"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

18 December, 2010

మన రాజకీయ వ్యవస్థను బాగు చేయడం ఎలా? ( వీక్షణం లో నా వ్యాసం )


-డా॥ దార్ల వెంకటేశ్వరరావు, అసిస్టెంటు ప్రొఫెసర్‌,
తెలుగు శాఖ, సెంట్రల్‌ యూనివర్సిటి,
గచ్చిబౌలి, హైదరాబాదు `46, మొబైల్‌ : 9989628949,
ఈ మెయిల్‌: vrdarla@gmail.com
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులువైందేమీ కాదు. ‘రాజకీయం’ ఒక వ్యవస్థగా మారుతున్నప్పుడే దానిలో కొంత రహస్య ఎజెండా కూడా దాగి ఉంటుంది. అది బయటకు కనిపించే ఎజెండా కాదు. తమ ఆస్తుల్ని కాపాడుకోవడం లేదా పెంచుకోవడం కోసం లేదా తమ అధికారాన్ని ఏదొకరకంగా నిలుపుకోవడం కోసం గానీ ఒక వారసత్వ సంపదగా మారాలనే రహస్య ఎజెండా, ప్రజా సేవ పేరుతో రాజకీయంగా ముందుకొస్తుంది. దీనితో పాటు సమాజంలో జరుగుతున్న అవ్యవస్థను సరిదిద్దాలనో, సమూలంగా మార్చాలనే ప్రయత్నంతో కూడా రాజకీయవ్యవస్థ ఏర్పడేఅవకాశం ఉంది.
మొదట ప్రస్తావించుకున్న ఇటువంటి రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో చాలా సులువుగా అమలులోకి రాగలుగుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో సాంఘిక హోదా అనేది ప్రాథమిక స్థాయిలో కులాన్నే ఆశ్రయించుకొని ఉండడం వల్ల వంశపారంపర్యతలకు అవకాశం ఏర్పడుతుంది. అది బాగా బలం పుంజుకున్నప్పుడు రకరకాల సమీకరణాలు ఏకీకృతమై రాజకీయవ్యవస్థగా గానీ, లేదా అప్పటికే ఉన్న ఏదో  ఒక రాజకీయపక్షంలో గాని చేరి తమ ఆధిక్యతను ప్రదర్శించుకోవడం ప్రారంభిస్తుంది. కనుక, రాజకీయ వ్యవస్థ అనేది కేవలం ఒక పార్టీగా పైకి కనిపించినా, అది ఏర్పడిన లక్ష్యాలు, ఏర్పరిచిన వ్యక్తుల మూర్తిమత్వం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిఉంటుంది. రాజకీయ వ్యవస్థ  ఒక్కోప్రాంతంలో ఒక్కొక్క రూపంలో ఉండి, అది శాసనబద్దంగా పాలించే లేదా పాలించాలనే ఆకాంక్షను వ్యక్తీకరించే కొంతమంది వ్యక్తుల సమష్టిరూపం ఒక పార్టీగా కనిపిస్తుంది. కానీ ఆ పార్టీ ప్రభావితమైయ్యేది ఆ ప్రాంతంలో ‘‘ ప్రభావిత’’ వ్యక్తుల నుండే అనేది సామాన్యులకు వెంటనే కనిపించకపోవచ్చు. దాన్ని పార్టీ నిర్ణయంగానో, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తటస్థంగా ఉండిపోవడంగానో అమలులోకి వస్తుంటుంది. ఈ అవగాహనతో ‘రాజకీయ వ్యవస్థ’ను చూసినప్పుడు దాన్ని బాగు చేయడానికి ప్రయత్నించి సఫలీకృతులు కావడానికి అవకాశం ఉంది.
రాజకీయవ్యవస్థ అనేది కేవలం ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో మాత్రమే పరిమితమైంది కాదు. కానీ ప్రతీ దేశానికీ  రాజకీయ వ్యవస్థ అనేది మాత్రం ఉంటుంది. అది ఆ భౌగోళిక ప్రయోజనాలను ఆకాంక్షించే వ్యవస్థగానే వ్యవహరిస్తుంది. ఈ అవగాహనతోనే దాని గురించి మాట్లాడవలసి ఉంటుంది.  అలా కాకుండా అన్ని ప్రాంతాల్నీ పరిగణనలోకి తీసుకుని మొత్తం రాజకీయ వ్యవస్థే చెడిపోయిందని గానీ, సక్రమంగా పనిచేస్తుందని గానీ ఘంటాపథంగా చెప్పగలమా? ఎవరో కొంత మంది అలా చెప్పినా వాటిలో  పరికల్పనలే ( హైపోథీసిస్‌) ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసేవీ, వినేవీ  వాస్తవంలో అలా ఉన్నాయో లేవో తెలియని అయోమయ సమాచార వ్యవస్థలో ఉన్నాం. నిజంగా క్షేత్రాన్ని దర్శించి వాస్తవాల్ని విశ్లేషించగలిగే సమయం, అవకాశం లభించడం అంతసులభమేమీ కాదు. అందువల్ల సాధ్యమైనంత వరకూ అందుబాటులో ఉన్న పరిశోధనల్ని, మీడియానీ ఆశ్రయించక తప్పదు. ఇలాంటప్పుడు మీడియాని కొన్ని పరిమితుల దృష్ట్యా పక్కకు పెట్టినా, మరి పరిశోధనలు సత్యాన్నే అన్వేషిస్తున్నాయా? పరిశోధకులు నిజంగా క్షేత్ర పర్యటన చేసి, నిష్పాక్షికంగా కుల, మత, వర్గ, లింగ, ప్రాంతీయ అభిమానాలకు అతీతంగా సమాచారాన్ని సేకరిస్తున్నారా? సేకరించిన సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారా? ఫలితాలను ముందే ఊహించి అంటే ఏవో కొన్ని పార్టీల లేదా కొన్ని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సిద్ధాంతీకరించేటప్పుడు తమ పరికల్పనలే వాస్తవాలుగా, ఫలితాంశాలుగా ప్రకటిస్తున్నారా? అనే వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ వ్యవస్థను సాధారణీకరించి వాటన్నింటికీ ఒకే సూత్రాన్నో, పరిష్కారాన్నో సూచించడం కూడా సాధ్యం కాదు. కానీ, ఒక ప్రాంతాన్నో, ఒక దేశాన్నో కేంద్రంగా చేసుకుని ఆ రాజకీయ వ్యవస్థ బాగుపడడానికి సూచించే పరిష్కారాల్ని ఇతర ప్రాంతాలు, దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు కూడా అనువర్తితం కావచ్చు. కనుక, మనదేశం నుండి రాజకీయవ్యవస్థ స్వరూపాన్ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను.
అనేక సంవత్సరాల పాటు వివిధ రాజవంశాలు, పరదేశీయుల పాలనలో భారతరాజకీయ వ్యవస్థ కొనసాగింది.స్వాతంత్య్రోద్యమకాలం నుండీ సామాన్యులకు కూడా దానిలో పాల్గోగలిగే, దాన్ని ప్రభావితం చేయగలిగే అవకాశం కలిగింది.స్వాతంత్య్రానంతరం  ప్రాబల్యపూరితమైన రాజకీయవ్యవస్థ మళ్ళీ పరోక్షంగా కులాధిక్యాన్ని ప్రదర్శించుకునే, బలమైన ఆర్థిక పునాదుల గల వారి చేతుల్లోకే వెళ్ళిపోయింది. నైతికవిలువలు, సామాజిక సంక్షేమ దృష్టి గల రాజకీయ పార్టీలు కుల, ధన ప్రాబల్యాల ముందు నిలవలేకపోయినా, తమ ఆశయాల్ని అధికార పార్టీగా మారిన రాజకీయవ్యవస్థ ద్వారా సాధించుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి.అందు వల్లనే ప్రజాశ్రేయస్సుని ఆకాంక్షించే కొన్ని పథకాలనైనా శాసనబద్దంగా అమలులోకి తేగలిగారు. వాటికి రాజ్యాంగరక్షణనీ కలిగించగలిగారు. ఇదే స్ఫూర్తి నేడు కూడా రావాల్సిన అవసరం ఉంది.
రాజకీయవ్యవస్థ రాజ్యాంగ బద్దంగా అధికారాన్ని చేపట్టినా, చేపట్టకపోయినా అధికారంలో ఉన్న వాళ్ళని అదుపులో ఉంచగలుగుతుంది. అందువల్లనే అధికారాన్ని చేజిక్కుంచుకున్న వాళ్ళ ఆశ్రితపక్షపాతం రక్తసంబంధ బంధుజన హితంగా మారిపోతున్నప్పుడు, దాన్ని నిలదీయగలుగుతున్నాం. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగానూ, మరికొన్ని పరోక్షంగానూ ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాల్ని స్వంతంగా ఏర్పాటు చేసుకుని తమ తమ కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నాయి.వీటిని ప్రభుత్వ రంగ నిర్వహణలో ఉన్నవి సమర్థవంతంగా ఎదుర్కోలేకపోగా, అవినీతి, అక్రమాల్ని వెలికితీయడంలో నత్తనడక నడుస్తున్నాయని కూడా చెప్పలేని స్థితికి చేరుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ పథకాల్ని ప్రచారం చేయడానికీ, స్వాతంత్య్రోద్యమ, రిపబ్లిక్‌ దినోత్సవాల్ని, సంస్కృతి పేరుతో కొన్ని మతకార్యక్రమాల్ని విధిగా ప్రసారం చేయడానికీ ఉద్దేశించబడినట్లుగా వ్యవహరిస్తున్నాయి. దీనితో ప్రైవేటు మీడియా ప్రజల్లోకి వేగంగా, శక్తివంతంగా చొచ్చుకుపోగలుగుతోంది. అప్పుడు ఆ మీడియా యాజమాన్యం ప్రజాభిప్రాయాల్ని తమకి అనుకూలంగా మార్చుకునే పనిలో నిమగ్నమవుతుంది. ఇక్కడే అవినీతి రాచబాటపరుచుకుంటుంది. అన్నింటికీ మీడియా కేంద్రంగా మారిపోతుంది. రాజకీయ వ్యవస్థని కూడా శాసించగలుగుతుంది. కనుక, మీడియా విధివిధానాలపై ముందుగా మేధావులు, ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి దాన్ని ఒకగాడిలో పెట్టాలి. అప్పుడే ప్రజాస్వామ్య రాజకీయవ్యవస్థ సక్రమంగా నడవడానికి ఒక చక్కని మార్గాన్ని సూచించినట్లవుతుంది.
మీడియాని నియంత్రించడానికి లేదా కొన్ని విధివిధానాల్ని రూపొందించడానికి శాసనవ్యవస్థ సక్రమంగా పనిచేయాలికదా అనే అనుమానం వస్తుంది. నిజమే, ఇటు రాష్ట్రస్థాయిలో శాసనసభ, కేంద్రస్థాయిలో లోక్‌సభ వివిధ చట్టాల్ని రూపొందించేందుకు వినియోగించాల్సిన సమయం వైయక్తిక ధూషణలకే పోయేట్లు కావాలనే రాజకీయ గూఢుపుఠాణం ఏదైనా జరుగుతుందేమోననేది ఆధారాలతో సహాప్రజలకు తెలిసేటట్లు చేయగలగాలి. ప్రభుత్వం కూడా అసెంబ్లీ, పార్లమెంటు శాసనాల రూపకల్పనలో, ప్రజాసమస్యల చర్చలో ఆ యా ప్రాతినిథ్య సభ్యులు వినియోగించుకున్న సమయాల్ని ప్రకటించాలి. శాసనసభ సమావేశాల్లో కేవలం రాజకీయపార్టీ నాయకులకే మాట్లాడే సమయం అత్యధికంగా కేటాయించడం, ఆ యా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించేవారికి తగినంత సమయం కేటాయించకపోవడం, రాజకీయపార్టీలు వారి స్వేచ్చను హరించేయడం కూడా రాజకీయవ్యవస్థ భ్రష్టుపట్టడానికి కారణమౌతుంది. ఈ వ్యవస్థను సరిదిద్ది, స్వేచ్చగా ప్రతిసభ్యుడూ పార్టీ కనుసన్నల్లోనే మాట్లాడాలనే కఠిననియమాల్ని సంస్కరించగలిగినప్పుడు రాజకీయవ్యవస్థలో మంచిఫలితాల్ని ఆశించవచ్చు.
శాసనసభ పనితీరుని విశ్లేషించుకునేటప్పుడే, రాష్ట్రంలోను, కేంద్రంలోను వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి ప్రాతినిథ్యం కోసం ఉద్దేశించిన విధానమండలి, రాజ్యసభ సభ్యుల ఎంపికపట్ల మౌలికమైనమార్పులు రావాలి. వారిని ఎంపికచేయడంలో గవర్నర్‌, రాష్ట్రపతులకు రాజకీయపార్టీల ప్రమేయాన్ని మించిన స్వేచ్చ ఉంటే బాగుంటుంది. ఒకవేళ అలాగే జరిగి మేధావుల్నే ఎంపిక చేసినా, వారి అభిప్రాయాల్ని ఆ యా సభల్లో వినిపించగలిగినా, వాటిని ఆచరణలోకి తీసుకోవాలనేమీ లేనప్పుడు ప్రయోజనమేమి ఉంటుందనుకోవచ్చు. కానీ, నేడు ప్రత్యక్షప్రసారాల వ్యవస్థలో మీడియా పోటీపడుతోంది. దేన్ని ప్రసారం చేస్తుంది, దేన్ని చేయడం లేదనే విషయంలో కొన్ని అనుమానాలున్నా, అన్ని వేళలా అలాగే జరుగుతుందనే నిరాశ కూడా మంచిది కాదు. అందువల్ల ఆ యా సభల్లో మేధావులు చర్చించిన ప్రజోపయోగ విషయాల పట్ల ప్రజలు చైతన్యవంతమౌతారు. కనుక, రాజకీయపార్టీలే మేధావుల్ని ఎంపికచేసే ప్రక్రియలోనే మార్పు రావడం రాజకీయవ్యవస్థ బాగుపడడానికి కనిపించే మరో అవకాశం.
రాజకీయవ్యవస్థ సక్రమంగా ఉండాలన్నా, అక్రమమార్గంలో పోతుందన్నా దానికి మేధావులే ప్రధాన బాధ్యులని చెప్పుకుంటున్నాం. అయినా వారి అభిప్రాయాల అమలుకి కూడా రాజకీయపార్టీలతో కూడిన ప్రభుత్వమే ఆధారం కావల్సి రావడం వల్ల మేధావులు కూడా వక్రమార్గానికి పోతున్నారనిపిస్తుంది. దర్యాప్తు సంఘాలు, ప్రత్యేక కమిటీల్లో మేధావులు ఉంటున్నారు. కానీ, రాజకీయ పార్టీలు, వ్యక్తుల ప్రభావాలకు లోనైయ్యేవాళ్ళు వాళ్ళకు అనుగుణంగా సత్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆ కమిటీలో ఒకరిద్దరు నిజాయితీ పరులున్నా, నిస్సహాయ స్థితిలో వాళ్ళకి అనుకూలంగా మారిపోవడమో, దానిలో ఇమడక బయటపడటమో జరుగుతుందనిపిస్తుంది. అటువంటి వాళ్ళు తమ తెలివితేటల్ని ఉపయోగించి వ్యవస్థ ని బాగుచేయాలనే అన్వేషణలో నిరాశా నిస్పృలకులోనైయ్యే వాళ్ళు, తమకు తోచిన మార్గంలో పనిచేసేవాళ్ళు ఉన్నారు. అలాంటివాళ్ళు ప్రజాసంఘాలు, విప్లవ సంఘాలతో మమేకమైపోతున్నారనిపిస్తుంది. అక్కడ  తమ భావాల్ని కొన్ని వ్యవస్థాపరమైన ఇబ్బందులున్నా స్వేచ్చగా వ్యక్తీకరించగలుగుతున్నారు.వ్యక్తిగత ఆస్తుల్ని రద్దుచేయాలనీ, ఆర్థికవ్యవస్థలో లోపాల్ని సరిదిద్ది, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని ఎన్నాళ్ళగానో మొత్తుకుంటున్నారు. నిజానికి ఆచరణలోకి రాగలిగితే రాజకీయ వ్యవస్థ వెంటనే సక్రమవ్యవస్థగా రూపొందగలుగుతుంది. కార్పోరేట్‌ మెంటాలిటీ గల వ్యక్తులు అఖిలభారత సర్వీసుల్లో చేరి, రాజకీయనాయకులకు ఇచ్చే సలహాలు ప్రజా సంక్షేమ దృష్టితో కాకుండా, అధికారంలో ఉన్న లేదా ప్రాభల్యంలో ఉన్న అతికొద్దిమంది ప్రయోజనాలకు అనుగుణంగా విధానాల రూపకల్పన జరగకుండా ఆదిలోనే అడ్డుకట్టవేయడం సాధ్యమౌతుంది. ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో అత్యంతముఖ్యమైన సంక్షేమానికి సంబంధించిన విధానాలను రూపొందిస్తున్నట్లు కూడా కనబడుతున్నా వాటిలోనూ వివిధ కాంట్రాక్టుల రూపంలో రాజకీయ నాయకులకు, వారి అనుచరగణానికి ఉపయోగపడేటట్లు ఉండడాన్ని గమనించాల్సి ఉంది. దీన్ని నియంత్రించగలిగే వ్యవస్థకూడా ఏర్పడుతుంది.
ప్రజాస్వామ్యం ద్వారా అధికారాన్ని సాధించే క్రమంలో ఏర్పడిన కొన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో అధ్యక్ష స్థానం కోసం జరిగే సంస్థాగత ఎన్నికలు కేవలం ఒక నామమాత్రపుతంతుగా నిర్వహిస్తూ, ప్రజాస్వామ్యభావనకే కళంకం తెచ్చేటట్లు నియంత్రంగా వ్యవహరిస్తున్నాయి. వంశపారంపర్యతను, కుటుంబ, బంధువుల, కుల వారసత్వాలను వ్యవస్థీకృతం చేస్తున్న రాజకీయపార్టీలను బాగుచేయాలని భావించడం నేతిబీరకాయలో నెయ్యివెతికినట్లేనేమో! అందువల్ల చిన్న పార్టీలు అంటే ఓటింగ్‌ శాతం తక్కువ రావడం వల్ల అలా పిలవబడుతున్నవీ, భావసారూప్యం గల రాజకీయపార్టీలు ఒక ఫ్రంట్‌గా ఏర్పడి రాజకీయ ప్రక్షాళనకు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు రాగలుగుతాయంటే, అందులోనూ ప్రాంతం, కులం, భాష తమ తమ ఆధిక్యాన్ని ప్రదర్శించడం జరుగుతోంది. మరోవైపు ఇలాంటి పార్టీలన్నీ ఏకం కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు, ఆకర్షణలు విరివిగానే జరుగుతున్నాయి. దీనితో పాటు ఏవో కొన్ని ప్రత్యేక మినహాయింపులు, రాయితీల ఒప్పందంతో ఏకమైనా, అధికారంలోకి రాగానే కుమ్ములాటలు బయలుదేరడంతో ప్రజలు మళ్ళీ ‘‘స్థిరత్వం’’ పేరు చెప్పుకునే రాజకీయపక్షాల వైపే మొగ్గుచూడవలసిన నిస్సహాయ స్థితిలోకెళ్ళిపోతున్నారు. వటవృక్షంలా అల్లుకుపోయిన రాజకీయవ్యవస్థను చిన్న చిన్న పార్టీలని పిలవబడుతున్నవీ, సామాజిక ఉన్నత లక్ష్యమనే భావ సారూప్యం గల పార్టీలు ఒక ఫ్రంట్‌గా ఏర్పడి, కేవలం అధికారం కోసమే కాకుండా, అధికారం పేరుతో చెలాయిస్తున్న అవ్యవస్థను ప్రజల ముంగిటకు తెచ్చి, ప్రజల్ని చైతన్యవంతం చేయడమే మన ప్రజాస్వామ్య రాజకీయవ్యవస్థను బాగు చేయడానికి ఉన్న గొప్ప ఆయుధం అనుకుంటున్నాను. దీనికి మేధావులే ముందో, వెనుకో ఉండి నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  

1 comment:

Anonymous said...

మన దేశం రాజఱికాన్ని వ్యతిరేకించి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన దేశం కాదు. మన రాజఱికాల్ని బ్రిటీషువారు అంతం చేశాక ఏం చేయాలో పాలుపోక ప్రజాస్వామ్యంలోకి వెళ్ళిన దేశం. అందుచేత ఇక్కడ ప్రజాస్వామ్యం అరాచకంతో సమానంగా మారింది. యూరోపియన్, జపనీస్ లేదా థాయ్ ప్రజాస్వామ్యాల్ని తీసుకుంటే రాజులే చొఱవ తీసుకొని ప్రజాస్వామ్యసూత్రాల్నీ, నిబంధనల్నీ రూపొందించడానికి సహకరించినట్లు కనిపిస్తుంది. అంటే ఆ దేశాల్లో రాజఱికానికీ ప్రజాస్వామ్యానికీ మధ్య ఒక సంధిదశ (transitional phase) నడిచింది. ఆ దశని దగ్గఱుండి అమలుపఱచినది రాజులే. కానీ మనకు అలాంటి దశేమీ లేదు. స్వాతంత్ర్యపోరాటం అనే ఒక అరాచకం నుంచి మార్గదర్శకత్వం లేని ప్రజాస్వామ్యమనే మఱో అరాచకానికి మనం ప్రయాణించాం.

వినడానికి వైరుద్ద్యం (paradox) లా కనిపించినా అసలు వాస్తవమేంటంటే ప్రజలకు ప్రజాస్వామ్య జీవనసూత్రాల్ని అలవాటు చేయాలంటే మొదట్లో ఒక ప్రాజ్ఞుడైన నిరంకుశ రాజో, నియంతో అవసరం. ఆ తరువాత అలాంటివారి అవసరం లేకుండానే ప్రజలు ఆ సూత్రాల ఆధారంగా తమను తాము నియంత్రించుకోవడం నేర్చుకుంటారు. పైన పేర్కొన్న దేశాల్లో జఱిగినది ఇదే.