1. మీ బాల్యం విద్యాభ్యాసం క్లుప్తంగా చెప్పండి?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో దార్ల అబ్బాయి శ్రీమతి పెద్ద నాగమ్మ దంపతులకు జన్మించాను. మేము నలుగురు అన్నదమ్ములు, ఒక చెల్లి. నేను మూడవ వాణ్ణి. నా బాల్యమంతా కోనసీమలోనే గడిపాను. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. ఆ తర్వాత అమలాపురంలోని ఎయిడెడ్ కళాశాలలో డిగ్రీ వరకు చదువుకున్నాను. బి.ఏ.లో స్పెషల్ తెలుగు ఒక ప్రత్యేక అంశం. డిగ్రీ కళాశాలలో డాక్టర్ ద్వా.నా. శాస్త్రి, డాక్టర్ వాడపల్లి చక్రపాణిరావు, డాక్టర్ బి.వి.రమణమూర్తి, డా.పైడిపాల, డా.మంతెన సూర్య నారాయణరాజు తదితరులు నాకు పాఠాలు చెప్పిన గురువులు. వీరికంటే ముందు నేను స్మరించుకోవలసిన వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్లోనూ, హైస్కూల్లోనూ ఉన్నారు. ఎలిమెంటరీ స్కూల్లో మాకే వెంకటరెడ్డి, ఆకుల రామలక్ష్మిగార్లు అంటే నాకిష్టం. వారు నా కులాన్ని, నా పేదరికాన్ని చూడలేదు; నన్ను ఒక విద్యార్థిగా చూశారు. ఇంకా చెప్పాలంటే తన పిల్లల్లో ఒకరిగా చూశారు. హైస్కూల్ లో సోషల్ టీచర్ ఆతుకూరి లక్ష్మణరావు, తెలుగు పండిట్ శ్రీకంఠం లక్ష్మణమూర్తి గార్లంటే నాకు ఇష్టం. వాళ్లు బ్రాహ్మణులైనా నన్ను ఎంతో దగ్గరికి తీసుకున్నారు. వాళ్ల పిల్లలతో పాటు నన్ను కూడా సైకిల్ ఎక్కించుకుని స్కూలుకు తీసుకువెళ్లేవారు. మరలా అలాంటి ఆదరణ డిగ్రీ చదివేటప్పుడు డాక్టర్ వాడవల్లి చక్రపాణి రావు గారు, డాక్టర్ ద్వా.నా. శాస్త్రి గారి దగ్గర పొందాను.
2. తెలుగు సాహిత్యంపై మక్కువ ఎప్పటినుండి కలిగింది?
ఉన్నత పాఠశాలలో లక్ష్మణమూర్తి గారి పాఠాలు నన్ను తెలుగు సాహిత్యం చదివితే బాగుంటుందని ఆలోచింపజేసినా, డాక్టర్ ద్వా.నా. శాస్త్రి గారి ప్రభావంతో పాటు, కోనసీమలో జరిగే సాహిత్య కార్యక్రమాలు నన్ను ఎక్కువగా సాహిత్యం వైపు ప్రేరేపించాయి. ప్రతిరోజు పత్రికలు చదివించే అలవాటు లక్ష్మణరావు గారి వల్ల ఏర్పడింది. అప్పుడే రచనలను చేయడానికి ప్రయత్నం చేశాను. స్థానిక సమస్యల గురించి రాసేవాణ్ణి. తర్వాత పత్రికల్లో కథలు, కవితలు చదివి ఉత్తరాలు రాసేవాణ్ణి. ఆ తర్వాత చిన్న చిన్న జోకులు కూడా రాసేవాణ్ణి. నా పేరుతో పాటు ఆ రచనలను చూసి ఎంతోసంబరపడిపోయేవాణ్ణి. దీనితో పాటు బి.ఏ. డిగ్రీ స్పెషల్ తెలుగులో ఆంధ్రా యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ రావడం, తర్వాత ఎం.ఏ. ఎంట్రన్స్ లో సెకండ్ ర్యాంకు రావడంతో ఫోటో కూడా పత్రికల్లో వచ్చింది. డిగ్రీలో ఉండగానే స్థానిక పత్రికల్లో చిన్న చిన్న కథలు, సమీక్షలు, పుస్తక పరిచయాలు, వ్యాసాలు రాస్తుంటే వాణ్ణి. దానివల్ల ప్రతిరోజూ సాహిత్య అనుబంధాలను చదవడం, సాహిత్య పత్రికలు చదవడం, సాహిత్య సమావేశాలకు వెళ్లడం, సాహితీవేత్తలతో పరిచయం కావడం నాలో తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనే ప్రేరణకు కారణమయ్యాయి. నేను ఒకటి రెండు లేదా కొన్ని రోజులపాటు ఏ ఊరు వెళ్ళినా ముందు ఆ చుట్టుపక్కల గ్రంథాలయం ఎక్కడుందని చూసేవాడిని. నేను రాసినవి చూసుకోవాలనే ఆత్రుత పాటు, మా గురువుల రచనలు, నాకు తెలిసిన వాళ్ళ రచనలు చూడ్డానికి కూడా ఖచ్చితంగా పత్రికలు చూడటం అలవాటై, క్రమేపీ సాహిత్యం పట్ల మక్కువ పెరిగింది.
3. మీ ఎం.ఫిల్., పిహెచ్.డి పరిశోధనా వివరాలు?
డాక్టర్ యస్. టి. జ్ఞానానందకవి గారి ఆమ్రపాలి కావ్యంపై ఎం.ఫిల్., పరిశోధకుడుగా ఆరుద్ర అనే అంశంపై పిహెచ్.డి. చేశాను. రెండు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే 1997, 2003లలో పూర్తి చేశాను. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. నాకు పిహెచ్డి సీటు వచ్చిన తర్వాత ఆచార్య కె.కె.రంగనాథచార్యులు గారు నన్ను దగ్గరకు పిలిచి పిహెచ్డి దేనికోసం చేయాలనుకుంటున్నావని అడిగారు. లెక్చరర్ గా స్థిరపడాలని కోరుకుంటున్నానని చెప్పాను. అయితే, సాహిత్య చరిత్రలను అన్నింటినీ చదవడానికి అవకాశం ఉంటుందనీ, అది భవిష్యత్తులో నీ టీచింగ్ కి బాగా ఉపయోగపడుతుందనీ, కాబట్టి ఆరుద్ర పై పరిశోధన చేయమన్నారు.
4. మీ రచనల వివరాలు?
నా రచనలు మూడు రకాలుగా కొనసాగుతాయి. ఒకటి: పరిశోధనాత్మక రచనలు. రెండు: సాహిత్య విమర్శ. మూడు: సృజనాత్మక సాహిత్య రచన. పరిశోధన రంగంలో దళిత, బహుజన సాహిత్యంపై విస్తృతంగా పరిశోధన కొనసాగించాను. వాటిలో కొన్ని వ్యాసాలను పుస్తక రూపంలో తీసుకువచ్చాను. వీచిక (సాహిత్య వ్యాసాలు), బహుజన సాహిత్య దృక్పథం, దళిత సాహిత్యం- మాదిగ దృక్పథం, పునర్ మూల్యాంకనం, సాహితీ సులోచన మొదలైనవన్నీ పరిశోధన సాహిత్య విమర్శకు సంబంధించిన రచనలు. దళిత తాత్వికుడు, నెమలి కన్నులు కవిత్వం, ఆత్మకథకు సంబంధించినవి. కవిత్వం, ఆత్మకథ (మొదటి భాగం - బాల్యం) రెండూ కూడా ‘నెమలికన్నులు’ పేరుతోనే ప్రచురించాను. నా కవిత్వం అత్యధికంగా ఆత్మాశ్రయంగా ఉత్తమ పురుషలోనే ఉంటుంది. నా కవిత్వంలో నా జీవితంతో పాటు, నా జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి జీవితాలను కవిత్వీకరించే ప్రయత్నం చేశాను. అందువల్ల అవి చిన్నప్పుడు పుస్తకాల్లో దాచుకునే నెమలి ఈకల్ని జాగ్రత్తగా దాచుకున్నట్లు, అవన్నీ భద్రంగా దాచుకున్నవే ఉంటాయి…సంతోషంగానో, విషాధంగానో! ఇక, ఆత్మకథ ఎలాగూ నా బాల్యానికి సంబంధించిందే. కాబట్టి దాని స్వభావం కూడా అంతే. అందువల్ల దానికి కూడా ఒకే పేరు పెట్టుకున్నాను. సాహిత్యంలో దీన్నొక ప్రయోగంగా చేస్తే ఎలా ఉంటుందో చూద్దామనుకున్నాను. నా ఆత్మకథ అనుకున్నదానికంటే మంచి పేరొచ్చింది. పత్రికలన్నీ దానిపై వ్యాసాలు, సమీక్షలు విస్తృతంగా ప్రచురించాయి. మా విద్యార్థులకు అది ఒక ప్రేరణ ఇచ్చిందని చాలామంది చెప్పడం నాకు సంతృప్తిని కలిగించింది.
5. దళిత సాహిత్యం వేపు ఎక్కువగా మొగ్గు చూపడానికి కారణం?
ఆ జీవితాన్ని స్వయంగా అనుభవించిన వాడిని. ఆ వాస్తవాన్ని సాహిత్యంలో గమనిస్తున్నప్పుడు ఆ సాహిత్యం అంతా ఇంకా సరిగ్గా రాలేదనే భావన కలగడం. పరిశోధన, సాహిత్య విమర్శలో నూతన కోణాలలో అది ఒకటి కావడం వల్ల దళిత, బహుజన సాహిత్యాలను వైపు నా దృష్టికి ప్రసరించింది. అయితే నాది కేవలం దళిత, బహుజన దృష్టి మాత్రమే కాకుండా, నా రచనల్లో వర్గ దృక్పథం కూడా మిళితమై ఉంటుంది.
6. కవులు, రచయితలు యిలా అధికభాగం అస్తిత్వ వేదనలకే పరిమితమైతే, సృజనాత్మక సాహిత్యం మాటేమిటి?
అక్కడే ఒక ముఖ్యమైన భావోద్వేగం వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే, అస్తిత్వం కోసం చేసే పోరాటం, ఆవేదన, పరిశోధనలన్నీ గుర్తింపుకు నోచుకోని కొన్ని కులాలు, వర్గాలు గుర్తింపుకోసం చేసే ప్రయత్నాలు. ఇవన్నీ కూడా నిజంగా మానవ అనుభూతులకు లోతైన రూపాలు. ఇవి మౌలికంగా సృజనాత్మకతకు అంకురాలే. ఆవేదనలను వ్యక్తీకరించడమే కాకుండా, వాటిని విశ్లేషించడం, వాటి మీద ఆసక్తి పెరగడం, అద్భుత రూపకల్పనలుగా మార్చడం – ఇదే సాహిత్యంలో సృజనాత్మకతకి తార్కాణం. ఆఫ్రికన్ సాహిత్యాన్ని చూస్తే వారి అస్తిత్వవేదన ఎంతో శక్తివంతంగా వెలువతోంది. తెలుగులో స్త్రీవాద దళితవాద సాహిత్యాలలో తమ బాధల పునరుక్తి ఎక్కువగా ఉండటం వలన, వాటిని వ్యక్తీకరించే భిన్నమైన శైలులు అభివ్యక్తి రీతులను అనుసరించకపోవడం వలన ఆ కష్టనష్టాలు ఆ మానసిక వేదనలు కొంతమందికి శక్తివంతంగా మనసును తాకలేకపోతున్నాయి. సాధారణ సాహిత్యంలో కూడా ఈ పునరుక్తి తప్పదు. అది ప్రేమ, అరిషడ్వర్గాలు రూపంలో కనిపిస్తుంది. అయినా అది ఆదరణకు నోచుకోకుండా పోవట్లేదు కదా. అస్తిత్వవాద సాహిత్యం కూడా అలాంటిదే. కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఆహ్వానించాలంటే సహృదయత, సానుభూతి కూడా ఉండాలి. అయితే, ఒక సమస్య ఏమిటంటే కవిగాని, రచయిత గాని, విమర్శకుడు గాని ఒక కోణానికే పరిమితమైతే అక్కడ స్తబ్దత ఏర్పడుతుంది; మొనాటమీ ప్రవేశిస్తుంది.
7. డయాస్ఫోరా సాహిత్యం పాఠ్య భాగంలో ఉండాల్సినంత ప్రాముఖ్యం ఉందంటారా?
అవును, డయాస్ఫోరా సాహిత్యానికి పాఠ్యాంశాలలో ఉండాల్సినంత ప్రాముఖ్యత ఉంది. తెలుగు వాళ్ళు వివిధ ప్రాంతాలలో జీవిస్తున్నారు. మదరాసీయులుగా, తెలుగు వాళ్ళు జీవించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మళ్ళీ దాని నుండి తెలంగాణ రాష్ట్రం… ఇలా ఒక్కొక్క రాష్ట్రంగా విడిపోయాయి. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు జీవిస్తున్నారు. తెలుగు సంస్కృతిని అనుసరిస్తున్నారు. ప్రపంచీకరణ పరిస్థితుల వల్ల ఇప్పటి విద్యార్ధులు స్థానిక స్థాయిలో మాత్రమే కాక, గ్లోబల్ పరిణామాలను, వలసపోయిన ప్రజల అనుభవాలను, వారి ఆత్మగౌరవ పోరాటాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డయాస్ఫోరా సాహిత్యం ప్రధానంగి వారి మానసిక స్థితి, సంస్కృతుల మధ్య సంఘర్షణ, గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. విదేశాల్లో నివసిస్తూ "ఇక్కడా – అక్కడా" అనే అనుభూతిని గలవారు – వారు neither here nor there అనే భావంతో జీవిస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన జీవన అనుభవం. దీన్ని తెలియజెప్పే రచనలు పాఠ్యాంశాలుగా ఉండటం విద్యార్థుల్లో మానవీయ విలువలతో పాటు విభిన్న సంస్కృతుల పట్ల సహనాన్ని పెంపొందిస్తుంది. అంతేకాదు, డయాస్ఫోరా రచనలు సామాజిక శాస్త్రాల, సాహిత్య విమర్శల, మానవశాస్త్రాల పరిశోధనలకు మార్గం చూపగలుగుతాయి. పాఠ్యాంశాలలో అవి చోటు చేసుకుంటే విద్యార్థులకు నూతన పరిశోధన మార్గాలు దొరుకుతాయి. వీటిని అందుకోవడం వల్ల తెలుగువారు కూడా అనేక రంగాలలో రాణించగలుగుతారు. అందువల్ల డయాస్పోరా సాహిత్యం ప్రతి విశ్వవిద్యాలయంలోనూ ఒక ప్రత్యేక పాఠ్యాంశంగా ఉండాలి. ఒకప్పుడు ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అని చదువుకునేవారు. దాని స్థానంలో ఈ పాఠ్యాంశం ఉండాలి.
8.విమర్శకుడిగా మీరు అనేక పురస్కారాలు అందుకున్నారు. ఈనాటి విమర్శనా రంగం ఎలా ఉంది?
పురస్కారాలకీ, విమర్శ , సాహిత్య కృషి అనే వాటికి అసలు సంబంధం లేదు. కొంతమందికి ఆ యా రంగాల్ల కృషి చేసిన వాళ్ళకి కొంత గుర్తింపు రావచ్చు. కానీ, గుర్తింపు పొందిన వాళ్లంతా అలాగే అనుకోవడానికి లేదు. నన్ను విమర్శకుడుగా గుర్తించి గౌరవించినందుకు సంతోషిస్తాను. ఇంకా గుర్తింపు రావలసిన వాళ్ళ అనేకమంది ఉన్నారు. వాళ్ళకి కూడా గుర్తింపు లభించినప్పుడు మరింత సంతోషిస్తాను. నేటి సాహిత్య విమర్శ రంగం బాగానే ఉంది. కాకపోతే సాహిత్య విమర్శను సహృదయంతో స్వీకరించగలిగే సాహితీవేత్తలు తక్కువగా ఉన్నారు. మన తెలుగులో కూడా కవి విమర్శకుడిగా; విమర్శకుడికే కవిగా ఉండటం వలన సాహిత్య విమర్శ మరింత పరిణత స్థితిలో ఉండాలి. కానీ, దురదృష్టవశాత్తు కొన్ని సార్లు ప్రశంసలే విమర్శలుగా చలామణీ అవుతున్నాయి. అయినా సాహిత్య విమర్శలో ఎంతోమంది నిబద్ధంగా వ్యవహరిస్తున్నారు. అయితే మన తెలుగు సాహిత్యంలో సాహిత్య విమర్శ రెండు రకాలుగా కొనసాగుతోంది. ఒకటి అకడమిక్ విమర్శ, రెండోది దానికంటే భిన్నమైన విమర్శ. పరిశోధన పత్రికలు అకడమిక్ విమర్శకు, దినపత్రికలు కొన్ని మాస పత్రికలు అకడమిక్ విమర్శకు భిన్నమైన విమర్శను ప్రోత్సహిస్తున్నాయి.
9. మీ ఆత్మకథకు "నెమలి కన్నులు" అనే పేరు పెట్టడానికి గల కారణం?
మనం చిన్నప్పుడు పుస్తకాల్లో నెమలీకలు దాచుకుంటాం కదా. అంటే మన బాల్య జ్ఞాపకాలకి అది ఒక ప్రతీక. నిజానికి ప్రతి జీవితంలోను తమ జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం ఏదొక సందర్భంలో జరుగుతుంటుంది. దాన్ని నెమలీక అనకుండా నెమలి కన్నులు అని అన్నాను. నెమలి కన్నులలో రకరకాల డైమెన్షన్స్ ఉంటాయి. మనం దాన్ని చూసే దృష్టిని బట్టి అందులో ఎన్నో రకాల రంగులు కనిపిస్తాయి. మన జీవితం కూడా అంతే. మన జీవితాన్ని ఎన్ని కోణాల్లో చూస్తే అన్ని కోణాలుగా మన జీవితం కనిపిస్తుంది. అందువల్లనే నా కవిత్వానికీ, ఆత్మకథకీ కూడా నెమలి కన్నులు అనే పేరు పెట్టాను. ‘’నెమలి కన్నులు" అనే పేరు ఒక బాధను, అణచివేతను చెప్పడమేకాదు; అదే సమయంలో ఒక అందమైన భావ ప్రపంచాన్ని, ఆశయాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. నా కవిత్వం ద్వారా, నా ఆత్మకథ ద్వారా నా వ్యక్తిగత జీవితం సామాజిక జీవితంతో ఎంతగానో ముడిపడి ఉందనే భావనతో ఆ పేరు పెట్టాను.
10. మీ ఆత్మకథ తరువాయి భాగాలు ఎలా ఉండబోతున్నాయి?
బాల్యం నాటి అనుభూతులలో అమాయకత్వం ఉంటుంది. సామాజిక అవగాహన ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ, కళాశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయం వరకు మరొక భాగాన్ని రాయాలనే ఆలోచనలో ఉన్నాను. దీనిలో ప్రధానంగా భావజాలం, రాజకీయ, సామాజిక, చారిత్రక అవగాహనలను ప్రతిపాదించే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులతో నా అనుభవాలను సాధారణీకరించే ప్రయత్నం చేస్తూ నా రాబోయే ఆత్మకథ ఉండబోతుంది. అది అనేకమంది జీవితాల్లోని కొన్ని కొత్త కోణాలు బహిర్గతం చేసే అవకాశం కూడా ఉంది.
11.విశ్వవిద్యాలయాల్లో పరిశోధన విషయానికొస్తే, ఒక నాటి ప్రమాణాలు ఇంకా కొనసాగుతున్నాయంటారా?
ఇది ఎప్పుడూ భిన్నాభిప్రాయాలలో కనిపిస్తుంది. తొలి దశలో జరిగిన పరిశోధనలు… అవి చేసిన వ్యక్తులు… కొన్ని సామాజిక వర్గాలకే పరిమితమైన వాళ్ళు. విద్య, బోధన, పరిశోధన ప్రజాస్వామీకరించబడిన తర్వాత అన్ని రంగాల వాళ్ళు విశ్వవిద్యాలయాల మెట్లు ఎక్కారు. ప్రమాణాలను నిర్ణయించటం సాధ్యం కాదు. ప్రమాణాలు నిత్యం మారుతూ ఉంటాయి. ఆనాటి పరిశోధనల్లోనూ, ఈనాటి పరిశోధనల్లోనూ కొన్ని లోపాలు ఉండొచ్చు. అలాగే, అనేక గొప్ప విషయాలు కూడా ఉండొచ్చు. ఆధునిక జీవితానికి, ఆధునిక సమాజానికి కావలసిన రీతిలో పరిశోధనలు మంచి ప్రమాణాలతోనే కొనసాగుతున్నాయని నా అభిప్రాయం.
12. మీ రచనలపై జరిగిన పరిశోధనలు?
నా రచనలపై పరిశోధనలు చేస్తానని చాలామంది పరిశోధక విద్యార్థులు అడిగారు. కానీ, అలా చేస్తానని అన్న వాళ్ళను, నా రచనలు చదివారో లేదో, వారి అవగాహన ఏమిటో గమనించిన తర్వాత నేను అనుమతి ఇవ్వలేదు. కానీ, ఒకరిద్దరికీ అనుమతిచ్చాను. మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ప్రెసిడెన్సీ కళాశాలలో దారిశెట్టి పుష్పిణి నా కవిత్వం పై ఎం.ఫిల్., పరిశోధన చేశారు. మరొక విశ్వవిద్యాలయంలో కూడా పీహెచ్డీ రిజిస్టర్ చేసుకున్నారని తెలిసింది. వీటితోపాటు తమ తమ సిద్ధాంత గ్రంథాలలో నా పరిశోధనలను వినియోగించుకున్నారు. నా రచనలపై ప్రముఖ సాహిత్య విమర్శకులు, పరిశోధకులు కొన్ని అభిప్రాయాలను ఆయా వ్యాసాలలో వ్యక్తీకరించారు.
13. మీ పర్యవేక్షణలో జరిగిన పరిశోధనలు?
పరిశోధన చేయడం, చేయించడం విశ్వవిద్యాలయ అధ్యాపకుల విధి. దానిలో భాగంగా నేను కూడా సుమారు 24 మంది డాక్టరేట్ డిగ్రీలను, 19 మంది ఎం.ఫిల్, అనేకమంది ఎం.ఏ.,డిజర్టేషన్స్ చేయించాను. నేను నా అభిరుచులకంటే, పరిశోధక విద్యార్థుల అభిరుచినీ, వాళ్ళ జీవితానికి ఉపయోగపడే ఆలోచనలనీ, సాహిత్యానికి మేలు చేకూర్చే లక్ష్యాలనీ దృష్టిలో పెట్టుకొని వివిధ పరిశోధన అంశాలను ఇచ్చాను.
14. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి, మిగతా విశ్వవిద్యాలయాలకు భేదం ఉంటుందా?
నేను డిగ్రీ వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల ఎస్. కే.బి.ఆర్. కళాశాల అమలాపురంలో చదువుకున్నాను. ఆ తర్వాత ఎం.ఏ., నుండి నా పరిశోధన డాక్టరేట్ పూర్తయ్యేవరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనే చదువుకున్నాను. వివిధ రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ గా కూడా ఉన్నాను. ఆ విధంగా మా విశ్వవిద్యాలయానికి ఇతర విశ్వవిద్యాలయాలకు మధ్య కొంత వ్యత్యాసాన్ని గమనించే అవకాశం కలిగింది. మా విశ్వవిద్యాలయంలో సిలబస్ రూపకల్పన చేయడంతో పాటు, ప్రశ్నాపత్రాలు ఇవ్వడం, మూల్యాంకన చేయడం అన్నీ కూడా మా అధ్యాపకులే నిర్వహిస్తారు. సిలబస్ రూపకల్పనలో అన్ని పార్శ్వాలను అధ్యయనం చేసేలాగా ప్రయత్నం చేస్తాం. మూల్యాంకనం కూడా సాధ్యమైనంత పారదర్శకంగా జరుగుతుంది. విద్యార్థినీ విద్యార్థులు అంతా వసతి గృహాలలోనే ఉండడం వల్ల వర్షం వచ్చినా మా విద్యార్థులు పాఠాలు వినడానికి వస్తారు. తరగతులు కూడా రెగ్యులర్ గా జరుగుతాయి. ఇతర విశ్వవిద్యాలయాలలో సిలబస్ రూపొందిందేదొకరు, ఒకరు పాఠం చెప్పేది మరొకరు, ప్రశ్నాపత్రం ఇచ్చేది ఒకరు వాటిని మూల్యాంకనం చేసేది ఇంకొకరు ఇలా ఉంటుంది. అప్డేటెడ్ నాలెడ్జ్ అందించడానికి మా విశ్వవిద్యాలయంలో ఎంతో అవకాశం ఉంది. అందువల్లనే మా విశ్వవిద్యాలయ విద్యార్థులు అని రంగాల్లోనూ ఉంటున్నారు.
15. సాంఘిక మాధ్యమాల దృష్ట్యా కవిత్వం పలచబడిపోయిందనే కొందరి అభిప్రాయంతో ఏకీభవిస్తారా?
కవిత్వం ప్రచురించుకోవడానికి స్వేచ్ఛ దొరికిందంటాను. మంచి కవిత్వం కూడా వస్తుంది. బాగా కవిత్వం రాసేవాళ్ళు ఎప్పుడూ బాగానే రాస్తున్నారు. కాకపోతే, అంతకుముందు అందరి కవిత్వం చదివే అవకాశం ఉండేది కాదు. అలా అందరూ కవిత్వం రాసేటప్పుడు, దాన్ని త్వరగా అందించాలని కుతూహలం వల్ల సహజంగానే పలుచనైన కవిత్వం వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ, సామాజిక మాధ్యమాల వల్ల నష్టం కంటే అనేక మందికి అవకాశం కలిగిందాన్ని మేలుగానే భావించాలి. ఒకప్పుడు రాజాస్థానాల నుండి వాళ్ళు చెప్పిందే కవిత్వం, సాహిత్యం. ఆ తర్వాత సాహిత్య సంఘాలు, కవి సమ్మేళనాలు, వాళ్లు ప్రచురించే పుస్తకాలు, పత్రికలు ప్రచురించే కవితలు… అవి మాత్రమే కవిత్వంగా చలామణి అయ్యాయి. సామాజిక మాధ్యమాల వల్ల అనేకమంది అవకాశం కలిగింది. సామాజిక మాధ్యమాల వల్ల కవిత్వం పలచబడిపోతుందనేదానికంటే, మంచి కవిత్వాన్ని ఆదరించడానికి, అందించటానికి అవకాశం కలిగిందని మనం సంతోషపడాలి.
16. మీ న్యూస్ పేపరు రాతల వల్ల ఒక పోస్టు మ్యాన్ ఉద్యోగం బదిలీ అయిందట?
అవునండి… నాకు చిన్నప్పటినుండీ అంటే హైస్కూలు రోజుల నుండీ పత్రికలకు ఉత్తరాలు రాసే అలవాటు ఉండేది. ఆ రోజుల్లో నేను రాసిన ఉత్తరాల వల్ల అనేక స్థానిక సమస్యలు పరిష్కారమయ్యాయి. ఆంధ్రజ్యోతి దినపత్రిక స్థానిక సమస్యలు ప్రచురించడమే కాకుండా, సమస్యలను సంబంధిత అధికారులతో కూడా చర్చించి వారి స్పందన కూడా ప్రచురించే వారు. అలా మా ఊరు పోస్టు మ్యాన్ గురించి నేను రాసిన ఒక ఉత్తరం పెద్ద వివాదానికి కారణమైంది. ఆయన ఉత్తరాలను ఎవరెవరికో ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు. కొన్నిసార్లు రెండు మూడు రోజుల ఉత్తరాలు కలిపి పట్టుకొచ్చేవాడు. దానివల్ల చాలామందికి ఇబ్బంది కలిగేది. నేను పత్రికలో రాసిన ఆ ఉత్తరం తర్వాత ఆ సమస్య చాలామందికి తీరినా, వ్యక్తిగతంగా నేను ఇబ్బందులకు గురయ్యాను. అలాగే, ఎలక్ట్రిసిటీ (కరెంట్) విషయంలో కూడా జరిగింది. కొంతమంది దొంగచాటుగా కరెంట్ వాడుకొనేవారు. దానివల్ల వోల్టేజీ సమస్య వచ్చేది. లైన్మెన్ కి చెప్పిన పెద్దగా పట్టించుకునే వాడు కాదు. అప్పుడు ఒక లేఖ రాశాను. అది కూడా పెద్ద గొడవలకు దారి తీసింది.
17. "బాల్యాన్ని ఎన్నిరకాలుగానైనా ఉత్ప్రేక్షించగలం" అన్నారు - ఉత్ప్రేక్షలో ఉపమానం కేవలం ఊహే కదా? బాల్యం వర్ణించడానికి ఉత్ప్రేక్ష అలంకారం సరైనదేనా? వివరించండి?
నా ఆత్మకథలో బాల్యాన్ని గురించి చెప్తూ అలా చెప్పాను. వాస్తవాన్ని బలమైన పోలికలతో చెప్పడం…కవి వర్ణన భావుకతకూ, ప్రతిభకూ నిదర్శనం. దానివల్ల వాస్తవికత దెబ్బతినదు. ఆ ఊహ వల్ల పాఠకులు మరింత శక్తివంతంగా దాన్ని అనుభూతి చెందుతూ, బాగా గుర్తుపెట్టుకుంటారు.
18. సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయడం ద్వారా సమాజానికి ప్రయోజనం చేకూరాలి. మీ పునర్మూల్యాంకన దృష్టికోణం ఏమిటి?
నా దృష్టికోణంలో కూడా సాహిత్యాన్ని, సమాజాన్ని కొత్త విలువలతో అర్థం చేసుకోవడమే. అది సామాజిక వాస్తవికతను అవగాహన చేస్తుంది. తాము చదివే రచన తమకు ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి మూల్యాంకన ద్వారా తెలుసుకోగలుగుతారు. ఈ పునర్ మూల్యాంకనం లేకపోతే కొన్ని భావజాలాలు ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి.
19. మీరు విద్యార్ధిగా ఉన్నప్పటి కాలం - మీరు ఆచార్యునిగా యిప్పుడున్న కాలం పరిశీలిస్తే విద్యార్ధుల్లో ఏమైనా మార్పులు గమనించారా?
అప్పుడు ఉపాధ్యాయులు అధ్యాపకుడి దగ్గరికి విద్యార్థులు వెళ్లాలంటే భయపడేవాళ్ళం. దీనికి వాళ్ళు అందరినీ దగ్గరికి రానివ్వకపోవడం ఒక ప్రధాన కారణం. ఇప్పుడు చదివే వర్గం, చదువు చెప్పే వర్గం కూడా మారింది. విద్యార్థులను స్వేచ్ఛగా దగ్గరకు రానిస్తున్నారు. ఒకప్పుడు కొంతమందికి పుస్తకాలు కూడా అందుబాటులో ఉండేవి కాదు. టెక్స్ట్ బుక్స్, గైడ్స్, ట్యూషన్స్…ఇవన్నీ కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండేవి. చాలామంది ఉపాధ్యాయులు విద్యార్థులను విపరీతంగా కొట్టేవారు; భయపెట్టేవారు; పాఠాలు చెప్పేవారు కాదు; నోట్స్ చెప్పేవారు కాదు. ఎంతోమంది ట్యూషన్స్ కోసం అలా చేసేవారు. అలాగని అందరూ ఒకే విధంగా ఉండేవారని చెప్పలేం. నేడు ఏదో ఒక రూపంలో పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి. అన్నీ ప్రజాస్వామీకరించబడ్డాయి. పారదర్శకత పెరిగింది. విస్తృతమైన విద్యా అవకాశాలు, మార్గాలు పెరిగాయి. అందువల్ల ఉపాధ్యాయులు, అధ్యాపకుల కంటే ఇతర అంశాల ద్వారా విద్యార్థులు తమకు కావాల్సిన జ్ఞానాన్ని నేర్చుకునే మార్గాలు పెరిగాయి. అయితే, విస్తృతమైన స్వేచ్ఛ సహజంగానే కొన్నింటిపై దుష్ప్రభావాన్ని వేస్తుంది. దీనిలో భాగంగానే ఉపాధ్యాయులు కొంత ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందువల్ల నేడు విద్యార్థులకు కేవలం గురుముఖతః మాత్రమే జ్ఞానాన్ని పొందాలనే ఆలోచన ఉండట్లేదు.
20. వర్తమాన కవులకు, రచయితలకు మీ సందేశం?
కవులు, రచయితలు ఎక్కువగా చదవాలి. ఎక్కువగా లోకాన్ని పరిశీలించాలి. సమాజంలో వస్తున్న మార్పులను గమనించాలి. సాంకేతికతను ఉపయోగించుకోవాలి. కానీ, దానికి బానిస కాకూడదు. కృత్రిమమేధ వంటి వాటి విషయంలో కవులు, రచయితలు జాగృతితో వ్యవహరించాలి. వీరే కాదు, పరిశోధకులు, విమర్శకులు కూడా ఏఐ (AI) ని ఉపయోగించుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది తప్పు దోవ పట్టించే అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. సమకాలీన అంశాలను శక్తివంతంగా, అభివ్యక్తి నైపుణ్యంతో చెప్పకపోతే ఆ రచయితా, ఆ కవీ మనగలగగడం కష్టం. ఏ.ఐ. భవిష్యత్తులో ఎన్నో చాలెంజెస్ ని మన ముందు పెట్టబోతుంది. నిజమైన జ్ఞానాన్ని గుర్తించే విషయంలో అయోమయాన్ని సృష్టించే అవకాశం కూడా ఉంది.
నాకు ఇలా ఒక మంచి అవకాశం ఇవ్వడం ద్వారా నా అభిప్రాయాలను మీతో పంచుకోగలిగే అవకాశం కలిగించినందుకు మీకు, సాహిత్య ప్రస్థానం పత్రిక సంపాదక వర్గానికి నా కృతజ్ఞతలు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి