"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

21 జనవరి, 2022

దార్ల మాట శతకం పై డా.మంగళగిరి శ్రీనివాస్ వ్యాసం

 దార్లమాట శతకం  అంతరంగం

(పుస్తక సమీక్ష)


డా.మంగళగిరి శ్రీనివాసులు,

సహాయ ఆచార్యులు(సి),

పీ.జీ.సెంటర్, గద్వాల,

తెలుగు శాఖ,

పాలమూరు విశ్వవిద్యాలయం,

9491388662.


పుస్తక ముఖచిత్రం నీలివర్ణ పరదాఛాయన  శశకరూపం కల్గిన చిన్నసైకిల్ పై సవారి చేస్తూ ముద్దులొలికే ముసి ముసి నవ్వుల చిరంజీవి, డాక్టర్ ఎం.మంజుశ్రీ, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు దంపతుల గరాల పట్టి పుత్రరత్నం శ్రీనివాసరావు ముఖచిత్రం చూడగానే ఆనందం, సంతోషం, అనురాగం, ఆప్యాయతలు కనిపిస్తున్నాయి.లోకంలోని ఏ తల్లిదండ్రులకైనా ఆస్తి అంతస్తులకన్న పేగుతెంచుకు పుట్టిన పిల్లలపై ఉండే ఆప్యాయత ఆనంతం.

దార్ల దంపతులకు

పుత్రుడు శ్రీనివాసరావుపై ఉన్న వాత్సల్యాన్ని  ముఖచిత్రం తెలియపరుస్తున్నది.


దార్లను కని పెంచి సమాజానికి పరిచయం చేసిన  తల్లిదండ్రులు కీ. శే. దార్ల 

అబ్బాయి(శ్రీలంకయ్య),శ్రీమతి పెద నాగమ్మల ఆశీర్వాద మహిమచే మట్టిలో మాణిక్యం అను మాటను నిజం చేయ 

చిన్నతనంలోనే తెలుగు పై అభిమానంతో ఆతుకూరి లక్ష్మణరావు వద్ద శిష్యరికం చేసి చందస్సులో పద్యాలు వ్రాయాలని మదిలో బీజావాపనం చేసుకుని చిన్న చిన్నగా పద్యాలు రాస్తూవచ్చారు. అలా రాసివుంచిన పద్యాలతో శతకంగా ప్రచురించాలి అనేది సంకల్పం. అట్టి సంకల్పానికి చేదోడుగా మిత్రుడు గోవిందుని గోవర్ధన్ సహకరించగా పద్య సాధనలో చాతుర్యం నింపిన శంకరాభరణం బ్లాగు, వాట్సాప్ సమూహాల నిర్వాహకుడు కందిశంకరయ్య  ప్రోత్సాహం వీరికి కొండంత అండ. దార్ల

రాసిన పద్యాల ప్రతిభను గుర్తించి మొచ్చుకోలులు అందించిన ఆచార్య రేమిళ్ల వేంకట రామకృష్ణ శాస్త్రి, మల్లవరపు జాన్ కవుల సహృదయుల ప్రేమలు వెన్నంటి నిలిచాయి.


దార్లమాట శతకం కృతికర్త ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, దార్లమాట శతకం కృతిభర్త కొత్తూరు సత్యనారాయణ గుప్త  ఈ ఇరువురు కూడా అసామాన్య సాహిత్య సంపన్నులు, సాహిత్య సేవకులు, నిర్విరామ కృషివలులు కావడం విశేషం. ఇరువురి మార్గాలు వేరు వేరు ఒకరేమో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు శాఖ అధ్యక్షులు, ఆచార్యులు,సాహిత్య పరిశోధకులు,అన్నింటికి మించి శిష్యులకు ప్రేమతో పాఠాలు బోధించే గురువులు దార్ల వెంకటేశ్వర రావు.  మరొకరు సంపాదకులు,సమాజ సేవకులు,సాహిత్య సేవకులు, అయినప్పటికీ సాహిత్యవృక్షం నీడన కొలువైన వ్యక్తులు కృతిభర్త  కొత్తూరు సత్యనారాయణ గణేష్ దినపత్రికకు సంపాదకులు. ఈ పత్రిక కర్నూల్ నుంచి వెలువరిస్తున్నారు.ఇందులో ఎంతో మంది కవులను ప్రోత్సహిస్తూ వారు పంపిన కవితలను పద్యాలను సాహిత్య అంశాలను ప్రతిదినము ఒక పేజీని  వీలునుబట్టి  ఆ పత్రికలో కవులను రచయితలను ప్రోత్సహిస్తున్న దారిలో దార్ల వెంకటేశ్వరరావుకి కొత్తూరు సత్యనారాయణగారితో పరిచయం ఏర్పడింది.దార్ల గణేశ పత్రికకు తరుచుగా కవితలు పద్యాలు పంపుతూ ఉండేవారు వాటిని గణేష్ పత్రికలో అచ్చు వేస్తూ ఉండేవారు. కొత్తూరు సత్యనారాయణ గుప్త చేస్తున్న సేవలను గుర్తించి దార్ల వారు ఈ గ్రంథాన్ని అంకితమిచ్చారు.


ఇట్టి గ్రంథానికి *పూలు పరచిన 'దార్ల'లో  శీర్షికన కంది శంకరయ్య అభినందించారు.

"స్వాగతం" శీర్షికతో ఆచార్య ఎస్ శరత్ జోత్స్నరాణి, డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటిస్, వారు ముందుమాటను రాసారు. దార్ల పద్యాలను కొనియాడుతూ ఆచార్య పిల్లలమర్రి రాములు "విలక్షణ రసహృదయుడు దార్ల" పేరిట అభినందనలు తెలిపారు.

ఇకపోగా ఆచార్య విస్తాలి  శంకర్  రావు తెలుగు శాఖ అధ్యక్షులు  మద్రాసు విశ్వవిద్యాలయం వారు సమకాలీన జీవితాలకు దర్పణం దార్లమాట శతకం శీర్షికన పరిపూర్ణ సద్విమర్శన రూపంలో కవి గురించి, కుటుంబ నేపథ్యం గూర్చి, వీరి సాహిత్యం గూర్చి తెలుపుతూ దార్లమాట శతకంలోని పద్యాలతో సమన్వయం చేస్తూ  పుస్తకం గూర్చి చక్కగా  పరిచయం చేసిన ఆచార్య విస్తాలి  శంకర్  రావు తెలుగు శాఖ అధ్యక్షులు మద్రాస్ వారి ఆశీర్వాదం శుభసూచకం.

దార్ల వారిపై మక్కువను తెలుపుతూ మల్లవరపు రాజేశ్వరరావు రెండు పద్యాలను రాశారు.

మిత్ర వాత్సల్యం పేరిట గోవిందుని గోవర్ధన్,

తెలుగు ఉపన్యాసకులు, పాలెం, వారు మిత్ర వాత్సల్యంతో తొమ్మిది పద్యాలలో వారి గొప్పతనాన్ని తెలియపరిచారు.

ఇక కొత్తూరు సత్యనారాయణ గుప్త (కృతిభర్త),

ఏమని వ్రాయాలి? అను శీర్షికతో ఆత్మీయ పలుకులు పలుకుతూ కృతికర్తతో ఏర్పడిన  పరిచయం తెలియపరుస్తూనే    వారి కుటుంబీకులకు ధన్యవాద వందనాలు తెలిపారు.


దార్ల వెంకటేశ్వరరావు "నా పద్య కవిత్వం నేపథ్యం" శీర్షికతో వారి జీవిత విషయాలను, శతకం రాయడానికి పూనుకున్న స్థితిగతులు అన్నీ కూడా ఇక్కడ తెలియజెప్పారు దార్ల. గ్రంథ రూపం రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.


శతకానికి ఉండవలసిన లక్షణాలలో ప్రాథమికంగా సంఖ్యా నియమం, మకుట నియమం, వృత్తి నియమం, భాషా నియమం ప్రధానమైనవి వీటిని బట్టి చూస్తే దార్ల మాట శతకంలో పై చెప్పిన విషయ అంశాలన్నీ సంపూర్ణంగా ఉపయోగించారు. సంఖ్యా నియమము ప్రకారము వందకు పైగా పద్యాల వినియోగంలో 165 పద్యాలను తీసుకున్నారు. మకుట విషయంలో దారి పూల తోట దార్ల మాట అను మకుటం తీసుకున్నారు. అన్ని పద్యాలకు కూడా 4వ పదంలో ఇదే మకుటం ఉంటుంది. ఇది  దార్ల వెంకటేశ్వర రావు నామముద్ర తెలియజెప్పును.

వృత్తి నియమం ప్రకారం ఆటవెలది పద్యాలను తీసుకున్నారు.భాషా నియమం విషయంలో అలతి అలతి మాటలతో   సరళమైన పదాలతో పద్యాలను రచించారు.ఇందులోని పద్యాలు అన్నీ విశ్లేషించడం సాధ్యం కాని పని అయినా మచ్చుకు కొన్ని దార్లమాట శతకంలోని  పద్యాల విశ్లేషణలు...


శ్రీ గణపతి దేవ శివపార్వతీ పుత్ర

నీదు దయను పొంది నిన్ను తలతు

పద్య విద్య సుజన హృద్యంబు చేయరా

దారి పూల తోట దార్ల మాట


అను పద్యముతో విఘ్నములు తొలగించే గణపతిని,శివపార్వతులకు స్తుతిస్తూ మీ దయవల్ల నాకు పద్య కవిత్వ విద్యను అందించగలరని ప్రార్థిస్తూ శతకమును ప్రారంభించారు దార్ల వారు.


కరవు నేల కాదు కళలకు పుట్టినిల్లు

వనరులుండె  స్వర్ణ వజ్ర ఖనులు

రాగి సంగటి రుచి రాయలసీమదే

దారి పూల తోట దార్ల మాట


రాయలసీమ ప్రాంతంలో ఓరి నాయనా ....అను ఒక సినిమా పాటలో కరువు గూర్చి విన్నా... డివిఆర్ పద్యంలో కళలకు పుట్టినిల్లని,గనులు, వజ్రాలు, బంగారం వనరులు ఉన్న నేలని , మంచి బలన్నిచే రాగుల సంగటి రాయలసీమ వారిదే అన్నట్లు రాయలసీమ గొప్పతనాన్ని ఈ పద్యంలో తెలిపారు డివిఆర్.


విత్తనమును బట్టి వికసించు బుద్ధులు

మట్టి యొక్కటైన మాను వేరు

మనుషులంత యొకటి మర్మంబు వేరయా

దారి పూల తోట దార్ల మాట


విత్తనమును బట్టి మొలకలు పేరుగుతుంటాయి.

మొలక మొలిచే మట్టి మాత్రం అన్ని మొలకలను ఒక్కటే. అయినప్పటికీ మొక్కలు ఎదుగుదల వేరు వేరు ఉంటుందని దీని సమన్వయం మానవులంతా ఒకటే అయిన వారి వారి మర్మాంబులు వేరు వేరుగా ఉంటాయని మనిషి ప్రవర్తనను ఈ పద్యంలో తెలిపారు డివిఆర్.


అవసరంబు మేర యన్యభాషనయిన

మాటలాడవలయు మరువవద్దు

మాతృభాష యేను మనకు జీవనమగు

దారి పూల తోట దార్ల మాట


అవసరానికి అన్యభాషలు మాట్లాడు కానీ మాతృభాషనూ ఎప్పుడూ మర్చిపోవద్దు అదియే మనకు జీవితాన్ని అందిస్తుందని మాతృభాషను గొప్పతనం ఈ పద్యంలో తెలిపారు డివిఆర్.


దళితుడెంత యున్నత పదవి నుండిన

కులము కర్మ యనుచు కూర్మి లేదు

భరత భూమి నందు భాగ్యంబు చూడరా

దారి పూల తోట దార్ల మాట


దళితుడు ఎంత ఉన్నత పదవిని అధిరోహించిన వారితో   కలసిమెలసి ఉండరు. కారణం వాడు దళితుడిగా పుట్టడం అది వాడి కర్మ. భరత భూమిలో ఈవిదంగా చూడరా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మనం అందరం సమానం అనే భావనతో ఉండాలని గ్రహించాలంటాడు డివిఆర్.


చదువు కన్న మిన్న సంస్కారమున్నచో

చక్కగున్న యెడల చదువు లేల?

నోరు మంచి గున్న ఊరికేముందిరా!

దారి పూల తోట దార్ల మాట


చదువున్న చదువు లేకున్నా సంస్కారంతో వుండడం మిన్న. సంస్కారంతో కూడిన మాటలు మాట్లాడితే ఏ ఊరు అయితేనేం ఎక్కడైనా మంచిగా జీవించగల్గుతాము అంటారు 

డివిఆర్.


ఈ విధంగా దార్ల వెంకటేశ్వర రావు ఎన్నో  సన్నివేశాలు, సమస్యలు,సంఘటనలు, వాటిని తీసుకుంటూ  తెలుగు భాషా గొప్పతనం గూర్చి, అమ్మ గూర్చి, రాజకీయ నాయకుల గూర్చి, ఓటు ప్రాధాన్యతను గూర్చి, నీటిని గూర్చి, ఊరిని గూర్చి, నల్లధనం గూర్చి, ప్రకృతిని గూర్చి ఇది అది అని లేకుండా సందర్భోచితంగా మనసుకు తట్టి మది అంతరంగం నుండి మదించగా వచ్చిన మంచి పద్యాలను వెలువరించి తన మేధో జ్ఞాన బండారాన్ని మన చేతిలో పెట్టిన పుస్తకం దార్లమాట శతకం.ఇందులో ఒక్కొక్క పద్యం ఒక్కొక్క భావాన్ని మనకు తెలియపరుస్తూ ఈనాటి నిజజీవితంతో  ముడిపడిన విధానాన్ని అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు శతకంలో చెప్పిన గొప్ప దార్శనికుడు దార్ల వెంకటేశ్వరరావు. 

ఇట్టి మంచి పుస్తకం వెలువరించిన దార్ల వెంకటేశ్వర రావు గారికి నమస్సులతో అభినందన  శుభాకాంక్షలు.

గువ్వల చెన్న శతకంలో  పద్యం గొప్పతనం గూర్చి ఒక పద్యం.


గుడి కూలును, నుయి పూడును

వడి నీళ్ళం జెఱువు తెగును, వనమును ఖిలమో

చెడనిది పద్యము సుమ్మీ

కుడి యెడమల కీర్తి గన్న గువ్వల చెన్నా


గుడి కూలిపోతుంది, మంచి నీటి బావి పూడిపోతుంది, వేగంగా వచ్చే నీటి వేగానికి చెరువు తెగిపోతుంది, వనము కాళిపోతుంది ,కానీ ఎప్పటికి నశించిపోనిది పద్యం మాత్రమే అనే  భావన్నీ బట్టి దార్ల వెంకటేశ్వర రావు వెలువరించిన దార్లమాట శతకం ధరణి యందు మంచి గుర్తింపు పొందుతుంది.......

కామెంట్‌లు లేవు: