డా.ద్వానాశాస్త్రిగారి పురస్కార ప్రదానోత్సవ సభ 2025
డాక్టర్ ద్వానా శాస్త్రి గారు మా గురువుగారు.
ఆయన పేరుతో వాళ్ల కుమారుడు శశికాంత్
ఒక పురస్కారాన్ని ఇస్తున్నారు.
దాన్ని ప్రతీ సంవత్సరం
ఒక ప్రముఖ సాహితీవేత్తకు ఇస్తున్నారు.
ఈ ఏడాది ప్రముఖ దూరదర్శన్ వ్యాఖ్యాత రచయిత కవి డా. ఓలేటి పార్వతీశం గారికి ఇచ్చారు.
ఈ కార్యక్రమం 15 జూన్ 2025వ తేదీన శ్రీ త్యాగరాయ గాన సభలో సాయంత్రం 6 గంటలకు జరిగింది.
శశికాంత్ నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఆయన ఉద్యోగరీత్యా చెన్నైలో స్థిరపడ్డారు.
చాలా రోజుల తర్వాత మళ్ళీ కలవబోతున్నాం.
అందుకే ఆ సమావేశానికి వెళ్లాలనిపించింది.
ఆ రోజే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు
డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ,
కూకట్ పల్లిలో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో
ఒక అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్నాను.
స్లమ్ ఏరియా( మురికివాడల)లో నివసిస్తున్న పిల్లలను
ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడానికి,
వాళ్ల ఇళ్లకు వెళ్లి
వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి,
ప్రభుత్వం అందించే అనేక పథకాలను వివరించి, పిల్లలను స్కూళ్లలో చేర్పించడం
ఆ కార్యక్రమంలో ప్రధాన లక్ష్యం.
ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చిన విద్యార్థిని విద్యార్థులకు
డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ
ఆహారాన్ని, బట్టలను
మరి కొన్ని సౌకర్యాలను అందిస్తుంది.
గత కొంతకాలంగా
నేను ఆ సంస్థ కార్యక్రమాలను గమనిస్తున్నాను.
ఆ సంస్థను శ్రీమతి చావా అరుణ అరుణ గారు నిర్వహిస్తున్నారు.
ఆమె న్యాయ శాస్త్రాన్ని అభ్యసించి కొన్నాళ్లు ప్రాక్టీస్ కూడా చేశారు.
ఆ తర్వాత సామాజిక సేవకు అంకితమయ్యారు.
ఆ స్వచ్ఛంద సంస్థలలో
అనేక కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నాను.
పెద్దపెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న
కొంతమంది డాక్టర్లు కూడా
స్వచ్ఛందంగా వచ్చి ఆ సంస్థలో పనిచేస్తున్నారు.
నన్ను కూడా ఆ సంస్థలో
ఒక సలహాదారులుగా ఉండమని శ్రీమతి అరుణగారు అభ్యర్థించారు.
ఆ విధంగా ఆ కార్యక్రమంలో పాల్గొని వచ్చాను.
అయినప్పటికీ,
చదువుకున్న మిత్రులందరికీ కలుసుకోవచ్చనే సంతోషంతో
ఎలాంటి శ్రమ అనిపించకుండా
శ్రీత్యాగరాయ గానసభకు వెళ్లాను.
ఒక అరగంట ముందుగానే వెళ్లాను.
శ్రీ త్యాగరాయగాన సభ చాలా మారిపోయింది.
ఎటు చూసినా పోస్టర్లు
మా కార్యక్రమాలకు రండి అంటూ
ఆహ్వానిస్తున్నట్లు ఉన్నాయి.
పగలు రాత్రి తేడా లేకుండా
ఆ చుట్టుప్రక్కలంతా
పార్కింగ్ చేయడానికి ప్లేస్ లేనంతగా
వాహనాలతో నిండిపోతుంది.
ఒక ప్రేక్షకుడిగా ఈ సభ నాకు తెలుసు
ఒక వక్తగా ఈ వేదిక నాకు తెలుసు
ఒక అతిథిగా ఆ డయాస్ నాకు తెలుసు
ఒక నిర్వాహకుడిగా ఈ భవనం నాకు తెలుసు.
హైదరాబాద్ వచ్చిన కొత్తలో
హైదరాబాదులోని సాంస్కృతిక సమావేశాలు జరిగే అనేక వేదికలు,
ఆ సభలు చూడటం
ఒక పనిగా కూడా పెట్టుకునేవాడిని.
ఆ సభలు
ఆ సమావేశాలకు గొప్ప వాళ్ళు ఎంతో మంది వస్తున్న వార్తలు
నాకు కుతూహలాన్ని కలిగించేవి.
అందువల్ల గొప్ప వాళ్ళందరిని చూడవచ్చుననే ఆశతో
ఆ సమావేశాలకు వెళ్లేవాడిని.
కొన్నిసార్లు తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చేది.
అప్పుడు చూసిన శ్రీ త్యాగరాయ గానసభకు ఇప్పుడు చూసే సభకు
చాలా తేడా ఉందనిపించింది.
అన్నీ బాగు చేయించారు.
వేదికల సంఖ్య పెంచారు.
ఉచితంగా సాహిత్య సమావేశాలను జరుపుకోవడానికి ఇచ్చే వేదికలను ఇస్తున్నారు.
అంతకుముందు
నాకు తెలిసినంతవరకు
ఇటువంటి సౌకర్యం లేదు.
మెయిన్ హాల్లో కూడా పేదవాళ్ళు …
అన్ని కులాల వారికి
వివాహాలకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడానికి
ఉచితంగా ఇవ్వడం కూడా ఇస్తున్నారనే ప్రకటనలు నన్ను బాగా ఆకర్షించాయి.
కాసేపు అవన్నీ పరిశీలించాను.
ఈలోగా మల్లిక్
తన కుటుంబ సభ్యులతో వచ్చారు.
నన్ను నవ్వుతూ పలకరించారు.
తమ శ్రీమతిని పరిచయం చేసి
నా గురించి ఆమెకు చెప్పారు.
తన కూతురిని కూడా పరిచయం చేశారు
ఆయన కళ్ళల్లో ఎంతో సంతోషాన్ని గమనించాను.
ఆయన కూడా నాకు ఒక సంవత్సరం సీనియర్.
మా సబ్జెక్టులు వేరైనా,
మేమంతా కలిసిమెలిసి పోటీలకు వెళ్లే
ఒక బృందంలో ఉండే సభ్యులం.
ఆకెళ్ళ రాఘవేంద్ర,
మల్లిక్,
శశికాంత్,
ప్రకాష్,
సీతామహాలక్ష్మి,
నేను…
అంతా కలిసి
మా కళాశాల తరపున
ఇతర కళాశాలలో జరిగే పోటీలకు వెళ్లే వాళ్లం.
నిజానికి వాళ్లంతా చదువుకున్న
రెండు
లేదా మూడో తరానికి చెందిన వాళ్ళు.
నేను మొదటి తరానికి చెందిన వాడిని.
వాళ్ళతో కలవాలంటే నాకు
మొదట్లో ఏదో అనీజీగా అనిపించేది.
వాళ్ళేసుకొనే బట్టలు
నిగనిగలాడే శరీరఛాయ
స్పష్టమైన ఉచ్చారణ
అవన్నీ వాళ్ళలో కొట్టొచ్చినట్లు కనిపించేవి
బక్క పల్చగా ఉండేవాణ్ణి
మామూలుగా బట్టలు వేసుకునేవాడిని
నాది అంత నిగనిగలాడే శరీరం కాదు
సెలవులు వస్తే పొలంలో పని చేసిన శరీరం
మంచి బట్టలు నాపై మెరవాలంటే
వాటిని ఇస్త్రీ చేసుకోవాలంటే
అమ్మ నాన్న నేను ఎంతో కష్టపడాల్సి వచ్చేది.
కానీ,
నా ఉత్సాహాన్ని చూసి
నన్ను వాళ్ళు దగ్గరికి తీసుకునేవారు.
నిజం చెప్పొద్దూ..
అయినా నాకు
ఏదో ఓ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్!
శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కళాశాల (SKBRC) అమలాపురంలో
నేను ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు చదువుకున్నాను.
ఆ కాలేజీలోనే
డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారు పనిచేసేవారు.
ఆయన మాకు పాఠాలు చెప్పేవారు.
ఇంటర్మీడియట్ నుండీ
స్పెషల్ తెలుగు ఒక ప్రత్యేక అంశంగా చదువుకోవడం వల్ల
ఐదు సంవత్సరాల పాటు
ఆయన దగ్గర మేము పాఠాలు వినే అవకాశం కలిగింది.
భాషా సాహిత్యాలను
చాలా సులభంగా చెప్పడం
ఆయనలోని ఒక ప్రత్యేకత.
ఆ కాలేజీలో చదువుకోవడం వల్ల
నాకు అనేకమైన మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. డాక్టర్ ద్వానాశాస్త్రి గారి కొడుకు శశికాంత్ కూడా అక్కడే చదువుకునేవాడు.
ఆయన నాకంటే ఒకటి రెండు తరగతులలో పెద్దవాడు.
నేను ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత
వక్తృత్వం, వ్యాసరచన వంటి పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి నాకు కూడా కలిగింది.
నేను కూడా వాటిలో పాల్గొనాలంటే
సాయంత్రం వరకు ఆగాలి.
కాలేజీ షిఫ్ట్ పద్ధతిలో నడిచేది.
ఒకవేళ ఇంటర్మీడియట్ ఉదయం నుండి
మధ్యాహ్నం వరకు ఉంటే, మధ్యాహ్నం నుండి
సాయంత్రం వరకు డిగ్రీ ఉండేది.
అలా షిఫ్ట్ పద్ధతిలో నడిచేది.
ఆ ప్రాంతంలో అది చాలా పెద్ద కళాశాల.
విశాలమైన ఆటస్థలం,
పెద్ద పెద్ద భవనాలు,
క్లాస్ రూములు ఉండేవి.
అయినా గాని
ఒకేసారి పాఠాలు జరగడం అనేది
సాధ్యమయ్యేది కాదు.
అంతమంది ఆ కాలేజీలో చేరేవారు.
ఆ కాలేజీలో సీటు రావడం అంటే
గొప్ప విషయంగా భావించే వాళ్ళం.
మా ఇంటి దగ్గర నుండి
కాలేజీ సుమారు 18 కిలోమీటర్లు ఉంటుంది.
ప్రతిరోజు బస్సు మీద
లేదా సైకిల్ పై వెళ్లి వస్తుండేవాడిని.
అయినా గాని ఆ పోటీలలో పాల్గొనేవాడిని.
అవన్నీ గుర్తుకొచ్చే నాకు.
మల్లిక్, నేను మాట్లాడుకుంటున్న కొంతసేపటికి
శశికాంత్ వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చాడు.
సంతోషం విప్పారిన ముఖంతో కనిపించాడు
ఆ నడక
ఆ నవ్వు
ఆ హావభావాలు చూస్తుంటే
మళ్లీ మా గురువుగారు
డా.ద్వా.నాశాస్త్రి గారినే చూస్తున్నట్లు అనిపించింది.
నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు.
ముందే తెలిసినట్లుగా వాళ్ళు చూశారు.
సభా నిర్వహణలో తలమునకులయ్యాడు.
నేను ఫ్యాన్ గాలి తగిలేలా
ఒక కుర్చీలో కూర్చున్నాను.
చాలా రోజుల తర్వాత
మళ్లీ ఒక ప్రేక్షకుడిగా కూర్చున్నాను.
ఒక శ్రోతగా కూర్చున్నాను.
ఆ సభఏర్పాట్లు
వచ్చిపోయే వాళ్ళని పలకరించడం
శశికాంత్ ని చూస్తుంటే
మళ్లీ నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది.
ఎన్ని సభలను ఈ హాల్లో నిర్వహించడంలో
నేను కూడా జ్యోత్స్నా కళా పీఠంలో
భాగమయ్యానో కదా
ఒక్కసారి గతమంతా గుర్తుకు వచ్చింది
ప్రశాంతంగా ఒంటరిగా కూర్చోవాలనిపించింది.
ఈలోగా
ఉదయం పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించి
కొన్ని ఇన్పుట్స్ అడుగుతూ
విలేకరులు ఫోన్ చేశారు.
కొన్ని వివరాలు రాసి పంపించమన్నారు.
అలా కాసేపు
అది రాసుకుంటూ కూర్చుండిపోయాను.
ఈ లోగా సమోసా ఒకవాటర్ బాటిల్
అందరికీ ఇచ్చారు
నేను కూడా తీసుకొని
కాస్త మంచి నీళ్లు తాగి
సమోసా పక్కన పెట్టాను.
ఇలాగా తెలిసిన వాళ్ళు
నన్ను కూడా పలకరించటం
వాళ్ళను నేను పలకరించడం
ఏకాంతంగా
ప్రశాంతంగా
అక్కడ ఒక్కడినే కూర్చోవడం
కుదరదని తెలుసుకోగలిగాను.
మల్లిక్
వాళ్ల కుటుంబ సభ్యుల్ని
శశికాంత్ కొటేషన్ కూర్చోబెట్టి
నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు.
సభ మొదలైంది
ముందుగా కొన్ని పాటలు పాడారు.
పెద్దాయన బాగానే పాడాడు.
వల్లీశ్వరర్ సభకు అధ్యక్షత వహించి
బాగా నిర్వహించారు.
డాక్టర్ ద్వారా శాస్త్రి గారి సాహిత్యాన్ని
వ్యక్తిత్వాన్ని ఆయన ప్రసంగంలో
అందరికీ ముందుగా చక్కగా తెలియజేశారు.
డా.ద్వా.నా.శాస్త్రి (ద్వాదశి నాగేశ్వర శాస్త్రి)
సాహిత్యంలో అనేక ప్రయోగాలు చేసి
అంతర్జాతీయ రికార్డులు
సొంతం చేసుకున్న విషయాలను తెలిపారు.
ఏకధాటిగా 12 గంటల పాటు
తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించి
ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతినీ గుర్తు చేశారు.
అంతే కాదు, డా.ద్వా.నా.శాస్త్రిగారు 2014లో
శతకసాహిత్యంలోవ్యక్తిత్వ వికాసం అనే అంశం మీద
188 నిమిషాల పాటు ప్రసంగం చేసి,
జీనియస్ బుక్ రికార్డ్స్ లో
స్థానం సంపాదించిన విషయాన్ని చెప్పారు.
2015లో పలకరిస్తే ప్రసంగం పేరుతో
6 గంటల నిర్విరామ ప్రసంగంతో
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ
చోటు దక్కించుకున్న రికార్డులను గుర్తు చేశారు.
‘’తెలుగు సాహిత్యంలో హాస్యామృతం"
డా. ద్వా.నా. శాస్త్రి గారు రచించిన ఒక గొప్ప పుస్తకంగా చెప్పి,
దానిలోని కొన్ని అంశాలను కూడా వివరించారు.
ద్వా.నా.శాస్త్రి గారి కంటే ముందు
ఒకరిద్దరూ దాన్ని రాద్దామని ప్రయత్నించినా
పూర్తి చేయలేదనీ,
కానీ, డా. ద్వా. నా. శాస్త్రి గారు పట్టువదలని విక్రమార్కుడిలా పూర్తి చేశారని చెప్పారు.
ఆ పుస్తక ప్రతులు అయిపోవడం వల్ల
పునర్ముద్రణలు చేస్తానని ప్రకటించారు.
ఈ పుస్తకం తెలుగు సాహిత్యంలో హాస్యం యొక్క వివిధ కోణాలను వివరిస్తుంది.
ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు
తెలుగు సాహిత్యంలో హాస్యం ఎలా వికసించిందో
ఈ పుస్తకం తెలియజేస్తుంది.
తర్వాత డాక్టర్ రమణాచార్యులు
శ్రీ త్యాగరాయగాన సభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి గారి ప్రసంగం అద్భుతం. ఒక అకాడమీషియన్ లా మాట్లాడారు.
అయినా అనేక సమావేశాల్లో మాట్లాడిన తీరని నేను చూసాను.
ఏవో నామమాత్రంగా
నాలుగు ప్రశంస వాక్యాలు చెప్పి వెళ్ళిపోలేదు
సభ చివరి వరకు ఉన్నారు.
కేవలం ఫోటో కోసం పోజు ఇవ్వలేదు.
తన తండ్రి కళా దీక్షితులు గారు
శ్రీ త్యాగరాయ గాన సభను
తనకు ఒప్పజెప్పిన తర్వాత
తనకు ఏమీ తెలియదని చెప్పారు.
అటువంటి అప్పుడు డాక్టర్ ద్వానా శాస్త్రి గారు
సాహిత్య కార్యక్రమాలు
నిర్వహించాలని సూచించారని చెప్పారు.
ఆయన ప్రసంగంలో డాక్టర్ ద్వారా శాస్త్రి గారి పట్ల అచంచలమైన గౌరవం కనిపించింది.
తేదీలతో సహా ఆయన చెప్పిన ప్రసంగం
వారితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది.
‘నేటి నిజం’ పత్రిక సంపాదకులు బైసా దేవదాస్ గారు డా.ద్వా.నా.శాస్త్రిగారితో తనకు ఎలాంటి అనుబంధాన్ని ఉందో చెప్పారు.
డా.ద్వా.నా.శాస్త్రిగారు హైదరాబాద్ వచ్చే ముందు
తనకు ఫోన్ చేసి మాట్లాడారని,
హైదరాబాదు ఒక పుష్పక విమానం లాంటిదనీ
రమ్మని స్వాగతించాననీ
దేవదాసు గారు వెల్లడించారు.
తన పత్రికలో
వ్యాసాలు
కవితలు
సమీక్షలు రాయడంతో పాటు
ఆయనతో నాలుగు బంధాన్ని గుర్తు చేసుకున్నారు.
వారి కవితను
ఎంతో భావావేశంతో చదివి వినిపించారు.
కిన్నెర సాహితీ సంస్థ నిర్వహకులు
మద్దాళి రఘురాం ‘మా నాన్నగారు’ పుస్తకం గురించి మాట్లాడారు.
ఆ తర్వాత శశికాంత్ మాట్లాడారు.
శశికాంత్ ప్రసంగం
ఆనాటి వక్తృత్వ పోటీలలోని
ఆ ధార ఇంకా కొనసాగినట్లే అనిపించింది.
ఆ ప్రసంగంలో చివరలో
ఆకట్టుకునేలా
ఆ చమత్కారం
నేటికీ అలాగే కొనసాగిపట్లనిపించింది.
శశికాంత్ లోని ప్రతి మాటలో
పెద్దవాళ్ల పట్ల వినయం
తండ్రి పట్ల గౌరవం
ఆత్మవిశ్వాసం
త్రివేణి సంగమంలా ప్రవహించాయి.
తన నాన్నగారికి దాచుకొనే తత్వం లేదనీ
ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా మొహమాటం లేకుండా మాట్లాడే వారనీ,
నిరంతరం అధ్యయనం చేసే వారనీ,
మనం పేదవాళ్ళుగా పుట్టినా,
మన కష్టాన్నే మనం నమ్ముకోవాలనీ
దానివల్లనే అన్నీ సాధించవచ్చుననీ చెప్పే వారనీ
నాన్నగారు చేసినంతటికృషిని
తాను చేయలేకపోయానని చెప్పుకున్నారు.
ఆనాడు శివుడు
తన కంఠంలో విషయం దాచుకున్నాడో లేదో
తనకు తెలియదు కానీ
తన తండ్రి గారు మాత్రం ఏదీ దాచుకోకుండా మాట్లాడేసేవారని,
నిష్కళంకంగా జీవించారని చెప్పారు .
పేరుకు తాను పురస్కారాన్ని ఇస్తున్నట్లు చెప్పినా
ఇవన్నీ రమణాచార్యులు గారు
రఘురాం గారు
కళా జనార్ధన మూర్తిగారు
వంటి వారే చేస్తున్నారని,
నాన్నగారి పట్ల ఉండే గౌరవానికి
ఉత్తమ సాహిత్యాన్ని కొనసాగించాలనే వార్ని ప్రోత్సాహించడానికి
ఇది ఒక సజీవ నిదర్శనమని చెప్పారు.
ఆ ప్రసంగానికి తన్మయుడైన
డా.రమణాచార్యులుగారు కూడా
ఎంతో సంతోషంగా శశికాంత్ ని అభినందించారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే,
ఈసారి పురస్కారం అందుకున్న డాక్టర్ ఓలేటి పార్వతీశం గారి ప్రసంగం
ఎంతో ఔచిత్యంతో కొనసాగింది
విశ్వనాథ వారు అంతటి శిష్యుడు
చెళ్ళపిల్ల వారికి లభించడం గొప్ప అని తన గురించి తాను చెప్పుకున్నట్లే,
శిష్యుడు గురించి
డాక్టర్ ద్వా.నా.శాస్త్రిగారి గురువు పండ్లమూడి సత్యనారాయణ గారు చెప్పుకున్న పద్యాన్ని చెప్పి
చక్కని ప్రసంగాన్ని చేశారు.
‘’అలనన్నయ్యకు లేదు
తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార
ధిషణాహంకార సంభార దో
హల బ్రహ్మీమయమూర్తి
శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి
చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్’’ అని
విశ్వనాథ సత్యనారాయణ గారు
తన గురువుగారైన
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి గురించి చెప్పారు.
సభ చాలా రసవంతంగా జరిగింది.
తొలి పురస్కారాన్ని అందుకున్నవల్లీశ్వర్,
మరో పురస్కారణ అందుకున్న బైసా దేవదాస్
ఈ ఏడాది పురస్కారం అందుకున్న
డా పార్వతీశం
అంతా డాక్టర్ ద్వా నా శాస్త్రి గారి
వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని సందర్భోచితంగా
ఔచిత్యమంతంగా ఆవిష్కరించారు.
మొత్తం మీద
చాలా రోజుల తర్వాత
ఒక మంచి సాహిత్య సభలో
పాల్గొన్నాననిపించింది.
చివరికి ఒక ట్రస్ట్ ఏంటంటే,
నేను, మల్లిక్, శశికాంత్
మిగతా మిత్రులతో కలిసి ఒక ఫోటో తీసుకున్నాం.
దాంట్లో నా ఫోటో చూసి నాకే భయమేస్తుంది.
నా ఫేసు అంతా మచ్చలు మచ్చలుగా పడింది.
భయంకరంగా కనిపిస్తుంది.
నేను మా ఇంటి దగ్గర నుండి
అక్కడి వరకు బైక్ మీద వెళ్లాను.
సరదాగా వెళ్లాను
కానీ, కారు మీదో
బస్సుమీదో వెళ్ళలేకపోయావా
నీ పని పడతాను చూడు
అని నా సరదా తీర్చేసింది!
ఐదు నిమిషాల
షాంపూ లాంటి కలర్
తలకి వేసుకొని వెళ్లాను.
దాంతో తలకి ఉండవలసిన కలర్ అంతా,
హెల్మెట్ నా ముఖానికి అంటించింది.
దీన్ని నేను గమనించకుండా
నేను ఫోటోలు దిగాను.
ఇంటికి వచ్చాక చూసుకుంటే
ఇంకేముంది, నా ఫోటో నన్నే భయపెట్టింది.!
ఫోటోలో వరుసగా జయప్రకాష్, శశికాంత్, ఓలేటి పార్వతీశం, దార్ల వెంకటేశ్వరరావు, మల్లిక్ (మల్లేశ్వర రావు) మరికొంతమంది
ఎస్.కె.బి.ఆర్.కళాశాల, అమలాపురం ప్రిన్సిపాల్ గారి ఆఫీసు
కళాశాలలో ఒక భవనం
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి