"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

29 July, 2015

రిషితేశ్వరి ఆత్మహత్యనెలా అర్థం చేసుకోవాలి?

నిన్న ( 28 జూలై 2015) హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ, సౌత్ క్యాంపస్ లో రిషితేశ్వరి ఆత్మహత్య నిరసన సభను sfi ( స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నిర్వహించారు.



 ఈ సభలో పెద్దసంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని రిషితేశ్వరి ఆత్మహత్యకు గల నేపథ్యాన్ని వివరించి, ఆ ఆత్మహత్యను ఖండించి, తగిన న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.  ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బి.టెక్ (ఆర్కిటెక్ ) చదువుతున్న విద్యార్థిని రిషితేశ్వరి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక వెనుకబడిన తరగతికి చెందిన విద్యార్థిని. ఆమెను తన సీనియర్లు ప్రేమించమని ర్యాగింగ్ చేసి ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించారని, దానికి అక్కడున్న అగ్రవర్ణ ఆధిపత్యవర్గానికి చెందిన విద్యార్థులే కారణమని ఆరోపించారు. రిషితేశ్వరి చివరిసారిగా రాసుకున్న సూసైడ్ నోట్ లోని అంశాలను ప్రస్తావించారు. మనువాదభావజాలమే ఆమెను ఆత్మహత్యచేసుకొనేలా ప్రేరేపించిందని, ఆ సంఘటనకు బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని ఆ ఉద్యమానికి తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నామని ప్రకటించారు. ఈ సభలో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపకుడు, చీఫ్ వార్డెన్ డా. జి. నాగరాజు, తెలుగు శాఖలో అసోసియేట్ ఫ్రొఫెసర్ డా. దార్ల వెంకటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. నేను మాట్లాడిన ప్రసంగంలోని కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

‘‘ మిత్రులారా... మనం ఇక్కడ ఒక సమావేశమయ్యాం. సాధారణంగా విశ్వవిద్యాలయాల్లో ఇలా సమావేశమెందుకవుతాం. ఒక విద్యార్థో, విద్యార్థినో, ఒక అధ్యాపకుడో ఏదైనా సాధించినప్పుడు దానిలోని గొప్పతనాన్ని చర్చించుకోవడానికి, వారిని ప్రశంసించడానికి సమావేశమవుతాం. ఒక అట్టడుగు వర్గం నుండో, ఒక అణచివేతకు గురైన కులాన్నుండో వచ్చిన విద్యార్థులు ఏదైనా సాధిస్తే వారిని అభినందించి, వారి నుండి స్ఫూర్తి పొందడానికి సమావేశమవుతుంటాం. కానీ ఇప్పుడు ఒక విషాదకరమైన విషయమేమిటంటే... ఒక అట్టడుగు, అణగారిన వర్గం, కులం నుండి గొప్ప విజయాలు సాధించాలని బయలుదేరిన ఒక విద్యార్థిని ఆశల్ని, ఆశయాల్ని అర్ధాంతరంగా చిదిమేసినందుకు చింతిస్తూ ఇక్కడ సమావేశమయ్యాం. పీడన, వివక్ష అనేది ఇక్కడ కావచ్చు; ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు; ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు; దాన్ని ఖండించడానికి ముందుకొచ్చిన మీ అందరినీ అభినందిస్తున్నాను. ఈ రోజు అణగారిన వర్గం నుండి వచ్చిన రిషితేశ్వరి కావచ్చు; చివరికి మన భావజాలాన్ని వ్యతిరేకించేవాళ్లు అన్యాయానికి గురైనా వాళ్ళ గురించి కూడా మనం పోరాడతాం. అలాంటి అన్యాయాన్ని ఖండిస్తాం. దీనిలో భాగంగానే మీరంతా, మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం అనుకుంటున్నాను.
అలా కాకపోతే ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ( మంగళగిరి, గుంటూరు) లో జరిగిన సంఘటనకీ మనకీ సంబంధం ఏమిటి? అలా అక్కడున్నవాళ్లూ అనుకోలేదు. అక్కడున్న ఎం.ఎస్.ఎఫ్ (మాదిగ విద్యార్థి సమాఖ్య), ఎస్.ఎఫ్.ఐ ( స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) గిరిజన విద్యార్థి సంఘం.... ఇలా అనేక సంఘాలు అక్కడా ఉద్యమించాయి. మన యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మొన్నే మనరాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణా ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడిన ప్రాంతం (వరంగల్లు) ప్రాంతం నుండి వచ్చిన రిషితేశ్వరి గురించి మనమెందుకు పోరాడాలనుకోలేదు. అది అన్యాయంగా భావించారు. ఆధిపత్యకుల అహంకారంగా గుర్తించారు. అగ్రవర్గం చేస్తున్న అధికార దాహంగా భావించారు. అందుకే అక్కడున్న అణగారికన వర్గాలు, కులాలు ఏకమై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా జరిగిందేమిటి?
రిషితేశ్వరి సూసైడ్ నోట్ బయటపడింది. యూనివర్సిటీ మూతపడింది. కులం పేరుతో విద్యార్థి సంఘాలు ఉండటం సరికాదనే కొత్త వితండవాదాన్ని బయటకు తీసుకొచ్చారు. మనదేశంలో కులాన్ని కాదని ఏ విధాన నిర్ణయాన్నైనా చేస్తున్నారా? ప్రతి దరఖాస్తులోను కులం కాలం లేకుండా చేయగలరా? రాజకీయపార్టీలు కులాతీతంగా సీట్టివ్వగలవా? పదవుల్ని ఇవ్వగలవా? ఉపాధి పథకాలను కులాతీతంగా కేటాయించడం సాధ్యమా? రాజ్యాంగంలో పేర్కొన్న కొన్ని కులాల హక్కుల్ని కాదనగలమా? అలాంటప్పుడు అణచివేతకు గురవుతున్న, కులం వల్లే అవమానాలకు గురవుతున్నవాళ్ళు తమ ప్రయోజనాల్ని పరిరక్షించుకోవడానికి ఒక సంఘంగా ఏర్పడ్డం తప్పవుతుందా? అయితే కమ్మసంఘం, రెడ్డి హాస్టల్స్, వెలమభవనాలు పేరుతో జరుగుతున్న సంక్షేమకార్యక్రమాల వెనుకున్న ఆశయాలేంటి? ఆ పేర్లతో వాటి కార్యకలాపాల్ని ఆపేయగలరామేథావులంతా ఆలోచించాల్సిన సమయమిది. ఏ కులాధిపత్యాన్ని, ఏ వర్గాధిపత్యాన్ని చూసుకొని తనని తాను ఆత్మహత్య చేసుకొనేలా చేసారో అటువంటి వాళ్లని కూడా వాళ్లతప్పువాళ్లు తెలుసుకుంటే చాలుఅని తన సూసైడ్ నోట్ లో రాసుకున్న దయార్ద్రహృదయులు అణగారిన, అణచివేతకు గురవుతున్న రిషితేశ్వరి లాంటి వాళ్ళు. వీళ్ళంతా తమపై జరుగుతున్న హింసను భరించలేక రాజ్యానికి విన్నవించుకోవడానికి కులాల్ని, వర్గాల్ని అనివార్యంగా ఏకం చేసుకుంటున్నారే తప్ప, రాజ్యాల్ని దోచుకోవడానికి కాదు; ఇతర కులాల్ని, ఇతరవర్గాల్నీ హింసించడానికో, వాళ్ళపై అధికారాన్నీ, ఆధిపత్యాన్నీ చెలాయించడానికో కాదు. అలాంటప్పుడు ఆ విద్యార్థి సంఘాల్ని నిషేధించడం సరైందేనా? 
ఈ సంఘటనలన్నింటినీ జాగ్రత్తగాపరిశీలిస్తే దీనివెనుక పనిచేస్తుంది మనువాదభావజాలం. ఒకప్పుడు మనవు స్త్రీలను చదువుకోవద్దని బహిరంగంగానే శాసించాడు. నేడు మనువాదం పరోక్షంగా ఆనిపనిచేస్తోంది. ఈ కోణంలో రిషితేశ్వరి ఆత్మహత్యను గానీ, ఇదే యూనివర్సిటీలో కొన్నేళ్ళ క్రితం ఒక అగ్రవర్ణాధిపత్యవిద్యార్థి మోసానికి గురై ఆత్మహత్య చేసుకున్న సునీత సంఘటనను చూడాలి. నేడు అణచివేతకు గురవుతూనే అభివృద్ధిలోకి వస్తున్నవాళ్ళను చూసి ఆధిపత్యవర్గాలు సహించలేకపోతున్నాయి. నన్ను భూమిలో పాతేస్తావా... ఒక మొక్కనై వచ్చిన శ్వాసనిస్తాను.
               ఆకాశంలోకి విసిరేస్తావా... ఒక చిరు చినుకునై వర్షిస్తాను.
           సముద్రంలోకి తోసేస్తావా... ఒక ముత్యమై బయటకొస్తాను’’ అన్నట్లుగా అంటరాని, అణగారిన కులాలు, వర్గాలు ముందుకొస్తున్నాయి. వీటిని సహించలేని ఆధిపత్యవర్గాలే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయి. ఇదంతా మనువాదంలో భాగం. ఇంతేకాదు... విధాననిర్ణయాలు చేసే పాలకవర్గాలు కిందివర్గాలు చిన్న చిన్న అధికారులుగా ఉన్నప్పుడే ఇటువంటి సంఘటనలు జరిపి ఈ కులాలు, ఈ వర్గాలు సమర్థవంతంగా పనిచేయలేవనే ఆలోచనని కల్గించేప్రయత్నం కూడా చేస్తాయి. ఆదేశాలన్నీ విధాననిర్ణయపాలక వర్గాల చేతుల్లో ఉంటాయి. వాటిని అమలు చేసే అధికారులు ఆ ఆదేశాలు మౌఖికాదేశాలకైనా స్పందించాలి; లేదా నిస్సహాయంగా వాటిని అమలు చేయాలి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్నదదే. అక్కడున్న రిజిస్ట్రార్, చీఫ్ వార్డెన్ చైతన్యమున్న వాళ్ళే. అయినా వాళ్లు ఆ ఆదేశాల్ని అమలుచేయాల్సిన నిస్సహాయస్థితికి నెట్టబడతారు. సాధారణ విద్యార్థినీ విద్యార్థులకు వీళ్ళే ప్రధానంగా కనిపిస్తారు. కానీ విధాన నిర్ణయాలను తీసుకునే వర్గాలు వేరుగా ఉంటాయి. వీటినీ గమనిస్తున్నారిప్పుడు విద్యావంతులైన విద్యార్థులు.
బుద్ధుని అహింసాసిద్ధాంతాలను ఆచరించాల్సిన విశ్వవిద్యాలయంలో హింసచెలరేగుతోంది. అది అణగారిన వర్గాలు, కులాలకేంద్రంగా జరుగుతోంది. అయినా రిషితేశ్వరిలాంటి వాళ్లు చనిపోతూ కూడా తన మరణానికి కారకులెవరో వాళ్ళకు తెలుసు. వాళ్లే తమ తప్పుని తెలుసుకుంటారు. వాళ్ళని వదిలేయండి అనగలిగన నిజమైన అహింసావాదులు అణగారిన వర్గాలు. అణచివేతకు గురవుతున్న కులాలు. రిషితేశ్వరి సూసైడ్ నోట్ చదువుతుంటే  ఆమెలో నాకూతురు కనిపించింది. ఆమెలో నా చెల్లి వేదన వినిపించింది. ఆమెలో నా విద్యార్థిని ఆశలు కనిపించాయి. అందుకే నేను కూడా ఇలాంటి సంఘటనను ఖండిస్తున్నాను. అలాంటి ఆత్మహత్యలు జరగకుండా నిరోధించే వ్యవస్థ రావాలని కోరుకుంటున్నాను. అన్ని వర్గాలు, అన్ని కులాలు న్యాయంగా. స్వేచ్ఛగా జీవించాలని ఆకాంక్షిస్తూ  అందరికీ న్యాయం జరగాలని చేస్తున్న మీ నిరసనను అభినందిస్తున్నాను. ’’


-డా.దార్ల వెంకటేశ్వరరావు

                29 జూలై 2015










No comments: