శ్రీ సాకే శ్రీహరి మూర్తి
ఈ పేరు చాలా సంవత్సరాల క్రితమే నాకు తెలుసు.
రాయలసీమ జాగృతి మాసపత్రిక ద్వారా తెలుసు.
ఒకసారి నాకు ఆయనే ఫోన్ చేసి తమ పత్రిక గురించి చెప్పారు.
కొన్ని పత్రికలు పంపి వాటిపై అభిప్రాయం రాసి పంపించమన్నారు.
దాన్ని ప్రముఖంగా ప్రచురించారు.
తర్వాత నా వ్యాసాలు పంపేవాణ్ణి.
ఆయన ప్రచురించేవారు.
తర్వాత భూమిపుత్ర పేరుతో దినపత్రిక నడుపుతామని అన్నారు.
కొన్నాళ్ళు బ్లాక్ అండ్ వైట్ లోను, తర్వాత కొన్ని పేజీలు కలర్ లోను ప్రచురించేవారు.
క్రమేపీ అన్ని పుటలూ కలర్ లో ప్రచురించేస్థాయికొచ్చారు.
ఆ పత్రికతో నాకు ఎంతో అనుబంధం ఏర్పడింది.
నా వ్యాసాలు రెగ్యులర్ గా రాసేవాణ్ణి.
అంతకుముందు ప్రసిద్ధ తెలుగు దినపత్రికలు…ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర భూమి, సూర్య, మనం మొదలైన పత్రికల్లో సంపాదకీయం పుటల్లో కూడా వ్యాసాలు వచ్చేవి. కానీ, వాళ్ళు ఎడిటింగ్ చేసేవారు.
నాకు రాయకూడదనుకొంటూనే రాసేవాణ్ణి.
అటువంటి సమయంలో భూమిపుత్ర పత్రిక నాకు దొరికింది. రాసిన ప్రతి అక్షరాన్నీ యథాతధంగా ప్రచురించే పత్రిక దొరికింది.
దాన్ని నా పత్రిక అనుకున్నాను.
అటువంటి పత్రికల ఎడిటర్ నీ కలవాలని సహజంగా నే అనిపిస్తుంది కదా…
నాకూ అలాగే అనిపించింది.
జూలై16, డా.రస్.టి.జ్ఞానానందకవి జన్మదినోత్సవం సందర్భంగా జ్యోత్స్నా కళాపీఠం వారు 2021 సంవత్సరానికి ఇచ్చే ఉత్తమ పాత్రికేయ పురస్కారాన్ని శ్రీ సాకే శ్రీహరి మూర్తి గారికి వచ్చింది.
ఆ సందర్భంగా ఆ తేదీన ఆయన హైదరాబాద్ వచ్చారు.
అప్పుడే ఆయన్ని తొలిసారిగా కలిశాను.
మరలా 11.11.2022 వతేదీన నేను అనంతపురం వెళ్ళినప్పుడు కలిశాను.
నాకోసం ఆయన, ఆయనతో పాటు డా.రమేశ్ నారాయణ గారు, రమేశ్ గారు, తోటి నాగరాజు ఒక అందమైన పూల బొకే పట్టుకొని వచ్చారు. దానితో పాటు ఒక పట్టు శాలువా తీసుకొచ్చారు. రమేశ్ నారాయణ గారు తన పుస్తకాలన్నీ నాకు ప్రేమతో ఇచ్చారు.
నా పుస్తకాలు కొన్ని శ్రీహరి మూర్తి గార్కి ఇచ్చాను.
నేను దిగిన అలెగ్జాండర్ హోటల్ లో వాళ్ళంతా కలిసి సత్కరించారు.
అది ఎంతో ఆత్మీయ ఆలింగనం లా అనిపించింది.
ఆ సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళాను.
ఆయన ప్రచురించే ప్రతిక సామాను, దాన్ని తయారు చేసే విధానం చూడాలని ఎంతో తహతహలాడాను.
శ్రీహరి మూర్తి గారి శ్రీమతి సిరిప్రియ…ఆ పత్రికను అవలీలగా క్వార్క్ లో డిజైన్ చేయడాన్ని చూసి నాకెంతో ముచ్చట వేసింది.
ఆ రోజు నాకోసం ప్రత్యేకంగా తయారు చేసిన రాగి ముద్ద, చికిన్ ఎంతో బాగుందో వర్ణనాతీతం.
అదొక తీయని జ్ఞాపకంగా మిగుల్చుకోగలిగాను.
వారి దంపతులిరువురి ఆప్యాయతా నాకెంతో సంతోషం కలిగించింది.
నేను మా ఇంటి కొచ్చేటప్పుడు
ప్రత్యేకంగా తయారు చేసిన వేరుశనగ పొడి వేడివేడి అన్నంలో వేసుకున్నప్పుడల్లా వాళ్ళే గుర్తుకొస్తుంది.
ఆ సమయంలోనే
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారి దగ్గర పరిశోధన చేసిన నాగేంద్ర వచ్చారు.
అనంతపురం స్పెషల్ హోగిలాలు పట్టుకొని వచ్చారు.
వాటిని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.బాలసుబ్రహ్మణ్యం గారు పంపారట.
రైల్వే స్టేషన్ కి మా సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్న సునీల్ కుమార్ రెడ్డి వచ్చాడు. వచ్చేటప్పుడు నెయ్యితో చేసిన హోగిలాలు పట్టుకొచ్చాడు.
అంతకుముందు నన్నూ, ఆచార్య విస్తాలి శంకరరావుగార్ని బుక్కరాయ సముద్రం చూడ్డానికి తీసుకెళ్ళాడు. తనకు పని ఉండడం వల్ల ఆచార్య బాల సుబ్రహ్మణ్యం గారు రాలేకపోయారు. కారిచ్చి డ్రైవర్ నిచ్చి పంపారు. మాతో పాటు వాళ్ళ రీసెర్చ్ స్కాలర్ ఈరన్న గార్ని పంపారు.
అంతకుముందు మా రీసెర్చ్ స్కాలర్స్ సునీల్ రెడ్డి, సుమలత తమ గారాలపట్టిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని చూడ్డం నాకెంతో ఆనందం అనిపించింది. ఆ అమ్మాయిని ఎత్తుకుంటే నాదగ్గర ఆ పిల్ల గువ్వలా ఒదిగిపోయింది. ఆ మెత్తని స్పర్శ నాకింకా ఆత్మీయంగానే అనిపిస్తుంది.
మాతో పాటు రావాల్సిన ఆచార్య రామనాథం నాయుడు గారు, తన కుటుంబ సభ్యులతో రావడం వల్ల మాతో కలవడం కుదరలేదు. కానీ, నేను, ఆచార్య శంకర్రావు గారు, ఆచార్య రామనాథం నాయుడు గారు కాన్ఫిడెన్స్ వర్క్ సమయంలో కలుకున్నాం.
అలా అనంతపురం ట్రిప్ ఒక అందమైన దృశ్యంలా, రుచికరమైన పదార్థంలా మిగిలిపోయింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి