'సాహిత్య విమర్శ ఒక బాధ్యతాయుతమైన పని'
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్య.
సాహిత్య విమర్శ ఒక బాధ్యతాయుతమైన పని అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం రాయలసీమ సాహిత్య సభ వారు ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఏర్పాటు చేసిన సాహిత్య సమావేశంలో సాహిత్య విమర్శకుడుగా వల్లంపాటి వెంకట సుబ్బయ్య అనే అంశంపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రసంగం చేశారు. వల్లంపాటి వెంకటసుబ్బయ్య విమర్శా శిల్పం, నవలాశిల్పం కథాశిల్పం వంటి గ్రంథాలను రాయడమే కాకుండా అనేక సామాజిక చారిత్రక గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేశారనీ, ఆయన జీవితాన్నీ, ఆయన రచనా దృక్పథాన్ని ఆ ప్రసంగం లో ఆయన వివరించారు.
తెలుగు సాహిత్య విమర్శ రంగంలో తనదైన ముద్ర వేసిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు రాయలసీమ ముద్దుబిడ్డ అనీ, ఆ ప్రాంత సాహిత్యాన్ని లోతుగా పరిశోధన చేసి ఒక గ్రంథం కూడా ప్రచురించారన్నారు. భారతీయ సాహిత్య సిద్ధాంతాలు, పాశ్చాత్య సాహిత్య విమర్శ మౌలికాంశాలను లోతుగా అధ్యయనం చేసిన ఉత్తమ విమర్శకుడుగా వల్లంపాటి వెంకటసుబ్బయ్యను గుర్తించాలన్నారు. సాహిత్యంలో వస్తు శిల్పాల ప్రాధాన్యాన్ని సమన్వయ దృక్పథంతో విశ్లేషించిన సామాజిక బాధ్యత గల సాహితీవేత్తగా, రాయలసీమ భౌగోళిక, చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మూలాలను ఆధారం చేసుకొని సామాజిక, సాంస్కృతిక దృక్పథంతో సాహిత్యాన్ని అనుశీలించడం నేర్చిన సైద్ధాంతిక విమర్శకుడుగా వల్లంపాటి విశేషమైన కృషి చేశారన్నారు. ఆయన రాసిన కథా శిల్పం. నవలా శిల్పం, విమర్శ శిల్పం, ఇతర వ్యాసాలు సాహిత్య విమర్శ కారులకు దారి దీపాలు. ఆయన అనువదించిన గ్రంథాలన్నీ చరిత్ర, సామాజిక సాహిత్య రంగాలలో అభ్యుదయ కరమైన ఆలోచనలకు ప్రేరకాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బండి నారాయణస్వామి, భూమి పుత్ర సంపాదకుడు సాకే శ్రీహరి మూర్తి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment