"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

02 November, 2010

తెలుగు సాహిత్యంలో మహోన్నత శిఖరం ఆచార్య ఇనాక్‌

-డా దార్ల వెంకటేశ్వరరావు
                సృజన, పరిశోధన, విమర్శన రంగాల్లో తనదైన ముద్రవేసిన గొప్ప సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారికి సి.పి.బ్రౌన్‌ అకాడమీ పురస్కారాన్ని ప్రకటించి, సాహిత్య విలువల్ని పెంపొందించడంలో ముందువరుసలో నిలిచే ప్రయత్నం చేసింది. తెలుగు భాషా,సాహిత్యాలకు సి.పి.బ్రౌన్‌ చేసిన సేవ అభ్యుదయమార్గంలో సాగింది. అంతవరకూ నిర్లక్ష్యానికి గురైన వేమన సాహితీ ప్రపంచానికి తెలిసాడంటే దానిక్కారణం సి.పి.బ్రౌన్‌. నిఘంటువుల్ని రూపొందించడంలోను, తెలుగు ప్రబంధాల్ని సంపాదించి, వాటికి వ్యాఖ్యానాల్ని రాయించి, అందరికీ అందించడంలోను ఆయన చేసిన సేవ విస్మరించలేనిది. అలాంటి మార్గంలోనే పయనించిన వారు ఆచార్య కొలకలూరి ఇనాక్‌.
సి.పి.బ్రౌన్‌ పుట్టుకతోనే ధనవంతుడైతే, ఆచార్య ఇనాక్‌ దీనికి పూర్తి వ్యతిరేకమైన ఆర్థిక, సామాజిక పరిస్థితుల నుండి వచ్చినా, ఇరువురూ క్రైస్తవమతం భావాల్ని ఆచరించే కుటుంబం నుండి రావడం విశేషం. అందుకేనేమో తాము చేసే ప్రతి పనినీ దైవసమానంగా భావించటం ఇరువురిలోను కనిపిస్తుంది.
బ్రౌన్‌ కాలేజీ గా పండితుల్ని ఒక బృందంగా పరిశోధన చేయించడం, తానూ చేయడం సి.పి.బ్రౌన్‌లో కనిపించినట్లే, ఆచార్య ఇనాక్‌ గారిలోనూ ఇలాంటి పరిశోధక లక్షణం కనిపిస్తుంది. వీరి పర్యవేక్షణలో సుమారు 24 మంది పిహెచ్‌.డి., 18 ఎం.ఫిల్‌., పరిశోధనలు చేసి, డిగ్రీలు తీసుకున్నారు. సుమారు 198 జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాల్ని సమర్పించారు. సమారు 180 పరిశోధన పత్రాలు ప్రచురించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ‘‘ తెలుగు వ్యాస పరిణామం’’ పై పరిశోధన చేశారు. అదే విశ్వవిద్యాలయానకి వైస్‌ ఛాన్స్‌లర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించడం ఒక చారిత్రక సన్నివేశం. నన్నయ నుండి ఆధునిక పత్రికా రచయితల వరకూ తెలుగు వ్యాసపరిణామం కొనసాగిన తీరు తెన్నుల్ని విశ్లేషిస్తూ, సాహిత్య విషయాలకే మన రచయితలు అధిక ప్రాధాన్యాన్నిచ్చారని సూత్రీకరించారు. వ్యాసం ఆలోచన కలించడంతో పాటు, అనుభూతిని రగిలించడానికి సహకరించినప్పుడు అందరినీ అలరించగలుగుతుందని, దానికెలాంటి లక్షణాలను కలిగి ఉండాలో వేలాది వ్యాసాల్ని పరిశీలించిన అనుభవంతో సిద్ధాంతీకరించారు.నేటికీ చాలా మందికి దొరకలేదంటున్న పురాణం సూరిశాస్త్రి లాంటి వారు రాసిన వ్యాసాల్ని కూడా ఆనాటికే సంపాదించి, వాటిపై కూడా నిర్ణయాల్ని ప్రకటించడం పరిశోధకునికగా ఆచార్య ఇనాక్‌ గారికున్న అన్వేషణ, శాస్త్రీయ దృక్పథానికి నిదర్శనం.

డాక్టరేట్‌ సాధించిన గ్రంథం రిఫరెన్సు గ్రంథం కావడం పరిశోధనకు నిజమైన గుర్తింపనుకోవచ్చు. అలాంటి గుర్తింపు వీరి తెలుగు వ్యాసపరిణామం గ్రంథానికి లభించింది. ఈయన చేసిన మౌలికమైన పరిశోథనలో కలికితురాయిగా చెప్పుకోదగింది వసుచరిత్ర ప్రబంధకారుడు శుభమూర్తిపై చేసిన పరిశోధన. ఇది పరిశోధన గ్రంథమైనా, విమర్శక దృక్పథం ఉండటం వల్ల దీని పరిశోధనాత్మక విమర్శ గ్రంథంగా పిలవడం సమంజసం.               
పరిశోథనలో అన్వేషణ, కొత్తవిషయాల్ని బయటపెట్టడం, సిద్ధాంతాన్ని స్థాపించడం లేదా ఒక విషయాన్ని సూత్రీకరించడం ముఖ్యం. వీటిలో అంతర్భాగంగానే కనిపిస్తున్నా, గుణ,దోష విశ్లేషణ, నిర్ణయ ప్రకటన విమర్శలో ప్రధానంగా చూడాలి. పరిశోధనలో కనిపించే అన్వేషణ, సమాచార సేకరణ విమర్శలో అంతగా కనిపించవు. లభించిన సమాచారాన్ని విశ్లేషించి, తులనాత్మకంగా పరిశీలించి, తనదైన దృష్టితో వ్యాఖ్యానించి, అది గుణమో, దోషమో ఒక నిర్ణయాన్ని ప్రకటించడం విమర్శ స్వభావం. ఈ రెండు స్వభావాలు సంతరించుకుంటే దాన్ని పరిశోధనాత్మక విమర్శ అనొచ్చు. అలా రెండు లక్షణాల్ని సంతరించుకున్న గ్రంథం ‘‘శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం’’. తన పేరు శుభమూర్తి, మూర్తికవి అని వసుచరిత్రకారుడు చెప్పుకున్నా, అతణ్ణి భట్టుమూర్తి, రామరాజభూషణుడు అని నాటి నుండి నేటి వరకూ పండితలోకం పిలవడంలో ఒక శూద్రుణ్ని కవిగా గాని, అతని పేరుతో గాని పిలవడానికిష్టపడని వర్ణాధిక్యాన్ని సోదాహరణంగా నిరూపించారు. శుభమూర్తిలో కవిలోకం పట్ల దళిత, బహుజనులు అలవరుచుకోవలసిన ప్రతిఘటన చైతన్యాన్ని గుర్తించేలా గ్రంథాన్ని సాధికారికంగా రాశారు. ఇంతవరకూ దీన్నెవరూ ఖండిరచకపోవడం దీనిలో ప్రతిపాదించిన పరిశోధనాంశాల్లోని శాస్త్రీయతకు నిదర్శనం.
ఇటువంటి పరిశోధనాత్మక స్పర్శతో  రాసిన విమర్శ గ్రంథం ‘‘ఆధునిక విమర్శ సాహిత్య సూత్రం’’   తెలుగు వ్యాసం గురించెవరైనా ప్రస్తావిస్తే, ఈ రంగంలో చేసిన ఇనాక్‌ గారి వ్యాసపరిణామాన్ని ఎలా పేర్కొంటారో, అలాగే ఆధునిక సాహిత్యాన్ని విమర్శించేందుకున్న నూతన సూత్రాల్ని ప్రతిపాదించిన గ్రంథమిది.  అటు పూర్తిగా మార్క్సిజం గాని, ఇటు మానవతావాదంతో గాని విమర్శించడానికి వీల్లేని పూర్తి దేశీయ విమర్శ పద్ధతిలో మాత్రమే విమర్శించదగినవి దిగంబర, స్త్రీవాద,దళితసాహిత్య ధోరణులు. వీటిని చాలా శ్రద్ధగా తాను పరిశోధన చేస్తూ, విద్యార్థుల చేత చేయిస్తూ వస్తున్న క్రమంలో వెలువడిన ఆణిముత్యాల్లాంటి విమర్శపద్ధతుల్ని ప్రతిపాదించారు. సాహిత్యవిమర్శకు తెలుగు సాహిత్యం అందించిన మహోన్నత వారసత్వసంపదగా దీన్ని చెప్పుకోవడానికి వీలున్న విమర్శపద్ధతులివి.
               సాహిత్య విమర్శలో ఆంగ్లేయుల ఇమేజినేషన్‌ నే తనదైన పద్ధతిలో చెప్పి, దానికి సామాజిక కోణాన్ని అందించి కట్టమంచి రామలింగారెడ్డి విమర్శకు ఆధునికతను ఇచ్చాడు. మళ్ళీ విమర్శకు అంతటి గౌరవాన్నిచ్చిన పరిస్థితి ఆచార్య ఇనాక్‌ గారికే చెందుతుంది. మార్క్సిజంలోని ఆర్థికాంశాల్ని, దేశీయతాభూమికతో రూపొందిన అంబేద్కర్‌ కులనిర్మూలనా చైతన్యాన్నీ మేళవించి సాహిత్యాన్ని సమన్వయించినప్పుడే స్త్రీవాద, దళిత సాహిత్య విలువల్ని శాస్త్రీయంగా అంచెనా వేయగలమని నిరూపించారు.
అంతవరకూ చర్చలో కొచ్చిన వస్తు, రూపాలు, నిబద్ధతలతో పాటు నిమగ్నత, నిబిడితలను ప్రతిపాదించారు. తాను రాసే రచనల్లోని జీవితానికి వ్యతిరేకమైన జీవితం ఉంటే రచయితకు నిబద్దత ఉన్నట్లు కాదు. రాసే వస్తువుతో తాదాత్మం చెందడమనే నిమగ్నత సాహిత్యానికి విలువల్ని అందిస్తుంది. తాను రాసే వస్తువుకీ, తన జీవితానికీ అవినాభావ సంబంధమున్నట్లైతేనే నిబిడితతో కూడినట్లవుతుంది. ఈ మూడు లక్షణాలు సమ్మేళనంతో సాహిత్య విమర్శ చేయడమనేది ఇనాక్‌ గారితోనే ప్రారంభమైంది. ఆ సూత్రమే ప్రధానకేంద్రంగా స్త్రీవాద, దళిత సాహిత్య విమర్శ చేయగలిగితేనే అది శాస్త్రీయమైన విమర్శపద్ధతి అవుతుంది. లేకపోతే స్త్రీవాద, దళిత సాహిత్యాల్ని సంస్కరణ, మానవతావాద, మార్క్సిస్టు పద్ధతుల్లో విమర్శించించినట్లే అవుతుంది.
ఇలా పరిశోధనలోను, విమర్శలోను ఒక మైలురాయిగా నిలవదగిన స్థాయిలో కృషిచేసిన ఇనాక్‌ గారు సృజనాత్మక సాహిత్యంలోనూ తనదైన ముద్ర వేయగలిగారు. తెలుగులో చక్కని, చిక్కని, చిన్న చిన్న వాక్యాల్లో అందంగా రాయడమెలాగో తెలుసుకోవాలంటే, ఇనాక్‌గారి వచనం చూడాల్సిందే. సృజనాత్మక రచనల్లో మునివాహనుడు, ఊరబావి, తలలేనోడు, కులవృత్తి వంటి రచనలు ఆయన తప్ప మరెవరూ రాయలేరనిపిస్తుంది. మొత్తం మీద రచనలన్నింటిలోనూ ఉండే గుణం మానవీయ విలువల్ని  మహోన్నత పతాకం చేయాలనే మహోన్నత సాహిత్య శిఖరం ఆచార్య కొలకలూరి ఇనాక్‌.
( ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారు సి.పి.బ్రౌన్‌ అకాడమీ పురస్కారాన్ని 30`10`2010 వ తేదీన అందుకుంటున్న సందర్భంగా రాసిన వ్యాసం.)

No comments: