"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

06 May, 2021

తత్రశ్లోకచతుష్ఠయమ్

 తత్రశ్లోక చతుష్ఠయమ్!


కావ్యాలన్నిటిలో నాటకం గొప్పది. ఆ నాటకాల్లో అభిజ్ఞాన శాకుంతలం గొప్పది. అందులో నాలుగవ అంకం మరి గొప్పది. అందులోనూ నాలుగు శ్లోకాలు మరీ గొప్పవి. ఆ నాలుగు శ్లోకాలు మీ అందరి కోసం.

"కావ్యేషునాటకం రమ్యమ్

నాటకేషు శకుంతలా!

తత్రాపి చతుర్ధోంకః

తత్రశ్లోకచతుష్ఠయమ్!"-

      అనేది కాళిదాస కృత అభిజ్ఞనశాకుంతలమ్ నాటకవిషయమైన ఆభాణకము.నిజమే! ఆమాటలు ముమ్మాటికీ సత్యములే! శ్రవ్యకావ్యములకన్న దృశ్యకావ్యము మిన్న.దృశ్యకావ్యకోటిలో కాళిదాసీయమైన శాకుంతలమను నాటకమునకుగలప్రశస్తి యనంతము.

అందును నాల్గవయంకము, అపురూపము.

              ఏల?నందురా?మానవజీవనమున నెదురగు

కష్టసుఖముల యనుభూతులను కాచివడపోసినదాయంకము.అదికాళిదాసుయొక్కమానసిక విశ్లేషణాశక్తికి గీటురాయి.మానవస్వభావముచిత్రమైనది.మామూలు సంసారియైనా, అరణ్యములలో కాపురముండు సన్యాసియైనా మానసికప్రవృత్తిలో నందరునొకేరకము.పైకికనిపించు రూపములువేరు.ఆంతర్యములువేరు.

అహంకారమమకారములు,విచార సంతోషములునొకేతీరుననుండుట అబ్బురము.

        ఇంతకూ శాకుంతలమున 4వ అంకమునగలకథ, "శకుంతలనత్తవారింటికంపుట"-ఈచిన్నిఘట్టమును మానవీయరమణీయమైన యితివృత్తముగా రూపొందించి,పాత్రలను తీర్చిదిద్ది.వాచకరచనలోతనదైన ప్రతిభను జోడించి నభూతో నభవిష్యతి

యనిపించినాడుకాళిదాసు.

            పరిమితపాత్రలతో ,కేవలం కణ్వ,శకుంతలలకుమాత్రమేపరిమితమై(చివరిలో అనసూయా ప్రియంవదలు,) కేవలం చెట్టుచేమలుఆధారంగా మనోభావాలనాలంబనంగా సాగించిన ఈయంకరచన కవికులతికుని కలంలోని బలానికి ప్రతీక!

మొదటిశ్లోకం:


పాతుం న ప్రథమం వ్యవస్యతిజలం యుష్మాస్వపీతేషు,యా

నాధత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవమ్,

ఆద్యే వః కుసుమప్రసూతిసమయే,యస్యాభవత్సుత్సవమ్,

సేయం యాతి శకుంతలా!పతిగృహం

సర్వైరనుజ్ఞాయతామ్!!

భావం:మీకు నీరు(పోయ )తాగనిదే,

యెవతె నీరుత్రాగదో,ప్రియమైన ఆభరణమైననుమీపైప్రేమతోచిగురుటాకునెవతె తునమదో, మీరుపూలుపూయునప్పుడెవతె పండగజేసికొనునో, అట్టి మీప్రియసఖి శకుంత యత్తవారింటి కేగుచున్నది. అందరు అనుమతిని దెల్పుడు.అనిదీనిభావము.

             ఈశ్లోకంలో ప్రకృతితో శకుంతలకున్నబంధమును బాంధవ్యమును కవివ్యక్తీకరించుచున్నాడు.కన్నతల్లి శకుంతల కని చెట్లక్రింద పడవేసిపోయినది.కన్నతల్లి కాదన్నబిడ్డను తరువులు తమనీడలలోపెంచినవి.శకుంతలకు ఆయాటవికప్రకృతియేప్రాణమునిలిపినది.కణ్వునినిర్హేతుకమైనప్రేమ,ఆమెకుజీవనాలంబనమైనది.తదుపరి అనసూయాప్రియంవదలచేరిక,వారిసరాగములు, అన్నిటికీ ఆవృక్షములేసాక్షి.

కాన నామెకు వృక్షములకన్న ప్రియతరములెవ్విగలవు?అందుచేతకణ్వునినోట పలికించినయీమాటలు ప్రకృతికి వారుసమర్పించు కృతజ్ఞతాంజలులే!

ఆతరువులు కల్పకములకు గురువులు.

(పట్టుచీరెలు,మొ) యధోచితకాన్కలతో

నామెనుసత్కరించినవి.


రెండవశ్లోకము: దుష్యంతునకు కణ్వ సందేశము!


అస్మాన్ సాధువిచింత్య,సంయమధనాన్

ఉచ్చైఃకులంస్యాత్మనః

త్వయ్యస్యాః కథమప్యబాంధవకృతం

స్నేహప్రవృత్తించ తాం

సామాన్య ప్రతిపత్తిపూర్వకమియం ,దారేషుదృశ్యాత్వయా,

భాగ్యాయత్తమతఃపరం ,నఖలు,తద్వాచ్యం వధూబంధుభిః!!


భావము:ఆటవికులైనమునులు లౌక్యము నెరుగనివారలైనను వారిమాటలలోగంభీరార్ధములు (గమ్యమానమగురీతి-)ధ్వనించురీతిగా

కాళిదాసు విరచించిన ఈశ్లోకము కవికులగురుని అపారమైన ప్రతిభకు ప్రతీకయై వెలయుచున్నది.

ఇందు పలు అర్థప్రత్యర్ధములు అనురణనాత్మకముగా వెలువడుచున్నవి.

! ,అనునయపూర్వకము: మేమాధనవంతులముగాము,తపమేమాకుగలధనము,మాపిల్ల అడవులలో పెరిగినది.కల్లకపటము లెరుగనిది.మాయమాటలు చెప్పి దానినెట్లో వశపరచుకొన్నావు.మాకుగూడా చెప్పుకొనలేని నీపైదానికిగలప్రేమయెంతఘనమో గమనింపుము.మీవంశగౌరవమునుగూడ మదినెంచుము.నీభార్యలలో నొకదానిగా దీనినేలుకొనుము.తక్కినది దానిభాగ్యము.ఇంతకన్నపుట్టినింటివారుకోరుటభావ్యముకాదు."-అని;

2,బెదిరింపు:


         1తపోధనులమైన మాగురించిబాగా ఆలోచింపుము.నీవేధనవంతుడననిభావింతువేమో నీకన్నథనవంతులముమేము.లౌకికమైన నీధనము సాధింపలేని యనేకమహనీయమైనకార్యములు మాధనము సాధించగలదు.అవసరమైన శాపముతోసహా, అదితెలిసికో!2ఉన్నతమైన నీవంశగౌరవమునకుకళంకముకల్పించకు.

         3మేములేనివేళమాకుతెలియకకుండ చేసిన యీనీనేరమునకు శిక్షపడకుండ

రక్షించుకో! 

4మాకుతెలుపకయే నిన్ను ప్రేమించిన దీనిప్రేమయెంతఘనమో ఊహించుకో! 5నీభార్యలయందు(రాజానాంబహువల్లభాః)ఈమెకుప్రత్యేకస్థానమునిచ్చి గౌరవింపుము.(పట్టమహిషి) 

6తక్కినది మేముకోరకుండగనే అదృష్టము ఆమెను వరింపగలదు.


3:నీకన్నమేము పరమధనవంతులం.

    నీతప్పుకునిన్నుశపింపగలం.

    పిల్లనిచ్చినవారని తక్కువగనెంచకు.

     నీవుకురువంశమునకుచెందినవాడవు.

ఈమె విశ్వామిత్ర మేనకలకుమార్తె.నీకు,నీవంశగౌరవమునకు తగినభార్య,

సా-మా- మాపిల్ల సాక్షాత్ లక్ష్మియే!

నీవు విష్ణుమూర్తివి మీయిద్దరికలయిక

అపూర్వమైనది.

సామాన్యప్రతిపత్తి:సా మా అన్యప్రతిపత్తి అని ఒకఅర్ధం,

సా  మాన్య ప్రతిపత్తి యని(అందరికన్నగౌరవముగా)మరోఅర్ధము.

 ఈవిధంగా దీనికి 8రీతులుగా ,నయ,భయ,విస్మయములు గలుగురీతి చెప్పి పంపినాడు.

ఇట్లీశ్లోకమును బహుచతురుక్తులతో నిండురీతిని విరచింప నెవరిశక్యము?

ఆకీర్తి కాళిదాసునకే దక్కినది.


మూడవది:దుహితకు హితోపదేశం!


శుశ్రూషస్వగురూన్,కురుప్రియసఖీవృత్తిం సపత్నీజనే,

భర్త్ృర్విప్రకృతాపి రోషణతయా,మాస్మప్రతీపంగమః,

భూయిష్టంభవ,దక్షిణాపరిజనే,భాగ్యేష్వనుత్సేకినీ,

యాంత్యేవం గృహిణీపదం యువతయోః వామాః కులస్యాధయః!

భావము:

అమ్మా!నీయత్తవారింట పెద్దలను సేవింపుము.సవతులయెడస్నేహమును ప్రదర్శింపుము,నీభర్తకోపగించిన నీవును కోపముతో నెదురాడకుము.విముఖతను జూపకుము.ధనమున్నదనివిర్రవీగక,సేవకులయెడదయను జూపుము.ఆడపిల్ల అత్తింటఈతీరునమెలగిన నుత్తమగృహిణియనిపించుకొనును.దీనికి విరుధ్ధముగా మసలువారు పుట్టినింటికిబాధపెట్టువారగుదురు.

        సాధారణముగా పూర్వము అత్తవారింటికేగు ఆడపిల్లలకు చెప్పు మంచిమాటలివియేయైనను శకుంతలకివిచెప్పుటలో ప్రత్యేకతయున్నది.ఇట్టివిధులామె కన్నదిగాదు.విన్నదిగాదు.పైగా పోవుచున్నదారాణివాసము.సపత్నులబెడదమెండు.కావున ముందుగనే ఆవిషయమును చెప్పుటమంచిది.అరణ్యమున అలకలనామెయెరుగదు.ఇంతవరకు ధనము ,దానివలనగలుగు గర్వమామెయెరుగదు.ఇపుడొక్కమారుగా మహారాణియగుట కన్నుమిన్నుగానక దాసదాసీజనము నుబాధించిన వారివలనకీడుమూడును.

గానముందుజాగ్రత్తమాటలను కణ్వునిచే కవిపలికించుచున్నాడు.ఇదియంతయు కాళిదాసీయమే!కణ్వుడులౌకికమర్యాదలనెరుగడుగదా!


4 శ్లోకము: కాళిదాస మనోవిశ్లేశణము;


యాస్యత్యద్యశకుంతలేతిహృదయం

సంస్పృష్ట ముత్కంఠయా,

కంఠస్తంభితభాష్పవృత్తికలుష శ్చిన్తాజడందర్శనమ్,

వైక్లబ్యమమ తావదీదృశమహో స్నేహాదరణ్యౌకసః,

పీడ్యంతే గృహిణః కథన్ను తనయా

విశ్లేషదుఖైర్నవైః!!


భావము: ఆడపిల్లలనుఅత్తవారింటికంపు తలిదండ్రుల మనోవేదనకు కాళిదాసీయమైన యీశ్లోకం ముకురాయమానమైనది.

           "ఈరోజు శకుంతల అత్తవారింటికేగుచున్నదని నాహృదయమేలనో తత్తరపడుచున్నది.

ఒక్కమారుగా తెలియనివిషాదము నాహృదమునాక్రమించినది.కన్నులనీరూనుట కంఠముబొంగురు వోయినది.

కనుచూపు మసకబారినది. ఏదో ఒకింతకాలము పెంచిన నాకేయిట్లున్నదే, నిజముగా తాముకనిపెంచిన కూతురు నత్తవారింటికి బంపునపుడా తలితండ్రులెంతబాధననుభవింతురోగదా? "-అని,

            శకుంతల కణ్వుని కన్నకుమార్తెగాదు.అయినను హృదయమురోదించుచున్నది.అది మూగవేదన!పైకికనరానిది.అయినను దానిచిన్నెలు దాగుటలేదు.అవే 1కంఠము వణకుట,బొంగురువోవుట,

కనుచూపు మసకబారుట, మొ:వి;

లౌకికవిషయాతీతుడగు మహర్షిలోకూడ నిట్టి భావములను జనింపజేయుటలో,

అతనిమనోవైక్లభ్సమును నిరూపించుటలో కృతకృత్యుడైనాడు.కాళిదాసకవీంద్రుడు.దీనిని సామాన్యగృహస్థులదుహితావిరహదుఃఖముతో నుపమించుచు,తులనాత్మకముగా ,కూతునత్తవారింటికంపుట గృహస్థులకు మిక్కిలి క్లేశదాయకమని నిరూపించుచున్నాడు.

     "ఇదేకాళిదాసీయ మనోవిశ్లేషణము"!

దీనినే మనవారిప్పుడు "చైతన్యశిల్పము"-అనుచున్నారు.పేరేదైననేమి కవికృతకార్యమంతయునొక్కటియేగదా!

     దీనిని కందుకూరివారు అధ్భుతముగా ననువదించినారు.చిత్తగింపుడు.


కొంగమందెడెందము,శకుంతలతానిపుడేగునంచయో

క్రందుగభాష్పరోధమున కంఠమునుంజెడె,దృష్టిమాంద్యమున్

బొందె ,నొకింతబెంచిన తపోధనులే యిటుఁగుందనెంతగా

గుందెదరోఁదమంతఁగనుగూతులఁబాయుగృహస్థులక్కటా!!

         ఇట్టిమనోవిశ్లేషణాసామర్ధ్యమునకుతోడు వర్ణనాసామర్ధ్యముతోడై కాళిదాస మహాకవి కవీనాంగణనలో కనిష్ఠికాధిష్ఠాతయైనాడు.తస్మైనమః!!


"ఆపరితోషాద్విదుషో న సాధుమన్యే'----

-------ఇతి-

                                  స్వస్తి!

     ఆచార్య చొప్పకట్ల సత్యనారాయణ.

No comments: