ప్రఖ్యాత కవి సుగమ్ బాబు గారు ఈరోజు 18.10.2022 వతేదీన మరణించారని ఇప్పుడే చదివాను. ఆయన మరణం అప్పుడే కవిత్వం రాసేవారికి తీరని లోటు. తెలుగు కవిత్వంలో అనేక ప్రయోగాలు జరిగాయి. దీనిలో సుగమ్ బాబుగారు కూడా చేరి, అనేక ప్రయోగాలు చేశారు. రెక్కలు ప్రక్రియ సృష్టికర్తగా పేరుగాంచిన సుగమ్బాబు గారి అసలు పేరు మహబూబ్ ఖాన్. ఈయన 1944, ఏప్రిల్ 1న గుంటూరు లో సకీనాబీబీ, ఫరీద్ఖాన్లకు జన్మించారు. బి.ఏ. వరకూ చదువుకున్నారు. తర్వాత ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్నత చదువులు చదువుకోలేకపోయారు. తెలుగు సాహిత్యంతో పాటు, ఆంగ్లసాహిత్యంపై కూడా పట్టుసాధించారు. పైగంబరకవులలో ఒకరై సుగమ్బాబు 2003లో రెక్కలు అనే నూతన రూప ప్రక్రియను ప్రవేశపెట్టి, దాన్నొక ఉద్యమంగా నడిపించారు. రామాయణం, భారతాలను, భగవద్గీతను కూడా రెక్కలులో వచ్చేలా కొంతమంది చేత రాయించారు. హిబ్రూ విశ్వవిద్యాలయం, ఇజ్రాయేల్కు చెందిన సుర్మన్ డేవిస్ ఈ రెక్కలను 'wings' పేరుతో ఇంగ్లీషులో అనువదించారు, చరలో సెలయేరు (1968), విప్లవం(1969), పైగంబర్ కవులు(1971), సూరీడు (1971),లెనిన్... లెనిన్ (1984),రెక్కలు (2004) ధమ్మపదం (2013) మొదలైనవి ఆయన రచనలు.ఆయన రచనలపై నేను రాయలసీమ జాగృతి మాసపత్రిక, జనవరి, 2018లో ఒక వ్యాసాన్ని రాసినప్పుడు, దాన్ని చదివి ఆయన ఎంతో సంతోషించారు. ఆతర్వాత ఆయనతో కలిసి అనేక సాహిత్య సభల్లో పాల్గొన్నాను.
వ్యక్తిగతంగా నన్ను ఆయన ఎంతో ఇష్టపడేవారు. ఆయనే ఫోన్ చేసిన చాలా సేపు మాట్లాడేవారు. ఆయన చాలామందిని రెక్కలు కవిత్వరూపం ద్వాారా సాహిత్యం వైపుకి నడిపించారు. కొంతమందికి ముందుమాటలు రాయమని నాకు ఫోను చేసి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక సహృదయసాహితీవేత్త మరణించడం తెలుగు సాహిత్యానికి తీరనిలోటు. ఆయన మరణానికి చింతిస్తూ, ఆయన కుటుంబసభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి