"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

13 December, 2017

ప్రపంచ మహాసభల తెలుగు భాషా చైతన్య ర్యాలి (12-12-2017)

తెలుగు భాష, దాని ఔన్నత్యం, తెలుగు వారి సంస్కృతుల వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడమే ప్రపంచతెలుగు మహాసభల ఆశయమని, తెలుగు మాతృభాషగా ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు భాషావ్యాప్తికి తోడ్పడాలని, అందుకు ఈ భాషా చైతన్య ర్యాలీ ఎంతగానో ప్రేరణనిస్తుందని హైదరాబాద్ విశ్వవిద్యాలయం, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఉద్భోదించారు. శేరిలింగంపల్లి, కొత్తగూడలోని సఫిల్ నగర్ లో గల న్యూబ్లూమ్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన తెలుగు భాషా చైతన్య ర్యాలిని ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మంగళవారం (12-12-2017) ఉదయం జెండా ఊపి ప్రారంభించారు.  పాఠశాల కరస్పాండెంట్ శ్రీ యు.కిరణ్ గారి అధ్యక్షతన జరిగిన ర్యాలి ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాతృభాషలు, దానిలో తెలుగు భాషావైశిష్ట్యాన్ని, అది కుటుంబం, స్థానిక ప్రజలు, పాలనతో ఎలా ముడిపడి ఉందో సోదాహరణంగా వివరించారు.(ప్రసంగ సంక్షిప్త రూపాన్ని కింద వేరేగా చదువుకోవచ్చు)  ప్రయివేటు పాఠశాల అయినప్పటికీ తెలుగు భాష గొప్పతనాన్ని చాటేలా ‘తెలుగుభాషా ర్యాలి’ని పాఠశాల యాజమాన్యమే నిర్వహిస్తున్నందుకు వారిని ఆయన అభినందించారు. సమావేశంలో విశిష్ట అతిథిగా ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ తాడిబోయిన రామస్వామి యాదవ్ పాల్గొని తెలుగు భాష ప్రాచీనతను, దానిలోని గొప్పతనాన్ని వివరించారు. తమ విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని శ్రీ కిరణ్ అన్నారు. పెద్దసంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేస్తూ స్థానిక వీధుల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. 





ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రసంగం పూర్తి పాఠం
తెలుగు భాషా చైతన్య ర్యాలీని నిర్వహిస్తున్న న్యూ బ్లూమ్ ఉన్నత పాఠశాల, సఫిల్ నగర్, కొత్తగూడ యాజమాన్యాన్ని, ముఖ్యంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీ కిరణ్ గార్ని అభినందిస్తూ, నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా నా పేరుని సూచించిన ప్రముఖ సామాజిక సంఘసంస్కర్త శ్రీ తాడిబోయిన రామస్వామి యాదవ్ గార్కి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ర్యాలీ ప్రారంభానికి ముందు జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగు భాషా వైభవాన్ని గుర్తుచేసేలా చైతన్య పరుస్తూ మంచి మాటలు చెప్తున్న పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు, దీనిలో భాగస్వాములైన విద్యార్థినీ విద్యార్థులకు, సిబ్బందికీ, స్థానిక ప్రజలకు నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
            మనలో కొంతమంది పొద్దున్నే‘గుడ్ మార్నింగ్’ అని పలకరించుకుంటాం కదా! తెలుగులో దాన్నే మంటారు? ‘‘శుభోదయం’’.  అందుకే మీ అందరికీ శుభోదయం.
            ఇప్పటి దాకా మనం మీలో కొంతమంది పాడిన పాటల్ని విన్నాం. కవితల్ని విన్నాం. కొంతమంది ఎంత మంచి సూక్తుల్ని చెప్పారు. ఇవన్నీ మనకి వెంటనే చక్కగా అర్థమయ్యాయి. మనం నిత్యం మాట్లాడుకునే తెలుగులో ఉండడం వల్లనే కదా మనకి బాగా అర్థమయ్యాయి.  బహుశా ఇక్కడున్న వాళ్లందరం మనింట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం కదా. పొద్దున్న లేచినది మొదలు పడుకునే వరకూ మన చుట్టుపక్కల వాళ్ళందరితోనూ ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుకుంటున్నాం. అలాంటి తెలుగు భాషలోని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే మన ప్రభుత్వం ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ నిర్వహిస్తుంది. మనకున్న సాంస్కృతిక వారసత్వాన్ని, మారుతున్న జీవన విధానాన్ని, మారాల్సిన పరిస్థితుల్నీ చర్చించుకోవడానికే మనం ప్రపంచ మహాసభల్ని నిర్వహించుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కె. చంద్రశేఖరరావుగారు స్వయంగా తెలుగు భాషాభిమాని. అందువల్ల ఆయనే అనేక సార్లు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాల్సిన తీరుతెన్నుల్ని చక్కగా పర్యవేక్షించారు. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు తెలుగు మాతృభాషగా అమలు చేయాలనే కృతనిశ్చయంతో కూడా పనిచేస్తున్నారు. మరి మనం కూడా మన తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసేపనిలో భాగస్వాములవ్వాలి కదా... అందుకే ఈ ‘తెలుగు భాషా చైతన్య ర్యాలీ’. దీనిలో పాల్గొంటున్న మీ అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న ఈ క్రమంలో ఒక ప్రయివేటు పాఠశాల తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ ఈ విధమైన ర్యాలీని జరపడం ఒక చారిత్రక సందర్భంగా నమోదవుతుంది. దీనిలో పాల్గొన్న మీరంతా ఆ చరిత్రలో ఒకరవుతున్నారు. అందుకు మిమ్మల్ని మరోసారి అభినందిస్తున్నాను.
మనం తెలుగు భాషా చైతన్య ర్యాలీని నిర్వహించుకునే ముందు మన తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగులో చదువుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాల్ని కొంత తెలుసుకోవాలి. అందువల్ల కొన్ని ముఖ్యాంశాల్ని మీకు చెప్తాను. మనం మన మాతృభాషలో చదువుకోవాలి. అప్పుడు మనకి చదువు భారమనిపించదు. ‘మాతృభాష’ అంటే మన అమ్మా, నాన్న, కుటుంబం అంతా మనం పుట్టినప్పటి నుండీ ఏ భాషలో అయితే మాట్లాడుకుంటామో ఆ భాషే మనకి మాతృభాష అవుతుంది. బహుశా ఇక్కడున్న మనందరిదీ తెలుగే మాతృభాష అయి ఉంటుంది. మన మేధావులు కూడా మన జీవన వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకొని ‘త్రిభాషాసూత్రాన్ని’ అమలు చేసుకోవాలన్నారు. అంటే మనం ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ వరకూ మన మాతృభాషా మాధ్యమంలోనే చదువుకోవాలి. దీనితో పాటు భారతదేశంలోని మన సోదర రాష్ట్రాల్లోని అందరితో కలిసి మెలిసి ఉండడానికి హిందీని నేర్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికీ, ఉన్నత చదువులు చదువుకోవడానికీ, ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికీ ఇంగ్లీషు మూడో భాషగా నేర్చుకోవాలి. అదే మన భాషా విధానం. కానీ, కొన్ని పాఠశాలలు, కళాశాలలు ఈ విధానాన్ని పాటించడం లేదు. చిన్ననాటి నుండే ఇంగ్లీషు భాషను కచ్చితంగా నేర్చుకోవాలంటున్నారు. ఇంగ్లీషు మాధ్యమంలోనే ఇతర సబ్జెక్టులన్నీ చదువుకోవాలంటున్నారు. మన తల్లిదండ్రులతో, బంధువులతో, ఉపాధ్యాయులతో, విద్యార్థినీ విద్యార్థులతో ఇంగ్లీషులోనే మాట్లాడాలంటున్నారు. దీనివల్ల మనలో చాలామంది చదువంటే భయపడుతున్నారు. మనం నేర్చుకోవాలనుకున్న ఇంగ్లీషు మన ఇంట్లోవాళ్ళకి తెలయకపోవడం వల్ల మనమేమి చదువుతున్నామో వాళ్ళకు తెలియడంలేదు. మనకేమైనా తెలియకపోతే మనవాళ్లని అడిగి తెలుసుకోలేకపోతున్నాం. దీనివల్ల మన కుటుంబానికీ, మనకీ తెలియని దూరమేదో మనమధ్య ఏర్పడిపోతుంది. ఇప్పటికే చాలామంది ఇంగ్లీషు మాధ్యమంలో చదువుతున్నవాళ్ళు, వాళ్ళకున్న నిబంధనలవల్ల కుటుంబసభ్యులతో మాట్లాడ్డం లేదు. కుటుంబసభ్యులతో, చుట్టుపక్కలవారితో మాట్లాడాలంటే వాళ్ళకొచ్చిన తెలుగుభాషలో మాట్లాడాలి. అలా మాట్లాడొద్దని పాఠశాల, కళాశాల యాజమాన్యాలు సూచిస్తున్నాయి. అందువల్ల మానవసంబంధాలన్నీ విచ్ఛిన్నమైపోతున్నాయి. మన కష్టాన్నో, సుఖాన్నో మనవాళ్ళతో పంచుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది.
ఇంటికెళ్లితే మనం ఎక్కువగా కుటుంబసభ్యులతో గడపాలి. మనం ఇంగ్లీషులోనే మాట్లాడితే మనకొచ్చిన ఇంగ్లీషు వాళ్ళకు రాకపోతే మనతో మాట్లాడ్డానికి ఇష్టపడరు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా తాతయ్య, నానమ్మ/అమ్మమ్మలతో గడపడానికి ఇష్టపడుతుంటారు. కానీ వాళ్ళకేమో వీళ్లకొచ్చిన ఇంగ్లీషు రాదు. అప్పుడు వాళ్ళు వీళ్ళతో మాట్లాడలేరు. పోనీ ఇరుగుపొరుగువాళ్ళతో మాట్లాడదామన్నా వాళ్ళకీ వీళ్ళకొచ్చిన భాష రాదు. అందువల్ల వీళ్ళెక్కువగా టీ.విలు ముందు కూర్చోవాల్సి వస్తోంది. చేతుల్లో మొబైల్స్ పెట్టుకొని తమకి నచ్చిన వాటిని చూసుకుంటూ గడపేస్తున్నారు. ఇదంతా ఒకవిధంగా కుటుంబంతో కలిసి మెలిసి ఉండాల్సిన వాళ్ళు అందరూ ఉండి కూడా ఒంటరితనంలోకి జారిపోవడానికి కారణమవుతుంది. ఈ ఒంటరితనం క్రమేపీ అనేక మానసిక వ్యాధులకు దారితీస్తుంది.
మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. పెద్దపెద్ద స్కూల్లోనో, కాలేజీల్లోనో ఇంగ్లీషు మీడియంలోనే చదివినవాళ్ళు ఓట్లు అడగడానికి వస్తుంటారు. ఓట్లేసేవాళ్ళకు అందరికీ ఇంగ్లీషు వస్తుందా? అందువల్ల వాళ్లతో మాట్లాడ్డానికి వాళ్ళెంతో ఇబ్డందులకు గురవుతున్నారు. సమస్యలున్నా వాటిని ఒకర్నొకరు స్పష్టంగా వ్యక్తీకరించుకోలేకపోతున్నారు. అందువల్ల ప్రపంచంలో మనం ఎక్కడ చదువుకున్నా మళ్ళీ మనం మన ప్రాంతంలో ఉద్యోగం చేయాలంటే మన భాష రావాల్సిందే. మనల్ని పరిపాలించాలన్నా, మనం మనవాళ్ల ప్రజాప్రతినిథులుగా ఎన్నికవ్వాలనుకున్నా స్థానిక భాష రావాల్సిందే. అప్పుడు మాత్రమే ఆ ప్రజలు, ఆ అధికారులు, ఆ ప్రజాప్రతినిథులు ఒకరికొకరు దగ్గరవుతారు. అలా కానప్పుడు తమనెవరో పరాయివాళ్లు పాలిస్తున్నట్లు ప్రజలు భావిస్తారు. ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా అర్థంచేసుకోలేక ప్రజాప్రతినిథులు, ప్రభుత్వాధికారులు మధ్యవర్తుల ద్వారా ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ, అవినీతికి అవకాశమిస్తుంటారు. అందువల్ల మాతృభాషలో, మాతృభాషామాధ్యమంలో అవసరమైనంతవరకూ మన చదువుల్ని మనం చదువుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విజ్ఞానం కూడా నేడు సత్వరమే అనువాదంమై మనకి అందుబాటులోకి వచ్చేస్తుంది. అందువల్ల మన మాతృభాషలోనే మనం చదువుకోవడం వల్ల మనమెంతో సృజనాత్మకంగా ఆలోచించగలుగుతాం. మనదేశ సంపదను ఎన్నోరెట్లు పెంచగలుగుతా. అప్పుడే మనం నిజమైన దేశభక్తులవుతాం.
మీరంతా ముందుగా మన తెలుగులో కూడా మన చదువుల్ని చదువుకుందామనే నిర్ణయానికి రావాలి. సుమతీ శతకకారుడు ఒక చక్కని పద్యం చెప్పాడు.
వినదగు నెవ్వరు చెప్పిన  
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ...!
మీరెప్పుడూ ఈ పద్యంలో చెప్పినట్లు ఎవ్వరు చెప్పినా ముందు వినండి. విన్నవెంటనే అదే సరైందని నమ్మేయకండి. దానిలోని నిజానిజాల్ని మీ పెద్దవాళ్లను అడిగి తెలుసుకోండి. అలా తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. మాతృభాషలో అంటే మన మాతృభాష తెలుగు మాధ్యమంలోనే చదువుకోవడం వల్ల వచ్చే ఉపయోగాల్ని మీ పెద్దవాళ్లను అడిగి తెలుసుకోండి. కేవలం ఇదే కాదు; ఏది విన్నా, దానిపై నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అర్థం కాకపోతే పెద్దవాళ్లను అడిగి తెలుసుకోండి. అమ్మనో, నాన్ననో, మీ ఉపాధ్యాయుల్నో, మీకు తెలిసిన పెద్దవాళ్లనో అడిగి తెలుసుకోండి. అప్పుడే నిర్ణయం తీసుకోండి. మనతెలుగు చదువుకోవడంలో కూడా అలాగే నిర్ణయం తీసుకోండి. మనతెలుగులో ఆంధ్రమహాభారతం, ఆంధ్రమహాభాగవతం, రామాయణాలు, పురాణాలు ఎన్నో ఉన్నాయి. అదంతా మనవాళ్లు మనకిచ్చిన గొప్ప విజ్ఞానం. దాన్ని మనం తెలుసుకోవాలి. మన వారసత్వసంపదను మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలంటే మనభాషను మనం నేర్చుకోవడానికి ముందుకురావాలి. మనభాషలో చదువుకోవడానికి ఇష్టపడాలి. మనభాష మనకి బాగా వస్తే, ఇతరభాషలైన హిందీ, ఇంగ్లీషు వంటి ఏ భాషలైనా చాలా సులభంగా వస్తాయని మన భాషాశాస్త్రవేత్తలు చెప్తున్నారు. మీరంతా మనదేశానికి ఎంతో కావలసిన వాళ్ళు. మీరే మరలా ఈ దేశాన్ని పాలించేవాళ్లు. మీరే మరలా ఈ దేశభవిష్యత్తుని తీర్చిదిద్దేవాళ్ళు. మన విజ్ఞాన పునాదులమీదే కొత్త విజ్ఞాన భవనాల్ని నిర్మించుకోవాలి. అప్పుడే మనం నిజమైన దేశభక్తులవుతాం.
మనం ఇంగ్లీషుకూడా నేర్చుకుందాం. డాక్టర్లు, ఇంజనీర్లు, సాప్ట్వేర్ నిపుణులవుదాం. కానీ అవన్నీ మళ్ళీ మనవాళ్ళకే ఉపయోగపడాలంటే మన మాతృభాషే మనకు శరణ్యం. అందువల్ల ఇతర భాషల్ని నేర్చుకున్నా, మన తెలుగు భాషను మనం విస్మరించొద్దు. మన తెలుగు భాషలోని గొప్పతనాన్ని తెలియజెప్పే గొప్ప కార్యక్రమాలు ప్రపంచతెలుగు మహాసభల్లో జరుగుతాయి. అవన్నీ మన తెలుగువాళ్ల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతాయి. ఆ ప్రపంచమహాసభలు డిసెంబరు 15 నుండి 19 వరకు ఘనంగా జరుగుతాయి. ఆ సభల్ని మనం విజయవంతం చేసుకుందాం. నలుదిశలా మన జాతి, మన భాషల గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటుదాం. దానికోసం మనమంతా నేడు ‘తెలుగు భాషా చైతన్య ర్యాలీ’ ని నిర్వహించుకుంటున్నాం. దీనిలో భాగస్వాములవుతున్న మీరందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
జైహింద్! జై భారత్! జై తెలుగు తల్లి!!
 ( ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా న్యూ బ్లూమ్ ఉన్నత పాఠశాల, కొత్తగూడలోని సఫిల్ నగర్ లో తెలుగు భాషా చైతన్య ర్యాలీ ప్రారంభ సభలో మాట్లాడిన సంక్షిప్త ప్రసంగం)


No comments: