ఈ శతకం చాలా బాగుంది సార్. అత్యంత సరళమైన పదాలను పాఠకుల కోసం అందించారు. భావం కరిగి భాష్యమైనట్టు, అక్షరాలు కదలి జీవిత బాటైనట్టు ఉంది. ఈ పద్యాలు సమాజంలోని ప్రతి వ్యక్తి చదవవలిసిన అవసరం ఉంది. సమయపాలన, క్రమశిక్షణ,క్షమ,ఓర్పు,మాట పొదుపు.. ఇలా మంచి గుణాలను, మంచి విషయాలను ప్రతిపాదిస్తూ రాశారు.
నిప్పు తననుతా దహించు నిశ్చయముగ
ప్రక్క నున్నవి గాల్చును వరుస తోడ
కోపమున్నచో బుద్ధియు కుంటు పడును
దారిచూపించునట్టిది దార్లమాట
పద్యం-(26)
ఇక్కడ దహించే నిప్పుని ఉపమానంగా చేసుకుని, కోపం తనను ఎంతలా దహిస్తుందనే విషయాన్ని పోల్చుతూ చెప్పారు. చదివే పాఠకుడికి భావస్ఫురణ వెంటనే వస్తుంది.
కఠిన వాక్కులు పల్కిన కలుగు కీడు
మెత్తని మాటలు పల్కిన మేలు కలుగు
పూల బాటగ మార్చును బ్రతుకు నంత
దారి చూపించునట్టిది దార్లమాట.
పద్యం-(32)
ఇక్కడ వాక్పారుష్యం గురించి చెప్పారు. ఒక మాట వల్ల వచ్చే అనర్థాలు,లాభాల గురించి వివరించారు. ప్రస్తుత సమాజంలో సంభాషణ సామర్థ్యం లేకపోతే,మాట పొదుపు లేనట్లైతే కీడు కలుగుతుంది. అనే విషయాన్ని సున్నితంగా మృదువైన పదాలు వాడారు.
చేయి జారిన నీరును చేర్చ వశమె
గడచి పోయిన కాలము కలుగు నొక్కొ
సమయ ముండగ పనులను సలుప
వలయు
దారి చూపించునట్టిది దార్లమాట.
పద్యం-(35)
చేయి జారిన నీరు, గడిచిన కాలం వెనక్కి తీసుకురాగలమా. చక్కటి పోలికతో సమయం విలువను తెలియజేశారు. ప్రతీ క్షణం విలువైనదే నీటి బిందువులా అంటూ చెప్పారు.
- కోట విజయ్ కుమార్, ఎం.ఏ. తెలుగు , యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, 31.1.2026
ఇలా చాలా మంచి పద్యాలు ఉన్నాయ్. నాకు నచ్చిన పద్యాలను నేను ప్రస్తావించాను. పాఠకుల కోసం, విద్యార్థుల కోసం ఈ పుస్తకాన్ని ఆన్లైన్ లో
ఈ-బుక్ గా అందించిన గురువుగారు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారికి చాలా ధన్యవాదాలు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి