శీలం భద్రయ్య ‘ముస్తాదు’ మినీ కవితల సంపుటిపై
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రసంగం
●
గౌడు చెమటకు
తల్లి తాటిచెట్టు ఎద ఉప్పొంగింది
గెలకంటి నుండి
బొట్లు బొట్లుగా ఆనంద భాష్పాలు
ఇది,
డాక్టర్ శీలం భద్రయ్య గారి ‘ముస్తాదు’ కవితా
సంపుటి లోనిది. దీన్ని వివరించడానికి ముందు
మీ అందరికీ నమస్కారం,
ఈరోజు
కవి, కథకుడు, తెలుగు భాషోపాధ్యాయుడు డాక్టర్ శీలం భద్రయ్యగారి ‘ముస్తాదు’ కవితా సంపుటి
గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు భాషా
చైతన్య సమితి, ద్వానా సాహితీ కుటీరం వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందించాలి.
తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా విధులు చేపట్టినటి నుండి నేటి వరకుఅవిశ్రాంతంగా శని ఆదివారాలు కూడా పనిచేస్తూ చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డాక్టర్ నామోజీ బాలాచారి గారు.నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు మా గురువుగారు డాక్టర్ ద్వా.నా.శాస్త్రిగారిపుత్రులు ద్వాదశి శశికాంత్ గారికి నమస్కారం. (నిజానికి ఆయన ఈ రోజు సభాధ్యక్షతలో లేరు. కార్యక్రమ ఆహ్వానపత్రంలో మాత్రం ఆయన పేరుంది.) మరొకరు నిర్వహించారు.
●
ఇలాంటి కార్యక్రమంలో
వక్తలుగా పాల్గొంటున్న ప్రముఖ కవి, సాహిత్య పరిశోధకుడు, విమర్శకుడు, మంచి వక్త, సెంట్రల్
యూనివర్సిటీలో నాకు సీనియర్ డాక్టర్ కోయి కోటేశ్వరరావు, ఉత్తమ సాహితీవేత్త రాపోలు సీతారామరాజు
గార్లకు నా నమస్కారాలు. ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటికీ తెలుగు సాహిత్యం పట్ల ఆయనకి
ఎనలేని అభిమానం ఉంది. దక్షిణాఫ్రికా నానీలు, నెల్సన్ మండేలా జీవిత చరిత్ర వంటివి ఆయనకు
సాహిత్యంలో మంచి గుర్తింపుని తెచ్చాయి.
●
అస్తిత్వ ఉద్యమానికి
ఉద్యమరూపాన్నిచ్చే గొప్ప కవితా సంపుటి ‘ముస్తాదు’ని వెలువరించిన డాక్టర్ శీలం భద్రయ్య
గారికి నా శుభాకాంక్షలు. సాహిత్యాన్ని రాయడమే కాదు, దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలో
తెలిసిన రచయిత భద్రయ్య గారు.
ఇప్పుడు నేను మొట్టమొదట ప్రస్తావించిన కవితలోని సౌందర్యాన్ని విశ్లేషించుకుందాం.
కల్లు
గీసే వృత్తి తెలంగాణలో ‘గౌడ’ కులస్తులు మాత్రమే చేస్తారు. కానీ, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో
ఈ వృత్తిని ఏ కులస్తులైనా చేయవచ్చు. అలా మా తాత, నాన్న, తర్వాత మా అన్నయ్య… వంశపారంపర్యంగా
ఈ వృత్తి చేస్తాం. అందువల్ల ఈ కవిత చదవగానే కవికి కవిత్వం ఉప్పొంగినట్లే, నాకు కూడా
హృదయం ఆనందంతో పొంగినట్లయ్యింది
తల్లి తాటిచెట్టు ఎద ఉప్పొంగింది
గెలకంటి నుండి
బొట్లు బొట్లుగా ఆనంద భాష్పాలు
జీవితాన్ని
కవిత్వం చేయడంలో ఇంత అద్భుతమైన అభివ్యక్తిని చూసి నాకు గంతులేసినంత పని అయింది.
తాటి
చెట్టుని తల్లిగా భావించటం ఒక పవిత్రమైన భావన. కల్లు గీయడానికి తాడిచెట్టు ఎక్కేముందు, ఆ చెట్టుకి మొక్కుతారు. అంతే
దాన్నొక దేవతగా, దైవంగా భావిస్తారు.
దళిత,
బహుజన వర్గాలు అన్నీ ప్రకృతితో తన్మయులవుతుంటారు.
కల్లు
గీయడం అనేది
తాటి చెట్టుకి ఉన్న లేత గెలలను మూడు పూటలా కత్తితో సన్నిని పొరలు కోయటం వల్ల దాని నుండి బొట్లు బొట్లుగా
కల్లు కారుతుంది.
అది
ఒక కుండలో పడేటట్లుగా ఎంతో నైపుణ్యంతో కడతారు.
ఒక
చెట్టుకి ఉన్న గెలలను బట్టి రెండు మూడు కుండలు కూడా కట్టే అవకాశం ఉంటుంది.
ఒక్కో
కుండకీ తాడుకట్టి, ఆ తాడుని జాగ్రత్తగా ఆ
గెలకు పైనున్న కమ్మలకు లేదా ఆ గెల మూలకి కడతారు.
దాన్ని
జాగ్రత్తగా తీసి దానిలో ఉన్న కల్లుని తన ముస్తాదుకు కట్టుకున్న కుండడలోకి
వేసుకుంటారు.
మళ్లీ
ఆ గెలకు ఆ కుండను కట్టే ముందు కుండను జాగ్రత్తగా తాటాకుతో శుభ్రం చేస్తారు. చేయి తగలకుండా ఆ ఆకుతోనే కుండను శుభ్రం
చేస్తారు. చేయి తగిలితే కల్లు పుల్లగా అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా శుభ్రం
చేయాలి.
ఎప్పుడూ కూడా ఆ గెలను పట్టుకొని జాగ్రత్తగా చిన్నచిన్న పొరలు కోయాలి.
అలా
కోసిన వెంటనే ఆ గెల నుండి టప్ టప్ మని బొట్టు బొట్లుగా కల్లు కారడం మొదలవుతుంది.
అలా
ఆ చెట్టుకి కట్టిన కుండలన్నీ శుభ్రం చేసి, ఆ గెలలన్నీ సన్నగా కోయాలి.
మరలా
బయట నుండి పురుగులు వంటి వేమీ ఆ కుండలో పడకుండగా, పక్షలు మూతిపెట్టకుండా మూత జాగ్రత్తగా
కట్టాలి.
ఒక్కోసారి
తాను తీసుకెళ్ళిన ఒక్క కుండ సరిపోదు.
మళ్లీ
కిందికి
దిగి వెళ్లి మరో కుండలో పెకెళ్ళి కల్లుని తీసుకురావాల్సి ఉంటుంది.
అలా
ఒక తాటి చెట్టు అంత కల్లు ఇవ్వడమంటే ఆ తాటి
చెట్టు నిజంగా తల్లి లాంటిది కాక,
మరేమవుతుంది.
అందుకే
ఆ పోలిక. ఎంత ఔచిత్య భరితంగా ఉంది.
●
ఈ పుస్తకానికి
రాసిన ముందు మాటలు కవి శీలంభద్రయ్య గారి కవిత్వాన్ని మాత్రమే కాకుండా, తెలంగాణ ప్రాంతంలో
గౌడ కులవృత్తికి సంబంధించిన ఔన్నత్యాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఆ కుల వృత్తిలోని
సాధకబాధకాలను కూడా ప్రస్తావించారు.
●
డాక్టర్ తండు
కృష్ణ చైతన్యగారు ఈ కవితా సంపుటికి ఒక సైద్థాంతిక నేపథ్యాన్ని చెప్పి, ఆ భావజాలానికి
’ముస్తాదు’ కవితా సంపుటి
ఎలా తోడ్పడుతుందో చక్కగా అన్వయించారు.
భాష: శీలం భద్రయ్య గారు తన
కవిత్వంలోగానీ, అంతముందు తాను వేసిన ‘లొట్టపీసు పూలు’ కథల్లో గానీ, తెలంగాణ జీవద్వంతమైనభాషను ఉపయోగించారు, ఇది వారి
రచనలకు సహజత్వాన్ని అందిస్తుంది.
యాదించుకో
...!
మందుకల్లు
కాదు
ఎతశితకు
“మందు" ..... “కల్లు”
ఇందులో ‘ఎతశిత’ .. మనసులోని బాధ అనే అర్ధాన్నిస్తుంది. ‘యాదించుకో’ గుర్తుపెట్టుకో, జ్ఞాపకం ఉంచుకో అనే
అర్థంలో నిత్యం ఆ పదాన్ని వాడతారు.
నడుముకు
కట్టిన వస్తాదు
చెమటోడ్చి
ఊరిదూపను
తీరుస్తాడు
ఉదా:
ముస్తాదు : ముస్తాదు అంటే
గీతకార్మికులు
నడుముకు కట్టుకొనేది. అది గౌడుకు పట్టుత్వం, గౌడు
వృత్తి పరికరాలైన కత్తులు, చిడతబద్దలను పెట్టుకునేది. చెట్టుపై కల్లు లొట్టి కూడా వెనక
తగిలించుకునేది.
ఇది
వృత్తి పదానికి ఉన్న వివరణ.
●
దీనితోపాటు…'ముస్తాదు' అనే పదం భిన్న సందర్భాలలో కూడా ఉపయోగిస్తారని నాకు కవే వివరించి
చెప్పారు. అంటే గౌడు పరికరాలైన మోకు, గుజి అన్నీ కలిపి చెప్పే పద బంధం. కులంలో ఎన్ని
ముస్తాదులున్నాయి అంటే? ఎంతమంది ఉన్నారనే అర్థం.
దీన్ని కోస్తా ప్రాంతంలో బల్లకట్టడం అంటారు.
‘గుజిది ఉడుంపట్టు
యమపాశానికి
వొళ్లు వణికింది’
కల్లు
గీసేవారు మూడు పూటలూ తాటి చెట్టు ఎక్కడం, దిగడానికి
కాళ్ళకి వేసుకునే ఒక ముఖ్యమైన పరికరం గుజి.
దీన్ని
కోస్తా ప్రాంతంలో అయితే ‘గుది’
అంటారు. నిఘంటువుల్లో -తాటిచెట్టు మొదలైన వాటినికి
ఎక్కుటకు కాళ్ళకు తగిలించుకొను బంధము.’ అని ఉంది. ఆ గుదిని తాటి నారతోటే తయారుచేస్తారు. దీన్ని తెలంగాణలో ‘గుజి’ అని వ్యవహరిస్తారు.
రెండు
కాళ్ళను బలంగా తాటి చెట్టుకు అదిమి పెట్టుకొనిపైకి ఎక్కడానికి కిందికి దిగడానికి కల్లు తీసేటప్పుడు ఆ తాటి చెట్టు గెలలనను సన్నగా
కత్తితో కోయడానికి కాళ్ళకున్న ఏకైక ఆధారం కూడా ఆ గుదే.
అది
గనక తెగినా, కాళ్ళల్లో ఒక కాలు బయటకు జారినా, మనిషి కింద పడిపోతాడు.
దాంతో తన ముస్తాదు ఒరలో ఉన్న మరొక కత్తి లేదా తన
చేతిలో కత్తి తనకే గుచ్చుకోవచ్చు. మనిషి పడ్డాడంటే ఆ చెట్టునే మనిషి దక్కుతాడో
లేదో చెప్పలేం. ఒకవేళ బ్రతికినా మళ్ళీ ఆరోగ్యంగా ఉండలేడు. కాళ్లో, చేయిలో, నడుమో విరిగిపోతుంది. ఒక్కోసారి అక్కడికక్కడే చనిపోయినవాళ్ళెంతమందో.
ఎందుకంటే, వాళ్లు పడినప్పుడు వెంటనే చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రాణం కాపాడొచ్చు.
కానీ,తాను ఒక్కడే ఆ తాటి వనందగ్గరకు వెళ్ళి కల్లు గీస్తాడు. ప్రతీరోజు చేసే పని
అది. అందువల్ల అతని కూడా రోజూ ఎవరూ ఉండరు. అందుకని అలాంటప్పుడు అది దిక్కులేని
చావు అవుతుంది.
మామూలుగా
చెట్టు ఎక్కడమే కష్టం.
ఆ చెట్టు
ఎక్కిన తర్వాత అక్కడ భూమి మీద నిలబడినట్లుగా చాలా సేపు నిలబడాలి.
ఆ చెట్టు
చుట్టూ తిరుగుతూ ఆ గెలలకు గెలలను జాగ్రత్తగా చిన్న చిన్న పొరలుగా కోయాలి.
దీంతోపాటు
ఆ గుది ఎంత గొప్పగా ఉపయోగపడుతుందంటే, రోజుకు మూడుసార్లు ఎక్కీ దిగేసరికీ పైనుండి కొద్దిగా కారినటువంటి కల్లు చెట్టు మీద పడడం వల్లా చెట్టు నున్నగా మారిపోతుంది. అటువంటి అప్పుడు
కాలు ఆ చెట్టు మీద జారిపోతుంది. కాలుని జారనివ్వకుండగా పట్టుకునేది గుదే. కాలుకీ, మనిషికీ మంచి పట్టునిస్తుంది.
అందుకని
యమధర్మరాజు చేతిలో ప్రాణాలు తీసే యమపాశం కూడా భయపడుతుంది అని కవి చెప్పడం పౌరాణిక ప్రతీకను ఆధునిక కవిత్వంలో శక్తివంతంగా ఉపయోగించుకున్నాడు
కవి. బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక పౌరాణిక
ప్రతీక ద్వారా గీతకార్మికుని జీవితంలో ఉపయోగించే సాధనాన్ని సామాన్య పాఠకులకు కూడా
కళ్ళకు కట్టినట్లు ఊహించుకోవడానికి ఈ వర్ణన ఉపయోగపడుతుంది. అందుకే గుది కల్లుగీసేవారికీ, కొబ్బరి దింపులు
తీసేవారికీ తాటాకు కొట్టేవాళ్ళకీ ముఖ్యమైనటువంటి పరికరం ఇది. ఇంత నైపుణ్యంతో చేయాల్సిన ఈ వృత్తి Unskilled లో
పెట్టడం ఆశ్చర్యం.
ఇదే
కాదు…
చేతివృత్తులు
చేసే వాళ్లంతా తమ పనులు చేసేటప్పుడు ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ప్రతీ వృత్తీ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని
చేయాల్సిన పనులు. చేనేత ... ఎంత నైపుణ్యం ఉంటే దారాల్ని ఒడకాలి, వాటిని బట్టలుగా
చేయాలి. ఎంత నైపుణ్యం ఉంటే తప్ప, ఎన్నో డిజైన్లు వేయడం సాధ్యమవుతుందా?
వడ్రంగి
పని...చూడండి. ఒక చెట్టు నుండి తీసుకున్న చెక్కను రకరకాలుగా నిత్యం మనకి ఉపయోగపడే
వస్తువులుగా చేస్తారు. గుమ్మం, కిటికీ, అలమారు... ఒకటా, కుర్చీ, మంచం, రకరకాల
కుర్చీలు, రకరకాల మంచాలు... ఇంతేకాదు, ఒకప్పుడు బండికి పెద్దపెద్ద చక్రాలు కావాలి.
ఇంచుమించు బండి అంతా చెక్కతోనే తయారవుతుంది. శీలలు, ఇరుసులు తప్ప... ... ఇంతే
కాదు, ఒకప్పుడు మన బియ్యం, ధాన్యం వంటివాటిని కొలవడానికి ఉపయోగించే కుంచం, శేరు, సోల
వంటివన్నీ చెక్కతోనే కదా చేస్తారు.... అవన్నీ
ఎలాంటి చెక్కవాడాలో, వాటిని ఎలా తీర్చిదిద్దాలో అనేది నైపుణ్యం కాదా?
కమ్మరి...
మనింట్లో నిత్యం ఉపయోగించుకునే కత్తి దగ్గర నుండి, సుత్తి, కొడవలి, చాకు, (శీలలు),
తలుపులకు, కిటికీలకు వాడే గొళ్ళాలు, మిగతా పరికారాలు, కిటికీలలో వాడే ఊసలు,
తాళాలు, వాటి చెవులు... ఇలా ఒకటా, రెండా
నిత్యం
మనం చెప్పులు లేకుండా నడవలేం. గీతకార్మికుడు వాడే ‘ముస్తాదు’లో మంచి చెర్మంతో
చేసిన ఒరలు ఉండాలి. అప్పుడే ఆ కత్తులు పెట్టుకున్నా, అది ఏమీకాదు. వీటితో పాటు
సమస్త చేతివృత్తుల వాళ్ళూ ఎంతో నైపుణ్యంతో తమ తమ వృత్తుల్ని చేయాలి. కానీ, ఇవన్నీ Unskilled జాబితాలో పెట్టేసారు.
ఒక
చిన్న కవిత ద్వారా ఇన్ని విషయాలను
మన ముందుకు చర్చకు పెడుతున్నాడు కవి.
కోపం వచ్చినప్పుడు గీతకార్మికులు దానితోనే కొడుతూ ఉంటారు.
చిన్నప్పుడు నేను గాని, మా అన్న తమ్ముళ్లలో
ఎవరైనా సరే ఆలస్యంగా లేస్తే ఆ గుదితోటే కొట్టేవాడు మా నాన్న.
సామాజిక స్పృహ: శీలం భద్రయ్యగారి కవితలు అణచివేత, తిరుగుబాటు, సామాజిక అసమానతలను ప్రతిబింబిస్తాయి.
ఇది
మినీ కవిత్వమే కావచ్చు. ఒక్కొక్క కవిత ఖండిక మూడు లేదా నాలుగు పాదాల్లో
కొనసాగింది.
కానీ,
ప్రతి ఖండికలోను ఒక జీవితం ఉంది.
కొన్నిసార్లు
మూడు వాక్యాలే రాసినా, భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో కనిపించే జీవితం మూడు వాక్యాలుగా
వర్ణించాడేమో అనిపిస్తుంది. ఇదొక చమత్కారం మాత్రమే.
సంప్రదాయ
లేదా శిష్ట సాహిత్యంలో ఉపయోగించే పదాలు నిఘంటువుల్లో కనిపిస్తాయి. కొన్ని కింది వర్గాలు, వర్ణాల వారు
ప్రయోగించేవైనా కోస్తాప్రాంతాల్లోని పదాలు కొంతవరకు నిఘంటువుల్లోకి ఎక్కాయి. అయినా
నేటికీ, దళిత బహుజన కులాల వృత్తి పదాలు
ఇంకా నిఘంటువులకు ఎక్కలేదు. కానీ,
తెలంగాణలోని తెలుగు పద సంపద ఇంకా
నిఘంటువుల్లోకి ఎక్కాల్సింది, పాఠ్యాంశాల్లో చేరాల్సింది ఎంతోఉంది. రవ్యాశ్రీహరి,
నలిమెల భాస్కర్ మొదలైన వాళ్ళు ఆ దిశగా కొంతపనిచేశారు. మిగతా వాళ్ళు కూడా దాన్ని
అందుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.
సృజనాత్మక
రచయితలు తమ కవితలు, కథలు, నవలలు, నాటకాలు, సినిమాలలో నిత్యం ఇలాంటి పదజాలాన్ని
ప్రయోగించి తమ రచనలు చేయాలి. పాఠ్యాంశాల్ని నిర్ణయించేవారు ప్రతి పాంతం యొక్క
ప్రాంతీయ అస్తిత్వంలో ఒకటైన భాషను మరొక తరానికి పరిచయం చేయడానికి, తెలుగు వారి సాంస్కృతిక సంపదను
పరిరక్షించడానికి, విస్మరణకు గురికాకుండాను పాఠ్యాంశాల్లో చేర్చాలి. దురదృష్టం ఏమిటంటే, ఇటువంటి వాటికి పాఠ్యాంశాల్లో తగినంత భాగం దక్కట్లేదు అందువల్ల నిత్యజీవితంలో
దళిత బహుజనులు వ్యవహరించుకునే పదాలకు ప్రధాన జీవన స్రవంతికి ఎంతో దూరం కనిపిస్తుంది.
శీలం
భద్రయ్య ఈ కవిత్వం నిండా భాషను, భావాన్ని అక్షరీకరిస్తూ కవి
గీతకార్మికునిలో ఆత్మగౌరవ చైతన్యాన్ని నింపాడు.
గీత కార్మికుని జీవితంలోని అనేక పార్శ్వాలను వర్ణించాడు. తాటి చెట్టుని భూలోక కల్పవృక్షం
అంటారు. దాన్ని ఎందుకంటారో తెలియాలంటే ఈ కవిత్వం చదవాలి. తాటి ఆకు, తాటి చెట్టు, దాని కమ్మలు, దాని ఆకులు, దాని పళ్ళు, ఆ పళ్ళు తిన్న
తర్వాత ఆ టెంకలను నేలలో పాతితే తేగలు (గేగులు)
రావడం… ఆ
తాడిచెట్లు ఇళ్ళలో దూలాలుగా, నిట్రాళ్ళుగా, కొన్నిచోట్ల వంతెనలుగా ఉపయోగించుకుంటారు.
ఇంకొంతమంది బలమైన తాటి దూలాలతో మంచాలు కూడా చేయించుకుంటారు... ఇలా తాటిచెట్టు నుండి వచ్చే ప్రతీ వస్తువు ఉపయోగపడేదే. దీన్నంతా
కవిత్వం చేసి మనం ముందు ఉంచాడు కవి.
కవితాత్మక శైలి: శీలం భద్రయ్యగారి
కవితల్లో కవితాత్మకత, గ్రామీణ చిత్రణ, ఎంతో భావోద్వేగంతో కూడినలోతు ఉంటుంది. పురాణ
ప్రతీకలను ఆధునిక జీవితంతో అద్భుతంగా ప్రయాణించాడు.
●
యాదవులకున్నట్టు
తాటి గెలలకో
గీతకారుడున్నాడు
భగవద్గీతలో
శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎంత గౌరవం విలువ ఉన్నాయో, అంత వ్యూహం… ఆ తెలివితేటలు… అందరినీ
నడిపించగలిగిన శక్తి సామర్థ్యాలు గీతకార్మికులకు కూడా ఉంటాయనేది కవి ధ్వని. ఇలా ఒక్కొక్కటీ చెప్పుకుంటూ
పోతో ఎంత తాత్విక లోతులు ఉన్నాయో తెలుస్తుంది.
పరవశింపజేసే
ప్రకృతిగంగను
నేలమీదకు
దింపే
అపర
భగీరథుడు
సాధారణంగా ఆకాశం
నుండి కురిసే వర్షాన్ని గంగ అంటారు. అది నిష్కల్మషంగా ఉంటుంది. కనుక అది ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు.
దీనికి
పురాణాల్లో ఒక కథ ఉంది.
భగీరథుని
ముత్తాత సగరుడు. అతడు ఒకసారి అశ్వమేధ యాగం చేస్తాడు. అయితే ఆ యాగాశ్వాన్ని
ఇంద్రుడు దొంగిలించి, పాతాళంలో
కపిల మహర్షి తపస్సు చేస్తున్న ప్రదేశంలో ఆ
జంతువును నిర్బంధిస్తాడు. సగరుని 60,000 మంది
కుమారులు పాతాళ లోకంలో ఆ గుర్రం ఉందని తెలుసుకుంటారు. అప్పుడు
వాళ్ళు అక్కడికి వెళ్లి తమ బొంగురు గొంతులతో గట్టిగా అరుస్తుంటారు. ఆ అరుపులు కపిలమహర్షిని కలవరపరుస్తాయి. కపిలమహర్షి
కోపోద్రిక్తుడవుతాడు. సగరుని 60,000 మంది కుమారుల్నీ, తన అగ్ని నేత్రాలతో బూడిద చేసేస్తాడు. వారికి
ఉత్తమగతులు లభించాలంటే స్వర్గంలోని గంగను పాతాళానికి తేవాలి. అది పొందేవరకు సగరుని కుమారుల అంత్యక్రియలను పూర్తికాదు.
అంత వరకు వాళ్ళు స్వర్గానికి చేరుకోలేరు. అందువల్ల భగీరథుడు అయోధ్య సింహాసనాన్ని
అధిరోహించిన తరువాత, తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని, గంగా
దేవిని ప్రార్థించడానికి హిమాలయాల్లో తపస్సు చేస్తాడు. స్వర్గంలోని గంగను
భూలోకానికి తీసుకొస్తాడు. అది భూలోకానికి తీసుకొచ్చేటప్పుడు మళ్లీ శివుడ్ని
ప్రార్థన చేయడం, గంగను తలపై ధరించిన శివుడు ఒక పాయలో నుండి కిందికి వదలడం, తర్వాత
ఆ ప్రవాహం జాహ్న మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తడం, ఆ మహర్షి కోపంతో ఆ నదిని మింగేయడం.
మళ్ళీ భగీరథుడు ఆ మహర్షిని శాంతింపజేసి ఆతని చెవి నుండి చిన్న ధార రావడం, అది
సాగరంలోకి చేరి, ఆ తర్వాత పాతాళానికి వెళ్ళి బూడిదగా మారిన తన తాతముత్తాతలపై ప్రవహింపజేసి,
వాళ్ళంతా ఉత్తమ గతులు పొందేలా చేస్తాడు.
ఇది
పురాణాల్లో ఉన్న కథ.
ఇంద్రుడు
దొంగిలించడంలో లోకకల్యాణం ఉంది. శివుడి రౌద్రాన్ని తగ్గించి, భక్తులకు ప్రసన్నవదం
కనిపించేలాచేయడం వంటి పరమార్థాలు ఉన్నాయి. నిజంగా శివుడు ఉన్నా లేకున్నా తీవ్రమైన
కోపంతో ఉండేవాళ్లు కాస్త నీళ్ళు తాగితే శాంతిస్తారు. నరాలు సరిగ్గా పనిచేస్తాయి.
రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఆవేశం తగ్గుతుంది. ఇదంతా వాచ్యంగా చెప్పకుండా మన
పౌరాణికులు పాత్రల రూపంలో చెప్పారు. ఇంద్రుడు దొంగతనం చేశాడని చెప్పడంలో ఇంకా అనేక
పరమార్థాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ చెప్పకోవడానికి సమయం సరిపోదు. ప్రస్తుతం,ఈ
కల్లుని తాటి చెట్టు నుండి కిందికి తీసుకొని రావడానికి కూడా అంతే కష్టపడాలి అని
కవి చెప్తున్నాడనేది ఈ కథ ద్వారా తెలుసుకోవాలి.
ఆకాశమంత
ఎత్తులో ఉన్న తాటి చెట్టు మీద నుండి కల్లు తీసుకొచ్చే గీతకార్మికుడ్ని కవి అపరభగీరథుడుగా
అభివర్ణించడంలో దీన్ని ఒక పవిత్రమైన వృత్తిగా కూడా సూచిస్తున్నాడు. ఆ కష్ణ నష్టాల్ని స్ఫురింపజేస్తున్నాడు.
వృత్తిలోని
గౌరవాన్ని ఎంతో ఉదాత్తంగా వర్ణించాడు కవి. మామూలుగా చెట్టు ఎక్కినవారు దిగడమే కష్టం. అలాంటప్పుడు నడుముకి
వేలూడుతున్న నిండు కుండతో చెట్టు ఒక్కొక్క అడుగు కిందికి వేస్తూ, తన నడుముకీ,
తాడికీ చుట్టూ కట్టుకున్న మోకుని జాగ్రత్తగా ఒకచేత్తో జరుపుతూ, మరొక చేత్తో
చెట్టుని పట్టుకుంటూ దిగాలి. మళ్ళీ దిగేటప్పుడు గానీ, ఎక్కేటప్పుడు గానీ, కాలుకున్న
గుది (గుజి)ని సడలనివ్వకుండా చెట్టుకి గట్టిగా అదిమిపెట్టాలి. రెండు చేతుల్నీ చెట్టుకి
బలంగా వ్యతిరేక దిశగా నొక్కుతూ ఉండాలి. ఇదంతా చూసినంత సులువుకాదు. ఒక వ్యక్తిగా
ఎక్కడ సులువే. కానీ, ఒక్క చుక్కకూడా కిందికి పడకుండా చూసుకోవాలి. మరొకవైపు, లొట్టు
(కల్లు ఉన్న కుండ) గట్టిగా ఊడితే చెట్టుకి తగిలి పగిలిపోకుండా జాగ్రత్తపడాలి. ఇంకొకవైపు
తనని తాను కాపాడుకుంటూ ఉండాలి. ఎంత బ్యాలెన్స్ చేసుకుంటే ఇది సాధ్యమూ ఒకసారి
ఆలోచించండి. అందుకే తాటిచెట్టు పైనుండి కిందికి కల్లుతేవడమనేది భగీరథప్రయత్నం
వంటిది అన్నాడు కవి.
●
కల్లు చుట్టూ
కందిరీగలు
కష్టాన్ని తాగి
ముఖం వాచేలా కుట్టాయి.
మంచి
కవిత్వంతో పాటు, ఆ వృత్తి జీవన వేదన కూడా దీనిలో ఉంది. ఎక్కడో జరిగే కల్తీ కల్లులకు
వీళ్ళనే
బాధ్యులను చేస్తారు. ఎక్సైజ్
డిపార్ట్మెంటువాళ్ళు తనిఖీలని, కొంత కల్లుని తీసుకెళతారు. దాన్ని పరీక్షించి
కల్తీకల్లు అంటారు. అది కాదని చెప్పడానికి వీళ్ళ ఎదురుగా తనిఖీచేయరు. అక్కడికి
తీసుకొనివెళ్ళాక ఏమి కలుపుతారో ఎవరికి తెలుసు? అందువల్ల వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. అంతే
కాదు, స్థానికంగా ఉండే సారాయి దుకాణం యాజమాన్యం కూడా కుట్రలు పన్నే అవకాశం ఉంది.
మరోవైపు తమ చుట్టుపక్కలవాళ్ళు కూడా వీళ్ళ ఎదుగుదలను సహించలేక రకరకాలసమస్యల్ని
సృష్టించే అవకాశం కూడా ఉంది. స్థానిక పెద్దమనుషులతో కలిసి కుట్రలు చేస్తుంటారు.
వీటికి తోడు కల్లు తాగడానికి వచ్చేవాళ్ళలో
కొంతమంది పలికే అవాకులు చివాకులు చాలా చిరాకునీ, బాధనీ కలిగిస్తుంటాయి. కవితాంశం ఈ కష్టజీవుల మనసులోని సంఘర్షణను, అణచివేత
వల్ల కలిగే మానసిక గాయాన్ని స్పష్టంగా వెల్లడిస్తుంది. అయినప్పటికీ, ఈ బాధలోనూ తిరుగుబాటు
స్ఫూర్తి దాగి ఉంది, ఇది ఆ కులవృత్తి ఆత్మగౌరవ చైతన్యాన్ని కూడా తెలియజేస్తుంది.
●
మొదటగా పలకరించి
చివరగా వీడ్కోలు తీసుకునే
అతని ఆప్తనేస్తాలు
సూర్య చంద్రులు
కల్లు
గీసేవారు పొద్దున్నే లేచి చెట్ల దగ్గరకు వెళ్లాలి. కొద్ది ఆలస్యంగా అంటే ఎండ వచ్చిన
తర్వాత గెల కోత కోస్తే ఆ కల్లు పుల్లగా మారిపోతుంది. అందుకే పొద్దున్నే
సూర్యోదయం పలకరిస్తుందట. మధ్యాహ్నం కూడా చెట్లు ఎక్కి గెల సన్నని పొరను కోయాలి. నిజానికి అలా తాటిగెలలను రోజూ చిన్నచిన్నపొరకోసి
బొట్టుబొట్టుగా కల్లుకారడానికి పదును పెట్టడాన్నే కల్లు గీయడం అంటారు. మరలా సాయంత్రం గెల పొరను మళ్ళీ తాజాదనం చేసి కల్లు తీయాలి.అప్పుడు అతనికి వీడ్కోలు చెప్పేది
కూడా సూర్యుడే! అంటే, పొద్దున్నుండి సాయంత్రం వరకు
కష్టపడే గీత
కార్మికుడి కష్టాన్ని ఎంత అద్భుతమైన భావ చిత్రంలా
చెప్పాడో చూశారా కవి.
‘వెన్నులు
ధనువులా
వంగినా
తాటిచెట్టు
నిటారుగా నిలబెడుతుంది’
గీత కార్మికుడు అన్నిసార్లు చెట్టు ఎక్కి దిగడం, ఒక నిచ్చెన,
ఒకతునగాలు, నడుముకి మోకు, దానికి ఒకవైపు కత్తి, ఒకవైపు గుది, మధ్యలో కుండ… ఎంతో జాగ్రత్తగా వాటిని చూసుకుంటూ
పని చేయాలి. ఇంత కష్టపడేటప్పుడు వీళ్ళు త్వరగా ముసలి వాళ్ళలా కనిపిస్తారు. నడుము వంగిపోతుంది.
బలం సడలిపోతుంది.
ఈ స్థితినంతా చెప్తూనే, ఆ చెట్టు ఎక్కేటప్పుడు మాత్రం
నడుముకున్న మోకు వల్ల కాళ్లకున్న గుదివల్ల నిటారుగా నిలబడాల్సిన పరిస్థితి. ఇది వాచ్యంగా
కనిపించే అర్థం. కానీ, ధ్వన్యార్ధంలో గీత కార్మికుడికి తాటి చెట్టు ఆర్థికంగా
కుటుంబాన్ని ఆదుకుంటూ తమని ఆత్మగౌరవంతో నిలబెట్టే గొప్ప ఆధారమనిచెప్తున్నాడు. ఒక్క చిన్న కవితలోనే అనేక పార్శ్వాలను అందించటం
కవి ప్రతిభకు నిదర్శనం.
ఇలా ఎన్ని కవితలనైనా విశ్లేషించే
అవకాశం ఉంది.
కల్లు మా కులదేవత
మండువా మా భరతమాత
తాటిచెట్టు మా జాతి పతాక
సర్వాయి మా జాతిపిత
వంటి
కవితా ఖండికలు నినాదాలుగా బహుజనుల గుండెల్లో నిలిచిపోతాయి. ఈ కవితా సంపుటిలో ‘నేటి
గీతం పాడుతాను’ అనే ఒక వచన కవితా ఖండిక ఉంది. దీనిలో అన్ని సబ్బండ కులాల వారి
వృత్తి నైపుణ్యాన్ని, ఒకరికొకరు సహాయపడే విధానాన్ని ఎంతో తాత్వికంగా వర్ణించాడు కవి.
కవికున్న సామాజిక స్పృహ, సామాజిక అవగాహన, వృత్తుల్లో చూడాల్సిన ఉదాత్తత, ఒక వృత్తితో
మరొక వృత్తి పెనవేసుకున్న గ్రామీణ జీవన చిత్రంలో కనిపించే సౌందర్యం అద్భుతంగా అక్షర
చిత్రాలుగా వర్ణించాడు.
‘’ఎద్దుతోలును వలిచి
తంగేడు చెక్కతో శుద్ధిచేసి
ఆరబెట్టి సానబెట్టి
మురిపెంగా ముస్తాదు కుట్టి
గౌడన్న చేతికిచ్చిన నీ చేతిచలువను
గుర్తుచేసి కడజాతి కట్టుబాటు
ఎక్కడిదని పాటగా చేసి పాడుతాను
మట్టి ముద్దను పసిబిడ్డగా చేతుల్లో
తీసుకుని ఒడుపుగా వృద్ధిచేసి
తొట్టిలో బిడ్డను లొట్టిగా మార్చి
గౌడజాతికిచ్చిన కన్నతండ్రి ప్రేమను
పాటగా చేసి పాడుతాను’’
ఇలా కొనసాగే ఈ వచన కవితకు ‘నేటి గీతం పాడతాను’’ అని పేరు
పెట్టడం వెనుక, ఇప్పుడు ఎటువంటి సాహిత్యం రావాలో సూచిస్తున్నాడు కవి. ఇప్పుడు సబ్బండవర్ణాలు
ఒకరికొకరు ఎలా కలిసిమెలిసి ఉండాలో ధ్వనిస్తున్నాడు కవి.
ఈ కవిత్వం చదువుతున్నంతసేపూ
చెట్టుమీద ఉన్న మా తాత కనిపించాడు
ఈ కవిత్వం చదువుతున్నంత సేపూ
నవ్వుతూ తాటి చెట్టు ఎక్కి
సాయంత్రానికి అందరితో సరదాగా గడిపే
మా నాన్నే కనిపించాడు.
ఈ కవిత్వం చదువుతున్నంత సేపూ
గ్లాసుల్లో కల్లు పోసి ఇచ్చే మా అమ్మే
అటు ఇటు తిరుగుతున్న సందడేదో వినిపించింది.
ఈ కవిత్వం చదువుతున్నంతసేపూ
తియ్యని సువాసన ఏదో
అక్షరాలతో నా చుట్టూ
అలముకున్నట్లే అనిపించింది.
‘’ప్రముఖ కవి జూలూరు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో
మొట్టమొదట బీసీ అస్తిత్వ స్పృహతో "వెంటాడే కలాలు వెనకబడ్డ కులాలు" అను పేరుతో
కవితా సంకలనం 2002 సంవత్సరంలో వెలువడింది. ఇందులో బీసీ కులాలకు చెందిన కవులు తమ కులాల
ఆస్తిత్వాన్ని ప్రకటిస్తూ రాసిన కవితలు ఉన్నాయి. అదేవిధంగా గౌడుల అస్తిత్వాన్ని చాటుతూ
పలువురు కవులు, రచయితలు గౌడుల ఆస్తిత్వాన్ని తమ రచనల ద్వారా తెలియజేశారు. వారిలో మామిండ్ల
రామా గౌడ్, ఆచార్య ననుమాస స్వామి, నేరెళ్ల శ్రీనివాస్, కె. వి. ఎల్, కొంపెల్లి వెంకట్
గౌడ్, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, మోత్కుల నారాయణ గౌడ్, డాక్టర్ పాండాల మహేశ్వర్,
డాక్టర్ తండ హరీశ్ గౌడ్, మెరుగు మల్లేశం, నకిరెకంటి శ్రీనయ్య గౌడ్, పల్లె దీక్షిత మొదలగువారు
గౌడుల అస్తిత్వాన్ని తమ రచనల ద్వారా చాటి చెప్పారు. గౌడ కులస్తుడు కాకపోయినా ప్రముఖ
కవి అంబటి వెంకన్న రాసిన 'కల్లు పాట' గేయం ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. ఇదే
స్పృహతో కవిత్వం రాస్తూ గౌడ జాతి అభ్యున్నతి కోసం పాటుపడుతూ గౌడ జాతి ఆత్మాభిమానాన్ని,
గౌడుల జీవన విధానాన్ని చాటి చెబుతూ శీలం భద్రయ్య రాసిన కవితా సంపుటే ఈ 'ముస్తాదు'.’’
అని డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య ముందుమాటలో చెప్పిన మాటలతో ఏకీభవిస్తూ ముగిస్తున్నాను.
మళ్ళీ నన్ను నా బాల్యానికీ, నా గ్రామానికీ తీసుకెళ్ళి మావాళ్ళందరితో కలిసి వచ్చినట్లనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన కవిశీలం భద్రయ్యగార్కీకీ, అంతర్జాల ప్రసంగాలను ఏర్పాటు చేస్తున్న జయప్రకాశ్ గార్కీ, దీనిక తోడ్పాటుని అందిస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.నామోజు బాలాచారి గార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓపిగ్గా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు.
(ఆదివారం 22 జూన్ 2025, సాయంత్రం 6గంటలకు
"తెలుగు భాషా చైతన్య సమితి, ద్వానా సాహితీ కుటీరం & తెలంగాణ సాహిత్య అకాడమీ,
హైదరాబాద్" వారు సంయుక్తముగా నిర్వహించిన "కొత్త పుస్తకం -2" శీర్షికన
"ముస్తాదు" తొలి గౌడ కవితా సంపుటిని జూమ్ వేదికలో నేను చేసిన ప్రసంగంలోని
ముఖ్యాంశాలు.)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి