*జాషువా సాహిత్యం నిత్య ప్రాసంగికం* - ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్య
పద్మభూషణుడు ,కళాప్రపూర్ణ గుర్రం జాషువా 126 వ జయంతిని పురస్కరించుకుని రాయలసీమ జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాషువా సాహిత్యంపై బుధవారం నిర్వహించిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంట్రల్ యూనివర్సిటీ తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య దార్లవెంకటేశ్వర రావు రాయలసీమ జాగృతి మాసపత్రికను ఆవిష్కరించడంతో పాటు జాషువా రచనలకు ప్రాసంగికత ఉన్నదని,ఆయన కలలుగన్న సామ్యసమాజ సాధనకై ఆయన ఆలోచనా విధానం ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ వసి వాడని పసి వయసులో నాటకాలు చూడాలన్న కుతూహలం కొద్దీ నాటకాలు వేసేచోటు నుండి నెట్టివేయబడ్డ గుర్రం జాషువా గండపెండేరాలతో చెళ్ళపిళ్ల వేంకటకవులతో సత్కరించబడ్డ ధీశాలి అని అన్నారు.విభిన్నమైన కథాంశాలను తీసుకొని విలక్షణమైన రీతిలో కట్టిపడేసే తన పద్య శైలిలో వర్ణించిన ఏకైక నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా అని కొనియాడారు.
గబ్బిలం కావ్యంలో వాడిన పద్య భాషను, నుడికారాలను మలచిన తీరు అత్యద్భుతమని అన్నారు.అధముడైన రాజుని కూడా దేవుడిలా కీర్తించలేక, స్త్రీ అంగాంగ వర్ణనల అశ్లీలాన్ని తట్టుకోలేక, ప్రేమికుల చిలిపి, మధుర, సరస, విరహ వేదనలు పలుకలేక, భూగర్భం నుండి విశ్వాంతరాలాల మధ్యలో మళ్ళీ మళ్ళీ విహరించలేక,అద్భుత, అద్వితీయ అభూత కల్పనలకు ఊ కొట్టలేక,ప్రకృతికి పరిచయం లేని పదాలను వివరించలేక,ఆ దేవ దేవుడ్ని సైతం పొగడ్తల పద్యాల మత్తులో ముంచలేక,అవే అవే వర్ణనలు వేరు వేరు కలాల నుండి పదే పదే జన్మిస్తుంటే సాహిత్యం ధనికుల, అగ్ర వర్ణాల వారి గృహాలలో వెట్టి చాకిరి చేస్తుంటే,సాహిత్య ప్రక్రియలు కొద్దిమంది గీసిన హద్దుల్లో బందీలుగా బ్రతుకుతుంటే,రచనలకు కూడా అంటరానితనమనే లక్షణాలు పెరుగుతుంటే ఆ సాహితీ వేత్తలకు చెప్పలేక, ఆ కూర్పులో ఇమడలేక, ఏం చేయాలో అర్ధంకాక,అలసిపోయి దిక్కులు చూస్తున్న అక్షరాలకు కొత్త శక్తిని ఇచ్చాయని అన్నారు. వెయ్యేళ్ళ పైగా చరిత్ర కలిగిన పద్య రూపాన్ని అస్త్రంగా చేసుకొని సమరం సాగించిన గుఱ్ఱం జాషువా కలం నుండి జాలువారిన పద్యాలు సమాజాన్ని తట్టిలేపాయని పేర్కొన్నారు.
జాతీయ సదస్సుకు అధ్యక్షత వహించిన రాయలసీమ జాగృతి మాసపత్రిక సంపాదకులు సాకే శ్రీహరిమూర్తి మాట్లాడుతూ
ఎవరూ చూడని చీకటి కోణాలను చూడగల క్రాంతిదర్శి కవి కోకిల జాషువా గారని అన్నారు. జాషువా కవిత్వంలో జాలి, దయ, కరుణలు కనిపిస్తాయని అన్నారు. నిజానికి జాషువా జీవితం నుండి అతని కవిత్వం వికసించిందని తన రచనల ద్వారా అణగారిపోతున్న పేద సమాజాన్ని మార్చాలని భావించిన కవితాకోవిదుడని అన్నారు. ఆ కోవలోనే ప్రయత్నించారని తెలిపారు. జాషువాలో, అతని రచనలలో కసి గానీ, ద్వేషం గానీ లేదని, కేవలం ప్రతిఘటన మాత్రమే ఉన్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో పత్ర సమర్పకులు డా.గిన్నారపు ఆదినారాయణ,డా. మంజుశ్రీ,డా.బత్తల అశోక్ కుమార్,పుట్టా ఓబులేసు,డా.పానుగంటి శేషకళ,డా.వెంకట నరేంద్ర ప్రసాద్,నేతల లలిత,డా.ప్రవీణ్ యజ్జల,డా.జాడ సీతాపతిరావు,పరిశోధక విద్యార్థులు నలసానిరాంప్రసాద్,సభా సమన్వయకర్త,సాంకేతిక సహకారాన్ని అందించిన వెంకటాద్రి సిలపాక తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment