ఈ కాలంలో రావలసినన శతకం
తెలుగు సాహిత్యంలో ఆనాటి నుండి నేటి వరకూ నిత్యనూతనంగా కొనసాగుతున్న గొప్ప సాహిత్య ప్రక్రియ శతకం. సాధారణంగా అప్పుడే ఛందోబద్ధమైన పద్యాన్ని అభ్యసించే తొలిదశలోనూ, చివరి దశలోనూ శతకం రాస్తుంటారు. తొలిదశలో శతకం రాసేవాళ్ళు అమ్మా, నాన్నా, కుటుంబం, దైవం,సమాజంలో తాను చూసిన ప్రతి అంశం పైనా పద్యం రాయాలని అనుకుంటారు. చివరి దశలో శతకం రాస్తే అది దైవాన్ని స్తుతిస్తూ లేదా ప్రయోగాత్మకంగా గానీ ఉంటాయి. సురభి శ్రీనివాసరావు గారి పద్యాలు చూస్తుంటే తొలిదశకు చెందినవని తెలుస్తుంది. తల్లిదండ్రుల పట్ల అచంచలమైన ప్రేమతో తాను రాస్తున్న కవిత్వాన్ని, ముఖ్యంగా ఛందోబద్ధమైన పద్యాల్ని వాళ్ళు చూడలేకపోయారనీ, అయినా తానిప్పుడు రాసిన శతకాన్ని వారికే అంకితమిస్తూ ఆ బాధా, సంతోషాల్ని మిళితం చేసిన ఒక మంచి పద్యంగా వర్ణిస్తూ ఇలా అన్నారు.
అమ్మ, నాన్న! మీరలమరులై దివికేగ
కనగలేరు నాదు కవనమిపుడు
శతకమొకటి వ్రాసి చరణముల స్పృశించి
యంకితమ్ము నిత్తు నందుకొనరె
కుటుంబ సంబంధాలలో అమ్మానాన్న వాళ్ళ దగ్గర పెళ్లి గురించి దేవుడు చక్కగా వర్ణించారు కవి. కోడల్ని అత్తమామలు కుటుంబం సరిగ్గా చూసుకుంటే ఆ బంధం ఎలా ఉంటుందో కొత్త కోణాలు వివరించారు శ్రీనివాసరావు గారు. అక్రమ సంపాదన గురించి రాజకీయాల్లో వస్తున్నటువంటి మార్పులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలైనటువంటి విషయాలు ఈ శతకంలో ఉన్నాయి. మానవులు నివారించడానికి భూమి దొరకనంతగా అనేకమంది ఈ భూమిని సొంతం చేసుకోవడం ఒకటైతే మనిషి అంతరిక్షంలో కూడా నివసించాలని అక్కడ కూడా వ్యాపారాలు చేసి కొత్త కొత్త విషయాలు ఈ శతకంలో ఉన్నాయి.
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అటువంటి అప్పుడు భర్త సర్దుకుపోయే దాని గురించి చమత్కారంగా చెప్తారు శ్రీనివాస్ గారు. ప్రకృతి పరిరక్షణలో మొక్కలు, ఆ మొక్కల్లో కొన్ని మనకి ఔషధాలుగా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయన్న విషయాల్ని కూడా తన కవిత్వం లో చేర్చారు.
పైకి కనిపించే సమాజం మాత్రమే కాకుండా జీవుడు అంతరంగికంగా పడే సంఘర్షణ ను కూడా చాలామంది కవులు రాస్తుంటారు . వనారస శ్రీనివాసరావు గారు కూడా తన కవిత్వంలో సామాజిక పరిస్థితులు ఎంతగా రాశారో, మనిషి ఆత్మ అంతరాత్మల గురించి కూడా ఆలోచించవలసినటువంటి వతాత్విక విషయాలను ఈ కవిత్వంలో కొన్ని చోట్ల ప్రస్తావించారు.
నేడు చాలామంది తినడానికి తిండి లేని వాళ్ళు ఉంటే మరి కొంతమంది లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ, తినడానికి అవకాశం లేని అనేక జబ్బులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా షుగర్, బిపి, థైరాయిడ్, గుండె సమస్యలు వంటివి ఆహారాన్ని నియంత్రించుకోమని చెప్తుంటాయి. ఇష్టం వచ్చినట్టు తింటే కుదరదని చెప్పే పలు రోగాలతో బాధపడుతున్న వారి గురించి దీనిలో చాలా చక్కగా ప్రస్తావించారు శ్రీనివాసరావు.
మాతృభాష అయినటువంటి తెలుగుని ప్రపంచీకరణ ఫలితంగా విస్తరిస్తున్న ఆంగ్ల భాష మింగేసి పరిస్థితులు ఏర్పడుతున్నాయనే ఆందోళన కూడా ఈ శతకంలో కనిపిస్తుంది.
కవికి భారతీయ ధర్మం పట్ల, సంప్రదాయాల పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్నట్లు ఈ శతకంలో కనిపిస్తుంది.
మనం కొన్నిసార్లు చాలా పరుషంగా మాట్లాడుతుంటాం. ఆ మాటలు ఎదుటివారిని ఎంత బాధ పడతాయో చెప్పే పద్యాలు కూడా దీనిలో ఉన్నాయి. దీనిలోని ఛందస్సు, అలంకారాలు వాటి గురించి నేను ప్రస్తావించట్లేదు. అచ్చం రాయుడు మీ గొప్ప కొన్ని లోపాలున్న వాటిని కాలక్రమంలో సరిచేసుకుంటారు. నష్టం లేదు. తెలుగు సాహిత్యాన్ని ఒక క్రమపద్ధతిలో చదివిన వారు కూడా ఏకొద్దిమందో తప్ప పద్యాన్ని రాయడం లేదు. ఒక కళాకారుడిగా స్వీయ ఆసక్తితో పద్యరచన చేస్తున్న శ్రీనివాస్ గార్ని ప్రతి ఒక్కరూ అభినందించాలి. ఈ శతకంలో కొన్ని పద్యాలలో అలంకారాలు, ఆయన చూపిన సాదృశ్యాలు వేమన శతకాన్ని తలపింపజేస్తాయి. ఈ పద్యం చూడండి.
కొత్తచెప్పు గరచు కొన్ని దినమ్ములు
బెదరకుండ తొడుగ బిగువు సడలుఁ
గొత్త బాధలుండు కొన్ని నాళ్ళట్టులే
శివుని యాన బలుకు శ్రీనివాసు
మనం నిత్యం వాడుకొనే వస్తువులతోనే మనసులో శాశ్వతమైన ముద్రవేసేలా జీవన సత్యాలు చెప్పడం కవి లోకజ్ఞతకు నిదర్శనం.
ఈ శతకంలో కవి తనకిష్టమైన దైవాన్ని సంబోధిస్తూ ఆ దైవం పై ప్రమాణం చేస్తూ కవి పలుకుతున్న పలుకుల మకుటంగా రావడం చాలా బాగుంది.
మొత్తం మీద ఈ శతకంలో మూడు రకాలుగా దీనిలోని వస్తువుని వర్గీకరించవచ్చు. . అందరూ అనుకునే సమస్యల్ని, ఆ పరిస్థితులనే ప్రముఖంగా వర్ణించటం…
నీటిలోన మొసలి నిక్కు జూపుచునుండు
వెలికి వచ్చినంత వెతలనొందు
స్థానబలిమి నెఱిగి సాహసింప వలెను
శివుని యాన బలుకు శ్రీనివాసు
కొన్నిసార్లు మనం స్థానబలిమితో ప్రవర్తిస్తుంటాం. ఇక్కడ కేవలం స్థానబలిమంటే ఆ స్థలం అని మాత్రమే కాదు. తనకున్న కులం, తనకున్న ఆర్థిక వనరులు, తనకున్న అధికారం ఇవన్నీ కూడా స్థానబలిమిలో అంతర్భాగాలుగానే అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఈ పద్యం చదివే వారికి వేమన పద్యం ఒకటి గుర్తుకొస్తుంది.
నీటిలోన ముసలి నిగిడి ఏనుగుబట్టు
బైట కుక్కచేత భంగపడును
స్థాన బలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినురవేమ
మనుషులు తాము ఆంతరంగికంగా ఒక తాత్విక కోణంతో జీవిస్తూనే లౌకిక జీవితాన్ని అనుసరించే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో జీవిస్తుంటారు. అలా మనిషిలోని ఆంతరంగిక, భౌతిక జీవితాన్ని విశ్లేషించుకుంటూ వెళ్లవలసిన జీవన తాత్వికతను కొని పద్యాలలో వివరించటం. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలను కవిత్వీకరించి, మంచి చెడుల ప్రస్తావన చేయడం.
తల్లియావు గడ్డి తా పొలమ్మున మేయ
గట్టునెటుల మేయు కడనదూడ?
తండ్రి సేయుతప్పు తనయులున్ జేయరే!
శివుని యాన బలుకు శ్రీనివాసు
సమాజంలో మనుషుల ప్రవర్తన కుటుంబ విలువలతోనే ముడిపడి ఉంటుంది. కుటుంబంలో తల్లిదండ్రులు ఆదర్శవంతమైన జీవనాన్ని జీవించాలి. దాని ప్రభావమే పిల్లలపై పడుతుంది. ఆ తర్వాత పడే బలమైన ప్రభావం పాఠశాల. మూడవది సమాజం. అంటే చుట్టూ ఉండే పరిసరాలు మానవ సంబంధాలు …ఇవన్నీ.కానీ మనం సమాజంలో ఉన్నటువంటి సమస్యను మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ దానికి మూల కారణమైన కుటుంబం, ఆ కుటుంబంలో తల్లిదండ్రుల ప్రవర్తనే అత్యంత ముఖ్యమనేది గుర్తించాలని ఈ పద్యంలో చాలా చక్కగా కవి వర్ణించారు.
ఇలా ఈ కాలానికి కావలసిన కవిత్వంగా ఈ శతకాన్ని వర్ణించిన శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ -500 046, ఫోన్: 9182685231
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి