"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

20 సెప్టెంబర్, 2026

ఆరుద్ర సాహిత్యం పై ఆచార్య దార్లతో ఇంటర్వ్యూ

 

నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి'20.9.2026 సౌజన్యంతో ... 

సాహితీ లోకానికి చిరస్మరణీయమైన అంజలి — 'నూరు శరత్తులు' (ఆరుద్ర శత జయంతి సంచిక)

మహాకవి, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆరుద్ర శత జయంతి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రముఖ రచయిత డా. హెచ్.ఎస్.వి.కె. రంగారావు గారు ('లహరి') అత్యంత ప్రతిష్టాత్మకంగా తన సంపాదకత్వం, సంకలనంలో  'నూరు శరత్తులు' (ఆరుద్ర శత జయంతి జ్ఞాపక) పేరుతో ఒక విశిష్ట ప్రత్యేక సంచికను వెలువరించారు. దీనికి సహాయ సంపాదకులుగా సి.ఎం.వి.చంద్రకుమార్ వ్యవహరించారు. ఆరుద్ర అరుదైన లేఖలు, ఆయన సాహిత్యంపై వచ్చిన విమర్శనాత్మక దృక్పథాలు, లోతైన పరిశోధనా పత్రాలు, అంతఃరంగిక ఇంటర్వ్యూలు, విశ్లేషణాత్మక వ్యాసాల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ సంచిక అక్షర లోకానికి ఒక అపురూప నిధిగా నిలుస్తుంది.

ఈ ప్రత్యేక సంచికలో  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో 'పరిశోధకుడుగా ఆరుద్ర' అనే అంశంపై 2003లో పీహెచ్.డీ. చేసి డాక్టరేట్ పట్టా అందుకున్న ఆచార్య డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు గారిని, ఆ ప్రత్యేక సంచిక సంపాదకులు హెచ్.ఎస్.వి.కె. రంగారావు గారు  ఇంటర్వ్యూ చేశారు. ఆరుద్ర గారి సాహిత్య దృక్పథం, ఆయన పరిశోధనా విశేషాలు, ఆయన అవలంబించిన పరిశోధనా పద్ధతులు,  సాహిత్య విమర్శలో ఆయన చేసిన అసాధారణ కృషితో పాటు అనేక అంశాలను డాక్టర్ దార్ల ఈ ఇంటర్వ్యూలో ఎంతో లోతుగా, విశ్లేషణాత్మకంగా ప్రస్తావించారు. 

ఆరుద్ర శతజయంతి ఉత్సవాల సందర్భంగా సాహిత్య ప్రియుల కోసం ఈ విశేష ఇంటర్వ్యూను 'నినాదం' సాహిత్య అనుబంధం ప్రత్యేకంగా పాఠకులకు అందిస్తోంది.

— సంపాదకులు, నినాదం


పరిశోధకుడుగా ఆరుద్ర

(ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారితో 'లహరి' ఇంటర్వ్యూ)

లహరి: నమస్తే సార్.

డా. దార్ల వెంకటేశ్వరరావు: నమస్తే.

లహరి: పరిశోధకుడుగా ఆరుద్రపై మీ పరిశోధనకు అభినందనలు. ఎంతో విలువైన సిద్ధాంత వ్యాస రచన అది.

డా. దార్ల: ఓహ్! ధన్యవాదాలండీ.

లహరి: ఆరుద్రది చాలా విస్తృతమైన కృషి, వైపుల్యమూ, వైవిధ్యమూ కూడా ఎక్కువే. తనది అభ్యుదయ దృక్పథమనీ, తాను ప్రధానంగా మార్క్సిస్టునని ఆరుద్ర ప్రకటించుకున్నారు. కవిగా సరే, ఈ దృక్పథం ఆయన పరిశోధనా రంగంలోనూ కనిపిస్తుందంటారా?

డా. దార్ల: చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సందేహాలు అవసరం లేదు. అయితే అనేక ఆధునిక శాస్త్రాలతో, కళా ప్రక్రియలతో, తత్త్వచింతనలతో ఆ దృక్పథాన్ని విశాలం చేసుకున్నారు. ఆయనది ప్రజా దృక్పథం. పరిశీలనలు, పరిశోధనలు, విమర్శలూ, ఆలోచనలూ సామాన్య మానవుడికి అందుబాటులో ఉండాలనే తత్త్వం ఆయనది. అందుకనే ఎంత క్లిష్టమైన విషయాన్నయినా ఆరుద్ర చాలా తేలిక ధోరణిలో, అత్యంత సరళంగా ప్రకటిస్తారు. ఆయనది మార్క్సిస్టు దృక్పథమే! సరళత్వం ఆరుద్ర సృజనాత్మకతకు, పరిశోధనను జనరంజకంగా తీర్చిదిద్దాలనే ఆయన దృక్పథానికీ నిదర్శనాలు. ఈ దృక్పథం ప్రధానంగా ఆయన 'గురజాడ గురుపీఠం', 'వేమన', 'రాముడికి సీత ఏమవుతుంది?', 'ప్రజాకళలు ప్రగతివాదులు', 'వ్యాసపీఠం', 'గుడిలో సెక్స్' రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇతర రచనలూ ఉన్నాయి.


లహరి: వేమన మీద ఆరుద్ర పరిశీలన ఏమిటి?

డా. దార్ల: వేమన తాను అభ్యుదయ ప్రవక్తగా మారి సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించారు. వేమన జన్మతః శైవుడైనా శైవమతంలో కన్పించే దురాచారాల్ని ఖండిస్తూ ఆటవెలది పద్యాలు చెప్పాడని ఆరుద్ర నిరూపించారు. వీటిలో కొన్ని భావాలు బాల్యం నుంచే వేమన మీద తీవ్ర ప్రభావం చూపించి ఉంటాయనీ, ఆస్తికుల తత్త్వాల కన్నా నాస్తికుల దర్శనాలే ఆదర్శవంతంగా ఉన్నట్లు వేమనకు అనిపించిందన్నది ఆరుద్ర భావన. చార్వాకులతోటి, లోకాయతశాస్త్రంతోటీ ప్రగాఢ పరిచయం ఏర్పరచుకోవడం వల్ల వేమనలో భౌతికదృష్టి ఏర్పడిందంటారు ఆరుద్ర. ఈ దృష్టి కలగడం వల్లనే వేమన పరలోకాన్ని ఖండించాడనీ, ధనం మనిషి జీవన స్థితిగతులకు మూలమవుతుందని వేమన గ్రహించాడంటారు. ఈ దృక్పథం వల్లనే ధనిక, పేదల మధ్య వ్యత్యాసాల్ని గుర్తించడమే కాకుండా పేదవాడికి ధనాన్ని పంచి పెట్టడానికి కీడుతలపెట్టయినా, ముచ్చటించైనా, కపటం చేతనైనా, తెగింపు చేతనైనా ధనవంతుడి సిరిని చేజిక్కించుకుని నిరుపేదకు పంచి పెట్టడం మంచిదనే విప్లవ ధోరణి వరకూ వేమన తత్త్వ చింతన వెళ్ళిందని ఆరుద్ర భావన.

లహరి: అయితే వేమనవి వేల కొద్దీ పద్యాలు చెలామణిలో ఉన్నాయి. ఆయన ప్రస్తావించని విషయం లేదు. తను చెప్పడానికి అనువైన పద్యాలనే ఆరుద్ర వ్యాఖ్యానానికి ఎంచుకున్నారని స్పష్టం. అది కూడా ఆరుద్ర దృక్పథాన్ని తెలుపుతుంది కదా!

డా. దార్ల: వేమన ఒక పద్యానికి ఆరుద్ర వ్యాఖ్యానం ఇది- 

"బాపడనగనేమి? భక్తుడనగనేమి? 

భోగియనగనేమి సొంపులేక 

 ఎన్నిపేరులైన ఇనజుడు పనితీర్చు 

విశ్వదాభిరామ వినురవేమ". తమ కులాలకు ఎన్ని పేర్లు పెట్టుకున్నా అందరి పనీ యముడు పడతాడు. లోకమంతా ఒకే కుటుంబం, లోకులంతా ఒకే కుటుంబంలోని వ్యక్తులు. ఎవరూ పంక్తి బాహ్యులు కారు. అందరూ ఒక్క కంచాన తింటే అన్ని బాధలకూ హేతువైన కులభేదం రూపుమాసిపోతుంది. సఖ్యత ఉంటుంది. ఈ సత్యాన్ని లోకులు విశ్వసించేటట్టు తలమీద చేయివేసి ప్రమాణపూర్వకంగా చెప్పరా? అని ఆదేశం. (ఇటీవల కాలంలో సామ్యవాద సాధకులైన వామపక్షాలవారు కూడా తమ పార్టీ సభ్యులు ఒకే కమ్యూన్లో ఆరగించాలని నియమం పెట్టుకున్నారు) అని బ్రాకెట్టుల్లో కూడా తన వైయుక్తిక అభిప్రాయాన్ని వ్యాఖ్యానంలో చెప్పటం ఆరుద్ర విమర్శలో మార్క్సిస్టు దృక్పథం కన్పించడం సందేహాలకు చోటు లేకుండా చేస్తోంది.

'సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర'లో కూడా వేమనను చారిత్రక, సామాజిక దృక్పథాల నుండి పరిశీలించినా, తులనాత్మక పరిశీలన కన్పిస్తున్నా అవన్నీ మార్క్సిస్టు విమర్శనా దృక్పథానికి అంతర్భాగంగానే కొనసాగాయి. 

'వ్యాసపీఠం'లో ఆరుద్ర భగవద్గీత మీద చేసిన వ్యాఖ్యానాలూ ఆయన మార్క్సిస్టు దృక్పథాన్ని స్పష్టం చేస్తాయి.

'భగవద్గీత' వర్ణ వ్యవస్థను సంరక్షించే గ్రంథమని, దీనివల్ల సమసమాజ నిర్మాణం సాధ్యం కాదనీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న భగవద్గీతను ముగ్గురు వ్యక్తులు వేర్వేరు కాలాలలో రచించారని ఆరుద్ర అభిప్రాయం. ఆ ముగ్గురు ఎవరో పేర్లు ప్రకటించలేదు. ప్రథమాచార్యుడు, ద్వితీయాచార్యుడు, తృతీయాచార్యుడు అనే అన్నారు. కొన్ని చారిత్రక కారణాల వల్ల ప్రథమాచార్యుడు ఉన్నత వర్గాల ప్రయోజనం కోసం 'గీత' రచన చేస్తే, రెండవ ఆచార్యుడు తాత్త్వికుల కోసం, మూడవ ఆచార్యుడు ఆర్తులకోసం, జిజ్ఞాసువుల కోసం ఈ గీత రచన చేసి అన్యదేవతా భక్తులను తన దైవానికి భక్తులను చేయదలిచాడని ఆరుద్ర వివరణ.

ప్రథమాచార్యుడు క్రీ.పూ. 600 కు పూర్వుడనీ, ద్వితీయాచార్యుడు క్రీ.పూ. 600-500 మధ్యకాలాలకు చెందినట్లు పేర్కొన్నారు. వర్గ, వర్ణరహిత సమాజం తృతీయాచార్యుడు క్రీ.పూ. 300-200 మధ్యకాలాలకు రావాలనే దృక్పథమే ఈ వ్యాసంలో ప్రధాన ప్రతిపాదన.

లహరి: గురజాడ మీద ఆరుద్ర దృక్పథంలోని ప్రత్యేకత ఏమిటి?

డా. దార్ల: జీవితం పట్ల, సాహిత్యం పట్ల గురజాడకున్న గంభీరమైన దృష్టి, సాహిత్య శిల్పకళా దృక్పథం, ఆయన సువిశాల మానవీయత ఎందరో ప్రతిభావంతులను ఆకర్షించింది. శెట్టి ఈశ్వరరావు, శ్రీశ్రీ, డాక్టర్ సి. నారాయణరెడ్డి - నవ్యాంధ్ర సాహిత్యానికి ఇద్దరు యుగకర్తలుగా గురజాడతో బాటు రాయప్రోలునూ భావించినా - కె.వి.ఆర్., గురజాడ మీద ఎంతో విలువైన ఆలోచనలు అందించారు. అగ్రశ్రేణి పరిశోధనలు విమర్శనాత్మకంగా, పరిశోధనగా కొనసాగించారు. గురజాడ జీవితాన్ని, రచనలనూ ఆరుద్ర చారిత్రక, తులనాత్మక విమర్శనా పద్ధతులను ఉపయోగించుకొని, గురజాడ అప్పారావు రచనల్లో కన్పించే అభ్యుదయ దృక్పథాన్ని, లక్ష్యాన్నీ నిరూపించారు.

గురజాడలో వేమన ప్రభావంతో బాటు పింగళి సూరన కళాసిద్ధాంత ప్రభావం కూడా కనిపిస్తుందంటారు ఆరుద్ర. గురజాడ చేసిన స్వతంత్ర రచనలో కళాసిద్ధాంతాల్ని, వేమన సామాజిక స్పృహనీ ఆకళింపు చేసుకున్నాడని నిక్షిప్తం చేయడంలో ఆరుద్ర పరిశీలన లోతైనది.

గురజాడ కంటే ముందుగా తెలుగు సాహిత్యంలో సామాజిక స్పృహ గల కవులుగా వేమన, వీరేశలింగం గార్లు కన్పిస్తున్నా వేమనను సంస్కరణవాదిగా, వీరేశలింగంగారిని ఆధునికాంధ్ర సాహిత్య నిర్మాతగా, గురజాడను 'ఆధునికాంధ్ర సాహిత్య జనకుడు'గా, శ్రీశ్రీని అభ్యుదయ సాహిత్య యుగకర్తగా ప్రకటించడం ఆరుద్రకు తెలుగు సాహిత్యం పట్ల గల లోతైన అవగాహనను తెలుపుతుంది.

లహరి: ఆరుద్ర తరంలో కె.వి.ఆర్., రా.రా., త్రిపురనేని మధుసూదనరావు గార్లు శక్తివంతమైన విమర్శకులుగా పేరు పొందారు. సోమసుందర్ విమర్శనాత్మక రచనలు విరివిగా చేశారు. ఆరుద్ర ప్రధానంగా పరిశోధకుడా? విమర్శకుడా? ఈ రెండింటికీ తేడా ఏమిటి?

డా. దార్ల: 'పరిశోధన' అనే పదానికి చాలా విస్తృతమైన పరిధి ఉంది. సత్యాన్వేషణ దీని ప్రధాన లక్ష్యం. పరిశోధనలో అనేక స్థాయిలు కూడా ఉన్నాయి. సేకరణ, వర్గీకరణ, విశ్లేషణ, సిద్ధాంతీకరణ, నూతన సిద్ధాంత స్థాపన, తులనాత్మక అధ్యయనం వంటి స్థాయిలన్నీ పరిశోధనలో ఉంటాయి.

దీంట్లో శాస్త్రపరిశోధన, కళాపరిశోధన రెండూ విలువైనవే ఉన్నాయి. సాహిత్య పరిశోధన కళాపరిశోధనల పరిధి కిందకే వస్తుంది. శాస్త్ర పరిశోధనలలో భౌతిక సత్యానికీ, కళా పరిశోధనలలో దార్శనిక సత్యానికీ ప్రాధాన్యత ఉంటుంది. అయితే కళా రంగంలో పరిశోధనలు చేసే వారికి కొన్ని కొన్ని ‘దృక్పథాలు' ఉంటాయి. ఆ దృక్పథాల ననుసరించి వారి పరిశోధనలలో భిన్న ఫలితాలు వస్తాయి. శాస్త్ర పరిశోధనలలో భిన్న ఫలితాలు రావు. అయితే పరిశోధనలలో పరిశోధకుడి వైయుక్తిక దృక్పథం కన్నా ఆ రచన వెలువడడానికి కారణమైన అన్ని పరిస్థితులనూ చూడగలిగే, పరిశీలించగలిగే మార్గమే ముఖ్యం.

విమర్శలో నాలుగు ప్రధానాంశాలు కనిపిస్తాయి. విశ్లేషణ, తులనాత్మక పరిశీలన, వ్యాఖ్యానం, నిర్ణయం. దీంట్లో విమర్శకుని 'అభిరుచి' కూడా ఉంటుంది.

ఆరుద్ర పరిశోధకుడు, విమర్శకుడు రెండూ. ఆయన దృక్పథం మార్క్సిస్టు విమర్శనా దృక్పథమే అని ఆయన రచనలను పరిశీలించిన ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. అయితే నిర్మొహమాటంగా చెప్పవలసినది తత్త్వంగా, లేదా బాగా అలవాటు చేసుకున్నదిగా కనిపిస్తుంది.

లహరి: ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రచనలో 'సమగ్రత' విషయం ఏమిటి? చిన్న సన్నాయి నొక్కుడు ఉంది కదా!

డా. దార్ల: (నవ్వారు). ఉంటుంది. దేనికైనా ఆ నొక్కుడు మంగళకరమే. సమగ్రత అంటే ఒక కాలంలో అవతరించిన ప్రతి రచననూ తెచ్చి కుక్కటం కాదు. సాహిత్యం ప్రారంభమైంది మొదలుకొని సంపుటాలు వెలువడినంతవరకున్న సాహిత్యం అంతటినీ అందించేదని భావించకూడదు. ఆరంభం నుండి, అన్ని సంపుటాలు వెలువడిన నాటి వరకూ సాహిత్యంలో గుర్తించదలచిన వాటిని విస్మరించకుండా రచన కొనసాగించగలగడం. ఆనాటి సాహిత్య స్పృహను, అవగాహన కల్పించడానికి ప్రయత్నించడం ఒక స్వరూపాన్ని, అవగాహనను కల్పించడంగా భావించాలి. ఆరుద్రే పదమూడవ సంపుటిని ముగిస్తూ 'స్వస్తివాచకం'లో చెప్పుకున్నట్లు సాహిత్య చరిత్రకు ముగింపు అంటూ ఉండదు. 'సమగ్రత' అంటే తెలుగు సాహిత్య ఆరంభవికాసాల్ని అవగతం చేసుకోవడానికి జరిగిన ప్రయత్నంగా గుర్తించాలి. సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర తొలిముద్రణల పీఠికలో గిడుగు సీతాపతిరావు గారు వెలుబుచ్చిన అభిప్రాయం- "ఆరుద్ర రచించిన గ్రంథాల్లో అన్ని విషయాలు సమగ్రంగా చర్చించడానికి అవకాశం కలిగింది. '... సమగ్ర శబ్దము సాపేక్షము' ఒక దృష్టిలో చూసినట్లయితే ఎంత విపులంగా రాసినా ఏదీ సమగ్రమవ్వదు. పదమూడు సంపుటాల్లో ఎంత వరకు సాధ్యం కాగలదో అంతవరకూ వీరి సాహిత్య చరిత్ర రాశారని" అన్నారు.

లహరి: కొందరు కవులను ఉటంకిస్తూ ఆరుద్ర వీరిని వదిలిపెట్టాడని ఆరుద్ర 'సమగ్రత'ను విమర్శించిన వారు పరిశోధక పరమేశ్వరుడు శ్రీ నిడదవోలు వెంకటరావు గారు.

డా. దార్ల: అది తొందరపడి చేసిన విమర్శే. అయినా నిడదవోలు వారో, మరొకరో పేర్కొన్న కవుల్ని అందర్నీ సాహిత్య చరిత్రకారుడు పేర్కొనాలనేది ఏమీ లేదు. కావ్య విలువల్ని బట్టి ఆ రచనను సాహిత్య చరిత్రలో ఉటంకించాలో వద్దో రచయిత విచక్షణ నిర్ణయిస్తుంది. ఈ విషయాన్ని మరింత విపులంగా నా థీసిస్ లో చర్చించాను.

లహరి: ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర అనుసరించిన యుగ విభజన పద్ధతి...

డా. దార్ల: అబ్బా! ఇది చాలా పెద్ద విషయం. ఎందరెందరో దిగ్దంతులు ఎన్నెన్నో వ్యాఖ్యలు చేశారు. వాటినన్నిటినీ పేర్కొని, ఒక్కొక్క ఆక్షేపణను నా సిద్ధాంత వ్యాసంలో చర్చించి ఆరుద్ర దృక్పథాన్ని వివరించే ప్రయత్నం చేశాను. ఆరుద్ర చాలా వివేచించుకున్నాక తన సాహిత్య చరిత్రలో రాజుల, పోషకుల పేర్లను అనుసరించే యుగవిభజన చేశారు. ఆంగ్ల సాహిత్య చరిత్రలో యుగ విభజన కాలాన్ని అనుసరించి, చారిత్రక పరిస్థితుల్ని క్రమంగా అధ్యయనం చేయడానికి వీలుగా రాజుల, పోషకుల్ని అనుసరించి చేశారు. అయితే ఈ విభజనలో ఆయన ఏకసూత్రతను పాటించలేదు. ఉజ్జాయింపు ప్రణాళిక అనీ, మరికొన్ని మార్పులు చేసిన యుగవిభజన అనీ, మొదట్లో వేసుకున్న ప్రణాళిక అనీ చాలాసార్లు యుగవిభజనని మార్పు చేశారు.

చరిత్రకైనా, సాహిత్య చరిత్రకైనా కాల స్పష్టత, కాలం చాలా ముఖ్యమైంది. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో కాలానుసరణమని, చారిత్రక సామాజిక అంశాల్ని మిళితం చేసి సాహిత్య చరిత్రని రచించినా కాలాన్ని స్పష్టంగా చెప్పకుండా, రాజుల పాలనా కాలాన్ని పేర్కొని, యుగవిభజన చేసి రచన కొనసాగించారు. కాల నిర్దేశంలో వివిధ రాజుల పాలనా కాలాలు కలిసిపోవడం వల్ల స్పష్టంగా గీతగీసినట్లు చెప్పకుండా తప్పించుకున్నారు. కానీ, సురవరం ప్రతాపరెడ్డి చేసిన యుగవిభజన ప్రభావం ఆరుద్రలో కన్పిస్తుంది. ఒక కాలంలోని ఒక ప్రసిద్ధ కవి పేరును బట్టి యుగవిభజన చేసినవారు ఉన్నారు. ఇది వైయుక్తిక దృష్టికోణమే. ఇలాంటి యుగ విభజన కూడా విమర్శల పాలైంది. యుగ విభజన సమంజసంగా ఉండడమనేది కూడా ఒక్కొక్క చరిత్రకారునికి ఒక్కో ప్రణాళిక ఆధారంగా ఉంటుంది.

లహరి: చాలా థాంక్స్ సార్. మీ అమూల్య సమయం వెచ్చించి ఆరుద్ర గురించి ఎన్నో విలువైన విషయాలు మాకు అందించారు. చివరగా ఒక ప్రశ్న: ఒక పరిశోధకుడుగా ఆరుద్ర చాలా విలువైన వ్యక్తి. అది ఇంకా మనం అంటే మేం గుర్తించదగినంతగా గుర్తించడం జరగలేదు. ఆ కోణంలో ఆరుద్ర గురించి మీ పరిశోధన ఎన్నో విలువైన అంశాలను పరిశీలించి, విశ్లేషించి సమన్వయ పరచింది. ఇది చాలా శ్రమతో కూడుకున్నది. ఇంత విలువైన సిద్ధాంత వ్యాసాన్ని మీరెందుకు విస్తృత పాఠకుల దృష్టికి తీసుకురాలేదు? సిద్ధాంత వ్యాసాన్ని మీరెందుకు ప్రచురించలేదు?

డా. దార్ల: అంటే నేను ఎందుకు ప్రచురించలేదు? అని మీరు అడుగుతున్నారు. పుస్తక ప్రచురణ అనేది చాలా కాంప్లికేటెడ్ వ్యవహారం. అది నా చేతుల్లోని విషయం కాదు. దాని మీదకు ఎందుకో నాకు మనసు పోలేదు. కానీ, ఆరుద్ర మనకు అవసరం. ఆరుద్రకీ మనం అవసరం. సమాజం మీద ప్రభావం కలిగించగల రచయిత ఆరుద్ర.

లహరి: నమస్తే. మీ కృషికి విస్తృత పాఠకలోకాదరణ కలగాలని ఆశిస్తాను.

డా. దార్ల: థ్యాంక్యూ సర్! చూద్దాం.


కామెంట్‌లు లేవు: