12 జూన్, 2025

నాకు తెలిసిన డాక్టర్ సినారె

 డా. సినారె ఒక మహోన్నత సాహితీశిఖరం





డాక్టర్ సి నారాయణ రెడ్డి కవిగా, అధ్యాపకుడిగా రాజ్యసభ సభ్యుడిగా, ప్రభుత్వ ఆస్థాన కవిగా, విశ్వవిద్యాలయాలకు ఉపాధ్యక్షుడిగా అనేక పదవులలో పనిచేశారు. పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి అయినా పైన అందరికీ ‘సినారె’ ‘డా.సినారే’, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా సినారె, పద్మ విభూషణ్ డాక్టర్ సినారె గానే సుపరిచితులు. ఆయన ‘ఆధునికాంధ్ర కవిత్వము: సంప్రదాయములు- ప్రయోగములు’ అనే అంశంపై పిహెచ్డి చేశారు. అది నేటికీ విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక ప్రామాణికమైన పరిశోధన గ్రంథం. 

సినారె అనగానే సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం లేకపోయినా, పత్రికలు చూస్తున్న సామాన్యులకు కూడా ఆయన ఒక కవి అని తెలిసిపోతుంది. తెలుగులో ఙ్ఞానపీఠ్ అవార్డు సాధించిన వారిలో ఆయన ద్వితీయుడే కానీ అందరినీ తన సాహిత్యంలో వర్ణించి అద్వితీయుడిగా నిలబడ్డారు. అలనాడు కవి శ్రీనాథుడు అంత వైభవాన్ని పొందాడో లేదో గానీ, తెలుగు నేలపై సాహిత్య ప్రపంచంలో సినారె కి దక్కినంత గౌరవ మర్యాదలు మరోకవికి దక్కలేదంటే అతిశయోక్తి కాదేమో!

1931 జూలై 29 న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేట్లో జన్మించినా తన ప్రతిభతో మహోన్నతమైన శిఖరాలను అధిరోహించారు.

 హైదరాబాద్ జంట నగరాలలో ఇంచుమించు ప్రతి రోజు ఆయన ఏదో ఒక సాహిత్య సభలో పాల్గొనేవారు. కొన్ని దశాబ్దాల పాటు ఆయన సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న ఫోటో లేకుండా పత్రికలు వార్తలు ప్రచురించలేకపోయాయి. ఆయన పాల్గొన్న సభలు అన్నీ రసభరితంగా ఉండేవి. ఎంతో సభలలో చమత్కారంతో మాట్లాడేవారు. తాను ప్రసంగించేటప్పుడు సభలో ఉన్నవారు ఎవరైనా మాట్లాడుకుంటే తన ప్రసంగాన్ని ఆపేసి వాళ్ళవైపు ఒక్కసారి సీరియస్ గా చూసేవారు. దానితో అందరూ నిశ్శబ్దం అయిపోయేవారు. 

ఎంత ఎదిగినా అడిగిన వారికి లేదనకుండా ముందుమాటలతో ఆశీర్వదించారు. సభలలో పాల్గొని ఆ పుస్తకాలలోని మంచి విషయాలనే ప్రస్తావించేవారు. అప్పుడే కవిత్వం, కథలు, నవలలు రాస్తున్న వారి దగ్గర నుండి గొప్ప సాహితీవేత్తల వరకు అందరికీ ఆత్మీయుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయనకు కవులు అంటే చాలా ఇష్టం. డాక్టర్ ఎన్. గోపి, డాక్టర్ ఎండ్లూరి సుధాకర్, డాక్టర్ శిఖామణి, డా. గోరీశంకర్ తదితరులను ఎంతగానో ఇష్టపడేవారు. ఆయన బ్రతికినంత కాలం అభినవ శ్రీనాథుడిలా బ్రతికారు. ఆయన ఉన్నంతకాలం రవీంద్ర భారతి కళకళలాడిపోయేది. ప్రభుత్వాలు మారినా, రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధ్యక్షులుగా ఆయనే ఉండేవారు. రెండు రాష్ట్రాలలోనూ ముఖ్యమైన సాహితీ సమావేశాల్లో కూడా పాల్గొనేవారు. ఆయనకు కవిత్వం అంటే చాలా ఇష్టం. కవిత్వం రాసే వాళ్ళు అన్నా చాలా ఇష్టం. ఆయన ప్రతి పాటను సందర్భోచితంగా చమత్కారంగా రసభరితంగా రాశారు. 

ఆయన ప్రసంగం ఎంతో చలోక్తులతో, హూందాగా ఉండేది. 

నేను కోనసీమ నుండి పెట్టీ బేడా సర్దుకొని సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవడానికి 1995 లో హైదరాబాదు వచ్చాను. ఆ సంవత్సరమే హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బులో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సినారె ని కలుసుకున్నాను. ఆయన, డా. ఎస్.శరత్ జ్యోత్స్నారాణి గారు రాసిన ‘కొత్తపాట’ కవితా సంపుటిని ఆవిష్కరించడానికి వచ్చారు. ఆయన వేదిక పైకి వచ్చినప్పుడు ఆరోజు నేను పుష్పగుచ్చాన్ని ఇచ్చాను.ఆ తర్వాత అనేక సభల్లో ఆయన ప్రసంగాల్ని విన్నాను. ఆయన ప్రతి ప్రసంగం ఒక రసగుళికలా సాగిపోతుంది. ఎప్పుడూ ఏదో కొత్త దనం ఉన్నట్లనిపిస్తుంది.   

నా ఎం.ఫిల్., పరిశోధన గ్రంథం ప్రచురించి చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఆవిష్కరించాను. ఆ సభలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి, పుస్తకాన్ని ఆవిష్కరించి ఆ పరిశోధనను ప్రశంసించారు.  

దీని గురించి నా బ్లాగులోఇలా రాసుకున్నాను.

‘’నా ఎం.ఫిల్., గ్రంథం " ఙ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన " ఆవిష్కరణ సభకు వచ్చి నన్ను ఆశీర్వదించారు. నా పుస్కకావిష్కరణ సభ చిక్కడపల్లి లోని నగర కేంద్ర గ్రంథాలయం లో 1999 జూలై 16 వతేదీన జరిగింది. నాటి సభకు చాలా మంది విచ్చేశారు. నా గ్రంథావిష్కరణ సభకు డా.సి.నారాయణ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ ఆచార్య సి. ఆనందారామం, మా గైడ్ డా.ఎస్.శరత్ జ్యోత్స్నారాణి, ప్రముఖ సాహితీ వేత్త డా.జె. బాపురెడ్డి, కృష్ణా పత్రిక సంపాదకులు పిరాట్ల వెంకటేశ్వర్లు, విశ్వసాహితి అధ్యక్షులు డా.పోతుకూచి సాంబశివరావు, కవయిత్రులు శ్రీమతి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, రత్నామహీధర్, శ్రీమతి రాణీ సంయుక్త తదితరులు పాల్గొన్నారు.’’


‘’ఆ తర్వాత జ్యోత్స్నాకళాపీఠంలో ఒక సభ్యుడిగా డా.సి.నారాయణ రెడ్డి గారిని సభావేదికపైకి పిలిచే అవకాశం అనేక సభల్లోకలిగింది. ఆయనతో వక్తగా పాల్గొన్న సభ మాత్రం 20 డిసెంబరు 2008 న శ్రీ త్యాగరాయ గాన సభలో జరిగిన సాహిత్య సభే కావడం విశేషం. ఈ సభలో పాల్గొన్న నాతో ఆయన ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. మాట్లాడిన వారందరినీ సత్కరించారు. అందులో నేనూ ఒకడిని కావడం నాకు ఎంతో ఆనందం కలిగించింది.’’ 

శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి హైదరాబాద్ లో 20.10.2008 వ తేదీన మిత్రుడు డా.ఎం. సంగీతరావు రచించిన ‘పోలాప్రగడ సత్యనారాయణమూర్తి జీవితం- సాహిత్యం’అనే పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఆ సందర్భంగా పోలాప్లగడవారి రచనలను కూడా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఙ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణ రెడ్డి, హైదరాబాదు దూరదర్శన్‌ డైరెక్టర్ డా.పాలకుర్తి మధుసూధనరావు, హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ లో ఆచార్యులు , ప్రొ. ఎస్. శరత్ జ్యోత్స్నారాణి, డా. జి.అరుణకుమారి,డా.దార్ల వెంకటేశ్వరరావు (నేను), విశ్వసాహితీ అధ్యక్షులు డా.పోతుకూచి సాంబశివరావు, ప్రముఖ విమర్శకుడు డా.ద్వానాశాస్త్రి, ప్రముఖ రచయిత్రి ముక్తేవి భారతి, పసిద్ద అనువాదకులు డా.డి.రంగారావు, ప్రముఖ రచయిత్రి పోలాప్రగడ రాజ్య లక్ష్మి , పరిశోధన పుస్తక రచయిత డా.ఎం. సంగీతరావులు పాల్గొన్నారు. ఓలా ప్రగడ వారి ‘పొత్తులభావి’ గురించి నేను ప్రసంగించాను. ఈ సాహిత్య సభలో ప్రేక్షకులుగా పాల్గొన్న డా.అద్దేపల్లి రామమోహన రావు, హైమవతీ భీమన్న, శీలా సుభద్రాదేవిగార్లను ఆ సందర్భంగా కలుసుకున్నాను. 


డా.సి. నారాయణరెడ్డి గారి 75 వ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ ద్వానా శాస్త్రి గారు ‘నానీలలో సినారె’ పేరుతో 75 నానీలను రచించి ఒక పుస్తకంగా ప్రచురించారు. దానిపై నేను ‘ప్రయోగాల పల్లకిలో 'నానీలలో సినారె’ పేరుతో ‘దట్స్ తెలుగు’ అనే అంతర్జాల పత్రికలో 2007, జూలై- ఆగష్టు నెలలో ఒక వ్యాసాన్ని రాశాను. కాసుల ప్రతాపరెడ్డి గారు దానికి ఎడిటర్ గా ఉండేవారు. 

ఆ తర్వాత, 

తెలంగాణ సారస్వత పరిషత్తు, బొగ్గులకుంట, హైదరాబాద్ లో 15.10.2015వతేదీన డా. పుట్ల హేమలతగారి పిహెచ్.డి. గ్రంథం ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’ పరిశోధన గ్రంథాన్ని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఆ సభలో నేను ఒక అతిథిగా పాల్గొన్నాను. డా. ఎన్. గోపిగారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు,ఆచార్య ఎండ్లూరి సుధాకర్, నల్లమోతు శ్రీధర్ గార్లు కూడా అతిథులుగా పాల్గొన్నారు. 


శ్రీమతిగంగినేనికళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం, వినుకొండ ,పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. "డా. సినారె సాహిత్య వైభవం "అనే జాతీయ అంతర్జాల సదస్సును14-7-2022న నిర్వహించారు. ఆ సమావేశంలో నా ప్రసంగంలో ‘సినారె సాహిత్య వైభవా’న్ని తెలియజేశాను. ఆ కళాశాల తెలుగు విభాగం శాఖాధిపతి డాక్టర్ జి. స్వర్ణలత ఈ అంతర్జాల జాతీయ సదస్సుని నిర్వహించారు. ఇంకా అనేక సందర్భాలలో ఆయన రచనలను, వ్యాసాలలో, ప్రసంగాలలో ఉటంకించినవి ఎన్నో ఉన్నాయి. 

 డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి సాహిత్య నేడు అందరికీ అందుబాటులో ఉంది. 

విశ్వంభర విజన్ పబ్లికేషన్స్ "వారు 18 సంపుటాలుగా వేశారు. ఆయన ‘నా పాటలో ఏముంది. నా మాటలో ఏముంది’ పేరుతో సినిమా సాహిత్యం , ఆ పాటల నేపథ్యం, చేసిన మార్పులు మొదలైన విశేషాలు అన్నీ రెండు సంపుటాలుగా వచ్చాయి. అవి సాహిత్య విమర్శకు ఆకర గ్రంథాలుగా ఉపయోగపడతాయి. 2017జూన్ 12వ తేదీన డా.సి.నారాయణరెడ్డిగారు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని దర్శించి నేను కూడా నివాళులు అర్పించాను. ఆరోజు నేను, ఆచార్య తుమ్మల రామకృష్ణగారు, ఆచార్య పిల్లలమర్రి రాములుగారు వెళ్ళాం. ఆరోజు మేము అక్కడ ఉండగా అనేకమంది ప్రముఖులు వచ్చారు. సినీ నేపథ్యగాయని శ్రీమతి ఎస్.జానకి గారు కూడా వచ్చారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ఆచార్య రవ్వా శ్రీహరి గారు సతీసమేతంగా వచ్చి, డాక్టర్ సినారె గారికి నివాళులర్పించారు. ఈరోజు డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇవన్నీ గుర్తు చేసుకోవాలనిపించింది.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 12 జూన్ 2025.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి