''యజ్జయాగాదులతో లక్షలాది జీవితాల్ని బలిపేరుతో హింసిస్తున్నప్పుడు
భారతదేశంలో జైన బౌద్ధ మతాలు అహింసను ప్రబోధించడం వల్ల వాటి పట్ల ప్రజలు ఆసక్తిని చూపారు. దానితో హిందూమతంలో అలజడి ప్రారంభమైంది. క్రమేపీ వైష్ణవం, శైవం తమ ఉనికిని కోల్పోవటం ప్రారంభించాయి. హిందూ మతానికి ప్రమాదానికి ముంచుకొచ్చిన తరుణంలో ద్వైతం, అద్వైతం విశిష్టాద్వైతం వంటి మతధోరణులు ప్రారంభమయ్యాయి.ఈపరిస్థితుల్లో పరోక్షంగా హిందూ మతాన్ని నిలబెట్టుకునే ప్రణాళిక తోనే వీరశైవం ఆవిర్భవించింది. సనాతన సంప్రదాయ హిందూమతంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. యజ్ఞయాగాదుల సమయాల్లో బలిపశువుల్లో ఆవులు, ఎద్దుల్ని చంపడాన్ని ఆపడంలో జైన, బౌద్ధాలకంటే ఒకడుగుముందకువేసి, ఎద్దుని నందీశ్వరునిగా పవిత్రీకరించారు. శివుడు నందీశ్వరుని రూపంలో బసవేశ్వరుని భూలోకానికి పంపించినట్లు గా వర్ణించారు.
నందీశ్వరుని అవతారమైన బసవేశ్వరుని బోధనలను ఆచరణలో చూపించడమే పాల్కురికి సోమనాథుడి ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన గురు దీక్ష, జంగమసేవ, వీరమాహేశ్వరవ్రతదీక్ష, సామాన్యులను సైతం పురాణ పురుషులు గా కీర్తించడం వంటివన్నీ పాల్కురికి సోమనాథుడు తన రచనల ద్వారా ప్రచారం చేశాడు. దీనిలో భాగంగానే కుల, లింగ భేదాలను ఖండించాడు'' అని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తన పత్ర సమర్పణలో వివరించారు. ఈ సమావేశానికి ఆచార్య కొలకలూరి మధుజ్యోతి అధ్యక్షత వహించారు. ఈయనతోపాటు బెంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య సమతా దేశ్ మానే, యోగి వేమన విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.వినోదిని కూడా తమ పత్రాలను సమర్పించారు.
ఫోటోల సౌజన్యం: అల్లూరు మస్తాన్
No comments:
Post a Comment