"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

20 March, 2009

దళిత సాహిత్యం --మౌలిక భావనలు : వచన కవిత్వం

--డా//దార్ల వెంకటేశ్వరరావు అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం, గచ్చిబౌలి, హైదరాబాదు-46, 09989628049, vrdarla@gmail.com

1.5.3 దళిత వచన కవిత్వం:

కులం వల్ల కలుగుతున్న సమస్యలను వర్ణిస్తూ వచన కవిత్వం అధిక స్థాయిలోనే వచ్చింది. నేటికీ పత్రికల్లో, పుస్తకాలలో ప్రచురితమవుతూనే ఉంది. గేయం కుల సమస్యను ఆధారం చేసుకొన్నా, ఆర్థికాంశాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. గేయాలు పాడిన/రాసిన వారే వచన కవిత్వాన్ని కూడా రాశారు. కానీ, వారి వచన కవిత్వం ప్రధానంగా కుల సమస్యపైనే దృష్టిని కేంద్రీకరించబడింది. మూలవాసీ సిద్ధాంతాన్ని మాష్టార్జీ ప్రతిపాదించారు. దళితులు నాగజాతికి చెందిన వారనే వాదాన్ని సవేరా ప్రచారం చేశారు. ఇలా వచన కవిత్వం కూడా వర్గ స్పృహతోనే ప్రారంభమయినా, తరువాత కాలంలో కులాన్నే కేంద్రీకరించుకొని వర్గ, మత వివక్షలను సైతం వ్యతిరేకిస్తూ వచ్చింది.



"చిక్కనవుతున్న పాట' (1995) తెలుగు సాహిత్యంలో ఒక కదలికను తెచ్చింది. తరువాత, దళిత కవిత్వం పూలే, అంబేడ్కర్తాత్విక భావజాలంతో, చైతన్యవంతంగా అనేక కవితా సంకలనాలు, సంపుటాల రూపంలో వెలువడింది. 1995లోనే కవితా సంకలనాలు ఎక్కువగా రావడం దళిత కవిత్వంలో ఒక చారిత్రక పరిణామం. సంవత్సరంలోనే కేశవ కుమార్, కె. సత్యనారాయణల సంపాదకత్వంలో "‘‘దళిత మేనిఫెస్టో', పట్టేటి రాజశేఖర్, నాగప్ప గారి సుందర్రాజు సంపాదకత్వంలో’‘ "గుండె డప్పు', సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంపాదకత్వంలో "బహువచనం' కవితా సంకలనాలు వచ్చాయి. ఇదే సంవత్సరంలో వచ్చిన మద్దూరి నగేష్బాబు వెలివాడ', కత్తి పద్మారావు "జైలుగంటలు',జూలూరి గౌరీశంకర్ "పొలికట్టె', సుంకర రమేష్బాబు తల్లి కోడి హెచ్చరిక' సతీష్చందర్‘‘"పంచమ వేదం'వంటివి పేర్కొనదగినవి.



వీటితో పాటూ కత్తి పద్మారావు ‘‘"నల్లకలువ'‘‘ (1996) ‘‘"భూమి భాష'‘‘, ‘‘"కట్టెల మోపు’‘', ఎండ్లూరి సుధాకర్‘‘"వర్తమానం'‘‘, ‘‘"కొత్త గబ్బిలం’‘', ‘‘"నల్ల ద్రాక్షపందిరి'‘‘, ‘‘"వర్గీకరణీయం'‘‘, ‘‘"అటాజనికాంచె'‘‘ (2005), పైడి తెరీష్బాబు ‘‘"అల్ప పీడనం'‘‘ (1996), చిన్ని ‘‘"ఒళ్ళు కడుక్కుందాం రండి'‘‘ జి.వి. రత్నాకర్‘‘"మట్టి పలక'‘‘, ‘‘"అట్లేటి అల'‘‘, గ్యార యాదయ్య ‘‘"ఎక్కోషి'‘‘, దార్ల

వెంకటేశ్వరరావు ‘‘"దళిత తాత్వికుడు'‘‘ (2004), ప్రసాద్మూర్తి ‘‘"కలనేత', "మాట్లాడుకోవాలి',’‘ చల్లపల్లి స్వరూపరాణి ‘‘"మంకెన పూవు',’‘ నాగప్పగారి సుందర్రాజు ‘‘"చండాల చాటింపు'‘‘, బన్న ఐలయ్య ‘‘"నిప్పు కణిక'‘‘ మొదలైనవి దళిత వచన కవిత్వంలో వస్తు, శిల్పాలలో వైవిధ్యాన్ని ప్రదర్శించాయి. వి. సిమ్మన్న, కొండపల్లి సుదర్శనరాజు వెలువరించిన’‘ "దళిత కవిత'‘‘ (1991)ను అనేకదళిత కవితలను ఒక చోటకు చేర్చిన మొదటి కవితా సంకలనంగా కొందరు పేర్కొంటున్నారు.


ఎస్‌.సి. వర్గీకరణ నేపథ్యంలో మాల, మాదిగలు పరస్పరం తమ అవకాశాల కోసం ఒకరినొకరు విమర్శించుకుంటూ వెలువడిన కవితా సంకలనం, సంపుటాలు వచ్చాయి. "‘‘మాదిగ చైతన్యం', "వర్గీకరణీయం', "ఒకే గొంతు', "దండోరా'‘‘ మొదలైనవాటిలో రకమైన కవిత్వం ఉంది..దళిత కవిత్వాన్ని విమర్శిస్తూ "చకోనా" సంపాదకత్వంలో ‘‘"పాట చిక్కబడుతుందా?'‘‘ (1996) అనే కవితా సంకలనం కూడా వెలువడింది.

వచన కవిత్వాన్నంతటినీ చూసినపుడు వస్తు, శిల్పాలలో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. సలంద్ర ‘‘"దళిత మేనిఫెస్టో' ‘‘కవితలో వర్గ స్పృహతో కూడిన కుల ప్రతిఘటన చైతన్యం కనిపిస్తుంది.

""నన్ను

చచ్చిన శవాల ముందు

దహన సంస్కారాలే చూసుకోమన్నావ్

సరే,

ఎలాగైతేనేం,

నీ ప్రాణాల్ని కూడా

ఎలా పాతేయాలో

నాకు తెలియడమే బాగయిది.'' -

అంటూ దళితులకు ప్రతికూలాంశాలైనవి, అనుకూలాంశాలుగా మార్చుకొని చైతన్యంతో పోరాటపటిమను ప్రదర్శించారు.

చాతుర్వర్ణ వ్యవస్థలో దళితులకు అవకాశం లేకుండా చేసిన తీరుని వర్ణిస్తూ బొజ్జాతారకం --

""నాకై కవిత లేదు

నాకు చరిత లేదు

నాలుగు వేదాలలోంచి

నాలుగు పాదాలలోంచి

నన్ను తొలగించారు'' -- అని వర్ణించారు.

అలాంటి దళితుడు ఆత్మ గౌరవం కోసం పోరాడిన పరిణామాలను కలేకూరి ప్రసాద్‌ "పిడికెడు ఆత్మ గౌరవం' కోసం కవితలో ఇలా అంటారు.

""త్రేతా యుగంలో నేను శంబూకుణ్ణి

ఇరవై రెండేళ్ళ క్రితం నా పేరు కంచికచర్ల కోటేశు

నా జన్మ స్థలం కీలవేణ్మణి, కారంచేడు, నీరు కొండ . . .

ఇప్పుడు కరడు గట్టిన భూస్వామ్య క్రౌర్యం

నా గుండెల మీద నాగేటి కర్రులతో

పచ్చబొడిసిన పేరు చుండూరు

ఇక చుండూరు నామవాచకం కాదు, సర్వనామం

. . . . . . . . .

అవమానాలకు, అత్యాచారాలకుక, మానభంగాలకు

చిత్రహింసలకు గురై

పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తినవాణ్ణి''

దళితులు హిందుమతం నుండి అన్యమతాల వైపు ఆకర్షింపబడటానికి గల కారణాలను కూడా కవులు వర్ణించారు.

""మీ వేదాలు ఆలకించినందుకు

సీసం పోయించుకుని దిబ్బళ్ళెత్తిన

నా చెవులకు నా మసీదు, నా సిలువ

అమృతం చిలికే

నాలుగు ఆప్తవాక్యాలు చెప్పి

ధార కట్టిన నా కన్నీటిని

పైట చెంగుతో తుడిచాయి'' --

అని చల్లపల్లి స్వరూపరాణి మతాంతరీకరణకు గల కారణాలు కవిత్వీకరించారు

వందలాది సంవత్సరాలు వర్గపోరాటంలో భాగంగా ప్రాణాలర్పించినా, కుల సమస్యను విస్మరించి, వర్గ సమస్యే ప్రధానమన్న మార్క్సిస్టులను కూడా వ్యతిరేకిస్తూ దళిత కవిత్వం వచ్చింది. అలాగే, ఒకప్పుడు దళితులను దగ్గరకు చేర్చుకున్న క్రైస్తవ మతంలో కూడా కులం రాజ్యమేలడాన్ని మద్దూరి శాంతయ్య "ఓసీ క్రీస్తు'లో నిరసిస్తూ కవిత్వం రాశారు. కవితను ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ముఖచిత్రంలో ప్రచురించడం ఒక చారిత్రక సందర్భంగా చెప్పుకోవచ్చు. వర్గీకరణ నేపథ్యంలో ఎండ్లూరి సుధాకర్‘‘"కొత్త గబ్బిలం', "వర్గీకరణీయం'‘‘ వంటి కవితా సంకలనాలని వెలువరించారు.

దళిత కవిత్వంలో మినీకవితలు కూడా కనిపిస్తున్నాయి. దళిత నానీలు, హైకూలు కూడా రాశారు. దీర్ఘకావ్యాలు కూడా వచ్చాయి. ఇలా వచ్చిన దళిత కవిత్వం వస్తు, రూపాలలో తెచ్చిన వైవిధ్యం తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయి కాగలుగుతుంది. దళిత కవిత్వంలో వచ్చిన శిల్ప వైవిధ్యాన్ని పాశ్చాత్య సాహిత్యంతో అన్వయించి జి. లక్ష్మీనరసయ్య అనేక వ్యాసాలు రాశారు. వాటిలో పౌరాణిక నేపథ్యం (Mythopoeic), వ్యక్తిత్వారోపణ (Personification), ఉల్లేఖన (Allusion), నాటకీయ స్వగతం (Dramatic Monologue), సంభాషణా శైలి (Conversational Style), పునరుక్తి (Repetition), అపరిచియిత్వీకరణ (De-Formalization), విరోధాభాసం (Paradox), అసాధారణ పోలిక (Conceit), స్థానభ్రంశం (Displacement), స్థానికత లేదా దేశీయత (Nativity), పురాణ ప్రతీకలు (Mythological symbols) మొదలైన శిల్ప పద్ధతులలో దళిత కవిత్వం శిల్ప వైవిధ్యాన్ని ప్రదర్శించింది.

దేవరాజు మహారాజు, ఎండ్లూరి సుధాకర్మొదలైనవాళ్ళు ""దళిత ఆత్మకథా'' ప్రక్రియను పరిచయం చేశారు. పైడి తెరీష్బాబు ""దళిత గజల్''ను ప్రారంభించినా కొనసాగలేదు. ఆయనే కవిత్వాన్ని క్యాసెట్‌ (హిందూ మహాసముద్రం) రూపంలో అందించడానికి ప్రయత్నించినా , పాటకున్నంత ఆదరణ దీనికి లభించలేదు. దళిత సాహిత్యలో ఇంకా ప్రదర్శనానుగుణ సాహిత్య ప్రక్రియలు రావలసి ఉంది.

2 comments:

Afsar said...

ee vyaasam baagundi. chivaralo anna maata -pradarsnaanuguna saahityam - raavaalanna maata ippati dalita saahityaaniki voka direction ni soochistondi. adi manchi/avasaramayina direction.

ika- dalita-Muslim (andhra,telangana, raayala seema anna tedaa lekundaa) anusandhaana saahityam koodaa marinta raavaalani naa korika. darla laanti vimarsakulu aa disa vaipu aalochanalni teesuku vellaali.

afsar

Darla said...

సర్, నమస్తే..మీ అభిప్రాయం ఇప్పుడే చదివాను. మీ సూచనలు ఆచరణీయం. ధన్యవాదాలు...మీ దార్ల. 10.1.2022