"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

16 August, 2007

'గుక్క' పట్టిన తెలంగాణ పోయిట్రీ ఒక ఎమెర్జెన్సీ పోయిట్రీయే!



( ది 23-9-2005 న దట్స్ తెలుగు లో 'తెలంగాణ అస్తిత్వానికి 'గుక్క ' పేరుతో ఈ సమీక్ష ప్రచురితమైంది. దీన్ని కొన్ని మార్పులు చేసి మళ్ళీ ఇక్కడ ప్రచురిస్తున్నాను.)


సాధారణంగా సమాజాన్ని అవగాహన చేసుకున్న ఆధునిక కవి గొంతులో ప్రజల ఆర్తి పలుకుతుంది. తన అస్తిత్వం ఏమిటో అంచనా వేసుకోవటం కనిపిస్తుంది. అత్యవసర పరిస్థితి ధ్వనిస్తుంది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుండి వస్తున్న కథల్లో, కవిత్వంలో ప్రాంతీయ అస్తిత్వం పట్ల స్పష్టమైన దృక్పథం వ్యక్తమవుతుంది. కవికి దృక్పథం ఉండటం వల్ల తన కవిత్వం ఎవరి కోసమో, తన కవిత్వ ప్రయోజనం ఏమిటో గుర్తెరిగినట్లవుతుంది. కాసుల ప్రతాపరెడ్డి ఈ కోవలోనే తెలంగాణ అస్తిత్వం కోసం నిజాయితీతో ఉద్యమప్రాయంగా కవిత్వం, కథలు, వ్యాసాలు రాస్తున్నారు. తెలంగాణ కథలు, కవిత్వంపై వచ్చిన వ్యాసాలను పుస్తకాలుగాను అందుబాటులోకి తెస్తున్నారు.
'భౌగోళిక సందర్భం', 'కొలుపు', 'తెలంగాణ తోవలు', 'తెలంగాణ కథ - దేవులాట' వంటి వ్యాససంపుటాల్లో గానీ, తన కథల పుస్తకం 'శిలువకు తొడిగిన మొగ్గ'లో గానీ, ఇప్పుడు ప్రచురించిన 'గుక్క' కవితాసంపుటిలో గానీ దేన్ని చూసినా తెలంగాణ బాగోగుల గురించిన తపన కనిపిస్తుంది. తన తెలంగాణ చరిత్ర, సంస్కృ తుల పట్ల ప్రేమతో కూడిన బాధ్యత ప్రతిఫలిస్తుంది. కాసుల ప్రతాప రెడ్డి గారు రాసిన విమర్శవ్యాసాల్లో, కథల్లో తనకి కావాలిసిన దేమిటో చాలా చోట్ల వాచ్యంగానే, స్పష్టంగానే, ధైర్యంగానే నిలదీసి అడిగినట్లు ఉంటుంది. కవిత్వంలో మాత్రం అందరిచేతా తెలంగాణ సమస్యను, ఆవేదనను అవగాహన చేయించి, అనుభవింపజేసి, తన వాదనను అంగీకరింపచేసేలా ప్రయత్నిస్తారు.
ఈమధ్య 'గుక్క' పేరుతో ఒక దీర్ఘ కవితా సంపుటిని ప్రచురించారు. దీనిలో ''గుక్క' దీర్ఘకవితతోపాటు ఈ పుస్తకంలో మరికొన్ని కవితలూ ఉన్నాయి. తెలంగాణా సంస్కృతినీ, జానపద పౌరాణిక, చారిత్రక గాథలనూ, సందర్భాలనూ, చివరికి చిన్నపిల్లలు, పెద్దవాళ్ల నోళ్లలో కూనిరాగాలయ్యే పాటలను కూడా తన కవిత్వంలో అంతర్భాం చేసి, తల్లి తెలంగాణ 'గుక్క' పట్టి దుఃఖిస్తున్న దయనీయ దృశ్యాన్ని చూపిస్తారు. గ్రంథ ముఖచిత్రంలో కూడా నెత్తి బాదుకుంటూ రోదిస్తున్న స్త్రీమూర్తిగా "తల్లి తెలంగాణ"ని స్ఫురింపజేస్తుంది.

స్వాతంత్య్రానికి ముందూ, ఆతర్వాత తెలంగాణలో జరిగిన పోరాటాలు చారిత్రాత్మకమైనవి. స్వరూప స్వభావాల్లో తేడాలున్నా సిద్ధాంత నేపథ్యం మాత్రం పీడన, పరాయీకరణల నుండి విముక్తి కోరుకోవటమే తెలంగాణా పోరాటాల తత్త్వం!
"చినిగిన బట్టలేసి కుట్టిన నేల
మొగుల కింద గన్నుల కోలాటాలు
పెయ్యంతా తూట్లే తూట్లు'' అని కవి కాసుల ప్రతాపరెడ్డిగారు వర్ణించడంలో తెలంగాణ ప్రాంత పరిస్థితి కండ్లకు కట్టినట్లుంది.
"బట్టలేసి కుట్టిన నేల'' అనే ప్రయోగం చేయడంలో గొప్ప ఔచిత్యం ఉంది. తెలంగాణ ప్రాంతంలో వివిధ రాజ్యాధికార జెండాలు ఎగిరిన చారిత్రక స్థితిగతులను స్ఫురింపజేస్తున్నారు.
స్వాతంత్య్రానికి పూర్వం నిజాం సంస్థానంలో తెలంగాణ, మరఠ్వాడా, కర్ణాటకలో గల భిన్న ప్రాంతాలతో, భిన్న సంస్కృతులతో నిండి, అధిక శాతం తెలుగు మాట్లాడే వాళ్లున్నా 'ముక్కు మొగం లేని దిక్కుమాలిన తెలుగువాళ్లు' (తెలంగీ బేడంగీ)గా ఎగతాళికి గురికాబడ్డారు తెలుగు వాళ్ళు.
రజాకార్ల దురంతాలు, దాని నుండి రక్షించుకొని భూస్వాముల దురంతాల నుండి కాపాడుకోవడానికి సాయుధ పోరాటం చేయటం జరిగింది . 1948 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం చర్య తీసుకుంది. 1950లో ముందుగా పౌరప్రభుత్వం, తర్వాత 1952లో సాధారణ ఎన్నికలు జరగాయి.ఆ తరువాత హైద్రాబాదు రాష్ట్రం ఏర్పడడం మొదలైన చారిత్రక సంఘటనలు జరిగాయి. ఇలా తెలంగాణ ప్రాంతలో అనేక అధికార జెండాలు మారాయి. ఆ తర్వాత అప్పటికే కుంఫిణీ వ్యాపారులు వాళ్ల సౌలభ్యం కోసం తెలుగు మాట్లాడే వాళ్లందరినీ ఒక ప్రాంతంగా కాకుండా, సర్కారు జిల్లాలు, దత్తమండలాలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలవారిని మద్రాసు ప్రెసిడెన్సీలో కొంతమందిని విభజించటంతో తెలుగువాళ్లు, మద్రాసు ప్రెసిడెన్సీలోనూ భాషా సంస్కృతుల పట్ల వివక్షను ఎదుర్కోవలసి వచ్చింది.అనేక రంగాల్లో వెనుకబాటుతనాన్ని గుర్తించగలిగారు. ఈ పరిస్థితుల్లో తెలుగు మాట్లాడే వాళ్లంతా ఒక రాష్ట్రంగా ఏర్పడాలనే భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన ఆకాంక్ష హైదరాబాద్‌ స్టేట్‌గా ఉన్న తెలంగాణను, మద్రాస్‌ ప్రెసిడెన్సీలో బాధితులైన తెలుగువాళ్లను కలిసిపోవడానికి ప్రేరేపించింది. ఇక్కడ 'విశాలాంధ్ర' ఉద్యమం వరకూ ముందున్న తెలంగాణను పరిశీలించినా కవి 'చినిగిన బట్టలేసి కుట్టిన' అనే ప్రయోగ ఔచిత్యం వెల్లడవుతుంది.
సాయుధ పోరాటంలో, నేటి నక్సల్‌ (మావోయిస్టు) రాజకీయాల్లో ప్రభుత్వం తరఫు నుండీ, నక్సల్స్‌ నుండీ జరుగుతున్న కాల్పులను , పోతున్న ప్రాణాలను 'మొగులు కింద గన్నుల కోలాటం'గా చెప్పడంలో, కురవవలసిన న మేఘాలు, చల్లదనం అందించవలసిన మేఘాల కింద నెత్తురు చారికలకు కవి ఆవేదనకు అక్షరరూపమే ఇదంతా ! దీనిలో ఒకానొక చారిత్రక పరిణామం, దాని ఫలితంగా దయనీయంగా మారిన తెలంగాణ బతుకు చిత్రాన్ని చూపగలిగారు కవి.
గతానికీ, వర్తమానానికీ ముడివేస్తూ
'పత్తి పంటల మీద పురుగుల మందు
పొలాల నిండా కొయ్యకాళ్లే
పర్రె కాలువలేవి, చెరువు ఊటలేవి?
మింటికీ ఒంటికీ ఏకధారగా కురుస్తున్న చీకటి
రెక్కలిరిగినై, కాల్లు విరిగినై
చిలుకెగిరిపోతున్నది, ఎగిరిపోతున్నది
ఊగరా, ఊగరా!!
వాసాలు అందుకుని ఊగరా'' అని వెలుతురివ్వని, ఆ వెలుతురుని దక్కనివ్వని పోరాటాల స్థితిగతులను చెబుతూ ప్రస్తుత తెలంగాణ స్థితికి ఆవేదనతో కుమిలిపోవటం కనిపిస్తుంది. ఇంతకు ముందే ప్రసిద్ది చెందిన కవి రాసిన కవితాపాదాలను (ఊగరా, ఊగరా!! ) ఉపయోగించుకోవడంలో గొప్ప శిల్పం ఉంది. ఈ కుమిలి పోవడాన్ని తెలంగాణలోని ప్రతిపౌరుడి గొంతుగా వర్ణంచారు కవి. త్యాగాలకు దక్కిన ఫలితం పేదరికమేనా కూడా అని ప్రశ్నిస్తున్నారు.
విశాలాంధ్ర ఉద్యమం, పెద్దమనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు అన్నీ తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపించగలవని అనుకున్నా, వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా కనిపించడం పట్ల కూడా కవికి ఆవేదన ఉంది. ఈ నేలపై ఉంటూ ఈ సంస్కృతిలో బతుకుతూ భాషనీ, ప్రజలనూ తక్కువగా అంచనా వేస్తూ, తన నేలపైనే ఒకరకమయిన పరాయాకరణ జీవితాన్ని గడపవలసిన పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నారు కవి. అలాంటి సందర్భాన్ని వర్ణిస్తూ ...
"నీ యావ వేరు
నీ రంది వేరు
నువ్వేమన్నా మా బాస రాసినవా?
మా యాస రాసినవా?
నీ రాతలకు మా తలరాతలకు పొంతనేది?
మనిసివిక్కడ, మనసక్కడ!
పాలు మర్సిన బిడ్డవైతివి, నీకేమెరుక?'' అని నిలదీస్తారు కవి. తెలంగాణ భాషను మాండలికంగా తీసిపారేయటం, సినిమాల్లో హీరోలకు కాకుండా రౌడీ పాత్రల చేత పలికించడం, కించపరచడం వంటివెన్నో జరుగుతున్న నేపథ్యాలన్నింటినీ గుర్తు చేస్తూనే తెలంగాణ ప్రజల మనో భావాలను గుర్తించమంటున్నారు కవి.
తెలంగాణప్రాంతానికి ఈ పరిస్థితి రావడానికి కారాణాలను అన్వేషించమంటూ -
" ఎవరికి పుట్టిన బిడ్డరా అంటే
ఎక్కెక్కి ఏడ్చే తల్లి
ఏ గాలి సోకిందో, ఏ తూర్పు గాలి విసిరిందో
కాకులు దూరిన ఇల్లు
గుడ్లగూబలు చొచ్చిన ఇల్లు'' అని చెప్పడంలో ఆవేశం కూడా ఉంది. ఆ ఆవేశానికి కారణముంది.ఒక వైపు తెలంగాణా ప్రాంతంలోవర్షాలు లేవు. తన నేల నుండే ప్రవహించినా, తన నేల ఉపయోగించుకోలేని దుస్థితిలో గోదావరి జలాలు! దీనికి ఏవో పథకాలంటూ ఇజ్రాయెల్‌, నెదర్లాండ్‌ వ్యవసాయ పద్దతులంటూ చేసినవన్నీ
'పథకాలకు పాతరేసి
, పైసలెత్తుకుపోయిన గద్దలు'గా మారటం విషాదకరం. వ్యవసాయం ఎలా ఉన్నా కనీసం తాగటానికి మంచినీళ్లు దొరకని పరిస్థితి. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఫ్లోరైడ్‌ బారిన పడిన జీవితాలెన్నో! దీన్ని వర్ణిస్తూ-
విషమై పారుతున్న పాతాళగంగ
కాల్లొంకర, కండ్లొంకర
పసి పోరగాల్లయినా పండ్లిగిలిస్తే నల్లని గారలు'' అని ఫ్లోరోసిస్‌ వ్యాధి బారిన పడిన జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. పురాణాలను చూస్తే గంగావతరణకు ఒక కథ ఉంది.దాన్ని తన వర్తమాన తెలంగాణ నీటి సమస్యకు ఉపయోగించుకుంటూ, భగీరథుడు తన వంశాన్ని రక్షించుకోవడానికి తపస్సు చేసి ఆకాశగంగను పాతాళం దాకా ప్రవహించేట్లు చేశారు. వాళ్లకు శాపవిముక్తి అయ్యిందో లేదో తెలియదు గానీ, వందలాది మీటర్ల లోతుల్లోకి తలతాకట్టు పెట్టయినా బోర్లు వేస్తే, వచ్చే నీళ్లు ఫ్లోరోసిస్‌ను తెచ్చి, తెలంగాణ ప్రలజకి విషంగా మారి నీటి శాపం వెంటాడుతున్న విషాద కథలను వినిపిస్తారు.
ఇంత జరుగుతున్నా, పీడితుల పక్షం వహించవలసిన పార్టీలు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించడం పట్ల కూడా అధిక్షేపాన్ని ప్రకటిస్తూ -
"మంత్రమేసెనో, మాయ చేసెనో, మరుగు మందే పెట్టెనో
ఆత్మపంజరంలో పిట్ట
కదం తొక్కుతూ, పదం పాడుతూ
ఎర్రెర్రని పలుకులు, ఎదురొడ్డిన రొమ్ములు
వీరభక్త హన్మంతులు
గుండె చీల్చుకుంటే సూర్యుళ్లే
నిన్ననా, మొన్ననా, ఆవలి మొన్ననా

కాలచక్రం కింద నలిగిన దేహాలెన్నో'' అని చరిత్రలో పోరాటాల వల్ల ప్రాణాలను కోల్పోయిన వారిని గుర్తు చేస్తూ వారి పోరాటాలకు ప్రతిఫలం దక్కాలనే తన ఆశయాన్ని ప్రకటిస్తున్నారు. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం కాదనీ, అలా సోది చెప్పటమో, శాంతి చేయటమో పరిష్కారానికి మార్గం చూపలేవంటూ -
"మార్మానమొచ్చినోడు మదమెక్కి కూస్తుండు
కావాలిసిన ది యిడుపు కాయితాలే'' అనీ, "
ఏరుపడటం తప్ప మాకు వేరు లేదు
నువ్వేంది చెప్పు తీర్పు చెప్పేది
మేమప్పుడే చెప్పినం
మాకు గట్టి గింజలు కావాలె, తాలు మాటలొద్దు''
అని తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇది కేవలం కవి అభిప్రాయమే అనుకోవడానికి వీల్లేదు- తెలంగాణ యావత్తు ప్రజల గొంతుగా భావించ వలసి ఉంది.
ప్రతాపరెడ్డి గారు తన కవిత్వంలో తెలంగాణ సమస్యను జడ్జీ అనే పాఠకుడి మందు లాయర్‌లా తన వాదనాపటిమను ఆర్ద్రంగా వినిపిస్తున్నారనంట్లు ఉంటుంది . 'గుక్క' పట్టి ఏడుస్తున్న తల్లి తెలంగాణ దుఃఖాన్ని ఆపాలంటే ముందుగా నీళ్లు కావాలి. ఆ నీళ్లు దాహం తీర్చాలి. గొంతు తడపాలి. గొంతు తడిసి, దాహం తీర్చి, జీవశక్తి నివ్వగలిగదే నీళ్లు కావాలి. కన్నీళ్లు తుడవాలి. అంటే ప్రత్యేక తెలంగాణ కావాలి. ఆ స్వరాన్ని బాగా విపించ గలిగారు. దాన్ని మంచి శిల్పంతో కూడా వర్ణించారు.
జానపద సాహిత్యంలో ఆణిముత్యం వంటి కథ 'బాలనాగమ్మ' కథ తెలంగాణ ప్రాంతానికి చెందిందే. దీన్ని కవి తన కవిత్వంలో ఉపయోగించుకొంటూ, సంస్కృతిపరమైన కథలను తెలుసుకోమంటూనే చైతన్యానికి ఊపిరి కోణాల్ని చూపుతున్నారు.
"సోది చెప్పవచ్చిన తల్లి
శాంతి చేయాలంటున్నది
కాగల కార్యం తీర్చే గంధర్వులేరి?
బాలనాగమ్మవో తల్లి, తెలంగాణా
చెర విడిపించే బాలవద్దిరాజేడి
?'' అని ఒక చోట రాశారు.
మరో చోట కూడా ఇలాంటి వర్ణనే చేస్తూ "
ఏడేడు సముద్రాలు దాటావా, నా చిట్టి తండ్రీ
మర్రిచెట్టు తొర్రలో చిలుక దొరకనే లేదు
పిడికిలి నిండా పట్టి పిసికేయడానికి
పరిగెడుతూ వుంటావా, ఎక్కడి దాకా?''
అనటంలోనూ, తెలంగాణ సమస్య పరిష్కారానికి చేయవలసిందేమిటో కూడా స్ఫురింపజేస్తున్నారు.
ఇలా కాసుల ప్రతాపరెడ్డిగారి కవిత్వంలో వస్తువుని ఆశ్రయించుకున్న ప్రత్యేక శిల్పాన్ని కూడా వివరించుకుంటూ పోతే కవిత్వనిర్మాణాల్లో ఎన్నో రహస్యాలు బయటపడుతుంటాయి. మీడియాని, జానపద గేయాల్ని, విప్లవ గీతాలను కూడా తెలంగాణ సాధనకు ఎలా వినియోగించుకోవచ్చో తన కవిత్వం ద్వారా రహస్యంగా అందరికీ అందంగా అందిస్తున్నారు. వింటున్న పాటనూ, చూస్తున్న దృశ్యాన్నీ, రమ్యంగా చెబుతున్న కథనీ కూడా తెలంగాణ దృష్టితో చూడగలిగే విశిష్టశైలిని కాసుల ప్రతాపరెడ్డి గారి కవిత్వంలో చూడగలిగే అవకాశం ఉంది.
ఉమ్మడి కుటుంబంలో ఉండటం వల్ల దొరకని ఏకాంతాన్ని వెతుక్కొనే సన్నివేశంలో 'కన్నులో మిసమిసలు కనిపించనీ, గుండెల్లో గుసగుసలు వినిపించనీ' అని హీరోగారు ఓ సినిమా (దేవత?)లో పాడుతుంటాడు. కాసులకవి దీన్ని "కన్నుల్లో బుసబుసలు కనిపించనీ/ గుండెల్లో బాకు దించనీ'' అని అనుకరణరూపంలో కవిత్వమవ్వటం ఓ చైతన్యస్రవంతి శిల్పం నుండి పుట్టిన కొత్త ఊహ!
మరో సినిమా అల్లూరి సీతారామారాజులో తెల్లవాడిని ప్రశ్నిస్తున్న సన్నివేశాన్నే స్ఫురింపజేస్తూ...
"ఎవడు వాడు, ఎచటి వాడు
ఇటువంటి నల్లవాడు
ఎందుకొచ్చిండో ఎరుకలేదాయె
కాకితో కబురైనా పెట్టకుండా వచ్చిన చుట్టమని
అంగలార్చి అక్కున చేర్చుకుంటి
నా నల్లనల్ల రేగళ్ల మీద పచ్చిపుండ్లు పడె''
అని తెలంగాణ సమస్య వైపు దృష్టి మరల్చేటట్లు కవిత్వీకరించారు కవి . సినిమా పాటలనే కాదు విప్లవ పాటలను , పిల్లల్ని ఆడించే జాబిల్లి పాటల్లో కూడా చైతన్యాన్ని నింపే ప్రయత్నంలో
"నీళ్లు మనవిరో, నేల మనదిరో
వాడి ఎవుసమేందిరో, వాడి దున్నుడేందిరో''
, "పైలం కొడుకో, కొమరన్న/ జర భద్రం కొడుకో'' అనటంలో విప్లవ చైతన్యంలోని చైతన్యాన్నీ వినియోగించుకోవాలనే తపన కవిలో ఉంది.
"గొంగట్ల మెతుకులేసి ఏరుకోవడమే
చీకటి అర్రల ఒంటరి మొత్తుకోలు
చందమామ రాకె, జాబిల్ల రాకె'' అనగలిగేదంతా ఆలోచించవలసిందే. సరదా కోసం వీటిని ప్రయోగించడం లేదు. ఒక విశిష్ట ప్రయోజనాన్ని ఆశించే ప్రయోగిస్తున్నారు కవి. గ్లోబలైజేషన్‌ పట్లా, ఆర్థిక సరళీకృత విధానాల పట్లా కూడా కవికి స్పష్టత ఉంది. సమకాలీన తెలంగాణ రాజకీయ పొత్తుల పట్ల కవి అభిప్రాయం ఉంది. తన తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించాలనే ఆర్తి కాసుల ప్రతాపరెడ్డి గారి కవిత్వం నిండా ఉంది. తెలంగాణ ప్రజలందరూ హత్తుకో తగినట్లుగా ఉంది.
కవి, విమర్శకుడు జూలూరి గౌరీశంకర్‌ గారు అన్నట్లు "కాసుల ప్రతాపరెడ్డి కవిత్వంలో భావోద్వేగం, పదునైన ఆలోచనలు ఉన్నాయి. తెలంగాణా పటానికి అల్లుకున్న వలస గూడును తన చేతులతో చీరేసే ప్రయత్నం చేస్తున్నారు''. కవి రచనకు, నిబద్ధతకూ నిత్యం నిదర్శనంగా నిలుస్తూ 'గుక్క' పట్టి దుఃఖిస్తున్న తల్లి తెలంగాణ దాహాన్ని తీర్చమని ఆహ్వానిస్తున్నారు.తెలంగాణ ప్రాంతానికి వచ్చిన ప్రజల 'వలస'ను స్పష్టంగా నిర్వచించవలసిన అవసరం ఉన్నా, సమస్యను పరిష్కరించడం మాత్రం అత్యవసరం అని గుక్క దీర్ఘ కవిత ధ్వనిస్తుంది. దీన్ని సొంత అస్తిత్వానికై 'గుక్క' పట్టిన తెలంగాణ కవిత్వంగానూ, ఇంకా బలంగా చెప్పాలంటే తెలంగాణ పోయిట్రీ ఒక ఎమెర్జెన్సీ పోయిట్రీ అవుతున్న జాడలను గుక్క దీర్ఘ కవిత నిరూపిస్తున్నది.
( గుక్క (కవితా సంకలనం; కవి: కాసుల ప్రతాపరెడ్డి; వెల: రూ. 15/-; ప్రతులకు: అన్ని ప్రధాన బుక్‌ షాపులల్లో)
-డా॥ దార్ల వెంకటేశ్వరరావు

No comments: