సమాజ స్వరూపాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకొని, వివక్షను ప్రశ్నించిన బలమైన గొంతుకి ప్రతీకగా గుర్రం జాషువాను గుర్తించవచ్చునని హెచ్ సి యూ, మానవీయ శాస్త్రాల విభాగం డీన్ ఆచార్య వి కృష్ణ వ్యాఖ్యానించారు. శనివారం తెలుగు శాఖలో నిర్వహించిన గుర్రం జాషువా 50వ వర్ధంతి కార్యక్రమానికి ఆచార్య వి.కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన తెలుగు శాఖాధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జాషువా దేశ ఔన్నత్యాన్ని, తెలుగు ప్రాముఖ్యాన్ని ఎలుగెత్తి చాటిన గొప్ప కవి అనీ, ఆయన్ని ఒక కులానికో, ఒక మతానికో చెందినవారిగా భావించకూడదన్నారు. హెచ్ సి యూ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ సాహిత్యంలో సామాజిబాధ్యతను విస్మరించని బాధ్యతాయుతమైన కవి అనీ, భావ, అభ్యుదయ సాహిత్య ధోరణులు కొనసాగుతున్న కాలంలోనే దళిత పక్షాన నిలబడి రచనలు చేసిన కవిగా ఆయన గబ్బిలం కావ్యం నిలుస్తుందన్నారు. ఆధునిక సాహిత్యంలో గొప్ప మానవతావాదకవిగానే కాక, ముసాఫిర్లు కావ్యంలో జాషువా తాత్వికతను ఆచార్య జి.అరుణకుమారి, శిశువు, వివిధ పాఠ్యాంశాల్లో చదువుకున్న ఖండికలు గురించి ఆచార్య పమ్మిపవన్ కుమార్, జాషువాలో విశ్వేశ్వరుడు, హేతువాదభావాలను డా.డి.విజయకుమారి వివరించారు.
No comments:
Post a Comment