"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

22 September, 2008

మల్లవరపు జాన్‌ కవిత్వంలో మాధుర్యం!

మల్లవరపు జాన్ కవి
మల్లవరపు జాన్ ప్రసిద్ధకవి. జాను కవి గారు 22 జనవరి 1927లో జన్మించారు. మల్లవరపు దావీదు, శ్రీమతి రత్నమ్మ గార్లు వీరి తల్లి తండ్రులు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని చీమకుర్తివీరి జన్మ స్థలం. వీరి కుటుంబానికో ప్రత్యేకత ఉంది. వీరి కుమారుడు రాజేశ్వరరావు, కుమార్తె కోటి రత్నమ్మ, మనవడు ప్రభాకరరావులు మంచి కవులు. ఒక మనవడు మంచి చిత్రకారుడు. జాను కవి గారు ది:12 ఆగష్టు, 2006 న మరణించారు.

మల్లవరపు జాన్ కవి పేరుతో పురస్కారం

ఆయన కుమారుడు మల్లవరపు రాజేశ్వరరావు తన తండ్రిపేరుతో తెలుగు సాహిత్యంలో విశేషమైన సేవచేసిన వారికి ప్రతియేడాది ఒక పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పురస్కార కమిటీకి మల్లవరపు సుధాకరరావు, మల్లవరపు ప్రభాకరరావులు ట్రస్టీలుగా ఉన్నారు. వీరిద్దరూ ప్రవృత్తి రీత్యాకవులు, వృత్తి రీత్యా కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్నారు.ఈ పురస్కారాన్ని 2016 నుండి ప్రారంభించారు. తొలిపురస్కారాన్ని ప్రముఖకవి, పరిశోధకుడు, అధ్యాపకుడు దార్ల వెంకటేశ్వరరావుకి అందించారు. పురస్కారానికి గాను 5116 రూపాయలు, ప్రశంసాపత్రం, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానం చేస్తారు.2016లో ఈ పురస్కార ప్రదానోత్సవం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బహుజన రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగింది.డా.దార్ల వెంకటేశ్వరరావుగారికి విజయవాడలో ఎం.బి.భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన రచయితల వేదిక ప్రథమ మహాసభల్లో ది 2016 ఏప్రిల్ 10న మల్లవరపు జాన్ స్మారక సాహిత్య పరిశోధన పురస్కారాన్ని (2016) ప్రదానం చేశారు.

మధురకవిగా పేరు పొందిన మల్లవరపు జాన్‌ కవిత్వంలో ఆ మాధుర్యం దేని వల్ల వచ్చింది?
ఆయన కవిత్వ ంరాశారు. ఆ కవిత్వాన్ని ఛందోబద్ద పద్యంలో రాశారు. సాంసన్‌ - డెలీలా నాటకం రాశారు. అది క్రైస్తవ సాహిత్యేతివృత్తం. అందులోనూ కొన్ని పద్యాలున్నాయి. సజ్జనాను రక్తిజాను సూక్తి మకుటంతో ఒక సూక్తి శతకం రాశారు. అది అనేక భావాల సంగమం. రేడియోలో సమస్యపూరణం పేరుతో వారం వారం ప్రసారమైన కార్యక్రమంలో అనేక సమస్యలకు పద్యపూరణ చేశారు. తన కృతులను ప్రచురించినవారినీ, ప్రచురించడానికి సహకరించినవారినీ, తన రచనలపై స్పందించినవారినీ అభినందిస్తూ పద్యాలు రాశారు. కవిత్వంలో తనకిష్టమైన ప్రాచీనాధునిక కవులనూ, కావ్యాలనూ స్పర్శించారు. మాతృభాషపై, మాతృభూమిపై అభిమానాన్ని కురిపించారు. వీటిని పరిశీలించినప్పుడు జాన్‌ కవి భిన్న వస్తువులను తీసుకొని కవిత్వం రాశారని తెలుస్తుంది. కవి భిన్న వస్తువులను తీసుకోవడం వల్ల మాధుర్యం వస్తుందా? తీసుకున్న వస్తువులను కవిత్వీకరించడంలో మాధుర్యం వ్యక్తమవుతుందా? అనే ప్రశ్న ప్రతి కవి గురించీ, ప్రతి రచన గురించీ వేసుకోవలసి వస్తుంది. ఈ ప్రశ్నకు వచ్చిన సమాధానాల సమాహారం నుండే కవిత్వ స్థాయి తెలుస్తుంది. కవి వచ్చిన సమాజం నుండి కూడా కవిత్వ స్థాయిని చూడాలి. కవిత్వ మాధుర్యాన్ని గుర్తించాలి. కనుక కవి చేసిన భాషా ప్రయోగాల జోలికి ఎక్కువగా పోకుండా భావాలను అనుసరించే మాధుర్యాన్ని పరిశీలిస్తున్నాను. జాన్‌ కవి అప్పకవి నిర్ణయాన్ని ఖండించడంతోనే ఆగిపోలేదు. మహాకవి జాషువా కవిత్వంతో కలిసి పయనించారు. కవిత్వం రాయడానికి కులం అడ్డంకి కాదని నిరూపించిన జాషువాని ప్రశంసించారు.
"కులహీనుండు రచించు కావ్యమ్ములు నిగ్గుల్‌ గుల్కినన్‌ గైకొన్ద్
న్వలదన్నాడతి ధూర్తుడప్పకవి - నీవా మాటలన్‌ ద్రుంచి క్రొం
దళకున్‌ గబ్బములల్లి పండితుల సన్మానంబులన్‌ గాంచి మా
తెలుగున్‌ జాతిని మేలుకొల్పితివి; సందేశాత్మ కావ్య ద్యుతిన్‌!'' (భావవిపించి, 1996 - 69) ఇక్కడ తరతరాల దళితవేదనను పలికించి, పాఠకులను ఆ వాదనతో ఏకీభవింపజేయడంలో మనసను పొందేది మాధుర్యమే! మన లాక్షణికులు ధీర్ఘసమాసాలు లేకుండా రాయడం, సరసములైన పదాలను కూర్చటం మాధుర్య గుణంగా వివరించారు. జాన్‌ కవిది కేవల సరళ శబ్ద ప్రయోగం వల్ల మాత్రమే వచ్చిన మాధుర్యం కాదు. చెప్పే భావంతో పఠితను అనుభవానికి తీసుకొని పోవడంలో మాధుర్యం ఉంది. డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ గురించి రాసిన పద్యాల్లో కూడా ఇలాంటి గుణం కనిపిస్తుంది.
"కర్ణుడలనాడు కులపరీక్షకుల నడుమ
శిరము వంచె వెంటనే నృపాదరణ గలిగె
అడుగడుగున నస్ప­ృశ్యుడవనుచు నిన్ను
దూరునపుడెవ్వరేనియు తోడుపడిరె?'' (భావ విపంచి, 1996-14) - అని వర్ణించడంలో గొప్ప ఆర్ద్రత ఉంది. అంటరాని తనాన్ని అనుభవించిన ప్రతి దళిత పాఠకుడూ మహాభారతంలో కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో కర్ణుడికి జరిగిన అవమానంతో మమేకమవుతాడు. వెంటనే అలాంటి అవమానాలెన్నింటినో ఎదుర్కొన్న డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ ఒంటరి పోరాటాన్ని స్ఫురింపజేశారు. ఇది వర్ణించినప్పుడు కవి కదిలిపోపయి వుంటారు. వేదనకు గురై వుంటారు. అలాంటి వేదనను అభివ్యక్తీకరించేటప్పుడు కవి చాలా నైపుణ్యాన్ని ప్రదర్శించవలసి వుంటుంది. ఆ ఖండికలను వర్ణించడంలో ఆ నైపుణ్యం వ్యక్తమైంది. ఇవన్నీ పాఠకుణ్ని ఒక తీయని బాధకు గురి చేస్తాయి. ఆ తీయని బాధలో మాధుర్యం ఉంంది. డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ చాలా విషయాల్లో ప్రభుత్వంతో ఒంటరిగానే పోరాడవలసి వచ్చింది. పదవుల్లో ఉన్నా, వాటిని కాపాడుకోవడానికే ప్రయత్నించే వాళ్ల మధ్య తన జాతి పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులకు కొన్నిసార్లు అలాంటి సందర్భాలు తప్పవు. అలాంటి సంఘర్షణల ఫలితమే నేటికైనా దళితులు కొంతవరకైనా ఆత్మగౌరవంతో తిరగ గలుగుతున్నారు. ఆ భావాల్నే కవి సరళమైన శైలిలో ఇలా వర్ణించారు.
‘‘నీ మూలన గదా! నేటి తరమ్ము రా
జ్యాంగ హక్కులరహస్యంబెఱింగె
నీ మూలమున గదా!నేటి హరిజన సో
దరుడు సభాధ్యక్షతనువహించె
నీ మూలమున గదా!నేటి దళిత కుల
మ్ముల 'రిజర్వేషను' పొందగలిగె
నీ మూలమున గదా!నేటి గిరిజనులు
వర 'కాలనీల'నివాసులయ్యె
ఊరికి సుదూరమున వాసమున్న వారు
చేరె;నీ మూలమున గ్రామ సీమలందు
నీశతజయంతి విజ్ఞాననిధులకెల్ల
గర్వమయ్యె నంబేద్కరూ! పర్వమయ్యె!! (భావవిపంచి, 1996 - 17) ఈ పద్యం చదివిన తరువాత పాఠకుడికి గొప్ప రిలీఫ్‌ కలుగుతుంది. 'పర్వమయ్యె' శబ్ద ప్రయోగంలో గొప్ప ఔచిత్యం ఉంది. బాధలన్నీ విముక్తమైనప్పుడు కదా నిజమైన మాధుర్యాన్ని అనుభవించగలిగేది! మాధుర్యంలోనూ ఎన్ని భేదాలు! జాన్‌ కవి గారు క్రైస్తవం పట్ల అభిమానం ఉన్నవారు. అయినంత మాత్రం చేత ఇతర మతస్థులపై నిరసనను ప్రదర్శించలేదు. వివిధ మతాలవారి మనోభావాలను వర్ణించడంలోనూ మధురమైన కవిత్వాన్ని రాయగలిగారు. శ్రీవెంకటేశ్వరుని నివాస స్థానంగా, హిందువుల పుణ్యక్షేత్రంగా భావించే తిరుపతి
"పలు మతానువర్తను పరస్పర విరుద్ధ
గతుల జరియించినను మానవత దలంచి
సహన సౌశీల్య సామరస్యముల తోడ
కలిసి మెలసి శాంతిజ్యోతి నిలుపవలదె?'' (భావవిపంచి, 1996-87) - అని ప్రశ్నించగలిగారు. సమాజంలో భిన్న మతాలున్నప్పటికీ మానవత్వాన్ని చాటి ఉత్తమ గుణశీలాన్ని పెంపొందించటానికి ఉపయోగపడాలనే ఆకాంక్ష కనిపిస్తుంది. కొంచెం ఓపిక చేసుకొని రాయగలిగితే కట్టమంచి వారి ముసలమ్మ మరణం వంటి కావ్యం కాగలిగిన స్వరూపస్వభావాలు కలిగిన 'వల్లూరమ్మ' గురించి కొన్ని గొప్ప ఖండికలు రాశారు. వల్లూరమ్మ గురించి ప్రజల నోళ్లలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. నేటికీ 'ఈతముక్కల' పరిసర గ్రామ ప్రజలు చాలామంది వల్లూరమ్మను గ్రామదేవతగా కొలుస్తారు. ఆ భావాలతో కవి ఏకీభవించే రాశారా? అనే దానికంటే అక్కడ జరుగుతున్న విషయాలను కవిత్వంలో రికార్డు చేయడంలో ఆ ప్రజల అనుభూతితో కలిసి పయనించారని మాత్రం తెలుస్తుంది.

"సంతాన హీనుల సాగిలపడి వేడ
                దివ్య సంతతి బ్రసాదించినావు
రోగాలతో వచ్చి రోదించి ప్రార్థింప
               నారోగ్యమిడి సాగనంపినావు
ఆపదలందు నిన్నాశ్రయించిన వారి
            చింతలడచి కటాక్షించినావు
అడుగట తడవుగ నభిమతంబుల దీర్చి
           కల్పవల్లిగ పేరు గాంచినావు

వాహనములాపి నీ గుడి వద్ద నిలిచి
తలచుకొని బయల్దేరు చోదకుల గాంచి
మేలు జేసెదవమ్మ! మమ్మేలు మమ్మ!
కూరిమి వరాలవెల్లి! వల్లూరితల్లి!'' (భావ విపంచి, 1996 - 73, 74)ఈ భావాలు కవివేనా? లేక కవి అక్కడి ప్రజలతో మమేకమై రాస్తున్నాడా? అనేది తెలియాలంటే పరిశోధన అవసరం! కవి దృక్పథాన్ని నిర్ణయించడానికి తీసుకొనే అనేక ప్రమాణాలను చూడవలసి వస్తుంది. కనుక ఆ విషయాన్ని కాసేపు పక్కనపెడితే, వల్లూరమ్మను కొలిచినవారు ఈ కవిత్వాన్ని చదివితే మాత్రం కవిత్వంలో గల మాధుర్యాన్ని అనుభవించగలుగుతారు! రామాయణ, భారత, భాగవతాలన నేటికీ నిలిచి ఉండడానికి అందులో 'గ్రంథ తతుల చందమందునుండటమే' కారణమంటారు కవి. ఇరవయ్యో శతాబ్ది మొదటి రెండు పాదాల్లో జీవించిన కొద్ది మంది దళిత కవులపై గాంధీ ప్రభావం తీవ్రంగానే ఉంది. జాన్‌ కవిపైనా ఉంది. అందుకనే అప్పటికి బాగా వాడుకలో ఉన్న హరిజన అనే పదాన్నే జాన్‌ కవి ఉపయోగించారు. అప్పటికే గాంధీ ప్రచారం చేస్తున్న హరిజన పదాన్ని డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ తీవ్రంగా వ్యతిరేకించినా, ఆ పదం పట్ల కొంతమంది అంగీకారానికి రాలేకపోయారు. అవగాహన ఉండటం, అవగాహన లేకపోవడం, అవగాహన కలిగినా కావాలనే ప్రయోగించటం వంటివెన్నో హరిజన పద ప్రయోగంలో ఉన్నాయి. అతుకుల బ్రతుకలు ఖండ కావ్య సంపుటి (1981)లో తరతరాలుగా అవమానాలతో బతుకీడ్చిన దళితుల గురించి హరిజనాభ్యుదయం ఖండికలో వర్ణిస్తూ...
 "అడుగు జాడలు కంట బడకుండ తుడవంగ/
 తాటాకు మడిమల దాకునాడు..'' అంటూ వర్ణించిన పద్యంలో దళితులంతా ఆ వర్ణతో కలిసి పయనిస్తారు. ఆనాడే మాల - మాదిగ అనే పేరుతో రాయకపోయినా వారి వృత్తులతో ఆ బాధలను వర్ణించారు కవి.
"చేనేత గుడ్డతో మానమ్ము గాపాడి
కట్టుబట్టల కెట్లు కష్టపడితివొ
పాదరక్షలనిచ్చి పాదాల రక్షించి 
దూరమ్ముగా నెట్లు త్రోయబడితివో..'' అని దళితులు వృత్తి చేయగలుగుతూ , ఆ వృత్తి తమకు ఉపయోగించుకోలేని సమాజ నిర్బంధాలను హృద్యంగా వర్ణించారు. జాన్‌ కవి హరిజన పదాన్ని ప్రయోగించినా, కవిత్వంలో మాత్రం డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ భావాలను సమర్థించటం కనిపిస్తుంది. కవిత్వంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా కవి అనుభవించి, దాన్ని రచనగా సృజనీకరిస్తాడు. రచనగా బయటకొచ్చిన తరువాత పాఠకులు/ శ్రోతలను అనుభవానికి గురిచేస్తాడు. అలా అనుభవానికి గురిచేసే రచనా విశిష్టత కవి అభివ్యక్తిలో ఉండే ఒక రహస్యం. ఆ రహస్యం తెలిసిన వాళ్లు ఎలాంటి వస్తువుని తీసుకున్నా దాన్ని కవిత్వం చేయగలరు. కొంతకాలం దాన్ని కవిత్వంగానూ చెలామణీ చేయగలరు. అయితే, అది పాఠకులందరికీ మాధుర్యాన్నివ్వగులుగుతుందా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. అంటే కవి వైపు నుండీ, పాఠకుల వైపు నుండీ మాధుర్యాన్ని గుర్తించవలసి వస్తుందన్న మాట. దీనికి కారణం అభిరుచి. కొంతమంది వస్తువేదైనా సాహిత్యంగా రూపొందితే దాన్ని చదువుతారు. అది సాహిత్యం కావడం కంటే, వస్తువుని బట్టే చదివేవాళ్లుంటారు. కనుకనే కళ ఎవరి కోసం అనే వాదం పుట్టుకొచ్చింది. కళ కళ కోసమా? కళ ప్రజలకోసమా? ఉభయుల కోసమా? అనే కళాతాత్త్విక చర్చలో జాన్‌ కవి ఉభయుల కోసమనే వర్గానికి చెందుతారు. ఒక సమన్వయవాదిగా కనిపిస్తారు. జాన్‌ కవి సరసవినోదిని (1991) పేరుతో ప్రచురించిన సమస్యాపూరణ పద్యాలలో కళ కళ కోసమనే దృక్పథం కనిపిస్తుంది. తెలుగులో ప్రాచుర్యం పొందిన అవధాన ప్రక్రియ పండిత, పామరులకు, భావుకులకు, కళాప్రియులకు వినోదాన్ని కలిగించగలుగుతుంది. కవికి భావుకత, సమయస్ఫూర్తి, పురాణేతిహాస లోకజ్ఞానం, భాషాపటిమ, కవిత్వీకరించే ప్రతిభ వంటివన్నీ సమస్యాపూరణకు అవసరం. ఇదొక పద్యవిద్య. స్వారస్యం తెలిసిన వారు ఆడుకునే సాహిత్యకేళి! ఈ పద్యభావాన్ని విప్పి చెప్పినప్పుడు పాండిత్యం లేకపోయినా ప్రతివాళ్లూ ఆనందించగలిగే కళ! జాన్‌ కవిగారు కూడా కొన్ని పద్యపూరణలు చేశారు. 'తనయుడు భర్తయయ్యె - వనితామణి చేసిన పుణ్యమెట్టిదో!' ఇదొక సమస్య. పద్యపాదంలో కొడుకే భర్త కావడమనే లోకవిరుద్ధమైన భావం స్ఫురిస్తుంది. రాజా ఈడిపస్‌ నాటకం తెలిసినవాళ్లకైతే అలాంటి ఓ విధివంచిత కథ గుర్తుకొస్తుంది. అయినా, అలా భర్త కావడం 'పుణ్యమవడం' ఆ నాటకం చదివినవారికీ నచ్చదు. మరేమై వుంటుంది. దాన్ని పూరించారు కవి.
"అనయము బల్లెటూరు తిరుగాడుచు పాడుచు నాల మేపుచున్‌
గొనముల రాశిబోయు నొక గొల్ల కులంగానయైన 'నీల'కున్‌
మనసిజ మోహనుండు సుకుమారుడు శూరుడునైన 'దేవకీ
తనయుడు' భర్తయయ్యె - వనితామణి చేసిన పుణ్యమెట్టిదో!'' (సరసవినోదిని, 1991-10) శ్రీకృష్ణుని అష్టభార్యలలో నీల ఒకరు. దాన్ని గుర్తు చేసుకున్నాడు కవి. కథా సందర్భాన్ని అల్లగలిగారు. గొల్లపల్లెలో ఆవులను మేపుకొంటూ జీవిస్తున్న 'నీల' అనే యువతిని దేవకీ తనయుడు (శ్రీకృష్ణుడు) ప్రేమించాడు. మరి అలాంటి సరసుడు, ఇష్టుడు, అందగాడు, మంచి వయస్సులో వున్నవాడు సాక్షాత్తూ అవతార పురుషుడుగా భావిస్తున్న శ్రీకృష్ణుడే భర్తగా లభించడం ఆమె చేసుకున్న పుణ్యమే కదా! అని చమత్కారంగా పద్యాన్ని పూరించడంలో సరసులైన వారికి ఆ కవిత్వం మధురం కాక ఏమవుతుంది?!
వినోదమే ప్రధానమైన మాధుర్యాన్నిచ్చిన మరొక పద్యపూరణ. 'కులవాసన నెంచి చూడ ఘుమఘుమలాడెన్‌' ఇదీ సమస్య!
నిజానికి సమకాలీన సమాజంలో 'కులం' కొంతమందికి సువాసననే కలిగిస్తుంది. లేకపోతే సమాజంలో కులం ఏనాడో నిర్మూలనమయ్యేది. పద్యపూరణ సమస్య మరొక సామాజిక సమస్య పరిష్కారాన్ని ఆలోచించే దిశగా కాకుండా, చాలా వరకూ వినోదక్రీడగా మార్చడమే అవధానంలో ప్రయోగంగా మారుతుంది. అప్పుడే ఆ కవిత్వంలో మాధుర్యాన్ని ఆస్వాదించగలిగే వాళ్లున్నారు. జాన్‌ కవిగారు వాళ్లకి అనుగుణంగానే పూరించగలిగారు.
"కలికీ! నీ చేతులలో
గల మహాత్మ్యంబదేమొ, కమ్మని వంటల్‌
వలపించెను కరివేపా
కుల వాసన నెంచి చూడ ఘుమఘుమలాడెన్‌'' (సరసవినోదిని, 1997, 36). వంట చాలా మంది చేసినా, కొంతమంది చేసిన వంటే కమ్మగా, రుచికరంగా ఉంటుంది. ఈ సమస్యను 'కరివేపాకుల వాసన'గా వర్ణించేసి, ఒక సామాజిక సమస్యను వినోదభరితంగా పూరించడంలో కవి శ్రోతలకు ఒక మాధుర్యాన్ని అందించగలిగారు. అందుకే జాన్‌ కవి కవిత్వం కవి సినారె గుండెను తాకింది. కవి తుమ్మల సీతీరామమూర్తికి సత్కవిత్వంగా తోచింది. జాన్‌ కవి భావానుభూతే కరుణశ్రీ చేత కింది పద్యాన్ని రాయించింది.
పనస తొనలకన్న పాల మీగడకన్న
మధువుకన్న ముగ్ధ వధువు కన్న
మల్లవరపు కవిత మధురాతి మధురమ్మ
జాను తెనుగు మేలి జాను తెనుగు'' ఈ పద్యంలో కరుశ్రీ కూడా జాన్‌ కవి కవిత్వంలో గల జానుతెనుగుని బట్టే ప్రధానంగా మధురత్వాన్ని గుర్తించగలిగారు. వేమన లోగడే ఇలాంటి ఒక పద్యాన్ని చెప్పారు. ఆ పద్యంలోని పనస తొనలకన్న అనే పదాలతో పద్యాన్ని ప్రారంభించటంలో వేమనను గుర్తు చేస్తున్నారు కరుణశ్రీ, వేమన భాషలో, భావంలో మాధుర్యాన్ని పలికించిన కవి. జాన్‌ కవి కూడా అలాంటి వారే అనే సూచనను కూడా కరుణశ్రీ పద్యం నుండి గ్రహించే వీలుంది.
ఏది ఏమైనా ఒక రచనను చదవడంలో భిన్న పార్శ్వాలుండడం వల్ల కవితామాధుర్యాన్ని భిన్న పార్శ్వాలలో గుర్తించాలి.
 జాన్‌కవి గారికి పాఠకుల మనసుకి ఆహ్లాదం కలిగించడంలో మాధుర్యం ఉంది.
ఆయన పద్యాన్ని చదువుతుంటే వినే శ్రోతకు శ్రవణత్వంలో మాధుర్యం కలిగింది.
 ప్రశంస పద్యాలలో ఉభయగత మాధుర్యం ఒలికింది.
 ఈ కవి కవిత్వ మాధుర్యం, శైలిలో ఉంది. వస్తువులో ఉంది.
 సామరస్య వాతావరణాన్ని వాంఛించడంలో ఉంది.
అన్నింటికీ మించి సహృదయతలో ఉంది.
ఆలంకారికులు చెప్పిన మాధుర్య గుణాన్ని మించిన లక్షణాలతో శోభిస్తుంది.
ఈ సైద్ధాంతిక నేపథ్యంతో మల్లవరపు జాన్‌ కవిగారి కవిత్వంలో గల మాధుర్యాన్ని సమాజ, సాహిత్య గతంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది.
డా.దార్ల వెంకటేశ్వరరావు
vrdarla@gmail.com

No comments: