"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

02 జనవరి, 2010

ఏమిటీ పెద్ద మనుషుల ఒప్పందం ?


(తెలంగాణ ఉద్యమం చరిత్రలో అందరూ తెలుసుకోవలసిన లేదా తెలుసుకోవాలనిపించేది ’పెద్దమనుషుల ఒప్పందం’ ఒకటి. దీని గురించి ఆంధ్రజ్యోతి ( 2- 1-2010) లో ప్రచురించారు. విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని భావించి ఆ పత్రిక సౌజన్యంతో దీన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను)


ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మౌలానా ఆజా ద్‌ కూడా పండిట్‌ నెహ్రూ నచ్చచెప్పిన మీదట 1956 ఫిబ్రవరిలో విశాలాంధ్ర ఏర్పాటునకు సుముఖుడయ్యారు. ఆ తరువాత తెలంగాణ నాయకులను ఒప్పించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 15న తనను కలిసిన తెలంగాణ నాయకులకు ఆంధ్రలో తెలంగాణ విలీనానికి అంగీకరిస్తే తెలంగాణకు ఒక ప్రాంతీ య కమిటీ నేర్పాటు చేయడం జరుగుతుందని కేంద్ర హోంమంత్రి జి.బి.పంత్‌ సూచించారు.

అయినప్పటికీ వారు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలనే తమ డిమాండ్‌ ను పునరుద్ఘాటించారు. కాదూ అంటే ప్రత్యామ్నాయంగా ఆంధ్ర, తెలంగాణ, ప్రతిపాదిత మైసూరు రాష్ట్రంతో కలిపి ఒక ద్విభాషా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.

అప్పటికే కేరళ, ప్రతిపాదిత మైసూరు రాష్ట్ర విలీనం గురించిన ప్రతిపాదన ఉన్నందున ఆంధ్ర, తెలంగాణ, మైసూరులతో పెద్ద ద్విభాషా రాష్ట్ర ఏర్పాటును పరిగణనలోకి తీసుకొనే ప్రసక్తి లేదని పంత్‌ స్పష్టం చేశారు. విశాలాంధ్ర ఏర్పాటుకే కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గు చూపుతుందని గ్రహించిన తెలంగాణ నేతలు ప్రాంతీయ కమిటీతో పాటు తమకు అనేక రక్షణలు కల్పించాలని అడిగారు.

విశాలాంధ్ర ఏర్పాటయినచో తలెత్తే సమస్యల గురించి ఆంధ్ర, హైదరాబాద్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో సమావేశమై చర్చలు జరిపారు. ఆంధ్ర రాష్ట్రం తరఫున బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు; తెలంగాణ తరఫున బూర్గుల రామకృష్ణరావు, కొండా వెంకట రంగారెడ్డి, జె.వి.నరసింగరావు, డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి ఈ చర్చల్లో పాల్గొన్నారు.

1956 ఫిబ్రవరి20న జరిగిన ఆ సమావేశంలో వారు అంగీకారానికి వచ్చిన ఒప్పందంలో కొన్ని ప్రధానాంశాలు:
(1) రాష్ట్రానికి చెందిన కేంద్రీయ, సాధారణ పరిపాలన వ్యయాన్ని ఉభయ ప్రాంతాలు నిష్పత్తి ప్రకారం భరించాలి; తెలంగాణ నుంచి లభించే ఆదాయంలో ని మిగులును తెలంగాణ ప్రాంతాల అభివృద్ధికే వ్యయ పరిచేందుకు కేటాయించాలి. ఈ ఏర్పాటు ఐదేళ్ల తరువాత సమీక్షకు వస్తుంది. శాసనసభలోని తెలంగా ణ సభ్యులు కోరినట్లయితే ఈ ఏర్పాటును మరో ఐదేళ్ళు పొడిగించవచ్చు;
(2) తెలంగాణలో ఉన్న విద్యా సౌకర్యాలు తెలంగాణ విద్యార్థులకు లభింపజేసి, ఇంకా అభివృద్ధిపరచాలి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న సాంకేతిక విద్యా సంస్థల తో సహా అన్ని కళాశాలల్లోనూ ప్రవేశాలు తెలంగాణ విద్యార్థులకే నియమితం చేయాలి లేదా రాష్ట్రము మొత్తం మీద ఉండే ప్రదేశాల్లో మూడో వం తు ప్రవేశాలు తెలంగాణ విద్యార్థులకు వారికి ప్రయోజనకరమైన కోర్సులకుగాను లభించాలి;
(4) ఏకీకరణ వల్ల తప్పనిసరి అయినప్పుడు ఉద్యోగాల్లో రిట్రెంచిమెంటు ఉభయ ప్రాంతాల నుంచి నిష్పత్తి ప్రకారము జరగాలి;
(5) ఇక ముందు ఉద్యోగాలకు చేర్చుకోవడం ఉభయ ప్రాంతాల జనాభా ప్రాతిపదికపై ఉంటుంది;
(6) తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను నిర్ణీత నిష్పత్తి ప్రకార మే పొందడానికి ఒక పద్ధతి నివాస నిబంధనల్ని ఉంచాలి.
(7) తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూముల అమ్మకము ప్రాంతీయ మండలి అధీనములో ఉండాలి;
(8) తెలంగాణ ప్రాంతపు అవసరాలు ఆవశ్యకతల దృష్ట్యా సర్వతోముఖాభివృద్ధి సాధించుకొనేందుకు ఒక ప్రాంతీయ మండలి ఏర్పాటు కావాలి;
(9) ప్రాంతీయ మండలిలో దిగువ పేర్కొ న్న ప్రకారం 20 మంది సభ్యులుంటారు. తెలంగాణ తొమ్మిది జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే 9 మంది తెలంగాణ శాసనసభ్యులు; తెలంగాణ జిల్లాల నుంచి విడివిడిగా వీరిని శాసనసభ్యులు ఎన్నుకోవాలి;
(10) ప్రాంతీయ మండలి చట్టబద్ధమైన సంస్థగా ఉంటుంది. పైన పేర్కొన్న వివిధాంశాల విషయాలు పరిశీలించి నిర్ణయించే అధికారం దానికి ఉంటుంది. ఇంతేకాక ప్రణాళికా రచన, అభివృద్ధి వ్యవహారాలు, నీటిపారుదల, ఇతర వ్యవసాయ పథకాలు, పారిశ్రామికాభివృద్ధి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంతవరకు ఉద్యోగ వ్యవహారాలను కూడా ప్రాంతీయమండలి పరిశీలించి నిర్ణయా లు గైకొంటుంది. ప్రాంతీయ మండలి అభిప్రాయానికి, రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయానికి మధ్య తేడా వచ్చినట్లయితే అంతిమ నిర్ణయం కోసం ఆ సమస్యలను భారత ప్రభుత్వానికి నివేదించాలి.
(11) మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతం నుండి 60 శాతం, తెలంగాణ ప్రాంతం నుండి 40 శాతం మేరకు మంత్రులు ఉండాలి. 40 శాతం తెలంగాణ మంత్రులలో ఒకరు తెలంగాణకు చెందిన ముస్లిం మంత్రి అయివుండాలి;
(12) ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతము నుంచి అయితే, ఉప ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ఉండాలి. అలాగే ముఖ్యమంత్రి తెలంగాణ నుండి అయితే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతము నుండి ఉండాలి, హోం, ఆర్థిక, రెవిన్యూ, ప్రణాళికలు, అభివృద్ధి వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖలలో రెంటిని తెలంగాణ మంత్రులకు అప్పగించాలి;
(13) 1962 సంవత్సరాంతం వరకూ తెలంగాణకు ప్రత్యేకంగా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సంఘము ఉండాలని హైదరాబాద్‌ ప్రదేశ్‌ కాంగ్రెసు సంఘము అధ్యక్షుడు అభిలషిస్తున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ సంఘము అధ్యక్షునికి అభ్యంతరము లేదు.

- కె.వి.నారాయణరావు
('ది ఎమర్జెన్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌' నుంచి)

1956 ఆగస్టు 14న ఆంధ్ర, తెలంగాణ నాయకులు మళ్ళీ సమావేశమై పైన పేర్కొన్న అంశాలతో కూడిన తుది ఒడంబడికపై సంతకాలు చేశారు. 'పెద్ద మనుషుల ఒప్పందం'గా ప్రసిద్ధి కెక్కిన ఈ ఒప్పందం ఆంధ్ర ప్రదేశ్‌ ఆవిర్భావానికి దారిని సుగమమం చేసింది. 1956 నవంబర్‌ 1న ప్రధాని నెహ్రూ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను ప్రారంభించారు.

1 కామెంట్‌:

kola చెప్పారు...

chaala viluvaina samaa charam. idhi Andhariki theli yalsina avasaram vundhi.

Thanks.