"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

11 December, 2008

రాజమండ్రి సాహిత్య సభలు ''మైనారిటీ సాహిత్యం'' సదస్సు విశేషాలు

సూర్య దినపత్రిక, తూర్పుగోదావరి జిల్లా అనుబంధం లో 11-12-2008 న ప్రచురించిన ఫోటో,న్యూస్ ఐటమ్‌ ను దృశ్యంలో చూడవచ్చు. 10-12-2008 నాటి ఒక సదస్సు సమీక్ష ను కింద అందిసున్నాను.
*** *** ***
కేంద్ర సాహిత్య అకాడమీ, మనోఙ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంల వారు సంయుక్తంగా ఈ నెల ( డిసెంబరు) 8,9,10 తేదీలలో రాజమండ్రిలో సాహిత్య సభలు నిర్వహించారు. మూడవరోజు అంటే డిసెంబరు 10 వ తేదీన జరిగిన "మైనారిటీ సాహిత్యం"పై జరిగిన ఒక సమావేశానికి నన్ను అధ్యక్షత వహించమన్నారు. ఆ విశేషాలను సంక్షిప్తంగా ఇక్కడ రాస్తున్నాను.
మనోఙ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, రచయిత్రి పుట్ల హేమలత గారు ఆహ్వానం పలికి, వక్తలను పరిచయం చేశారు.
సభాధ్యక్షత వహిస్తూ నా ఉపన్యాసాన్ని ''మైనారిటీ సాహిత్యం'' అంటే ఏమిటో వివరించే దిశగా కొనసాగించాను.
"ప్రపంచ వ్యాప్తంగా గానీ, భారత దేశంలో గానీ ముస్లిములు సంఖ్యాపరంగా మైనారిటీలు కాదు. భారతీయ జనాభా లెక్కల ప్రకారం చూసినా ముస్లిములు రెండవ స్థానంలో ఉన్నారు. అటువంటప్పుడు వీరిని మైనారిటీలని ఎలా పిలావాలి? అలా పిలవడం వెనుక ఉన్న కారణాలేంటి? అని ఆలోచించవలసి ఉంది. నా అభిప్రాయం ప్రకారం మైనారిటీ సాహిత్యం అంటే ముస్లిం సాహిత్యమే కాదు. క్రైస్తవ సాహిత్యం కూడా అవుతుంది. అయితే అది ఆ మతాన్ని ఆధారం చేసుకొని ఆ ప్రజలపై జరుగుతున్న దాడులను, అభద్రతను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. ఆ మతం వల్ల వారిపై జరుగుతున్న అల్పసంఖ్యాక భావమే వారి రచనల్లో వ్యక్తమైతే అప్పడు అది "మైనారిటీ సాహిత్యం" అవుతుంది. "దళితులు" అని చాలామందిని కలిపి పిలుస్తున్నా, వాస్తవంలో దళితులంటే మాల, మాదిగ తదితర ఉపకులాలవారనే అభిప్రాయమే వ్యక్తమవుతుంది. ఉమ్మడిగా దళితుల్లో తమకి రావలసిన హక్కులను తమకి రావాలని వాదిస్తూ మాదిగ తదితర ఉపకులాల వాళ్ళు ఉద్యమంతో పాటు, సాహిత్యాన్ని కూడా రాస్తున్నారు. కానీ, ముస్లిం మైనారిటీ సాహిత్యానికి లభిస్తున్న ప్రాధాన్యత, దళితుల్లో అంతర్గతంగా జరుగుతున్న వ్యధలను వక్తీకరిస్తూ రాస్తుంటే, దానికి లభించడం లేదు. ఆ విధంగా మాదిగ సాహిత్యం ''మైనారిటీ తనాన్ని'' సంతరించుకుంది. సామాజికంగానూ దళితులుగానూ వృత్తి చేతా, సహజీవనం చేయవలసిన వారి చేతా అవమానించబడుతూ, దాని గురించి రాస్తే ఏమవుతుందో అనే అంతటి అభద్రతతో అనేక మంది మాదిగ సాహితీ వేత్తలు ఆలోచిస్తున్నారు. వీరికి తగిన ప్రాధాన్యత లభించక పోగా, ఒకరిద్దరు ఎవరైనా సాహసించి తమ భావాల్ని రాస్తే, వారిపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. మాదిగ వాదాన్ని రాస్తునందుకు డా// ఎండ్లూరి సుధాకర్ పై అనేక మంది దాడి చేస్తున్నారు. కలం పేర్లతో, దొంగ పేర్లతో రాస్తూ సాహిత్య దాడులు చేస్తున్నారు. వ్యక్తి గతంగా కూడా నిందలు చేస్తున్నారు. డా// ఎండ్లూరి సుధాకర్ గారి వాదాన్ని సమర్ధిస్తూ రాసే వారి రచనలు ఎన్ని ప్రచురణకు నోచుకుంటున్నాయి? ఇదంతా మాదిగసాహిత్యం ''మైనారిటీ''కి గురికావడం కాదా? ఉమ్మడిగా దళితులుగా ఉండటం లేదా అలా పరిగణన పొందడం వల్ల మాదిగలకు జరుగుతున్న అన్యాయం కాదా?
ఒరిస్సా,తమిళనాడు తదితర చోట్ల క్రైస్తవులపై, లేదా క్రైస్తవులుగా మతాన్ని స్వీకరిస్తున్న దళితులపై కొంతమంది దాడులు చేస్తున్నారు. ఆ దాడుల్ని ఖండిస్తూ వెలువరించే ఎన్ని ప్రకటనలు న్యూస్ అవుతున్నాయి? అసలు ఆ దాడులు వెలుగులోకి రావాలంటే ఎన్నాళ్ళు పడుతుంది? ఇదంతా క్రైస్తవులుగా మారేటప్పుడు దళితులు మైనారిటీ తత్త్వానికి గురికావడం కాదా? ఆ విషయాలన్నీ రాస్తే , వాటిని ప్రచురించే సంస్థలెన్ని ఉన్నాయి? తమ సమస్యల్ని , తమ ఫీలింగ్స్‌ని రాయడానికే భయపడుతున్న స్థితిలో ఉండటం మైనారిటీ భావం కాదా? తెలుగులో ముస్లిములు తమ అభద్రతను రాస్తుంటే వెంటనే ప్రచురించడామే కాకుండా, వాటి పై అనేక విశ్వవిద్యాలయాలు పరిశోధనలు కూడా చేయిస్తున్నాయి. ఈ స్థితి మాదిగ సాహిత్యానికి దక్కుతుందా? దళితుల్లోని మిగతా ఉప కులాల వారికి లభిస్తుందా? కనుక, మైనారిటీ సాహిత్యం అంటే కేవలం ముస్లిం సాహిత్యమే అని అనుకోవడం సరైంది కాదు. కానీ, సంఖ్యాపరంగా వాళ్ళు హిందువుల తర్వాత స్థానంలో ఉన్నా, అనేక కారణాల వల్ల ముస్లింలను మైనారిటీలని, వారు రాసే సాహిత్యం మైనారిటీ సాహిత్యం అనీ పిలుస్తున్నారు. కానీ, తెలుగులో వస్తున్న ముస్లిం సాహిత్య పుస్తకాలపై ఎక్కడా తమ సాహిత్యం ''మైనారిటీ సాహిత్యం'' అని కనిపించట్లేదు. కనుక, ఈ సదస్సు మైనారిటీ సాహిత్యంపై మరో చూపుని చూడవలసిన అవసరం ఉందని నా అభిప్రాయం'' అని నా ప్రసంగాన్ని ముగించాను. నా ప్రసంగం పూర్తి పాఠాన్ని త్వరలోనే నా బ్లాగులో పెడతాను.
ఈ సదస్సుకి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదం పెరిగిపోతున్న ఈ తరుణంలో అనేక ముక్కలు ముక్కలుగా సాహిత్య కారులు విడిపోవడం వాంఛనీయం కాదన్నారు. సాహిత్యానికి ఒక లక్ష్యం, తాత్త్విక భూమిక లేకుండా పయనించడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఏ సాహిత్యమైనా ప్రధానంగా వర్గ స్పృహ కలిగి ఉండాలి. అప్పుడే దానికి ఒక లక్ష్యం ఉంటుందని అన్నారు. ముస్లిం మైనారిటీ సాహిత్యానికి గల తాత్త్వికత ఏమిటో వివరించకుండా, దాన్ని కొంతమంది ఇస్లాం వాదంగానూ, మరికొంత మంది ముస్లిం వాదంగానూ ఎవరికి తోచినట్లు వారు రాయడం వల్ల వారి లక్ష్యం పట్ల స్పష్టత లభించదని ఉద్బోధ చేశారు.
డా// వినోదిని 'దళిత క్రైస్తవ స్త్రీవాద సాహిత్యం' పై పత్రాన్ని సమర్పించారు. " అగ్రవర్ణాల వాళ్ళు మమ్మల్ని కిరస్తానీలని పిలవడంలోనే మాల మాదిగలనే స్పృహ కలిగి ఉంటారని, తమకి బొట్టులేక పోవడంతోనే గుర్తు పట్టేస్తారనీ అన్నారు. అగ్ర వర్ణస్తుల స్త్రీవాదం , దళిత సమస్యల్ని అసలు స్పృశించదని, ఆ పరిస్థితుల్లోనే దళిత స్త్రీవాదం ముందుకు రావలసిన వచ్చిందన్నారు.
స్కైబాబా ''ముస్లిం దేశీయత" గురించి మాట్లాడారు. తమ మూలాలు దళితుల్లోని మాదిగల్లోనో, మాలల్లోనో ఉండి ఉంటాయన్నారు. తమ సాహిత్యాన్ని మైనారిటీ సాహిత్యం అని పిలుచుకోవడం అంటే, ఆ మైనారిటీ తత్త్వాన్ని, ఆ పిరికినీ మరింత పెంచుకోవడమే అవుతుందని స్పష్టం చేశారు. తమలో దర్గా సంస్కృతి ఉందనీ, అందులో భారతీయ ముస్లిములందరూ దేశీయమత విధానాలను పాటిస్తుంటారని వివరించారు. తమని ప్రపంచంలో ఎక్కడైనా భారతీయుడుగానూ, ఆ తర్వాతనే ముస్లిం గానూ గుర్తించాలని కోరుకుంటామని అన్నారు. ఉర్దూ కేవలం ముస్లింల భాషగా గుర్తించబడటం శోచనీయమని పేర్కొన్నారు.
డా// సీతారాం "ముస్లిం సాహిత్యం: కవిత్వం-అభివ్యక్తి" గురించి పత్రాన్ని సమర్పించారు. కొన్ని ముస్లిం కవితలను చదివి, వాటిలో గల అభివ్యక్తిని సోదాహరణంగా వివరించారు. ముస్లిం కవిత్వంలో సుమారు మూడు వందల ప్రత్యేక భాషా పదాలను గుర్తించానని, వాటిని ప్రయోగించిన కొంతమంది ముస్లిం కవుల అభిప్రాయాలను కూడా సేకరించానని వివరించారు. కవిత్వం రాయడానికి ముస్లిం కవులు తెలుగులో పడుతున్న కష్టాన్ని వివరించారు. ముస్లిముల కవిత్వ అభివ్యక్తిని అర్థం చేసుకోవడానికి వారి సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక కోణాలను కూడా గుర్తించవలసిన అవసరం ఉందన్నారు. ముస్లిం కవిత్వంలో ప్రయోగించిన భాష వల్ల తెలుగు సాహిత్యం మరింత శక్తి వంతంగా తయారైందనీ పేర్కొన్నారు.
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖను కూడా ప్రారంభించాలని కోరుతూ సాహితీ వేత్తలందరూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దాన్ని ప్రభుత్వానికీ, విశ్వవిద్యాలయానికీ నివేదించాలని కోరారు.
సదస్సుకి అధ్యక్షత వహిస్తూ ప్రారంభంలో నేను చేసిన ఉపన్యాసంలో మైనారిటీ సాహిత్యం అంటే ఏమిటో చెప్పిన వివరణను ఇంచుమించు అందరూ ఆమోదించిన తీరులోనే తమ పత్ర సమర్పణలు కొనసాగాయి. ఆ విధంగా మైనారిటీ సాహిత్యం అంటే కేవలం ముస్లిం సాహిత్యమే అని కొనసాగుతున్న ఆలోచనకు మరో చూపు ప్రసరించి మైనారిటీ సాహిత్యానికి మరింత విస్తృతి పెరగడానికి ఈ సదస్సు దోహద పడిందని, ఆ విధంగా ఈ మూడు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సాహిత్యానికి ఒక కొత్త దిశానిర్దేశం జరగడం సంతోషకరం అని వ్యాఖ్యానించాను. అంతేకాకుండా, మా తాతలు నేతులు తాగారు మా మూతులు ఇంకా వాసన వస్తున్నాయంటూ నిందలు గురికాబడుతున్న బ్రాహ్మణులు వంటివారు కూడా వారి ఆలోచన విధానాలలో మార్పులు వచ్చినప్పుడు, అవి సమాజ అభ్యుదయానికి దోహదపడుతున్నప్పుడు, బ్రాహ్మణులు మైనారిటీ వర్గంగా మారితే వారి గురించి రాసే సాహిత్యం కూడా మైనారిటీ సాహిత్యంగానే భావిస్తాం అని నా ముగింపు వాక్యాల్లో చెప్పాను.
వందన సమర్పణ చేస్తూ పుట్ల హేమలత గారు మూడు రోజుల సభల విశేషాలను సమీక్షించారు. సభలు జయప్రదం కావడానికి కారణమైన అందరికీ కృతఙ్ఞతలు తెలియజేసారు.

-డా//దార్ల వెంకటేశ్వరరావు
లెక్చరర్,తెలుగు శాఖ, సెంట్రల్ యూనివర్సిటి,
హైదరాబాదు -46



No comments: