శతక రచయిత ఆచార్య దార్ల
వెంకటేశ్వరరావుగారికి సభా ముఖంగా అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తర్వాత
ఆచార్య దార్లవారి జీవితాన్ని, సాహిత్య ప్రస్థానాన్ని సీనియర్ ఫెలో డా॥ కళ్యాడపు రమేశ్ సంక్షిప్తంగా పరిచయం చేస్తూ...
‘‘వేసవి సెలవులకు వెళ్ళితినూరికి
ఉక్కబోసిచంపెఊరునందు
అన్ని మరచిపోతి అమ్మను చూడగా
దారి పూలతోట దార్ల మాట.
వేసవిఉక్కపోయిస్తుంది,చెమటకక్కిస్తుంది,ఊరికేకూర్చోనివ్వదు.
ఈయన కోనసిమ కుర్రాడు. కాబట్టి అన్నిటినిదాటుకోగలిగి అమ్మను చూసే సరికి అంతా
మరిచిపోయాడు. ఎలాంటి కవి అయినా ఉద్యమకారుడైనా, విప్లవకారుడైనా, రక్తం ఉరకలేసినా
అమ్మ అమ్మే. అమ్మను మించిన దైవం లేదు. అంతేకాదు అమ్మతనం కొడుకు తనం దానిని
చెప్పడానికి రాసిన ఉదాహరణకి. మరో పద్యం...
కట్టుకున్న హాయి కాటను చీరయే
పెట్టవలయు గంజి పట్టుబట్టి
ఉతికినప్పుడల్లబ్రతుకేమొబేజారు
దారి పూలతోట దార్ల మాట !
నిజం చెప్పాలంటే ఈ
పద్యం కొంత గిలిగింతలు పెడుతుంది. కవి ఈ పద్యంలో ఒక మెలిక పెట్టారు. అసలు
కట్టుకున్న హాయి కాటను చీరయేది. కాటను చీర ఎవరైనా కట్టుకోవచ్చు. సరే స్త్రీలే కట్టుకున్నారనుకొండి.
కట్టుకుంటే హాయిగా ఉంటుంది. అసలు హాయి ఎవరికి కట్టుకున్న వారికా చూసేవారికా?పెట్టవలయు గంజి పట్టుబట్టి! ఈ గంజి
పెట్టేదెవరు మనకు ఆమె పెడుతుందా? ఈయన పెడతాడా? లేదా ఇంకెవరైనా పెడతారా?ఇలా చాలా పద్యాల్లో
నిబిడీకృతమైన అర్థాలు చాలా ఉన్నాయి. ఉతికినప్పుడల్లాబ్రతుకేమొబేజారు! అసలు బేజారు పడాల్సిన పనేముంది? నిజానికి స్త్రీ కట్టుకుంది అనుకొండి చాలా
ఇష్టంగా, ఈ చీరలో చాలా ఆనందంగా ఉన్నానని మురిసిపోయి ఉండవచ్చునేమో గాక! కాని ఇక్కడ ఉతికినప్పుడల్లాబేజారుఅంటాడు కవి. ఇలా గిలిగింతలు పెట్టే
సందర్భాలు పద్యాల్లో కనబడతాయి. ఒక్కో పద్యం రెండు మూడు అర్థాలకు దారి తీస్తూ
చెక్కిలిగింతలు పెట్టే పద్యాలివి. ఇలాంటి భావాలు చాలా ఉన్నాయి. అమ్మతో ఆత్మీయతను
పంచుకున్న భావాలున్నాయి. దానితో పాటుగా మరో పద్యం చూడండి.
‘‘కులము మతములన్నికుత్సితబుద్ధులు
కలపవలయు గాని కలహమేల?
మంచి కన్న మించు మానవత్వము లేదు
దారిపూలతోట దార్లమాట
నిజానికి దార్లవారు ఒక అస్తిత్వ చైతన్యం నుంచి వచ్చినా ఇంత అభ్యుదయంగా ఉంటారని నేను ఊహించలేదు. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఆత్మీయత, అనురాగం, స్నేహశీలత్వం, ఆధునికతల్లో ఉన్న వృత్తులకు సంబంధించి కూడా ఆయన చెప్పడం, సామాజిక ఉద్యమాలు, సామాజిక సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, కొన్ని చోట్ల పాటకులకే ఆలోచించుకోమని వదిలిపెట్టిన సందర్భాలు ఈ సమకాలీన, వర్థమాన సమాజంలో చిగురించిన ఈ దార్ల శతకమనేది ఒక మంచి పరిణామం. దీనికి మకుటం ‘దారిపూలబాట దార్ల మాట’ అనేది హాయిగా చెప్పారు కాని ఈయన చెప్పిన విషయాలు పూలబాటకు తీసుకెళతాయనికోరుకోవచ్చుగాని దారి మాత్రం ముళ్ళబాట. ఆ పూలబాటను వేసుకోవాలంటే ఈ ముళ్లబాటను దాటాలి అనే స్పృహ ఈ శతకం ద్వారా తెలియజేశారు. ప్రతి పాఠకుడికి అది అర్థమవ్వలనే ఉద్దేశ్యంతో రాశారు. ప్రతి పద్యంలోనూ అది కనిపిస్తుంది. ఈ శతకం రాసినందుకు ఆచార్య దార్లవెంకటేశ్వరరావుగారిని మేమంతా అభిమాన పూర్వకంగా, అభినందన పూర్వకంగా, మాకు పాఠం చెప్పిన అధ్యాపకుడిగా, ఆత్మీయతను పంచుకుని, అక్కున చేర్చుకుంటూ, మేమూ గర్వపడుతూ, ఇలాంటి మరో ప్రక్రియలోకి, మరో భావనలోకి విశాల ప్రపంచంలోకి వస్తున్నందుకు ఆహ్వానిస్తూ పద్యంలో పుట్టిన వచన కవిగాఈయనను మేము గుర్తిస్తున్నాం. మీరు కూడా ఈ శతకాన్ని చదివి వాటి భావాల్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈయన ఈ పద్యంలోకి వచ్చినప్పుడు ఎలాంటి మొహమాటాలు పడకుండా, దాపరికాలు లేకుండా, ఎదుర్కొన్న ఇబ్బందులూ, దీని ఎడిటింగ్ లో వచ్చిన సమస్యలూ, వాటి సుహృద్భావన వాతావరణం, ఆయనకు దొరికే తోడ్పాటూ గురించి ఎంతో సహజంగా రాసుకోవడం చాలా చక్కగా ఉంది. కాబట్టి ఈ శతకాన్ని ప్రతి ఒక్కరూ చదివి ముళ్లబాటల్ని తెలుసుకుని పూలబాటల్ని చేరుకుంటారని ఆకాంక్షిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన డా॥ ఎన్. రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని తన ప్రసంగాన్ని ముగించారు.
తర్వాత ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య మునిరత్నం
నాయుడుగారు ప్రసంగిస్తూ...
‘‘ఈ కార్యక్రమాన్ని ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రంలో నిర్వహించడం చాలా సంతోషం.
ముఖ్యంగా మిత్రుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారు నాకు గత ఇరవై ఏళ్ళుగా బాగా
తెలుసు. వారి పుస్తకం మన సమక్షంలో ఆవిష్కరణకు అవకాశం రావడం గొప్పదని
భావిస్తున్నాను. దార్లవారు ఈ శతకంలో నేడు సామాజిక రుగ్మతల్లో ఎన్ని సమస్యల్నీ,
రాజకీయ సమస్యల్నీ ఎంతో సూక్ష్మంగా పరిశీలించారని చెప్పాలి. నిజంగా మన సతీశ్
చెప్పినట్లు ముళ్లబాటను దాటుకునే పూలబాటను చేరుకోవాలంటూ... ఈ పద్యాల్ని
ఉదహరించారు.
‘‘క్రొత్త
నోట్ల వలన కోరి వచ్చుననిరి
నోట్లు
రద్దు చేయ కోట్ల కొలది
నల్ల
ధనము లేదు తెల్ల ధనము లేదు
దారిపూలతోట
దార్లమాట’’అంటే నోట్ల రద్దు వల్ల నిష్ప్రయోజనమే
తప్ప ప్రయోజనం లేదు. అని కవి భావన. అదేవిధంగా దోపిడి వ్యవస్థను ఎండగడుతూ రాసిన
పద్యం చూడండి.
‘‘తెల్ల
దొరలు పోయి నల్లదొరలువచ్చె
మారవలయు
ముందు మనిషి మనసు
దేశమేదియైనదేవళంబౌనురా
దారి
పూలతోట దార్లమాట.’’
ఇక్కడ
రాజకీయ వ్యవస్థ ఎట్లా మారినా మన బతుకులకు వెలుగు రాలేదని కవి ఆవేదన కనబడుతుంది.
‘‘శిలను
చెక్కి శిల్పి శిల్పముగ మలుచు
కఠిన హృదయమైన కరునట్లు
సహృదయతను నింపు సాహిత్య పఠనంబు
దారి పూలతోట దార్లమాట’’ ఈ పద్యంలో సాహిత్య పఠనం ఎంతో గొప్పదని దీనిని కవి శిల్పంతో
పోల్చాడని గుర్తుచేశారు.
దార్ల వారు మరో పద్యంలో తెలుగు వారి లేదా భారతీయ ఆత్మీయతను ఈ విధంగా పద్యంలో ఇముడ్చారు.
‘‘కలిమి లేములన్నికష్టసుఖములట్లు
తల్లి
దండ్రియన్నదమ్ములుంద్రు
రక్తబంధమదియెరాదేదియును
సాటి
దారిపూల
తోట దార్ల మాట.’’ అంటూ... కుటుంబ వ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యతను,
రక్తసంబంధాల విలువను ఇందులో దార్ల చాలా చక్కగా వర్ణించారు.
ఎంతో హృద్యంగా శతకాన్ని రాసిన ఆచార్య దార్లవారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ తమ ప్రసంగాన్ని ముగించారు.
‘‘పద్యం ఎప్పటికి హృద్యమే’’ గొంతు సవరించి తీయగా
పాడగలవారుంటే హాయిగా ఆ రసానందలో మునిగి తేలిపోవచ్చు. అయితే ఆ రోజు ఇక్కడి పద్య
ప్రయోజనం ఇంకా బలమైనది, విలువైనది కూడా. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారు కాదు కాదు
‘దార్ల’గా సాహిత్యలోకంలో ప్రసిద్ధులైన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు, వారు
నాకు దాదాపుగా పదేళ్ళుగా అంటే నేను పిహెచ్. డి., చేసే తొలినాళ్ళ నుంచి
పరిచయస్తులు. వారిని అన్నా అని ఆత్మీయంగా పిలుచుకునేంత చనువు వుంది. మా గొంతుక అని
చెప్పుకునే పొగరూ ఉంది. వారితో ఎన్నో సార్లు నా ఆలోచనలను, సందేహాలను పంచుకున్నాను.
మిత్రమా! అని నోరారా పలకరిస్తూ మనసారా
మాట్లాడే గొప్ప స్నేహశీలి. మంచి కవి రచయిత, గొప్ప విమర్శకుడు, ఎన్నో వ్యాసాలను,
పుస్తకాలను ప్రకటించి తనదైన శకాన్ని కొనసాగిస్తున్నారు. వారి అభివృద్ధికి నేను
ఎప్పుడూ సంతోషిస్తా. ఇక ‘దారి పూలబాట దార్లమాట’ అనే మకుటంతోవచ్చిన ఈ శతకాన్ని
చూచినప్పుడు ఇందులో వాత్సల్యం నిండివున్న అమ్మ తలపు ఉంది. ఆత్మను పంచి యిచ్చే
ప్రేమికుడి మనసూ ఉంది. అలాగే సమాజాన్ని గురించి పరితపించే సంస్కర్త పిలుపూ ఉంది.
మట్టినాదని విర్రవీగి, వట్టిచేత పోయే వాడిని హెచ్చరించే తత్వ చింతనా ఉంది. ఒక
రాజకీయ నాయకుడు, ఒక ఓటరు, అమ్మభాష, నోటు, కులము, మతం మోడి, నిన్నటి బిగ్ బాస్ ఇలా
ఒకటేమిటి సమకాలీన సమాజంలో ఉన్న ప్రతి విషయాన్ని, ప్రతి సమస్యని భూతద్దంలో వెతికి
వెతికి ఒక్క కథలాగా కాక, ఒక్కొక్క పద్యమొక కథలాగా చెప్పి, ఈ సమాజం పోకడను వేలెత్తి
చూపుతున్నపుడు వేమన్నలు, జాషువాలు, కనిపిస్తారు, వినిపిస్తారు. తెలుగు, ఇంగ్లీషు,
హిందీ, ఇలా విభిన్న పదాలను ఏరుకుని, అందమైన పదబంధాలను కూర్చుకొని సరళమైన శైలిలో,
లోతైన భావావేశంలో తన ఆర్తిని, ఆవేశాన్ని చూపుతూనే, అక్కడక్కడా వ్యంగ్యాన్ని
జోడిస్తూ రాసిన ఈ ‘దార్లమాట’ శతకం చదవవలసిన పుస్తకం. అందరికి స్ఫూర్తిదాయకం. తోటలో
మరెన్నో పూలమాటలు పరిమళించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుస్తకావిష్కరణ పని మన
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో ఆవిష్కరణ చేయాలన్న గొప్ప ఆలోచన
చేసినందుకు మన సీనియర్ ఫెలో డా॥ ఎన్. రాంబాబు గారికి, ఈ సభను జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా
విచ్చేసిన మన కేంద్రం విద్యాత్మక సిబ్బంది అందరికీ పేరుపేరున ధన్యవాదాలు
తెలియజేస్తూ... ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసిందని ప్రకటించారు.
ధన్యవాదాలు.
స్వస్తి.
శతకం ఆవిష్కరణ: పత్రికల రిపోర్టులు
సభ సమన్వయ కర్త: నూనావత్ రాంబాబు (సీనియర్ ఫెలో)
రిపోర్టర్ :డా॥ బడిగె
ఉమేశ్. (అసోసియేట్ ఫెలో)
ప్రాచీన తెలుగు
విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరు
No comments:
Post a Comment