"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

20 December, 2010

సాహిత్యంలో బహుజన దృక్పథం


సాహిత్యం విశ్వజనీనమైంది. తీసుకున్న వస్తువు ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో, ఒక జెండర్‌కో చెందినట్లు పైకి కనిపించినా, దానిలో చెప్పే సత్యం మాత్రం విశ్వజనీనం కావాలి. అలా కానప్పుడు అది అందరి సాహిత్యంగా కాకుండా, కొందరి సాహిత్యంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఏ సమాజంలో జీవిస్తున్న రచయితైనా తన దృక్పథాన్ని బట్టి రచన కొనసాగిస్తాడు. తీసుకొనే వస్తువేదైనా, దాన్ని ఏ లక్ష్యం వైపు తీసుకెళ్తున్నాడో ఆ మార్గమే ఆ రచనా తత్త్వాన్ని, ఆ రచయిత దృక్పథాన్నీ తెలుపుతుంది. అయినా, సర్వమానవాళికి చెందిన ఒక సామూహిక అనుభవమేదో ప్రతిఫలించగలిగినప్పుడే అది సాహిత్యమై పరిమళిస్తుంది.
ప్రపంచసాహిత్యమంతా ప్రధానంగా రెండు మార్గాల్లో నడుస్తుంది.ఒకటి, సమాజాన్ని కొన్ని ఆధిపత్య వర్గాలకు అనుకూలంగా మార్చుకోవడానికి సాహిత్యాన్ని ఒక సాధనంగా వాడుకునే దృక్పథం. దీన్ని భావవాద దృక్పథం అని అంటారు. సమాజంలో అపరిష్కృతంగా కనిపించే అనేక క్లిష్ట సమస్యలకు పరిష్కారాల్ని సూచిస్తున్నట్లుంటుంది. దైవాన్ని నమ్ముకోవడం వల్ల, యజ్ఞయాగాదులు, పూజలు చేయడం వల్ల ఆ సమస్యలన్న్లీ తీరిపోతాయని ఈ సాహిత్యం బోధిస్తుంది.తెలుగులో ప్రాచీన సాహిత్యమంతా ఇంచు మించు ఈ భావవాద ధోరణిలోనే నడిచింది.
మానవుడే అన్నింటికీ కేంద్రమంటూ, అన్ని వర్గాలకూ ప్రాధాన్యాన్నిచ్చే దిశలో, సామాజిక వాస్తవిక దృష్టితో  కొనసాగేది ఆధునిక సాహిత్యం. కాలాన్నీ, సాహిత్య తత్త్వాన్నీ పరిశీలించడం వల్ల నిజమైనఆధునిక సాహిత్యమేంటో తెలుస్తుంది.భావవాద ఛాయలున్న సాహిత్యం కొంత వెలువడుతున్నా, దానికి మూడురెట్లు అధికంగా భౌతికవాద దృక్పథంతోనే ఆధునిక సాహిత్యం వస్తోంది. సామాజిక వాస్తవిక వాదులు భావవాద దృక్పథంతో వెలువడే సాహిత్యాన్ని తిరోగమన సాహిత్యమనీ, భౌతికవాద దృక్పథంతో వెలువడే సాహిత్యాన్ని పురోగమన సాహిత్యమనీ వ్యాఖ్యానిస్తారు.
భౌతికవాద దృక్పథంతో సాహిత్యాన్ని పరిశీలించే ధోరణి మార్క్సిజంలో కనిపిస్తుండడం వల్ల కేవలం దీన్నే ఒక ప్రధాన దృక్పథంగా భావించడం జరుగుతోంది. దీనిలో వర్గం పునాదిగా ఉంటుంది. ఉపరితలాంశాలన్నీ, సాహిత్య, కళారూపాలతో సహా వర్గ సమస్య పరిష్కృతమైతే, మిగతా అన్ని సమస్యలూ పరిష్కారమైపోతాయని భావిస్తుండడం సర్వసాధారణంగా కనిపిస్తుంది.
బహుజన దృక్పథంలో వర్గ సమస్యలున్నా, దేశీయవాస్తవిక సామాజిక దృష్టి వల్ల కులం ప్రాధాన్యాన్ని వహిస్తుంది. వర్గ వివక్షనీ, కులవివక్షనీ పక్క పక్కనే పెట్టి చూస్తే, కుల వివక్ష మానసిక క్షోభను కలిగిస్తూ, ఆత్మగౌరవ సమస్యని ముందుకి తెస్తుంది. అందువల్ల కేవలం వర్గ సమస్యతో మాత్రమే సాహిత్యాన్ని చూస్తే, దాంట్లోనూ భౌతికదృష్టి ఉన్నా, సాహిత్యం సమాజ వాస్తవికతను ప్రదర్శించడంలో పాక్షికకోణమే ప్రదర్శితమౌతుంది. అందు వల్ల వర్గ, కుల సమస్యల సమ్మేళనంతో సాహిత్యాన్ని విశ్లేషించేది సాహిత్యంలో బహుజనదృక్పథమవుతుంది.
కేవలం తెలుగు సాహిత్యం వరకే చూసినా, మన సాహిత్య చరిత్రకారులు అత్యధికులు నన్నయతోనే సాహిత్య యుగాన్ని ప్రారంభించారు. అంతకుముందు సాహిత్యం ఉన్నా, గాసట బీసటగా ఉందనీ, లిఖితసాహిత్యం కావ్య రూపంలో కనిపించడమనేది నన్నయతోనే మొదలైందని సిద్ధాంతీకరిస్తున్నారు. అందు వల్ల నన్నయకు ముందున్న సాహిత్నాన్ని ప్రాజ్ఞన్నయ యుగం అంటున్నారు. నన్నయ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనుసృజన ( ట్రాన్స్‌క్రియేషన్‌ ) చేశాడు.  పద్యంలో ఆంధ్రమహాభారతాన్ని రమణీయంగా వర్ణించాడు.
పద్య రూపంలో ఒక కావ్యం వెలువడాలంటే, నాటి సాహిత్యవేత్తలు పద్యాన్ని అర్ధం చేసుకునే సామర్ధ్యానికి సంసిద్ధులై ఉండాలనే కదా. అంటే అప్పటికే సాహిత్యం చాలా ఉంది. అది పద్య, గద్య, గేయ, వచన రూపాల్లో ఉండే అవకాశం ఉందన్నమాట. దీన్ని శోధించడంతోనే తెలుగు సాహిత్యంలో బహుజన దృక్పథానికి ద్వారాలు తెరిచే అవకాశం ఉంది.
సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థను బలంగా ఆచరించడానికి ఉపయోగపడే భావజాలాన్ని భావవాదం ప్రోత్సహిస్తుంది. రాజులు, పోషకుల ఆధారంగా సాహిత్య సృజన జరిగిందని నిరూపించే దిశగా ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యాన్ని రాశారు. అభ్యుదయయుగం వరకే రాసి, తర్వాత సాహిత్య చరిత్రను కొనసాగించకపోవడానికి కుల అస్తిత్త్వ చైతన్యాన్ని గుర్తించక తప్పని పరిస్థితి రావడం ఒక బలమైన కారణం. అందుకే 13వ సంపుటి రాసే నాటికే స్త్రీ, దళిత సాహిత్య ఉద్యమాలు వచ్చినా, వాటిని చాలా జాగ్రత్తగా పక్కకు పెట్టేశాడు. ఇక్కడ నుండి మళ్ళీ సాహిత్య చరిత్రను రాయాల్సిన అవసరం ఉంది.అదెవరు రాసినా దానిలో బహుజనదృక్పథం తప్పకుండా ప్రతిఫలించాలి.
పన్నెండో శతాబ్దం నాటి శివకవులలో కూడా కులాన్ని యెడబాయలేమని ప్రకటించినవాళ్ళున్నారు. శివకవులు కొన్ని కింది వర్ణాలకీ స్థానం కల్పించినట్లనిపిస్తున్నా, వారినీ తమ మతానికి అనుకూలంగా మార్చుకోవడానికే ఆ భావాల్ని ఉపయోగించుకున్నారనేది బహుజనసాహిత్య దృక్పథం గుర్తిస్తుంది.
16 వ శతాబ్దంలో మొల్ల రామాయణం, శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదరాశారనే విషయాల్లోని వివాదాల్ని కుల దృష్టితో పరిశీలించాల్సిన అవసరం ఉంది. వసుచరిత్ర కారుడి పేరు గురించిన వివాదం, శూద్రుడు రాసిన కావ్యం కాకి ఎంగిలితో సమానమనీ, దాన్ని చదవకూడదనీ లక్షణాల్ని నిర్దేశించిన 17 వ శతాబ్దం నాటి అప్పకవిని గురించి ఆలోచించాలి. బ్రౌన్‌ వెలికితీసిన వేమననూ, వేమన పద్యాలుగా చెలామణీలో ఉన్న ఆధ్యాత్మిక పద్యాల్నీ విశ్లేషించుకోవాలి. వీరబ్రహ్మేంద్రస్వామి సాహిత్యం కూడా ఆధ్యాత్మికమైనా, ఆ సాహిత్యంలో కనిపించే ప్రజాస్వామిక భావాల్ని మూల్యాంకన చేసే పద్ధతికీ, సంప్రదాయ సాహిత్యాన్ని విశ్లేషించే దానికీ తేడా ఉంది. 17, 18 శతాబ్దాల నాటి తెలుగు  సాహిత్యాన్ని క్షీణ ప్రబంధయుగంగా సంభావించడంలోని ఆంతర్యాన్నీ గమనించాలి.
సాహిత్యం కులాన్ని పట్టించుకుని వెలువడిన విధానాన్ని బహుజన సాహిత్య దృక్పథం తెలుపుతుంది తప్ప, కులాన్ని ప్రోత్సహించదు. కులాన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిగత ప్రతిభను, సమాజాన్ని విచ్ఛిన్నం చేసిన విధ్వంసాన్ని విశ్లేషిస్తూ, కుల నిర్మూలనకు ప్రయత్నిస్తుంది.అందుకనే సాహిత్య సృజన కూడా ఒక బాధ్యతాయుతంగా, సామాజిక ప్రయోజక సాధనంగా ఉపయోగపడాలని భావిస్తుంటుంది. కళ కళకోసం కాదు, కళ ప్రజల కోసమన్న రీతిలో అవగాహన చేసుకోమంటుంది. అందుకే బహుజనసాహిత్యం అవధాన, చిత్ర కవిత్వ పాండిత్య ప్రదర్శనలకు అంతగా ప్రాధాన్యానివ్వదు.     
తీసుకునే వస్తువుతో పాటు, ఆ వస్తువుకి ఎన్నుకునే రూపాన్ని కూడా జాగ్రత్తగా ఎన్నుకోవాలనేది బహుజన దృక్పథంలో గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం. మన తెలుగు సాహిత్యంలో పద్యానికి ఒక విశిష్టస్థానం ఉన్నా, ఆ పద్యం సంస్కృత సమాసభూయిష్టంగా ఉండటాన్నీ గమనించాలి. పద్య కవులు తమ పాండిత్య నిరూపణ కోసం రాస్తున్నారో, పండిత పామర జనరంజకంగా పద్యాన్ని నిర్మిస్తున్నారో పరిశీలించి, పద్యం ఎంతవరకూ ఆదరణీయమో తేల్చుకోవాలి.
గేయం, వచనం కలిగించినంత సత్వంచైతన్యం పద్యం కలిగించలేదు. కానీ, ఒక శాశ్వతమైన అనుభూతిని ఒకటి రెండు వాక్యాల్లో కూడా అందించగల శక్తి పద్యానికి ఉందనీ గుర్తించాలి.వచన సాహిత్యంలో కూడా చిన్న చిన్న వాక్యాలు, సంభాషణలు, సన్నివేశకల్పనలు  ఉంటాయి. అవి పాఠకుల మనస్సుల్లో శాశ్వతంగా గుర్తుంటాయి. పద్యమా, వచనమా అనేదానికంటే, శక్తివంతమైన వాక్యం ముఖ్యం. అది వచనానికి కూడా ఉంది.

రూపకాల్లో వివిధ వస్తువుల్ని తీసుకున్నా, సంభాషణలు, సన్నివేశ కల్పనలు శక్తివంతంగా వర్ణించి,ప్రదర్శించగలిగితే ఈ సాహిత్యరూపాలు కూడా ప్రజల్ని ఆలోచింపజేయగలుగుతాయి. సమాజ పురోభివృద్ధికి తోడ్పడాలనుకునే రచయితలు తీసుకునే వస్తువుతో పాటు, సాహిత్య రూపాల్ని కూడా జాగ్రత్తగా ఎన్నుకోవాలి.
సాహిత్యంలో వస్తువు, రూపం, శిల్పం, ప్రక్రియల పట్ల ఉన్న కొంత అస్పష్టత వల్ల వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోలేని కొంతమంది రచయితలు కూడా కనిపిస్తున్నారు.
ఇప్పటికే మార్క్సిస్టుశిబిరాల్లో సాహిత్యపాఠశాలలు కొనసాగిస్తూ, సాహిత్యాన్ని చారిత్రక, భౌతికవాద దృష్టితో చూడ్డం నేర్పారు. దాన్నింకా కొనసాగిస్తూ, ప్రజాకళారూపాల్ని వాడుకోవడానికీ శిక్షణలిస్తున్నట్లు తెలుస్తోంది.ఇటువంటి శిక్షణనే దళిత సాహిత్యానికి కేంద్రస్థానంగా, మూలస్థానంగా పేర్గాంచిన హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో సాహిత్య పాఠశాలలో తరగతుల్ని డా బి.ఆర్‌. అంబేద్కర్‌ అసోషియేషన్‌ ఆరంభించింది. దీనిలో ఎంపిక చేసిన కొంతమందికి  రాజకీయ, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక అంశాల్ని బహుజనదృక్పథంతో అధ్యయనం చేయడమెలాగో శిక్షణనిస్తుంది. ఇటువంటి అవగాహనా తరగతుల్ని అన్ని చోట్లా కొనసాగించగలిగితే బహుజనదృక్పథం మరింత వేగవంతంగా ముందుకు రాగలుగుతుంది.
- డా దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ,
సెంట్రల్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాదు` 46
ఫోను: 09989628049

No comments: