20.2.2023 వ తేదీన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జాకీర్ హుస్సేన్ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆచార్య పులికొండ సుబ్బాచారి గారి నవల 'రేవుతిరగబడితే..' గ్రంథాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి గౌ.ఎం.వెంకయ్యనాయుడుగారు ఆవిష్కరించారు
పాశ్చాత్య వ్యామోహంతో భారతీయ మూలాల్ని విస్మరించవద్దు
రేవు తిరగబడితే'...నవల ఆవిష్కరణ సభలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్య.
పాశ్చాత్య వ్యామోహంతో భారతీయ మూలాల్ని విస్మరించవద్దనీ, లోపాల్ని సరిచేసుకుంటూ భారతీయ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పవలసిన అవసరం ఎంతో ఉందనీ, సామాజిక వాస్తవాలకు దర్పణంగా 'రేవు తిరగబడితే ' ఉందని భారత మాజీ రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు రచించిన 'రేవు తిరగబడితే...'నవలను సోమవారం నాడు (20 .2.2023) ముఖ్య అతిథిగా పాల్గొన్న (భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆవిష్కరించి మాట్లాడారు. స్వరాజ్యం సముపార్జించిన తొలినాళ్ళలో ఇంకా స్వాతంత్య్రం రాని ప్రజల స్థితిగతులు ఈ నవల ప్రతీ ఫలిస్తుందని ఆయన అన్నారు. సాంఘిక సమానత్వంతో పాటు, ఆర్థిక పరిస్థితులు కూడా అందరికీ అందుబాటులో రావాలన్నారు. ఎంతో పరిశోధన చేసి, ఈ నవల అందించిన ఆచార్య పులికొండ సుబ్బాచారిని అభినందిస్తున్నానని ప్రశంసించారు.
ఈ సమావేశానికి హెచ్ సియు వైస్-ఛాన్సలర్ ఆచార్య బి.జె.రావు అధ్యక్షత వహించారు. వివిధ కుల వృత్తుల వారు వారి మానసిక సంఘర్షణలను ఈ నవలలో రచయిత శక్తివంతంగా ఆచార్య పులికొండ సుబ్బాచారి వివరించారని ఆచార్య బిజెరావు అన్నారు.
ఈ కార్యక్రమం దళిత, ఆదివాసీ అధ్యయనం, అనువాద కేంద్రం (సిడాస్ట్) ఆధ్వర్యంలో జరిగింది. అతిథులుగా హెచ్ సియు ప్రొ. వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్.ఎస్.సర్రాజు, ఆంధ్రజ్యోతి సంపాదకులు డా.కె.శ్రీనివాస్ తెలుగు నవలా సాహిత్యంలో మాలపల్లి తర్వాత మరల అటువంటి ఉత్తమ నవల అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా.మామిడి హరికృష్ణ, ప్రముఖ కవి డా.కొప్పర్తి వెంకట రమణమూర్తి పాల్గొనగా, తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ప్రభుత్వ సిటీ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డా.కోయికోటేశ్వరరావు పుస్తక సమీక్ష చేశారు.
నవలలో సమకాలీన బహుజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన పరిణామాలు, దాని వెనుక సుమారు ఏభై యేళ్ళ సంఘర్షణను, ఆ చారిత్రక వాస్తవాలను తెలుసుకోవచ్చునని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక రజకస్త్రీ చాకలి ఐలమ్మ సూత్రధారి అయితే, ఈ నవలలో బహుజనల ఆత్మగౌరవ పోరాటానికి బొర్రమ్మ కేంద్రమవుతుందని ఆచార్య దార్ల పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాంతంలో రజాకార్ల దురాగతాలు, దేశ స్వాతంత్య్రం, తదనంతరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పటేలు, కరణం, గ్రామ పెత్తందారుల చేతుల్లో చేతివృత్తుల వాళ్ళు ఎన్ని కష్టాలను అనుభవించవలసి వచ్చిందో ఈ కథలో ఆ చారిత్రక వాస్తవాలను చక్కగా రచయిత సృజనీకరించారని ఆచార్య దార్ల విశ్లేషించారు.
ఆత్మగౌరవం, అస్తిత్వం , బహుజన కులాల ఐక్యత అనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దృష్టితో రచయిత ఈ నవలను రచించారని డాక్టర్ కోయి కోటేశ్వరరావు అన్నారు. ఆకలి దళిత బహుజనులు ఎదుర్కొంటున్న ఆకలి , అవమానాల ఉమ్మడి తీవ్రతను, సామాజిక ఆర్థిక దోపిడిని ఈ నవల ద్వారా రచయిత వివరించారని ఆయన పేర్కొన్నారు.
సిడాస్ట్ అధ్యక్షులు ఆచార్య విష్ణు సర్వదే సమావేశానికి అతిథులను ఆహ్వానించగా, ఆచార్య పులికొండ సుబ్బాచారి తాను రచించిన నవల నేపథ్యాన్ని చెప్పి, అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి