"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

27 June, 2011

కళా స్వేచ్ఛా, విశృంఖలత్వమా ?

ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ అనగానే అతనొక గొప్ప చిత్రకారుడనేవాళ్ళున్నారు. మరి కొంతమంది సినీ నటి మాధురీ దీక్షిత్‌ అభిమాని అనేవాళ్ళున్నారు. ఇంకొంతమందైతే హిందు దేవతల నగ్న చిత్రాల్ని వేసిన ముస్లిం చిత్రకారుడని చెప్తారు. నిజానికి చిత్రకళలో తనదైన ప్రత్యేకతను సంతరించుకున్న కళాకారుడు ఎం.ఎఫ్‌. హుస్సేన్‌. అమెరికా నుండి వెలువడే ‘ఫోర్బ్స్‌’ అనే పత్రిక ఈయన్ని ‘భారతీయ పికాసో’ గా అభివర్ణించింది. ఈయన భారత ప్రభుత్వం నుండి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాల్లో పద్మశ్రీ (1955), పద్మభూషణ్‌ (1973), పద్మవిభూషణ్‌ (1991)లను పొందడమేకాకుండా,1986లో రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు.

ఈయన గౌరవార్ధం భారతీయ తపాలా శాఖ 1982,1988 సంవత్సరాల్లో రెండు స్టాంపుల్ని కూడా విడుదల చేసింది. ఆయన చిత్రాతోనే ఆ స్టాంపుల్ని ముద్రించడం విశేషం. ఇవన్నీ భారతీయు డిగా, కళాకారుడిగా ఎం.ఎఫ్‌.హుస్సేన్‌ని గౌరవించాయనడానికి నిదర్శనాలు.పుట్టింది పేదవాడిగా, భారతీయుడిగానే అయినా, చనిపోయింది మాత్రం అత్యంత పేరు ప్రఖ్యాతులు పొందిన కళాకారుడిగా, పరాయిదేశంలోనే! ఎవరైనా తాను పుట్టిన దేశంలోనే చనిపోవాలనేమీ లేకపోయినా, వివాదాల సుడిగుండమైన ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ ఈ విషయంలో చాలా చర్చనీయాంశమైయ్యారు. హిందువుల మనోభావాల్ని కించపరిచినందుకు ఈయన పరాయిదేశం పారిపోవాల్సివచ్చింది. తొమ్మిది పదులు దాటిన ముసలి వయసులో కేసులు, కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక నశించి, తన మాతృదేశమైన భారత దేశం రావాలనుకున్నా రాలేక పరాయి దేశంలోనే చివరి శ్వాస వదిలేశారు.
 ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ పూర్తిపేరు మఖ్బుల్‌ ఫిదా హుస్సేన్‌. మహారాష్ర్టలోని పండరీపురంలో 1915 సెప్టెంబరు17న జన్మించారు. మోహన్‌దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీ, మదర్‌ థెరీసాల చిత్రాలతో బాటు రామాయణ, మహాభారతాల్లోని విశేషాల్ని చిత్రించారు. 2010లో ఖతార్‌ దేశ పౌరసత్వాన్ని స్వీకరించారు. 2011 జూన్‌ 9న లండన్‌లో చనిపోయారు. చిత్రకారుడిగా, సినీ నిర్మాతగా, ఫొటో గ్రాఫర్‌గా, అన్నిం టికీ మించి స్వేచ్ఛగా బతికారు. కార్లంటే ఎంతో ఇష్టపడే ఈ కళాకారుడికి సొంతంగా ఆర్ట్‌ స్టుడియో లేదనీ, రోడ్ల మీదా, హోటళ్ళలోను, తనకి నచ్చిన ఏ చోటనైనా తన చిత్రాల్ని చిత్రించే కళాకారుడిగా పేరుపొందారు.
ఏడాదిన్నర వయసులోనే తల్లి చనిపోయారు.

తండ్రి వేరే వివాహం చేసుకోవడంతో తల్లిదండ్రుల అనురాగానికి దూరమైన దశ. చిత్రకళను అభ్యసించడానికి1935లో పాఠశాలలో చేరి,చిత్ర కళల్లోని రీతుల్ని శాస్త్రీయంగా గమనించారు. బతుకు తెరువు కోసం సినిమా హోర్డింగ్స్‌పై చిత్రాల్ని వేసేవారు. ఆ తర్వాత కాలంలో సూరత్‌, బరోడా, అహ్మదాబాదు నగరాల్లో స్వయంగా చిత్రాల్ని వేసి సంపాదించడం మొదలు పెట్టారు.ఆ తర్వాత 1947లో ఫ్రాన్సిస్‌ న్యూటన్‌ సౌజా స్థాపించిన ప్రోగ్రెస్సివ్‌ ఆర్టిస్ట్స్‌ గ్రూపులో చేరి, ఆధునిక చిత్రకళా రీతుల్ని అధ్యయనం చేశారు.

దీంతో ఈయన ఆలోచనల్లో వచ్చిన మార్పు ఆయన చిత్రాల్లో కనిపించసాగింది. అంతవరకున్న సంప్రదాయ కళారీతులకు భిన్నంగా, అప్పటికే పాశ్చాత్య దేశాల్లో ఆదరణలో ఉన్న ఆధునిక చిత్రకళారీతుల్లోని క్యూబిజం శైలిలో తన చిత్రాల్ని వేశారు. ఇలా చిత్రకళ, శిల్పకళారంగాల్లో వచ్చిన ఈ మార్పులే సాహిత్యరంగంలో కూడా ప్రభావం చూపాయి. వీటి ఫలితమే ప్రతీక, భావచిత్ర వాదాలతో పాటు, అథివాస్తవిక ధోరణులతో సాహిత్యం కనిపిస్తుంది. ప్రసిద్ధ చిత్రకారుడు పాబ్లో పికాసో (1881-1973) తన చిత్రాల్ని క్యూబిజం శైలిలో చిత్రించారు.

పికాసో వేసిన చిత్రాల్లో గుయెర్నికాను కళా విమర్శకులు గొప్ప కళాఖండంగా పేర్కొంటారు. 1937లో జర్మనీ, దాని మిత్ర పక్షాలు గుయెర్నికా రాజధాని బాస్క్‌ను బాంబులతో నేలమట్టం చేసిన సంఘటనకు ప్రతిస్పందిస్తూ పికాసో గుయెర్నికా అనే చిత్రాన్ని వేశారు. బలవంతుల దౌర్జన్యాలు ఎలా ఉంటాయో ఆ చిత్రంలో క్యూబిజం శైలిలో చిత్రించారు. దీనిలో ఎద్దులు- కిరాతక సైనికులకు, దౌర్జన్యానికీ ప్రతీకగా, గుర్రాల్ని- ఎదురు తిరిగిన ప్రజాసమూహానికీ, సాత్వికత్వానికీ చిహ్నంగా చిత్రించారని ఆ చిత్రం విశేషాల్ని కళావిమర్శకులు వివరిస్తున్నారు.

ఇటువంటి వివరణలు పెద్దగా ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ చిత్రాలకు కనిపించడం లేదు. కానీ, పికాసోతో ఈయన్ని పోల్చడానికి ప్రధానకారణం క్యూబిజం శైలిలో తన చిత్రాల్ని చిత్రించడం కావచ్చు. ఈయన వేసిన కొన్ని చిత్రాలకైతే ఎలాంటి పేర్లు లేకపోవడంతో ప్రేక్షకులే వాటిలోని రసత్వాన్ని ఊహించుకోవాల్సి వస్తుంది. అయితే, ఈ చిత్రాల్ని జాగ్రత్తగా చూస్తే, రేఖలు, రంగుల కంటే, కోణాకృతులకి ప్రాధాన్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇలా కోణాల (క్యూబ్స్‌)తో చిత్రాల్ని గీయడం వల్ల చిత్రాన్ని కేవలం ఒకే కోణంతో కాకుండా, భిన్నకోణాల్లో పరిశీలిస్తే, విభిన్న భావాల సంగమం ఆ చిత్రంలో కనిపిస్తుంది.

ఈ శైలిలో ఒక యువతి యొక్క చిత్రాన్ని చిత్రించేటపడు, ఆమె సౌందర్యానికంటే, ఆమెను చిత్రించిన కోణాల్ని పరిశీలించడం ముఖ్యమౌతుంది. అపడు ఆమె బాహ్య సౌందర్యం కంటే, ఆమె ఆలోచనా రీతిని ఆ చుట్టూ వేసే వివిధ సంకేతాలు, రేఖలతో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ పద్ధతిలోనే ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ వేసిన ‘భారత మాత’ చిత్రాన్ని గానీ, ఇతర చిత్రాల్ని గానీ చూడాల్సి ఉంటుంది.
కేవలం పికాసో శైలిలో మాత్రమే కాకుండా, క్యూబిజంలో కనిపించే మరింత ఆధునిక ధోరణిలో ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ చిత్రించారని కళావిమర్శకులు వ్యాఖ్యానించారు. ఈ పద్ధతిలో అంతవరకు అంగీకరిస్తున్న శైలికి భిన్నంగా, ప్రయోగాత్మకంగా ఉంటూనే, రాడికల్‌గా కనిపిస్తుంది. అందుకనే, భారతీ యులకు అందంగా, అంగీకరించే రీతిలో కనిపించే రాజా రవివర్మ చిత్రించిన దేవుళ్ళ పటాలతో పోల్చుకుని, ఈయన్ని నిరాకరించే వరకూ వెళ్ళారు.

తన చిత్రాల్ని ఆర్ట్‌ ఎగ్జిషన్‌లో పెట్టడం ద్వారా డబ్బు, పేరు ప్రఖ్యాతుల్ని పొందడమెలాగో తెలుసుకుని, భారతీయ చిత్రకళాకారుల్లో అత్యధిక పారితోషికం పొందిన కళాకారుడుగా నిలవగలిగారు హుస్సేన్‌. ఆ్చ్ట్టజ్ఛూ ౌజ ఎ్చ్చ ్చఛీ ఒ్చఝఠ్చ: ్చజ్చిఛజ్చిట్చ్ట్చ 12 పెయింటింగ్‌ సుమారు1.4 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు వేలం పాటలో అమ్ముడుపోయింది. అయితే, ఈ వేలం పాట సందర్భంలోనే న్యూయార్క్‌ లోని క్రిస్టీ భవనం బయట నిరసన ప్రదర్శనలు జరిగాయి. హుస్సేన్‌ హిందువుల మనోభావాల్ని గాయపరుస్తున్నందున, ఆయన పెయింటింగ్స్‌ని ప్రదర్శించ డానికి వీల్లేదని ఆందోళన కారులు ధ్వజమెత్తారు.

కానీ, కళ- సంస్కృతులను రక రకాలుగా వ్యాఖ్యానించుకోవచ్చనీ, మత చిహ్నాలను వ్యక్తీకరించడం, వ్యాఖ్యానించడం, పునర్‌ వ్యాఖ్యానించడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అనీ, కళల్ని నియతి మార్గంలోనే కొనసాగించాలని శాసించలేమనే ప్రకటనతో నిర్వాహ కులు హుస్సేన్‌ చిత్రాల్ని ప్రదర్శనకు పెట్టారు. 21 వ శతాబ్దానికి కూడా ఆయన చిత్రాలు సమకా లీనతను కలిగి ఉంటాయని, ఆ విలువల్ని గుర్తించలేకనే, ఆ చిత్రాల్లో నగ్నత్వాన్ని మాత్రమే చూసి నిరసనలు తెలియజేయడం సరైంది కాదని వ్యాఖ్యానించిన వాళ్ళున్నారు.

హుస్సేన్‌ వేసిన చిత్రాల్లో ఏ భావాలున్నాయో తెలియకపోయినా- ఈయన ఒక ప్రభావిత వ్యక్తిగా మారడం వల్లనే ప్రపంచంలో ప్రజల్ని, కళాకారుల్ని అత్యధికంగా ప్రభావితం చేయగల ప్రముఖులైన 500 మంది ముస్లిం ప్రముఖులలో ఒకనిగా రాయల్‌ ఇస్లామిక్‌ స్ట్రాటజీస్‌ సెంటర్‌ గుర్తించింది. మరి ఇంత ప్రభావితం చేయగల గల కళాకారుడు వేసిన చిత్రాలలో- సరస్వతీదేవిని నగ్నంగా చిత్రించటం, భారత మాతను, కాళికా దేవిని, లక్ష్మీ దేవిని, రామాయణంలోని కొన్ని పాత్రల్ని స్ఫురించేటట్లున్న వాటిలో- నగ్నత్వాన్ని కావాలనే చిత్రిస్తున్నారనే ప్రచారం జరిగింది. పైగా ముస్లిం, క్రైస్తవ చిత్రాల్ని ఇలా చిత్రించకపోవడంతో హిందువుల మనసుల్ని గాయపరుస్తున్నారనే వాదనకి బలం చేకూరింది.

దేవాలయాలపై ఉండే నగ్న శిల్పాలకీ, వీటికీ వ్యత్యాసం ఉందనే వాళ్ళున్నారు. తాపీధర్మారావు, ఆరుద్ర వంటి వాళ్ళు అలాంటి వాటి గురించి సుదీర్ఘంగానే చర్చిం చారు. అక్కడ కనిపించని నగ్నత్వం ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ చిత్రాల్లోనే కనిపించిందనడానికి ఆయన ఒక ముస్లిం కావడమనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కళాకారునికి ఉండే స్వేచ్ఛ, ఆ ధోరణులు, నూతనత్వం, ప్రయోగాలు తెలియనివాళ్ళు ఇలాంటి చిత్రాల్ని విమర్శించడాన్ని పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదనే భావనతో వాటిని పట్టించుకోని కళావిమర్శకులు కూడా ఉన్నారు.

హిందూ దేవతలను నగ్నంగా చిత్రించడాన్ని తట్టుకోలేక, ఆయన చిత్రాల గురించి ఒక కవి ( పాపినేనిశివశంకర్‌ )ఇలా కవిత్వీకరించారు- ‘జీవిత మర్మాల్ని గాక చర్మాల్ని చూడాలన్నావు....
/ అందరూ పిల్లల్ని స్నానం కోసం దిగంబరం చేస్తే
 నువ్వు స్త్రీ మూర్తుల్ని ప్రదర్శన కోసం దిగంబరం చేశావు
అందరూ నీలి చిత్రాల వైపు చూపిస్తే,
నువ్వు పురాణాల కల్పనల వైపు, ఖజురహో శిల్పాల వైపు
 వేలు చూపించావు’ - అని. ఆ విధంగానే ఈ చిత్రకారుణ్ణి అర్ధం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.

కళాకారుడిగా తాను చేసే ప్రయోగాలు సామాన్య ప్రజలకు అర్ధంకానప్పుడు, సాహిత్య, కళా రంగాల్లోనూ రాజకీయాలు ప్రవేశించినప్పుడు, పైకి కనిపించకపోయినా ఆ కళాకారుల కుల, మత ప్రభావాలు నిరసనల్లోనూ ప్రతిధ్వనిస్తుంటాయి. అప్పుడు అత్యధికులైన వారి ఆందోళనలకే తల ఒగ్గవలసి వస్తుంది. తమ సృజనలో హేతువు ఉన్నా, కళాత్మక విలువలే ఉన్నా, కళాకారుడు కోరుకునేది స్వేచ్ఛే అయినా అది- విశృంఖలత్వం అనిపించినప్పుడు- కొన్నిసార్లు నిరాదరణకూ, నిరసనకూ, నిషేధానికీ దారితీయవచ్చు. ఇదే ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ చివరి దశలోనూ ఎదురైంది. ఇదే- ఆయతో నిరసనకారులకు క్షమాపణ చెప్పించడానికీ, మాతృదేశం వదిలి పరాయిదేశంలో తలదాచుకోవడానికీ కారణమయ్యింది.
-Dr.Darla Venkateswara Rao,

Assistant Professor,

Dept .of Telugu,

University of Hyderabad, (Central University),

Gachibowli, Hyderabad-500 046

e-mail: vrdarla@gmail.com

Ph: 040-23133563 (O), Mobile: 09989628049,

-డా॥దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు,
తెలుగుశాఖ, సెంట్రల్‌యూనివర్సిటి,
గచ్చిబౌలి, హైదరాబాదు-46
ఫోన్‌: 9989628049

No comments: