"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

04 జనవరి, 2026

తెలుగు సాహిత్యంలో రెండు ‘నెమలి కన్నులు’ : ఒక ప్రయోగం (పరిశోధన వ్యాసం:డా.జె.వి.చలపతిరావు)

తెలుగు సాహిత్యంలో రెండు ‘నెమలి కన్నులు’ : ఒక ప్రయోగం (ఆచార్య దార్ల ఆత్మకథ, కవిత్వంలో వస్తువు – శిల్ప ప్రయోగాలు)

 

-      డా.జె.వి.చలపతిరావు,

అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు విభాగం,

కాకరపర్తి భావనారాయణ కళాశాల (స్వయంప్రతిపత్తి),

విజయవాడ. ఎన్.టి.ఆర్.జిల్లా, ఆంధ్రప్రదేశ్.

 

పత్రసారాంశం

తెలుగు సాహిత్యంలో అనేక ప్రయోగాలు జరిగాయి. పద్యకవిత్వంలో జరిగిన ప్రయోగాలను చిత్రకవిత్వంగా విమర్శకులు చెప్తారు. అక్కడ వస్తువు పారమార్ధికం.ఆధునిక కవిత్వంలో కూడా ప్రయోగాలు జరిగాయి. కానీ, ఇక్కడ వస్తువు సామాజికం. ఇదొక రకమైన ప్రయోగమైతే, ఒక రచయిత తన రెండు వేర్వేరు ప్రక్రియల్లో రాసిన రెండు పుస్తకాలకు ఒకే పేరు పెట్టడం చెప్పుకోదగిన ఒక ప్రయోగం. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారి కవిత్వం, ఆత్మకథలకు ఒకే పేరు ‘నెమలి కన్నులు’ అని పెట్టారు. దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే రెండింటిలోను వస్తువులో కొన్ని పోలికలు కనబడతాయి. కొన్ని ప్రయోగాలు కనిపిస్తాయి. సాధారణంగా ఆత్మకథ వచనంలో లేదా పద్యం (కవిత్వం)లో ఉంటుంది. కానీ, దార్ల వారి ఆత్మకథ వచనంలోనే ఉన్నట్లు అనిపించినా, కవితాత్మకమైన శైలిలో ఉంటుంది. ప్రతి భాగంలోను కనీసం ఒక వచన కవితను అంతర్భాగం చేయడం కనిపిస్తుంది. మరొకవైపు తన జీవితానికి సంబంధించిన సంభాషణలు, సన్నివేశాలు వివరించేటప్పుడు వాటిని సంభాషణలుగా వర్ణించేటప్పుడు కాల్పనికతను ప్రదర్శించారు. ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క కథలా అనిపిస్తూనే, ఒకదానితో మరొకదానికి విడదీయరాని బంధాన్ని కలిగి ఉంటుంది.ఇలాంటి ప్రయోగాలు ఎన్నో దీనిలో కనిపిస్తాయి. అలాగే, ఈయన ప్రచురించిన ‘నెమలికన్నులు’ కవిత్వం కూడా ప్రయోగాలతో ఉంది. అది వచన కవిత్వమే అయినా, దానికి రాసిన తన నేపథ్యం కవితాత్మకంగా ఉంటుంది. వచన కవితలతో పాటు, మినీ కవితలు కూడా కలిపివేశారు. ప్రతి ఒక్కరికీ బాల్యం ఉంటుంది. మనిషి ఎదిగిన తర్వాత  బాల్యాన్ని తలచుకోవడమూ కనిపిస్తుంది. ఇది ఒక అనుభూతుల దొంతర. ఆ అనుభూతులను రమణీయంగా వర్ణించగలిగి, జీవితాలకు ఆదర్శంగా నిలవగలిగితే ఆ సాహిత్యానికి పరమప్రయోజనం ఉన్నట్లవవుతుంది. అటువంటి జీవితం, రమణీయమైన శైలి, ఆధునిక సమాజానికి కావలసిన వస్తువు ఆచార్య దార్లవారి కవిత్వం, ఆత్మకథలలో ఉన్నాయి. ఆధునిక సమాజాన్ని పట్టి పీడిస్తున్న కులం వల్ల పొందే అవమానాలు కనిపిస్తాయి. కొంతమంది అగ్రకులాల్లో వారు కూడా తనని ఎలా ప్రోత్సహించేవారో కూడా చెప్పుకున్నారు. వాటిని ఆచార్య దార్ల ఎదుర్కొన్నతీరు సమాజాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో తెలుపుతుంది. ఒక కులనిర్మూలన సిద్ధాంతం కనిపిస్తుంది. ముఖ్యంగా దీనిలోని బాల్యం అందరి బాల్యంగా సాధారణీకరిస్తుంది. వీటిని తులనాత్మక సాహిత్య పరిశోధన పద్ధతిలో ఈ వ్యాసంలో వివరించాలనుకుంటున్నాను.

(కీలకపదాలు: నెమలికన్నులు, దార్ల వెంకటేశ్వరరావు, కులనిర్మూలన, దళిత ఆత్మకథ, ఆధునిక సామాజిక ఉద్యమం)

నెమలికన్నులు పేరు ఒక ప్రయోగం:

        డా.దార్ల వెంకటేశ్వరరావుగారు తన కవిత్వ సంపుటికీ, ఆత్మకథకు ఒకే పేరు పెట్టడం ఒక ప్రయోగం. కవిత్వ సంపుటిని 2016లోను, ఆత్మకథను కస్తూరి విజయం వారు 2023లోను ప్రచురించారు.  నాకు తెలిసినంతవరకు రెండు ప్రక్రియలకు చెందిన వేర్వేరు రచనలకు ఒకేపేరుని ఎవరూ పెట్టలేదు. కానీ కొద్ది తేడాతో  కాళోజీ మాత్రం తన కవితలకు ‘‘నాగొడవ’’ అనీ, తన ఆత్మకథకు ‘‘ఇదీ నాగొడవ’’ అనీ పేరు పెట్టాడు. కవితలను కాళోజీ ఫౌండేషన్ వారు 2001లో ప్రచురిస్తే,  ఆత్మకథను స్వేచ్ఛాసాహితీ వారు 1995లో ప్రచురించారు.

  డా.దార్ల వెంకటేశ్వరరావు తాను ఇలా పేరు పెట్టడానికి గల కారణాలను తన బ్లాగు (https://vrdarla.blogspot.com)లో వివరిస్తూ ‘‘నెమలి కన్నీరు  దుఃఖానికి, కలవరానికి ప్రతీకగా వాడబడుతుంది. నెమలి కన్నీరు అనేది భావనాప్రపంచంలో ఒక ఉదాత్తమైన భావోద్వేగానికి సూచికగా భావస్తారు.దార్ల వెంకటేశ్వరరావు గారు తన కవిత్వాన్ని సామాజిక చైతన్యానికి ఉపయోగపడేలా రాశారు. ఆయన కవిత్వంలో వ్యక్తిగత కష్టాలే కాక, సమాజంలో అణచివేయబడ్డ వారి బాధలు, ఆకాంక్షలు, పోరాటాలు ప్రతిఫలిస్తాయి.వాటిని సాధారణీకరించడం కవిత్వం ప్రత్యేకత."నెమలి కన్నులు" అనే పేరు ఆయన కవితాసంపుటికి పేర పెట్టడం ద్వారా తన లోతైన  భావోద్వేగాలను, అతని రచనల వెనుక ఉన్న బాధను, సమాజం పట్ల ఉన్న హృదయస్పందనను తెలియజేశారు. ఆయన జీవితమూ కష్టనష్టాలతో కూడుకున్నదని, వ్యక్తిగతంగా అనుభవించిన బాధలు, వివక్ష, పోరాటాలు కూడా ‘నెమలి కన్నీటి’లా మౌనంగా, లోతైన బాధలతో నిలిచిపోయినా, వాటిని అధిగమించి, నెమలిని చూడగానే కనిపించే ఆ నెమలిఈకలలోని రకరకాల రంగుల్లా, గొప్ప దశకు చేరుకున్న స్థితిని సూచించేందుకు ఈ పేరును కొనసాగించారు. ఈ పేరు ద్వారా తన జీవిత అనుభవాలను కేవలం వ్యక్తిగత స్థాయిలో కాక, సామాజిక స్థాయిలోనూ ప్రతిబింబించాలనుకున్నారు. ఇది తెలుగు సాహిత్యంలో ఒక ప్రయోగంగా కూడా చెప్పుకోవచ్చు.’’ అని రాసుకున్నారు.  దీన్ని బట్టి తెలుగు సాహిత్యంలో ఇదొక ప్రయోగంగా తెలుస్తుంది.

దళిత (కులం) వస్తువులో గల పోలికలు

 కవితాసంపుటిలోను, ఆత్మకథలోను ప్రతిఫలించిన ప్రధాన వస్తువు భారతీయ సమాజంలో దళిత జీవితం. సమాజంలో భిన్న కులాలు, మతాలు సామాజిక హోదాలకు కారణమవుతున్న స్థితిని ఈ రచనల్లో వివరించారు. అయితే రెండు పుస్తకాలు ఇది  ప్రత్యేకించి కుల నిర్మూలన గురించి మాత్రమే చర్చించవు, కానీ, ఆయన జీవితంలోని అనుభవాలు, పాఠశాలల్లో కుల వివక్ష గురించి వివరిస్తాయి. భారతీయ సమాజంలో కులం ప్రభావాన్ని చర్చిస్తూనే దళితులు ప్రధాన జీవన స్రవంతిలోకి రావాల్సిన పరిస్థితుల్నీ వివరించారు. కేవలం కొన్ని కులాలు మాత్రమే కలిసిమెలిసి జీవించడం కష్టం. అన్ని కులాలు కలిసిమెలిసినప్పుడు మాత్రమే అందరిజీవితం సుఖవంతమవుతుందనీ, అది అందరూ గుర్తించాలనే సందేశం రెండు పుస్తకాల్లోను కనిపిస్తుంది.

ఈ కులంలో పుట్టకపోతే 

నేనూ ఇంకొకలా ఆలోచించేవాణ్ణిమో

ఈ కులంలో పుట్టటమే మంచిదయ్యింది

అవమానమంటే అర్థమైంది 

అందర్నీ ప్రేమించడమూ తెలిసింది” ( నెమలికన్నులు–2016: 1) అనడం ద్వారా భారతీయ సమాజంలో ‘కులం’ వల్ల కలిగే వివక్ష తెలుస్తుంది. అయినప్పటికీ తన కులంలో పుట్టడం వల్ల ప్రేమించే మనస్తత్వం అలవడిందని ఒక సకారాత్మక దృక్పథాన్ని కవి వ్వక్తీకరించడం విశేషం.  కొన్ని కులాల వాళ్ళు ఇతర కులాల వారిని చిన్నవిషయానికి కూడా చంపేస్తున్న సంఘటనలను స్ఫురింపజేస్తూ ఈ కవిత చివరిలో ఇలా అంటాడు కవి. 

 ‘‘ఈ కులంలో పుట్టడమే మంచిదయ్యింది

 ఈ కులంలో పుట్టకపోతే 

మనుషుల్ని ప్రేమించలేకపోయేవాళ్లేమో!

అవమానాలకు తట్టుకోలేక 

దురాగ్రహం పట్టలేక హత్యలెన్నింటినో చేసేవాణ్ణిమో!!’’  ( నెమలికన్నులు–2016: 3)

ఇటువంటి విషయాలే తన ఆత్మకథలో కూడా పేర్కొన్నారు.

ఊరికి చివరి గుడిసెలో బతికే వాళ్ళం. కులం అంట గట్టిన అవమానాల్ని ఇంకా మోయక తప్పని వాళ్ళం. చూపుల్తో, మాటల్తో నిత్యం నలిగిపోతున్నవాళ్ళం.

మనిషిని చూసినా, మాటవిన్నా  ఏ మాత్రం స్పందన కలగని హీనత్వం, మా కులం పేరు చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూస్తున్న వాళ్ళం.

మా కులం తెలియనంత వరకు ఎంతో గౌరవించేవాళ్లు, మా కులం తెలిసిన వెంటనే వేరే విధంగా వాళ్ళ ముఖ కవళికలన్నీ మారిపోతుంటాయి. నా జీవితంలో ఇలాంటి సందర్భాలెన్నో...! మా జీవితాల్లో ఇలాంటి సంఘర్షణలెన్నెన్నో!! (నెమలి కన్నులు, 2023:3)

చిత్రమేమిటంటే, ఆ కాల్వ గట్టు మీద కూడా హిందువులైనా ఆయా కులాల్ని బట్టి వాళ్ళకు కేటాయించిన స్థలంలోనే అంత్యక్రియలు చేసుకోవాలి.

ఆ స్మశానంలో కూడా కులం వదిలిపెట్టని స్థితిని నేను మా ఊరిలో చూశాను. కాల్వగట్టు ప్రభుత్వ స్థలాలను కూడా కొంతమంది వాళ్ళవాళ్ళ పొలాల దగ్గర ఆక్రమించుకొని, కొబ్బరితోటలు పెంచేసుకున్నారు. (నెమలి కన్నులు, 2023:14)

నాకు తెలిసినంతవరకూ గ్రామమంతా కులాల దొంతరగానే ఉంటుంది. ఫలానా వాళ్ళని గుర్తించాలన్నా ఆ కులంతోనే సూచిస్తారు. ఆ పూజారి గారబ్బాయనో, ఆ పంతులుగారనో పిలుస్తారు. ఆ రాజుగారనో, ఆ కోమటాయననో, ఆ కాపు గారనో, ఆ కంసాలోడో, ఆ మంగలోడో, ఆ మాలోడో, ఆ మాదిగోడో ... ఇంకా కాస్త స్పష్టంగా తెలియడానికి పేర్లని కూడా జత చేస్తుంటారు.

అందుకే బడిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులది  ముందుగానే వాళ్ళదే కులమో చిన్న పిల్లలకి కూడా తెలుస్తుంది.

ఆ పంతుళ్లు కూడా తాము పాఠాలు చెప్పే పిల్లలు ఎవరెవరు ఏ కులం వాళ్ళో, వాళ్ళ తల్లిదండ్రులు ఏయే వృత్తులు చేస్తారో ముందే తెలుసుకుంటారు. ఆ పిల్లల్ని తిట్టాలన్నా, ఒకవేళ మెచ్చుకోవాలన్నా ఆ కులాలు, ఆ కులవృత్తులకు అవేవీ దూరంగా ఉండవు.

నేను చదువుకున్న ప్రాథమిక పాఠశాలలోనే నేను వాటిని గమనించాను. (నెమలి కన్నులు, 2023:37)

నన్ను మాస్టారు కొట్టినందుకు బాధనిపించలేదు. నన్ను తిడుతూ నా కులం పేరు పెట్టి మా వాళ్ళందరినీ కూడా తిట్టారు. ఆ మాట నన్నెవరో నిలబెట్టి, నిలువునా రంపంతో కోస్తున్నట్లనిపించింది.

హెడ్మాస్టర్ త్రినాథరావుగారుగానీ, వెంకటరెడ్డిగారు గానీ, రామలక్ష్మి మేడమ్ గారు గానీ అయితే, నన్నే కాదు, ఎవ్వరినైనా కొట్టినా, తిట్టినా కులాన్నంతటినీ తిట్టినట్లు నాకు గుర్తులేదు. ఇలాంటి వాళ్ల ఆప్యాయతతోనే నా కులం వల్ల కలిగే అవమానాల్ని అధిగమించాను.

మా పెద్దన్నయ్యకు మాత్రం సీటివ్వలేదు. మా ఉపకులంలో మొట్టమొదటసారిగా చదువుకుంటున్నది మా కుటుంబంలోనే.

 మా పెద్దన్నయ్యతో పాటు చదువుకున్న మా దళితుల్లోని ఒక ఉపకులానికి చెందిన వాళ్ళందరికీ మాత్రం సీటిచ్చారు. కానీ, మా అన్నయ్యకు సీటులేదన్నారు.

దళితుల్లోని ఒక ఉపకులంపై మరొక ఉపకులం ఒక పథకం ప్రకారం అప్రకటిత నిషేధాలు విధిస్తున్న సంగతి మా పెద్దన్నయ్యకు, నాకూ ఆరో తరగతిలో సీటు దొరక్కపోవడమే నిదరర్శనమనిపించింది.మా దళితుల్లోని ఒక ఉపకులం అప్పటికే తొలితరం వాళ్ళు చదువుకొని, రెండవతరం వాళ్ళు చదువుకోవడం ప్రారంభించారు.

పేదరికానికి కులం తోడైతే అది కొంతమందికి సమాజంలో ఆత్మగౌరవ సమస్యగా మారుతుంది. ఇంకొంతమందికి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే, ఆ కుటుంబాన్ని ముందుకి లాక్కెళ్ళాలంటే, వాళ్ళంతా ఏదొక పని చేయక తప్పని పరిస్థితి. ఇది మా కుటుంబానికి కూడా అనుభవం నేర్పిన పాఠం లాంటిది. ఇలా అనేక సందర్భాల్లో తన ఆత్మకథలో కులం వల్ల కలిగిన అవమానాలు, తన అస్తిత్వ సమస్యల్నీ వివరించాడు రచయిత. విచిత్రమేమిటంటే కులం అదే కులంలోని ఉపకులాలపై కూడా ఆధిపత్యాన్ని చెలాయిస్తుందనే విషయాన్ని ఎంతో స్పష్టంగా వివరించాడు రచయిత. ఇలాంటి సందర్భాలెన్నో తన ఆత్మకథలో సందర్భానుసారంగా వివరించాడు రచయిత. ఒక గ్రామాన్ని ఆధారంగా తీసుకున్నా భారతీయ సమాజం, దాని అంతరాలు తెలియడానికి ఈ కవితాసంపుటి, ఈ ఆత్మకథ సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి.

కొన్ని కులాల వారి ఆదరణ:

భారతీయ సమాజంలో ఒక కులంలో పుట్టడం వల్ల అందరూ అలాగే ఉంటారని సాధారణీకరించలేం. ఈ విషయాన్ని కూడా తన కవిత్వం, తన ఆత్మకథలో ఆధారాలున్నాయి.

‘‘నేను ఛీత్కారాల గొంగళి పురుగునై

విసిరేయబడ్డప్పుడు

నా చుట్టూ నేనే సాలిగూళ్ళు అల్లుకుంటున్నప్పుడు

నాలోకి నేనే

కుంచించుకు పోతున్నప్పుడు

అభయ హస్తమిచ్చి ఆత్మ విశ్వాసాన్నిచ్చిన వాళ్ళను

వాళ్ళెవ్వరైనా నేను మర్చిపోలేను

నా శరీరంలో శరీరమై

నా మనసులో మనసై

నా మనిషిలో మనిషై

నా ప్రాణంలో ప్రాణమైన వాళ్ళను

వాళ్ళెవరైనా చిన్ని రంద్రం నుండే చూడలేను’’ (నెమలికన్నులు,2016:45-46) అని అనడం ద్వారా భారతీయ సమాజంలో కేవలం తన కులస్తులతోనే ఉండడం, తమ కులస్తులతోనే కలిసిమెలిసి ఉండడం సరిపోదనీ, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి మనిషిని మనిషిగా ప్రేమించగలిగిన వాళ్ళు ఏ కులస్తులైనా కలిసిమెలిసి ఉండాలనే భావన ఈ కవితలో కనిపిస్తుంది.

తన ఆత్మకథలో కూడా బ్రాహ్మణులు తనను ఆదరించిన తీరుని, తన స్నేహితుల్లో అన్ని కులస్తులు ఉన్నారనీ చెప్పడం మాత్రమే కాకుండా, విద్యాలయాలకు దాన ధర్మాలు చేయడం, విద్యాలయాలు కట్టడం వంటివి చేశారనే కోణాలను కూడా చూడ్డం కనిపిస్తుంది.

 ‘‘మా ఊరిలో ‘‘హోతా’’ వారని ఓ బ్రాహ్మణ కుటుంబం ఉండేది.ఊళ్ళో ఎవ్వరు పనిలో పెట్టుకున్నా ... పెట్టుకోక పోయినా ...‘‘హోతా’’ వారి పొలంలో మాత్రం అందరికీ పనిదొరికేది. అందుకని సెలవు వచ్చినా, డబ్బులు అవసరం పడినా పిల్లలం కూడా వాళ్ళ పొలంలో పని చేయడానికి వెళ్ళేవాళ్ళం.

పంచాయితీ రోడ్డు పక్కనే, మా బ్రాహ్మణ చెరువుకి దగ్గర్లో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది.

ఆ స్థలాన్ని ఆకాశం సన్యాసి చిట్టిబాబుగారని ఒక వేదోత్తముల వంశానికి చెందినవారు    ఆ స్థలాన్ని పాఠశాల కోసం దానం చేశారు. దాన్ని ఆనుకొనే సుమారు రెండు ఎకరాలు అటో ఇటో  పొలం ఉంటుంది. ఆ పొలాన్ని మాకే కౌలుకిచ్చేవారు. మా ఇంటిల్లిపాదీ ఆ పొలంలో పనిచేసుకునేవాళ్ళం.

నేను చదువుకునే స్కూలే చాలా పెద్దది. శ్రీవరహాభొట్ల నారాయణమూర్తిగారని ఒక బ్రాహ్మణ పండితుడు ఆ స్థలాన్ని దానం చేశారు. ఆ స్కూలు మీద ‘’శ్రీవరహాభొట్ల నారాయణమూర్తి మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, కాట్రేనికోన’’ అని ఆయన పేరే రాసి ఉంటుంది.’’  (నెమలి కన్నులు, 2023:111)

నాస్తాల్జియా:

గతంలో గడిపిన మధురమైన అనుభవాలను గుర్తు చేసుకొని మనసు లో కలిగే మృదువైన బాధ, తీపి జ్ఞాపకాల పట్ల తపన  దీనినే నాస్తాల్జియా అంటారు.  అంటే, గతంలో జరిగిన సంతోషకరమైన సంఘటనలు, ప్రదేశాలు లేదా అనుభవాల గురించి ఆలోచిస్తూ, ఆనందం, విచారం రెండూ కలిగిన ఒక భావోద్వేగం. ఇది గతానికి తిరిగి వెళ్లాలనే కోరికతో కూడిన ఒక ప్రత్యేకమైన అనుభూతి, దీనిని "గతం పట్ల ఆప్యాయమైన కోరిక" అని కూడా అంటారు.  నాస్తాల్జియాలో జ్ఞాపకాల వేదన, గతస్మృతి తపన, గతానుభూతులపై ప్రేమతో కూడిన బాధ వంటివన్నీ వ్యక్తమవుతుంటాయి. ప్రధాన లక్షణాలు:గతంలోని సంతోషకరమైన జ్ఞాపకాలు, ముఖ్యంగా వ్యక్తిగత అనుబంధాలు కలిగిన వాటిని గుర్తుచేసుకోవడం.  ఇది గతంలో జరిగిన సంతోషకరమైన సంఘటనల గురించి ఆలోచిస్తే కలిగే ఆనందంతో పాటు, ఆ సమయానికి తిరిగి వెళ్లలేమనే విచారాన్ని కూడా కలిగిస్తుంది.  విచారంగా లేదా కష్టంగా ఉన్న సమయాల్లో ఇది ఓదార్పునిస్తుంది. కొన్నిసార్లు పాత పాటలు లేదా వస్తువులు కూడా నాస్టాల్జియాను రేకెత్తించగలవు, గతంలోకి తీసుకువెళ్ళి బలమైన జ్ఞాపకాలను సృష్టిస్తాయి. ఒక ఉత్పత్తి, సేవ లేదా అనుభవం గత జ్ఞాపకాలను రేకెత్తించినప్పుడు "నాస్టాల్జియా ఎఫెక్ట్" కలుగుతుంది, ఇది వెచ్చదనం మరియు ఆప్యాయత వంటి భావనలను కలిగిస్తుంది.  ఉదాహరణకు: ఒక వ్యక్తి తన బాల్యంలోని పాఠశాల రోజులను, స్నేహితులను, ఆడిన ఆటలను గుర్తు చేసుకుని హృదయంలో తీపి తపనను అనుభవిస్తే — అది నాస్తాల్జియా. సాహిత్యపరంగా, నాస్తాల్జియా ఒక ముఖ్యమైన భావవ్యాఖ్య. కవులు, రచయితలు తమ రచనల్లో గతకాలపు జ్ఞాపకాలపై తపన, వేదన, ఆత్మీయతను వ్యక్తపరుస్తారు.  ఈ లక్షణాలు దార్ల వెంకటేశ్వరరావుగారి కవిత్వం, ఆత్మకథల్లో కనిపిస్తాయి.

తాను పుట్టిన కులం, ఆ సందర్భంగా తల్లిదండ్రుల కష్టనష్టాలు ఇవన్నీ తన కవిత్వంలో నాస్తాల్జియాగా వ్యక్తమవుతాయి. అనేక కవితల్లో ఈ నాస్తాల్జియా కనిపిస్తున్నా, గ్రామీణ ప్రాంతం గురించి రాసిన ‘‘మా వూరు నవ్వింది’’ అనే ఒక కవిత చూస్తే ఈ కవితాసంపుటిలో ఉన్న నాస్తాల్జియా తెలుస్తుంది.

కథల్లోనో, టీవీల్లోనో, సినిమాల్లోనో

పచ్చని పొలాల్ని చూసినప్పుడల్లా

 మాయమ్మ, మా అయ్యలతో కలిసి

పురుగుల్నీ, పాముల్నీ లెక్కచేయకుండా

రాత్రుల్ని ఎన్నింటినో లాంతరు బుడ్గుల్తో

పగటిగా మార్చుకుని

గుల్లల్తోనూ, గూడల్తోనూ, నీటి చుక్కల్నే తడుపుకున్న నా కళ్ళల్లో

ఆ పాత దృశ్యాలేవో పలకరించి పోతుంటాయి.’’ అంటూ బాల్యం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటాడు కవి. అంతే కాదు తన తల్లి తండ్రుల త్యాగం, ప్రేమ వంటివి కూడా తన కవితలో ప్రతిఫలిస్తుంటాయి.

‘‘ఆ గాయాల చేతుల్లోనే కారం పచ్చడి నూరుతూ

మా కళ్ళకు కనిపించకుండా

మా అమ్మ పడిన బాధంతా గుర్తొచ్చి

అన్నం తినడం అమాంతంగా ఆపేస్తుంటాను

నిస్సహాయతతో నాలోకి నేనే ఉండగట్టికిపోతుంటాను

హుస్సేన్ సాగర్, గండిపేట, హిమాయత్ సాగర్...

ఏ నీటి గలగలల్ని చూసినా

మా వూరిలో ప్రవహించే కాల్వలే నా కళ్ళల్లో...!

గోచి పెట్టుకునో చిరిగిపోయిన లాగు కట్టుకునో

తుప్పల్ని నరికి సరికీ పూడికల్ని తీసి తీసీ

 వంపు సొంపుల్తో వయ్యారాల్ని నేర్పి నేర్పీ

కిల కిల నవ్విస్తూ, పంట చేలల్లోకి ప్రవహింపజేసిన

 ఆ కాల్వలే నా కళ్ళల్లో...!’’ ఇలా కొనసాగుతుందా కవిత. ఇవన్నీ తన బాల్యం, తనలాంటిబాల్యమంతా కవిత్వంగా వచ్చింది. ఇదంతా నాస్తాల్జియాలో భాగమే అవుతుంది.

ఇటువంటి నాస్తాల్జియానే తన ఆత్మకథలో కూడా కనిపిస్తుంది.

1. మాకు మా తాతగారింటి ముందు ఒక నారింజ చెట్టు ఉండేది. దాని ఒళ్ళంతా కళ్ళన్నట్లు గుత్తులు గుత్తులుగా కాయలు కాసేవి. దాని కాయలు నేను కోసుకొని బడికి పట్టుకొని వెళ్ళేవాడిని. మా మిత్రులకు వాటినిస్తుండేవాణ్ణి. వీళ్ళతోపాటు ఇంకా కొంతమంది ఉండేవారు.

ఇంటర్వెల్ సమయంలోను, స్కూలు అయిపోయిన తర్వాత మా ఇంటికొచ్చి వాటిని కోసుకొని వెళ్ళేవారు. చాలా తియ్యగా ఉండేవి ఆ నారింజపండ్లు. ఒక్కొక్కరూ ఒక్కో రకం పండ్లు అప్పుడప్పుడూ తెచ్చేవారు. వాటిని పంచుకొని మేమంతా తినేవాళ్ళం.

2.నాకు చిన్నప్పటి నుండీ స్వీటంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుండీ పాలతో చేసిన పిండివంటలన్నా ఇష్టం. కొబ్బరి లవుజు ఉండలంటే మహా ఇష్టపడేవాణ్ణి.

కిరాణా కొట్టు దగ్గరకెళ్ళినప్పుడల్లా బెల్లం ముక్క అడిగి తినేవాణ్ణి. ముందు అలా సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళిన వారికి బెల్లం ముక్క పెడతారని తెలియదు. వాళ్ళే ఒకసారి సరుకులన్నీ కొన్నతర్వాత వాటికి డబ్బులిచ్చేసాక, నా చేతిలో ఒక బెల్లం ముక్క పెట్టారు.

3.మా బడి ఎదురుగా ఒక ఇంట్లో మిఠాయి తయారు చేసేవారు. మేము పాఠాలు వింటున్నా, అక్కడ తయారు చేసే రకరకాల మిఠాయిల నుండి మాకు తీయని వాసనలు వస్తుండేవి. రోజూ డబ్బులివ్వడమంటే మా అమ్మా నాన్నలకు కష్టం. నాకేమో జీళ్ళంటే ప్రాణం. నాకు చిన్నప్పుడు, ప్రాథమిక పాఠశాలలో చదువుకునేటప్పుడు ఇంచుమించు ప్రతీరోజూ జీళ్ళే కలలోకి వచ్చేవి.

ఇలా చిన్ననాటి జ్ఞాపకాలు, కేవలం దార్ల వెంకటేశ్వరరావుగారివి మాత్రమే కాదు, ఆ వయసులో ఉన్నవాళ్ళందరివీ అనిపిస్తాయి.

అభివ్యక్తి వైవిధ్యం:

      దార్ల వెంకటేశ్వరరావుగారు తన కవితా సంపుటిలో గల కవితల్లో ఎంతో వైవిధ్యభరితమైన అభివ్యక్తి ఉంది. ఈ కవితాసంపుటిపై దారిశెట్టి పుష్పిణి చెన్నైలని ప్రెసిడెన్సీ కళాశాలలోడా. ఎన్. ఎలిజబెత్ మేరీ జయకుమారి గారి పర్యవేక్షణలో 2017లో ‘‘నెమలికన్నులు కవిత్వం- అభివ్యక్తి వైవిధ్యం’’ అనే పేరుతో ఒక ఎం.ఫిల్ చేశారు.  ఈ సిద్ధాంత గ్రంథంలో నెమలికన్నులు కవిత్వంలో కనిపించే అభివ్యక్తి వైవిధ్యాన్ని పరిశోధకురాలు ఎంతో విస్తృతంగా విశ్లేషించారు.

మనిషి మానవ సంబంధాలు, సామాజిక జీవితం, దానిలోని సమస్త వైరుధ్యాలు  వీటన్నింటి యొక్క కళాత్మక ప్రతిఫలనం సాహిత్యంలో వస్తువు అవుతుందని పాపినేని శివశంకర్ అభిప్రాయం.( శివశంకర్, పాపినేని: సాహిత్య మౌలిక భావనలు:1996 :78.) ‘సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ’ లో అభివ్యక్తిని ఇలా వివరించారు. ‘‘విషయాన్ని వ్యక్తీకరించే పద్ధతి ఇందులో వాక్య నిర్మాణమూ భాష వాడిన ప్రతీకలు మొదలైనవన్నీ  వస్తాయి ’’ (నళిని, సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ’ పుట: 21)

కవిత్వంలో ఒక విషయం మరో విషయానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతీకలుగా చెప్పబడతాయి.  ప్రాతినిధ్యం వహించే వస్తువులని కవి సమాజం నుంచి గ్రహించి చెప్తాడు. జీవితంలోని సుఖదుఃఖాలు మొదటిసారిగా శక్తివంతంగా, కళాత్మకంగా కవిత్వంలోనే వ్యక్తీకరించబడతాయి. కాబట్టి కవి స్వీయ అనుభవాలనుంచే పదాలు, ప్రతీకలు స్వీకరించి కవితా నిర్మాణం చేస్తాడు.  సహజంగా కవులు సముద్రాన్నో, నదినో, పర్వతాన్నో జీవితానికి ప్రతీకలుగా గ్రహించి జీవితంలో జరిగిన సంఘటనలకు వీటన్నింటిని ప్రాతినిధ్యం వహించేలా చేస్తాడు. ఈ కవి కూడా ‘‘చౌరస్తా’’ని ఒక జీవితానికి ప్రతీకగా గ్రహించి వసంతం, శిశిరాలను ప్రాతినిధ్య వస్తువులుగా చేసి నభూతోనభవిష్యత్తి అనే కవితలో ఇలా రాశాడు.

                    ‘‘జీవన చౌరస్తాలో కొచ్చిన కొత్తలో

                    వెలుగులు విరజిమ్మిన వసంతం

                    ఇంత తొందరగా

                    భవిష్యత్తు మొగ్గల్ని చిదిమేసిన

                    శిశిరమైన చీకటి అవతారం

                    రంగుల ప్రపంచం

                    అద్భుతమైన రూపం

                    వికృతమై వెక్కిరిస్తూ

                    రక్తసిక్తమైన కాన్వాస్’’             

(నభూతోనభవిష్యత్తి , పుట:9)

    ‘చౌరాస్తా’ అనేది అన్యదేశ్య పదం. నాలుగు రోడ్ల కూడలి అని వాచ్యార్థం. ‘జీవన చౌరస్తా’ అని దీన్ని కవి ప్రయోగించాడు. కవితలో అక్షరదోషమో, కవి ప్రయోగమో పదాన్ని మార్పు చేసినట్లు మాత్రం కనిపిస్తుంది. ‘తన నిర్ణయాలు తాను తీసుకునే సమయం’ అనేది ఇక్కడ ఒక అర్థంలో స్ఫురిస్తుంది. ‘నలుగురూ తమకిష్టమైన నాలుగు వైపులకు వెళ్ళే మార్గాల్లోకి వచ్చినప్పుడు’ అని మరొక అర్థం వ్యంగ్యార్థంగా కనిపిస్తుంది. తానొక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన తొలిదశలోనో, లేక అంతా సంతోషంగా తమ తమ ఉన్నత లక్ష్యాలను నెరవేర్చుకునే క్రమంలోనే తన జీవితంలో ఎదురైన విషాదాన్నిక్కడ కవి వ్యక్తీకరిస్తున్నాడు. ‘భవిష్యమొగ్గల్ని’; ‘వెలుగులు విరజిమ్మిన వసంతం’ వంటివన్నీ కవి రాబోయే జీవితం గురించి గొప్ప కలలు కన్నాడని చెప్పే కీలకాంశాలు. కానీ, తన జీవితంలో ప్రవేశించిన ‘విషాదం’ తన కలల్ని కల్లలు చేసేసిందనే వేదన తర్వాత కవిత అంతా వర్ణితమైంది. అందుకనే కవి ‘శిశిరమైన చీకటి అవతారం’ అని జీవితమంతా అప్పుడే శిశిర ఋతువులోని ఆకులు రాలినట్లే, ఆశలు రాలిపోయి మోడువారిపోబోతున్న జీవితాన్నిక్కడ దృశ్యీకరిస్తున్నాడు. అందుకనే ‘చీకటిఅవతారం’ గురించి వర్ణించాడు. చీకటి అనే అవతారం తన జీవితంలో వసంత పూయాల్సిన జీవితాన్ని శిశిరఋతువుగా మార్చేసిందనే ఆవేదనను వ్యక్తీకరిస్తున్నాడు. ఇక్కడ – భవిష్యత్తు ఎంతో అందంగా ఉండాల్సిన జీవితం తొందరగా ముగిసిపోతున్న భయాందోళన గల మనస్తత్వం అభివ్యక్తమైంది. దీనికి జీవితమనే మార్గాన్ని, దాని చుట్టూ ఉన్న ప్రకృతినీ వర్ణిస్తూ, ఆ ప్రకృతిని ఆరు ఋతువుల్లోని రెండింటితో సామ్యం చెప్పాడు. సంతోషానికి వసంతఋతువునీ, విషాదానికి లేదా ముగిసిపోతున్న జీవితానికి శిశిరాన్ని ప్రతీకాత్మకం చేశాడు. దాన్ని చివరిలో ‘రక్తసిక్తమైన కాన్వాస్’ అని ముగించాడు. జీవితమనే రహదారిలో అనేకమంది నడుస్తుంటారు. రకరకాలైన సన్నివేశాల్ని, సంఘటనల్ని, కొన్నిసార్లు వివిధ చిత్రకారులు వేసే చిత్రాల్ని చూస్తుంటారు. కవి ఒక జీవితమేదో అర్థంతరంగా ముగిసిపోయిన తర్వాత కనిపించబోయే చిత్రాన్ని మనసులో రూపుకట్టిస్తున్నాడు. అందుకే దీని శీర్షికను ‘నభోతో నభవిష్యతి’ అని పెట్టడం ద్వారా ‘ఇలాంటి అర్థంతరంగా ముగిసిపోయే జీవితం ఇంతకు ముందలేదు, ఇకపై ఉండకూడద’నే ఆకాంక్షతో పెట్టినట్లుంది. విషాదాన్ని వర్ణిస్తూనే, ఆశను చిగురింపజేయడం ఈ కవితాఖండికలో కనిపించే గొప్ప అభివ్యక్తి వైవిధ్యం.

 దీని ద్వారా కవి – మానవజీవితం మన చేతుల్లో ఉన్నట్లే ఉన్నా, ఏదీ మన చేతిలో లేకుండా పోయే ప్రమాదం కూడా పొంచే ఉంటుందని గమనించాలి. అప్పుడు మానవుని మానసిక, భౌతిక స్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. అలాంటి స్థితిని ఈ కవితలో ప్రతీకాత్మకంగా వర్ణించాడు కవి అని దారిశెట్టి పుష్పిణి తన సిద్ధాంత గ్రంథంలో వివరించారు.

తన ఆత్మకథ వచనంలోనే ఉన్నప్పటికీ, దీనిలో ఆలంకారిక శైలి ఆ రచనను సాహిత్యీకరించడంలో ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శించింది. అంతేకాదు, అక్కడక్కడా పెట్టిన కవితలు ఆత్మకథా రచనలో శైలిపరంగా గొప్పప్రయోగంగా కూడా కనిపిస్తుంది. ఆచార్య పి.చంద్రశేఖర్ ఈ ఆలంకారిక శైలి గురించి వివరిస్తూ ఇలా అన్నారు.

 ‘‘సమాజం స్వార్థపూరితం, తాను మాత్రమే బాగుండాలనే చింతన ఎక్కువ మందిలో కనిపిస్తుంది. అంతేకాక ఆత్మ ప్రశంస, పరనింద సాగుతోంది. అయితే దేవుణ్ణి కోరుకున్నప్పుడు కూడా దార్ల అందరు బాగుండాలని ఆశిస్తున్నారు.

దేవుణ్ణి మనం కోరుకునేటప్పుడు మనకోసమే మనం దేవుణ్ణి అడక్కూడదు. మన చుట్టుప్రక్కల వాళ్ళంతా బాగుండాలి,అందరితో మనం బాగా ఉండేమనస్తత్వాన్ని మనకివ్వాలి." అని సమభావాన్ని ప్రబోధించారు.

ఈ విధంగా నెమలి కన్నులు ఉపదేశాత్మకంగా సాగుతుంది.

ప్రతి మనిషి పుట్టుక, తల్లిదండ్రులు కాకతాళీయే. అయితే పూర్వజన్మ సుకృతమని భావిస్తారు కొందరు. ఏది ఏమైనా తన పుట్టుక స్థితిగతులను ప్రతిఒక్కరు గర్వపడాలి, ఔన్యత్యాన్ని ప్రశంసించాలి. ఈ నేపథ్యంలో దార్ల తన జాతి ఔన్నత్యాన్ని ఇలా వర్ణంచారు. వాటికి దగ్గర్లో ఒక నక్షత్రం ఉంటుంది. దాని పేరు ఆరంజ్యోతి (అరుంధతి) అని మా అమ్మ చెప్పేది. "ఆ ఆరంజోతి మనింటి పిల్లే ... అలా నక్షత్రంగా మారిపోయింది." అని మా అమ్మ అనగానే మాకు ఆశ్చర్యమనిపించేది. అని తన మూలాల ఔన్నత్యాన్ని వెల్లడించారు.

'నువ్వక్కడి నుండి వెనెక్కి వెళ్ళు...!

ఆ మాట

నాలేత ఆకులాంటి గుండెల్నెవరో

చీల్చేస్తున్నట్లనిపించింది." (నువ్వక్కడి నుండి వెనెక్కి వెళ్ళు...!) గుండెను లేత ఆకుతో ఉపమించారు.

మాకు ఇంటర్వెల్ బెల్ కొట్టినప్పుడు, కిలకిలమంటూ మా పిల్లలంతా పంజరంలోని చిలుకల్లా ఉరుక్కొంటూ బయటకొచ్చే వాళ్ళం." (మూగవేదనల పేగు బంధం). పిల్లలను పంజరంలోని చిలుకలతో ఉపమించారు. మా పెద్దన్నయ్య ఓ హిట్లర్! పెద్దన్నను హిట్లరుతో పోలిక.

"నిజమే.. బాల్యం ఓ చలమ లాంటిదే!

బాల్యం ఓ సముద్రం లాంటిదే!

అంటాం. బాల్యం ఓ ఆకాశం లాంటిది..” అని బాల్యాన్ని పరిపరి విధాలుగా ఊహించారు. ఇలా చెప్పడం ఉల్లేఖాలంకారం

దార్ల తెలుగు సాహిత్యాన్ని ఔపోశన పట్టారు. ప్రాచీన సాహిత్య ప్రభావానికి గురికాని రచయితలుండరంటే అతిశయోక్తి కాదు. దీనికి దార్ల అతీతుడు కాదనుకుంటాను.

"ఇంకాస్త సేపు అలాగే ఆ సూర్యోదయాన్ని చూస్తుంటే, ఆ చెట్ల మధ్యలోనుండి సన్నని వెలుగు ... అది కోత కోసిన పంట పొలాల దగ్గర కాపలా కాస్తూ, చేసుకి పెట్రోమాక్స్ లైట్ వేసి, చూస్తున్నట్లు అటూ ఇటూ నాలుగు వైపుల్లో ఏదొక వైపు ఆ కాంతి కిరణాలు కదులుతున్నట్లు అనిపించేవి.' స్వభావోక్తి అలంకారం. ఇది ఆముక్తమాల్యదలోని "తల పక్షచ్చట గుచ్చి బాతువులు కేదారంపు కుల్యాంతర స్థలి నిద్రింపగ చూచి..." పద్యంలోని రైతుల వర్ణన గుర్తుకు తెస్తుంది.’’ అని నెమలికన్నులు ఆత్మకథలో కనిపించే అభివ్యక్తివైవిధ్యాన్ని డా. పగడాల చంద్రశేఖర్ విశ్లేషించారు.

ముగింపు:

      ఈ విధంగా దార్ల వెంకటేశ్వరరావు రచించిన నెమలి కన్నులు కవితాసంపుటి, ఆత్మకథ తెలుగు సాహిత్యంలో ఒక వినూత్నమైన ప్రయోగాలు మాత్రమే కాకుండా, వస్తు, శిల్ప, అభివ్యక్తుల్లో విశిష్టమైన రచనగా సాహితీవేత్తలు అభిప్రాయ పడ్డారు. ఆయన భారతీయ సమాజంలో కులం ఉన్నా, అన్ని కులాలను సమైక్యతతో పయనించాలనే స్ఫూర్తిదాయకమైన దృక్పథంతో ఈ రెండు రచనలను కొనసాగించి, భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం మనే భావనకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

ఆధార గ్రంథాలు:

వెంకటేశ్వరరావు, దార్ల. (2016). నెమలికన్నులు (వచన కవితాసంపుటి). హైదరాబాదు: మంజుశ్రీ ప్రచురణలు.

వెంకటేశ్వరరావు, దార్ల. (2023) నెమలి కన్నులు (ఆత్మకథ, తొలిభాగం), హైదరాబాదు:కస్తూరి విజయం ప్రచురణలు.

నళిని, ఎస్.ఎస్. (2009) సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ.  హైదరాబాదు: నవోదయాబుక్ హౌస్. 

నారాయణ రెడ్డి, సింగిరెడ్డి. (2001). ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు: ప్రయోగములు.

హైదరాబాదు:  విశ్వంభరా విజన్ పబ్లికేషన్స్. 

వీరభద్రయ్య, ముదిగొండ. (2012). విమర్శ,  కళాతత్త్వ శాస్త్రాలు. హైదరాబాదు: తెలుగు కాడమీ. 

శరత్ జ్యోత్స్నారాణి, ఎస్. (2003).  స్వాతంత్ర్యానంతర తెలుగు కవిత – వస్తువు,  రూపం, శిల్పం.

హైదరాబాదు: జ్యోత్స్నా కళాపీఠం. 

 

 (సాహిత్య తరంగిణి , తెలుగు పరిశోధన మాసపత్రిక సౌజన్యంతో)

 

 

 

 

 

 

 

 

 


కామెంట్‌లు లేవు: