విజ్ఞుడు ఎవరో తెలియాలంటే ఆ ముందు పద్యం చదివి రావాల్సిందే. అలా ఒక కొత్త ప్రయోగం కనిపిస్తుంది. 

 

 

 ఈ శతకంలో ప్రధానంగా కనిపించే అంశాలు

        నైతిక – మానవతా విలువలు: ‘కష్టపడుకున్న ఫలితము కలుగ దెపుడు తప్పకుండగ సోమరితనము వీడి, కంకణము దాల్చి ముందుకు కదల వలెను’. జీవులు అత్యాశపరులై అక్రమార్జన కొరకు అడుగులిడుట తప్పు అంటాడు. కష్టపడకుంటే ఫలితం ఉండదని,సోమరితనం వదిలి శ్రమించాలని పిలుపునిస్తాడు. మాట తప్పని వాడికి మన్నన దొరుకుతుందని చెప్తాడు.

       తల్లిదండ్రుల పట్ల గౌరవం: ‘పెద్ద నాగమ్మ మాతృత్వ ప్రేమ పంచి ఆదరమ్మను దీవెన లందజేసి నమ్మకమ్మను నీడలో నడుపు చుండు దారి చూపించు నట్టిది దార్ల మాట’. ‘నాదు జనకుడు లంకయ్యనామునెపుడు నాద రంబున నబ్బాయి యనుచు పిలిచి దీవెనలు పొందు చుందును దిగులుమాన్ప దారి చూపించు నట్టిది దార్ల మాట’.

       గురుభక్తి : గురువు నేర్పిన విద్య మరవకూడదని,జ్ఞాన దీపం వెలిగించే వ్యక్తిగురువు ఒక్కడేనని,వినయ విధేయతలతో మెలిగి విజ్ఞుడవ్వాలని సూచిస్తాడు.

       సత్యనిష్ఠ: సత్య వాక్కును సజ్జనుడు మరువడని,ధర్మమే నిలిచి గెలుస్తుందని ‘ఆశ పెరిగిన ధర్మమ్మునడుగు నంటూ సత్యమార్గమ్మువీడక సాగవలయు’,‘వంశ గౌరవ మన్నది వాక్కు తోడ సత్యమెప్పుడు వీడక సాగవలెను మాట తప్పని వానికి మన్ననబ్బు’ నంటాడు. నీతి నియమాలను పాటిస్తూ, నమ్మకము అనే కొమ్మను నరక కుండా చూడమంటాడు.

       స్నేహబంధం: ‘ఆప్త మిత్రులైనిలిచిరి యనుదినమ్ము వారు చలపతి రావును పార్వతీశ శర్మ గారలన్ నిరతముసంస్తుతింతు’, ‘సూర్యుడుదయించుకమునుపు నార్యయనుచు పలుక రించు మిత్రుండు గోవర్ధనుండు మిత్ర భావము తోడను మేలుగూర్చు’నని గుర్తు పెట్టుకుంటాడు. ఇవి వ్యక్తిగత జీవిత నిర్మాణానికి అవసరమైన మూలాధారాలుగా కవి ప్రతిపాదించారు. ఆపదలు ఎదురైనప్పుడు ఆదుకునే మిత్రులను ఎప్పటికీ మనసులో దాచుకోవాలని చెప్తాడు.

       సమాజిక బాధ్యత: వ్యర్థాలను సృష్టించే ప్లాస్టిక్ వాడకూడదని, ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు కలుగుతుందని బోధిస్తాడు, దాన్ని నిర్మూలించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలంటాడు. దాన గుణం కలిగిన వారు దాచుకోకుండా నిరుపేదలకు పంచిపెడతారని, విత్తమార్జన కోసం సత్య న్యాయ ధర్మాలను బుద్దివంతులు వీడరని పేర్కొంటాడు. ‘కులము మతబేధములపేరా కుటిల మెపుడు నెంచ వలదయ్య ప్రజలలో నెవ్వరైన, లోక హితము కోరాలి ప్రాకటముగ’ అంటాడు.  అంతేగాక, నీతి, న్యాయం పట్ల కట్టుబాటు, మితవ్యయం, ఆత్మనిగ్రహం వంటి అంశాలను పద్య రత్నాలుగా మార్చారు.

       బాలల వ్యక్తిత్వ వికాసం: పిల్లలు అక్షరాభ్యాసం నుండి విద్య నేర్పిన గురువులను గౌరవంగా చూడమనడం, మాతృభాష పట్ల అభిమానం లిగి ఉండడం, చెప్పిన మాట తప్పక వినాలని చెప్పడం, సోమరిగా ఉండకూడదని చెప్పడం, దేశ భక్తిని కలిగి ఉండడం, సహజ గుణ శీలాలతో గౌరవం పొందమని చెప్పడం, మేలు చేసిన వారికి మేలే చేయమని చెప్పడం, మిత్ర భావాన్ని కాపాడుకోమని చెప్పడం, దీనుల పట్ల దయ జాలి కలిగి ఉండమని చెప్పడం వంటి బుద్ధులను సూక్తులుగా చెప్తాడు. ఇవి పిల్లలకే కాదు పెద్దలకు కూడా చెప్పవలసిన మాటలు.

       బౌద్ధ తత్వం: అంతం లేని కోరికలే దుఃఖానికి మూలమని, తృప్తే సంతోషానికి ద్వారమని, వ్యాధులకు, వృద్ధాప్య వలయానికి చిక్కి ఆల్లాడి పోతారని బుద్ధుడి కోణం లోంచి  హితవు పలుకుతాడు. కులమత బేధాలు వీడి, మూఢ నమ్మకాలను వదిలి, కారుణ్య భావంతో మెలిగితే లోక కల్యాణం జరుగుతుందని సూచిస్తాడు. మంచి నడవడిక, శాంతి సహనాలు, దాన ధర్మాలు మానవ సమాజాన్నిఉన్నతంగా నిలబెడతాయని బౌద్ధ సందేశాన్ని అందిస్తాడు. 

పర్యావరణ చింతన (Eco-consciousness)

ఈ శతకంలో అత్యంత ప్రాధాన్యమైన అంశం ప్రకృతి సంరక్షణ.

 చలువ నిచ్చును గాదె వృక్షమ్ము లెపుడు, ప్రాణ వాయువు నందించి బ్రతుక జేయు,చెట్లు నరికిన ప్రాణికీ చేటు చేయు’.వృక్ష సంపద నెలకొన్న విరివిగాను,కురియుచుండును వర్షాలు విరివి గాను,నరులు నమ్మాలి ప్రకృతిని మరువకెపుడు’ అనడంలోనే పర్యావరణంలో చెట్లు ఎంత ప్రాధాన్యం కలిగిం ఉన్నాయో అర్థం అవుతుంది.

       చెట్ల నరికివేతపై ఆందోళన

       నీటి విలువ

       కాలుష్య సమస్య

       భూమి, గాలి, నీటి పరిరక్షణ మొదలైన విషయాల పట్ల చైతన్యం కలిగిస్తుంది ఈ శతకం.

      సాంప్రదాయ శతకాలలో అరుదుగా కనిపించే ఈ పర్యావరణ దృక్పథం, ఈ  కృతికి ఆధునికతను తెచ్చింది. ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణపై రచయిత వ్యక్తపరచిన ఆందోళన ఈ కృతికి సమకాలీన ప్రాముఖ్యతను తెచ్చింది. చెట్ల సంరక్షణ, నీటి విలువ, కాలుష్య నియంత్రణ వంటి అంశాలు కేవలం ఉపదేశాత్మకంగా కాక, హృదయాన్ని తాకే విధంగా పద్యరూపంలో ఆవిష్కరించబడ్డాయి. ఈ విధంగా శతకం ఒక నైతిక శాస్త్రగ్రంథంలా, జీవన సూత్రాల సంకలనంలా నిలుస్తుంది.

  

          సరళమైన భాష. లయబద్ధత, వ్యవహార పదప్రయోగం, ఉపదేశ ధోరణి కలిగి, ప్రతి పద్యం ఒక సూక్తిలా ఉంటుంది. భావస్పష్టత, సమకాలీన సమస్యల ప్రతిఫలనాలు, శతక నిర్మాణ నిబద్ధత, మానవ విలువల ప్రచారం దార్ల మాట శతకానికి వన్నెతెచ్చాయి.



            ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు విద్యావేత్తగా, పరిశోధకునిగా, కవిగా సమాజం పట్ల తన బాధ్యతను పద్యరూపంలో వ్యక్తపరచడం ప్రశంసనీయం. “దార్ల మాట” అనే మకుటంతో ప్రతి పద్యం ఒక జీవన సందేశంగా, మార్గదర్శక వాక్యంగా రూపుదిద్దుకుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవం, గురుభక్తి, సత్యనిష్ఠ, మానవతా విలువలు, స్నేహం, సామాజిక నైతికత వంటి అంశాలతో పాటు ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, సమాజ బాధ్యత వంటి ఆధునిక చైతన్య భావనలు కూడా ఈ శతకంలో సుస్పష్టంగా వ్యక్తమయ్యాయి. భాషా సరళత, భావాల స్పష్టత, తేటగీతికి అనుగుణమైన లయ, పద ప్రయోగంలో వైవిధ్యం ఇవి ఈ శతకానికి సాహిత్య విలువను పెంచిన అంశాలు. పాఠకుడు ప్రతి పద్యాన్ని చదువుతూనే ఆత్మపరిశీలన చేసుకునేలా చేయడం ఈ కృతికి ఉన్న ప్రధాన లక్షణం. ఈ శతకం సాహిత్యాభిమానులకు మాత్రమే కాక, విద్యార్థులకు, యువతకు, సమాజంలో విలువల ఆధారిత జీవనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తుందని నమ్ముతున్నాను. రచయితకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ కృతి విస్తృత ప్రచారం పొందాలని ఆకాంక్షిస్తున్నాను.

************

 

ఆచార్య ఎన్.ఈశ్వర రెడ్డి

అధ్యక్షులు, పాఠ్య ప్రణాళికా సంఘం

తెలుగు శాఖ

యోగి వేమనవిశ్వ విద్యాలయం

కడప.

16 డిసెంబర్, 2010

మల్లవరపు జాన్ కవి గారి 'ఒక మాదిగవాని స్వగతం

 పరిమళించే 'జాతీ'యత !


కవిత్వమంతా జాతీయతను పరిమళింప చేసే కొద్దిమంది పద్య కవులలో 'మధురకవి' మల్లవరపు జాన్ కవి గారు ఒకరు! ఆయన మరణానంతరం వెలువడుతున్నదీ"స్వగతము". దీనిలోని ఇతివృత్తం జన్మరీత్యా ఒక మాదిగవాని స్వగతం. ఇంకా లోతుగా చెప్పాలంటే కులం వల్ల జీవితమంతా అవమానాల పాలై తన అస్తిత్వానికై తపన పడిన ఓ దళితుని స్వగతం దీనిలో వినిపిస్తుంది. మాదిగ జీవితం చుట్టూ ఆ వర్ణన కొనసాగినా రకరకాల జీవితానుభావాలను ఎదుర్కొంటున్న ప్రతి దళితుని ఆవేదనను ఈ "స్వగతం"లో అక్షరీకరించగలిగారు.

ఈ "స్వగతము"ను ఏ ప్రక్రియగా చెప్పుకొనే వీలుందనుకొంటూ చదివాను. మన లాక్షణికులు "ఖండకావ్యం, ఆఖ్యానం, ఆఖ్యాయిక వంటి వాటికి సమానమైన పోలికలున్న కొన్ని లక్షణాలను చెప్పారు. "ఖండకావ్యం భవేత్కావ్యస్యైకాదేశనుసారిచ" అని 'సాహిత్య దర్పణం' ఖండకావ్యం అంటే ఏమిటో వివరిస్తుంది. కవి తాను స్వయంగా చూసిన దాన్ని చెబితే (స్వయం దృష్టార్థ కథనం ప్రాహురాఖ్యానం బుథా) దాన్ని 'ఆఖ్యానం' అని అంటారు. 'కల్పితేతివృత్తం కలిగినదాన్ని కథ' అని 'సత్యేతివృత్తాంతం కలదాన్ని ఆఖ్యాయిక (కథ కల్పిత వృత్తాంతా సత్యార్థాఖ్యాయికా మతా) అని లక్షణాలు వివరిస్తున్నాయి. కావ్య నాయకుడే స్వయంగా ఆ రచనలో తన వృత్తాంతాన్ని తెలిపినట్లయితే దాన్ని ఆఖ్యాయిక (వృత్తమాఖ్యాయతే యస్యాం నాయకేన స్వచేష్టితం) అంటారని లాక్షణికులు అంటున్నారు. అయితే, మల్లవరపు జాన్ కవి గారు రాసిన "స్వగతము"లో గేయ లక్షణాలున్నప్పటికీ అంతకుమించి ఒక అంశాన్ని హృద్యంగా వర్ణించే లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తుంది.దళితుని జీవితంలో కులం కేంద్రంగా జరిగే అకృత్యాలను ఏకదేశంగా వర్ణించగలిగారు కవి. అలా వర్ణించటంలో బిగువు కూడా ఖండకావ్యానికే బాగా ఒదుగుతుంది. అది ఈ 'స్వగతం'లో ఉంది.అలా గేయంలో కూడా ఖండకావ్యం రాయవచ్చనని నిరూపించారు. ఈ రచనలో కవి తన కథనే చెబుతున్నట్లు అనుకుంటే, దీన్ని ఆఖ్యానం అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ, కవి తన విషయాలు కాకుండా తను ఒక జాతికంతటికీ ప్రతినిధిగా వివరించారు. కనుక, ఆఖ్యానం అయ్యే అవకాశం లేదు. పోనీ సత్యార్థ కథమే ప్రధానం అనుకుందామంటే "స్వగతం" నిండా జీవిత వాస్తవికతే ఎక్కువగా కనిపిస్తుంది. అంతకు మించి ఒక జాతి జీవితం చుట్టూ ఉన్న జీవన వ్యథంతా కనిపిస్తుంది. ఇవన్నీ ఖండకావ్యాల్లో కనిపించే కొన్ని లక్షణాలు. కనుక, దీన్ని 'ఖండకావ్యం' అని పిలవడం సమంజసమేమో!

కొన్ని వందల సంవత్సరాలుగా తెలుగువారికి వారసత్వ సంపదగా కొనసాగుతున్న ఛందోబద్ద కవిత్వంలో మాత్రాఛందస్సు కూడా ఒక భాగమే! గురజాడ అప్పారావు గారి 'ముత్యాల సరాల' లో సంస్కరణ భావాలు కనిపిస్తాయి. మల్లవరపు జాన్ కవిగారు కూడా ఈ ఖండకావ్యాన్ని మాత్రా ఛందస్సులోనే వర్ణించారు. సంప్రదాయంలో ఉంటూనే నవీనత్వాన్నీ కోరుకోవడానికి ఈ 'నవ్యసంప్రదాయ కవి' మాత్రా ఛందస్సుని ఒక మార్గంగా ఎంచుకున్నారు. ఆ మాట కొస్తే ఆయన ప్రతి రచనలోనూ సంప్రదాయంలో నవ్యత్వాన్ని కోరుకోవడం కనిపిస్తుంది.

జాతీయోద్యమ కాలంలో గాంధీజీ కులనిర్మూలనను కూడా ఒక అంశంగా చేర్చారు. తొలితరం దళిత కవులలో ముఖ్యంగా కుసుమ ధర్మన, గుర్రం జాషువ, బోయి భీమన్న మొదలైన కవులలో ఆ ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది. అలాంటి ప్రభావమే మల్లవరపు జాన్ కవి గారి కవిత్వంలోనూ ఉంది. ఆ ప్రభావాన్ని ఆయన రాసిన ఇతర రచనలలో కూడా చూడవచ్చు. ఈ ఖండ కావ్యంలో ఆ ప్రభావాన్ని వర్ణిస్తూ........

" అంటరాని తనంబు పోవలే

అందరొకటై మెలగవలెనని

స్వరాజంబు తెచ్చుకోవలె"నని సంస్కరణ వాదులు భావించారంటారు కవి. అలా దళితులందరిని కలుపుకొని జాతీయోద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి, స్వాతంత్ర్యాన్ని సాధించడానికి నాయకులు బాటలు వేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కులనిర్మూలన మాత్రం జరగలేదు. దళితులకు అందవలసిన విద్యా సౌకర్యాలను అందనివ్వకుండా అడ్డుకున్నారు. అంతేకాదు చాలామంది, విద్యాలయాలకు వచ్చే దళితులను అస్పృశ్యులని అవమానించారు. అయినప్పటికీ విద్యాసక్తి గల దళితులు ఆ అవమానాలను సహిస్తూనే అక్షరాలు నేర్చుకున్నారు. అలా నేర్చుకోవడం వెనుక ఎంతో దయనీయ స్థితి ఉందంటూ కవి .....

"అంటరానితనంబు చనెనని

అయ్య నను బడికంపినప్పుడు

కండ్లురిమి నాపై రూళ్ళ" కర్రలను విసిరేవారని ఆ చారిత్రక పరిణామక్రమాన్ని వివరించారు. అంతే కాకుండా జానపద గేయాలు, బుర్రకథలు, హరికథలను వినడం ద్వారా మౌఖికంగానే విద్యనభ్యసించిన అనేక మంది దళితుల విద్యాభ్యాస విధానాన్ని, దాని వెనుకున్న వేదనామయ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించారు కవి.

మొత్తం మీద ఈ ఖండకావ్యంలో దళితుని జీవితాన్ని వర్ణించడానికి మాదిగ సాంస్కృతిక జీవనాన్ని కేంద్రంగా చేసుకున్నారు. దళితుని వేదన, పనిలో నైపుణ్యం, దళితుల పట్ల సంస్కరణ రూపంలో జరిగే మోసం, దాన్ని ఎదుర్కోవడానికి కొంతమంది దళితులు ప్రదర్శించే ఆగ్రహావేశాలు, అలాంటప్పుడే మరికొంత మంది దళితులు ప్రదర్శించే సంయమనం, ఆ సంయమనానికి సామాజిక సంబంధాలను, పురాణేతిహాసాలను హేతు పూర్వకంగా చూపడం, దళితులు కూడా పాలకులుగా ఉన్న చారిత్రక వారసత్వాన్ని విశదీకరించడం వంటివన్నీ 'కొండ అద్దమందు కొంచమై ఉండదా' అన్నట్లు వర్ణించగలిగారు. ప్రజాస్వామిక, లౌకిక మానవతావాదాన్ని స్థాపించే జాతీయతా స్ఫూర్తి ఈ రచన నిండా కనిపిస్తుంది. దీన్నంతటిని కవి ఒక భారతీయ పౌరుడిగా తన జన్మభూమిపై ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో నిలబడి మాట్లాడే ఒక దళితుని స్వరంగా వినిపించారు.

దేశీయతను, సంప్రదాయ వారసత్వాన్ని కొనసాగిస్తూనే అవాంచనీయ ధోరణులను సంస్కరించుకొనే నవ్యసంప్రదాయవాదకవిగా మల్లవరపు జాన్ కవిగారిని ప్రతిష్టాపించే ఖండకావ్యమిది. వస్తు ఛందో నవ్యతను ప్రదర్శించే ఈ కావ్యాన్ని పాఠక లోకానికి అందిస్తున్న ప్రచురణకర్తలు అభినందనీయులు.

- డా// దార్ల వెంకటేశ్వర రావు

15.12.2010

15 డిసెంబర్, 2010

మల్లవరపు జాన్ కవి గారి ' మధుర కవీంధ్ర శతకం'

 అనూభూతి స్పర్శనందించిన మల్లవరపు జాన్ కవి గారి శతకం !

December 13, 2010

' మధురకవి' బిరుదాంకితులు మల్లవరపు జాన్ కవిగారు పద్యం రాసినా, వచనం రాసినా అలవోకగా సాగిపోతుంది. ప్రతి పద్యం ద్రాక్షాపాకంతో రసభరితంగా ఉంటుంది. వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉండే నిగూఢమైన భావాల్ని కూడా సరళంగా అర్థమయ్యే శైలీలో వర్ణించ గల ప్రతిభాశాలి జాన్ గారు. అలాంటి కవిగారి కవిత్వాన్ని సమకాలీన దిగ్గజ్జాల్లాంటి కవులు కూడా మెచ్చుకోవటం ఒక ప్రత్యేకత. అయితే, ఆయన గురించి ఒక శతకమే వెలువడటం మరో విశేషం.

ప్రముఖ కవి, అవధాని చేగిరెడ్డి చంద్రశేఖర రెడ్డిగారు మల్లవరపు జాన్‌కవి జీవితం, వ్యక్తిత్వం, రచనలలో కనిపించే తత్త్వం ఇలా అన్నింటినీ రసభరితంగా వర్ణిస్తూ " మధురకవీంద్రశతకం"ను రాశారు.

ఒకటి రెండు పద్యాలు మినహా "కవీంద్ర" అనేదే మకుటం. ఈ మకుటాన్ని ఎన్నుకోవటంలోనే చంద్రశేఖర రెడ్డిగారికి, జాన్‌కవిగారి పట్ల గల అభిమానం వ్యక్తమవుతుంది. జాన్‌కవిగారి కుటుంబాన్ని బాగా పరిశీలిస్తేగాని రాయలేని కొని పద్యాలు ఈ శతకంలో కనిపిస్తున్నాయి.

" వ్యాసునకు వినాయకునటు

వ్రాసెను మధురమున కొడుకు రాజేశ్వరరావ్

వాసిని గాంచగ కృతులన్

శ్యాసయనగ మెల్గి నాడు !జాన్ కవీంద్రా!"

జాన్‌కవిగారి కుటుంబం గురించి తెలియకపోతే ఈ పద్యాన్నెవరూ రాయలేరు. జాన్ కవి గారి కుటుంబమంతా చక్కని సాహిత్య వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక వైపు తాము నమ్ముకున క్రైస్తవ జీవితంలోని ప్రశాంతతనూ, మరో వైపు సంసారపూరితమైన సాహిత్య చర్చలతో కుటుంబం ఎంతో ఆనందభరితంగా సాగిపోతుంటుంది. నన్నుకూడా ఒక సారి ఒక సాహిత్య కార్యక్రమానికి వాళ్ళ ఊరు పిలిచి, సన్మానం చేశారు. ఆ సందర్భంగా జాన్ కవిగారితో ఒక రోజు గడపగలిగే అవకాశం లభించింది. వాళ్ళ కుటుంబాన్ని దగ్గరగా చూడగలిగే వీలు కలిగింది. చంద్రశేఖర రెడ్డి గారు, జాన్ కవి గారికి, రాజేశ్వరరావు గారిని విఘ్నేశ్వరునితో పోల్చగలగడం సరైనదని ఆ కుటుంబాన్నిదగ్గరగా చూసిన నాకు గొప్ప అనుభూతిని కలిగించగలిగింది. జాన్ కవి కుమారుడు రాజేశ్వరరావు, రాజేశ్వరరావు కుమారులు ప్రభాకర రావు, సుధాకర్ రావులు కూడా కవులే! ఒకరిపట్ల మరొకరికి ఎనలేని విధియ, విధేయతలు! వీటన్నింటిని చెప్పకుండానే ఆ స్ఫురణ కలిగిస్తూ ఆ వారసత్వాన్ని ఒక్క పద్యంలోనే కవి వర్ణించటం ఎంతో సముచితంగా ఉంది.

కావ్యానికీ, శతకానికీ మధ్య గల భేదాలలో ముఖ్యమైనది కథ! కావ్యంలో కథ ఉంటుంది. శతకంలో ఒక్కో పద్యానికీ ఒక్కో కథ స్పురింపజేయగలిగే శక్తి ఉంటుంది. ముక్తకాలతో కూడిందే శతకం. అయినా ఈ శతకంలో జాన్ కవి మూర్తిమత్వం, కవిత్వం, బోధనా ప్రభావం, రచనల వైశిష్ట్యం వంటి వాటినెన్నింటినో కవి వర్ణించారు. ఆ విధంగా చూసినప్పుడు "మధుర కవీంద్ర శతకము"నకు ఒక ప్రత్యేకత ఉందని స్పష్టమవుతుంది.

జాన్ కవి శైలిని, వస్తు వైశిష్ట్యాన్ని వర్ణిస్తూ ఈ శతక కవి రాసిన...

"రచయించితిరి కవితలను

రుచిజూపితిరెన్నో వేదబుక్కుల సూక్తులన్

ప్రచురించినారు కృతులను

వచనములో గూడ మల్లవరపు కవీంద్రా!" అనే పద్యాల్లాంటివెన్నో ఈ శతకంలో ఉన్నాయి. ప్రతి పద్యం ఒక రత్నంలా భాసిస్తోంది. సాహిత్య చరిత్రలో జాన్ కవి గారికి ఇప్పటికే ఒక విశిష్ట స్థానం ఉండగా, ఆ స్థానాన్ని ఈ శతకం మరింత ద్విగుణీకృతం చేస్తుంది. జాన్ కవితో, ఆయన సాహిత్యంతో సాన్నిహిత్యం ఉన్నవాళ్ళకే కాకుండా, ఆయన ఎలా ఉంటారో, ఆయన సాహిత్యం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి కూడా ఈ శతకం ఎంతో అనుభూతినీ, ప్రేరణను కలిగించేటట్లు వర్ణించిన కవి చేగిరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు ఎంతైనా అభినందనీయులు!


- డా// దార్ల వెంకటేశ్వర రావు (6-1-09)