"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

13 November, 2007

సాహిత్యం లో స్త్రీ జీవిత చిత్రణ: భావజాల ప్రభావం











- డా//దార్ల వెంకటేశ్వర రావు

మన ప్రాచీన తెలుగు సాహిత్యం స్త్రీని ఒక భోగ వస్తువుగా చిత్రించటంలో భావజాలం ప్రాత్ర చాలా ఉంది. రామాయణం, మహా భారతం, భాగవతం, ప్రబంధాలు, శతకాలు మొదలైన వాటిన్నింటిలోనూ ఈ భావజాల ప్రభావం ఉంది.సర్వ సాధారణంగా భావజాలం దేశ , కాలానుగుణంగా రూపొందుతుంది. మన భారత దేశంలో వేదాలు, స్మృతులు, పురాణాల రూపంలో హిందూభావజాలం ఉంది .

ఇది తరువాత కాలంలో ” హిందూ ధర్మ సూత్రాలు” గా ప్రచారం పొందింది. ఈ భావజాలం ప్రధానంగా వర్ణ,లింగభేధాలతో రూపొందింది. కొన్ని వర్ణాలవారిని కర్మపేరుతో ఇంచుమించు బానిసలుగానే మార్చుకున్నారు.రామాయణకాలంలో కర్మ సిధ్ధాంతాన్ని వ్యతిరేకించినందుకు శంబూకుడు మొదలైన వార్ని మరణశిక్షవిధించటానికీ వెనుకాడకపోవటానికీ ఈ భావజాల ప్రభావమే ప్రధాన కారణం. ఈ భావజాల ప్రభావమే ‘ ఆదర్శం’ పేరుతో సీతాదేవిని అగ్నిప్రవేశం చేసేలా పురిగొల్పింది. అన్ని చేసినా శ్రీరాముడ్నే సీతాదేవి ‘ తన దైవం’గా భావించటంలోనూ భావజాల ప్రభావం ఉంది. పరిశోధన దృష్టితో చూస్తే హిందూ భావజాలాన్ని ఆధారంగా చేసుకొని స్త్ర్రీని పురుషుడు తనబానిసగా ఎలా మార్చుకున్నాడో స్పష్టమవుతుంది.
హిందూభావజాలంలో జెండర్ సమస్య సామాన్యమైనదికాదు. స్త్రీని శూద్రురాలుగా పరిగణించారు. ఒకప్పుడు మహోన్నతమైన సింధూనాగరికతా కాలం నాటికి మాతృస్వామ్య వ్యవస్థ ఉండగా, ఆర్యులు భారత దేశంలో ప్రవేశించిన తరువాత,నెమ్మదినెమ్మదిగా పితృస్వామిక వ్యవస్థకు పయనించేటట్లు చేయగలిగారని పరిశోధనలు తెలుపుతున్నాయి.కారల్ మార్క్స్,ఏంగిల్స్ , డి.డి.కోశాంబి, రోమిల్లాథాపర్ , ఆర్ . ఎస్. శర్మ తదితరుల పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. ఆనాటి సమాజంలో అధిక సంఖ్యలో స్త్ర్రీదేవతలు పూజింపబడినా , క్రమేపీ పురుష దేవుళ్ళు పూజలందుకోవటం ప్రారంభించిన తరువాత స్త్ర్రీ దేవతల స్థానం అధమస్థాయికి పోవటం లోనూ ఈ భావజాలం పాత్ర ఎంతో ఉంది.
మన తెలుగులో నీతిశతకాలు పేరుతో కొన్నిశతకాలను పిలుస్తున్నారు . అంతే కాకుండా” నీతి శతకములు సర్వజన హితకరములైనవి…విషయ బాహుళ్యమును బట్టి నీతి శతకములు సర్వజనపఠనీయములగుచున్నవి” ( డా. జి. నాగయ్య ‘ తెలుగు సాహిత్య సమీక్ష , రెండవ సంపుటి. 1996: 568) అనే అభిప్రాయంలో ఈ శతకాలు ప్రచారం లో ఉన్నాయి. శతకాల్లో నీతి లేక పోలేదు. కానీ , ఆ నీతి అందరికీ సంబంధించిందికాదు. అది ప్రధానంగా పురుష దృక్పథం నుండి రూపొందింది.
నీతి శతకాల్లో ఒక విశేషమేమిటంటే , వాటిలో కొన్ని సార్వ జన ,సార్వకాలిక నీతులుంటాయి . వాటిని చూపుతూ తమభావజాలాన్ని చాలా జాగ్రత్తగా అందరిలో ఇంజెక్ట్ చేస్తుంటాయి . 16, 17 శతాబ్దాల్లోనే అనేక అభ్యుదయభావాలను వివిధ పద్యాలుగా వెదజల్లిన వేమన పద్యాల్లోనూ స్త్రీ పట్ల చాలా నిరసన భావాలు కనిపిస్తాయి. అయితే , అందులో వేమన చెప్పిన అసలు పద్యాలెన్ని అనేది నేటికీ పరిశోధనాంశాల్లో నలుగుతునే ఉంది. ఆ పరిశోధన ఫలితాలు తెలిసే వరకూ మాత్రం స్త్రీ పట్ల వ్యక్తమైన వేమన భావాలు స్త్రీని అవమానించే విధంగానే ఉన్నాయని భావించక తప్పదు. “నీతి శతకాల్లో ఎడనెడ కొంత నీతి కనిపిస్తున్నప్పటికీ స్త్రీల విషయంలో చాలా తప్పుడు భావాలను కలిగి ఉన్నాయి… సుమతీ, వేమన శతకాల్లో చాలా వరకు సంస్కృత శతకాల ప్రభావం ఉంది” అని కత్తి పద్మారావు గారు (భారతీయ సంస్కృతిలో స్త్రీ 1993: 172) అనటంలోనూ భావజాల ప్రభావం శతక కర్తల పై ఉందని తెలుస్తుంది.
సాధారణంగా ప్రతి సాహిత్యం ,సాహిత్య ప్రక్రియా ఆ సమాజ పరిస్థితులకు అణుగుణంగానే రూపొందుతుంది. అలాగే మన తెలుగు సాహిత్యం కూడా సృజనీకరించబడింది. కనక, ఆనాటి సమాజ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ సాహిత్యాన్ని విమర్శించాలనే ఒక నియమం విమర్శకుల్లో ఉంది. ఆ పద్ధతిలో సాహిత్యాన్ని అంచనా వేయటమే సద్విమర్శ అవుతుంది . ప్రాచీన సాహిత్యమంతా పాతచింతకాయ పచ్చడని కోట్టేయడానికీ వీల్లేదు. కానీ , ‘గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్’ అంటే మాత్రం ఒప్పుకోలేరు! ఎప్పుడూ ఒక కాలం లో వచ్చిన సాహిత్యం నుండిఅందరూ గ్రహించవలసినవి కొన్ని మాత్రమే ఉంటాయి. ఎప్పుడూ సర్వజన హితం, సర్వకాలయోగ్యంగా ఉంటాయని భ్రమించటం మాత్రం అవగాహన రాహిత్యమే అవుతుంది. ఆ అవగాహననే అందరిపై రుద్దాలనుకున్నప్పుడు సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. ప్రాథమిక పాఠశాలల్లో నీతి పద్యాలు పెట్టాలనుకుంటున్నారు. మంచిదే. కానీ, ఎలాంటి పద్యాలు పెడతారో గమనించవలసి ఉంది. లేక పోతే చిన్న నాటి నుండే బాలబాలికల్లో విష భీజాలను నాటడానికి ప్రయత్నించడమే అవుతుంది. అది పెరిగి పెద్ద జెండర్ సమస్యగా మారుతుంది.



( ప్రజాకళ మార్చి 2007 సౌ జన్యంతో... పునర్ముద్రితం )

No comments: