"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

20 September, 2008

కులం – వర్గం : శంబుక దృక్పథం

డా//దార్ల వెంకటేశ్వరరావు
లెక్చరర్,తెలుగు శాఖ,
సెంట్రల్ యూనివర్సిటి,గచ్చిబౌలి,
హైదరబాదు
సమాజాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే, సమకాలీన సాహిత్యాన్నీ, అందులోనూ దళిత సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అవసరం ! దళితుల భాగస్వామ్యంలేని భారతీయ సమాజాభివృద్ధిని ఊహించడం అసాధ్యం. కులవివక్షను అనుభవిస్తూ, తప్పనిసరై చేస్తున్న వృత్తులు, కులవృత్తులుగా వంశపారంపర్యం కావడం , అవి దేశ సంపదకు ప్రధానమైనా, వాళ్ళెలా అప్రధానమయ్యారో శాస్త్రీయంగా అధ్యయనం చెయ్యడం ప్రస్తుత అవసరం. నిషేధాలు , సానుభూతులు, సంఘర్షణలు, సహకారాలు దళిత జీవితాల్లో ఎలా పెనవేసుకుపోయాయో, అవన్నీ భారతీయ సమాజంతో ఎలా ముడిపడి ఉన్నాయో తెలియకపోతే, సంక్లిష్టమైన సమాజాన్ని అవగాహన చేసుకోవడం అంత సులభం కాదు. ఈ సంక్లిష్టత అర్థం కావాలంటే, దళిత జీవితం, దళిత సాహిత్యం అవగాహనకు రావాలి . చాలామంది రచనలు చేసేవాళ్ళు, సమాజ సంక్లిష్టతను అర్థం చేసుకోవడంలో , అవగాహన చేసుకోవడంలో, వాటిని ఆవిష్కరించడంలో, రచనలు చేసే వారి జీవన నేపథ్యాలను బట్టి కూడా సాహిత్య ప్రతిఫలనం జరుగుతుంటుంది. ఈ ప్రతిఫలనం దళిత సాహిత్యంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది . అయితే, కేవలం రచనలను బట్టే , రచన చేసిన వారి స్వభావాన్ని పూర్తిగా అంచనా వేయడానికీ కొన్ని సమస్యలున్నాయి.
ప్రత్యక్షంగా దళితులను వ్యతిరేకిస్తూ, అణచివేస్తూ, ఆ దళితులనే పునాదులుగా చేసుకొని ' అభివృద్ధి ' లోకి వస్తున్న వాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉన్నారు . అలాగే చదువుకున్న మేథావులు కూడా, దళిత సాహిత్యాన్ని వ్యతిరేకిస్తూ , బయటకొచ్చి, వేదికలెక్కి ఊకదంపుడు ఉపన్యాసాలను దంచేస్తుంటారు . అవసరమైతే రాశామని చెప్పుకోవడానికి సానుభూతి దిగతుడుపుగా, దళిత సాహిత్యాన్ని రాస్తుంటారు . దానివల్ల వస్తే, గిస్తే, సన్మానాలు, బహుమతులు అందుకోవడానికీ వెనుకాడరు. దళితులుగా పుట్టిన వాళ్ళూ దళితులం కాదంటునే , దళితులకొచ్చే అన్ని అవకాశాల్నీ కొల్లగొట్టేయడంలో, ఇతర కులాలకే మాత్రం తీసిపోలేదని కొంతమంది నిరూపిస్తున్నారు . నిజానికి ఇతర కులాల వాళ్ళు, వీళ్ళకంటే కొంత నయమనిపిస్తుంటుంది . ఇటువంటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు , చైతన్యవంతులైతే ఏదొకరూపంలో తమ నిరసనను వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వారిలో ' శంబుక ' ఒకడు !
1.1. శంబుక దళిత చైతన్యం:
శంబుక పేరుపెట్టుకున్న ప్రత్తిపాటి మల్లేశ్వరరావు సమకాలీన సమాజంలో కనిపించే హిపోక్రసీని చూస్తూ, నోరు మూసుకుని , కాళ్ళూ చేతులుకట్టుకొని, ఏమూలనో దాక్కుంటూ, తన పబ్బం గడిపేసుకుందామనుకోలేదు . మాటై, పాటై, ఉద్యమ బాటై స్పందించారు . తన భావాలను కవిత్వంగా అందించారు. తన ఆలోచనలను పరిశోధనాత్మకంగా " ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు ఉద్యమంపై కుల ప్రభావం - ఒక పరిశీలన " లోనూ, " చరిత్రలో క్రైస్తవం - ఒక పరిశీలన " లోనూ స్పష్టంగానే చెప్పారు .
ఆశలు రేపినా కూడా ఆవేశంతో ముంచేసింది మార్క్సిస్టుల మార్గం, ఆవేశాన్ని అణచివేసి, కులం రంగు పూసుకుని , వివక్షను ప్రదర్శించే 'మతం' మార్గంలో మరొకటి దళితులను దగా చేసిందని నోరెత్తి, హోరెత్తి అక్షరమై ఆ గ్రంథాల్లో ధ్వనింప చేశారు శంబుక .
కుల నిర్మూలనకు, దాని అవగాహనకు, తద్వారా సమాజం చైతన్యవంతం కావడానికీ ఆధునిక ఆలోచనలనూ పంచాలనే ఆశయంతో నాస్తిక సమాజంలో చేరి , ప్రతీ విషయాన్ని దేవుడితో ముడిపెట్టే కర్మసిద్ధాంతాన్ని ఖండించారు. ఆధునిక భారతీయ సమాజంలో దళితపల్లె కూడా ఒకటవ్వాలని కలలుగన్నారు .
'శంబుక ' చరిత్రను చెప్పడానికీ వ్యాసం రాయడం లేదు! శంబుక చైతన్యాన్ని మరొకసారి స్మరించుకోవడానికే ఈ ప్రయత్నం. దళిత సాహిత్యంలో తమకోసం జీవితాలను త్యాగాలను చేసిన వారిని స్మరించుకొంటూ, చైతన్యం పొందడమనే లక్షణం ఒకటి ఉంది. దీనిలో భాగమే ' శంబుక ' పై ఈ వ్యాసం. శంబుక రాసిన కవిత్వంలో కనిపించే దళిత దృక్పథాన్ని చెప్పాలనుకుంటున్నాను. 1958 డిసెంబర్ 9 న పుట్టి, గుంటూరు పరరిసరాలు చైతన్యవంతం చేయడంలో తనవంతు పాత్ర నిర్వహించిన శంబుకను మార్క్సిస్టు దళారీలు ఏప్రిల్ ఒకటో తేదీ, 1995 న దారుణంగా హత్య చేశారు.
'శంబుక' ఆశించిందేమిటి? ఆయన కవిత్వాన్ని తెలుగు సాహిత్యంలో, దళిత సాహిత్యం ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని వివరించుకునే ముందు దళిత కవితాభివ్యక్తిలో ఉండే ప్రత్యేక అంశాలను చర్చించుకుంటే మంచిదేమో!
1.2. దళిత కవిత్వాభివ్యక్తి:
దళితులను చైత్యన్యపరచటం దళిత సాహిత్యం, ప్రయోజనాల్లో ప్రధానమైంది. కనుకనే, అభివ్యక్తిలో భాషలో తీసుకొనే అలంకారాలలో, శిల్పనైపుణ్యంలో అన్నీ దళితులకు అనుగుణమైన , తెలిసిన, అనుభవంలో ఉన్న వాటినే ఉపయోగించుకోవడం కనిపిస్తుంది. నిత్య జీవితంలో ముడిపడిన వాటినే ఊపమానాలుగా , ప్రతీకలుగా గ్రహించటం జరుగుతుంది. ' కళ కోసం కళ ' అనే శుద్ధ కళావాదుల వలే కాకుండా ' కళ ప్రజలకొరకే ' అనే నైతిక కళావాదుల వర్గంలోకి దళిత కవిత్వం చేరుతుంది . అయితే, దళిత కవిత్వ అభివ్యక్తి మూడు మార్గాల్లో పయనిస్తుందని చెప్పే అవకాశం ఉంది.
1) సాధారణమై పదాలు, నిత్య వ్యవహారంలో కలసిపోయిన సంభాషణ వలే కనిపిస్తూ, భాషకంటే వస్తుతత్వంపైనే దృష్టిని పెట్టేటట్లు చేయడం
2) భాష, వస్తుతత్త్వ వ్యక్తీకరణకి సమ ప్రాధాన్యతనిస్తూనే సౌందర్యాభివ్యక్తిలో మరే ఇతర సాహిత్యానికీ దళిత సాహిత్యం తీసిపోదని నిరూపించే ప్రయత్నం చేయడం.
3) ప్రతిదాన్నీ వ్యవస్థగా మార్చే ప్రయత్నం కూడా కనిపిస్తుంది.
దీనిలో మొదటి వర్గానికి శంబుక కవిత్వం చేరుతుందనిపిస్తుంది. ఇక్కడొక విషయాన్ని గుర్తుంచుకోవలసి ఉంది. దళిత కవిత్వ అభివ్యక్తీకరణ పద్ధతులను , స్థాయిలను పేర్కొనడమనేది, విశ్లేషణకు వీలుగా, అధ్యయన సౌలభ్యం కోసమే తప్ప, ఆధిక్యతలను, ఉచ్చనీచ భావాల్ని కలిగించడానికి మాత్రం కాదు ! ' శంబుక ' కవిత్వం దళితుల కోసం. దళిత సామాన్య ప్రజల కోసం రాసింది.
కవిత్వాన్ని తూచే పద్ధతుల్లో కొంతమంది దళిత కవులను ప్రత్యక్షంగా విమర్శించక పోయినా , పరోక్ష విమర్శలు చేస్తూ, అభివ్యక్తి నైపుణ్యం లేక, రాసిన దానినంతటికీ గొప్ప కవిత్వాభివ్యక్తిగా కీర్తించుకుంటూ, వస్తూరూపాల్లో, వస్తువుకే ప్రాధాన్యమని వాదిస్తున్నారనే వాళ్ళూ అక్కడక్కడా కనిపిస్తున్నారు . అలాంటి వాళ్ళకి సరైన సమాధానమిస్తూనే వస్తు రూపాల్లో సమప్రాధాన్యత నివ్వగలిగి, ఏ సాహిత్యానికైనా పోటీ పెట్టగల దళిత సాహిత్య సృష్టికర్తలు ఎంతోమంది ఉన్నారు . శివసాగర్, ఎండ్లూరి సుధాకర్, సతీష్ చంద్ర , మద్దూరి నగేష్‌ బాబు, శిఖామణి, పైడి తెరేష్‌బాబు, కలేకూరి ప్రసాద్‌, షాజహానా తదితరుల కవిత్వాన్ని పరిశీలిస్తే, దళిత సౌందర్యాభివ్యక్తి ఎంత సమర్థవంతంగా వ్యక్తమయ్యిందో తెలుస్తుంది. దళిత సౌందర్యం వస్తువు వల్లా, దాన్ని అభివ్యక్తీకరించడం వల్లా సమర్థవంతంగా కావడం ' శంబుక ' కవిత్వంలోనూ కనిపిస్తుంది. " పోయేదేమీ లేనోళ్ళం " అని తన కవితా సంపుటికి పేరు పెట్టుకోవడంలోనే, దళితుల పోరాట స్ఫూర్తినీ తెలియపరుస్తున్నారు కవి.
1.3. శంబుక దళిత దృక్పథం:
"శంబుక" రాసిన కవితల్లో కొన్నింటిని "పోయేదేమీ లేనోళ్ళం" పేరుతో ఒక పుస్తక రూపంలోకి తెచ్చాడు. వీటిలో శంబుక దళిత దృక్పథం, దళిత సాహిత్య అధ్యయనంలో ఒక ప్రధానవర్గ కోణాన్ని ఆవిష్కరించేదిగా ఉంది. శంబుక దళిత దృక్పథంలో కిందివి ప్రధానంగా కనిపిస్తాయి.
1) సమాజంలో కులం కనిపించడం ఒక విస్మరించలేని వాస్తవం.
2) "కులం" పేరుతో దోపిడీ జరుగుతుంది. ఇది భిన్న రూపాల్లో ఉంది .
3) కుల నిర్మూలనకు కృషి చేస్తున్నదెవరు? వ్యతిరేకిస్తున్నదెవరు? గమనించవలసి అవసరాన్ని నొక్కి చెప్పడం.
4) కులాన్ని వాడుకుంటూనే, కులాన్ని విస్మరించే వాళ్ళని వ్యతిరేకించడం.
5) కులపరంగా, ఆర్థికపరంగా మార్క్సిస్టులు పోరాటాల్ని నిర్మించవలసిన అవసరాన్ని చాటడం.
6) మార్క్సిస్టు పార్టీలో నాయకత్వం అగ్రవర్ణాలనబడే వారి చేతుల్లోనే మారు రూపాల్లో చేరడంవల్ల, మార్క్స్‌ లెనిన్‌మావో ఆశయాలు నెరవేరడంలేదనే అనుభవ సత్యాన్ని చాటడం .
7) దళితుల ఆత్మ గౌరవ ప్రకటనతో స్వీయ ఉద్యమాల నిర్మాణావశ్యకత వివరించటం
వీటితోపాటు మరికొన్ని అంశాలనూ తన కవిత్వంలో శంబుక శక్తివంతంగా చెప్పే ప్రయత్నం చేశాడు.
1.3.1. విస్మరించలేని స్థితిలో కులం:
"కులమయమిదం భారత్" కవితలో "శంబుక" సమాజ అంతరాల్లో కులం చొచ్చుకుపోయిన మార్గాలను అన్వేషించి చూపాడు. గుడిలో, బడిలో, మతంలో, ప్రేమలో, పెళ్ళిలో, ఉద్యోగంలో నిరుద్యోగిగా ఉండిపోవడంలో, ప్రభుత్వంలో, ప్రభుత్వ యంత్రాంగంలో, ఓట్ల సీట్లలో, కాలేజీల్లో, కార్ఖానాల్లో, పండితునిలో, పామరునిలో, నీటిబోరుల్లో, విద్యుద్దీపాల్లో, జైళ్ళలో, నల్లకోట్ల న్యాయంలో, నాయకత్వంలో, రౌడీయిజంలో, పల్లెల్లో, పట్నాల్లో, పార్టీల్లో, చివరికి చావులో కూడా ' కులం ' ప్రస్తావన అనేది లేకుండా లేదు. కాకపోతే, ఆచారంగానో, సంప్రదాయంగానో కలసిపోయి , ఆంతర్యాన్ని వ్యక్తం చేస్తూ కులం తన స్వభావాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. దీనివల్ల కులానికీ ' ఒక్కో సంస్కృతి ' రూపొందడంలో ఆశ్చర్యపోవలసిన పనేమీలేదు . కానీ, భారతీయ సమాజాన్ని చూసినట్లయితే, నాటి నుండి నేటి వరకూ దళితులను రకరకాల పీడనలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆ పీడనల నుండి రక్షించుకోవడానికి మతమార్పిడిలను తప్పనిసరి పరిస్థితులలో అంగీకరించవలసి వచ్చింది . ఏ కొందరో ఇష్టపడి కొన్ని మతాల్లోకి వెళ్ళినా, ఆ మతాల్లోనూ దళితులకి దక్కిన గౌరవం అనుభావంలోకొచ్చే సరికి , అందులొను ఇమడ లేని పరిస్థితులు! ఇలా హిందువులు , ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులుగా దళితులు మారిపోవటం వెనుక తరతరాల పీడన నుండి బయటపడాలనే ఆలోచనే ప్రధాన లక్ష్యం. దీని ఫలితంగా, సంస్కృతీ వైవిధ్యం దళితుల్లో ఎక్కువగా కనిపించినా, కులంలోని అంటరానితనం దళితులనందరినీ ఏకసూత్రంలో కట్టిపడేసింది .
భారతదేశ వ్యాప్తంగా పరిశీలించి చూసినట్లయితే కులానికో సంస్కృతి ఉన్నా, విభిన్న సంస్కృతులతో పాటు అస్పృశ్యత దళితుల్లోనే కనిపిస్తూ వంశపారంపర్యమయ్యింది. 'కులం' ఒక కాదనలేని సత్యమై కూర్చొంది! " కులమయమిదంభారత్ " కవితలో శంబుక! తన సైద్ధాంతిక భూమికనంతా ఈ కవితలో కవిపించేటట్లు చేసుకున్నారు . సిద్ధాంత వివరణ చేస్తున్నట్లుగా మిగిలిన కవితలను వర్ణించారు. అయితే ఈ సందర్భంలో సాహిత్య అభివ్యక్తి గురించి మాట్లాడుకోవలసిన అవసరం ఉంది . ' కులమయమిదం భారత్ ' కవితలో సామాన్య పదాలతోనే 'కవిత్వం' చేశారు కవి . అలంకారాలు తొడగడం కంటే అలవోకగా చెప్పినట్లే కనిపిస్తుంది కవిత. "దళిత కవిత్వం ఇలాగే వుంటుందా"? అనే అనుమానం కూడా కలగవచ్చు. ఆధునిక సాహిత్యంలోనూ వ్యక్తి , వ్యక్తి చైతన్యం, వైయక్తికానుభూతులు మాత్రమే ఆధునిక చైతన్యం కాదనీ, మార్మికంగా వ్యక్తం చెస్తేనే సాహిత్యం గొప్పదనడం వంటి వాటిలో దళిత సాహిత్యానికి కొన్ని విభేదాలున్నాయి వాటిని గమనించకపోతే, శిల్పాభివ్యక్తి గురించే ఎవరైనా మాట్లాడతారు!
1.3.2.నిలదీసిన అనుభవం :
ఒక మాదిగ వ్యక్తి నిండుగా బట్టలు వేసుకుంటే చూసే చూపులకీ, అగ్రవర్ణమని పిలవబడే వ్యక్తి బట్టలు ధరించకపోవడంలో నిరాడం బరత్వాన్ని పోలిక చేసి "ఆహా కులమా!" పేరుతో రాసిన కవితలో ఒకడిది దర్పం, మరొకడిది నిరాడంబరత్వం అనడంలో చూసే చూపు సరిగ్గా లేదంటున్నారు కవి. ఈ కవితలో డా.అంబేడ్కర్‌, గాంధీలను స్ఫురింపజేస్తారు. దీన్ని సమాజంలో కుల నిర్మూలన ఆదర్శ ప్రకటనకు అనుసంధానిస్తూ --
" బాపనోడు కులం లేదంటే
మహోన్నత సంఘ సంస్కర్త, ఆదర్శ జీవి
మాలోడు ఇదే అంటే
ప్రమాదకరమైన పచ్చి కులతత్త్వవాది
' ఓసి ' కులమా
నీవెంత కసాయిదానివే?!" - అని ప్రశ్నించటంలో కనిపించే ఆధిపత్య భావజాలాన్ని వివరిస్తున్నారు కవి. దళితులపై సంస్కరణ పేరుతో చెలాయించే నాయకత్వాన్ని, దాని స్వభావంలో కనిపించే హిపోక్రసీని బహిర్గతం చేస్తున్నారు. "ఓసి" కులమా అనడంలో అగ్రవర్ణం అనే పార్శ్వాన్ని కూడా చూడగలిగే అవకాశం ఉంది. "ఓసి" కులమా అనే దానిలో కులాన్ని నిందించడమూ ఉంది. కులాంతర వివాహాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. నిజంగా ప్రేమించేవారికి ఆ కులం ప్రతిబంధకేమీకాదు. సరే, ముందుకెళ్ళి కులాంతర వివాహం చేసుకోకుండా సిద్ధపడితే, వ్యతిరేకించేదెవరో గమనించాలంటున్నారు కవి ఇలాంటి వైరుధ్యాలు నిండుగా పెట్టుకున్న ఆధిపత్య భావజాలం గలవాళ్ళు, తమ పిల్లలను వాళ్ళకు ఇష్టం ఉన్న లేకపోయినా తమ కులం వాళ్ళకే ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. దానికి అనేక కథలల్లుతారు అంటారు కవి! "ఎర్రదొంగలు" కవితలో " సమాజంలో కౌటిల్య కులాలేవీలేవంటూ
'వర్గం వర్గం' అంటూ కొంగ జపం చేస్తున్న
మార్స్కిస్టు అద్వైతులు
తన కొడుకులూ, కూతుళ్ళకు
తన కులపోళ్ళను మాత్రమే ఏరిఏరి
పెళ్ళిళ్ళు చేస్తున్న మార్స్కిస్టు మనువులు
ఇంటి గుమ్మంలో మార్క్స్, లెనిన్‌ల ఫోటోల తగిలించు" కునే 'ఇంటి లోపలి దేవుని ఫొటోలు తగిలించే /హిందూ కమ్యూనిస్టుల డొల్లత్నాన్ని బట్టబయలు చేస్తున్నారు కవి. కులం వద్దంటూనే కులాన్ని పాటించే వాళ్ళలో వర్గవాదులు కూడా ఏ మాత్రం తీసిపోవట్లేదంటున్నారు కవి . వీళ్ళు ఎప్పటికీ కుల నిర్మూలనకి ఆదర్శవంతులు కాలేరనీ, దళితులు ఇటువంటి వారిపట్ల జాగురూకులై ఉండవలసిన అవసరాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు కవి . చరిత్రలో ఆదర్శవంతుల జాబితా కోసమే ప్రయత్నించే కుల నిర్మూలన సంస్కర్తల చరిత్రలను పునరాలోచించమంటున్నారు కవి .
1.3.3. ప్రత్యామ్నాయ పోరాటమార్గం:
'వర్గ' వాదులలో కనిపిస్తున్న 'కులం' ప్రభావాన్ని గుర్తించమంటున్నారు కవి . దీనికి స్వీయానుభవం, 'కమ్యూనిస్టు ఉద్యమంపై కుల ప్రభావం' పరిశోధనతో కూడిన గ్రంథం రాయడం శంబుక కవిత్వ అనుభవానికి బాగా తోడ్పడి ఉండవచ్చు. ' దళిత 'గర్జన' కవితా ఖండికలో --
" నిన్నడిగేది ఒక్కటే కామ్రేడ్!
వర్ణధర్మం పేరుతో వాడు నన్ను ఈసడిస్తే
వర్గ పోరాటం పేరుతో
నీవు నన్ను విస్మరిస్తున్నావు " అని చెప్పడమే గాకుండా, నాయకత్వంలో ఉన్న వాళ్ళు వర్గవాదులూ దళితులను ప్రతిభలేని వాళ్ళుగా ముద్రవేస్తున్నారనీ, పార్టీ క్రమశిక్షణ పేరుతో సేవకులుగా మారుస్తున్నారనీ, మార్స్కిస్టు పడికట్టు పదాలతో గందరగోళానికి గురిచేయడం కంటే వాస్తవాన్ని గుర్తించాలంటున్నారు కవి. వినే పరిస్థితుల్లో లేని' నాయకత్వ పరిరక్షణ జిత్తుల్ని పసిగట్టిన దళితులు' ఎర్రజెండా వ్యాపారం చేస్తున్న
"ఈ ఎర్ర బూర్జువా/ వామపక్షీయుడో, రామపక్షీయుడో గానీ/ మా వ్యతిరేక పక్షీయుడవుతున్న వైనాన్ని గుర్తించారని " పోయేదేమీ లేనోళ్ళం " లో స్పష్టం చేసి, అన్నింటా మోసపోయిన పరిస్థితుల్లో, నమ్మిన వాళ్ళు కూడా దళితులను బానిసలుగా మార్చుకోవడాన్ని వ్యతిరేకించడం, స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించుకోమని ప్రభోధించడం కవి భావాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
1.4. శంబుక మార్క్సిజం:
దళితులు స్వతంత్ర పోరాటాల్ని నిర్మించుకుంటున్నారు. దానికి కారణాలేమిటి? మార్క్సిజంలోగల నాయకత్వ వైఫల్యం వల్లనా? మార్క్సిజం పునాదుల్లో ' కులం ' భాగం కానందువల్లనా ! అనేది శంబుక జీవితం, సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం చదివే వారికి స్పష్టంగానే తెలుస్తుంది. జెండాలు మోయడానికే ఉపయోగపడుతున్న దళితులు పార్టీ పేరుతో మార్క్సిస్టు భావజాలంలో , ఆదర్శంలో, ఆచరణలోకి రాకపోవడానికి కులమే కారణమవుతున్నా, దాన్ని అంగీకరించకుండా, కులాధిపత్య భావజాలంగల నాయకులే అడ్డుతగలడంవల్ల , ఆత్మగౌరవాన్ని చంపుకొని, ప్రాణాలను బలిపెట్టడానికే ఆ పోరాటాల్లో మిగిలిపోవడం కంటే, ఆత్మగౌరవ స్వతంత్ర కుల పోరాటం నిర్మించుకోమంటున్నారు కవి. దళితుల సమస్యలు ఎజెండాలో పెట్టమంటే , కుల తత్త్వాన్ని అంటగట్టడం, గతితార్కిక భౌతికవాదాల్ని వినిపించడం , ఉపరితల అంశాలన్నింటికీ, పునాదిలోని ఆర్థిక అంశాలే కారణమంటూ సాధారిణీకరించడాన్ని తీవ్రంగానే వ్యతిరేకించారు కవి . వ్యతిరేకించవలసిన అవసరాన్ని భవిష్యత్ తరాలకి కవిత్వంలో అందించి స్ఫూర్తిదాయకమయ్యారనుకోవచ్చు!
" ఈ సాంఘిక-ఆర్థిక అసమానతలపై
సాయుధంగా తిరగబడతాం
మాకు మేము మార్గదర్శకులమౌతాం
మేము కారల్‌మార్క్స్ చెప్పిన
పోయేదేమీ లేనోళ్ళం" అంటూ తాము మార్క్సిజాన్ని వ్యతిరేకించడంలేదనీ, మార్క్సిజాన్ని భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మార్పులచేసి, కులాన్ని కూడా ఎజెండా చేయాలని వాదించారు కవి. అలా కుదరదనుకున్నప్పుడు డా.అంబేడ్కర్ తాత్త్విక భూమికకు చేరువుగా మార్క్సిజాన్ని దేశీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకోవాలనే దృక్పథం 'శంబుక'లో కనిపిస్తుంది !
శంబుక రాసిన దళిత కవిత్వంలో ఇలా అనేక నూతన పార్శ్వాలు ప్రతిఫలించాయి సాంఘిక ఆర్థిక పార్శ్వాలు అందులో ప్రధానమైనవి. దళితులు కులం వర్గం రెండింటిని పట్టించుకోవలసిన అవసరం ఉందనే ఆలోచన బలంగానే వ్యక్తం అయ్యింది. అయితే శంబుక తాత్త్విక పోరాట దృక్పథంలో కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి. కానీ, కవి ప్రత్యక్షంగా అనుభవించిన జీవితం నుండి 'పోరాటమార్గం' దళిత ఉద్యమం' గా రూపొందిందేమో అర్థం చేసుకోవలసి ఉంది.' శంబుక దళిత దృక్పథంలో కనిపించేవన్నీ వర్తమాన దళిత ఉద్యమం ఈ అన్ని భావాలను అంగీకరించాలనేమీ లేదు! కానీ, 'శంబుక దృక్పథం' లో అనేక అంశాలను వర్గవాదులు గుర్తించే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి . చికాగోలోని 'హే' మార్కెట్‌లో ఎనిమిది గంటల పనిదినం కోసం రక్తాన్ని చిందించిన కార్మికుల సమరత్యాగాన్ని నిత్యం స్మరించుకుంటూనే, కార్మికవర్గ చేతిలో నిలవ వలసిన ఎర్రజెండా, బూర్జువా, పెటీ బూర్జువాలు లాక్కోవడాన్ని వ్యతిరేకించినందుకు, దాన్ని బహిరంగంగా ఉద్యమ ప్రాయం చేసినందుకు ఆత్మత్యాగాన్ని చేయవలసి వచ్చింది శంబుక. తన ప్రాణం కోల్పోయినా తాను నమ్మిన సిద్ధాంతం కోసమే జీవించిన దళితవీరుడిగా దళితుల, పీడితుల హృదయాల్లో కలకాలం నిలిచిపోతారు కవి శంబుక .

2 comments:

Ajit Kumar said...

ఆదర్శప్రాయుడైన ఒక దళిత పోరాటయోధుణ్ణి గురించి తెలియజేసినందుకు థ్యాక్స్.

Praveen Mandangi said...

కుల వ్యవస్థ ఒక గొప్ప హిపోక్రిటిక్ వ్యవస్థ. పెళ్ళి విషయంలో అందరూ కులానికే ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ అక్రమ సంబంధాల విషయంలో ఎవరూ కులం గురించి ఆలోచించరు. ఇది చదవండి

http://telugu.stalin-mao.net/?p=62