విభిన్న భాషల మధ్య ఐక్యతే భారతదేశ విశిష్టత
-ఆచార్య సి.మృణాళిని వ్యాఖ్య
ఉపన్యసిస్తున్న ఆచార్య సి.మృణాళినిగారు
వందన సమర్పణ చేస్తున్న ఆచార్య ఫజుల్ ఉల్లా
భారతదేశంలో భిన్న భాషలు ఉన్నప్పటికీ వాటి మధ్య ఐక్యత కొనసాగడం భారతీయ భాషలలోని విశిష్ట లక్షణం అని, దానికి మహాభారతాన్ని సజీవ ఉదాహరణగా పేర్కొనవచ్చునని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్, సిలికానాంధ్ర ( యుఎస్ఏ) తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సి.మృణాలిని పేర్కొన్నారు. మంగళవారం (9.1.2024) హెచ్ సి యు మానవీయ శాస్త్రాల విభాగం ఆధ్వర్యంలో భారతీయ భాషోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మహాకవి సుబ్రహ్మణ్య భారతి జన్మదినోత్సవాన్ని భారతీయ భాషా దినోత్సవంగా ప్రతి యేడాది డిసెంబర్ 11 వతేదీన జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, ఆ కార్యక్రమాన్ని ఈనెల 9వ తేదీన స్కూల్ ఆఫ్ హ్యూమానిటిస్ ఆడిటోరియంలో డీన్, ఆచార్య వి.కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. మహాభారతాన్ని మూలంలో భావం కోల్పోకుండా తెలుగులోకి అనుసృజన చేసిన గొప్పతనం కవిత్రయ భారతానికి చెందుతుందని, వ్యాస మహాభారతంలోని పరమార్థాన్ని యథాతధంగా తెలుగులోకి తీసుకొచ్చారన్నారు. తెలుగు ప్రజలకు భక్తి కంటే లౌకిక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ అనీ, ఆ దిశగానే సాహిత్యం కూడా వెలువడిందన్నారు. సుబ్రహ్మణ్య భారతి తన రచనల్లోకందుకూరి వీరేశలింగం పంతులుగారిని ఒక పాత్రగా చేసి ఆయన గొప్పతనాన్ని వర్ణించారని సోదాహరణంగా వివరించారు. తమిళ కవి అయినప్పటికీ తెలుగు సుందరమైన భాషగా సుబ్రహ్మణ్య భారతి ప్రశంసించడం ఆయనలోని జాతీయతా స్ఫూర్తికి నిదర్శనం అన్నారు. అటువంటి సుబ్రహ్మణ్య భారతి పేరుతో భారతీయ భాషా దినోత్సవాన్ని జరపడం ఎంతో ఔచిత్యమైన చర్యగా ఆచార్య మృణాళిని వ్యాఖ్యానించారు. కేంద్ర సాహిత్య అకాడమీ కూడా 24 భాషలలో జాతీయస్థాయిలో పురస్కారాలను ఇస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన డీన్ ఆచార్య వి. కృష్ణ మాట్లాడుతూ భారతీయ భాషా దినోత్సవం భారతీయసమైక్యతకు నిదర్శనంగా భావింంచాలన్నారు. మరొక ప్రత్యేక అతిథి ఇఫ్లూ యూనివర్సిటీ అనువాద శాఖ అధ్యక్షులు ఆచార్య వి.బి.తారకేశ్వర్ భారతదేశంలోను, రాష్ట్రాలలోను భిన్న భాషలకు కేంద్రంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందీ శాఖ అధ్యక్షులు ఆచార్య సి.అన్నపూర్ణ సుబ్రహ్మణ్య భారతి కవితలను, ఆచార్య పిల్లలమర్రి రాములు తెలుగు కవితను ఆలపించారు. ఈకార్యక్రమానికి సమన్వయకర్తగా తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యవహరించినా,
తులనాత్మక సాహిత్య కేంద్రం, ఉర్దూశాఖల అధ్యక్షులు ఆచార్య జె.భీమయ్య, ఆచార్య ఏ.ఎమ్.ఫజులుల్లాలు కార్యక్రమానికి స్వాగతం, వందన సమర్పణలు చేశారు. కార్యక్రమంలో మానవీయ శాస్త్రాల విభాగంలోని అన్ని శాఖల అధ్యక్షులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment