"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

16 March, 2009

మైనారిటీ సాహిత్యం మరోచూపు ( 16-3-2009 న ఆంధ్రప్రభ సాహిత్యానుబంధంలో ప్రచురితం)

(ఈరోజు (16-3-2009) ఆంధ్రప్రభ సాహిత్యానుబంధంలో మైనారిటీ సాహిత్యం-మరో చూపు పేరుతో ఈ కింది వ్యాసం ప్రచురితమైంది. )


డా// దార్ల వెంకటేశ్వర రావు
తెలుగు లెక్చరర్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు,
గచ్చిబౌలి, హైదరాబాదు – 500046 vrdarla@gmail.com
ఫోన్‌: 9989628046



ప్రపంచ వ్యాప్తంగా గానీ, భారత దేశంలో గానీ ముస్లిములు సంఖ్యాపరంగా మైనారిటీలు కాదు. భారతీయ జనాభా లెక్కల ప్రకారం చూసినా ముస్లిములు రెండవ స్థానంలో ఉన్నారు. అటువంటప్పుడు వీరిని మైనారిటీలని ఎలా పిలావాలి? అలా పిలవడం వెనుక ఉన్న కారణాలేంటి? అని ఆలోచించవలసి ఉంది. నా అభిప్రాయం ప్రకారం మైనారిటీ సాహిత్యం అంటే ముస్లిం సాహిత్యమే కాదు. క్రైస్తవ సాహిత్యం కూడా అవుతుంది. అయితే అది ఆ మతాన్ని ఆధారం చేసుకొని ఆ ప్రజలపై జరుగుతున్న దాడులను, అభద్రతను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. ఆ మతం వల్ల వారిపై జరుగుతున్న అల్పసంఖ్యాక భావమే వారి రచనల్లో వ్యక్తమైతే అప్పడు అది "మైనారిటీ సాహిత్యం" అవుతుంది. "దళితులు" అని చాలామందిని కలిపి పిలుస్తున్నా, వాస్తవంలో దళితులంటే మాల, మాదిగ తదితర ఉపకులాలవారనే అభిప్రాయమే వ్యక్తమవుతుంది. ఉమ్మడిగా దళితుల్లో తమకి రావలసిన హక్కులను తమకి రావాలని వాదిస్తూ మాదిగ తదితర ఉపకులాల వాళ్ళు ఉద్యమంతో పాటు, సాహిత్యాన్ని కూడా రాస్తున్నారు. కానీ, ముస్లిం మైనారిటీ సాహిత్యానికి లభిస్తున్న ప్రాధాన్యత, దళితుల్లో అంతర్గతంగా జరుగుతున్న వ్యధలను వక్తీకరిస్తూ రాస్తుంటే, దానికి లభించడం లేదు. ఆ విధంగా మాదిగ సాహిత్యం ''మైనారిటీ తనాన్ని'' సంతరించుకుంది. సామాజికంగానూ దళితులుగానూ వృత్తి చేతా, సహజీవనం చేయవలసిన వారి చేతా అవమానించబడుతూ, దాని గురించి రాస్తే ఏమవుతుందో అనే అంతటి అభద్రతతో అనేక మంది మాదిగ సాహితీ వేత్తలు ఆలోచిస్తున్నారు. వీరికి తగిన ప్రాధాన్యత లభించక పోగా, ఒకరిద్దరు ఎవరైనా సాహసించి తమ భావాల్ని రాస్తే, వారిపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. మాదిగ వాదాన్ని రాస్తునందుకు డా// ఎండ్లూరి సుధాకర్ పై అనేక మంది దాడి చేస్తున్నారు. కలం పేర్లతో, దొంగ పేర్లతో రాస్తూ సాహిత్య దాడులు చేస్తున్నారు. వ్యక్తి గతంగా కూడా నిందలు చేస్తున్నారు. డా// ఎండ్లూరి సుధాకర్ గారి వాదాన్ని సమర్ధిస్తూ రాసే వారి రచనలు ఎన్ని ప్రచురణకు నోచుకుంటున్నాయి? ఇదంతా మాదిగసాహిత్యం ''మైనారిటీ''కి గురికావడం కాదా? ఉమ్మడిగా దళితులుగా ఉండటం లేదా అలా పరిగణన పొందడం వల్ల మాదిగలకు జరుగుతున్న అన్యాయం కాదా?
ఒరిస్సా,తమిళనాడు తదితర చోట్ల క్రైస్తవులపై, లేదా క్రైస్తవులుగా మతాన్ని స్వీకరిస్తున్న దళితులపై కొంతమంది దాడులు చేస్తున్నారు. ఆ దాడుల్ని ఖండిస్తూ వెలువరించే ఎన్ని ప్రకటనలు న్యూస్ అవుతున్నాయి? అసలు ఆ దాడులు వెలుగులోకి రావాలంటే ఎన్నాళ్ళు పడుతుంది? ఇదంతా క్రైస్తవులుగా మారేటప్పుడు దళితులు మైనారిటీ తత్త్వానికి గురికావడం కాదా? ఆ విషయాలన్నీ రాస్తే , వాటిని ప్రచురించే సంస్థలెన్ని ఉన్నాయి? తమ సమస్యల్ని , తమ ఫీలింగ్స్‌ని రాయడానికే భయపడుతున్న స్థితిలో ఉండటం మైనారిటీ భావం కాదా? తెలుగులో ముస్లిములు తమ అభద్రతను రాస్తుంటే వెంటనే ప్రచురించడామే కాకుండా, వాటి పై అనేక విశ్వవిద్యాలయాలు పరిశోధనలు కూడా చేయిస్తున్నాయి. ఈ స్థితి మాదిగ సాహిత్యానికి దక్కుతుందా? దళితుల్లోని మిగతా ఉప కులాల వారికి లభిస్తుందా? కనుక, మైనారిటీ సాహిత్యం అంటే కేవలం ముస్లిం సాహిత్యమే అని అనుకోవడం సరైంది కాదు. కానీ, సంఖ్యాపరంగా వాళ్ళు హిందువుల తర్వాత స్థానంలో ఉన్నా, అనేక కారణాల వల్ల ముస్లింలను మైనారిటీలని, వారు రాసే సాహిత్యం మైనారిటీ సాహిత్యం అనీ పిలుస్తున్నారు. కానీ, తెలుగులో వస్తున్న ముస్లిం సాహిత్య పుస్తకాలపై ఎక్కడా తమ సాహిత్యం ''మైనారిటీ సాహిత్యం'' అని కనిపించట్లేదు.


ఫోటోలో వరసగా డా//సీతారాం, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, మాట్లాడుతున్న డా//దార్ల వెంకటేశ్వరరావు, ఆ తర్వాత ఉన్న ది స్కైబాబా.

'మైనారిటీ' అనే పదం ప్రధానంగా సంఖ్యావాచకాన్ని సూచిస్తుంది. దాన్ని మనం అల్ప సంఖ్యాక వర్గంగా భావిస్తున్నాం. 2005 సర్వే ప్రకారం ఎన్సిక్లోపిడియా బ్రిటానికా ప్రకారం ప్రపంచ జనాభాలో 33% క్రైస్తవులు, 20% ముస్లింలు, 13% హిందువులు, 5.9% బౌద్దులు ఉన్నారు.
2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 80.5% (82,75,78,868)హిందువులు, 13.4% (13,81,88,240) ముస్లింలు, 2.3% (2,40,80,016) క్రైస్తవులు, 1.9% (1,92,15,730) సిక్కులు, 0.8% (79,55,207) బౌద్దులు, 0.4% (42,25,053) జైనులు ఉన్నారు. అలాగే 0.6% (66,39,626) పర్షియన్లు మరియు ఇతర మతస్థులు ఉన్నారు. మత గుర్తింపు లేకుండగా 0.1% (7,27,588) ఉన్నారు. ఒక్క మన భారతదేశంలో ఉన్న సుమారు 102 కోట్ల జనాభాని ఆధారంగా తీసుకొని మాట్లాడినా, ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారని తెలుస్తుంది. సంఖ్యాపరంగా చూసినపుడు హిందువుల కంటే ముస్లింలు అల్ప సంఖ్యాక వర్గం అవుతారు. కాని, ముస్లింల కంటే అల్ప సంఖ్యాక వర్గంగా క్రైస్తవులు, బౌద్దవులు, తదితర మత వర్గానికి చెందిన వారు అవుతారు. కనుక, మరి ముస్లింలను మాత్రమే మైనారిటీ వర్గం అని ఎందుకు పిలవాలి? అనేది ఒక ప్రశ్న.
ప్రపంచవ్యాప్తంగా చూసినా, క్రైస్తవులు మొదటి స్థానంలో ఉన్నారు. ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు. ఇవన్నీ అధికారిక లెక్కలు ప్రకారం మాత్రమే. ఇంకా అనేక మంది ఉండవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఒకటి ఉంది. భారతదేశంలో ముస్లింలను మైనారిటీ వర్గం అని పిలవడం సమంజసమేనా? అలా పిలవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి?
1) ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద దాడుల్లో ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళే కీలక వ్యక్తులుగా ఫోకస్ కావడం జరుగుతుంది. 2) ముస్లిం మతంలో అల్లా బోధనల్లో ఉన్నవి ఏమైనా గానీ, 'జీహాద్‌' పట్ల ముస్లిమేతర సమాజానికి వాస్తవ విషయాలు తెలుస్తున్నాయో లేదో తెలియదు. కానీ, జీహాద్‌ అనగానే 'ఒక మత యుద్ధం' అనే ప్రచారంలో ఉంది. తమ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసే యుద్ధం అని కూడా ప్రచారంలో ఉంది. ఇలాంటి కారణాల వల్ల ముస్లింల పట్ల ప్రపంచ వ్యాప్తంగా, ఒక ద్వేష పూరిత వాతావరణం ఏర్పడిందనిపిస్తుంది. ప్రపంచంలోఎక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగినా, ఆ ఉగ్రవాదుల్లో ముస్లిం పేర్లు కనిపించినా, దాని ప్రభావం వల్ల కూడా అందరి ముస్లింలపై ఆ అనుమానపు చూపులు చూస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తుంది.
భారతదేశంలో ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నప్పటికీ, వారి కంటే తర్వాత స్థానంలో ఉన్న వారికున్నంత స్వేచ్ఛ ముస్లింలకు లేదనే అభిప్రాయం బలంగానే వినిపిస్తుంది. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు అత్యధికంగా జరుగుతున్న ప్రాంతాలు జమ్మూ & కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ తదితరాలను చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో జనాభాని పరిశీలించినా ప్రథమ స్థానంలో హిందువులే ఉన్నారు. ముస్లింలకు రెండవ స్థానమే. జమ్మూ & కాశ్మీర్‌లో మాత్రం ప్రథమ స్థానంలో ముస్లింలు 67,93,240 రెండవస్థానంలో హిందువులు 30,05,349 ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో హిందువులు 13,39,79,263 మంది, ముస్లింలు 3,07,40,150 మంది ఉన్నారు. మహారాష్ట్రలో హిందువులు 77859385 మంది ముస్లింలు 1,02,70,485 మంది ఉన్నారు. ఢిల్లిలో హిందువులు 1,13,58,049 మంది ముస్లింలు 16,23,520 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హిందువులు 6,78,36,688 మంది ముస్లింలు 69,86,856 మంది ఉన్నారు.
ఈ లెక్కలను చూసినపుడు జమ్మూ & కాశ్మీర్‌లో తప్ప మిగతా అన్నీ చోట్లా ఇంచుమించు హిందువులే అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. జమ్మూ & కాశ్మీర్‌లో ముస్లింలు అధిక సంఖ్యాకులు. ఈ నేపథ్యంతో చూసినపుడు ముస్లింలు నిజంగా అల్ప సంఖ్యక వర్గానికి చెందినవారే అవుతారా? అనేది ఒక బలమైన ప్రశ్న. నిజమే భారతదేశంలో హిందువులు తర్వాత ముస్లింలే అధిక సంఖ్యాకులు. కాని, 1992 డిశంబరు 6వ తేదిన బాబ్రి మసీద్ కూల్చివేత తర్వాత ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నప్పటికీ తామంతా అల్ప సంఖ్యాక వర్గమనే భావం మరింత బలపడింది. ఆ తరవాత 2002లో గుజరాత్‌లో జరిగిన మత కల్లోలాలు ముస్లింలలో మరింత అభద్రతా భావాన్ని పెంచాయి. మరొక వైపు భారత స్వాతంత్రానికి ముందు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన నిజామ్‌ నవాబుల పాలన, ఆ కాలంలో నవాబుల చర్యల పట్ల ప్రచారంలో ఉన్న అభిప్రాయాలు నేటి ముస్లింల పట్ల ద్వేష పూరిత భావాన్ని కలిగిస్తున్నాయనీ ముస్లిం రచయితల రచనల బట్టి తెలుస్తుంది. ఈ అభిప్రాయాలన్నింటినీ, ఈ చారిత్రక నేపథ్యాన్ని చూసినపుడు ముస్లింలు దేశ వ్యాప్తంగా ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ అభద్రతకు గురవుతున్నారనేది వాస్తవం. దీని కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.
1.ఈ దేశంలో పుట్టి పెరిగినప్పటికీ ముస్లింలను చాలా మంది పరదేశీయులుగా భావించటం. 2. ముస్లింల పాలనలో హిందువులపై జరిగిన దాడులకు ముస్లింలను అందరినీ భాధ్యులుగా భావించటం. అవే అనుమానాలతో, అవే వాదనలతో అక్కడక్కడ మాట్లాడటం.3. సినిమాలలో ముస్లింలను దేశ ద్రోహులుగా చిత్రించటం.4) అన్ని వర్గాలతో జీవించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, ముస్లిములను రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారనే భావన. 5) మరొక వైపు ముస్లింలలో కూడా వర్గ, కుల భేదాలు ఏర్పడటం వల్ల ముస్లింలలోనే అంతర్గతంగా వివక్షతకు గురికావటం జరుగుతుందనే అనుభవ సత్యాలతో సాహిత్యాన్నీ సృష్టించటం. 6) అనేక సంవత్సరాలుగా భారతదేశంలోనే పుట్టి, పెరిగి అన్ని మతస్థులతో కలిసి మెలిసి జీవించటం వలన ముస్లిం సంస్కృతిలో వైవిధ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా పీర్ల పండుగా, మోహరం, దర్గ పండుగలు అన్నీ ముస్లిం, హిందూ సమైఖ్యతకు నిదర్శనంగా నిలుస్తున్నా, ఆచార సంప్రదాయాల వలన కొంతమంది ముస్లింలను ముస్లింలే తక్కువగా చూస్తున్నారనే భావన వ్యక్తమవుతుంది. 7) అరబ్బీ, ఉర్ధూ, పారశిక మొదలైన భాషలను అన్ని ముస్లిం వర్గాలు మాట్లాడ లేకపోవడం వల్ల భాషాపరమైన మైనారిటీని కూడా కొంత మంది ముస్లింలు అనుభవిస్తున్నారు.8) వివిధ పాలన కారణాల వల్ల జరిగిన మత మార్పిడిలలో దళిత వర్గాలు ముస్లింలుగా మారటంతో ముస్లింలలో కూడా స్థాయి భేదాలు పెరిగిపోయాయి. దీని వల్ల కూడా ముస్లింలలోనే మరో అల్ప సంఖ్యాక వర్గం ఏర్పడింది.
ఇంకా మరికొన్ని కారణాలు ఉన్నా ముస్లింల మనోభావాలను సాహితీకరించటంలో ప్రధానంగా మూడు ధోరణులు కనిపిస్తున్నాయి.
అ) ముస్లిమేతరులు ముస్లింల గురించి రాయడం.
ఇది రెండు రకాలుగా జరుగుతుంది. ముస్లింల గురించి ముస్లిమేతరులు తమ దృక్కోణంతో తమకు తెలిసిన జీవితాన్ని మాత్రమే రాయడం. మరో కోణంలో ముస్లింల పట్ల విష పూరిత భావాల్ని పెంచటం.
ఆ) ముస్లింలే తమ మనోభావాలని వ్యక్తీకరించటం.
ఇ) మత, కుల, వర్గ పరంగా జరుగుతున్న అన్ని వివక్షలను ప్రశ్నిస్తూ కొంత మంది ముస్లింలే రాయడం.
ఆధునిక సాహిత్యంలో వచ్చిన వివిధ ధోరణి/ వాదన/ ఉద్యమాలలో స్త్రీ, దళిత, ముస్లిం మైనారిటి సాహిత్యం అనే విభజన ఇంచుమించు సాహితీవేత్తలందరూ అంగీకరించారు. జల్‌జలా, ఆజా, గుజరాత్ గాయం, అలావా, జగన్ కీరాత్, నఖాబ్‌, ముల్కీ, వతన్‌ తదితర ముస్లిం సాహిత్య గ్రంథాలు వెలువడ్డాయి. అంతక ముందు 'చిక్కనవుతున్న పాట', 'పదునెక్కిన పాట', 'బహువచనం' తదితర కవితా సంకలనాలలో కూడా ముస్లిం వేదనను తెలిపే రచనలు ఉన్నాయి. నిజానికి ముస్లిం సాహిత్యం, ఆ వాదనలను కేవలం హైదరాబాదు కేంద్రంగానే కాకుండా,రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారి భావాల్ని సమీకరించే దిశగా జరగాలనే వారూ ఉన్నారు. వీరి రచనలపై అనేక విశ్వ విద్యాలయాలు పరిశోధనలు చేస్తున్నాయి. ముస్లిమేతర సాహిత్య విమర్శకులు కూడా ఈ సాహిత్యాన్ని గుర్తించారు. ఇప్పుడు చెప్పుకున్న ముస్లిం రచయితల రచనలలో కూడా తమ వాదాన్ని బలమైన స్వరంతోనే చెప్పుకున్నారు. ముస్లిం సాహిత్యంలో కూడా ముస్లిం స్త్రీవాద సాహిత్యం అనే విభాగాన్ని కూడా సాహితీ వేత్తలు గుర్తిస్తున్నారు. అయితే, ఆయా పుస్తకాలలో గానీ, ఆ పుస్తకాలపైన గానీ ఎక్కడా కూడా తమది ''మైనారిటీ సాహిత్యమ''ని పేర్కొనలేదు. కానీ, అత్యధిక సంఖ్యాక వర్గం దగ్గర నివశించే అల్పసంఖ్యాక వర్గం పొందే అభద్రతా భావమే వారి రచనల నిండా ప్రతిఫలిస్తుంది. కనుక ''మైనారిటి'' అనేది ఆ ప్రజల మానసిక భావన. దానిని అనుసరించి ''మైనారిటీ సాహిత్యం'' అని అనగానే ముస్లింల అభద్రతను తెలిపే సాహిత్యంగా గుర్తిస్తున్నారు. వారు రాసిన కవితలు, కథలు, వ్యాసాలు ఆ భావననే ప్రచారం చేస్తున్నాయి. ముస్లిం సాహిత్యంలో కూడా కొన్ని ఆంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ వారందరిలో కనిపించే మౌలిక భావన మాత్రం అభద్రతను ప్రతిఫలింజేయడం, తమని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం జరుతుతుందని, దానికోసం ప్రతిచోటా దేశభక్తిని నిరూపించుకోవలసి వస్తుందనీ వాదిస్తున్నారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్, తదితర ముస్లిం దేశాలలో జరిగే మత, సామాజిక కార్యక్రమాలతో భారతీయ ముస్లింలు కూడా ఒకే గాటినికి కట్టేసి చూడటం జరుతుందనీ, కానీ తాము ముందు భారతీయులమని గుర్తించాలని వాదిస్తున్నారు. ఇలా అనేక కారణాల వల్ల వీరి సాహిత్యమే '' మైనారిటీ సాహిత్యం'' గా మన తెలుగులో చాలా మంది పరిగణిస్తున్నారు.
భారత దేశంలో మతపరంగా జరిగినట్లే కుల, ప్రాంత, లింగ వివక్ష కూడా కొనసాగుతుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వారిలోనే అనేక ఉపకులాలు, అలాగే బి.సి. లలోని అనేక ఉపకులాలు ఉన్నాయి. వీరికి ఎవరి అస్తిత్వం వారికి ఉంది. వీళ్ళందరికీ రాజ్యంగం ప్రకారం లభించవలసిన హక్కులు సమానంగా లభించటం లేదు. కొన్ని ఉప కులాల వారికి అన్యాయం జరుగుతుంది. ప్రాంతాల వారిగా చూసినప్పుడు కూడా ఈ వివక్ష కనబడుతుంది. కనుక నిర్ధిష్ట ఉపకుల సాహిత్యంలో అల్ప సంఖ్యాక వర్గ తత్వమే కనిపిస్తుంది. మన భారతదేశంలో దళితులంతా అనేక పేర్లతో ఉన్నారు. రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య వారి కుల నామాలు భిన్నంగా ఉన్నాయి. దానిని బట్టి వారి వృత్తి, సాంఘిక హోదా, దానిని అనుసరించి వారి ఆర్ధిక పరిస్థితి నిర్ణయించబడుతుంది.
భారతదేశంలో సుమారు అర్థ శతాబ్ధం క్రితం జరిగిన సర్వేలను అనుసరించి ఏర్పడిన కుల జాబితాలేనేటికీ కొనసాగుతున్నాయి. వాటిని అనుసరించి రూపొందినవే చట్టాలుగా అమలులోకి వచ్చాయి. వాటి వల్ల సమైఖ్యత పేరుతో ఉన్న షెడ్యూలు వల్ల కొన్ని కులాలు, ఉపకులాలు దోపిడీకి గురవుతున్నాయి. వాటిని గుర్తించిన మేథావులు సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తున్నా, అభివృద్ధి నిరోధక శక్తులు వాటిని తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణ ఉద్యమం అలాంటిదే. కనుక మైనారిటీ అనేది కులాలు, ఉపకులాలను బట్టి కూడా ఉంటుంది.
దీన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు సంఖ్యాపరంగా ప్రథమ స్థానంలో ఉన్నా, వారు భారతదేశంలో అల్ప సంఖ్యాకులే. వాళ్ళు కేవలం రెండు శాతం కూడా లేరు. 19వ శతాబ్డం వరకూ ముస్లిం, హిందూ పాలన ప్రభావం వల్ల క్రైస్తవుల ప్రభావమే లేదు. హిందూ ఆధిపత్యమే కొనసాగింది. తర్వాతకాలంలో బౌద్ద, జైన మత ప్రభావాలు ఉన్నా, ముస్లిం పాలకులు వచ్చిన తర్వాత, ప్రభావం చాలా వేగవంతంగానే కనిపించింది. మూడో మతంగా క్రైస్తవ మతం తన స్థానాన్ని ఏర్పరుచుకుంది. బ్రిటీష్ పాలనా ప్రభావంతో క్రైస్తవ మతం వేగంగానే విస్తరించింది. అలా విస్తరించడానికి పాలనా ప్రభావం ఉన్నా, క్రైస్తవంలో కనిపించే ప్రేమ తత్త్వం కింది వర్ణాల్ని విశేషంగా ఆకర్షించింది. దీనికి తోడు ఆర్థికంగా కూడా సహకారి అయ్యింది. హిందూ మతంలో చూపే కుల వివక్ష మొదట్లో క్రైస్తవంలో కనిపించక పోవడంతో సామాజికంగా కింది వర్ణాల వాళ్ళు క్రైస్తవంలోకి మారిపోవడంతో హిందూ మతంలో సంస్కరణోద్యమాలు వేగవంతమయ్యాయి. ఆ సంస్కరణ ప్రధానంగా హిందూ మతాన్ని పునర్జీవింప చేసే దిశగానే జరిగాయి. కానీ, దాన్ని సాంస్కృతిక పునర్జీవనమన్నారు.
మరోవైపు బ్రిటిష్ పాలన అన్ని రంగాలలోనూ ఆధిపత్యాన్ని చెలాయించడాని తద్వారా భారతీయ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో వస్తున్న మార్పుల పట్ల మేథావులలో ఆలోచన ప్రారంభమైంది. అదే ధోరణి కొనసాగితే దేశ సార్వభౌమత్వం ప్రశార్ధమై పోతుందని ఊహించారు. వ్యాపారం కోసం వచ్చినా, తర్వాత కాలంలో అన్ని రంగాల్ని శాసించే స్థాయికి చేరుకోవడంతో సాంస్కృతిక పునర్జీవన కార్యక్రమాలు మరింత వేగవంతమయ్యాయి. మరోవైపు భారతీయుల స్వయం పాలన కోసం జరుగుతున్న స్వాతంత్ర్యోధ్యమంతో వేగవంతమైంది. దీనిలో భాగంగానే సంస్కరణోద్యమం రావడం, దానిలో భాగంగా 'హరిజనుల' పట్ల గాంధీజీ ప్రణాళిక బయటకొచ్చింది. హరిజననోద్యమం దళితుల్ని ఆలోచింపజేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలా చేసింది. హరిజనోద్యమం దళితులకు విముక్తి కలిగించిందని, బ్రిటిష్ పాలకుల దగ్గరే దళితులకు కొన్ని ప్రత్యేక హక్కుల్ని పొందే ప్రయత్నం మరోవైపు అంబేద్కర్ ఆధ్వర్యంలో జరిగింది.
స్వాతంత్ర్యానంతరం దళితులకు ఏవో కొన్ని రిజర్వేషన్లు తప్ప, కుల నిర్మూలన జరగక పోగా, దళితులపై మరింత ద్వేష భావం పెరిగిపోయింది. మరోవైపు దళితుల్లోనూ కొన్ని వర్గాల వాళ్ళే రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కుల్ని పొందడంతో, మరికొన్ని దళిత వర్గాల్లో అసంతృప్తి పెరిగిపోయింది. దాని కోసం దళితుల సమైక్యత అనేది అన్ని రకాలుగా పంపిణీ జరిగినప్పడే జరుగుతుందని భావించే స్థితికి చేరుకుంది. దాన్ని కొన్ని దళిత వర్గాలు అంగీకరించక పోవడంతో వర్గీకరణ ఉద్యమాలు రాక తప్పలేదు. అలా పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వర్గీకరణ ఉద్యమం తీవ్రమైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లి కూడా వర్గీకరణలో గల సామంజస్యాన్ని అంగీకరించింది. దీనితో దళితుల్లోని ప్రధాన వర్గాలైన 'మాల - మాదిగ' లలో మాదిగలు ప్రత్యేక అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. కానీ, మాదిగ సాహిత్యాన్ని ఒక ప్రత్యేక సాహిత్య ధోరణిగా దళిత సాహితీ వేత్తలు కూడా అంగీకరించడం లేదు. తమ ఆవేదనల్ని వ్యక్తం చేస్తున్నా మాదిగ సాహిత్యం ఇప్పుడు మైనారిటీ సాహిత్యమైంది. అలాగే, దేశంలో జరుగుతున్న క్రైస్తవులపై, క్రైస్తవుల జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ రాస్తున్న సాహిత్యం కూడా మైనారిటీ సాహిత్యమే అవుతుంది. అలాగే తెలంగాణపై జరుగుతున్న వివక్షను తెలిపే సాహిత్యం కూడా మైనారిటీ సాహిత్యమే అవుతుంది.
( 10-12-2008 న రాజమండ్రిలో కేంద్ర సాహిత్య అకాడమీ, నన్నయ విశ్వవిద్యాలయం, మనోఙ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీ వారు సంయుక్తంగా నిర్వహించిన " మైనారిటీ సాహిత్యం చర్చలు " సదస్సులో చేసిన నేను చేసిన అధ్యక్ష ఉపన్యాసాన్ని కొన్ని మార్పులు చేర్పులతో ఇక్కడ అందిస్తున్నాను. )

No comments: