ప్రసాద్ సూరి
ఈరోజు (18.6.2025) ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార జాబితాలో తెలుగు పేరది.
అతని గురించి ఇంటర్నెట్ లో వెతికితే
ఒకటి రెండు వ్యాసాలు మాత్రమే కనిపిస్తాయి.
‘ఉదయిని’ అంతర్జాల సాహిత్య పక్ష పత్రికలో
ఒక వ్యాసం కనిపిస్తుంది.
‘’తెలుగు సాహితీ సాంస్కృతిక కళా రంగాలలో, కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత, దేశ, లింగ, వివక్షలను,
విభేదాలను విడనాడి,
ప్రేమ స్నేహ,
సర్వ మానవ సమానత్వంలను
పెంపొందిచడం కోసం
వెలువడే సాహిత్య అభివృద్ధికి
కృషి చేస్తుంది.
ఇటు వంటి కృషి చేసే
వ్యక్తులను, సమూహలను,
సంస్థలను సమర్ధిస్తుంది.
రండి. కొత్త వెలుగులకోసం
మరోప్రపంచం వైపు కలిసి నడుద్దాం.’’
అని తమ ఆశయాలను ప్రకటించింది
‘ఉదయిని’ పత్రిక.
ఈ పత్రికలోనే ‘మైరావణ’ నవలను
పరిచయం చేసే
ఆ వ్యాసం పేరు
‘ప్రసాద్ సూరి విరచిత ' మైరావణ’’
దీన్ని 12 డిసెంబర్ 2023 వతేదీన
ఆ పత్రికలో ప్రచురించారు.
ఆ వ్యాసాన్ని తాడి ప్రకాష్ రాశారు.
ఎన్నో అతిశయోక్తులతో
కొనసాగినట్లు ఉంటుంది ఆ వ్యాసం.
తాడి ప్రకాష్ గారు
తెలుగు దిన పత్రికల్లో
న్యూస్ ఎడిటర్ గా ఎంతో అనుభవం ఉన్నవారు. జర్నలిజం జ్ఞాపకాలతో
ఆయన రాసిన 'ఏలూరు రోడ్డు' పుస్తకం బాగా పాపులర్ అయింది.
ఏలూరు భాషలో ఎలా మాట్లాడుకుంటారో కూడా తన వ్యాసంలో ప్రసాద్ సూరి గురించి
ఆత్మీయంగా రాశారు.
ఇప్పుడు ఆయన మాటలు
అతిశయోక్తులు కాదనిపిస్తుంది!
పేరును బట్టి విలువలు మారిపోయే కాలం కదా!
ప్రసాద్ సూరి నూనూగు మీసాల నూత్నయౌవనంతో రచించిన ‘మైరావణ’కు బహుమతి రావడంతో
బహుశా చాలామంది
ఈ వ్యాసాన్ని చదివి మొదట
అలాగే అనుకుంటారేమో!
ప్రసాద్ సూరి మొదటి నవల
‘మై నేమ్ ఈజ్ చిరంజీవి'.
దీన్ని కూడా ఛాయా పబ్లికేషన్స్ వారే ప్రచురించారు.
మైరావణ రాస్తున్నప్పుడు,
ప్రసాద్ సూరికి 20ఎళ్ళు దాటి
21 లో ప్రవేశిస్తున్న యువకుడు!
ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసిన ప్రసాద్ సూరికి
చిత్రకారుడు మోహన్ అంటే చాలా ఇష్టపడతాడట.
" బెస్తవారి నిజ జీవితాన్ని తెలుగులో ఈ ‘మైరావణ’ నవలే తొలిసారిగా స్పష్టంగా చిత్రిస్తోంది.అపోహలు స్థిరపడి ఉన్న సమాజంలో చావుకు తెగించే వారి వేట జీవనాన్ని, కడుపు చేత పట్టుకొని బతికే వలస బతుకుని బయట ప్రపంచానికి తెలియని కోణాల నుంచి స్పష్టంగా చూపుతోంది ఈ నవల.
జానపద వీరుడి వంటి బెస్త మైరావణుడు ప్రధాన పాత్రగా భారతదేశ గత ఎనభై ఏళ్ళ సామాజిక చరిత్రకి వర్తమాన రాజకీయ అంశాలను చేర్చి బలమైన తర్కంతో సాగింది ఈ నవల. జానపద వీరుడు అంటేనే 'అధికార మదానికి, పీడనకీ' లొంగనివాడు, తల తెగిపడుతున్నా చెదరనివాడు కనుక రచయిత దీని ద్వారా ఏమి చెప్పదలచినాడో పాఠకులు సులభంగానే గ్రహించగలరు’, అని సొలోమోన్ విజయ్ కుమార్ తన ముందుమాటలో చెప్పారు.
‘’మన చుట్టూ ఉండే చిన్న చిన్న మనుషుల్లోనే ఒక మైరావుడు కూడా ఉండొచ్చని, దేశాలు, సముద్రాలు దాటిన ఒక వీరగాథ మన మధ్యే పుట్టవచ్చని, మైరావుడి తో పాటూ నీళ్ళల్లో చేపలని, సముద్రంలో చుక్కలని వలలో మూట కట్టేందుకు బయల్దేరండని పాఠకులను ఆహ్వానిస్తున్నాను. సినిమా కనబడేలా రచించిన ఈ యువ నవలాకారుడు రాబోయే కాలంలో మరిన్ని గొప్ప రచనలు , Be ready for a grand, immersive thrill ride…’’ అని సినీ రచయిత రఘు బండి వ్యాఖ్యానించారు.
‘’మాదిగ జీవితాన్ని వేముల ఎల్లయ్య కక్క నవలలోకి ఎక్కించాడు. ఇక కమ్మరి, కుమ్మరి, శాలీలు, వైశ్యులు చాలామంది రచయితలు అయ్యారు. వాళ్ళ జీవితాల్ని రాసారు. అలాగే జర్నలిజం నుంచి వచ్చిన రచయితలు, లాయర్లు అయిన రచయితలు వాళ్ళ వృత్తిజీవితాలని కూడా కథలుగా మలిచారు. కానీ విచారం... మత్స్యకార కులానికి చెందిన రచయిత ఒక్కడూ లేడే, ఆ కథలూ లేవే..
మరి నువ్వూ? అనొచ్చు.
నేను చిన్నవాడిని, చూసిన జీవితం చాలా చిన్నది. చేపలు పట్టడం నాకు రాదు, నా పని కాదనుకుంటూనే వచ్చాను. అయితే హైదరాబాద్ వచ్చాకే నా అస్తిత్వ బలం నాకు అర్థం అయింది. నా 'మై నేమ్ ఈజ్ చిరంజీవి' నవలలో కొంత ఆ జీవితాన్ని చెప్పగలిగాను. ఓ ముప్పై ఏళ్ళు వచ్చాక జీవితానుభవం బాగా గడించి మా కథ రాద్దాం అనుకున్నాను. అప్పటిదాకా నా బతుక్కి ఎవడు గ్యారెంటీ అని రియలైజ్ అయ్యి 'మైరావణ' నవలతో ఓ ప్రయత్నం చేసాను.’’ అని ప్రసాద్ సూరి తన నవల రచనా నేపథ్యాన్ని ఒకచోట చెప్పుకున్నాడు.
'మైరావణ’ నవల: సారంలో విశిష్టత, రూపంపై అశ్రద్ధ…పేరుతో ఫేస్ బుక్ లో మరొక సమీక్ష కనిపిస్తుంది. దీన్ని, ప్రసిద్ధ నవలా రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు రాశారు. ఈయన వృత్తి రీత్యా మెరైన్ ఇంజినీర్. వీరి మొదటి నవల 'యారాడ కొండ' 2020లో ఆటా బహుమతి పొందింది. ‘తూరుపు గాలులు', 'చలిచీమల కవాతు' వీరి కథా సంపుటాలు. వీరి కథల ఇంగ్లీష్ అనువాదం ‘ఈస్ట్ విండ్' క్రిందటి ఏడాది విడుదల అయింది. ‘చెదిరిన పాదముద్రలు' నవల 2024 వ సంవత్సరానికి ‘ఆటా బహుమతి' పొందింది.
మైరావణ నవల గురించి ఉణుదుర్తి సుధాకర్ ఇలా వ్యాఖ్యానించారు‘’ఒకప్పుడు ఓడల్ని నిర్మించిన వాడబలిజీలు, వాళ్లే చిన్నచూపుచూసే జాలరులుగా మారిపోయారంటారు, అదే కులానికి చెందిన ఈ నవలా రచయిత ప్రసాద్ సూరి. ఇది వీరి రెండవ నవల (మొదటి నవల 'చిరంజీవి’ని కూడా ఛాయా రెసోర్స్ సెంటర్ వారే ప్రచురించారు). ఉత్తరాంధ్ర తీరవాసులు బర్మా వలసవెళ్లి, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో అనేక కష్టాలకోర్చి, కాందిశీకులుగా కట్టుబట్టలతో తిరిగిరావడం, ప్రాజెక్టు నిర్మాణాల్లో పని వెతుక్కుంటూ పల్నాడు ప్రాంతాల్లో స్థిరపడడం, అక్కడ లంబాడీలతో సంపర్కం, నక్సలైటు ఉద్యమం - ఈ క్రమంలో 'మైరావణుడు’ అనబడే జనాదరణ కలిగిన నాయకుడు ఉద్భవించడం ఈ నవలకు ఇతివృత్తం.
కళింగాంధ్ర (లేదా ఉత్తరాంధ్ర) స్థానికత, బలమైన మాండలికం, చేపలుపట్టేవారి సాంకేతిక పరిభాషాప్రయోగం, చేపల్లో రకాలు, వలల నిర్మాణం, చేపలు పట్టడంలో చాకచక్యం - ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ నవల చదవాల్సిందే.
నవల మొత్తం, మైరావణుడు అనే ఒక వ్యక్తిని ఎత్తి చూపడంగా, అతని సాహసకృత్యాల సముదాయంగా, కనిపిస్తుంది. తన కులమైన వాడబలిజల జీవితాల్ని శోధించడమే తన లక్ష్యంగా రచయిత చెప్పుకున్నాడు.’’
అంతర్జాలంలో కొనుక్కోవడానికి
‘మైరావణ’ నవల
అందుబాటులోఉంది.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 18.6.2025
ఈనాడు, ఆంధ్రప్రదేశ్ 19.6.2025 సౌజన్యంతో
విశాఖవాసి ప్రసాద్ సూరి
యువ పురస్కారానికి ఎంపి కైన 'మైరావణ' రచయిత ప్రసాద్ సూరి విశాఖపట్నానికి చెందినవారు. ఈయన అసలు పేరు సూరాడ ప్రసాద్. విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లిలో 2000 డిసెంబర్ 12న జన్మించారు. హైదరాబాద్లోని జేఎన్ఏఎఫ్యూలో 2019-24 మధ్య బీఎఫ్ఎ చేశారు. చరిత్రపై ఆసక్తితో ప్రస్తుతం గుజరాత్లోని వడోదరలో ఎంఏ ఆర్కియాలజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈయన మత్స్యకార కుటుంబానికి చెందినవారు. ఇంట్లో చదు వుకున్నవారెవ్వరూ లేకపోయినా సొంతంగా తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకొని రచనా వ్యాసంగం కొనసాగించారు. తెలివి, ధైర్యం, బలం ఉన్నవాడికి అదృష్టం కలసి వస్తే ఏం చేస్తాడన్న ఇతివృత్తంతో మైరావణ పుస్తకం రాశారు. ఇది విశాఖ తీరప్రాం తంలో చేపలు పట్టే బెస్తవాళ్ల జీవితకథ. దాని ముఖచిత్రంపై బొమ్మను సొంతంగా గీశారు. 'మైనేమ్ ఈజ్ చిరంజీవి' ఈయన తొలి రచన.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి